![](https://static.wixstatic.com/media/acb93b_4380c45b78c8463bb05d51dfabf5213d~mv2.png/v1/fill/w_49,h_28,al_c,q_85,usm_0.66_1.00_0.01,blur_2,enc_auto/acb93b_4380c45b78c8463bb05d51dfabf5213d~mv2.png)
'Natyamu - Nruthyamu - Abhinayamu - New Telugu Article Written By Sudarsana Rao Pochampally
'నాట్యము - నృత్యము - అభినయము' తెలుగు వ్యాసం
రచన: సుదర్శన రావు పోచంపల్లి
భారతీయ చతుషష్టి (64)కళలలో చోటు చేసుకున్నది నాట్యము- ఈ నాట్యములో అంతర్భాగములే నృత్యము అభినయము.
శ్లోకము- "వేద వేదాంగేతిహాసాగమ, న్యాయ, కావ్యాలంకార, నాటక, గాన, కవిత్వ, కామశాస్త్ర, శకున, సాముద్రిక రత్న పరీక్షా, స్వర్ణ పరీక్షాశ్వ లక్షణ, గజలక్షణ, మల్లవిద్యా, పాకకరమ, దోహళ గంధవాద ధాతువాద, ఖనీవాద, రసవాదాగ్నిస్తంభ, జలస్తంభ, వాయుస్తంభ, ఖడ్గస్తమ్ష, వశ్యాకర్షణ మోహన, విద్వేష్హాచ్చాటన, మారణ, కాలవంచన, వాణిజ్య పాశుపాల్య కృష్యా సవకర్మ, లావుక యుద్ధ మృగయా రతికౌశలా దృశ్యకరణీ ద్యూతకరణీ చిత్రలోహ పాషాణ మృద్దారు వేణు చర్మాంబరక్రియా చౌర్యషసిద్ధి స్వరవంచన, దృష్టివంచన, జలప్లవన, వాక్సిద్ధి, ఘటికా సిద్ధి, ఇంద్రజాల, మహేంద్రజాలాఖ్య చతుషష్టి విద్యాయమాన నిరవద్యని విద్యజ్ఞాన విద్యోతితే- "
నాలుగు వేదాల సరసన పంచమ వేద సారంగా నాట్యానికి గౌరవము ఉన్నది- నాట్యంతో దైవాన్ని దర్శించే వాళ్ళున్నారంటారు-
గానం భంగిమ కలిసిన నాట్యందైవారాధనగా భారతీయ సంస్కృతీ జీవధారగా భావిస్తారు- భరతముని నాట్య కళలకు ఆద్యుడంటారు. ఈ నాట్య కళ మూలాలు జానపద నృత్యంలో ఉన్నాయి. ప్రపంచం లో ప్రతి జాతికి తనదైన నాట్యం ఉన్నది.
శ్రమలో కాళ్ళూ చేతులూ కదలిక నుంచి నాట్యం ఆవిర్భవించిందంటారు.
ఋగ్వేదం నుండి పాఠ్యాన్ని, యజుర్వేదం నుండి అభినయాన్ని, సామవేదం నుండి సంగీతాన్ని అధర్వణ వేదం నుండి రసాన్ని గ్రహించి నాట్యవేదాన్ని సృష్టించారు.
ఆంగికం, వాచికం, ఆహార్యం మరియు సాత్వికం అను నాలుగు ఉపాంగాలు ఈ నాట్యానికి ప్రాణం.
నాట్యంలో జ్ఞానం, శిల్పం, విద్య, కళ, యోగం, కర్మ వంటివి మిళితమై ఉంటాయి. 64 ప్రాచీన కళలలో నాట్యం ఒకటి ఒక్కో ప్రాంతానికి ఒక్కో నాట్య రీతి ఉంటుంది. జానపద, సంప్రదాయం ఆధునిక రీతులను అనుసరిస్తుంటారు.
(నృత్యాలు వేసే అడుగులు శరీరంలోని క్యాలరీలను కరిగిస్తాయి ఒత్తిడిని తట్టుకునేలా చేస్తాయి, రోజువారి సమస్యలు మరిచి పోతారు).
నాట్యము = నృతా గీత వాద్య కూడిక.
నృత్యము = శరీర హస్త నేత్రాభినయము చేత భావమును తెలుపుచు ఆడెడు ఆట.
అభినయము = హృద్గతాభావ సూచకమైన శరీర చేష్టా విశేషము.
లలితకళలు = సంగీతము మొదలగు కళలు.
చిత్ర లేఖనము, శిల్పము, సంగీతము, నృత్యము, కవిత్వము ఈ తెగకు చెందినవే లలిత కళలు.
నృత్యము= ఇది భావాశ్రయమైనది. పదార్థాభినయాత్మక మైన మార్గమని ప్రసిద్ధినొందినది. జనులు సామాన్యముగా నృత్యము- నాట్యము అందలి బేధము తెలియక రెండింటిని సమానార్థకంగా వాడుతారు. దశరూపకారుడు ఆన్యత్యామాశ్రయం నృత్యం అనియు - ధనికుడు రసాశ్రయన్నాట్యాద్భావాశ్రయం నృత్యమన్య దేశం అనియు రెండింటికి బేధము నిరూపించారు.
నాట్యము రసాశ్రయమైనది ఇందు కావ్యార్థాభినయం గోచరించును.
నృత్యం ఆంగికాభినయం ప్రాధాన్యము వహించుచున్నది.
నాట్యము సాత్వికాభినయ బహుళమై ఒప్పుచుండును.
నృత్యము కూడా నృత్తము వలెనే శ్రవణేంద్రియములకంటె చక్షురింద్రియములకే ఎక్కువ ప్రీతి కలిగించును.
నృత్యము క్షణ క్షణాంచల్యమున దళావిపర్యమును కూడా సూచింపజాలియుండును.
సంగీతానికి ప్రేమకు పుట్టిన బిడ్డే నృత్యం.
ఆత్మలో దాగున్న భాష నృత్యం.
చీకటి - వెలుగులు, అచలనము- నృత్యము రెండుజతల విరుద్ధ అంశాలు.
మనస్సు ఎల్లప్పుడు నృత్యము చేస్తుంది.
నృత్యము ఒక జాతికి సంబంధించినది కాదు - మానవాళిది.
నృత్యము ఒక మానవులలోనే కాక భూచర, జలచర, ఖేచర జీవులలో కూడా కనబడుతుంది.
నృత్యమనగా- శరీర, హస్త, నేత్రాభినయముతో భావము తెలుపు ఆడే ఆట.
నాట్యమనగా- కేళిక, గుణిక, గొండిలి, తేతెయ్యలు, నటనము, నటితి, నట్టువ, నట్టువనము, నట్టి, నర్తనము, నాటకము, నృతి, నృత్తము, నృత్యము, పంజళి, ప్రేంఖ, లాసము, లాస్యము, నృత్త, గీత, వాద్యముల కూడిక.
తాండవము=ఉద్ధతమైన(కఠోరమైన- గర్వించ తగిన) నృత్యము.
అభినయము- రంగస్థలం మీద నటీనటుల మానసిక, శారీరక, వాచిక కలాపాన్ని అభినయం అంటారు. నటులు తాము ధరించిన పాత్ర యొక్క సుఖ దుఃఖాది అవస్థలు హావ భావ విలాసాది చేష్టలను వ్యక్తీకరిస్తూ ఆ పాత్రే మనముందు ప్రత్యక్షమైందని భ్రమింపజేసి రసానుభూతి కలిగించే ప్రక్రియే అభినయం. ఉదా- - తేలు కుట్టినప్పుడు ఏడవడం సహజం- అది అభినయమనిపించుకోదు- తేలు కుట్టనప్పుడు కుట్టినట్లు నటించి నిజంగా తేలు కుట్టిందని ఎదుటి వారు నమ్మేటట్లు చేయడం అభినయం.
ఆంగికం భువనం యస్య వాచికం సర్వ వాంగ్మయం
ఆహార్యం చంద్ర తారాదితం వందే సాత్వికం శివం (అభినయ దర్పణం)
ఈ అభినయం రెండు రకాలు-
1. స్థూలాభినయం - వాక్యార్థ అభినయం - వాక్యాన్ని స్థూలంగా ప్రేక్షకుల హృదయాలకు హత్తుకునేలా చేయడం. (ఇది నాటక ప్రదర్శనలో ప్రదశిస్తారు)
2. సూక్ష్మాభినయం - ప్రతి పదానికి అర్థాన్ని ప్రదర్శించి చూపడం. (ఇది నృత్య ప్రదర్శనలో ఉపయోగిస్తారు)
మానవుని పుట్టుకతో సిద్ధించిన అనుకరణ ప్రవృత్తి అభినయానికి మూలమని కొందరి అభిప్రాయం. ఆత్మావిష్కరమే అభినయమని కొందరు, నాటక కథ ద్వారా సిద్ధించిన మానవ హృదయ జీవనమే అభినయమని మరికొందరి భావన- పాత్ర బాహ్య కృతిని చిత్రించడమే గాక నటుడు తనలోని మానవ స్వభావాలను ఆ పాత్రలో పొందుపరిచి తన ఆత్మను అందులో ప్రతిష్టించి మానవ అంతర్జీవితాన్ని సృజించి కళాత్మకంగా ప్రదర్శించడమే అభినయమని మరి కొందరు నిర్వచించారు-
ఒక్కొక్క దేశం లో ఒక్కొక్క కాలం లో కళాకారుని ద్వారా ఒక్కొక్క రీతిలో అభినయం వర్ధిల్లి ప్రచారం లోకి వచ్చింది.
పై రెండు రకాల అభినయాలే కాకుండా ఇంకో నాలుగు రకాల అభినయాలు ఉన్నాయి- వాటినే చతుర్విధ అభినయాలు అంటారు. అవి.
1. ఆంగికాభినయం(అంగములచే నేర్పబడినది)
2. వాచాభినయం(భాషా రూపమైనది)
3. ఆహార్యాభినయం(రంగస్థలమునకు వలసిన సంభారములను సమకూర్చుట)
4. సాత్వికాభినయం(సత్వము- ఇతరుల సుఖ దుఃఖాది భావములను చూచి వానిని భావించినప్పుడు మనస్సునకు కలుగు అత్యంతాసక్తిచే నెరవేర్పదగిన భావములు మూలమునకు కలుగు అభినయము. )
ఆంగికం భువనం యస్య
వాచికం సర్వ వాంగ్మయం
ఆహార్యం చంద్ర తారాది
తం వందే సాత్వికం శివం.
జగత్తుకు మూలం పరమాత్మ- పరమాత్మ సంకల్ప రూపమే విరాట్ పురుషుడు (ఈశ్వరుడు) ఈశ్వరుని చైతన్య రూపమే ఈ జగత్తు లేక ప్రకృతి. నాట్యమే చైతన్య రూపమైన అభినయము. అనగా చైతన్య రూపమును సూచించు దృశ్య సమాహారము. ఈశ్వరుని నాట్యమును అనగా అభినయమును ప్రతిఫలింప జేసేదే జగత్తు.
ఈ సమస్త భువనము అనగా జగత్తు ఈశ్వరుని అభినయ విశేషము. ఆయన భావ సూచకం. సమస్త సాహిత్య రూపమైన ప్రణవమే ఆయనకు వాచికం.
సూర్య చంద్ర వివిధ గ్రహ తారాదులతో కూడిన ఈ సృష్టి ఆయనకు ఆహార్యం. ఆయన సాత్వికాభినయ ప్రతిఫలమే రససిద్ధి రూపమైన ఈ జగత్తు (ప్రకృతి)
అభినయం ఈశ్వరునిది అభినయ దర్పణ రూపం ప్రకృతి- ప్రకృతిపురుషుల సహచర యోగం చరాచర జగత్తు.
అవయవములచే చేయబడు అభినయమును ఆంగికం అంటారు.
ఆంగికం, వాచికం, ఆహార్యం, సాత్వికం నటనలో ఉండాల్సిన ముఖ్య సాధనాలు.
మొదటిది శరీరం ద్వారా ప్రదర్శించే అభినయం. దీనినే ఆంగికం అంటారు.
రెండవది అభినయిస్తూ నోటితో ఉచ్చరించే మాటలు, పాడే పాటలు - ద్దినిన్ వాచకం అంటారు.
మూడవది ఆహార్యం- అంటే బట్టలు, ఆభరణాలు, ముఖానికి చేసుకునే అలంకారం మొదలైనవన్నీ కలిసి-
నాల్గవది సాత్వికం- ముఖం లో చూపించే హావ భావాలు, ఆంగికాన్ని, వాచకాన్ని, ఆహార్యాన్ని సాత్వికాన్ని సమపాళ్ళలో రంగరించినప్పుడు మాత్రమే ఉత్తమ ప్రదర్శన సాధ్యమౌతుంది.
గొప్ప నటులకు ఉండవలసిన లక్షణాలు మూడు- 1. ఆంగికం (అందమైన రూపు)2. వాచకం(మంచి కంఠస్వరం) 3. అభినయం (హావ భావాలతో ప్రేక్షకులను ఆకర్షించుకోగల సామర్థ్యం).
అంగికం భువనం- యస్య వాచికం ససర్వ వాంగ్మయం
ఆహార్యం చంద్ర తారాదితల నమఃసాత్వికం శివం- - -
భూ మండలాన్ని దేహంగా- సమస్త వాగ్మయం వాక్కుగా సూర్య చంద్ర గ్రహ తారా మండలాలను ఆభరణాలుగా ధరించి ఆనంద నర్తనం చేస ఆ నట రాజుకు నమస్సుమాంజలి.
కాల చక్రమనే వృత్తంలో కాలే అగ్ని శిఖను చేత పట్టుకొని మరొక చేత డమరు ధ్వని వినిపిస్తూ అభయ ముద్రను ప్రదర్శిస్తూ చెదిరిన జటాజూటంతో చెలరేగి ఆడే నటరాజ భంగిమ సృష్టి రహస్యాన్ని లయ విన్యాసాన్ని వివరించే అభయమూర్తి అని అభివర్ణించిది సనాతన ధర్మం-
విశ్వ సృష్టి ఆవిర్భావానికి మూలమైన శక్తిని నిర్వచించే పరమాణు విన్యాసమే నటరాజు భంగిమ అని తెలుసుకుంది ఆధునిక విజ్ఞానం.
అందుకే నిలువెత్తు నటరాజ విగ్రహాన్ని జనీవాలోని అణు పరిశోధనా సంస్థ ముంగిట్లో ప్రతిష్టించింది.
ఆధునికతను, ఆధ్యాత్మికతను అనుసంధానం చేసి 36 అధ్యాయములు 6000 శ్లోకాలుగా సూత్రీకరించి లోకానికి అందించిన అద్వితీయ సాహిత్యమే భరతముని నాట్య శాస్త్రము.
భావం, రాగం, తాళాలను వ్యక్త పరుస్తుంది భరత నాట్యం- తమిళనాడు శాస్త్రీయ నృత్య విధానం భరత నాట్యం నృట్టం- భావ వ్యక్తీకరణ నృత్య - చేతులతో భావాన్ని వ్యక్తం చేయడం. నాట్య- పాత్రను చిత్రీకరించడం ఇలా మూడు రకాల భంగిమలను ఇముడ్చుకొని ఉంటుంది భరత నాట్యం. భరత నాట్యంలో ఆభరణాలు, గజ్జెలకు ఎక్కువ ప్రాధాన్యముంటుంది.
భ- భావం, ర- రాగం, త- తాళం ల సమ్మేళనమే భరత నాట్యం.
జీవన భావం లోని శ్రావ్యతను లయబద్ధం చేసి మానవ జీవన పరమార్థాన్ని విశదీకరించే విశిష్ట వాంగ్మయమే భరతనాట్యం.
మానవ దేహానికి మూలాధారమైన అగ్ని తత్వాన్ని వ్యక్త పరుస్తూ అగ్నిర్వైముచా దేవా- అన్న ఆర్యోక్తిని అభినయం ద్వారా ఆవిష్కరించే విధానమే భరత నాట్యం.
అంతర్గతమైన ఆత్మ శక్తిని అంతటా నిండి ఉన్న ఈశ్వర చైతన్యంలో ఐక్యం చేయగల సాధనం క్రమాన్నీ సంకేతాత్మకంగా తిల్లాన, జతి స్వరాలతో ప్రదర్శించే విజ్ఞాన విన్యాసమే కూచిపూడి నృత్యం.
గోల్కొండ ప్రభువైన తానీషాను సైతం సమ్మోహనపరచి 600 ఎకరాల పరగణాను నజరానాగా స్వీకరించిన నృత్య రీతి కూచిపూడి.
కూచిపూడి నృత్యము ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఒక భారతీయ నాట్యం. ఇది కృష్ణా జిల్లాలో దివి తాలూకాకు చెందిన కూచిపూడి గ్రామములో ఆవిర్భవించింది.
కూచిపూడిలోని బ్రాహ్మణులు ఈ శాస్త్రీయ నృత్యాన్ని అభ్యసించడము తో దీనికి ఈ పేరు వచ్చి దక్షిణ భారత దేశము అంతటా పేరుగాంచింది.
పుట్టుక విషయానికి వస్తె భరత నాట్యాన్ని రచించింది భరత ముని 3000 ఏండ్లక్రితం.
ప్రస్తుతం వాడుకలో ఉన్న భరత నాట్య శాస్త్రాన్ని ఒక తాటిపైకి తెచ్చి అమలు పరిచినవారు తంజావూరుకు చెందిన చిన్నయ్య, పొన్నయ్య, శివానందం, వడివేలు అనబడే నలుగురన్నదమ్ములు. వీరు 18 వ శతాబ్ద్ధానికి చెందినవారు.
ప్రాచీన దేవాలయాల్లో శిల్పాలు భరత నాట్య భంగిమలో అప్సరసలు నాట్యం చేస్తున్నటుల తీర్చి దిద్దబడి ఉంటాయి.
పూర్వ కాలం దేవ దాసీలు దేవాలయాల్లో భరత నాట్యం ప్రదర్శించేవారు.
భావం, రాగం, తాళం ఈ మూడు ప్రాథమిక నృత్య కళాంశాలను భరత నాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతోపాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి.
సాధారణంగా భరత నాట్యం లో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. కట్టుబాట్లు మరీ ఎక్కువ.
నాట్య శాస్త్రంలో ఇలా చెప్పబడింది- నీలకంఠుడు కైశికీ పద్ధతిలో నృత్యం చేస్తుండగా నేను చూశాను - ఆ నృత్యం యొక్క ఆత్మ (క్రియలు)ధరించే వస్త్రాలు అత్యంత మనోహరంగా ఉండాలి - శృంగారమే ఆ నృత్యానికి మూలం. మగవారికి ఆ నృత్యం సరిగా చేయడం సాధ్యం కాదు-
భారతీయ నాట్యం-
భారత దేశం లో ప్రాచుర్యంలో ఉన్న నాట్య నృత్య రీతులను భారతీయ నాట్యం- భారతీయ నృత్యం అంటారు.
భారత దేశం లో అనేక నాట్య రీతులు కానవస్తాయి- శాస్త్రీయంగా చూస్తె ప్రతి రాష్ట్రం లొ సాంస్కృతిక నాట్యాలున్నాయి.
భారతీయ నాట్యంలో అనేక విధాలు - ప్రధానంగా రెండు విధాలు.
1. సంప్రదాయ నృత్యాలు.
2. జానపద గిరిజన నృత్యాలు.
ఇవే కాకుండా ప్రస్తుతం అన్ని రీతులలోను ప్రధానంగా పాశ్చాత్య, దేశీయ విధానాలను మేళవించి రూపొందించిన నృత్య విధానాలు ప్రస్తుతం జనాదరణ కలిగి ఉన్నాయి.
సాధారణంగా సంగీతానికి పారవశ్యమై శరీరంలో ఏర్పడే కదలికలు లేదా లయబద్ధ సంగీతానికి శరీరం లయబద్ధంగా కదలడం అని చెప్పుకోవచ్చు.
శాస్త్రీయ నాట్య రీతులు- -
1. కూచి పూడి, . 2. భరత నాట్యం, . 3. కథక్, . 4. కథకళి, . 5. మణిపురి, . 6. ఒడిస్సి, . 7. మోహిని ఆట్టం, . 8. సత్రియ నృత్యం, . 9. యక్ష గానం.
జానపద నాట్య రీతులు ఏ రాష్ట్రము వారి పద్ధతులలో ఆ రాష్ట్రాలలో వేరు వేరు పేర్లతో పిలువబడుతాయి.
ఆంధ్ర తెలంగాణలలో.
ఆంధ్ర- - వీధి నాటకం, . బుర్రకథ, . గంటమర్థాలు, . కోలాటం, . పేరిణి, . తోలు బొమ్మలాట. థింసా నృత్యం, . చిందు నృత్యం.
తెలంగాణ- పేరిణి నృత్యం.
భారతీయ శాస్త్రీయ నృత్యం-
భారత దేశం శాస్త్రీయ నృత్యాలకు పుట్టినిల్లు. భిన్న శాస్త్రీయ నృత్య కళలతో నిండి ఉన్నది. నాట్యం, శాస్త్రీయ నృత్యం కావాలంటె భరత ముని బోధించిన నాట్య శాస్త్ర విధంగా అభినయం నాట్యం కలిసిన విధంగా ఉండాలె.
అంగ, ప్రత్యంగ, ఉపాంగ, ముద్రల విశేషాలతో నాట్య శాస్త్రాన్ని రచించిన భరతముని కాని వివిధములైన హస్త ముద్రా విన్యాసాలతో "అభినయ దర్పణ"గ్రంథాన్ని మనకు అందించిన నందికేశ్వరుడు కానిమనకు చెప్పిన సత్యం ఒక్కటే- యతో హస్తః తతో దృష్టిః యతో దృష్టి తతో మనః తతో భావః తతో రసః - నీ కదలికలు, నీ దృష్టిని ప్రభావితం చేస్తే ఆ దృష్టి నీ మనసును ప్రేరేపిస్తుంది. ప్రేరేపితమైన మనసు భావ ఉద్దీపనకు కారణ మౌతుంది.
విధానం- -
కూచిపూడి నృత్య ప్రదర్శన గణేశ స్తుతి, సరస్వతీ స్తుతి, లక్ష్మీ స్తుతి పరాశక్తి స్తోత్రాలతో మొదలౌతుంది. ఆ పై ఒక్కొక్క పాత్ర వేదికనలంకరించి ధారవు (ఒక చిన్న సంగీత నాట్య రూపం) తో స్వీయ పరిచయం చేసుకుంటారు- దీని తరువాత కథ మొదలౌతుంది. ప్రక్కన గాయకుడు కర్ణాట సంగీత శైలిలో కీర్తనలు పాడుతారు. దీనినే నట్టువాంగం అంటారు. ఇందులో మృదంగం, వయోలిన్ వేణువు, తంబురా వంటి వాద్య పరికరాలను ఉపయోగిస్తారు. చురుగ్గా, లయ బద్ధంగా కదిలే పాదాలు శిల్ప సదృశమైన దేహం భంగిమలు, హస్తాలు, కళ్ళు తో చేసే కదలికలు ముఖం లో చూపించే భావాలు- ముఖాభినయంతో కూచిపూడి నృత్య కళాకారులు సాత్వికాభినయం, భావాభినయం చేయడం లో ఉద్దండులు - నృత్యకారులు ధరించే ఆభరణాలు తేలికగా ఉంటె బూరుగు అనబడు చెక్కతో చేస్తారు.
ఈశ్వరుడు ఆది ప్రవక్త- నందికేశ్వరుడు ఈశ్వరుని సన్నిధిలో నాట్యము గ్రహించాడు. అతడే శివుని ఆజ్ఞపై బ్రహ్మకుపదేశించాడు- అటుపై బ్రహ్మ నాట్యమును ఉదహరించాడు- భరతుడు దానిని గ్రహించి నాట్య శాస్తం రచించాడు. దానికే నాట్యవేదమని పేరు.
శాండిల్య, వాత్సల్య, కోహాదులు భరత శిష్యులు. వారు నాట్య విద్యను ప్రచారం చేశారు. లోక సంగ్రహాన్ని అపేక్షించిన మనువు సూర్యుడిని లోక సముద్ధరణోపాయమును చెప్పమని అడిగాడు. సూర్యుడు చెప్పిన ఉపాయములను బట్టి భరతుని దగ్గర మనువు నాట్య విద్యను తెలుసుకున్నాడు. దీనినే కొందరు వాక్దేవి సంప్రదాయమంటారు.
నాట్య ప్రయోజనాలు.
అత్యంత ప్రయోజనాలు ఎన్ని ఉన్నా మహా రసమే నాట్య ముఖ్య ప్రయోజనము. మనో రసానికి అనుకూలమైన ప్రవర్తన ఎక్కడ సంపాదించ గలిగితె అక్కడ ఆస్వాదం కలుగుతుంది. మనో వృత్తిలో విజ్రుంభించి తే స్పంద శక్తుల నిరోధించి సమానావస్థను సంపాదించిన తరువాత నే సాధకుడు ఆస్వాద భూమికను అందుకో గలుగుతాడు. నాట్యం వల్ల చక్షురాదింద్రియాలు ఏ యే విధంగా ఉన్నప్పటికి భవనా చక్షువు, భవనా శ్రోత్రము, భవనేంద్రియము స్వస్వవ్యాపారంలో బాగా మగ్నత పొంది ఉంటవి. అందు వలన మనో భూమి కూడా భావనకు మహా సాగరం అవుతుంది. దీని వలన ప్రపంచ భేదం సులభము. దీని వలన ఆత్మ ప్రకాశము చెందును. ఈ మహా ప్రకాశావస్థనే మహా రసమంటారు. ఇటువంటి మహా రస సంపత్తిని నాట్యం అందజేయ గలుగుతుందని ఈ శాస్త్రం తెలుపుచున్నది. ఈ మహా రస సంపదే ఆత్మ సంవేదనము నాట్యం చూచే ప్రతి వానికి కలుగదు. విశిష్టమైన అర్హత ఇక్కడ కూడా అవసరము.
నాట్యము ఒక వ్యాయామము లాంటిది - నాట్యము చేయడము వల్ల ఆధ్యాత్మిక భావం పెంపొందడమే కాక మనోల్లాసము- మనసుకు ప్రశాంతత శరీరానికి ఆరోగ్యము మున్నగు ప్రయోజనాలను పొందవచ్చును.
సమాప్తం.
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_98c20bcbe71b4993806731a979a4638d~mv2.jpg/v1/fill/w_145,h_184,al_c,q_80,usm_0.66_1.00_0.01,blur_2,enc_auto/acb93b_98c20bcbe71b4993806731a979a4638d~mv2.jpg)
రచయిత పరిచయం:
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.