top of page

పాణిగ్రహణం - 2


'Panigrahanam - 2' New Telugu Web Series


Written By Bhagavathula Bharathi


రచన: భాగవతుల భారతి

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)


(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

గత ఎపిసోడ్ లో..

హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి.

ఆమె చెల్లెలు సుగాత్రి.

హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల.

సాగర మేఖల జీవితం గురించి ఒక పుస్తకం రాయమని హంస మంజీరను అడుగుతుంది సుగాత్రి.

విరుపాక్షను మందు పార్టీకి రమ్మని స్నేహితులు బలవంతం చేసినా అంగీకరించడతను.

గర్భవతిగా ఉన్న భార్యను వదిలి రానంటాడతను.


పాణిగ్రహణం ఎపిసోడ్ 1 కోసం ఇక్కడ క్లిక్ చేయండి


ఇక పాణిగ్రహణం ఎపిసోడ్ 2 చదవండి.


'నాచేయి వదలనన్నాడు

గుబులు వేళల్లో నీలాలన...

గోదారి అలలను చుంబించే

పున్నమి వెన్నెల కిరణం అన్నాడు

నువ్వే లేకుంటే నేను

శూన్య పంజరంలోని రెక్కలు తెగిన

విహంగమన్నాడు

నా అన్వేషణ :

కొండ కొమ్ము నుండి జారిపడ్డాక

అడుగున దొరికే నీ నవ్వుల

ముత్యపు చిప్పల కోసమన్నాడు

తను తనువైతే నేను మనసన్నాడు

ప్రేమరధానికి తను చక్రమైతే

నేను ఇరుసన్నాడు ...

నా ఏకాకితనపు ఎడారిలో

దక్కిన ఒయాసిస్సు వన్నాడు

అన్నీ అనీ అనీ ఎవరికి ఏమయ్యాడు?

తన గుండెను గుడిగాచేసి ....

నన్ను దేవతను చేసి...

తను దేవుడయ్యాడు

?????????????

పతిదేవుడయ్యాడు.'


కవిత రాస్తుండగా.......


బయటినుండి వచ్చిన భర్త ముఖం వివర్ణమవటం చూసింది హంసమంజీర.

కురిసివెలవటానికి సిద్దమవుతున్న మేఘం

నలుపురంగు రంగు విడిలి దూదిపింజలుగా విడిపోయి....పాలిపోయినట్లలుముకున్న

ఆకాశాన్ని చూస్తున్నట్లు, అనిపించింది,

ఆక్షణంలో భర్తముఖం హంసమంజీరకు....


"ఏమయిందీ?" అంది.


"క్రాస్ రోడ్డులో అన్నయ్య కనిపించాడు."


అన్నయ్య అంటే హంసమంజీర భర్తకు

మేనమామ అల్లుడు.


"ఏమన్నారూ?"


"సమీర్ కు విడాకులట ...వాడిభార్య నోటీసు పంపిందట.


"హయ్యో! అదేమిటీ?!ఇంకా కాళ్ళపారాణి ఆరనేలేదు అనేది పాతసామెత. పెళ్ళిభోజనం అరగనేలేదు అనేది నేటి సామెత. మెున్ననేగా...థెళ్ళెం థెళ్ళెం అంటూ బస్సులలో తరలివెళ్ళి, కన్నులపండుగైన పెళ్ళి...... ఇలా ఎందుకైందో?! "


"మా అన్నయ్య కొడుకుకి విడాకులెందుకయినాయ్? ఇదీ అందుకే ఐంది. వాళ్ళూ ఏడాదిగడవకముందే....

కోర్టుమెట్లు ఎక్కారుగా!"


"అదిసరే ఇదేమిటిట.... ప్రాబ్లమ్? "


"అన్నిటికీ...అన్ని విడాకుల సమస్యలకీ మూలకారణం ఇగోనా? .. నేను అనే పట్టుదలా? .... సర్దుబాటు లేకపోవటమా? ...లేక సిధ్దాంతులు చెప్పే గ్రహస్థితా!? నా కళ్ళముందు ఇది రెండోది

మెున్న అన్నయ్య కొడుకు. ఈరోజు సమీర్. "


"ఇదివరకు ఉమ్మడి కుటుంబాలలో ,భార్యలకు చాకిరీతో,

భర్తలకు నిరంతరమూ సంపాదించటంతో సరిపోయేది. కలిసిగడిపే సమయం లేకనో, స్వార్ధమో, ఏమో... అన్ని ఉమ్మడి కుటుంబాలూ... వ్యష్టి కుటుంబాలుగా మారిపోయినాయి. ఇప్పుడు భార్యాభర్తలకే

కలవక ,నూక్లియర్ కుటుంబాలయిపోతున్నాయ్."


"ఉపన్యాసం సరే! విషయం ఏమిటిట?"


"ఇద్దర్నీ హైదరాబాదు లో కాపురానికి పెట్టి ఇటువాళ్ళూ, అటువాళ్ళూ తిరిగివచ్చేసారు


"ఓఅర్ధరాత్రి వీళ్ళకి ఫోన్ వచ్చిందిట. ఆఅమ్మాయి చేతినరం కోసుకుందని.... ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. సమీర్ హాస్పటల్ లో చూపించి, పుట్టింటివాళ్ళని పిలిచి వాళ్ళకి అప్పజెప్పాడుటభయంతో..."


"భయం కాదా! మరి... జరగరానిది ఏదైనా జరిగితే పోలీసుకేసులు, ఎంక్వయిరీలు....నానా రభస. ఎంత అప్రతిష్ట... "


"ఇప్పుడుమాత్రం ఏమయిందీ?కోర్టులో

దావావేసింది... అత్తామామా హెరాస్ చేసారు.... పైగా ఉన్నదిగా మీ ఆడాళ్ళ చేతిలో ఆయుధం.... వాడు మగాడు కాదు.

లాలో విడాకులకు ఎన్ని సెక్షన్ లు ఉన్నాయో అన్నీ పెట్టి,

పాతికలక్షలు భరణం కావాలి అని కూడా పెట్టిందిట .... "


"మరి వీళ్ళేమంటున్నారూ ?"


"సమీర్ బాధపడ్డాడుట..

ఆ అమ్మాయిని నేనేం అనలేదు. అనేంత చనువూ మామధ్య ఇంకా ఏర్పడనే లేదు. "


"నీది బట్టతల... పెళ్ళి కోసమని మీ అమ్మా వాళ్ళు నీ జుట్టు ప్లాంటేషన్ చేయించారు.

నేనుకాబట్టి చేసుకున్నాను,దయతలచి...

అందీ... నేనేమో నీది బానపొట్ట,ఈ వయసుకే ఇలాఉంటే పిల్లలు పుట్టాక...ఇంకెంత లావుగా ఉంటావో అన్నాను. "


"హత్తేరీ! నన్నంతమాటంటావా?

అని వంటింట్లోకి పోయి చాకుతో చేతినరం

కోసుకుంది. తలుపు బాదాను .తెరుచుకుని

బయటికి వచ్చి బ్లాక్ మెయిల్ మెుదలెట్టింది.

చాలా చిన్నవిషయానికే ఇలా చేసింది.'

అని సమీర్ చెబుతున్నాడుట."


"పైగా! తను నాతో ఉంది పాతికరోజులే. పాతికలక్షల భరణం అడుగుతోంది.

మిమ్మల్నిద్దర్నీ నేను సిగ్గులేకుండా అడుగుతున్నాను!...... "


"బయటి ఆడదానితో గడిపినా రోజుకి లక్ష అవుతాయా? మంగళసూత్రం కట్టినందుకు

మగవాడిగా నేను చెల్లించే మూల్యమా?

నేను ఏ తప్పూ చేయలేదు. తనని కొట్టలేదు, తిట్టలేదు. తను వస్తే తప్పకుండా ఆదరిస్తా... అంతేగానీ... ఈ అపరాధ రుసుము నేను చెల్లించను... అని కరాఖండీగా చెబుతున్నాడుట..చాలాసేపు చెప్పుకుని బాధపడ్డాడు అన్నయ్య. "


"అవును పిల్లలకు పెళ్ళి చేసి, హాయిగా, ప్రశాంతంగా ఉండాల్సిన వయసులో, ఇలాంటి చిచ్చులురేగితే?... కానీ ఇప్పటి సమాజంలో ఇదో సామాజిక రుగ్మతలాగా ఇంటింటా విడాకులే... ఏంటో.... ఏం అర్దంకావట్లా!"


"అందుకే ఏ పెళ్ళిళ్ళకూ పోకూడదు మనం. వాళ్ళు కలిసే ఉన్నారు అని తెలిసాక వెళ్ళాలి " అన్నాడు.


ఆమాటలకి హంసమంజీర పకపకానవ్వి

"ట్రాజెడీ లో కామెడీ అంటే ఇదే... అర్దం లేకుండా... అవును.... చూడరాదూ!

మా సాగరమేఖల బ్రతుకు....

సమీర్ కి భార్యవిలన్.... మరిఇక్కడ?...


////////////////


ఇక్కడ మనీషా ఎన్ క్లేవ్ లో


"విరూ" అంటూ తల్లి కంగారు పడటాన్ని చూసి....


"ఏం లేదమ్మా! అక్కగురించి గుర్తుకువచ్చి...

మనసు గుబులుగుబులుగా సుళ్ళుతిరిగిందోక్షణం ..."


"అవునురా! మగాళ్ళంతా, మెుగుళ్ళంతా నీలాగా ఉంటే.... మేఖల లాంటి వాళ్ళ బ్రతుకులు ఇలా అవ్వవుగా! సాగరమేఖల అని పేరు పెట్టినందుకు...సాగరాన్ని నడుముకు చుట్టిన కెరటమే అయింది అది.


"విడాకుల తర్వాత మనతోనే ఉండమని బ్రతిమాలినా... నేనుఎవరికీ భారం కాకూడదూ!...ఉద్యోగం చేసుకుని బ్రతుకుతానని.... హైదరాబాదు వెళ్ళింది.

కలిసిరాక... సూర్యాపేట చేరింది. అక్కడ

బాబాయ్ కూతురు హంసమంజీర ద్వారా

యోగక్షేమాలు తెలుస్తూనే ఉన్నాయి... గానీ.....

దేవుడు దానిని ఓదారి చేస్తే బాగుండు."


అని కన్నీళ్ళు పెట్టుకుంటూ దేవుణ్ని ప్రార్ధిస్తున్న తల్లితోపాటే.... గతంలోకి జారిపోయాడు విరూపాక్ష.


/////////////


"మేకలా!మేకలా! అనిఎగతాళి చేస్తున్నారు నన్నూ! "అంటూ ఏడుస్తూ స్కూల్ విశేషాలలో భాగంగా... బామ్మకు చెబుతూ,

నా పేరు మార్చమని

నాన్నకు చెప్పుబామ్మా " అని....


అని కంప్లైట్ ఇస్తున్న సాగరమేఖల ను

బామ్మనూ మార్చిమార్చి చూస్తున్నారు.

విరూపాక్ష. హంసమంజీర,సుగాత్రి.


"మేఖల అంటే మెులనూలు, అంటే వడ్డాణం అనుకో! సాగరం అంటే సముద్రం.

సాగరమేఖల చుట్టుకుని, సురగంగ చీరగా మలచుకొని అనే పాటవినలేదా!? భారతీయతను చాటుతూ ఈ పాటవ్రాసారు. దేశభక్తి తోనే మీనాన్న ఈపేరు పెట్టాడే భడవా! పేరు మార్చుకోకూడదే! " అందిబామ్మ.


"పో బామ్మా! నువ్వెప్పుడూ అంతే!

ప్రతి దానికీ ఏదోటి చెబుతావ్ !?" మూతిముడిచింది మేఖల.


"అన్నయ్యకు చూడు విరూపాక్ష అని శివుడి

పేరు పెట్టుకోలా!? పొండి ....పోయి సత్రందగ్గర.... బుద్దుడిదగ్గర ఆడుకుని రండి.ఈ సెలవులోనేగా మీరు ఆడుకునేదీ!? ఈలోపు మీకు ఇష్టమైనవన్నీ వండి ఉంచుతాను ...."


పరుగులెత్తుకుంటూ సత్రం అనేబడే పార్కు

దగ్గరకు పరుగెత్తారు నలుగురూ...


కష్టనష్టాలేవీ తెలియని బాల్యం.

నవ్వుతూ తుళ్ళుతూ, అరమరికలు లేని, లేతనవ్వుల బాల్యం....

పెద్దవాళ్ళయ్యాక.... అవతల ఎన్ని ఒడుదుడుకులు ఎదుర్కోవాలో తెలీని

అమాయకపు బాల్యం.


విశాలాక్షమ్మ రామయ్య గార్లకు విరూపాక్ష ,సాగరమేఖల పెద్దకొడుకు

పిల్లలైతే, హంసమంజీర,సుగాత్రి

చిన్న కొడుకు పిల్లలు.... ,పిల్లల్ని పట్నంలో చదివించి, ఉద్యోగాలు రాగానే, వాళ్ళదారిన వాళ్ళు వెళ్ళిపోయినా, పల్లెటూరి వాతావరణం, పైరుపచ్చల మధ్య ఉండే విశాలాక్షమ్మ, రామయ్య దంపతులు మాత్రం, ఇక్కడే ఉండిపోయారు.


పిల్లలు మాత్రం తల్లిదండ్రుల చేతిని వదిలి పెట్టని సంస్కారవంతులు...అప్పటివరకూ...


కాస్త సెలవులు వస్తే చాలు పిల్లలతో సహా పల్లెకి రెక్కలు కట్టుకుని వాలిపోతారు.

పల్లెటూరి వాతావరణం, సంస్కృతి, సాంప్రదాయం ,పిల్లలకు వాసన చూపిస్తూనే ఉంటారు.


సత్రం దగ్గర ఏనుగుల బొమ్మల జారుడుబండమీద జారుతూ, అక్కడే, అప్పుడే పూసిన కాగితపు, బఠాణీ పూలను కోసుకొచ్చి, గద్దెపై ఉన్న బుద్దుడికి పోటీలుపడి పెడుతూ ,ఎన్నో కబుర్లూ, కథలూనూ ,అలసిసొలసి ఇంటికి వస్తే,

ఇద్దరు అమ్మల సాయంతో, పిండివంటలు వండిపెడితే, తినేసి, పెద్దదొడ్లో, జామకాయలూ, సీమసింతకాయలు కోసుకుతింటూ, కొన్ని జేబులో కుక్కుకుంటూ, పెద్దచెర్లో పెద్దవాళ్ళతో పాటు ఈతకు వెడుతూ, అన్నీ ఆపాతమధురమైన ఙ్ఞాపకాలు.


సత్రంలో లైబ్రరీ లో సాయంత్రం అయ్యేసరికి.... ఆకాశవాణి విజయవాడకేంద్రం.... యువవాణి కార్యక్రమం.... బావగారి కబుర్లు.... అంటూ ప్రసారమయ్యే....రేడియో వార్తలు...

ఇన్ని టి. వి లు వచ్చినా అద్భుతమైన ఙ్ఞాపకాలే.

అన్ని రోజులూ, ఒకలాఉండవుగా. పెద్దజంట కీర్తిశేషులయ్యారు. చిన్నజంటలు

పల్లెటూరిలోని పొలం,పుట్రా అమ్మేసి, పట్నంలో... ఉద్యోగాలలో స్థిరపడ్డారు.


కానీ పట్నంచేరాక విరూపాక్ష తండ్రి సప్తవ్యసనాలకూ, బానిసవ్వటాన్ని, విరూపాక్ష బాబాయ్ తట్టుకోలేక పోయాడు.

అన్నివిధాలా నచ్చచెప్పాలనే చూసాడు.


కానీ అవేవీ చెవినిపెట్టక ఓ రోజు ఆఫీసులో వర్క్ చేసే అమ్మాయితో వెళ్ళిపోయాడు.

తర్వాత భూమిమీదే లేడని కబురు.

అప్పటినుంచి విరూపాక్ష తల్లే, కొడుకునీ, కూతురు సాగరమేఖలనూ ఎంతో కష్టపడి పెంచుకొచ్చింది .....విరూపాక్ష బాబాయ్ సాయంతో.


పిల్లలూ చక్కగా పెద్దచదువులు చదివి ప్రయోజకులయ్యారు.


ఇక పెళ్ళిళ్ళూ....


"మన మేఖలకు చక్కటి సంబంధం కుదిరేటట్లు చూడనా?" విరూపాక్ష బాబాయ్ చెప్పాడు.


"కుఱ్ఱాడు ఎవరు?వివరాలు తెలిస్తే ఎంక్వయిరీ చేయవచ్చుగా " అడిగింది విరూపాక్ష తల్లి.


"సాప్ట్ వేర్...ఢిల్లీ లో ఉద్యోగం. స్వంత ఊరు ఎఱ్ఱుపాలెం. మనకుటుంబం లాగానే.... తండ్రిలేడు. తల్లే ఉంది. తోబుట్టువులు లేరు. ఓ అన్నయ్య ఉన్నాడు. పెళ్ళయి అక్కడే స్థిరపడ్డాడు. మంచిసంబంధం.... కుదుర్చుకు వస్తాను."


"మనమ్మాయీ! బానే చదువుకుందిగా!?కట్నం ఎంతడుగుతారో!? "


"ఆడపిల్ల ఎంత చదువుకున్నా, ఉద్యోగం చేస్తున్నా... కట్నాలూ, లాంఛనాలూ తప్పవుగా!? "


============================================

సశేషం


పాణిగ్రహణం ఎపిసోడ్ 3 కోసం ఇక్కడ క్లిక్ చేయండి

============================================

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


Twitter Link

https://twitter.com/ManaTeluguKatha/status/1613149018770792448?s=20&t=1odY_YxgUQhWjgENEd7Ltg


Podcast Link





ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

https://linktr.ee/manatelugukathalu

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.

https://www.manatelugukathalu.com/profile/bharathi/profile


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.












101 views2 comments
bottom of page