top of page

ఇన్స్టాగ్రామ్ స్టాకర్ - పార్ట్ 3



'Instagram Stalker - Part 3/3' - New Telugu Story Written By Shilpa Naik

Published In manatelugukathalu.com On 25/05/2024

'ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పార్ట్ 3/3' పెద్ద కథ

రచన: శిల్పా నాయక్

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



జరిగిన కథ

తన ఫ్రెండ్ రష్మీ సలహా మీద ఇన్స్టాగ్రామ్ వాడటం మొదలుపెడుతుంది రాధ. సాహిల్ అనే వ్యక్తితో ఇన్స్టా లో పరిచయం పెరుగుతుంది. పరీక్షలు దగ్గరవడంతో చాటింగ్ ఆపుతుంది. ఒకరోజు సాహిల్ బస్సులో కనపడి రాధను వేధిస్తాడు. క్లాస్ మేట్ వంశీ జోక్యంతో వదిలేస్తాడు. 


రాధను హాస్టల్ ఖాళీ చేసి ఇంటికి వెళ్ళమంటాడు వంశీ. 

ఇంటికి వెళ్లే దారిలో భయానికి లోనవుతుంది రాధ. 


ఇక ఇన్స్టాగ్రామ్ స్టాకర్ పార్ట్ 3 చదవండి. 


రాధ అరుపులకి తన ఇంటి వాళ్లే కాకుండా చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా లేచి ఇంట్లో నుంచి బైటికి వచ్చి రాధని చూస్తు, రాధ తండ్రి శ్రీనుని పిలుస్తారు. శ్రీను, రాధ తల్లి లక్ష్మి, ఇంట్లో నుంచి కంగారుగా తాళం తీస్కొని గేటు ఓపెన్ చేసి రాధని ఇంట్లోకి తీసుకెళ్తారు. 


"అసలు అర్ధరాత్రి ఇంటికి రావాల్సిన అవసరం ఏముంది? " అని శ్రీను రాధని కోపంగా అడుగుతాడు. 


రాధ ఏం మాట్లాడకుండా కూర్చుంటుంది. శ్రీను కొంచెం కోపం తగ్గాక, "లక్ష్మి, అమ్మాయికి అన్నం పెట్టు, " అని చెప్పి రాధ వైపు తిరిగి, "నిన్ను తిట్టాలనే ఉద్దేశం కాదమ్మా. ఇలాంటి సమయంలో ఒంటరిగా హైవే నుంచి ఊరికి రావడం మంచిదేనా చెప్పు? ఇప్పుడు చూడు, ఏదో చూసి భయపడి ఎలా అరిచావో. అయినా ఈరోజు ఏదో పార్టీ ఉందని చెప్పావ్ కదా, మరి ఎందుకు ఊరొచ్చావ్? " అని సందేహంగా అడుగుతాడు. 


రాధ ఏం మాట్లాడకుండా అలాగే కూర్చొని ఆ ఆకారం గురించే ఆలోచిస్తుంటుంది. 


అప్పుడే లక్ష్మి భోజనం ప్లేట్ రాధకి ఇస్తుంది. రాధ ఏం మాట్లాడకుండా భోజనం చేస్తూ ఉండగా రాధ వాళ్ళ బాబాయి మరియు పిన్ని రాధ గురించి తెల్సుకోవడానికి వస్తారు. రాధ పరిస్థితిని గమినించిన శ్రీను వాళ్ళని పొద్దున్నే రమ్మని చెప్పి పంపిచేయడానికి ప్రయత్నిస్తాడు. కానీ రాధ వాళ్ళ బాబాయి శ్రీనుతో, "అన్న, మన ఊరి పొలిమేరల్లో ఉన్న మర్రి చెట్టు కి వెంకటయ్య ఉరేసుకుని చచ్చిపోయాడంటా తెలుసా. "అని అడుగుతాడు. 


బాబాయి మాటలకి పిన్ని కూడా, "అవును బావగారు, ఆ శవాన్ని మొదటిగా చూసింది మన రాధమ్మే అని, అందుకే అలా భయపడిందని ఊర్లో అందరు చెప్పుకుంటున్నారు. ఈ విషయం చెప్పడానికి వస్తే, మీరేమో.. అయినా సరేలే పొద్దునే రాధమ్మని ఎదైనా గుడి తీసుకెళ్తే బాగుంటుంది" అని కొంచెం ఎగతాళిగా చెప్పి అక్కడ నుండి వెళ్లిపోతారు. 


రాధ భోజనం తినేసి పడుకుంటుంది. శ్రీను జరిగిన విషయం మొత్తం లక్ష్మికి చెప్తాడు. ఇద్దరు రేపు రాధని గుడికి తీసుకెల్దామని అనుకుంటారు. పొద్దునే 6 అవుతుంది. 


లక్ష్మి రాధని నిద్రలేపడానికి రాధ చేయి పెట్టుకుంటుంది. కానీ రాధ శరీరం చాలా వేడిగా ఉంటుంది. జ్వరంతో రాధ మాట్లాడడం కూడా కష్టమైపోతుంది. శ్రీను వెంటనే డాక్టర్ ని ఇంటికి పిలుస్తాడు. డాక్టర్ ఏవో మందులు ఇచ్చి వెళ్ళి పోతాడు. ఆ మాత్రలు వేసినా జ్వరం మాత్రం తగ్గదు. శ్రీను, లక్ష్మికి ఏం చెయ్యాలో తోచదు. రాధ కనీసం నీళ్లు కూడా తాగలేకపోతుంది. 


బలవంతంగా తాగిస్తే వెంటనే వాంతి చేసుకుంటుంది. అన్నాన్ని చూస్తే పురుగులు కదులుతున్నటుగా ఉందని చెప్పి ఏం తినకుండా అలాగే మంచం మీద పడి ఉంటుంది. అప్పుడప్పుడు శరీరం కాలిపోతున్నంత వేడిగా ఉంటే మరొకసారి ఐస్ ముద్దలా చల్లగా మారిపోతుంది. రాధ వాళ్ళ బాబాయి, ఇంటికి ఒక బాబాని పిలుచుకొని వస్తాడు. ఆ బాబా రాధని చూడగానే తన పైన ఎవరో చేతబడి చేసారని, వచ్చే అమావాస్య రాత్రికి తను చనిపోతుందని, ఇప్పుడు తనే కాదు ఏ బాబా కానీ ఏ సాయం చెయ్యలేరని చెప్పి వెళ్ళిపోతాడు. 


ఆ మాటలు విన్న శ్రీను, లక్ష్మి నిల్చున్న చోట కూర్చొని భోరున్న ఏడుస్తారు. ఆ ఏడుపులని విన్న రాధ తనలో ఉన్న బలమంతా కూడగట్టుకొని తన నాన్నని పిలవలనుకున్నా గొంతులో నుంచి మాట బైటకి రాదు. 


అప్పుడే రాధకి పొలాలలో కనిపించిన ఆకారము తన ఇంటి గోడపైన కనిపించడంతో గట్టిగా అరుస్తుంది. ఆ అరుపులకి శ్రీను, లక్ష్మి రాధ దగ్గర వస్తారు. కాని రాధకి మాట్లాడే శక్తి కూడా లేకపోవడంతో మౌనంగా ఏడుస్తుంది. తన ఏడుపుని చూసిన వాళ్ళు కూడా ఏడుస్తారు. కొన్ని రోజులు ఇలాగే గడిచిపోతాయి. 


రోజు రోజుకి రాధ పరిస్థితి దిగజారుతునే ఉంటుంది. కళ్ళు తెరవడం కూడా కష్టమైపోతుంది రాధకి. ఆ నోటా ఈ నోటా నుంచి ఈ విషయం ఊరి సర్పంచ్ దాక చేరుకుంటుంది. సర్పంచ్ కొన్ని పళ్ళు తీసుకోని, శ్రీను ఇంటికి వస్తాడు. 


సర్పంచ్ ఏమైందని అడిగాక, శ్రీను జరిగింది మొత్తం చెప్పి ఏడుస్తాడు. సర్పంచ్ ఓదారుస్తూ, "ఇలాంటి మంచి మనిషికి ఏం కాదులేరా. నువ్వు ఊరుకో. ఇదిగో ఈ పళ్ళు తీసుకో. వీటిని జ్యూస్ చేసి రాధమ్మకి తాగించు. "అని చెప్పి పళ్లు ఉన్న కవర్ ని శ్రీనుకి ఇస్తాడు. 


శ్రీను, "వద్దయ్యా, పెద్ద మనసుతో మీరు ఇచ్చినా తీసుకునే పరిస్థితిలో మేము లేమయ్యా. ఎల్లుండే అమావాస్య.. "అని మళ్ళీ ఏడుస్తాడు. 


సర్పంచ్ శ్రీను భుజం పైన చేయి వేసి, "అది చెప్పడానికే వచ్చాను. నాకు తెలిసిన ఒక తాంత్రికుడు ఉన్నాడు. 


ఆయనకి ఇలాంటి విషయాల్లో చాలా అనుభవం ఉంది. నేను నీ గురించి ఆయనతో నిన్న ఫోన్ లో మాట్లాడాను. తను రాధమ్మకి సంబంధించిన ఏదైనా వస్తువుతో రమ్మని చెప్పాడు. నువ్వు కూడా త్వరగా తయారవు. ఇద్దరం ఆయన దగ్గర వెళద్దాం. " అని చెప్పడం శ్రీను మనసులో చిన్న ఆశ మొదలవుతుంది. శ్రీను వెంటనే రాధ దుప్పటాని సంచి లో వేసుకొని సర్పంచ్ తో కలిసి ఆయనని కలవడానికి వెళ్తాడు. 


ఆ తాంత్రికుడు ఏం మాట్లాడకుండా ఆ దుప్పటాని తీసుకుని దానిని ముగ్గులో పెట్టి, ఏవో మంత్రాలు చదువుతూ, ‘మీరిక వెళ్ళవచ్చు’ అంటూ సైగ చేస్తాడు. శ్రీను ఏదో చెప్పబోయే లోపే సర్పంచ్ తనని బైటకి లాక్కొస్తాడు. 


శ్రీను కంగారుగా, "ఆయనతో మాట్లాడాలని అనుకుంటే. మీరేంటి ఇలా లాక్కొచ్చారు? " అని అడుగుతాడు. 


సర్పంచ్, "ఆయనికి మొత్తం తెలుసు. సైగ చేసిన తర్వాత కూడా అక్కడే ఉండి, ఆయనని డిస్టర్బ్ చేస్తే అది మనకి మంచిది కాదు. అర్ధంచేసుకో. "అని చెప్పి మళ్ళీ ఊరికి ప్రయాణమవుతారు. 


ఆ రోజు రాత్రి, శ్రీను మరియు లక్ష్మి కి నిద్రే పట్టదు. రాధ కోసం తన ఇంటి పూజ గదిలో దేవుడికి పూజ చేస్తుంటారు. అలా పూజ చేస్తూ చేస్తూ అక్కడ నిద్ర పోతారు. 


పొద్దునే 5 అవుతుంది. రాధ చెవిలో నీళ్లు కారుతున్న శబ్దం వినిపిస్తుంది. రాధ మెల్లగా లేవడానికి ప్రయత్నిస్తుంది. అలా లేచి నీళ్లు కారుతున్న వైపు మెల్లగా నడుస్తూ అక్కడికి చేరుకుంటుంది. ఇంటి పైన ఉన్న ట్యాంక్ నిండిపోయి నీరు కారుతున్నాయి. రాధ వరండాలో ఉన్న మోటార్ స్విచ్ ని ఆఫ్ చేసి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చుంటుంది. రాధకి తనలో పాజిటివ్ ఎనర్జీ ఫీల్ అవుతుంది. 


చుట్టుపక్కల వస్తువులని గమనిస్తూ ఉండగా గేటు బైట, రోడ్ పైన ఏదో ఉన్నట్టు అనిపిస్తుంది. ఈసారి రాధకి భయం వేయదు. మెల్లగా గేటు ని ఓపెన్ చేసి చూడగా అక్కడ రోడ్ పైన వంశీ, సాహిల్ మరియు ఎవరో బాబా రక్తం కక్కుకొని చచ్చిపోయినట్టుగా కనిపిస్తుంది. వంశీ చేతిలో తన దుప్పటా ని చూసి రాధ షాక్ అవ్వుతుంది. ఎందుకంటే ఆ దుప్పటాని సాహిల్ ని గ్రౌండ్ లో కలవడానికి వెళ్ళినప్పుడు వేసుకున్నది. గేటులో దుప్పటా చిక్కుకుపోవడంతో దానిని అక్కడే వదిలేసింది. 


రాధకి అప్పుడు అర్ధమయింది, బహుశా ఆ దుప్పటాతోనే వంశీ, సాహిల్ తనపై చేతబడి చేసారని. అసలు ఎందుకిలా చేసారో రాధకి అర్ధం కాక ఆలోచిస్తూ ఉంటుంది. అప్పుడే అటుగా వస్తున్న రాధ వాళ్ళ బాబాయి ఆ శవాలని చూస్తు గట్టిగా అరవడంతో శ్రీను, లక్ష్మి నిద్ర లేచి కంగారుగా రాధ మంచం వైపు వెళ్తారు. బాబాయి రాధని చూస్తూ ఆశ్చర్యంగా, "నీ అంత నువ్వే ఇక్కడికి దాక నడిచి వచ్చావా?" అని అడుగుతాడు. 


అప్పుడే శ్రీను గేటు దగ్గర వచ్చి రాధని చూసి ఆనందంతో కన్నీళ్లు పెట్టుకుంటాడు. కొన్ని రోజులు ఇలాగే గడుస్తాయి. రాధ ఫైనల్ సెమిస్టర్ లో కూడా పాస్ అయ్యిపోవడంతో కాలేజీ కి వచ్చి ఫైనల్ మెమో తీసుకోమని మెసేజ్ వస్తుంది. కానీ రాధ మనసులో ఏదో తెలియని భయం, వంశీ లాగా ఫ్రెండ్ అని ముసుగు వేసుకుని తన చెడుని కోరుకుంటున్నారో, అని. 


శ్రీను మరియు లక్ష్మిలకి రాధని మళ్ళీ సిటీకి పంపించే ఉదేశ్యం లేదు. రాధకి కూడా తన అమ్మ నాన్న ని వదిలి వెళ్ళే ఆలోచనే లేదు. అందుకే ప్లేసెమెంట్ లో వచ్చిన జాబ్ ని రిజెక్ట్ చేసేసి, చివరిసారిగా మెమో కోసం కాలేజీకి తన నాన్నతో కలిసి వెళ్తుంది. అక్కడ రష్మి కోసం ఎదురు చూసింది. కాని రష్మికి బదులుగా తన అన్నయ్య రావడం చూసిన రాధ, రష్మి ఎక్కడని అడుగుతుంది. 


రష్మి వాళ్ళ అన్నయ్య కన్నీళ్లు పెట్టుకోని, "2 వారల క్రితం, ఒక రోజు రాత్రి గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఇల్లంతా అటు ఇటూ తిరుగుతూ సృహ తప్పింది. ఇంకా అప్పటి నుంచి అలాగే ఉంది. తనని ఎంతో మంది డాక్టర్స్ కి చూపించాం. రిపోర్ట్స్ అని నార్మల్ గానే ఉన్నాయి కానీ తను ఇంకా ఎందుకు సృహ లోకి రావట్లేదు అర్ధం కాలేదని చేతులెత్తేశారు. మా అమ్మమ్మ ఎవరో పండితుడుని పిలిపించింది. ఆయన చెప్పిన మాటలు విని షాక్ అయ్యాం. రష్మి పైన ఎవరో రివర్స్ చేతబడి చేసారంట. తను చనిపొదు కానీ బతుకంతా కాలం ఇలా సృహ లేకుండా.. "అని ఏడుస్తూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. 



రాధకి అసలు ఎలా రియాక్ట్ అవ్వాలో కూడా అర్ధం కావట్లేదు, ఎందుకంటే 2 వారల క్రితమే అమావాస్య వచ్చింది, వంశీ, సాహిల్ చచ్చిపోయారు కాబట్టి. రివర్స్ చేతబడి, అంటే రష్మి, వంశీ, సాహిల్ కలిసి తన పైన చేతబడి చేసారా? కానీ ఎందుకు? రష్మి తన బెస్ట్ ఫ్రెండ్ కదా తను ఎందుకు ఎలా చేసింది? నేను వాళ్ళకి ఏం ద్రోహం చేశాను? ఇలాంటి ప్రశ్నలు రాధ మనసులో ఉన్నా సమాధానం చెప్పే పరిస్థితిలో ఎవరూ లేరు. 

=======================================================================

సమాప్తం

=======================================================================


శిల్పా నాయక్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

 విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

 

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

నా పేరు శిల్ప. నేను రచయిత్రిని అని చెప్పలేను. కానీ అప్పుడప్పుడు ఫాంటసీ, భయం కల్పించే కథలు రాస్తుంటాను. కథలు రాయడం ఇప్పుడే నేర్చుకుంటున్నా.



28 views0 comments
bottom of page