top of page

శిక్షణ


'Sikshana' New Telugu Story

Written By Ch. C. S. Sarma

'శిక్షణ' తెలుగు కథ

రచన: సిహెచ్. సీఎస్. శర్మ

(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

శివ.. వయస్సు పన్నెండు సంవత్సరాలు.. ఏడవ తరగతి..

తల్లి వసుంధర.. స్కూల్ టీచర్.. తెలుగు ఉపాధ్యాయని..

తండ్రి ఆనందరావు.. కాలేజీ లెక్చరర్. ఇంగ్లీస్ పిహెచ్.డి..


శివ, తర్వాత ఆ దపంతులకు ఐదేళ్ళకు ఆడబిడ్డ పుట్టింది..

పేరు అమృత. వయస్సు ఏడు సంవత్సరాలు. మూడవ తరగతి..


అన్నా చెల్లెలు, తల్లి స్కూల్లోనే చదువుతున్నారు. ఆ స్కూల్లో ప్రయిమరీ.. సెకండరీ.. రెండు విభాగాలు వున్నాయి. ఆ భార్యా భర్తలు చక్కని ఆశయాలు కలవారు. పిల్లలను మంచి క్రమశిక్షణతో పెంచుతున్నారు.


వారి ఆరాటం.. శ్రద్ధ.. కేవలం వారి పిల్లల వరకే కాదు పరిమితం. స్కూలు, కాలేజీలోని అందరు పిల్లలను వారిరువురూ ఎంతో ప్రీతితో చూస్తారు. అభిమానిస్తారు. చక్కగా చదువు చెబుతారు.


తెలుగు పండిట్ రాఘవయ్య మాస్టారు గారు ఏడవతరగతి ఎసెక్షన్ లో సత్య హరిశ్చంద్రుల వారి పాఠాన్ని వివరిస్తున్నారు.. పిల్లలందరూ శ్రద్ధగా వింటున్నారు. ఆ సెక్షన్ లోనే శివ ఉన్నాడు..


‘‘సత్యహరిశ్చంద్ర మహారాజుల వారు.. వారి జీవితకాలంలో ఎన్నడూ ఆడిన మాటను తప్పలేదు. విశ్వామిత్రుల వారికి ఇచ్చిన మాట ప్రకారం.. సర్వ సామ్రాజ్యాన్ని వారికి ధారపోసి.. అదీ చాలక భార్య చత్రమతి, కుమారుడు లోహితాశ్వరుల విక్రయించి, తాను కాటికాపరిగా.. అంటే శవాలను కాల్చువానిగా మారి విశ్వామిత్రుల వారికి చెల్లించవలసిన ధనాన్ని చెల్లించారు. ఆ సూర్యవంశపు మహాచక్రవర్తి మాట తప్పని సత్యసంధుడు.

యుగాలు గడిచాయి. తరాలు గడుస్తున్నాయి. కాని వారి మహోన్నత సుచరిత్ర చిరస్థాయిగా ఈ మన భారతావనిలో మిగిలిపోయింది. సత్యం ధైర్యం సాహసం.. వారి సొత్తు.


‘‘భావి జీవితంలో మీలో ఎవరెవరు.. ఏ హోదాలకు చేరుతారో.. ఎంత ఉన్నతికి ఎదుగుతారో ఇప్పడు తెలియదు. సత్యాన్ని ధర్మాన్ని నీతిని నిజాయితిని ధైర్యాన్ని సాహసాన్ని.. గౌరవించి పాటిస్తే.. మీరంతా కూడా గొప్పవారు అవుతారు. కావాలని నేను మిమ్ములనందరినీ మనసారా దీవిస్తున్నాను.’’


లాంగ్ బెల్ మ్రోగింది. పిరీడ్ ముగిసింది. అది చివరి పిరీడ్.. పిల్లలు.. అధ్యాపకులు ఇండ్లకు బయలుదేరారు. పిల్లలను వారివారి తల్లిదండ్రులు.. గురువులు చిన్నవయస్సు నుండి ఇచ్చు శిక్షణ.. వారి భావి జీవితానికి బంగారు బాట.. అవుతుంది. నేడు చాలామంది తల్లితండ్రులు.. ఇరువురూ ఉద్యోగస్తులైనందున.. పిల్లలు స్కూలుకు పోకముందు.. చైల్డ్ కేర్ సెంటర్స్ లో వదలి.. మూడు సంవత్సరాలు నిండగానే.. ప్రీకేజీలో ప్రవేశం.. ఆపై ఆంగ్ల రైమ్స్.. ఎబిసిడీలు నేర్చుకోవడం.. తరువాత సంవత్సరం యు.కే.జి. పిదప మొదటి తరగతి (ఫస్ట్ స్టాన్ డరడ్) తో విద్యాభ్యాసం ఊపు అందుకొంటుంది ఇంగ్లీష్ లో. పిల్లలు మన పద్ధతులకు.. మాతృభాషకు.. దూరం అవుతున్నారు చాలామంది.

స్థితి ఎంతవరకు దిగజారిందంటే.. మమ్మీ డాడీ.. గ్రాండ్ మా గ్రాండ్ ఫా అంటూ.. తన తాత నాయనమ్మల పేర్లు తెలియని చెప్పలేని చిన్నారులు ఎందరో?.


ఇక.. మన హైందవ పురాణాలు.. నీతి నీయమాలు.. ఆచార వ్యవహారాలు.. వారికి క్రమంగా దూరమైపోతున్నాయి. సాంబూ! నీవు మీ వూరి స్కూల్లో నీ కొడుకునే చేర్చకుండా మా వూరికి వచ్చి మా బడిలో చేర్పించాలనే నీ భావన.. నా మీద, మా పాఠశాల మీద నీకు వున్న గౌరవం.. నమ్మకానికి.. నీవు నాకన్నా చిన్నవాడివైనా చేతులు జోడించి నమస్కరిస్తున్నాను ప్రియసోదరా!..’’ రాఘవయ్యా మాస్టారుగారు సాంబూ ఎదుట చేతులు జోడించారు.


సాంబూ నవ్వుతూ ప్రతి నమస్కరం చేశాడు.

రాఘవయ్య మాస్టారుగారి సతీమణి సావిత్రమ్మగారు వారి పెళ్ళి అయిన పది సంవత్సరాల తర్వాత మొగబిడ్డకు జన్మనిచ్చింది.. వారి చిరకాల వాంఛ తీరింది. ఆ అబ్బాయి పేరు హరి.. అతను శివ వయస్సు వాడే. శివ హరులు మంచి స్నేహితులు.. ఒకే తరగతి.. ఒకే వీధిలో వారి ఇళ్ళు అప్పుడు శెలవల రోజులు. శివ హరి ఇంటికి వచ్చాడు.

‘‘సాంబూ!.. ఈ అబ్బాయి పేరు శివ. వసుందర టీచర్ కొడుకు. నా కొడుకు హరి.. వీడు ఒకే క్లాస్. ఇద్దరూ మంచి స్నేహితులు..’’ నవ్వుతూ చెప్పాడు రాఘవయ్య.

ఆక్రొత్త వ్యక్తికి తనను మాస్టారు గారు చేసిన పరిచయంతో శివ నవ్వుతూ సాంబూగారిని చూస్తూ చేతులు జోడించాడు.


‘‘బాబూ!.. నీ పేరు శివనా!..’’ అడిగాడు సాంబు.

‘‘అవునుసార్!..’’ వినయంగా జవాబు చెప్పాడు శివ. సాంబూ తన కొడుకును తనతో తీసికొని రాలేదు. రాఘవయ్య మాస్టారుగారితో తనకు వున్న పరచయరీత్యా తన కొడుకును ఆ వూరి స్కూల్లో చేర్చే విషయం మాస్టారుగారితో మాట్లాడాడు సాంబు..

అతను వుండేవూరు ఈ వూరికి మధ్య దూరం ఆరు కిలోమీటర్లు. సాంబు తన కొడుకును చేర్చబోయేది ఆరవతరగతిలో..


సమయం సాయంత్రం ఐదుగంటలు..

శివ గొంతు విని.. హరి బయటకు వచ్చాడు. ఇరువురూ శివాలయం వైపుకు వెళ్ళారు. అక్కడ వారు మిత్రులతో కలసి కబాడి ఓ గంటసేపు ఆడుతారు. ఆలయం హరి ఇంటికి చాలా దగ్గర.. మిత్రులు అందరూ కలసి రెండు జట్లుగా ఏర్పడి కబడీ ఆటను ప్రారంభించారు.


ఆకాశంలో వాతావరణమార్పు. మేఘాలు కమ్ముకొన్నాయి. సన్నగా చినుకులు. కొంతసేపు పిల్లలు ఆ చినుకులను లెక్క చేయకుండా ఆడారు. పది నిముషాల్లో.. గాలి తీవ్రత.. వర్షపు జోరు పెరిగింది. శివహరులు.. హరి ఇంటి వైపుకు పరుగెత్తారు.

* * *

ఆ గాలీవాన బంగాళాఖాతంలో రేగిన వాయుగుండం కారణం అని ప్రాంతీయ్య వార్తలలో రేడియో మూలంగా ప్రజానీకానికి హెచ్చరిక. బెస్తలు సముద్రంలోకి వెళ్ళకూడదనే సందేశం. గాలీవాన ప్రళయతాండం చేయసాగింది.


శివ వచ్చేటప్పుడు వాళ్ళ అమ్మతో.. ‘‘అమ్మా!.. శలవులేకదా!.. మొన్న హరి నా కోరిక ప్రకారం ఆ రాత్రి మన ఇంట్లో వున్నాడు కదా!.. ఈ రోజు నేను వాళ్ళ ఇంట్లో వుంటాను అది హరికోరిక. ఏడుగంటల కల్లా నేను ఇంటికి రాకపోతే.. దిగులు పడకు. హరి ఇంట్లో వున్నానని అనుకో!.. చెప్పాడు శివ. సరేరా!.. అలాగే!.. జాగ్రత్తగా ఆడుకొండి..’’ తల్లి వసుందర హెచ్చరిక.


తాను తల్లికి చెప్పిన మాటలు శివకు గుర్తుకు వచ్చాయి. తల్లిని చెల్లిని తండ్రిని తలచుకొన్నాడు.

మిత్రులిరువురు.. హరి తల్లి పెట్టిన ఆహారాన్ని తిని హరి గదిలో పడుకొన్నారు దుప్పట్లు కప్పుకొని.. ఆ గదిలోని ఒక బీరువా వుంది. అది వారి లాకర్..


అతిథి సాంబు మాధవయ్య గారు.. భోంచేసిన తరువాత సావిత్రమ్మ వెండి కంచాలు చెంబులను బీరువాలో పెట్టడానికి తెరిచింది. అదే సమయానికి సాంబు మాస్టారుగారితో ఆ గదిలో ప్రవేశించాడు. అతని కళ్ళకు బీరువాలోని వస్తువులు స్పష్టంగా కనుపించాయి. మాధవయ్యగారు అతనికి పడకను ఆ గదిలో అమర్చారు. పడుకోమని సాంబుకు చెప్పి.. మాధవయ్య సావిత్రమ్మలు ఆగది నుండి వెళ్ళిపోయారు. బీరువాపైన గోడమీదున్న చీలకు బీరువా తాళాలు తగిలించారు పార్వతమ్మ. భార్యా భర్తలు వారి గదిలో పడుకొన్నారు. వేకువన నాలుగు గంటలకు సాంబు కళ్ళు తెరచి శివ హరిలను చూచాడు. వారు దుప్పటి క్రింద గాఢ నిద్రలో వున్నారు. మెల్లగా లేచి బీరువాను సమీపించాడు. చీలకున్నా తాళాలను చేతికి తీసికొన్నాడు.. మెల్లగా బీరువాను తెరిచాడు.

లోన వున్న వెండి సామాన్ను.. ఇరవై ఐదు సవర్ల బంగారు నగలను తన సంచిలో వేసికొన్నాడు. అదే సమయానికి.. శివకు కల.. తల్లి ఏడుస్తున్నట్లు.. వులిక్కి పడి లేచి మంచంపై కూర్చున్నాడు. శివను చూచిన సాంబు వేగంగా బీరువా తలుపును మూయకుండా బయటికి వెళ్ళిపోయాడు.


అప్పటికి వాన ‘గాలి తగ్గాయి. ప్రళయం తగ్గింది..’ అనుకొని సాంబు వేగంగా బస్టాండ్ వైపుకు నడిచాడు.

తెరిచిన బీరువాను చూచిన శివ.. హరిని తట్టిలేపాడు. గాఢ నిద్రలో వున్న హరి కదల్లేదు. ‘సాంబు.. మాస్టారు గారి బీరువాలోని సామాగ్రిని దోచుకొని పారిపోతున్నాడు. అతని ఎదిరించి వాటిని తీసికోవాలి. మాస్టారు గారికి ఇవ్వాలి..’ ఈ ఆలోచనతో శివ.. సాంబూ వెనకాల బయలుదేరాడు.


దారిలో పోలీస్ స్టేషన్..

శివా మెదడులో తళుక్కన ఒక ఆలోచన..


పరుగెత్తి స్టేషన్ లో ప్రవేశించాడు. దుప్పటికప్పకుని కునికి పాట్లు పడుతున్న డ్యూటీ కానిస్టేబుల్ కనకరాజును తట్టి లేపాడు. ‘‘దొంగ..దొంగ.. సారో రండి ప్లీజ్!..’’ ప్రాధేయ పూర్వకంగా కోరాడు శివ. విషయాన్ని పూర్తిగా చెప్పాడు..


మొదట కానిస్టేబుల్ శివాను కశిరినా.. అతని మాటల్లోని నిజాయితి తన గురువుగారిపైన అతనికి వున్న అభిమానానికి సంతోషించి శివ వెంట బయలుదేరాడు.

ఆవూరి నుండి వుదయం ఐదున్నరకు మొదటి బస్సు సాంబు వూరికి బయలు దేరుతుంది. రడీగా వున్న బస్సులో సాంబు ఎక్కి ముందు వైపున కూర్చున్నాడు.


శివా బస్సులోవున్న సాంబూని చూచాడు. కనకరాజుకు చూపించాడు. గాలీ వాన వలన బస్సులో ఐదుగురే ప్రయాణీకులు. అందులో సాంబు ఒకడు. డ్రయివర్ కండక్టర్లు ముందున్నా షెడ్ లో సిగరెట్ కాలుస్తున్నారు. కానిస్టేబుల్ కనకరాజు.. బస్సు వెనక వైపు నుంచి ఎక్కి సాంబు సీట్లో.. ప్రక్కన కూర్చున్నాడు..


సాంబూ లేచి పోలీసును ప్రక్కకు త్రోచి వేగంగా బస్సు ముందు నుంచి దిగాడు. పరుగుతీయ సాగాడు.


శివా.. అతన్ని వెంబడించి అతని కాలును గట్టిగా పట్టుకొన్నాడు. సాంబూ ముందుకు పడ్డాడు. అతనితో పాటు పట్టువీడని శివ నేలపడ్డాడు. కానిస్టేబుల్ కనకరాజు సాంబు జుట్టు పట్టుకొని లేపాడు. చేతులకు బేడీలు తగిలించాడు. అతని చంకన వున్న సంచిని తన చేతిలోకి లాక్కున్నాడు. చేయి అందించి శివను లేపాడు.


మాస్టారు మాధవయ్య ఐదున్నరకు లేచి పిల్లలు అతిథి వున్నగదిలోకి ప్రవేశించాడు. తెరిచి వున్న బీరువాను చూచాడు. శివ సాంబు లేనందున వారికి అనుమానం కలిగింది. బీరువాలో చూచాడు. గుండె ఆగినంత పనైయింది. బిగ్గరగా ‘‘సావిత్రీ!..’’ అరిచాడు మాస్టారు. ఆ అరుపువిని హరి వులిక్కిపడి లేచాడు. సావిత్రి పరుగున వారిని సమీపించింది.


ముగ్గురికి విషయం అర్థం అయింది. వారు ఆవేదనతో శివ ఇంటివైపుకు బయలుదేరారు.

బేడీలు చేతులకు వున్న సాంబూను ప్రక్కన వున్న కానిస్టేబుల్ కనకరాజును శివను చూచి వారు ఆశ్చర్యపోయారు. సాంబు వారిని చూచి తలదించుకొన్నాడు కన్నీటితో..


జరిగిన కథను కానిస్టేబుల్ ఆ ముగ్గురికి వివరించాడు. చివరగా, ‘‘ఈ బాబు తల్లిదండ్రులు ఇచ్చిన శిక్షణ చాలాగొప్పది. ఎంతో సాహసం చేశాడు. ఈతని వల్లనే మీ వస్తువులు నా చేతికి వచ్చాయి. దొంగ దొరికాడు. అన్ని వున్నాయోలేవో చూచుకొండి సార్!..’’ తన చేతిలోని సంచిని మాస్టారుగారి చేతికి అందించాడు కానిస్టేబుల్ కనకరాజు. సావిత్రమ్మ సంచిలోని వాటిని చూచి.. ఆనందంగా ‘‘అన్నీ వున్నాయి సార్!’’ అంది.


శివా ఇంటి కి రానందున అతని కోసం తల్లి వసుంధర తండ్రి ఆనందరావు విచారంగా వీధిలో ప్రవేశించారు. వారిని చూచిన శివా వారివైపుకు పరిగెత్తాడు..


రాఘవయ్య మాస్టారు.. సావిత్రమ్మ.. హరి.. కానిస్టేబుల్ కనకరాజు వారిని సమీపించారు. వీరంతా శివను ఎంతగానో అభినందించారు. శివను కన్న తల్లి.. అతన్ని ప్రీతిగా తన హృదయానికి హత్తుకుంది.. తండ్రి శివతలపై తన కుడిచేతిని వుంచి ఆనందంగా దీవించాడు. సాంబును లాక్కొని కనకరాజు స్టేషన్ వైపుకు నడిచాడు.. మాస్టారుగారు సతీమణి ఆనందంగా వారి ఇంటి వైపుకు నడిచారు.


సమాప్తం.

సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.

కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.

బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం

విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు

ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.

తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.


రచనా వ్యాసంగం: తొలి రచన ‘లోభికి మూట నష్టి’ విద్యార్థి దశలోనే రాశాను, అప్పట్లో మా పాఠశాల బ్రాడ్కాస్టింగ్ స్టేషన్ నుండి ఈ శ్రవ్య నాటిక అన్ని తరగతులకు ప్రసారం చేశారు.

అందులోని మూడు పాత్రలను నేనే గొంతు మార్చి పోషించాను.

మా నాయనమ్మ చెప్పిన భారత భాగవత రామాయణ కథలు నన్ను రచనలకు పురికొల్పాయి.

ఇప్పటి వరకు 20 నవలలు, 100 కథలు, 30 కవితలు రాశాను.



44 views0 comments
bottom of page