top of page
Original.png

చర్విత చర్వణం

Updated: Aug 19, 2023


ree

'Charvitha Charanam' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally

'చర్విత చర్వణం' తెలుగు కథ

రచన : సుదర్శన రావు పోచంపల్లి


శ్రీ మహా విష్ణువు కాలమునుండి కూడా పరిపాలన, పదవులు, పదవుల కేటాయింపులు రాజ్యము, రాజధానులు- పురాణాలు చదివితే గోచరిస్తాయి. శ్రీ మహా విష్ణువు కాని పరమేశ్వరుడు కాని బ్రహ్మ దేవుడు కాని నేటి మన కాలపు పరిపాలనా విధానాన్నే పోలి అధికారాలు కలిగి ఉంటారు.


విష్ణువు వైకుంఠములో ఉంటు నేటి మన దేశ ప్రధానిగాను, శివుడు కైలాసములో ఉంటు రాష్ట్ర పతిగాను, ఇక బ్రహ్మ దేవుడు సత్య లోకములో ఉంటు దేశములోని అతున్నత న్యాయ మూర్తిగాను కొలువులు నిర్వర్తిస్తున్నట్టులు ద్యోతక మైతున్నది. అట్లనే అష్ట దిక్పాలకులు వాళ్ళ రాష్ట్రములు రాజధానులు-

దిక్పాలకుడు

దిశ

రాజధాని

ఇంద్రుడు

తూర్పు

అమరావతి

అగ్ని

ఆగ్నేయం

తోజోవతి పట్టణం

యముడు

దక్షిణం

సంయమని పట్టణం

నైరుతి

నైరుతి

కృష్ణాంగన పట్టణం

వరుణుడు

పశ్చిమ

శ్రద్ధావతి పట్టణం

వాయువు

వాయువ్యం

గంధవతి పట్టణం

కుబేరుడు

ఉత్తరం

అలక పట్టణం

ఈశానుడు

ఈశాన్యం

యశోవతి (కైలాసం)

మానవులకే కాదు దేవతలు కూడా స్త్రీ లోరులనుటకు ఉదంతముగ తారా చంద్రుల వ్యవహారము చెప్పవచ్చును. దేవతల గురువైన బృహస్పతి స్త్రీ లోలుడై స్వంత భార్యయైన తారను నిర్లక్ష్యము చేయుటవలన ఆమె పరిస్థితి గమనించిన చంద్రుడు ఆమెను వశపర్చుకొని శృంగారము జరుపుటచే బుధుడు జన్మించాడని అంటరు. (బుధుడు శాపవశమున నపుంసకుడుగా పుడుతాడు. తరువాత మహా శక్తివంతుడు, జ్ఞానసంపన్నుడై జ్ఞానశక్తీ దేవిని పెళ్ళాడుతాడు).


దేవేంద్రుడు గూడా రసోన్మాదముతో మునుల భార్యలమీద మనసు పడ్డవాడై వేకువ ఝామున మునులు స్నానాదికాలకై కోడి కూత ఆధారముగా తెల్లవారు సమయమనెంచి బయలు దేరుట గమనించి, తానే కోడికన్న ముందుగా స్వరవంచన చేసి మునులు బయలుదేరగానే మునిపత్నుల అనుభవించ పూనుకున్నట్టు పురాణాలలో చెబుతారు.


ఇక కులాల విషయానికొస్తె కృతయుగమునుండి కులాలు ఉన్నట్టు పురాణాల ద్వారా తెలుస్తున్నది.


ఉదాహరణకు- త్రేతా యుగములో రాముడు సీతను అగ్ని పరీక్షకు పెట్టడానికి కారణం ఒక రజకుడు చేసిన ఆరోపణ.

ద్వాపరలో శ్రీ కృష్ణుడు గొల్ల వారింట్ల పెరుగడము- అట్లనే విదురుడు శూద్ర స్త్రీ గర్భమున జనించడము- కలియుగమైతే సరేసరి.


హరిశ్చంద్రుని పరీక్షించినవాడు. త్రిశంకు స్వర్గాన్ని నిర్మించినవాడు, సృష్టికి ప్రతిసృష్టి చేసిన మహా తపోశక్తి సంపన్నుడు; శకుంతలకు తండ్రి. గాయత్రి మంత్ర సృష్తి కర్త శ్రీ రామునికి గురువు అయిన విశ్వామిత్రుడంతటి వాడే కరువు కాలమున ఒక చండాలుడు ఎండబెట్టుకున్న కుక్క మాంసాన్నే దొంగిలించి తిన్నాడని పురాణాలు చెబుతాయి-


ఇక అగస్త్యమహాముని రాక్షసుని మాంసము తిని జీర్ణించుకున్నాడని కూడా పురాణ కథనం. అదెట్లంటె ఇలలుడు- వాతాపి అనే ఇద్దరు రాక్షస సోదరులు మానవ రూపము దాల్చి దారిన పోయే వారిని ఆతిథ్యానికని పిలిచి ఇలలుడు తన తమ్ముడగు వాతాపిని మేకగా మార్చి ఆ మేక మాంసము అతిథులకు పెట్టి వాళ్ళు తిన్న తరువాత వాతాపీ అని ఇలలుడు పిలువగానే అతిథుల కడుపు చీల్చుకుంటు బయటికొచ్చేవాడు-


అప్పుడు ఇద్దరన్నదమ్ములు ఆ అథితుల చంపి తినేవారు- ఇదే తీరు ఒక నాడు అగస్త్య మహామునిని కూడా ఆహ్వానించి తమ్ముడగు వాతాపిని మేకగ మార్చి ఆ మాంసముతో విందు భోజనము పెట్టి ఎప్పటిలాగే వాతాపీ అని పిలుస్తాడు ఇలలుడు. అది గ్రహించి వాక్శుద్ధి గల అగస్త్యుడు జీర్ణం అంటాడు. వాతాపిఅగస్త్యుని కడుపులో జీర్ణమైపోతాడు-


2.

అందుకే పిల్లలకు మందు పోసినా ఉగ్గు పెట్టినా జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అని అంటుంటారు -


పురాణాలలో అన్నీ సాధ్యమే. మచ్చుకు సూర్యుని వాహనము ఏడు గుర్రాల రథము- అందులో విచిత్ర మేమిటంటె ఆ రథానికి చక్రము ఒకటే - పగ్గాలు ఏడు బుసలుకొట్టే పాములు- రథ సారథి అనూరుడు అంటె తొడలు లేనివాడు- అకాశములో ఏ ఆలంబన లేని నిరంతర అనంతకాల పయనము-


భారత వంశీయులైన కౌరవ పాండవుల యుద్ధమును గురించి తెల్పు 100000 లక్ష శ్లోకముల మహా కావ్యము కౌరవ పాండవుల యుద్ధమును గురించియేకాక ధర్మార్థ, కామ మోక్షములను గురించియు తెల్పుచున్నది-హైందవులచే భగవదవతారముగ భాగింపబడు శ్రీ కృష్ణుడు ఈ కాలమునకు చెందిన వాడుగా భావింపబడుచున్నాడు- మహాభారత యుద్ధ సమయమందు శ్రీ కృష్ణుడు భారత వీరుడైన అర్జునునకు బోధించిన నీతి ధర్మము "భగవద్గీత" యను నామముతో మహా భారతములో అంతర్భాగముగా నున్నది-అందుచే మహా భారతము పుణ్యకావ్యముగ ఎంచబడుచున్నది-


మహా భారతము వేదవ్యాసునిచే రచించబడినది - కాలక్రమమున ఎన్నొ విషయములందు చేర్చబడినవి- మహా భారతమును "పంచా వేదము "అని కూడ పిలుచుచున్నారు-


ఇప్పటి కాలములో ప్రభుత్వాలు వ్యవసాయ దారులకు గాని రక్షక భటులకు గాని యుద్ధ సమయములో చని పోయిన సైనిక కుటుంబమునకుగాని రాయితీ, పరిహారము మున్నగు వసతులు ఆనాడే అనగా ధర్మరాజు పరిపాలనా కాలములో కూడా కలిగించెడి వారు- ధర్మ రాజును నారదుడు అడిగినట్టి ప్రశ్నల ఆధారంగా మనకు తెలియుచున్నది-


నారదుడు ధర్మ రాజుకు రైతులకు చేయవలసిన సహాయము గురించి చెబుతూ

ధరణీ నాథ భవద్భుజ

పరిపాలిత యైన వసుధ బరిపూర్ణములై

కరమొప్పుచున్నె చెరువులు

ధరణికవగ్రహ భయంబు దనుకక యుండన్-

హీనులకు కర్షకులకు ను

భూనుత ధాన్యంబు బీజములు వణిజులకున్

మానుగ శతైకవృద్ధి న

నూనముగా ఋణములిత్తె యుత్తమ బుద్ధిన్


నారదుడు ధర్మరాజును అడింగిందేమిటంటె “రైతులకు కరువు అనేది లేకుండా చెరువుల్లో నీళ్ళు నిండి ఉండి బాగుగా కనిపిస్తున్నాయా.. పేదలైన బలహీనులైన కర్షకులకు ధాన్యాని ఇస్తున్నావా, వారికి విత్తనాలు ఇస్తున్నావా, చిన్న వ్యాపారులకు ఋణాలు ఇస్తున్నావా.. అంతే కాదు, శతైక వృద్ధితో అంటె నూటికి ఒక రూపాయి వడ్డీకి ఇస్తున్నావా.. దానితోనే సరియైన అభివృద్ధి” అని చెబుతాడు.


రైతు సంక్షేమ పథకాలే కాకుండ నారదుడు పరిపాలనా సంబంధమైన విధానాలు కూడా చెబుతాడు -


తమ తమ కనియెడు తరి జీ

తము గానక నవయు భటుల దౌర్గత్య విషా

దములేని వానికవ

శ్యము నెగ్గొనరించు నతడు శకృండైనన్-


పరిపాలనలో ప్రభుత్వం కోసం పనిచేసే భటులకు సరైన సమయములో తగిన రీతిని జీతాలు ఇవ్వక పోతె అలాంటి వారు పరిపాలకులకు తప్పనిసరిగా నష్టం చేకూరుస్తారు-


కాబట్టి చనిపోయిన వారినే కాదు బతికి ఉండి పాలనలో సేవ చేసే భటులకు మంచి జీత భత్యాలు ఇవ్వాలి. ఇంకా చెబుతూ

చోర భయ వర్జితముగా

ధారుణీ బాలింతె యధిక ధన లోభమునన్

జోరులలక్షింపరుగా

వారలచో ధనము గొని భవితభ్యవరుల్


దొంగల భయము లేకుండా పాలిస్తున్నావా? నీ దగ్గర పని చేసే సేవకులు అధిక ధన లోభము (లంచాలకు లొంగి)చోరులను కాపాడి వెనుకేసుకొని వచ్చే అవకాశం ఉంది.. ఇవన్ని అడుగుతు ఉద్యోగులను నియమించే విషయంలో హెచ్చరిక చేస్తాడు-


ఉపధాశుద్ధులబాప

వ్యపగత బుద్ధుల వినీతవర్తుల సములన్

సుపరీక్ష వినియోగించితె

నిపుణుల నర్థార్జనాది నృపకార్యములన్-

ఉత్తమ మధ్యమాధమ నియోగ్యత

బుద్ధి నెరింగిన వారిన

యుత్తమ మధ్యమాధమ నియోగములన్

నియమించితె నరెన్

ద్రోత్తమ భృత్యకోటికి సమానముగా

దగు జీతంబులా

యత్తమ సేసి యిత్తె దయ నయ్యయి

కాలము దప్పకుండగన్-


పన్నులు, డబ్బులు వసూలు చేసే సమయములో నీతితో వర్తించే వారిని ఉత్తమ, మధ్యమ, అథమ స్థానాలలో వారి ప్రావీణ్యము బట్టి నియమిస్తున్నావా లేదా అని అడుగుతాడు-

దీన్ని బట్టి మనకు తెలిసేదేమిటంటే భారత కాలములో కూడా లంచగొండులు, దొంగలు, మోసగాండ్లు, సమర్థులు, అసమర్థులు, లోభులు, రాజ ద్రోహులు మొదలైన వారు ఉన్నారని ద్యోతకముచున్నది.


గురుజాడ అప్పారావు గారు రచించిన కన్యాశుల్కం తెలుగుజీవనాన్నీ, వాతావరణాన్నీ, మనుషుల శ్వాసనిశ్వాసాల్నీ, ఆంతరిక వ్యధల్నీ, భ్రష్టు పట్టిన మానవస్వభావాల్నీ ఆవిష్కరించే మొదటి సాంఘిక నాటకం.


అందులో ఒక పాత్రధారి అంటాడు 'అన్నీ వేదాలలో ఉన్నాయష' అని- ఈ అనంత కాల గమనం లో నేటికి రూపుమార్చుకొని పునరావృతమయితున్న జీవన విధానాలు-- అదే చర్విత చర్వణం.

***

సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

ree

రచయిత పరిచయం:

పేరు-సుదర్శన రావు పోచంపల్లి

యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)

వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి

కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను

నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,

నివాసము-హైదరాబాదు.




Comments

Rated 0 out of 5 stars.
No ratings yet

Add a rating
bottom of page