top of page

అఘాయిత్యం

#UndavilliM, #ఉండవిల్లిఎమ్, #Aghayithyam, #అఘాయిత్యం, ##TeluguHeartTouchingStories


Aghayithyam - New Telugu Story Written By Undavilli M

Published In manatelugukathalu.com On 18/04/2025

అఘాయిత్యం - తెలుగు కథ

రచన: ఉండవిల్లి.ఎమ్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



ఆరోజు సాయంత్రం స్కూలు నుండి రాగానే, సిస్త్క్ క్లాస్ చదూతున్న అక్షర, పుస్తకాల బ్యాగ్ ని పక్కకు గిరాటేసి, సోఫా మీద చతికిలబడిపోయింది. కడుపులో ఏదో అలజడి, తరచూ అక్షరకి ఆరోగ్యం బావుండటం లేదు. ఎవరికీ ఏమీ చెప్పలేకపోతుంది. 


సోఫామీద పడుకున్న అక్షరని వాళ్ళమ్మ సునంద వచ్చి "ఏమైందే!?" అని అడిగింది. 


"కడుపులో బాలేదమ్మా" అంది అక్షర. 


"నొప్పా! అయినా, మామిడి ముక్కలు కోసుకుని, అలా ఉప్పుకారం వేసుకుని తినొద్దంటే వినవు!" అంటూ వంట గదిలోకెళ్ళి, ఉప్పునీళ్లు తెచ్చిచ్చింది. ఆరోజు రాత్రి వామన్నం చేసి పెట్టింది. 


అక్షరలో ఏ మార్పు రాలేదు, సునందకి అర్ధం కాలేదు. 

గారాల కూతురు కాబట్టి, ఆనంద్ కి మనసు కుదుర్లేదు. మర్నాడు స్కూలుకి సెలవు పెట్టించి, హాస్పిటల్లో చూపించాలనుకున్నాడు. ఆరోజు రాత్రి ఆనంద్ కి సరిగా నిద్రపట్టలేదు. ఈ మధ్య అక్షర డల్ గా ఉంటుంది. సుమారు మూడు నెలల్నుంచి మౌనంగా ఉండటం, భయంగా తిరగడం, ప్రోగ్రెస్ రిపోర్టులో అనూహ్యంగా మార్కులు తగ్గుముఖం పట్టడం, ఇవన్నీ దేనికి సంకేతాలో, విషయమేమై ఉంటుందోనని పదే పదే ఆలోచన్లు అనంత ముఖాలుగా పరుగెడుతున్నాయి. 


మర్నాడు౼

భార్య సునందతో అక్షరని హాస్పిటల్ కి తీసుకెళ్లాడు. లోపల డాక్టరు దగ్గర, స్కెతస్కోప్ తో చెక్ చేశాక "ఎప్పట్నుంచమ్మా నొప్పి" అని అడిగారు. 


"నిన్నటినుంచి" అంది అక్షర. 


"ఎందుకో నాకు బాగోదంకుల్" అంది. 


అన్నీ చూసాక, కొన్ని రకాల పరీక్షలు చేయించమని ప్రిస్క్రిప్షన్ రాసిచ్చారు. హాస్పిటల్ లొనే ఉన్న ల్యాబ్ లో అక్షర బ్లడ్ ఇచ్చి, ముగ్గురూ హాల్లో కూర్చున్నారు. 

కడుపు నొప్పికి సింపుల్ గా రాసే మాత్రలకి, ఇన్ని పరీక్షలు ఏమిటో సునంద, ఆనంద్ లకు అర్ధం కాలేదు. 


రిపోర్ట్స్ నేరుగా డాక్టరు గారి గదిలోకి వెళ్లిపోయాయి. రిపోర్ట్స్ ఎలా ఉన్నాయని ల్యాబ్ టెక్నిషియన్ని అడిగితే "డాక్టరు గారు చెప్తారు. లోపలికెళ్లండి" అన్నాడు.

 

రిపోర్ట్స్ అన్నీ తిరగేసి, అక్షరని నర్సుతో బయటికి పంపించి, డాక్టరు గారు ఇద్దరికీ అసలు విషయం చెప్పారు. 


సునంద, ఆనంద్ లు షాకై పోయారు. నమ్మలేకపోయారు. ఏం మాట్లాడలేకపోయారు. 

"కంగారు పెట్టకండి, జాగ్రత్తగా వ్యవహరించాలి" అని ఆఖరి సారిగా చెప్పిన డాక్టరు గారి మాటలు చెవుల్లో మారుమ్రోగుతున్నాయి. 


అక్షరని తీసుకుని గబగబా ఆటోలో ఇంటికి చేరిపోయారు. లోపలికెళ్లి, తలుపు వేసి, అక్షరని కూర్చోబెట్టి గుచ్చిగుచ్చి ప్రశ్నలు సంధించారు. అక్షర ఏమి చెప్పలేక, భయపడి పోతోంది. పదిహేను వారాల గర్భిణీ అని ఎవరికైనా తెలిస్తే, పరువేం కాను, పిల్ల భవిష్యత్తు ఏమిటో అంటూ సునంద ఏడుపులంకించుకుంది. 


ఆనంద్ దిగాలు పడిపోయాడు. ఏమి చేయాలో, ఎలా అర్థం చేసుకోవాలో ఇద్దరికీ అంతుపట్టడం లేదు. వాళ్ళ లోపలి బాధకి నివారణ మార్గం వెతకలేక పోతున్నారు. ఆరోజు అక్షరని పడుకోబెట్టి, భార్య భర్తల మధ్య చాలా ఆవేదన పూరిత మాటలు తెల్లవార్లూ జరిగాయి. మర్నాడు స్కూలుకి పంపించలేదు. 


ఉదయం మెల్లగా అక్షర నుండి విషయం రాబట్టారు. ఆ వీధిలోని తేజ పేరు చెప్తూ భయంతో వణికి పోయింది. సునంద మంచి నీళ్ళు పట్టించింది. 


"ఏం చేశాడు!?" సునంద అడిగింది. 


"ఆ అంకుల్ ఏదేదో చేసేవాడు, ఎవరికైనా చెప్తే, చంపేస్తానన్నాడు" అని కళ్ళు పెద్దవి చేసి తల్లి వైపు చూస్తుండిపోయింది అక్షర. 

ఇద్దరికీ విషయం అర్థమైపోయింది. రెండిళ్ల ఆవల ఉండే తేజ తరచూ వస్తుంటాడు. అక్క, బావ అంటూ ఇద్దర్నీ పలకరిస్తాడు. బిస్కట్స్, చాకలెట్స్ తెస్తాడు. దారిలో ఆపి, ఇంట్లోకి రమ్మని బిస్కట్ పాకెట్స్, చాకలెట్స్ ఇచ్చేవాడంట.

 

బయటికి ఈ విషయం తెలిస్తే, ఏమవుతోందని, దిగమింగుకోలేక, అన్నం సహించడం లేదు వాళ్ళకి. ఆరోజు స్కూలుకి ఆనంద్ తీసుకెళ్లాడు. "ఎవరేమని అడిగినా జ్వరమని చెప్పు స్కూల్లో" అని ముందే చెప్పి ఉంచాడు. 


అక్షరని రోజూ స్కూలుకి ఆనంద్ తీసుకెళ్లి, తీసుకొస్తున్నాడు. ఆందోళనతో పాటు, అక్షర ఆరోగ్యమూ పాడవుతుందని తెలుస్తూనే ఉంది. ఏం చేయాలో తెలియని స్థితిలో రెండు వారాలు గడిచి పోయాయి. సునంద తన తమ్ముడు చైతన్యని అర్జన్టు గా రమ్మని ఫోన్ చేసింది. 


చైతన్య హుటాహుటిన ఊడిపడ్డాడు. విషయం తెలుసుకుని, హతాశుడయ్యాడు. ఉద్రేకంతో ఊగిపోయాడు. "ఇలాంటి వాళ్ళని ఊరికే వదిలేయకూడదు. పోలీస్ రిపోర్ట్ ఇచ్చి, లోపలేయించాలి. నలుగురికీ తెలిస్తే బుద్ధొస్తుంది వెధవకి" అంటూ రంకెలు వేసాడు. 


"వాడితో పాటు మన పిల్లా నలుగురికి తెలుస్తుంది కదరా" అంది సునంద. 


"మన పేరు బయటికి రాకుండా, వాడ్ని లోపలపెట్టి కుమ్మేయ్యాలి" అన్నాడు చైతన్య. 

"మన పిల్లని ఇప్పుడేం చేయాలో చూడు, తర్వాత వాడి సంగతి చూద్దాం" అన్నాడు ఆనంద్. 


వీళ్ళకి ధైర్యాన్ని కలిగించి, పోలీస్ కంప్లైంట్ ఇప్పించాడు చైతన్య. తేజ అనేవాడు ఈ విషయాన్ని ముందుగానే గ్రహించి కనపడకుండా పోయాడు. వాడిదేవూరో ఎవరికీ తెలియదు. ఎక్కడ పన్జేసేవాడో తెలీదు. చిట్స్ వసూళ్లు చేస్తానని చెప్పేవాడు. 


పోలీస్ స్టేషన్ కి వెళ్ళాక, అబార్షన్ చేయించడానికి ఇబ్బందిగా మారింది. "పర్మిషన్ లేకుండా అబార్షన్ చేయకూడదు. పర్మిషన్ తెచ్చుకోండి. కావాలంటే విషయం బయటకు రాకుండా చూస్తాం" అన్నారు స్టేషన్లో. 


తలనొప్పిగా తయారైం "నాకేం అయిందమ్మా" అన్న అక్షర ప్రశ్నకు సునంద, ఆనంద్ లకు ఏం చెప్పాలో తెలీలేదు "ఏదో కాయ కడుపులో కాసింది. మందులతో తగ్గిపోతుంది" అని చెప్తున్నారు. 


ఎవరికీ తెలియకుండా, రహస్యంగా జిల్లా మెడికల్ హెల్త్ ఆఫీసర్ కి పర్మిషన్ కొరకు దరఖాస్తు పెట్టారు. 


సరైన కారణాలు, రుజువులు లేకుండా గర్భస్రావం చేయడం కుదరదన్నారు. అవన్నీ రుజువు చేసే సమయం, సందర్భం కాదని చెప్పినా విన్లేదు. ఎవరికీ తెలియకుండా చేయడానికి, పోలీస్ స్టేషన్ లో కేసు ఫైల్ అయివుంది. చేసేది లేక హైకోర్టులో దావా వేశారు. 

హైకోర్టులో వాదనలన్నీ విన్నాక, మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ(ఎం. పి. టి)చట్టం ప్రకారం ఇరవై వారాల లోపు కాబట్టి, గర్భస్రావానికి అనుమతి మంజూరు చేస్తున్నాం. కానీ, సాధ్యాసాధ్యాలని పరిశీలించి, ఆ అమ్మాయి ఆరోగ్య స్థితిని ఇద్దరు సీనియర్ డాక్టర్ల పర్యవేక్షణతో కూడిన పరిశీలన పత్రాన్ని కోర్టుకు సబ్మిట్ చేయాలని మెడికల్ రీసెర్చ్ సెంటర్ ని ఆదేశించింది. 


ఆ నివేదికను బట్టి ఆర్డర్ మంజూరు చేస్తామని ఆర్డర్ డిక్లేర్ చేసింది. మెడికల్ రిపోర్ట్స్ వ్యతిరేఖంగా వచ్చాయి. చైతన్య, ఆనంద్ లు, ముందుగానే డాక్టర్ని సంప్రదించారు. రిపోర్ట్స్ అనుకూలంగా మారిస్తే, ఎంత కావాలన్నా ఇస్తామన్నారు. 


దానికి డాక్టర్ ఒప్పుకోలేదు. బి. పి కంట్రోల్ కి రావాలి. హిమోగ్లోబిన్ పర్సన్టేజ్ ఆడవాళ్లకు పదివరకైనా ఉండాలి. పదిలోపు ఏడు, ఎనిమిది శాతాలుంటే గర్భస్రావం చేయడం తల్లికి ప్రమాదం. అలాగని ఎవరిదైనా రక్తం ప్యాకెట్స్ ఎక్కిస్తే, రక్తం తాలూకా వాళ్ళ కాంప్లికేషన్స్ అన్నీ తల్లికి వచ్చే అవకాశాలు ఎక్కువ. 


ఈ విషయం డాక్టరు వీళ్ళిద్దరికీ వివరించడంతో బాగా అర్ధమైంది. రక్త హీనతని అధికమించాలంటే ఐరన్ సుక్రోజ్ ఇంజెక్షన్స్ ఎప్పటికప్పుడు వాడుతూ, చెక్ చేయించుకుంటూ ఉండాలి. కండీషన్ బాగున్నాక అబార్షన్ చేయొచ్చు. 

కోర్టు కూడా రిపోర్ట్స్ చూసాక ఇలాగే చెప్పింది. ఆమె రక్తహీనత సమస్యని, మందులు వాడి, మెరుగుపడ్డాక అనుమతి ఇస్తామన్నారు. చేసేదేమిలేక డాక్టరు చెప్పిన ప్రకారం కోర్సు వాడటం మొదలు పెట్టారు. అక్షరలో మెల మెల్లగా మార్పులు వస్తున్నాయి. ఆమెని పరిపుష్టంగా తయారు చేశారు. ఈ గండం గట్టెక్కడానికి శతకోటి దేవతల్ని ప్రార్ధించారు. 


అక్షరలో హిమోగ్లోబిన్ పర్సంటేజ్ పెరిగి, మెడికల్ రిపోర్ట్స్ రావడానికి, ఐదువారాలు పట్టింది. కానీ, ఇరవై వారాలు దాటిన తర్వాత గర్భస్రావం తల్లికి ప్రమాదం తెచ్చి పెడుతుంది. అదీకాక పదకొండేళ్ల బాలిక. కోర్టు దానికి అనుమతి ఇవ్వలేదు. 


అప్పటి వరకు ఏదో జరుగుతుందనుకున్న కుటుంబం కుప్పలా కూలిపోయింది. దిగాలు పడి, విపరీత మానసిక వత్తిడితో, వాళ్ళ పరిస్థితి దిగజారింది. సొసైటీ లో వాళ్ళ స్థితి, అక్షర భవిష్యత్ కళ్ళల్లో మెదలి కన్నీళ్లే మిగిలాయి. 

ఇంటి ఆవరణలో బయట అందరూ కూర్చుని ఉన్నారు. అక్షరకి ఏమి తెలియడం లేదు. బయట పిల్లలందరూ ఆడుకుంటున్నారు. 


"నేనూ అడుకుంటాను నాన్న ప్లీజ్.. " అన్న అక్షర మాటకి ఆనంద్ కదలిపోయాడు. ఏమి సమాధానం చెప్పలేక, కళ్ళల్లో కన్నీళ్లు చిప్పిల్లాయి. ఆపుకోలేని బాధతో కూతుర్ని రెండు చేతుల్తో బాహువుల్లో బంధించి దుఃఖించాడు. 


నీతి, సంప్రదాయం, గౌరవాలతో ఉన్న తన కుటుంబపు పరిస్థితిని తలచుకుని బాధని దిగమ్రింగలేక పోయాడు ఆనంద్. ఎన్నో రకాలుగా ఆలోచించి, ఆనంద్, చైతన్యలు పోలీస్ స్టేషన్లో మీడియాకి ఈ విషయం తెలియనివ్వొద్దని తెలిపి, మా కుటుంబాన్ని దయచేసి అల్లరిపాలు కానివ్వొద్దని ముందస్తుగా వేడుకున్నారు. 


ఆనంద్ అకస్మాత్తుగా నిర్ణయం తీసుకుని, ఉన్న ఇంటిని అద్దెకు ఇచ్చేసి, మరో ఉద్యోగం వెతుక్కుని, వేరే ఊరికి తన కుటుంబంతో షిప్ట్ అయ్యాడు. 


చుట్టు పక్కల వారితో పరిచయం లేకుండా, జనంలో కల్సి జీవించడం మానేసి, నిరాధారంగా కాలాన్ని వెళ్ల బుచ్చారు. అక్షర ఆరోగ్యాన్ని పరిరక్షించుకుంటూ, కాలం ఇట్టే గడిచిపోయింది. అక్షర వేసే ప్రశ్నలకి అబద్ధపు జవాబులు చెప్తూ, ఎవరికీ ఇలాంటి సమస్యలు రాకూడదని రోజూ దేవుళ్ళకి మొక్కారు. 


ఇరవై ఎనిమిది వారాలు దాటగానే అక్షరకి డెలివరీ సిట్యువేషన్ ఏర్పడింది. హాస్పిటల్ లో అడ్మిట్ చేశారు. సిజేరియన్ చేసి బిడ్డను తీయాలన్నారు. అడ్మిట్ కార్డ్ లో తల్లి పేరు రాసారు. ఇవన్నీ భయాన్ని కలిగించాయి. భీతితో అయోమయ స్థితిని మనసుకి తగిలించుకుని, యాంత్రికంగా పన్లు చేస్తున్నారు. 


తల్లి పేరు ఏమిటని ఆడిగినప్పుడే సునంద, ఆనంద్ లు బిక్కమొహాలు వేశారు. చిన్న పిల్లకి ఇలాంటి పరిస్థితి. పైగా సిజేరియన్ చేస్తే, పొట్ట మీద చిన్నపాటి గుర్తయినా సజీవ సాక్ష్యానికి రుజువుగా నిలబడుతుంది. మాములు డెలివెరీకి గట్టి ప్రయత్నం చేస్తే, తల్లి ప్రాణానికే ప్రమాదం అన్నారు. 


గత్యంతరం లేని పరిస్థితిలో సిజేరియన్ జరిగింది. అమ్మాయి పుట్టింది. తల్లీ బిడ్డా క్షేమంగా బయట పడ్డారు. బిడ్డని ఏం చేయాలో తెలియని మీమాంస. 


చైతన్య "ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి డొనేట్ చేద్దాం" అన్నాడు. 


"మనమే తీసుకెళ్లి పోయి దత్తత తెచ్చుకున్నామని చెబుదాం" అంది సునంద, ముందుగా పుట్టడం వల్ల బిడ్డని మాత్రం ఎన్. ఐ. సియు(నియోటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్)లో రెండు నెలలు ఉంచాలన్నారు. ఈ లోపుగా నిర్ణయం తీసుకోవాలి. అక్షరను మాత్రం పదిహేను రోజుల తర్వాత ఇంటికి పంపించేశారు. 


"అక్కా!, టీవీలు, మొబైల్స్, మన పిల్లకి దూరంగా ఉంచి, మనం జాగ్రత్త వహించినా, అవతలి వారు కూడా ఇవన్నీ చేయాలి కదా!, ఇలాంటి వారి నుండి, మనం ఎప్పుడూ జాగరూకత తోనే ఉండాలి" అన్నాడు చైతన్య. 


ఆడుతూ, పాడుతూ లోకమంటే తెలియని ఆడపిల్లకి జరిగిన తీరు! సునందలో కళ్ళు చెమ్మగిల్లాయి. 


ఆనంద్ లో ఆలోచనలు ముంచెత్తాయి. అక్షర చదువు దీనివల్ల ఆపకూడదని, ఆమెకు అనుక్షణం అండగా నిలబడి, ఈ గాయం మర్చిపోయెంతగా, ఇలాంటివి ఎదుర్కొనేంతగా మానసిక స్థైర్యాన్ని కలిగిస్తూ, ఆమెను తీర్చి దిద్దాలనే పట్టుదల పెరిగింది.


సమాప్తం. 

 ౼౼౼౼౼

ఉండవిల్లి.ఎమ్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం: ఉండవిల్లి.ఎమ్

ఇప్పటి వరకు వివిధ దిన, వార, మాస, పక్ష, రేడియోలలో కలిపి 150 కథలు, 200 వరకు కవితలు వచ్చాయి. 

'శిధిల స్వరాలు ' కవితా సంపుటి, ' అంకితం ' కథా సంపుటి, నిశ్చల నవల, ' ఒక దేహం - అనేక మనసులు ' నవలలు పుస్తక రూపంలో వచ్చాయి. 

 నిశ్చల నవల, అంకితం కథా సంపుటి కన్నడంలోకి అనువాదం అయ్యాయి. 


చాలా కథా, కవిత సంకలనాల్లో కథలు, కవితలు వచ్చాయి. 

 అనేక మనసుల్ని కథల్లో, నవలల్లో దృశ్యమానం చేయడం ఇష్టం! 


Comments


bottom of page