top of page

బలి పశువు


'Bali Pasuvu' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

నీ పేరేంటి?" గర్బిణీ పేషెంట్ ని చెక్ చేస్తూ అడిగింది డాక్టర్ యశోధర.

"లచ్చిమండి " సిగ్గుపడుతూ చెప్పింది లక్ష్మి.

" మీ ఆయనేం చేస్తుంటాడు?"

ఆయన అనగానే ఆవేశపడుతూ " ఏం సేత్తాడు? నాకీ గతి తెప్పిస్తుంటాడు" ఉక్రోషంగా అంది లక్ష్మి.

" చ.. అదికాదు లక్ష్మీ! ఏం పని చేస్తుంటాడు అని..?”

"కూలిపనమ్మగోరూ!"

" నిన్ను బాగా చూసుకోడా?"

“ఆ! అంతోటి ఆడు తెచ్చింది ఆడికే సాలదమ్మగోరూ! ఇంక నన్నూ పిల్లల్ని ఏం సూత్తాడు? పొద్దోయేక తప్పతాగి సీకట్లో తూలుకుంటూ ఒత్తాడు. ఆడొచ్చేసరికి మాంసం కూరో,సేపల పులుసో నేదా కనీసం గుడ్డు ఓసనైనా తగలాలి. నేకపోతే నన్ను గొడ్డును బాదినట్లు సితకబాదతాడు" ఉబికి వస్తున్న కన్నీటిని ఆపుకుంటూ దు:ఖాన్ని దిగ మ్రింగుకొంటూ చెప్పుకుపోతుంది లక్ష్మి. ఆ వేదనాభరితమైన ఆవేదనా ప్రవాహానికి అడ్డువేయలేక సానుభూతితో వింటుంది ఓ డాక్టరుగా కాకపోయినా సాటి స్త్రీగా.

లక్ష్మి చెప్పుకుంటూ పోతుంది. " ఆ తర్వాత ఉన్నదేదో తినేసి నిద్దరోతాడు. ఆ నిద్దట్లోనే నా అవుసరం ఒత్తాది. ఆ నిసాలోనే ఆడి దగ్గర మిగిలిన డబ్బులేవైనా ఉంటే నాకు దక్కుతాయి. నా బతుకేదో నా నెట్టాగొ సర్దుకుపోతూ, ఈడుసుకొత్తున్నాను. కానీ రేపొద్దున్న నా పిల్లలేవవుతారోననే బెంగ అమ్మగోరూ” అంటూ వాపోయింది.

“సరి సరి! ఇంతకూ అసలు సంగతి అడుగుదామనుకుంటూనే మర్చిపోయాను. నీకెంత మంది పిల్లలు?"

" ఆరుగురు అమ్మగోరూ ".

" మరి ఇంతవరకూ పిల్లలు పుట్టకుండా ఆపరేషనెందుకు చేయించుకోలేదు ?"అని అడిగింది యశోధర.

" అదే నమ్మగోరూ ! నువ్వయినా ఆపరేసను చేయించుకో. నేదా నానయినా సేయించుకుంతానంతే ఇనిపించుకోడే. నాను సేయించుకోవడం ఆడికి ఇట్టం లేదు, ఆడు సేయించుకోడు.. ఏటి సేయమంటారొ మీరే సెప్పండమ్మగోరూ" అంది లక్ష్మి.

"పద నేను చెప్పి ఒప్పిస్తాను " అని లక్ష్మిని వెంటబెట్టుకొని చెకప్ రూం నుండి కన్సల్టింగ్ రూం లోకి వచ్చి అక్కడ బుద్దిమంతుడిలా కూర్చొని అమాయకుడిలా కనబడుతున్న అతగాడితో అదే లక్ష్మి మొగుడితో అంది యశోధర.

" చూడు బాబూ! ఈమె చాలా బలహీనంగా ఉంది. అందులోనూ గర్బిణీ. రక్తం బాగా లేకపోతే కాన్పు కష్టం అయిపోతుంది. పుష్టికరమైన ఆహారం అంటే బలమైన తిండి పెట్టాలి. పైగా ఈ టానిక్కులు వాడాలి" అని ప్రిస్క్రిప్షన్ చీటీ వ్రాసిస్తూ అంది “ఈ సారికేదో అయిపోయింది. మళ్ళీసారి కాన్పు వస్తే మాత్రం మనిషి ప్రాణానికే ప్రమాదం. అంచేత ఈ కాన్పు టైములోనే నీ భార్యకి మరి పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేసేస్తాను.. ఏం? ఏమంటావు?"

“ఆపరేసను ఒద్దమ్మగోరూ.. ఆపరేసనంటే నాకు భయం. దానికి సేత్తే ఆదేమైపోద్దోనని" నసిగేడు తవిటయ్య- లక్ష్మి మొగుడు.

" దొంగ సచ్చినోడు! నా మీద ఎంత పేమ ఒలకబొత్తున్నాడో డాట్టరమ్మ దగ్గర" మనసులోనే అనుకుంది లక్ష్మి.

“ఇదేం పెద్ద ఆపరేషన్ కాదు భయపడడానికి. అతి చిన్న ఆపరేషన్. సులువుగా అయిపోతుంది. ఆపరేషను చేయించుకుంటే నీకు సంసారభారం తగ్గుతుంది. మీ ఆవిడ ఆరోగ్యం క్షీణించకుండా కాపాడినవాడవవుతావు. ఈ ఆపరేషను వల్ల ఎటువంటి బాధ, ఇబ్బంది, అనారోగ్యం, బలహీనత కలగదు. మీ ఆవిడికి ప్రభుత్వం ఓ చీరా, 145 రూ.లు ఇస్తుంది. చూడు ఆలోచించు..” నచ్చచెప్పింది. తవిటయ్య ముఖం విప్పారింది. 145/- రూ. కట్టపడకుండా ఒత్తున్నాయి. ఓ నెల్రోజులు పాటు మందుకు మరి ఢోకానేదు అనుకొన్నాడు. తవిటయ్యలో అంగీకార సూచనలు కనిపించి నవ్వుకుంది డా.యశోధర.

“అలాగే నమ్మగోరూ! మా మంచి, సెడ్డా మీకు తెలీదేటి ? మా ఆడదానికి మీ సేత్తోనే ఆపరేసను సేసెయ్యండి” అన్నాడు.

"చూసేవా లక్ష్మీ! నే చెప్పలేదూ మీ ఆయన్నీ ఒప్పిస్తానని" అని డాక్టరమ్మ అనేసరికి ఆశ్చర్యపోవడం లక్ష్మి పనైంది.

*** *** ***

లక్ష్మి ఆడబిడ్డని ప్రసవించింది. బర్త్ కంట్రోల్ ఆపరేషన్ చేయడమూ అయిపోయింది. ఏదో చెప్దామని డా. యశోధర గదిలోకి వెళ్లబోతున్న తవిటయ్యకు ఆ గదిలో ఎవరో అతి దీనంగా అంటున్న మాటలువినపడ్డాయ్.

" నా ఇంటి దీపం ఆరిపోయేక నాకీ డబ్బెందుకమ్మా? "

“అది కాదండీ! మీ కక్కర్లేకపోయినా చనిపోయిన వారి కుటుంబానికి ఇది ప్రభుత్వం ఇచ్చే సొమ్ము."

“ దాని పానం ఇచ్చేసి నేను పదిఏలు పట్టుకుపోనా? అంటే దాని పానం ఖరీదు పదిఏలా? "

“ చ చ.. చ.. అలా అనలేదు . ఏదో నష్టపరిహారంగా.."

" పదిఏలు తీసుకొంటే అది పోయిన నట్టం పూడుతుందా? అదిలేని లోటు తీరుతుందా? "

"నిజమే! కాని అయాచితంగా వస్తున్న దాన్ని మీరెందుకు కాదనాలి?"

తవిటయ్యకు అర్ధమైంది. తాగుబోతు బుర్రని తొలిచిందో పురుగు. పదివేలు నా జనమలో సూడగలనా? ఓహ్! ఆ డబ్బుతో ఓ మందు కొట్టెట్టి రోజూ మందు కొట్టేత్తుండొచ్చు అనుకుంటూ ఊహా సౌధాలలో తేలిపోసాగాడు తవిటయ్య.

*** *** ***

" ఒసేవ్ లచ్చివీ! సూసేవా నా కూతురెట్టా ఉందో? అంతా నా పోలికేనే! పుట్టిన బిడ్డను చూస్తూ అన్నాడు తవిటయ్య.

“ఫొ మావా! మొత్తానికి నాకు మంచి రోజులొచ్చి ఆపరేసను సేయించేసేవు అంతేసాన" అంది అమాయకంగా బలైపోతున్నానని తెలియని మేకలా.

" అవునే! నాకూ మంచిరోజులొత్తున్నాయ్. ఇదిగో ఈ పాలు తీసుకో, నీకు ఒంటో బాగా రగతం (రక్తం) పట్టాలట. మంచి బలం రావాలి. ఊ! " భార్యను మంచం మీద నుండి లేవదీస్తూ పాలగ్లాసు అందిస్తుండగా చూసింది డా. యశోధర. ఈ సారి ఆశ్చర్యపోవడం యశోధర వంతైంది.

*** *** ***

" డాక్టర్! బెడ్ నెం.7 పేషంట్ కి సీరియస్ గా ఉంది డాక్టర్!" నర్స్ హడావిడిగా పరిగెత్తుకొంటూ వచ్చి చెప్పింది.

" ఆ! ఏమైంది!? " కంగారుగా అడిగింది యశోధర.

" ఏమో డాక్టర్! మిమ్మల్ని అర్జంటుగా ఓ సారి పిలుచుకు రమ్మంటుంది డాక్టర్"

"పద పద" అంటూ వార్డు వైపు పరుగులాంటి నడక తీసింది యశొధర. ఊపిరాడక ఆయాసపడుతున్న లక్ష్మిని చూసి “లక్ష్మీ! ఏమైంది నీకు?” అని అడుగుతూ “సిస్టర్! ఆక్సిజన్ వెంటనే సిద్దం చేయి" అని పురమాయించింది. స్టెతస్కోపుతో పరీక్ష చేస్తూ మరో చేత్తో ఒంట్లో వేడిని చూడసాగింది. “అమ్మగోరూ! నానిక బతకను. నన్ను బతికించడానికి మీరు అవత్తపడొద్దు. నాను బతికినా సుకపడలేను. ఆడు సుకపెట్టేది నేదు. " అతి కష్టం మీద మాట్లాడింది లక్ష్మి.

" అదేంటి లక్ష్మీ? నీకేం భయం లేదు నేనున్నానుగా!" డాక్టరుగా తన ధర్మాన్నినిర్వర్తిసూ ధైర్యం చెప్పింది యశోధర.

" లేదమ్మగోరూ! నాను సెప్పేది ఇనండి. తరవాత సెప్పగలనో లేదో..” గొంతు పెగల్చుకుని మూలిగినట్లు అంది. మరణ వాగ్మూలం మిస్ అయిపోతుందేమోననే భయంతో “చెప్పు లక్ష్మీ ఏమైంది?" అడిగింది యశొధర. ముక్కలు ముక్కలుగా రొప్పుకొంటూ చెప్పసాగింది లక్ష్మి. " నా పెనిమిటి.. "

“ఆ! నీ మొగుడు ఏం చేశాడు?"

" తాగిన మైకంలో ఓ గుట్టు బయట పెట్టేశాడు."

“ ఏంటది ?" ఆతృతగా అడిగింది యశోధర.

" నానుగాని ఇక్కడ సచ్చిపోతే ఆడికి పదిఏలు ఇత్తారని తెలిసిందట". తవిటయ్యకు ఆ సంగతి ఎలా తెలిసిందో యశోధరకు అర్ధమైంది.

" అందుకని నాకు పాలల్లో ఇసం కలిపి ఇచ్చేసేడు "

“ఎంత ఘోరం!" వాపోయింది యశోధర.

" పాలు తాగేక గాని నాకు ఈ సంగతి తెలీనేదు ."

" ఉండు! వాడి పని చెప్తాను. వాడు పదివేల కోసం పురిటిలోనే పెళ్లాం ప్రాణం తీస్తాడా? వాడు మనిషేనా? లేక హంతకుడా? వాడ్ని వెంటనే పోలీసులకు అప్పగిస్తాను " అంటూ ఫోన్ తీయబోయింది.

“ఒద్దమ్మగోరూ.. నేను లేక పిల్లలు దిక్కులేని వాళ్లయిపోతారు. ఇంక తండ్రి కూడా కూనీకోరని తెలిస్తే ఆల్లు భరించలేరు. లోకం సయించదు”.

"ఓ త్రాగుబోతు హంతకుడైన భర్తను కనికరిస్తున్న నీలాంటి భార్యలున్నంతకాలం భర్తల అరాచకాలూ, జులుం సాగుతూనే ఉంటాయి" ఆవేశంగా అంది యశోధర.

"ఆడు ఇప్పుడు కూడా ఆపరేసను సేసుకున్నందుకు మీరు నాకు ఇచ్చిన డబ్బులెట్టుకెళ్ళి ఏ కల్లుపాకలోనో తాగుతుంటాడు. నాను పోయేసరికి ఆడు మారితే అంతేసాన".

" మద్యపానం వల్ల కలిగే అనర్దాలు తెలిసి కూడా దానికి దూరం కాలేని దురదృష్టవంతులపై జాలిపడడం తప్ప ఏమీ చేయలేం " అని యశోధర ఓ నిట్టూర్పు విడిచింది. "“అమ్మగోరూ! నా సివరికోరిక.." నాలుక పొడిబారిపోతుండడం గమనించి “ఏంటి లక్ష్మీ ? చెప్పు!” కంగారుగా అడిగింది యశోధర.

" నాను పోయేక ఇచ్చే పదిఏలు మాత్రం ఆడికియ్యకండి. నా పిల్లల పేరున ఏసి ఆల్లని ఏ అనాదాస్రమం లోనో సేర్పించండి. అంతేకానీ ఆడి నీడ పడనీయకండి. మీకు సేతులెత్తి మొక్కుతాను. ఈ పున్నెం కాత్త కట్టుకోండి " అంటూ డాక్టరమ్మ చేతులు వదిలి ఆఖరి శ్వాస విడిచింది లక్ష్మి. ఆఖరి ఘడియల్లో కూడా ఆప్తులెవరూ లేని లక్ష్మికి ఆప్తురాలై ప్రక్కన నిలబడింది డా.యశోధర. అనాధలైన ఆరుగురు ఆడపిల్లలను ఏడుస్తున్న వార్డులోని ఏడో బిడ్డను చూసి, చావు ఓ మామూలు విషయంగా తీసుకొని చలించని డాక్టరమ్మకు కూడా కళ్లలో నీళ్ళు నిండేయి. బలిపశువులా అయిన లక్ష్మిని తలచుకొని భారంతో అక్కడ నుండి కదిలింది డా.యశోధర తన విధ్యుక్త ధర్మాన్ని నెరవేర్చడానికి.


( సమాప్తం )

( ఈ నా కథ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో తే.27.01.1994 దీని ప్రసారితమైంది.

అమెరికాలోని తెలుగు అంతర్జాల పత్రిక "వాస్తవం " లో తే.13.01.2017 దీని ప్రచురితమైంది.)

మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి

రచయిత పరిచయం

పేరు : పతి. మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం




83 views0 comments
bottom of page