top of page

పాణిగ్రహణం - 5


'Panigrahanam - 5' New Telugu Web Series



(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)



(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)

జరిగిన కథ....

హంసమంజీర ఒక రచయిత్రి, కవయిత్రి.


ఆమె చెల్లెలు సుగాత్రి.


హంసమంజీర పెదనాన్న పిల్లలు విరూపాక్ష, సాగర మేఖల.


సాగరమేఖల భర్తతో విడాకులు తీసుకున్న విషయం గుర్తుకొచ్చి బాధ పడతాడు విరూపాక్ష.


గతం గుర్తుకొస్తుందతనికి.

సాగరమేఖలకు వివాహం జరుగుతుంది.


ఇద్దరు ఆడపిల్లల తరువాత ఒక అబ్బాయి పుడతాడు.


కుటుంబ పోషణ లో భర్తకు చేదోడుగా ఉండటానికి తను కూడా ఉద్యోగంలో చేరుతుంది సాగరమేఖల.


అభినందించక పోగా అనుమానిస్తాడు భర్త.

అవమాన భారంతో ఆత్మహత్యకు ప్రయత్నిస్తుంది సాగరమేఖల.

హాస్పిటల్ లో కోలుకుంటుంది.

భర్తను, పిల్లల్ని వదిలి హైదరాబాద్ లో ఉద్యోగం చూసుకొని ఒంటరిగా ఉంటుంది ఆమె.

ఫోన్ రావడంతో గత కాలపు ఆలోచనలనుండి తేరుకుంటాడు విరూపాక్ష.

ఇక పాణిగ్రహణం ధారావాహిక ఐదవ భాగం చదవండి.


విరూపాక్ష ఫోన్ లో విషయం విని స్థాణువులా అయ్యాడు.

"అవును కేసువేసిందట. "

"అదేంటి ఆడపిల్లను తీసుకునిపోయిందిగా, ఎక్కడ ఎలాబ్రతుకుతోందిట?" విరూపాక్ష నొసలు ముడేస్తూ అడిగాడు.


అవతల్నించి ఏదో మాట్లాడారు.

"విడాకులకోసం అంత తొందరేంటిట?"


కాసేపు సంభాషణ తర్వాత ఫోన్ కట్ చేసి,

మళ్ళీ సోఫాలో కూలబడ్డాడు విరూపాక్ష.


"మళ్ళీ ఏమైందిరా విరూ!" తల్లి అడిగింది.

"అదేనమ్మా! మన లక్ష్మణ భార్య విడాకులకు పెట్టిందిట. "


"అదేమిట్రా!? ఇప్పటికి ఎన్ని విడాకుల కేసులు విన్నామో... ఏం జరిగిందో?.... లక్ష్మణ్ మంచిపిల్లవాడేనే!"

"అవును! చిన్న ఉద్యోగం.... చాలీచాలని సంపాదనతో నెట్టుకొస్తున్నాడు..... " అంటూనే పరధ్యానంగా లక్ష్మణ గురించి ఆలోచిస్తున్నాడు.


లక్ష్మణ చాలా అమాయకుడు. తనను ఆప్యాయంగా "అన్నయ్యా " అంటూ పిలిచేవాడు.

విరూపాక్ష ఆఫీసుకు వెళ్ళేటప్పుడూ.... నవ్వుతూ పలుకరించేవాడు.

తనకళ్ళముందే తన ఆధ్వర్యంలోనే పెళ్ళయింది. భార్య సునీలబీదింటిపిల్లే. చక్కనిదే. చదువుకోలేదు, కానీ చాలా తెలివైంది. అందరితోనూ కలివిడిగా, కపటం లేకుండా మాట్లాడుతూ ఉండేది.


ఆడపిల్ల పుట్టాక లక్ష్మణ సంపాదన సరిపోవటం లేదని....

"వేణ్ణిళ్ళ కి చన్నీళ్ళ లాగా సంపాదనకు, నేనూ ఏదైనా చేస్తే బాగుంటుందేమో! తర్వాత ఇంకో, పిల్లో, పిల్లవాడో పుడితే... ఖర్చులు పెరుగుతాయిగా... ఏం చేస్తే బాగుంటుంది?"


తననూ, తోటివాళ్ళను అడుగుతూ ఉండేది. మళ్ళీ తానే.. చిన్నబుచ్చుకుంటూ... "నేను చదువుకోలేదుగా! నాకు ఉద్యోగం ఎవరిస్తారూ?! బడ్డీకొట్టు పెట్టి, దానిమీద ఆదాయంతో, మెస్ పెడదామనుకుంటున్నానన్నా!

అప్పుఇచ్చి సాయంచేస్తే.... కొంచెం పుంజుకున్నాక మీడబ్బులు మీకిస్తానన్నా!" అడిగింది విరూపాక్షని, లక్ష్మణ పెళ్ళాం సునీల.


"అయ్యో! దానిదేం ఉందమ్మా. లక్ష్మణ నాకు బాగా తెలిసినవాడేగా! ఎంతకావాలో తీసుకో! తీర్చటం సంగతి తర్వాత.... ఆడపిల్లవి!... సొంతకాళ్ళమీద నిలబడి వ్యాపారం చేసుకుంటానంటే... నా చేతనైన సాయం నేనుచేస్తా! " అంటూ లక్షరూపాయలు అప్పుఇచ్చాడు.


భర్తసహకారంతోనే బడ్డీకొట్టు పెట్టింది....

పగలూ, రాత్రీ బాగానే కష్టపడింది.

మంచి సెంటర్ కాబట్టి, బడ్డీ కొట్టు

బాగానే సాగింది.

విరూపాక్ష అప్పుని నిదానంగా తీర్చేసింది.


మెస్ పెట్టింది. చాలామంది కాలేజీ పిల్లలకు భోజనాల కార్డులిచ్చింది. పొరుగూరునుండి, భార్యాపిల్లలను వదిలి, ఇక్కడ ఉద్యోగానికి వచ్చిన మగవారికి, ఈ మెస్ వసతిగా, చక్కని భోజనం..... అందిస్తోంది.


ఇంతలో ఏమైంది? లేచిపోవటం అంటే? ఎన్ని అర్ధాలనర్ధాలూ? చెప్పకుండా పోయింది అనా? పుట్టింటికిపోయి రాకుండా భీష్మించుకు కూర్చుంటే.... దాన్నే అందరూ లేచిపోవటం అనుకుంటున్నారా?


లక్ష్మణకి ఫోన్ చేస్తే.... "ఏమో! బట్టలూ నగలూ... ఏవో డాక్యుమెంట్స్ తీసుకుపోయింది. కారణం తెలీదు.

ఎక్కడికి పోయిందో తెలీదు" అన్నాడు.


"ఇదేం విడ్డూరం!? పుట్టింటివాళ్ళకైనా తెలుస్తుందిగా! "

"ఇంకో విడ్డూరం అన్నయ్యా! ఆమె పుట్టింటివారు వాళ్ళు,

మా అమ్మాయిని, నువ్వు టార్చర్ పెడుతున్నావు! మా అమ్మాయికి, రావాల్సిన ఆస్థి లావాదేవీలు మా అమ్మాయికి ఇచ్చేయండి. ఆమె మీతో కాపురంచేయనంటోంది అంటున్నారు. "


"నా దగ్గర నా ఒంట్లోని అస్థికలు తప్ప, ఆస్థులూ అంతస్థులు ఏం ఉన్నాయో! వాళ్ళకి తెలీదా? అడిగినవన్నీ ఇవ్వడం అంత తేలికా? అన్నయ్యా!? ప్రకృతిని బట్టే మానవుడి నడక... ప్రకృతి రోజుకి ఎన్నిరకాలుగా మారుతోందో?! బుద్దులూ క్షణానికో రకంగా మారుతున్నాయ్. "


"బీభత్సమంటే ప్రకృతికేం తెలుసు? మనిషినడిగితే చెబుతాడు భయానక బీభత్స రౌద్ర రసాలన్నీ....

క్షణమో రకం, పూటకో తీరూ

కాసేపు కౌగిలింతల స్నేహం

మరికాసేపు విషంచిమ్మే విరోధం

పట్టరాని నవ్విస్తూ....

క్షణంలోనే మోసం చేసేసి

అంతులేని దు:ఖంలోకి తోసేసీ...

మరి పర్యావరణం?!

ఎడతెగని ఎండ... అంతలోనే

కుండపోత వాన...

ఉక్కపోతకు ముక్కిపోత..

గజగజ వణికించే చలి...

క్షణమెుకతీరు, రోజుకోరీతి...

ప్రకృతి లోంచి ఉధ్భవించిన మానవుని ఉనికా?!

స్వార్థ పరుడైన మానవుని లోని ప్రకృతి

వైపరీత్యమా?!

కూర్చున్న కొమ్మను నరికేసే మానవనైజం...

మానవునికి గుణపాఠంనేర్పే ప్రకృతి బీభత్సం...

ఒకరిలో ఒకరు సంలీనమైన స్నేహమే...

ఒకరి తో మరొకరు నెరిపేది బీభత్సమే..

పంచభూతములతో మమేకమై...

చెట్టూ పుట్టా గాలి నిప్పూ నీరూ..

ప్రకృతి ఆరాధనలోని ఆధ్యాత్మికతో...

బీభత్సరహిత పర్యావరణానికి

కృషి చేసే మానవుడే మహనీయుడు.... "

కవిత చెబుతుంటే విన్న విరూపాక్ష....

"లక్ష్మణా! నీలో ఇంత విషయపరిజ్ఞానం ఉందా? నువ్వూ కవివేనా? నేనేనా కవికానిదీ? "ఆశ్చర్యం గా అడిగాడు.


"నువ్వు కవివి కాదన్నవాణ్ణి కత్తితో పొడుస్తాను." పకపకా నవ్వాడు లక్ష్మణ. శృతి కలిపాడు విరూపాక్ష.


"లేకుంటే ఏమిటన్నయ్యా! మగాడుకాదు అని నిందవేయటానికి, మాఇద్దరికీ పుట్టిన పాప ఉందిగా! అందుకని టార్చర్ పెడుతున్నానని నిందవేసింది. పోనీ అత్తామామా టార్చర్ పెడుతున్నారని చెప్పటానికి, మేం వేరే, అమ్మానాన్న వాళ్ళు వేరేగా ఉంటున్నాం గదా! ఇంకా నయం

మీ అప్పు మీకు తీర్చింది నయం! " అన్నాడు.


"లక్ష్మణా! నా బాకీ సమస్య కాదు ఇక్కడ.... కారణం తెలియాలిగా?! నువ్వు టార్చర్ పెట్టడం అనే కారణం హాస్యాస్పదం గా ఉంది. నీకు నోట్లోంచి మాటేరాదు సరిగా!

వ్యాపారంలో గానీ, ఇంట్లోగానీ, ఆర్థికంగా పెత్తనం అంతా ఆమెదేగా!? అదే తప్పా? అర్ధంకాలా!? "

"నాకు అర్ధమయితేగదా! అన్నయ్యా నీకు చెప్పేదీ!? కొన్నాళ్ళు మెదలకుండా ఉంటేసరి! ఆమెకూ, తెలిసివస్తుందిగా! షాప్ ను మూయను. మా తమ్ముడు, మరదలికి ఇస్తా. వాళ్ళే నడుపుకుంటారు " అని లక్ష్మణ తో పాటు, అందరూ ఊరుకున్నారు.


"ఇది జరిగి రెండేళ్ళయింది. ఆమే తిరిగి వస్తుందనుకుంటే ఇప్పుడు విడాకుల నోటీసు ఏమిటీ? "

ఆలోచనల్లోంచి తేరుకుని....

"లక్ష్మణా! నేనువిన్నది నిజమేనా!? " ఫోన్ చేసాడు విరూపాక్ష.


"నిజమే అన్నయ్యా! మెస్ మీద ఆదాయం బాగానే వస్తోందిగా! ఎక్కడనుండి తెలుసుకుందో! మెస్ తనకి అప్పగించి విడాకులివ్వాలని, పెట్టింది. "


"కారణం ఏమిటో?"

"నాకుతెలుస్తేగా!? ఊళ్ళోకి వస్తోందిట. చూసినవాళ్ళు చెప్పారు. ఇంటికి రావట్లా. నాపిల్లని నాకు చూపించమంటే, నాతో ప్రాణహాని ఉన్నది పిల్లని పంపనని లాయర్ తో కబురు చేసింది. ఏంటిదంతా అన్నయ్యా!?" అంటున్నాడు.


ఆలోచనలకు అందట్లేదు. ఏదో జరగకూడనిదే జరిగింది. లేకపోతే ఊళ్ళోకి వచ్చి, ఎవరికీ కనబడకుండా పోవటం ఏమిటీ? కనీసం మెుగుడికి కూడా! ఏ కారణంలేకుండానే ఇంత జరుగుతుందా?


లక్ష్మణకు తెలీదంటున్నాడు. నిజంగానే తెలీదా? తెలిసినా నాకు చెప్పటానికి తను ఇష్టపడటంలేదా!? ఏదో ఉంది.

ఆ మిష్టరీ ఏంటీ!? ఆలోచిస్తున్నాడు విరూపాక్ష.

=============================================

సశేషం


=============================================

భాగవతుల భారతి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు ఇక్కడ క్లిక్ చేయండి.

కథలు, నవలలు మరియు జోకుల పోటీల వివరాల కోసం


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



Twitter Link

Podcast Link

ఇప్పుడు మనతెలుగుకథలు.కామ్ లో ప్రచురింపబడ్డ కథలను ఈ క్రింది లింక్ ద్వారా వినవచ్చును.

లింక్ క్లిక్ చేసి, google podcast/spotify podcast/apple podcast లలో మీకు అనువైన దానిని ఎంపిక చేసుకొని మంచి కథలను చక్కటి తెలుగు ఉచ్చారణలో వినండి.


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం : నావివరములు.... పేరు భాగవతుల భారతి Double M.A., B. Ed భర్త... శ్రీనివాస్ గారు (లెక్చరర్) వృత్తి... గృహిణి, నిత్యాగ్నిహోత్రము, వేదాధ్యయనము, స్వాధ్యాయం

ప్రవృత్తి... రచనలు.. పద్యాలూ, వ్యాసాలు, కథలు, కవితలు, వచనకవితలు.

ప్రచురణలు.... అనేక ప్రముఖ పత్రికలలో

బహుమతులు... ప్రైజ్ మనీ తో కూడిన అనేక బహుమతులు.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు.








78 views1 comment
bottom of page