top of page

వన భోజనం


'Vana Bhojanam' Written By Sampath Kumar S

రచన : S. సంపత్ కుమార్


దేవునికి దణ్ణం పెట్టుకొని, కోడలు ఇచ్చిన ఫలహారం తిని, న్యూస్ పేపర్ పట్టుకొని వాలు కుర్చీలో వాలాడు ఆదినారాయణ. ఈ మధ్య రిటైర్ అయ్యి హైదరాబాద్ లో ఉండే కొడుకు దగ్గర సెటిల్ అయ్యాడు. అలా వాలు కుర్చీలో కూర్చుని పేపర్ చదువుతున్న ఆదినారాయణ ఒక ప్రకటన చూసి ఆగిపోయాడు అది ఏమిటంటే ఫలానా కులం వారు ఏర్పాటు చేసుకున్న వనభోజనాల గురించి. ఆ ప్రకటన చూసి చాలా ఆశ్చర్యపోయాడు. ఇంతకు ముందు జ్ఞానం సరిగా లేక, కులాల పిచ్చిలో కొట్టుకొని పోయారంటే అర్థం ఉంది. ఇప్పుడు అన్ని కులాలలో ఉన్నవారు చదువుకుంటున్నారు. ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకొని పట్టణాలలో,విదేశాలలో వ్యాపారం, ఉద్యోగాలు చేస్తున్నా ఈ కులాల కల్చర్ పెరగడం వింతగా ఉంది. ఐనా ఈ పట్టణలలో కులాల పేరిట వనభోజనాలు ఏమిటి ? ఇంక మా రామాపురంలో తోటలో వనభోజనాలు ఏర్పాటు చేస్తే అన్ని కులాల వారు ఐకమత్యంగా ఉండి కార్తీక మాసంలో వనభోజనాలు ఒక పండుగలా చేసుకునేవాళ్లం. అప్పటి పిల్లలకైతే ఎవరిది ఏ కులమో తెలిసేది కాదు. ఇప్పుడు తన కులమేమిటో తెలుసు. మరియు కులాభిమానము పెంచుకొని ఇతర కులాలంటే చిన్నచూపు భావం కలిగించుకుంటున్నారు . ఈ ఆధునిక సమాజంలో ఇలా కులాల కల్చర్ అభివృద్ధి అవుతుంటే ఎలా అనుకుంటూ గతంలోకి వెళ్లాడు ఆదినారాయణ.

కార్తీక మాసం వనభోజనాలు సుబ్బయ్య గారి తోటలో సందడే సందడి అక్కడక్కడ పందిళ్ళు ఒకపక్క వంటల ఘుమఘుమలు ఇంకోపక్క పిల్లల ఆటలు మరోపక్క పెద్దవాళ్ల ముచ్చట్లు లౌడ్ స్పీకర్ లో పాటలు మనం ముందుగా 1970 సంవత్సరం వెళ్దాం . ఆది నారాయణ, తెలుగు మాస్టర్ ఆంజనేయులు,చెప్పులు కుట్టే అతను అనంతాచారి ,గుడి పూజారి అక్బర్, టైలర్ ఈ నలుగురూ మంచి మిత్రులు రామాపురంలో. ఈ నలుగురూ రామాపురం ప్రజలకు తలలో నాలుకలు. రామాపురం అటు పల్లెటూరు కాదు, ఇటు టౌన్ కాదు. పండగలప్పుడూ, ఏదయినా ఫంక్షన్ లు జరిగినప్పుడూ ఈ నలుగురి కుటుంబాల సందడి చెప్పనక్కరలేదు. ఇంక కార్తీక మాసంలో సుబ్బయ్య చౌదరి తోటలో వీరు చేసే వనబోజనల కార్యక్రమం ప్రత్యేకం. శాఖాహార రుచులతో సర్వకులమత సమ్మేళనం. ఆటపాటల సందడితో నయనానందకరం . ఇలా కాలం కొన్ని సంవత్సరాలు గడిచి 1995 సంవత్సరం వచ్చింది .చెప్పులు కుట్టే ఆంజనేయులు కూతురు పెండ్లి పట్నంలో ఉన్న తన బంధువుల అబ్బాయికి ఇచ్చి చేశాడు . అల్లుడు బాగా చదువుకున్నా, కులవృత్తి దైవంలా భావించి చెప్పుల దుకాణం, తర్వాత చెప్పుల కంపెనీ పెట్టి, ఇప్పుడు స్టాండర్డ్ ఫుట్ వేర్ కంపెనీగా ప్రసిద్ది చెంది, దేశ నలుమూలల వ్యాప్తి చెంది, కోటీశ్వరుడయ్యాడు. ఆంజనేయులు అల్లుడుకు చేదోడుగా పట్నం చేరుకున్నాడు. అలాగే అక్బర్ కొడుకు కూడ పట్నంలో వస్త్ర దుకాణం పెట్టి సంపన్నుడయ్యాడు. అక్బర్ కూడ కొడుకుతో పాటు పట్నంకు వచ్చాడు. ఇంక రామాపురం లో తెలుగు మాస్టర్ ఆదినారాయణ,పూజారి అనంతాచారి మాత్రమే ఉన్నారు. కార్తీక మాసంలో మాత్రం ఆంజనేయులు, అక్బర్ తమ కుటుంబాలతో రామాపురంకు వచ్చి వనభోజనాల్లో పాల్గొంటూనే ఉన్నారు . అలా కాలం 1998 సంవత్సరంకు వచ్చింది. తెలుగు మాస్టర్ ఆదినారాయణ రిటైర్ అయ్యాడు. కొడుకు పట్నంలో ఉద్యోగం కాబట్టి అతను కూడా పట్నం వచ్చాడు. రామాపురం లో అనంతాచారి ఒక్కడే ఉండిపోయాడు. అప్పటినుంచి వీరిమధ్య దూరం పెరిగి వనభోజనాలు ఆగిపోయాయి . కోడలు పిలుపు తో గతంలో నుండి బయటకు వచ్చి, చేయవలసిన పనులు చేసి మధ్యాహ్నం భోజనం చేసి మంచం మీద కాసేపు పడుకోగానే నిద్రలోకి జారుకున్నాడు. మరుసటిరోజు ఉదయం ప్రతి రోజూల వాకింగ్ చేసుకుంటూ అక్కడే దగ్గరలో వున్న తన మిత్రుడు ఆంజనేయులు దగ్గరకు బయలుదేరాడు ఆదినారాయణ. పట్నంలో కూడ తన ఉర్లో చేసినట్లు ఈ కార్తీక మాసంలో సర్వకులమత వనభోజనాలకు శ్రీకారం చుట్టాలని ఆదినారాయణ అనుకున్నాడు పేపర్లో తాను చదివిన కార్తీక మాసంలో ఫలానా కులం ఏర్పాటు చేసుకున్న వనభోజనాల ప్రకటన ఆంజనేయులకు చూపించాడు "ఇక్కడ ప్రతి కులం వారు ఇలా వనభోజనాలు కార్తీక మాసంలో ఏర్పాటు చేసుకోవటం మామూలే" అన్నాడు ఆంజనేయులు "మనం ఎంతో అభిరుద్ది సాధించాం అంటారు, ఇంతకు ముందు జ్ఞానం సరిగాలేక, కులాల పిచ్చిలో కొట్టుకొని పోయారంటే అర్థం ఉంది.ఇప్పుడు ప్రతి ఒక్కరూ జ్ఞానం సంపాదించుకొని పెద్ద పెద్ద పట్టణాలలో,విదేశాలలో వ్యాపారాలు, ఉదోగ్యలు చేసుకుంటున్నారు. మరి ఈ పట్టణాలలో ఇలా కులాల వారీగా వనభోజనాలు చేసుకోవడం ఏమీ బాగాలేదు" అన్నాడు ఆదినారాయణ. "ఏమీ బాగాలేదు కాని అంత మనమాదిరే ఉంటారా"అని ఆంజనేయులు అన్నాడు. "నాకు ఒక ఆలోచన వచ్చింది" "ఏమిటది" "సర్వకులమత వనభోజనం ఏర్పాటు చేద్దాం" "నీకేమైనా పిచ్చి పట్టిందా ,ఊర్లో అంటే అందరు తెలిసినవాళ్లే కాబట్టి మనం ఏది చేసినా అప్పుడు నీ ఆదర్శ చాదస్తం నడిచింది. " "తెలిసిన వాళ్ళతో ఊర్లో చేసాము అలాగే ఇప్పుడు ఇక్కడ కొత్త ప్రయోగం చేసి చూద్దాం". "ఇప్పుడు ఎవరి దారి వాళ్ళదే. మన పిల్లలు చేయాలి. అది వాళ్లకు కుదరదు. కాబట్టి మనం గుళ్ళో అన్నదానం చేద్దాం. కాస్త పుణ్యమైనా వస్తుంది. అన్ని వర్గాల వారు వచ్చి తిని వెళ్లుతారు." "అంతే అంటావా" ఇంతలో కొడుకు నుంచి కాల్ "నాన్నా ! తొందరగా రండి. మన కులం వాళ్ళు వనభోజనాలు ఏర్పాటు చేశారు. నిన్న మీకు మీ కోడలు చెప్పడం మరచిపోయిందట" అని చెప్పగానే ఆంజనేయులు వంక చూస్తూ,కొడుకు తనతో మాట్లాడిన విషయం చెప్పాడు పక పక పక మని నవ్వాడు ఆంజనేయులు "ఇంక సర్వకులమతా వనభోజనాలు అంటూ నీకు వచ్చిన ఆలోచన నాకు చెప్పావు కాబట్టి సరిపోయింది . ఇప్పుడు పిల్లలు మన మాట వినేటట్టులేరు. వారికి అంతా తెలిసినా ఈ కులాల మైకంలో పడిపోయారు. నీతులు చెప్పే ప్రజా నాయకులు తాము ఏ పార్టీలో వున్నా తమ కులం వారు ఎర్పాటు చేసిన వనభోజనాలకు మాత్రం వస్తారు. మనం ఏ పార్టీలో వున్నా మన కులం అంత గొప్పది మరేదీ లేదు అంటారు అలాగే ఇతర రంగాల ప్రముఖులు కూడా. ఇంక మన రోజులే నయం. " "ఔను నిజం చెప్పావు " "ఆదినారాయణ భుజం తడుతూ "నీ ఆదర్శాన్ని ఏమీ చంపుకోవద్దు . ఈ పూట భోజనానికి మా ఇంటికి రా " అని పిలిచాడు ఆంజనేయులు. ఇంటికి వెళ్ళాక"నేను వనభోజనానికి రావటం లేదు మా స్నేహితుడు ఆంజనేయులు ఇంటికి భోజనానికి వెళ్తున్నా" కోడలికి గట్టిగా వినపడేటట్లు చెప్పి తృప్తిగా ఆంజనేయులు ఇంటికి నడిచాడు ఆదినారాయణ. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఇంట్లో వాళ్లు కుల వనభోజనాలకు వెళ్ళడం, తాను మాత్రం ఆ రోజు ఆంజనేయులు ఇంటికి భోజనానికి వెళ్ళడం ఇలా కొన్నేళ్లు జరిగేది. కాలం , వయసు ఆగదుకదా అలా 2018 సంవత్సరం వచ్చింది 1998లో రిటైర్ అయిన ఆదినారాయణ కు 78 యేండ్లు వచ్చాయి అలాగే ఇక్కడే ఉన్న రామాపురం మిత్రులు ఆంజనేయులుకి, అక్బరుకు మరి రామాపురంలో ఉన్న అనంతచారికి దాదాపు అదే వయసు వచ్చి ఆరోగ్యంగానే ఉన్నారు.ఆంజనేయులు తప్ప మిగతా మిత్రులు కలుసుకోవడం ఎప్పుడో జరిగేది. కార్తీక మాసం. ఆదినారాయణ మనవడు ఒక రోజు వచ్చి రేపు మనం వనభోజనంకి పోతున్నాం అన్నాడు "నేను ఎలా రాను అని, మీ నాన్న ఇన్నేళ్ల తర్వాత నీతో చెప్పిస్తే వస్తాననుకున్నావా ? అది జరగని పని" "ఎందుకు రావు ?రేపు అక్కడ పెండ్లి చూపులు కూడ,నీవు అమ్మాయి చూసి సరే అంటేనే నా పెండ్లి." మనవడి బలవంతం మీద వెళ్లక తప్పలేదు ఆదినారాయణకు ఫంక్షన్ హాల్లో కార్తీక వనభోజనాలు. ఇష్టంలేకపోయినా కార్లో నుంచి దిగాడు ఆదినారాయణ. ఒకపక్క వంటల ఘుమఘుమలు . ఇంకోపక్క పిల్లల ఆటలు. మరోపక్క పెద్దవాళ్ల ముచ్చట్లు. లౌడ్ స్పీకర్ లో పాటలు . స్థలం మారింది కాని రామాపురం సుబ్బయ్య గారి తోట వాతావరణము గుర్తుకొస్తుంది. ఇంతలో ఆంజనేయులు,అక్బర్,అనంతచారి తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులు తన కాళ్ళను మొక్కుతుంటే కళ్ళలో సంభ్రమాశ్చర్యాలు. అప్పుడే జరగింది. ఒక అద్బుతం మనవడు ఒక అమ్మయి తీసుకొచ్చి "ఎలా ఉంది తాత, ఈ అమ్మాయి" ఆశ్చర్యం, ఆనందం! ఆమె ఎవరో కాదు రోజూ ఆంజనేయులు ఇంటికి వెళ్ళినప్పుడు నాకు పాలు ఇచ్చే ఆంజనేయులు మనవరాలు. ఆంజనేయులు మనవరాలితో తన మనవడు కలవడం తెలియదు కానీ ఒక్కటే కాలేజీలో చదువుతున్నారు అని తెలుసు . రామాపురంలో లాగా కార్తీక వనభోజనాలు పట్టణంలో కూడ ఏర్పాటు చేయాలనే తన కోరిక కోరికగా మిగిలిపోగుడదని, అది తెలుసుకొని ., తన మనవడు ఆంజనేయులు మనవరాలితో వనభోజనాలు ఏర్పాటు చేయడమే కాకుండా, వారిద్దరూ ప్రేమించి, తన ఆశీర్వాదంతో పెళ్ళి చేసుకోవాలని అనుకోవడం, తన చివరి రోజుల్లో ఆదినారాయణ పొందిన ఆనందం మరవలేనిది.

గమనిక : ఈ కథ సంక్రాంతి కథల పోటీకి పంపబడింది.బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసికొనబడుతాయి

రచయిత పరిచయం : S. సంపత్ కుమార్

చదువు M.A. Archeology

కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.

340 views0 comments
bottom of page