A . Annapurna
writer
Profile
About
నాగురించి పరిచయం.
నాది కాకినాడ. బులుసు వెంకటేశ్వర్లుగారి అమ్మాయిని. వారు వృత్తి రీత్యా పిఠాపురం రాజావారి కళాశాలలో ఇంగ్లీష్ లెక్చరర్. కానీ తెలుగులో శతాధిక గ్రంధకర్త. ''వారురాసిన మహర్హుల చరిత్ర'' టీటీడీ దేవస్థానం ప్రచురణ హక్కు తీసుకుంది. నాన్నగారి స్వంత లైబ్రెరీ నాలుగు బీరువాలు ఆయనకు ఆస్తి. దానిమీద నాకు ఆసక్తి పెరిగి ఒకొక్కటే చదవడం మొదలుపెట్టేను. అందులో నాకు బాగా నచ్చినవి విశ్వనాథవారి ''ఏకవీర '', శరత్ బాబు, ప్రేమ్ చంద్, తిలక్, భారతీ మాసపత్రిక. నాన్నగారు రాసిన వ్యాసాలూ ప్రింట్ అయినా తెలుగు -ఇంగిలీషు వార్తా పత్రికలూ. ఇంటి ఎదురుగా వున్నా ;;ఈశ్వర పుస్తక బాండాగారం లైబ్రెరీ'' కి వచ్చే పిల్లల పత్రికలూ, వారం మాస పత్రికలూ వదలకుండా చదవడం అలవాటు అయింది. పెళ్లి అయ్యాక కూడా అందుకు ఎలాంటి ఇబ్బంది రాలేదు.
చదివిన తర్వాత నా అభిప్రాయం ఉత్తరాలు రాసేదాన్ని. కుటుంబ బాధ్యతలు తీరి ఖాళీ లభించిన తర్వాత రచనలు చేయాలని ఆలోచన వచ్చింది. రచన, చతుర-విపుల తో మొదలై అన్ని పత్రికలూ ప్రోత్సాహం ఇచ్చారు. హైదరాబాద్ వచ్చాక జయప్రకాష్ నారాయణ్ గారి ఉద్యమసంస్థ లో చేరాను. వారి మాసపత్రికలో వ్యాసాలూ రాసాను.. అలా కొనసాగుతూ పిల్లలు అమెరికాలో స్థిరపడితే
వెళ్ళివస్తూ వున్నప్పుడు కొత్త సబ్జెక్ట్ లభించేది. అక్కడి వెబ్ పత్రికలూ సిరిమల్లె, కౌముది, సాక్రిమెంటో తెలుగు-వెలుగు పత్రికల్లోనూ నా కథలు, కవితలు వచ్చాయి. ఇప్పటికి రాస్తూనేవున్నాను. చదువుతూ కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉండాలి అనే ఆసక్తి వుంది. అవి అన్ని సబ్జెక్ట్లలో కూడా. ఈ వ్యాపకాలు జీవితకాలం తోడు ఉంటాయి. ఈ సంతృప్తి చాలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి,
ఉత్తమ అభ్యుదయ రచయిత్రి బిరుదు పొందారు.
(writing for development, progress, uplift)
