top of page

ఆనందం పరమానందం


'Anandam Paramanandam' written by Muralidhara Sarma Pathi

రచన : పతి మురళీధర శర్మ

"ఏమండీ! ఎవరూ?" ఫోన్ లో మాట్లాడుతున్న కృష్ణమూర్తిని అడిగింది ఆయన అర్ధాంగి అనసూయ వంటింట్లో నుండి చేతులు తుడుచుకొంటూ వస్తూ.

"అబ్బాయే! అమెరికా నుంచి" అని కృష్ణమూర్తి అన్నాడో లేదో "ఏదీ ఇలా ఇవ్వండీ. నేను మాట్లాడతాను" అంది అనసూయ ఆరాటంగా. "ఉండవోయ్. ఇప్పుడేగా ఫోనొచ్చింది. నేను మాట్లాడుతున్నాగా! అయిపోయాక ఇస్తాను" చెప్పేడు కృష్ణమూర్తి.

" ఎలా ఉన్నాడు? బాగున్నాడా? ఎప్పుడొస్తాడట?' ప్రశ్నల వర్షం కురిపిస్తున్న భార్యతో, " నేను నీతో మాట్లాడనా? వాడితో మాట్లాడనా? సరే! అదేదో నువ్వే మాట్లాడి నాకు చెప్పు వాడేమన్నాడో" అని ఫోన్ ఇచ్చేసేడు భార్యకి కృష్ణమూర్తి. భర్త అలకని ఆసమయంలో పట్టించుకోలేదు అనసూయ.వెంటనే ఫోన్ తీసుకొని వంటింట్లో కి వెళ్ళిపోయి మాట్లాడడం మొదలుపెట్టింది,

"అభీ! ఎలా ఉన్నావు? సత్య ఎలా ఉంది? పిల్లలెలా ఉన్నారు?" అంటూ. అమ్మ అనురాగం,ఆప్యాయతకు సెల్ వేడెక్కిపోయింది. అంటే అంత సేపు మాట్లాడిందన్నమాట. 'ఇంకా అవలేదా మాట్లాడడం?' అని కృష్ణమూర్తి అనేంతవరకూ అనసూయ కళ్ళు కొడుకుని చూసినంత ఆనందంతో చెమ్మగిల్లేయి. అది గమనించిన కృష్ణమూర్తి 'ఇంతకీ వాడేమంటున్నాడు? 'అని అడిగేడు.

"ఏమంటాడు? అమ్మా, నువ్వెలా ఉన్నావు? నాన్నగారెలా ఉన్నారు? అని అడిగేడు".

"సరేలే! అవి మామూలే. ఇంతసేపు మాట్లాడేవు కదా.. ఏంటి కబుర్లు?' ఆరా తీసేడు కృష్ణమూర్తి 'మీ పుట్టినరోజు ఎప్పుడని అడిగేడు'.

'ఎందుకూ ? చెప్పేసేవా? వింతేముంది? ప్రతి ఏడాదీ వచ్చేదే కదా!'

"అడిగేక చెప్పకుండా ఎలా ఉంటాను? అయినా ఈ ఏడాది ప్రత్యేకమే. తమరు 60 వసంతాలు పూర్తి చేసుకొని 61వ వసంతంలో అడుగు పెడుతున్నారు" అని తెలియజెప్పింది అనసూయ. 'అయితే ?'

'అయితే ఏంటి? వాడు మీ షష్టి పూర్తి మహోత్సవం ఘనంగా జరిపిస్తాడంట' చెప్పింది గొప్పగా అనసూయ.

" అలాంటివి నాకు ఇష్టం లేదని తెలుసుకదా" అన్నాడు కృష్ణమూర్తి.

"మీకు ఇష్టం లేకపోయినా వాడి సరదా వాడిది .అయినా అంత అభిమానంతో కొడుకు అమెరికా నుండి వచ్చి చేస్తానంటుంటే మీరేంటి?" దెప్పి పొడిచింది భర్తని.

"వాడి సరదా వాడిది అయితే నా సరదా నాదీ"

'ఈ దొరగారి సరదా ఏమిటో' వేళా కోళంగా అంది అనసూయ.

'మీతో మాట్లాడలేను ' అంటూ ముఖం తిప్పేసుకుంది.

'అందుకే మాట్లాడకుండా పడుకో' అంటూ నిద్రకుపక్రమించేడు కృష్ణమూర్తి. నాలుగు రోజుల తర్వాత మళ్లీ ఫోన్ వచ్చింది కృష్ణమూర్తికి కొడుకు నుండి. సారాంశం ఏమిటంటే 'మీ షష్టి పూర్తి ఫంక్షన్ కి అన్ని ఏర్పాట్లూ చేయమని బలరాం బాబాయ్ కి చెప్పేను. అన్నింటికీ ఖర్చు ఎంతవుతుందో కనుక్కొని చెప్పమని చెప్పేను.ఆ డబ్బులు నేను మీకు పంపిస్తాను. అవి బాబాయికి ఇవ్వండి. అన్ని ఏర్పాట్లూ చేస్తాడు. మీరేం శ్రమ పడనక్కరలేదు. మేము ఆరోజు ఉదయం వస్తాము. సాయంకాలం ఫంక్షన్. ఈ లోపు నాకు రావడం అవదు. అందుకే బాబాయి కి పని పెట్టేను' అని. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. తలుపు తీయగానే బలరామ్ ప్రత్యక్ష్యం. 'బలరాం' రా! రా! నూరేళ్లాయుష్హు. ఇప్పుడే నీ గురించి అనుకొంటున్నా. మావాడు ఫోన్ చేసేడు . నీకూ చేసేడట కదా'? అడిగేడు కృష్ణమూర్తి.

'అవునన్నయ్యా! అభిరామ్ నాకు చెప్పినవన్నీ నీకు చెప్పే ఉంటాడు అందుకే వచ్చేను' అన్నాడు బలరామ్. ఇంతలో అనసూయ 'మరిది గారూ! బాగున్నారా!?' అంటూ వచ్చింది. 'బాగున్నాం వదినా'

'చెల్లెమ్మ ఎలా ఉంది? అని కుశల ప్రశ్నలడిగింది.

ఇంతలో 'అనసూయా! బలరామ్ కి ముందు మంచి స్ట్రాంగ్ కాఫీ పట్టుకురా. టిఫిన్ తయారయేలోపు ' ఆర్డరిచ్చేడు అనసూయ వాళ్లాయన.

'అన్నయ్యా! నా టిఫిన్, కాఫీ అయిపోయాయి. వదినా! నువ్వేం పని పెట్టుకోకు. అభిరామ్ చెప్పిన పని మీద వచ్చేను. ఏమిచేయాలో,ఎలా ఉండాలో,ఏవేవి ఎంతలో ఉండాలో తెలుసుకొందామని వచ్చేను ' అని చెప్పేడు బలరామ్.

'పోనీ కాఫీ తెస్తాను మొహమాటపడకండి ' అంది అనసూయ.

'మీ దగ్గర నాకు మొగమాటమేమిటమ్మా.అన్నయ్య షష్టి పూర్తి ఫంక్షన్ పనులన్నీ నావే.' మీరేం కంగారు పడకండి అన్నట్లు భరోసా ఇచ్చేదు బలరాం.

'సరే! ఈ లోపు అన్నదమ్ములిద్దరూ మాట్లాడుకొంటుండండీ' అంటూ వంటింట్లోకి వెళ్లింది అనసూయ. అనసూయ అలా వెళ్లడమేమిటి తమ్ముడితో మెల్లగా అన్నాడు కృష్ణమూర్తి 'ఏ ఏర్పాట్లూ చేయవద్దు నువ్వు . నీకు తెలుసుగదా నాకిలాంటివి ఇష్టం ఉండవు'

'తెలుసు. కానీ బాబాయ్, అన్ని ఏర్పాట్లూ చేసేసేవా అని అభిరాం అడిగితే ఏం చెప్పను?' అడిగేడు బలరాం.

'అన్నీ చేసేసేను అని చెప్పేయ్' అని సలహా ఇచ్చేడు కృష్ణమూర్తి.

'ఏమిటో నువ్వు అన్నయ్యవి. నేను తమ్ముడ్ని. నువ్వు చెప్పినట్లు నేను చెయ్యాలి. కాని ఈ విషయంలో కృష్ణమూర్తి అంటే నువ్వు ఈ బలరాముడు చెప్పింది వినాలి.' మెలిక పెట్టేడు తమ్ముడు.

అనసూయ వంటింట్లోంచి రావడం చూసి కృష్ణమూర్తి 'ష్! మీ వదిన వస్తుంది. మరేం మాట్లాడకు. నేను చెప్పింది గుర్తుందిగా అలాగే చెయ్యాలి ' అన్నాడు.

అనసూయ వస్తూ మరిదికి కాఫీ ఇచ్చి 'ఇంతకూ ఏర్పాట్ల గురించి కనుక్కున్నారా? అని అడిగింది.

'అన్నీ కనుక్కున్నాను వదినా' అని చెప్దామనే వచ్చేను ' అన్నాడు బలరాం.

'అయితే మా వాడికి లెక్క అంతా చెప్పేవా? అడిగేడు కృష్ణమూర్తి.

'చెప్పేను. నీకూ చెప్తున్నాను చూడు అన్నయ్యా! ' ఫంక్షన్ హాల్ కి 15,000, లైటింగ్,డెకరేషన్ కి 5,000, సౌండ్ సిస్టం కి 5,000, వీడియోకి 10,000, కేటరింగ్ కి 20,000, గిఫ్ట్స్ కి 5,000 మొత్తం 60 వేలు చెప్పేడు బలరాం.

'అయితే అదీ షస్టిపూర్తే అన్నమాట 'అన్నాడు కృష్ణమూర్తి.

'అన్నమాట కాదు తమ్ముడి మాటే' అంది అనసూయ.

'ఏమిటో మీ మాటే చెల్లుతుంది ' అన్నాడు కృష్ణమూర్తి. బలరాం వదిన ఇచ్చిన కాఫీ త్రాగి 'మరి వస్తా అన్నయ్యా' అభిరాం నీకు డబ్బులు పంపాక అవి నాకిస్తే అన్నీ బుక్ చేసేస్తాను.వస్తాను వదినా'అని వెళ్లిపోయేడు.

*********

మరో రెండ్రోజుల్లో కృష్ణమూర్తికి అభిరాం నుండి లక్ష రూ. అందింది. వెంటనే కొడుక్కి ఫోన్ చేసేడు కృష్ణమూర్తి. 'ఏరా! మీ బాబాయి చెప్పిన లెక్క 60 వేలే అయితే లక్ష పంపించే వెందుకూ?' అంటూ.

'ఏం లేదు నాన్నా! అంటే ఎందుకైనా మంచిదని ... అవునూ ఇంతకీ అందర్నీ పిలవడం అయిపోయిందా లేదా?'

'అయిపోయిందిరా!'

'ఏదీ అమ్మకివ్వండి ఫోన్ . ఓ సారి మాట్లాడతాను అనగానే 'ఏమోయ్. నీ గారాల కొడుకు నీతో మాట్లాడతాడట' అని ఫోన్ అనసూయ కిచ్చేసేడు కృష్ణమూర్తి.

'మీ కన్నీ వెటకారమే' అనుకొంటూ ఫోన్ తీసుకొంది. మాట్లాడడం అయిపోయేక 'అవునూ! అందర్నీ పిలవడం అయిపోయిందని చెప్పేరట. ఎక్కడ పిలిచేం? మీరు పిలిచేరా నాకు తెలియకుండా'

'ఎవడి పెళ్ళికి వాడు పిలుచుకోడు కదోయ్. బలరాం ఈ పాటికి అందరికీ ఫోన్ లో చెప్పేసే ఉంటాడు. అయినా ఈ రోజుల్లో ఇంకా పిలుపులేమిటోయ్! వాట్సాప్ లో ఆహ్వాన పత్రికలు పంపించేయడమే' సర్ది చెప్పేడు కృష్ణమూర్తి.

'ఏమిటో మీ వ్యవహారం నాకేదో అనుమానం గానే ఉంది' వ్యక్త పరిచింది అనసూయ.

'అనుమానం ముందు పుట్టి ఆడది తర్వాత పుట్టిందంటారు. నీ పేరేంటి?' అడిగేడు కృష్ణమూర్తి భార్యని.

'అదేంటలా అడుగుతున్నారు? మీకు తెలియదా?' ఎదురు ప్రశ్న వేసింది అనసూయ.

'తెలుసు చెప్పవోయ్!'

'అనసూయ '

'అంటే ఎవరు?'

'మీ భార్యని '

'అదీ తెలుసు. అది కాదు నేనడిగింది. అనసూయ ఓ పతివ్రత. అంచేత నా మాటని గౌరవించడమే నీ ధర్మం'.

'నేనెప్పుడు గౌరవించలేదు? ఈ మధ్య మీరు బొత్తినా నాకు అర్ధం కావడం లేదు' నిష్టూరంగా అంది అనసూయ.

'నీకు అర్ధం కాకపోయినా మిగతా వాళ్లకు అర్ధమయితే చాలు'. అదిసరే. ఉండు బలరాం కి డబ్బులిచ్చేసి వస్తాను. అన్నీ బుక్ చేయాలి కదా' అంటూ బయటికెళ్ళిపోయేడు కృష్ణమూర్తి. *********

షష్ఠిపూర్తి రోజు వచ్చేడు అభిరాం భార్యా పిల్లలతో. బలరాం బాబాయ్ ని రమ్మన్నాడు. బలరాం, సత్య, పిల్లల పలకరింపులయిపోయేయి.

'అన్ని పనులూ అయిపోయాయా బాబాయ్? ఏర్పాట్లన్నీ పూర్తయినట్లేనా?' అని అడిగేడు అభిరాం. 'ఊ' అని తల ఊపేడు బలరాం అన్నయ్య, కృష్ణమూర్తి చేసిన కనుసైగ చూస్తూ.

' నేనూ ఓ సారి అన్నీ చూస్తా' అన్నాడు అభిరాం.

బలరాం కంగారు పడుతూ 'ఎందుకూ? నువ్వు చెప్పినట్లే అన్నీ చేసేను కదా! ఇంకెంతసేపు?' అన్నాడు కృష్ణమూర్తి వైపు చూస్తూ.

'అవునవును' అన్నాడు కృష్ణమూర్తి. 'సరే' అని ప్రయాణ బడలిక తీర్చుకొంటూ అమ్మా నాన్నలతో కబుర్లలో పడ్డాడు . అత్తా కోడళ్ల మాటలతో, తాతా మనవడూ ,మనవరాళ్ల ముచ్చట్లతో ఇంటికి పండుగ సందడి వచ్చింది. 'అమ్మయ్యా' అని బలరాం ఊపిరి పీల్చుకొంటూ 'వస్తాన్రా అభిరాం. రడీగా ఉండండి అందరూ' అని అందరికీ చెప్పి నిష్క్రమించేడు.

*******

సాయంత్రం కృష్ణమూర్తి ఇంటిముందు రెండు కార్లు వచ్చి ఆగేయి. కృష్ణమూర్తి, బలరాం, అభిరాం జంటలూ, పిల్లలతో బయలు దేరేరు. కాని కృష్ణమూర్తి, బలరాం మనసులు మనసులో లేవు. అభిరాం ఏమనుకొంటాడో, ఏమంటాడో? అని. కారు ఆగిన సంగతే గమనించలేదు.

' ఏంటి బాబాయ్! ఇక్కడ ఆపేరు?' అని అభిరాం అడిగేంతవరకూ.

వెంటనే తేరుకొని 'అందరూ దిగండి' అన్నాడు బలరాం.

' ఏంటి? ఇది ప్రేమ సమాజం అనాధాశ్రమం. ఇక్కడేం పని?' అడిగేడు అభిరాం.

'దిగరా చెప్తానూ ' అని కృష్ణమూర్తి అనడంతో అర్ధంకాక అందరూ దిగేరు.

'అందరూ రండి, చెప్తాను' అంటూ కృష్ణమూర్తి నడిచేడు. ఆ అనాధాశ్రమమ నిర్వాహకుడు వచ్చి స్వాగతం పలికి అందరినీ లోపలికి తీసుకెళ్ళేడు. కృష్ణమూర్తి, బలరాం లకు తప్ప మిగతా వాళ్ళెవరికీ ఏం జరుగుతుందో అర్ధం కాలేదు. అనాధాశ్రమ నిర్వాహకుడికి అందరినీ పరిచయం చేసేడు కృష్ణమూర్తి. కృష్ణమూర్తి కార్లో ఉన్న పార్శిళ్ళు తీయించి అక్కడున్న అనాధ పిల్లలందరికీ అభిరాం చేత ఒక్కో డ్రెస్ ఇప్పించేడు .వాళ్లను డ్రస్ లు మార్చుకొని రమ్మన్నాడు. రాగానే వాళ్లకు స్వీట్స్ పంచి పెట్టించేడు. ఆ తర్వాత అప్పటికే రడీ చేసి ఉంచిన స్పెషల్ భోజనం వడ్డించబడింది. ఇదంతా ఫంక్షన్ కి ముందు తంతేమో అనుకున్నారు అభిరాం తో పాటు అందరూ.

'నాన్న గారూ,ఇక వెళ్దామా?' అన్నాడు అభిరాం.

'ఎక్కడీకి రా? అన్నాడు కృష్ణమూర్తి.

'ఫంక్షన్ హాల్ ? ' అన్నాడు అభిరాం.

వెంటనే కృష్ణమూర్తి 'చూడు అభీ! నేను నీకు తండ్రిని, పెద్దవాడిని. అంచేత నీ మనసు బాధ పెడితే చిన్న వాడివైన నిన్ను క్షమించమని అడగలేను. కాని ఇప్పుడు అసలు సంగతి చెప్తున్నాను. ఇదే ఫంక్షన్ హాల్. ఇంతకంటే ఉత్తమమైన ఫంక్షన్ హాల్ ఇంకెక్కడా ఉండదు"

అందరూ నోరెళ్ల బెట్టి వింటున్నారు.

"ఈ పిల్లల కళ్లల్లో వెలుగులే లైటింగ్. వాళ్ల డ్రెస్సులే డెకరేషన్. వాళ్ల కేరింతలే స్టీరియో సౌండ్ ల కన్నా మిన్న . ఇక వీడియో అంటావా , పైన ఉన్న ఆ భగవంతుడే తీస్తున్నాడు. ఈ అనాధ బాలలే మన అతిధి దేవుళ్ళు .తిండికి లోటు లేని వాళ్ళకు విందు ఇచ్చి మిగతాది పారబోసేకన్నా ఒక్కరోజు వీళ్లకు విందు పెడితే మహా పుణ్యం. నేను చేసిన పనికి నీకు కోపం రావచ్చు. కానీ నువ్వు నా షష్టిపూర్తి ఫంక్షన్ కని పంపిన డబ్బులు దేని కోసం? నా ఆనందం కోసమే కదా? ఈ రోజు వీళ్ల మధ్య గడపడంతో నాకు కలిగే ఆనందం పరమానందం. అంచేత నువ్వు పంపిన డబ్బులు ఈ అనాధాశ్రమానికి విరాళంగా ఇచ్చేను. నేను చేసింది తప్పని నీకనిపిస్తే నన్ను మన్నించు" అన్నాడు కృష్ణమూర్తి. అభిరామే కాదు. అక్కడున్న వాళ్లందరికీ నోట మాట రాలేదు.

'అవును బాబాయ్, ఇదంతా నీకు తెలిసే జరిగిందా? మరి అయితే నాకెందుకు చెప్పలేదు?' అడిగేడు అభిరాం బలారాం ని.

'అవున్రా అభిరాం! నాకు తెలియకుండా ఎలా జరుగుతుంది? ఎందుకంటే నువ్వే నాకు అంతా అప్పజెప్పేవు కదా! అయినా మీ నాన్న మాట కాదనలేక పోయేను. ఆయన ఆనందమే మా అందరి పరమానందం. నన్ను క్షమించు ' అన్నాడు బలరాం.

'అదేంటి బాబాయ్! అంతమాటనకు. నాన్న చేసిందీ మంచిదే కదా! నాకా ఆలోచనే రాలేదూ' అనడంతో ఆ అనాధాశ్రమం ఆనందాశ్రమం అయిపోయింది.

***శుభం***

( ఇది అమెరికా అంతర్జాల పత్రిక "వాస్తవం" లో తే.27.08.2016 దీని,అంతర్జాల పత్రిక "ఆఫ్ ప్రింట్" లో తే.24.04.2017 దీని,వసుధ ఎన్విరో/ఆర్.జి.బి.ఇన్ఫో టైన్ లో తే.16.06.2017 దీని ప్రచురితమైంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో తే.14.03.2017 దీని ప్రసారితమైంది. )

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును. మనతెలుగుకథలు.కామ్ లో రచయిత ఇతర రచనలకు క్లిక్ చేయండి పరుగు తెచ్చిన ప్రమాదం ఎవరికెవరు ఏమవుతారో హేట్స్ ఆఫ్ టు వాట్స్ ఆప్ గురు దక్షిణ నేనూ మనిషినే అత్తారింట్లో దారేదీ ( హాస్య కథ ) యద్భావం తద్భవతి

రచయిత పరిచయం : పేరు : పతి.మురళీధర శర్మ ఉద్యోగం : భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ లో సీనియర్ సబ్ డివిజనల్ ఇంజనీర్ గా 2008 లో పదవీ విరమణ స్వస్థలం/నివాసం : విశాఖపట్నం రచనావ్యాసంగం ప్రారంభం : టీ.వీ.కొందాం నాటికతో. అది తే.15.03.1987. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం. నా రచనలలోని వర్గాలు : కథలు, కథానికలు (చిన్న కథలు), బాలసాహిత్యం, కథలు, కవితలు, పద్యాలు, ఆధ్యాత్మిక విషయాలు, వ్యాసాలు , పదరంగం (పజిల్స్), హాస్యోక్తులు (జోకులు) నాటికలు (42), సూక్తిముక్తావళి, చింతన – ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలో ప్రసారితం సమస్యాపూరణలు(126) : దూరదర్శన్ హైదరాబాద్, విజయవాడ కేంద్రాలలోనూ, ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రంలోనూ ప్రసారితం “తప్పెవరిది” నాటిక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కుటుంబ సంక్షేమ శాఖ వారిచే చిత్రీకరించబడి సంచార రథంపై ప్రదర్శింపబడింది. నా రచనలు ప్రచురితమైన పత్రికలు దినపత్రికలు : ఆంధ్రభూమి,ఆంధ్రప్రభ,ఈనాడు వారపత్రికలు : ఉదయం,సుప్రభాతం,ఆబ్జెక్ట్ వన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లిమిటెడ్,హైదరాబాద్ పక్షపత్రికలు : అక్షర తపస్మాన్,జిల్లా సాక్షరతా సమితి,చిత్తూరు మాసపత్రికలు : బాలరంజని, చిత్ర, స్వప్న, విశాలాక్షి, సాహితీకిరణం, సాహిత్యప్రసూన, సృజన విశాఖ, ప్రజ-పద్యం, విశాఖ సంస్కృతి అంతర్జాలపత్రికలు : ప్రతిలిపి, వాస్తవం (అమెరికా), ఆఫ్ ప్రింట్, తెలుగువేదిక, ఆంధ్రసంఘం పూనా 75వ వార్షికోత్సవ సంచిక “మధురిమ” 2017 చిరు సన్మానాలు : 1. సాహితీ సమితి, తుని వారిచే 2.పరవస్తు పద్యపీఠం, విశాఖపట్నం వారిచే దూరదర్శన్ హైదరాబాదు కేంద్రంలో ప్రసారితమైన సమస్యాపూరణ, వర్ణనలకు ఉత్తమ పూరణ, ఉత్తమ వర్ణనలుగా ఎంపికై యువభారతి వారిచే పురస్కారాలు భావగీతి – భావగీతికల సుమవనం (ముఖపుస్తక సమూహం/ఫేస్ బుక్ గ్రూప్) వారిచే హేవళంబి నామ సంవత్సర ఉగాది సందర్భంగా నిర్వహించిన కవిత/పద్య/విశ్లేషణ పోటీలలో ఉత్తమ కవి/రచయితగా బహుమతులు, నగదు బహుమతి, ప్రశంసాపత్ర ప్రదానం “ధరిత్రి “ సాహితీ మిత్రుల సంగమం, మహబూబాబాద్ జిల్లా, తెలంగాణ వారిచే నిర్వహించబడిన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి కవితలు , కథల పోటీలలో ఒక కథకూ, ఒక కవితకూ ప్రశంసాపత్ర ప్రదానం 2015 లో సృజన విశాఖ,గరిమ సాహితీ సాంస్కృతిక సంస్థలు నిర్వహించిన శ్రీ మన్మధ ఉగాది కవి సమ్మేళనంలో జ్ఞాపిక బహూకరణ 2016 లో సృజన విశాఖ ఏడవ వార్షికోత్సవ ఆత్మీయ జ్ఞాపిక బహూకరణ తే.09.04.2017 దీని ప్రజ – పద్యం ( లోకాస్సమస్తా సుఖినోభవంతు ) ఫేస్ బుక్ సమూహం వారి సామాజిక పద్యాల పొటీలో ప్రత్యేక సంచికతో పాటు జ్ఞాపిక బహూకరణ వసుధ ఎన్విరో లేబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి సౌజన్యంతో RGB Infotain ఉగాది 2017 సందర్భంగా నిర్వహించిన కథల పోటీలో “ ఒక్క క్షణం “ కథకు ద్వితీయ బహుమతి ( రు.8000/-) ప్రదానం


95 views0 comments
bottom of page