top of page

పెండ్లి చూపులు


'Pendli Chupulu' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'పెండ్లి చూపులు' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ


ఫోన్‌ చేయబోయేముందు ఆ తండ్రి తన కూతురును... ‘‘అమ్మా!... బాగా ఆలోచించావా!...’’

దీనంగా అడిగాడు. ‘‘యస్‌ నాన్నా!... ‘నేను నీకు తగను ..’ అన్న ఆ మాటతో నాకు వారి గొప్ప

వ్యక్తిత్వం గోచరించింది నాన్నా!...’’అందుకే!...’’ నవ్వింది భూదేవి...


వీధి వాకిట్లో సీతాపతి ఆత్రంగా నిరీక్షిస్తున్నాడు...

అప్పటికి అరగంటలో మూడుసార్లు వీధిలోకి ఇంట్లోకి నడిచాడు. కారణం... పెద్దకూతురు భూదేవికి పెండ్లి చూపులు. అవసరం తీర్చుకొనేందుకు రెస్టురూమ్‌కు వెళ్లాడు.

వాకిట్లో ఆటో వచ్చి ఆగింది.


ముందుసీట్లో డ్రైవరు ప్రక్కన ఉన్న పెండ్లికొడుకు బాలరాజు తలవూపుకుంటూ దిగి... ప్యాంట్‌ పాకెట్‌ నుంచి దువ్వెనను బయటకు తీసి.. చెరిగిన తలను సరిచేసుకొని... రిక్షావాలాకు డబ్బులిచ్చాడు...

ఆ ఇంటి వీధివైపున ఉన్న కిటికీ ద్వారా వాకిటిముందు దిగిన వారిని పెండ్లికూతురు భూదేవి... ఆమె చెల్లి శ్రీదేవి చూచారు.


బాలరాజు తల సింగారాన్ని ఇరువురూ చూచారు.

‘‘చాలు.. చాలు..’’ అంది శ్రీదేవి నవ్వుతూ...

ఆ మాటలు... బాలరాజుకు వినిపించాయి. బిత్తరపోయి మూడువైపులా చూచాడు.

రిక్షా వెనుకనుండి బాలరాజు అమ్మ గౌరమ్మ, మేనమామ ముత్యాలరావు వారి సతీమణి చంద్రిక దిగారు.


‘‘ఏయ్‌!... నోరు మూయవే!...’’ శ్రీదేవి నోటికి తన చేతిని అడ్డంపెట్టింది భూదేవి.

‘‘ఏమండీ!... వాళ్లు వచ్చారండీ!...’’ భర్తగారికి సిగ్నల్‌ ఇచ్చింది... అర్ధాంగి చంగాళమ్మ...

వీధిలోకి పరుగెత్తాడు సీతాపతి. వారిని చూచి నవ్వుతూ... ‘‘రండి... రండి...’’ స్వాగతం పలికాడు.

వీరు ముందు... ఆ వెనకాల ఆ నలుగురూ ఇంటి వరండాలో ప్రవేశించారు.


‘‘కూర్చోండి సార్‌!...’’ అన్నాడు సీతాపతి.

నలుగురూ కుర్చీలలో కూర్చున్నారు.

సీతాపతి ఇంట్లోకి పరుగెత్తాడు.

ఐదు నిముషాల్లో తనూ భార్య... గ్లాసులు జగ్గుతో వరండాలోకి వచ్చారు.


జగ్గులో వున్నది నిమ్మకాయ మజ్జిగ. అది చైత్రమాసం... ఎండ తీవ్రత.. దాహ శాంతి కోసం గ్లాసుల్లో మజ్జిగ నింపి నలుగురికీ అందించాడు సీతాపతి.


నలుగురూ వేగంగా త్రాగారు. అడిగి... రెండో రౌండు గ్లాసుల్లో నింపాడు... ఆనందంగా చప్పరిస్తూ త్రాగారు. జగ్గు ఖాళీ అయింది. ఇంట్లో నిమ్మకాయలు లేవు. వారి వాలకం మరో గ్లాస్‌ వేసేదానికి సిద్ధంగా వున్నట్టు సీతాపతికి అనిపించి.. భార్యను తట్టి ఇరువురూ లోనికి వెళ్లారు... ఐదు నిముషాల తర్వాత వచ్చి వారిని లోనికి ఆహ్వానించాడు సీతాపతి.


నలుగురూ లోన ప్రవేశించారు... కుర్చీలలో కూర్చున్నారు.... వారిముందు తుంగచాప.. దానిపైన రంగురంగుల బెడ్‌షీట్‌..

‘ఓహో!... దీనిపై అమ్మాయిగారు వచ్చి కూర్చుంటారు కాబోలు!...’ అనుకొన్నాడు బాలరాజు.

‘‘చంద్రా!...’’ ముత్యాలరావుగారి సంబోధన...


‘‘ఏమండీ!... ఎంతో పతిభక్తితో కూడిన జవాబు...

‘‘వెళ్లి అమ్మాయిని తీసుకురా!...’’


‘‘వద్దు... వద్దు...’’ చంగాళమ్మగారి అభ్యంతరం... వెంటనే నవ్వుతూ...

‘‘మీకెందుకు ఆ శ్రమ... అది నా పాత్ర... అమ్మాయిని నేను తీసుకొని వస్తాను...’’ వేగంగా ఎదుటి గదిలో ప్రవేశించింది.


‘‘మామా!...’’

‘‘ఏం బాలరాజా!...’’


దాహం అన్నట్టు సైగచేశాడు చేతితో బాలరాజు...

ప్రక్కనవున్న సీతాపతి పరుగున వంటగదికి వెళ్లి జగ్గు గ్లాసుతో వచ్చి... గ్లాసులో నీరు నింపి బాలరాజుకు అందించాడు.

‘‘సీతాపతీ!... మీ నెల్లూరులో ఎండలు జాస్తయ్యా!... పాపం మా బాలరాజు అల్లాడిపోతున్నాడు...’’ అన్నాడు ముత్యాలరావు.


‘‘అలాగనా సార్‌!... మరి మన... అదే తమరి అల్లూరిలో ఎలావుంటుంది సార్‌!...’’ అడిగాడు సీతాపతి.

‘అల్లూరు ఏదో మహా ఊరు... కొడైకెనాల్లా ఫీలవుతున్నారు...’ అనుకొన్నాడు...


తల్లి... పెండ్లికూతురు వచ్చారు. ఆ బెడ్‌షీట్‌పై భూదేవి కూర్చుంది.

చంద్రిక కుర్చీ దిగి అమ్మాయి ప్రక్కన కూర్చుంది.

బాలరాజు భూదేవిని ఆత్రంగా చూస్తున్నాడు.

కిటికీగుండా బాలరాజును చూస్తున్న శ్రీదేవి నవ్వుకొంటోంది...


‘‘ఎంతవరకు చదివావు?...’’ అడిగింది చంద్రిక.

‘‘ఎం.ఏ.బి.ఇడి.,...’’ భూదేవి జవాబు...

పెండ్లికొడుకు బాలరాజుకు ఆమాట... కరెంట్‌ షాక్‌!...

‘‘ఆ...’’ ఆశ్చర్యపోయింది చంద్రిక.


‘‘అవునండీ!...’’ చిరునవ్వుతో చెప్పింది భూదేవి.

బాలరాజు ఆశ్చర్యంతో ముత్యాలరావు ముఖంలోకి చూచాడు... విచారంగా...

‘‘నేను వారిని కొన్ని ప్రశ్నలు అడగాలి!...’’ మెల్లగా చెప్పింది భూదేవి.


అందరూ ఆశ్చర్యంతో భూదేవి ముఖంలోకి చూచారు.

‘‘గతికితే... అతకదని మేము టిఫిన్‌ ఏర్పాటు చేయలేదు...’’ మెల్లగా చెప్పాడు సీతాపతి.

భూదేవి తండ్రి ముఖంలోకి చూచింది. లేచి ‘‘రండి సార్‌!...’’ఎదుటి గదిలోకి వెళ్లిపోయింది.

బాలరాజు కళ్లల్లో నీళ్లు... దీనంగా మామ ముఖంలోకి చూచాడు.


‘‘వెళ్లు... వెళ్లి మాట్లాడు...’’ బాలరాజు చేతిని పట్టుకొని లేపాడు ముత్యాలరావు.

బడికి అయిష్టంగా వెళ్లే పిల్లాడిలా ఆ గదిలోకి వెళ్లాడు బాలరాజు.

భూదేవి తలుపు ప్రక్కన నిలబడి వుంది.... బాలరాజు తలవంచుకొని గదిలో ప్రవేశించాడు... మెల్లగా తల ఎత్తి చూచాడు. భూదేవి కనిపించలేదు.

‘‘కూర్చోండి...’’


ఆ భూదేవి పలుకుతో బిత్తరపోయి గది నాలుగు వైపులా ఆశ్చర్యంతో చూచాడు.

‘‘మీరు ఎంతవరకు చదివారు?...’’ భూదేవి ప్రశ్న... క్షణం తర్వాత మరలా ‘‘కూర్చోండి!...’’ అంది చిరునవ్వుతో భూదేవి.


బాలరాజు ఒంటికి బంక చమటలు పట్టాయి. నిలబడలేక.. కుర్చీలో కూలబడ్డాడు... తలవంచుకొని.

‘‘నేను ప్లస్‌టూ... సెంట్రల్‌ గవర్నమెంటు జాబ్‌... మీ అంత చదువు నేను చదువుకోలేదు... నేను మీకు తగను...సారీ!...’’ వేగంగా కుర్చీనుండి లేచి, మామ పిలుస్తున్నా ఆగకుండా వీధిలోకి వెళ్లిపోయాడు.

అతని బృందం వీధిలో ప్రవేశించింది.


‘‘మామయ్యా!... మోసం చేశావు...’’ అంటూ వేగంగా బస్టాండ్‌ వైపుకు నడవసాగాడు ఆ ముగ్గురూ బస్టాండుకు ఆటో ఎక్కారు.

భూదేవి... తనకు బాలరాజు చెప్పిన మాటలను తల్లిదండ్రులకు చెప్పింది.

మనస్సున అతన్ని గురించి ఆలోచనలు...


వారం రోజుల తర్వాత... సత్యమూర్తి ముత్యాలరావుకు ఫోన్‌ చేసి... ‘’మీ అబ్బాయిని మా అమ్మాయి ఇష్టపడిరది. మీ అబ్బాయికి మా అమ్మాయి నచ్చితే... తెలుపండి... నేను వచ్చి మీతో మాట్లాడుతాను...’’ వినయంగా చెప్పాడు సీతాపతి.


ఆనందపారవశ్యంతో ముత్యాలరావు... ‘‘ఒరే బాలరాజూ!...’’ బిగ్గరగా అరిచాడు.

&&&&&&

//సమాప్తి//

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఇక్కడ క్లిక్ చేయండి.

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఇక్కడ క్లిక్ చేయండి.

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


https://www.facebook.com/ManaTeluguKathaluDotCom


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



30 views0 comments
bottom of page