top of page

అజాని


'Ajani' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'అజాని' తెలుగు కథ

రచన: సుదర్శన రావు పోచంపల్లి


బాలశౌరి మంచి ఆస్తి పరుడు మాటకారి -స్నేహశీలి..


భార్య వకుళ - భర్తంటే ఎనలేని గౌరవము- ఇద్దరాడపిల్లలు మల్లిక - భార్గవి.


ఇద్దరు కొడుకులు రమేశ్- రాజేశ్.


బాలశౌరి కుటుంబము - తల్లిదండ్రులను చిన్నప్పుడే పోగొట్టుకున్న దురదృష్టవంతుడు బాలశౌరి .


ఊళ్ళో పొలాలు-పాతకాలపు బంగళా-పట్టణములో పెద్ద బంగళా -పనివారు మొదలగు హంగులతో బాలశౌరి వైభోగమే వైభోగము-


దైవాన్ని నమ్మినోడు బాలశౌరి నిత్య పూజలేకాక వారానికో వ్రతము అంటూ బంధువుల స్నేహితుల ఆహ్వానించుచు నిత్యకల్యాణము పచ్చ తోరణము అన్న చందాన నడుస్తుంటది వారింట-


కొడుకులతో సమానంగా బిడ్డలను కూడ బాగా చదివించాడు బాలశౌరి .మంచి సంస్కారమలవడేలా పెంచాడు పిల్లలను.

పట్టణ వాసమైనా తరచు తమ ఊరికి పోయి వస్తుంటారు కుటుంబమంతా-


బాలశౌరి ఆదాయము మొత్తము వ్యవసాయము మీదనే - పంటలు బాగా పండే పొలాలు- దానికి తోడు జీతగాండ్లకు వారు మెచ్చేలా జీతాలు ఇస్తూ అప్పుడప్పుడు వాళ్ళ అవసరాలు కూడా తీరుస్తుంటాడు అదనంగా బాలశౌరి - ఇక జీతగాండ్లు కూడా ఒళ్ళు దాచుకోకుండా నిజాయితీగా పనులు చేస్తుంటారు -


ఇక చేతికి ఎముక లేదన్నట్టుగా పనిమనుషులకు కోరిన సహాయము చేస్తూ వారితో మర్యాదగా పనులు చేయించుకుంటది వకుళ.


రెండేళ్ళ లోపలనే ఇద్దరు బిడ్డలకు మల్లిక కు అహర్పతి తోనూ, భార్గవికి వైజయంత్ తోనూ పెండ్లి జరిపిస్తాడు బాలశౌరి బాగా చదువుకున్న స్థితిగల వారిని చూసి.


తరువాత కొడుకులకు మాత్రము బీదింటి చదువుకున్న అమ్మాయిలతో వివాహం జరిపిస్తాడు బాలశౌరి - రమేశ్కు లావణ్య తోనూ, రాజేశ్ కు రోహిణి తోనూ.- ఇక ఎప్పుడూ కొడుకులు,కోడళ్ళు,బిడ్డలూ అల్లుళ్ళతో ,ఇల్లంతా కళ కళే.

ఒకనాడు ఒక జీతగాడు తీవ్ర జ్వరముతో చనిపోతె వాళ్ళ కుటుంబాన్ని తాత్కాలికంగా ఆదుకున్నా రెండెకరాల పొలము కూడా దానము చేస్తాడు బాలశౌరి తన దా తృత్వాన్ని నిలబెట్టుకున్నవాడై.


ఇట్లా బాలశౌరి కుటుంబము సాగిపోతుంటె ఇక ఒక్కొక్కరుగా మనుమలు మనుమరాళ్ళు పుట్టుకొచ్చి ఇంటికి ఇంకింత శోభ సమకూర్చుతారు మల్లిక కొక కొడుకు. పేరు నవనీత్- అట్లనే భార్గవికి కూడా ఒక్కడే కొడుకు పేరు వినోద్ - ఇక కొడుకులకు రమేశ్ కు ఒక కూతురు పేరు హైందవి, రాజేశ్ కు ఒక కూతురు పేరు జ్యోత్స్న.


బాలశౌరికి , వకుళకి సంతోషానికి అవధులు లేకుండా మనుమలు మనుమరాడ్ర పెరుగుదల దిన దిన ప్రవర్ధమానమై వికసిత కుసుమాల పరిమళాలుగ ద్యోతకమైతది .వాళ్ళిల్లే ఒక ఆనంద నిలయంగా మారిపోతది.

హఠాత్ పరిణాము-- వాళ్ళింటి దీపము వకుళ స్నానము చేసి వచ్చి తడి చేతితో సెల్ ఫోన్ చార్జింగ్ కు పెట్టుచుండగా దురదృష్ట వశాత్తు కరెంట్ షాక్ కు గురియై ఆ క్షణమే ప్రాణాలు కోల్పోతుంది .

.

ఆనంద నిలయము ఒక్కసారే శోకసంద్రముగా మారిపోయి రోదనలు మిన్నంటుతాయి. పరిసరాల ప్రజలు కూడా వచ్చి వీళ్ళను ఊరడించె ప్రయత్నము చేస్తారు- అనుకోని సంఘటన వాళ్ళను కూడా దిగ్భ్రాంతికి గురిచేస్తుంది. బాలశౌరి ఉల్లికాడలా మారిపోతాడు-


‘ఆ మృత్యువు నన్నెందుకు ఆహ్వానించలేదు.. అమాయకురాలైన నా ఇంటి దేవత ఏమి పాపము చేసిందని? ఆ మారి నన్ను అజానిని చేసింది’ అని బోరున విలపిస్తూనే ఉంటాడు బాలశౌరి.

వకుళ తలిదండ్రులు తోబుట్టువులు అందరు వస్తారు, దుర్వార్త తెలియగానే ఆగమేఘాలమీద- వాండ్లు వీండ్లను కౌగలించుకొని విలపిస్తారు - పసిపిల్లలు మాత్రం ఏదీ తెలువని అమాయకత్వములో తల్లుల కన్నీళ్ళు తుడుస్తుంటే ఆ దృశ్యము చూడలేని వారు అక్కడినుండి బయటకు వెళ్ళి పోతారు ఏమిటీ ఈ ఘోరము అనుకుంటు.


ఎట్టకేలకు కొంత సద్దు మణిగిన తరువాత ఇక వకుళ అంతిమ యాత్రకు తీసుకొని పోయి ఆ కార్యక్రమాలు ముగింపజేస్తారు కొడుకుల రోదన నడుమ.


ఇంటినిండా జనము - వచ్చిన బంధువులు కూడా తిరిగి పోలేక పోలేక పోతారు- ఆడ పిల్లలు,కొడుకులు,కోడళ్ళతో సహా బాలశౌరి అత్తమామలు బావమరుదులు కూడా వీళ్ళ ఇంటిలోనే ఉండి పోతారు పండ్రెండు రోజుల కార్యక్రమమయ్యేవరకు-


ఎంత ఖర్చయినా పరువా లేదు అనుకుంటూ ఉత్తర క్రియలు ఎంతో ఘనంగా జరిపిస్తాడు బాలశౌరి - లెక్క లేనన్ని దాన ధర్మాలు చేస్తాడు- నా దేవత నా చెంత లేనప్పుడు ఈ ఆస్తి పాస్తులు నాకెందుకు అని ఏడుస్తూనే.

బాలశౌరి తన భార్య పుస్తెలు,బంగారము అన్ని సొమ్ములు మూటగట్టుకొని దేవాలయానికి పోతాడు-


అవన్నీ హుండీలో వేస్తూ ‘దేవుడా ఈ సొమ్ములన్ని తీసుకో. తృప్తి లేకపోతె నా భార్య పుస్తెలు కూడా నీ దేవి మెడలో వేసుకో. నన్ను అజానిని చేసినవు. నేను నాకు తెలిసి ఏపాపము చేయలేదుకదా’ అని విలపిస్తాడు బాలశౌరి.

కొన్ని రోజులుండి బిడ్డలు అల్లుళ్ళు వెళ్ళిపోతారు విచార వదనాలతో.

వాళ్ళు వెళ్ళి పోతుంటె మరియొక మారు బిగ్గరగా ఏడుస్తాడు బాలశౌరి - వాళ్ళకు కాళ్ళాడకున్న, తప్పని వ్యవహారము అనుకుంటూ కన్నీరు కారుస్తూనే పయనమౌతారు.

ఇక బాలశౌరి ఏకాకిగా తనగదికే పరిమితమై ఉంటుంటే కొడుకులు మాత్రము రా త్రిదనుక తండ్రి వద్దనే కూర్చుంటారు ఒకరు తప్పితె ఒకరు-


కోడళ్ళు మాత్రము కన్న తల్లిలా మామగారికి కావలసిన సపర్యలు చేసుకుంటు సకాలములో భోజనము పెడుతుంటారు-


తన భార్య చేసిన వంటకాల రుచి కానక లోలోనే కుళ్ళుతూ విధిలేక తింటుంటాడు కాని ఎట్టి పరిస్థితిలో కూడా కొడుకులు కోడళ్ళు మనసు నొచ్చుకోకూడదను తలంపుతో.


భార్య పోయినంక ఇక గుడులకు పోవడము మానుకుంటాడు బాలశౌరి వైరాగ్య చిత్తుడై.


‘కొడుకులు మంచి ఉద్యోగము చేస్తూ బాగానే సంపాదిస్తున్నారు కద.. నా దేవత లేనప్పుడు నేనొక్కడినే ఊరికి పోవడమెందు’కని విరక్తితో పోవడము మానుకుంటాడు బాలశౌరి .


ప్రమిదలో చమురు అయిపోతున్న దీపములా రోజు రోజుకు శరీర పటుత్వము క్షీణిస్తూ అనుకుంటాడు- అసలే నేను అజానిని. ఇంకా శరీరములో సత్తువ లేకుండా మొండి బ్రతుకు బ్రతుకుతూ పరాధీనమైతనో ఏమో అను తలంపుతో ఇంకా కృంగి పోతుంటాడు బాలశౌరి .


పైకి మాత్రము ఎట్టి పరిస్థితిలో నోరు జారకుండా జాగ్రత్త పడుచుంటాడు.


భార్య చిత్ర పటము ముందుంచుకొని కుములుతుంటాడు. నేను నా బాధలు- మనసులోని మాటలు శరీర యాతనలు ఎవరితో చెప్పుకోవాలి ఎందుకు నాకీ శాపము అని మథన పడుతుంటాడు బాలశౌరి .


రమేశ్-రాజేశ్ ఇద్దరన్నదమ్ములు ఒకనాడు తమ ఇంటి మీద అందరికీ కనపడేటట్లుగా "వకుళా నిలయము" అని వ్రాయిస్తారు. అది చూసి బాలశౌరి ఎంతో ముదమొందుతాడు.


హైందవి,జ్యోత్స్నల తో మాత్రము అప్పుడప్పుడూ అన్నీ మరచి ఆడుకుంటాడు బాలశౌరి - భార్య జ్ఞప్తికి రాగానే

చూడు వకుళా.. మన వంశాంకురాలు ఎట్ల ఆడుకుంటున్నరో, ఎంత ముద్దుగున్నరో.. వారి ముద్దు ముచ్చట చూసి అనుభవించే యోగము నీకు లేకపాయె ప్ల్చ్’ అనుకుంటూ కంట తడిపెటుకుంటాడు బాలశౌరి.

కోడళ్ళు చూసి “మామయ్యగారు.. పోయిన అత్తయ్యగారు తిరిగిరారు. మీరదేపనిగా పరితాపము చెందుట ఎందుకండీ.. మిమ్ముల చూసి మాకూ దుఃఖము కలుగుచున్నది. అట్ల ఊరికే బాధపడకండి” అని ఓదారుస్తుంటారు.

నేను నా భార్యను కోల్పోయి పరితపించుచు పాపం అమాయకులైన నా కోడళ్ళను ఆవేదనకు గురి చేయడము భావ్యమా అని తనకు తాను ప్రశ్నించుకొనుచు అంతర్మథనం చెందుతాడు బాలశౌరి.

తా జేసిన పాపము లేదు

నే జేసిన దోషము లేదు

నిత్య పూజలు వ్రతాలు

నియమ నిష్టలతొ పాటించి

సాకేత రామునుకు సాష్టాంగ

దండమిడుతుంటి మిరువురము


ఆ దైవ లీలనో తా జేసిన

పుణ్యమో నలుగురు సంతానము

అందించి ఆనందించె మిగుల

నయగార మొలికించు నా బిడ్డలుగ

రూపు రేఖలు మీవంటు

చూపు నాపై వుంచె నారాణి

ముప్పది ఏండ్లకే సెలవంటు

తప్పుకొనె నన్ను తిప్పల పాల్జేసి

గొప్ప గుణ శీలి

ఆహారమున అష్టమ రుచులు

అందించే నాకు ప్రతి దినము

తాను కష్ట పడుచు నాకిష్టమనుచు

పప్పైన చారైన కూరైన పరమాన్నమైన

చెప్పలేనంత రుచులతో నన్నొప్పించి

నే దిని బ్రేవన్న తనకరిగినట్టు

ఎన్నని తలువనా తలిరుబోణి

తనువొంచి పనిసేయు నాకై తపన జెంది

ఇక చూడ ఇక రాదు ఇక నేను

తన దారి వెదుక తరలువరకు--


అని వ్రాస్తూ కన్నీటితో కాగితాన్ని తడుపుతాడు బాలశౌరి

తండ్రి బాధను అర్థము చేసుకున్నకొడుకులు మల్లిక- భార్గవి ఇండ్లకు పోయి తండ్రి ఇప్పటంతలో కోలుకోలేని పరిస్థితి ఉన్నదని ఒక నెలరోజులకొరకైన వచ్చి పొమ్మని బ్రతిమాలుతారు-


మీరింతగా అడుగవలెనా మేమే రావాలనుకుంటున్నము రేపే పయనమైతము అని చెబుతారిద్దరు చెల్లెండ్రు- వారిద్దరు ప్రక్క ప్రక్కనే ఉంటారు.


మరునాడు ఇద్దరు బిడ్డలు,ఇద్దరల్లుళ్ళు పిల్లలతీసుకొని వస్తారు- వాళ్ళను చూడగానే అమ్మా అంటూ ఒక్కసారిగా ఏడుపు మొదలు పెడుతాడు బాలశౌరి– బిడ్డలిద్దరు తామేడుస్తూనే తండ్రిని ఓదార్చే ప్రయత్నము చేస్తూ తాతయ్య దగ్గరికి రండి అని కొడుకులను పిలుస్తారు - వాళ్ళు అయోమయంగా చూస్తూ వచ్చి తాత చేయి పట్టు కుంటారు.- బాలశౌరి కొంత ఊరడిల్లి మనుమలతో ముచ్చటించ ఆరంభిస్తాడు.


నెలరోజులు తండ్రితోనే ఉండి - “మేము ఇద్దరము ఒక్క చోటనే ఉన్నాము నాన్నా! మా ఇంటికి పోదాము పద” అని తండ్రిని వాళ్ళ వెంట తీసుక పోతారు మల్లిక -భార్గవి.


వాళ్ళు వెళ్ళి పోగానే ‘హమ్మయ్య! నాన్నకు కొద్దిరోజులైన ఉపశమనం కలుగుతది’ అనుకుంటారిద్దరన్నదమ్ములు.


సమాప్తం


సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.




50 views0 comments
bottom of page