top of page

మా తిరపతి పయానం


'Ma Tirapati payaanam' New Telugu Story Written By Varanasi Bhanumurthy Rao

'మా తిరపతి పయానం' తెలుగు కథ

రచన: వారణాసి భానుమూర్తి రావు

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)


మా నాయనకు తిరపతి బోవల్లని బలే ఆశగా ఉండేది. పుట్టినెంట్రుకులు పుట్టిన బిడ్డలకు తీసుకొనే పొయ్యేదానికి తిరపతికి పోయి గుండు కొట్టించే అలవాటు మా ఇంట్లో వుండేది. ‌ పుట్టినెంట్రుకలు తీయించే దానికి కొందరు గుర్రం కొండ కాడుండే రెడ్డమ్మ కొండకు, కొందరు చౌడేపల్లి కాడుండే చౌడమ్మ గుడికి పోతారు. మా నాయన అప్పో సప్పో చేసి తిరపతికి పోతా వుండె. తిరపతికి పోవల్లంటే కర్చు చ్యానా అవుతుంది. మా కుటుంబం పోవల్లంటే నూరు రూపాయలయినా గావల్ల. అంత దుడ్డు మా కాడ ఉండేది గాదు.


మా నాయన నాకు ఆరేడేళ్ళు వచ్చినా పుట్టినెంటుకలు తీయించలా నాకు.


"పాపం‌ మగ పిల్లోడు.. యాందీ దరిద్రము? ఆడ పిల్ల మాదిరి జుట్టు పెంచుకొని జడ ఏస్తావుంటే నాకు ఏడుపు వస్తా వుండాది. నాకు కోపమొస్తే మంగలోళ్ళ రామన్న పిలిపించి ఇంట్లోనే గుండు కొట్టిస్తా!" అని గట్టిగా మా నాయన్ను తిడ్తా వుండేది మా యమ్మ.


మా నాయన నన్ను తీసుకొని ముద్దు చేసే వాడు. “సూడు నా కొడుకు! ఎంత అందంగా ఉండాడో! జుట్టు పెద్దదయినా గిరజాలు వేసుకొని, రిబ్బన్లు ఏసుకొని, చిన్ని కిట్టయ్య మాదిరి వుండాడు." అని నన్ను దగ్గరకు తీసుకొని ముద్దులు కురిపించే వాడు మా నాయన.


"నాయనా! నాకు మగ పిల్లోళ్ళ మాదిరి క్రాపు చేయించు. నన్ను చూసి నా స్నేహితులంతా గేలి చేస్తా వుండారు. ఆడోడా.. అడోడా అని పిలుస్తా నవ్వతా వుండారు. నాకు బిరీన గుండు కొట్టిస్తావా ? లేదా?" అని నేను చానా కోపంగా అడిగినా.


"తిరపతికి పోదాము నాయనా! ఈ సారి కూరగాయలు ఏసినాము గదా మన మడ్లో! వారం వారం అమ్మతా వుణ్డాము గదా మాలు సంతలో.. కలకడ సంతలో గూడా అమ్మతా వుండాము. ‌ఈ సారి మన ఆవులు ఈని నాయి గదా? పాలు గూడా బాగా యిస్తా వుండాయి. కవ్వం పెట్టి అమ్మ సిలికితే మస్తుగా వెన్న పడతా వుండాది. ఆ ఎన్న వుట్టి మీద ముంతలో పెట్టి వారానికి ఒక సారి మరగ పెడితే నెయ్యి వస్తా వుండాది. నెయ్యి గూడా సొలిగె పావలా లెక్కన అమ్మతా వుండాము. రూపాయికి నాలుగు సొలిగెల నెయ్యి. నూరు రూపాయలు సేతిలో పడితే తిరపతికి అందరమూ పోతాము నాయనా!" అని మా నాయన కథంతా సెప్పె.


బియ్యం గూడా శేరు రూపాయి అని మా నాయన చెప్పినాడు. అందుకే మేము నూకలు కొనుక్కొని రాగి సంగటి చేసుకొని తింటాము. బియ్యం ధర ఎక్కువంట.


నాకు ఏ ఇసయ మైనా మా నాయన పూస గుచ్చి నట్లు చెప్తాడు. ‌ అందుకే నాకు అన్ని ఇసయాలు మా అన్న, అక్క కంటే నాకే బాగా తెలుసు. ‌ చానా విసయాలు నేను మా నాయన దగ్గరే నేర్చు కొన్నా! ఎందుకంటే నేను సిన్న కొడుకును గదా! అందుకే మా నాయనకు నేనంటే స్యానా ఇష్టం.


రెండు, మూడు నెలల తరువాత మా నాయన నూరు రూపాయలు సంపాయించి నాడు.


ఒక మంచి రోజు సూసు కొని పొద్దున్నే ఆరు గంటలకు స్నానాలు చేసి, మంచి బట్టలు ఏసు కొని, నేను మా నాయన, మా అమ్మా, మా యన్న, మా యక్క ఇంటిలో ఎంకటేస్వర సామి పటానికి టెంకాయ కొట్టి అందరమూ తిమ్మాపురం క్రాసు కాడికి నడుసుకొంటా పోతిమి.


అమ్మ సిత్రాన్నము, గడ్డ పెరుగన్నము టిఫిన్ గిన్నెల్లో కట్టుకొని గుడ్డ మూత కట్టి బిగించె. ‌ ఇంకా మా యమ్మ మేము తినేదానికి అప్పచ్చులు, కారాలు, చుట్టలు, పప్పు బిళ్ళలు, కారం బెట్టి వేయించిన అనప కాయ గింజలు, వేయించిన చెనిక్కాయ గింజలు, పాగం పప్పు వుంటలు, జొన్న బొరుగుల బెల్లం కలిపిన వుంటలు అన్నీ ఎత్తుకొని తిత్తిలో పెట్టుకొని ఇల్లు బీగాలు వేసుకొని నడిస్తిమి. ‌


ఈ రెండు రోజులూ గొడ్డూ గోదా తిండి కోసం మా ఇంటి పక్కనున్న మా మామోళ్ళకు జాగరత్త గా చూసుకోమని చెప్పితిమి. మాకు కోడి పెట్టలు, పుంజులు నాలు గైదు వుండాయి. వాటి కోడి పిల్లలు పదో ఇరవై వుండాయి. ‌రాత్రి అయిందంటే ఆటిని పెద్ద గంపల కింద చేర్చల్ల. ఆ పని మా అత్తోళ్ళకు చెప్పి నాము. నాలుగైదు మేకలుండాయి‌. ఆటిని మేతకు తీసుకొని పోవల్ల అని మా మామా వాళ్ళకు చెప్పితిమి.


మా ఇంటిలో కాపలాగా అంజి అనే కుక్క వుండాది. ‌

మేము పోతా వుంటే అది ఏడుపు మొగం ఏసుకొని చూస్తావుండాది. దానికి తిండీ గూడా మా రవణమ్మ అత్తకు చెప్పినాము.


అంతే కాదు మా ఇంటిలో రాజా, రాణి అనే రెండు పిల్లులు ఉండాయి. అయి మా అమ్మకు, నాకు అంటే స్యానా ఇష్టం. ఆటికి పాలు నేనే తాపిస్తా ప్రతి రోజూ.


అయి మా కొట్టంలో, చుట్టింట్లో, పసుల పాకలో తిరిగే ఎలకల్ని పట్టుకొని బాగా తినేస్తాయి.


"అమ్మా.. రాజా, రాణికి పాలు ఎట్లా?" అని ఏడుపు మొహం వేసుకొని అడిగినాను నేను.


"రెండురోజులే గదా నాయనా! ఎలకల్ని తిని వుంటాయిలే!" అనింది మా యమ్మ.


కానీ నాకు ఏ మూలనో పిల్లుల్ని‌ చూస్తా వుంటే బాధగా ఉండాది.


అవి‌ మ్యావ్ మ్యావ్ అని నా వొడిలో కూర్చొని ఆడుకొంటా వుంటాయి.


యాడికైనా పోవాలంటే పెద్ద పీకు లాట. ‌ అన్నీ సూసుకొని బోవల్ల. అందుకే ఇంట్లో ఎవ్వరో ఒక్కరుండల్ల‌.


తిమ్మాపురం‌ క్రాసు కాడికి వస్తానే పీలేరుకు పొయ్యే ఎర్ర బస్సు నిలబడింది.


సంతోషంగా అందరమూ బస్సెక్కినాము.

నేను బస్సు ఎక్కి ఆరేడు నెలలు అవుతావుంది. ‌అప్పుడెప్పుడో కలకడ శివరాత్రి తిరనాలకు కలకడ వరకూ బస్సెక్కి నాము అందరమూ.


నేనూ, అక్కా, అన్నా ముగ్గురు కూర్చొనే సీట్లో కూర్చొన్నాము‌. అక్క, నేనూ కొట్లాడు కొన్యాము. కిటికీ పక్కన ఎవరు కూర్చో వల్ల అని కొట్లాట. నేను గట్టిగా ఏడిస్తే నన్ను కిటికీ పక్క కూర్చో బెట్టిరి. ‌ అక్కేమో ఏడుస్తా అమ్మ పక్కన వుండే కిటికీ పక్కన కూర్చొండె.


కిటికీ పక్కన కూర్చొంటే గాలి చల్లగా ముక్కులకు, చెవులకు కొడుతోంది. ‌ రోడ్డు పక్కన వుండే పల్లెల్ని, మనుషుల్ని, గుట్టల్ని చూస్తా వుంటే కుశాలుగా ఉండాది‌. మా యన్న నా మీద పడి పడి బయటకు తొంగి చూస్తా వుండాడు.


బస్సు పీలేరు బస్టాండు చేరింది. ‌ అక్కడ నుండి పీలేరు రైల్వే స్టేషన్ కెడితే తిరపతికి వెళ్ళే రైలు వచ్చింది. ‌


మేమంతా రైలు బండి ఎక్కినాము. ఆ రైలు బండి పాకాల మీదుగా తిరపతికి పోతుంది. మా కందరికీ ఆ బొగ్గుల రైలు చూస్తా వుంటే ఎంతో సంతోషము వేసింది. ‌ బస్సు కంటే రైలులో హాయిగా వుంది మా పయానం‌.

అప్పుడు ఒక తమాషా జరిగింది.


మేమంతా పాకాల బొగ్గు ఇంజన్ రైల్లో పోతావుంటే నేను ఇంకో బోగీ లోకి మా అమ్మా నాయనకు తెలీకుండా, సెప్పకుండా ఎల్లి పోతి. మా యమ్మ ఒకటే ఏడుపు. మా నాయన కాళ్ళూ, సేతులూ వణకతా వుంటే నేనుండే బోగీకొచ్చి రెండు దెబ్బలు పీకి, బిగీన రెట్ట పట్టుకొని లాక్కోని పాయె! నేను ఏడస్తావుంటే, మా యమ్మ అక్కడ అత్తిరాసాలు అమ్మే ఒకాయప్పకు అణా ఇచ్చి అత్తిరాసాలు రెండు కొన్నిచ్చె. నేను ఏడుపు మానేస్తి.


మా యమ్మ నన్ను గట్టిగా పట్టుకొని తిరపతి దాకా వదలనే వదల్లా!


అప్పుడప్పుడూ మేము తెచ్చు కొన్న అప్పచ్చులు తింటా వుంటిమి. మద్యాహ్నము మా యమ్మ తెచ్చు కొన్న సిత్రాన్నము, పెరుగన్నము చిన్న ప్లేట్లల్లో పెట్టి ఇచ్చె. అందరమూ బాగా తిన్యాము. ‌ మా నాయన రైలు ఆగి నప్పుడల్లా టేషన్ లో వుండే కుళాయల దగ్గర నీళ్ళు మర చెంబుల్తో పట్టుకోనిచ్చి మాకు తాపిస్తా వుండె‌.


సాయంకాలం ఆరు గంటలకు రైలు తిరపతికి చేరె.

మా నాయన స్యానా సార్లు తిరపతికి వచ్చినాడు గాబట్టి ఆయప్పకు అన్నీ తెలుసు. ‌


ఆ రాత్రికి తిరపతిలో ఉండల్నా, కొండకు పోవల్నా అని మాట్లాడు కొంటిమి అందరమూ.


కొండకే పోదామని అమ్మ చెప్పె. బస్టాండుకు పోయి కొండకు పొయ్యే బస్సు ఎక్కినాము. బస్సులు వస్తా వుణ్డాయి. పోతా వుండాయి.


దూరంగా కొండ మీద వుండే గోపురం వరకూ లైట్లు కనబడతా వుండాయు. కొండ మీద శంఖు చక్రాలు లైట్ల వెలుతురులో కనబడతా వుండాయి.


బస్సు కొండకు కదిలింది. బస్సులో జనాలు ఒక్క సారిగా" గోవిందా! గోవిందా!" అని గట్టిగా అరచి నారు. మేము గూడా" గోవిందా" అని గట్టిగా అరిస్తిమి.


రాత్రి ఎనిమిది గంటలకు బస్సు కొండ చేరింది.

మా నాయన మమ్మల్ని అందర్నీ గట్టిగా పట్టుకొని ఒక ధర్మ సత్రానికి పిలుచు కొని పాయె. ‌


ఆ రాత్రి అక్కడే పడుకొని, పొద్దున్నే కల్యాణ కట్ట కు పోవల్ల అని మా నాయన చెప్పె.


"కల్యాణ కట్టలో దేవుడు వుంటాడా నాయనా?" అని నేను అడిగినాను.


ఆ మాటలకు మా నాయన పగల బడి నవ్వె.

" కల్యాణ కట్టలో నీకు బోడి గుండు చేస్తారు."అని అన్యాడు మా నాయన.


ఆ రాత్రి మా యమ్మ తెచ్చు కొన్న అన్నం మూట విప్పె. అదే ఆ రోజు అందరమూ తిని అక్కడ్నే బొంతలు కింద పరచు కొని పడుకొంటిమి.


మా యమ్మ తెచ్చిన గిన్నెలు అన్నీ శుభ్రంగా కడుక్కొని మా పక్కన్నే పడుకొన్యాది.


కొండ మీద బాగా చలి పెడతా వుంది. ‌ మా యమ్మ తెచ్చు కొన్న దుప్పట్లు మాకు కప్పింది.


ఆ రాత్రి ఎప్పుడు నిద్ర పొయినామో మాకే తెలీదు.

**************************************


పొద్దున్నే తెల్ల వార తానే లేచి కల్యాణ కట్ట కాడికి పోయినాము అందరమూ.


అక్కడ గుండు కొట్టే వాళ్ళ దగ్గర నన్ను కూర్చో బెడతానే ఆయప్ప కొన్ని వేడ్నీళ్ళు నెత్తిన చల్లి జుట్టు నంతా నీటితో తడిపె. నాకు బయ మేసి ఏడిస్తిని. మా యమ్మ, మా నాయన పక్కన కూర్చొని ధైర్యం చెప్పిరి.


" ఈ యప్ప నాకు గుండు కొట్టిస్తే నాకు ఎంటికలు మళ్ళా రావు గదా?" అని గట్టిగా ఏడుస్తా అన్యాను.


నా మాటలకు గుండు కొట్టే ఆయప్ప, మా యమ్మా, మా నాయనా పగల బడి నవ్విరి.


" రెండు నెలల్లో ఇంకా బాగా వొత్తుగా, నల్లగా వస్తాయి. అప్పుడు నువ్వు నీ స్నేహితుల మాదిరి క్రాపు వుంటుంది. యాల ఏడ్చేది?" అని మా అమ్మ నవ్వతా అనె.


" పుట్టిన ఎంటుకులు తీస్తా వుండారు గదా ? కత్తి పెట్టే ముందు కానుకలు పెట్టండి" అనె ఆ గుండు గొరిగే ఆయప్ప.


మా నాయన జోబీలో వుండే అర్థ రూపాయి బిళ్ళ ఆయప్పకు ఇచ్చె.


" గోవిందా!" అని ఆయప్ప నా నెత్తి మీద కత్తి పెట్టి బర బర మని గొరిగె.



గుండు చేసిన తరువాత నాకు చ్యానా హాయిగా ఉండినాది.


నాకు బోడి గుండు చేసిన తర్వాత నాకు మా వాళ్ళను చూసి స్యానా ఇస్మయం కలిగింది.


వరసగా మా అమ్మ గూడా గుండు చేసుకొనె. మా నాయన, మా అక్క, మా అన్న అందరూ గుండు చేసు కొనిరి. మేము ఐదు మంది బోడి గుండ్లతో కోనేటికి పోయి అక్కడ స్నానాలు చేస్తిమి.


అక్కడొకాయన మా బోడి గుండ్లకు గంధం బాగా పూసినాడు. కత్తి వాటు మంట ఒక్క సారిగా తగ్గి పాయె. మా గుండులు చల్లగా అనిపించె.

ఆయప్పే మాకు అందరికీ గోవింద నామాలు పెట్టినాడు.


ఆయప్పకు మా నాయన ఒక అర్థ రూపాయి బిళ్ళ చేతిలో పెట్టె.


మేమందరమూ ఆ తరువాత సర్వ దర్శనం లైనులో నిలబడితిమి. అందరూ గుండ్లు చేసుకొని గోవిందా, గోవిందా అని గట్టిగా రెండు చేతులూ ఎత్తి అరుస్త వుండారు.


మా నాయన నా కాళ్ళు నొప్పి వస్తా వుండాయంటే నన్ను భుజాల మీద ఎక్కించు కొన్నాడు. నేను మా నాయన గుండు పట్టుకొని ఎత్తులో‌ కూర్చొన్నా!


నాలుగైదు గంటలో దేవుని దర్శనం అయింది.


ఎంకటేస్వర సామి ఆ దీపాల కాంతిలో వెలిగి పోతున్నాడు. ఆ విగ్రహం చూసి మాకు

భక్తి భావం ఎక్కువయి, అందరమూ గట్టిగా" ఏడు కొండల వాడా! గోవిందా!" అని అన బడితిమి.


మా అమ్మ ఏడుస్తా వుండాది.


" సామీ! నీ దర్శనం అయింది. మమ్నల్ని, మా బిడ్డల్ని, మా గొడ్డూ గోదల్ని, మా వూరిని సల్లగా చూడు నాయనా! గోవిందా! ఏడు కొండల వాడా! ఆపద మొక్కుల వాడా!" అని గట్టిగా అరచె.


మా అమ్మతో పాటి మేము గూడా గట్టిగా అరిస్తిమి.


దర్శనం అయిన తరువాత మా అమ్మ మొక్కులు చెల్లించల్ల అని హుండీలో దాచుకొన్న దుడ్లు కొన్ని ఏసె.


ప్రసాదం తీసుకొని గుడి బయటకు అందరూ వస్తిమి.


మాకు ఈ తిరపతి యాత్ర జీవితాంతం గుర్తుండి పోయింది.


ఎంతయినా మా సిత్తూరోళ్ళకు ఈ ఎంకన్నే దిక్కు గదా?


******************************************

వారణాసి భానుమూర్తి రావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

Podcast Link:


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

వారణాసి భానుమూర్తి రావు గారు ఆంధ్రప్రదేశ్, చిత్తూరు జిల్లాలోని మహల్ రాజుపల్లె లో జన్మించాడు. అతను వృత్తిరీత్యా కార్పొరేట్ కంపెనీలల్లో ముఖ్య ఆర్థిక కార్య నిర్వహణాధికారిగా పనిచేసాడు. ప్రవృత్తి రీత్యా కథలు , వచన కవితలు రాస్తున్నాడు. ఇప్పటికి అతను 60 కథానికలు, 600 దాకా వచన కవితలు రాశాడు. అతని కథలు ఆంధ్ర జ్యోతి , విజేత , ఆంధ్ర ప్రభ మొదలైన పత్రికలలో ప్రచురింపబడ్డాయి. మొదటి కథ ఆంధ్ర ప్రభ సచిత్ర వార పత్రిక లో 1981 లో 'జీవన గతులు ' అనే కథ అచ్చయ్యింది. తరువాత ' ఈ దేశం ఏమై పోతోంది? ' అనే అదివారం ఆంధ్రప్రభ దిన పత్రిక లో అచ్చయ్యింది. ఆంధ్ర జ్యోతిలో పది కథలు దాకా అచ్చయ్యాయి. నల్లటి నిజం , జన్మ భూమి , అంతర్యుద్ధం , వాన దేముడా! లాంటి కథలు అచ్చు అయ్యాయి. 2000లో "*సాగర మథనం* ", 2005 లో " *సముద్ర ఘోష*" అనే కవిత సంపుటిలను ప్రచురించాడు. అందులో "సముద్ర ఘోష" పుస్తకాన్ని అక్కినేని నాగేశ్వర రావు గారికి అంకితం చేశారు. ఈ పుస్తకాన్ని జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి. నారాయణ రెడ్డి విడుదల చేసారు. అతను రాసిన కథ "పెద్ద కొడుకు" ( రాయల సీమ రైతు బిడ్డ మీద కథాంశం) భావగీతి ప్రతిలిపి 2014 కథల పోటీలో ప్రతిలిపి ద్వారా ప్రత్యేక బహుమతి పొందింది.ఈ కథను 60000 మంది పాఠకులు చదివారు. 4500 మంది స్పందించారు.

వారణాసి భానుమూర్తి రావు రాయలసీమ వ్యవహారిక బాషలో వ్రాయడానికి ఇష్టపడతారు.ఇప్పుడు " రాచపల్లి కథలు " , " నాన్నకు జాబు " అని తమ చిన్ననాటి అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో నిక్షిప్తం చేస్తున్నారు.‌ .అలాగే తన మొట్టమొదటి నవలా ప్రక్రియను " సంస్కార సమేత రెడ్డి నాయుడు " తెలుగు వారి కోసం వ్రాశారు .ఆ తరువాత '' వరూధిని - ప్రవరాఖ్య '' శృంగార ప్రబంధ కావ్యాన్ని తమ దైన శైలిలో నవలీ కరణ చేశారు . కరోనా పై వీరు రాసిన కవిత ఆంధ్ర ప్రభలో ప్రచురించారు. సాహిత్య రంగంలో విశేషమైన ప్రతిభ ను కనబరచిన వీరికి సాహితీ భూషణ , ప్రతిలిపి కవితా ప్రపూర్ణ ,సహస్ర కవి రత్న అనే బిరుదులు లభించాయి.

వారణాసి భానుమూర్తి రావు గారు ఇటీవల అనగా ఏప్రిల్‌ నెల 2022 లో రెండు పుస్తకాలు పాఠక లోకానికి అందించారు. 1. *మట్టి వేదం* కవితా సంపుటి 2. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* తెలుగు నవల . గిడుగు రామమూర్తి పంతులు ఫౌండేషన్ వారిచే సాహిత్య రంగంలో విశేష మైన సేవలు చేసినందుకు గానూ , వీరి *మట్టి వేదం* కవితా సంపుటికి , *గిడుగు రామమూర్తి సాహిత్య పురస్కారం -2022* ని అందు కొన్నారు.

తెలుగు కవులు లో వారణాసి వారి కథలు రాయల సీమ గ్రామీణ ప్రాంతాల నేపథ్యంలో కలిగి వుంటాయి.చిత్తూరు జిల్లాకు చెందిన వారణాసి భానుమూర్తి గారి కథలు , కవితలు వివిధ ఆన్ లైన్‌ పత్రికలలో వచ్చాయి. త్వరలో మరి కొన్ని నవలలు , కథల సంపుటాలు , కవితా సంకలనాలు వెలువడుతున్నాయి.ఇంతవరకు మూడు కవితా సంపుటిలు , ఒక నవలను పాఠక లోకానికి అందించారు.

*వీరి ముద్రిత రచనలు* ------------------

1. *సాగర మథనం* : 2000 సంవత్సరంలో అవిష్కరించారు. డాక్టర్ గోపీ గారు , తెలుగు అకాడమీ ప్రధాన సంచాలకులు , ఈ కవితా సంపుటి మీద ముందు మాట వ్రాశారు.

2. *సముద్ర ఘోష*: 90 కవితలున్న ఈ కవితా సంపుటి 2005 సంవత్సరంలో జ్డానపీఠ్ అవార్డు గ్రహీత , డాక్టర్ సి.నారాయణ రెడ్డి గారు ( సినారె) అవిష్కరించారు. ఈ పుస్తకాన్ని , పద్మ విభూషణ్ డాక్టర్ నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు గారికి అంకిత మిచ్చారు .

3. *మట్టి వేదం* : 70 కవితలున్న ఈ కవితా సంకలనాన్ని 2022 ఏప్రిల్‌ నెల 17 వ తేదీ వెలువరించారు.‌ ఈ పుస్తకానికి కే రే జగదీష్ గారు , ప్రముఖ కవి , జర్నలిస్టు ముందు మాట వ్రాశారు

4. *సంస్కార సమేత రెడ్డి నాయుడు* : ఇది రచయిత గారి తొలి నవలా ప్రక్రియ. ఈ నవల 17 ఏప్రిల్ 2022 నాడు అవిష్కరణ జరిగింది. ఈ నవల రాయల సీమ కక్షలు , ఫాక్షన్ ల మధ్య ఎలా రెండు కుటుంబాలు , రెండు గ్రామాలు నలిగి పొయ్యాయో తెలిపిన కథ. శ్రీమతి రాధికా ప్రసాద్ గారు ఈ నవలకు ముందు మాట వ్రాశారు. ఈ నవలకు ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 అందు కొన్నారు.

5. *పెద్ద కొడుకు* : 19 కథల సంపుటి. వారణాసి భానుమూర్తి రావు గారు వ్రాసిన కథల సంపుటి *పెద్ద కొడుకు* తుమ్మల పల్లి కళా క్షేత్రం , విజయ వాడ లో మల్లె తీగ వారు నిర్వహించిన జాతీయ సాంస్కృతిక ఉత్సవాల సందర్భంగా శ్రీమతి లక్ష్మీ పార్వతి గారు , ఆంధ్రప్రదేశ్ తెలుగు అకాడమీ చేర్ పర్సన్ , కళారత్న శ్రీ బిక్కి కృష్ణ , తదితరుల చేతుల మీదుగా 20.11.2022 తేదీన అవిష్కరించారు. ఇందులో 19 కథలు ఉన్నాయి. ప్రతి కథ ఆణి ముత్యమే. కళా రత్న శ్రీ బిక్కి కృష్ణ గారు ముందు మాట వ్రాసిన ఈ పెద్ద కొడుకు కథల సంపుటి మానవీయ విలువల్ని అనేక కోణాల్లో రచయిత స్పృశించారు. వారణాసి గారు ఈ " పెద్ద కొడుకు " కథల సంపుటిని పాఠక లోకానికి అందించారు. ఇందులోని కథలన్నీ ఆణి ముత్యాలే! సమాజానికి సందేశ మిచ్చే కథలే!

*అముద్రిత రచనలు*

1 . *వరూధిని ప్రవరాఖ్య* : అల్లసాని పెద్దన గారి మను చరిత్రము నవలీ కరణ చేశారు‌. ఇది ఇంకా అముద్రితము.త్వరలో ప్రచురణకు వస్తుంది.

2 .*రాచ పల్లి కథలు* : తన చిన్న నాటి అనుభూతుల్ని , గ్రామీణ ప్రాంతాల్లో తను గడిపిన అనుభవాల్ని క్రోడీకరించి వ్రాసిన కథానికలు . త్వరలో ప్రచురణకు వస్తుంది.

3 . *నాలుగవ కవితా సంపుటి* త్వరలో వస్తుంది.

4 . *నాయనకు జాబు* అనే ధారావాహిక ఇప్పుడు వ్రాస్తున్నారు. లేఖా సాహిత్యం ద్వారా కథను వాస్తవిక సంఘటనలతో చెప్పడం ఈ జాబుల ప్రత్యేకత.

*విద్యాభ్యాసం* -----------

వారణాసి భానుమూర్తి గారి విద్యాభ్యాసం అంతా చిత్తూరు జిల్లాలో జరిగినది.

ఐదవ తరగతి వరకూ ప్రాధమిక పాఠశాల మహల్ లో , తరువాత ఆరవ తరగతి నుండి ఎనిమిదవ తరగతి వరకూ మహల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో జరిగింది. ఆ తరువాత తొమ్మిది , పది తరగతులు మేడికుర్తి కలికిరి చిత్తూరు జిల్లా జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల లో చదివారు.‌ ఇంటర్మీడియట్ మరియు బి కాం బీ.టీ కాలేజీలో చదివారు.‌ తరువాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సు ఎస్ వీ యూనివర్సిటీ లో చదివారు.‌ వుద్యోగ నిమిత్తం హైదరాబాదు వెళ్ళిన తరువాత అక్కడ కాస్ట్ అండ్ మేనేజ్ మెంట్ అక్కౌంటన్సీ ( FCMA) చేశారు.‌ ప్రొఫెషనల్ అక్కౌంట్స్ లో నిష్ణాతులయ్యారు.

*వృత్తి* ------

వారణాసి భానుమూర్తి గారు అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ జనరల్ మేనేజర్ గా వివిధ కార్పోరేట్ కంపెనీలల్లో పని చేశారు. హైదరాబాదు మహా నగర మంచి నీటి సరఫరా మరియు మురుగు నీటి సంస్థలో చీఫ్ జనరల్ మేనేజర్ (అక్కౌంట్స్) గా పని చేశారు.ఒక పేరు పొందిన నిర్మాణ సంస్థలో సీనియర్ జనరల్ మేనేజర్ (అక్కొంట్స్ మరియు ఫైనాన్స్ ) గా పని చేసి వివిధ బాధ్యతలను 36 సంవత్సరాల పాటు నిర్వర్తించారు. కాస్ట్ అక్కౌంట్స్ హైదరాబాదు చాప్టర్ కి వైస్ చేర్మన్ హోదాలో బాధ్యతలను నిర్వర్తించారు.

వృత్తి ఏమైనప్పటికీ , ప్రవృత్తిగా కవిగా , రచయితగా రాణించారు. పదవ తరగతి నుండీ కవితలు , కథానికలు వ్రాశారు.ఇతని కథలు , కవితలు వివిధ పత్రికల్లో ప్రచురితమయ్యాయి. ‌

ఇతనికి ఇంత వరకు లభించిన బిరుదులు; 1. ప్రతిలిపి కవితా ప్రపూర్ణ 2. సహస్ర కవి రత్న 3. సాహితీ భూషణ 4. గిడుగు రామమూర్తి వారి సాహిత్య పురస్కారం 2022 లో. 5. ప్రతిలిపి సాహిత్య అవార్డు - 2021 6. కళావేదిక వారి సాహితీ పురస్కారం 31.12.2022 న అందుకొన్నారు.



377 views1 comment
bottom of page