పరివర్తన
- Neeraja Prabhala
- Dec 22, 2024
- 7 min read
#NeerajaHariPrabhala, #నీరజహరిప్రభల, #పరివర్తన, #Parivarthana, #TeluguKathalu, #తెలుగుకథలు

Parivarthana - New Telugu Story Written By Neeraja Hari Prabhala
Published In manatelugukathalu.com On 21/12/2024
పరివర్తన - తెలుగు కథ
రచన: నీరజ హరి ప్రభల
(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)
అప్పుడే ఆఫీసు నుంచి ఇంటికి వచ్చి భార్య మంజుల ఇచ్చిన కాఫీని త్రాగుతూ ఆమెతో కబుర్లు చెబుతున్న రమణ సెల్ ఫోన్ రింగవగానే లిఫ్ట్ చేశాడు.
“హలో! నేను జగదీష్ ని. మీరంతా ఎలా ఉన్నారు? అమ్మని ఇంకో రెండురోజులలో నీవద్దకు తీసుకెళ్లాలి కదా! గుర్తుచేస్తున్నాను. నా వద్ద ఉండాల్సిన ఆరునెలలు గడువు పూర్తయింది. నీవొచ్చి ఆవిడని తీసుకెళ్లు” అన్న తన తమ్ముడు జగదీష్ మాటలకి తృళ్లిపడ్డాడు రమణ.
“వస్తాలేరా! గుర్తుందిలే!” అని ఫోన్ పెట్టేసి మంజులతో తమ సంభాషణ చెప్పి “రేపే వెళ్లి అమ్మను తెస్తాను”. అన్నాడు రమణ.
అది విన్న మంజులకు గొంతులో వెలక్కాయ పడ్డట్టయి ముఖంలో రంగులు మారాయి. అత్తగారు వస్తే తనకి తలకు మించిన బాధ్యత. ‘ఇటీవలే తన రెండవ కూతురి పెళ్లి బాధ్యత నెరవేరిందనుకుని ఇప్పుడే కాస్త ప్రశాంతంగా ఉన్నాము అనుకుంటే ఇప్పుడిదొకటా?” అని మనసులో అనుకుని వంటగదిలో మిగిలిన పనిని పూర్తి చేసుకునేందుకు లోపలికి వెళ్లింది మంజుల.
ఆ మరునాడు ఆఫీసుకు సెలవు పెట్టి తమ్ముడు ఉన్న ఊరికి వెళ్లాడు రమణ. పెద్ద కొడుకు రమణని చూసి డెబ్బై ఏళ్ల కాంతమ్మ కళ్లల్లో మెరుపు మెరిసింది. అతడిని దగ్గరకు పిలిచి ఆప్యాయంగా పలకరించి క్షేమసమాచారాలను అడిగింది. వాటన్నిటికీ ముక్తసరిగా సమాధానం ఇచ్చాడు రమణ. భోజనాలయ్యాక తమ్ముడు, మరదలి వద్ద శెలవుతీసుకుని తల్లిని తీసుకుని తన ఇంటికి వచ్చాడు రమణ.
మంజుల అత్తగారిని పలకరించి లోపలికి తీసుకెళ్లి ఆవిడకి గదిని చూపించి కావల్సిన ఏర్పాట్లు చేసింది. మంజులని చూసి ఆప్యాయంగా పలకరించింది కాంతమ్మ. రోజులు గడుస్తున్నాయి. సహజంగానే ముభావి అయిన రమణ ఆఫీసు పనుల హడావుడితో కాంతమ్మ వద్ద కూర్చుని మాట్లాడేందుకు సమయం గడపట్లేదు. తన కొడుకు ధోరణి కాంతమ్మకు అలవాటే కనుక తన మనసుకు సర్దిచెప్పుకుంది.
తనకేది కావలసివచ్చినా మంజులని అడగాల్సిన పరిస్థితి కాంతమ్మది. అత్తగారిని సాధిస్తూ, దెప్పిపొడుస్తూ ఏదో మొక్కుబడిగా ఆవిడ అడిగింది ఇవ్వడం చేస్తోంది. ఇదంతా ఇదివరకు ఆ ఇంట్లో తను ఎదుర్కొన్న పరిస్థితి అయినా ఇప్పుడు కాంతమ్మకు చాలా బాధగా ఉంటోంది.
ఇదే బాధతో ఆ రాత్రి కాంతమ్మకు సరిగా నిద్రపట్టలేదు. గతం తాలూకు వైభవాన్ని తలుచుకుని ప్రస్తుత పరిస్థితులతో పోల్చుకుని కన్నీరు మున్నీరుగా విలపించింది. ఏదో చప్పుడైతే గతజ్ఞాపకాల దొంతర నుండి తృళ్లిపడి తన పైటచెంగుతో కన్నీటిని తుడుచుకుని క్రమేణా నిద్రాదేవి ఒడిలోకి జారుకుంది కాంతమ్మ.
కొన్నాళ్లయ్యాక ఒక రోజున రోడ్డు ప్రమాదంలో జగదీష్ ఆశువులు కోల్పొయాడు. జరిగిన దారుణం తెలిసి భార్య విజయ గుండెలవిసేలా దుఃఖించింది. విషయం తెలిసి రమణ దంపతులు బాధపడి, నెమ్మదిగా కాంతమ్మకు చెప్పి ఆమెని జగదీష్ ఇంటికి తీసుకెళ్లారు. చెట్టంత కొడుకుని పోగొట్టుకున్న కాంతమ్మని ఓదార్చడం ఎవరితరమూ కాలేదు. ఆమెని నెమ్మదిగా కాస్త స్వాంతనపరిచి, విజయని, ఆమె పిల్లలను ఓదార్చి జరుగవలసిన తంతుని సక్రమంగా నిర్వహించారు రమణ దంపతులు.
పదిరోజుల తర్వాత తల్లితో, భార్యతో తమ ఇంటికి వచ్చాడు రమణ. మనసుకి ఎంత సర్దిచెప్పుకుంటున్నా కాంతమ్మకి గుండెకోత బాధ తీరట్లేదు. పదే పదే జగదీష్ జ్ఞాపకాలు కళ్లముందు కదలాడుతూ ఉంటోంది. కొడుకుని పోగొట్టుకున్న ఆ కన్న తల్లి బాధ వర్ణనాతీతం.
తల్లి బాధని గుర్తించినా, భార్యా విధేయుడైన రమణ దానిని గుర్తించనట్టుగా తన ఎడల ప్రవర్తిస్తున్న తీరు ఆ తల్లి మనసుని ఇంకా బాధపెడుతోంది. అయినా ‘వాళ్లు సంతోషంగా ఉంటే చాలు’ అనుకుని ఆ భగవంతుని వేడుకుంటూ కాలం గడుపుతోంది కాంతమ్మ. తల్లి మనసు కదా!
కొన్నాళ్ల తర్వాత మంజులకు “తన అత్తగారి బాధ్యతని ఎలా వదిలించుకోవాలి?” అనే దురాలోచన ఎక్కువై తనకు తెలిసిన ఉచిత వృధ్ధాశ్రమాన్ని సంప్రదించి అక్కడకు ఆవిడని చేర్చే నిర్ణయం తీసుకుని తన భర్తకు చెప్పింది. అది విన్న రమణ ఆ వృధ్ధాశ్రమాన్ని చూసి అక్కడి వాళ్ల స్ధితిగతులను తెలుసుకున్నాడు. తన తల్లి తన ఇంట్లో తన భార్యచేతిలో అవమానాలను, బాధలను భరించేకంటే వృధ్ధాశ్రమంలో అయినా సుఖంగా జీవితం గడుపుతుంది. తన తోటి వృధ్ధులను చూస్తూ మాటా, మనసుని పంచుకొంటూ, అక్కడి ఆర్గనైజర్ల ఆదరణ, ఆప్యాయతని చవిచూస్తూ తన బాధలని కొంతన్నా మర్చిపోతుందనుకుని ఇంటికి వచ్చాడు.
ఒకరోజున ఇంట్లో మంజుల లేని సమయం చూసి తల్లి వద్దకు చేరి ఇన్నేళ్లుగా తన మనసులోని బాధని, ఆవేదనని, తప్పనిసరై తల్లి ఎడల తాను ప్రవర్తించిన తీరు, తన నిస్సహాయతని ఆమెతో చెప్పి తనని క్షమించమని ఆమె పాదాలను తాకి కన్నీళ్లతో వేడుకున్నాడు రమణ.
“అమ్మా! దయచేసి ఈ కసాయి కొడుకుని క్షమించమ్మా. నా భార్య కర్కశత్వానికి దడిసి నేను నీయందు చాలా కసాయిగా ప్రవర్తించాను. అది చాలా తప్పని తెలుసు. నీవు, నాన్న మమ్మల్ని ఎంత ప్రేమానురాగాలతో, ప్రాణంగా పెంచి పెద్దచేశారో నాకు అనుక్షణం గుర్తుందమ్మా. అయినా నేను మీ యందు ప్రవర్తిస్తున్న తీరు నన్ను దావాగ్నిలా దహించివేస్తున్నా నేను కసాయిగా నీయందు ప్రవర్తించాను.
నిన్ను క్షమాపణ కోరినా నేను చేసిన పాపం తీరదు. దయతో నన్ను క్షమించమ్మా. ఇప్పుడు కూడా నీ కోడలి మాటవిని నిన్ను ఈ వయసులో వృధ్ధాశ్రమంలో చేర్చాల్సిన దుస్థితి. కనీసం అక్కడైనా నీవు ప్రశాంతంగా జీవితాన్ని గడుపుతావనే ఆలోచనతో నిన్ను తీసుకెళ్లబోతున్నాను. నన్ను క్షమించమ్మా” అని తల్లి పాదాలను పట్టుకుని చిన్నపిల్లాడిలా రోదిస్తున్న కొడుకుని చూసి చలించిపోయిన కాంతమ్మ భారమైన హృదయంతో కొడుకుని లేవదీసి హత్తుకుని ప్రేమగా ఓదార్చింది.
“రమణా! నీ మనసు నాకు తెలుసు. నేను కని పెంచిన నా బిడ్డల మనసు నాకు తెలీదా! చెప్పు. నా మీద మనసులో నీకెంత ప్రేమ ఉన్నా దానిని నీవు వ్యక్తపరచలేని నీ నిస్సహాయత నాకు తెలుసు. నేను నిన్ను ఎప్పుడూ తప్పుగా అనుకోలేదు. అనుకోను కూడా. నీవు నీ భార్యాబిడ్డలతో సంతోషంగా ఉంటే నాకదే చాలు. నేను నీవు చెప్పిన వృధ్ధాశ్రమానికే వెళతాను. అప్పుడప్పుడు వచ్చి నన్ను చూస్తూ ఉండు. కోడలు ఇంటికి వచ్చే సమయం అవుతోంది. బాధపడవోక.” అని తన పైట కొంగుతో కొడుకు కన్నీళ్లని తుడిచి అతడిని ప్రేమగా ఓదార్చింది కాంతమ్మ.
ఇన్నేళ్లూ తన గుండెల్లో దాగున్న భారాన్ని దింపుకున్నవాడై తల్లి ఓదార్పుతో మనసు సేదతీరి తల్లిని ప్రేమతో హత్తుకున్నాడు రమణ.
కాసేపటికి మంజుల ఇంటికి రావడం, అందరూ కలిసి భోజనం చేయడం జరిగింది. ఆ సాయంత్రం వృధ్ధాశ్రమానికి తన తల్లిని తీసికెళ్లి అక్కడ చేర్చి ఆమెకు, అక్కడి నిర్వాహకులకు తగు జాగ్రత్తలు చెప్పి కాసేపు తల్లితో గడిపి ఇంటికి వచ్చాడు రమణ. వచ్చాడన్న మాటే గానీ ఆ రాత్రి అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు. పశ్చాత్తాపంతో మనసంతా దిగులుగా ఉంది.
మరో పదిరోజులతర్వాత కూడా రమణకి దిగులు తీరలేదు. తను తన తల్లికి ద్రోహం చేస్తున్నాననే బాధ అతడిని రోజురోజుకు మానసికంగా కృంగదీస్తోంది.
కొన్నాళ్ల తర్వాత రమణ పెద్దకూతురు మాధవి తన 5సం..సిరి తో తండ్రి ఇంటికి సరదాగా వచ్చింది. రమణ దంపతులు వాళ్లని చూసి చాలా సంతోషించారు. ఒకరోజున రమణ దంపతులు ఏదో పనిమీద బయటికి వెళ్లారు. మాధవి వంటగది పనిలో నిమగ్నమైంది. హాయిగా బయట ఆడుకుంటున్న సిరిమీదకి వీధికుక్క ఉరికింది. భయంతో వణికిపోతూ ఏడుస్తూ కేకలేస్తున్న సిరిని స్ధానికులు రక్షించి ఇంట్లో ఉన్న మాధవికి అప్పగించారు.
“బ్రతుకుజీవుడా!” అనుకుని తన కూతుర్ని అప్పగించినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలిపి కూతుర్ని ఓదార్చి, అక్కున చేర్చుకుని, ప్రేమగా హత్తుకుంది మాధవి. కాసేపటికి ఇంటికి వచ్చిన రమణదంపతులు జరిగింది తెలుసుకుని సిరిని ఓదార్చి ఆడించారు.
ఈ సంఘటన మంజుల మనసుని బాగా కదిలించింది. “తమ ఇంట్లో పెద్దదిక్కుగా తన అత్తగారు ఉండుంటే ఈరోజు తన మనవరాలికి ఇలాంటి ఆపద వచ్చుండేది కాదు. దేవుని దయ వలన ఈరోజు ఎంత ప్రమాదం తప్పింది. అంతా భగవంతుని దయ.” అనుకుంది మంజుల తన మనసులో.
ఇంక ఒకరోజున మంజులని పిలిచి “చూడు మంజూ! ఇన్నేళ్లూ నిన్ను, నీ మనసుని బాధపెట్టగూడదని నా తల్లి తండ్రుల ఎడల నిర్దయతో ప్రవర్తించి వాళ్ల మనసులని చాలా బాధపెట్టాను. నీ మాటవినే చివరకు ఈవయసులో అమ్మని వృధ్ధాశ్రమంలో చేర్చాను. నా తప్పులని ఇప్పటికైనా నేను సరిదిద్దుకొనకపోతే నేను కొడుకుని కాదు కదా! కనీసం మనిషిని కూడా కాను.
నీకిష్టంలేకపోయినా ఇప్పుడు మా అమ్మను మన ఇంటికి తెచ్చి ఆవిడని నా ప్రాణంలా చూసుకోదలుచుకున్నాను. అవసరమైతే ఒక మనిషిని ఆవిడసేవలకు కేటాయించి అమ్మని ప్రేమగా చూసుకుంటాను. ఇది నా స్ధిర నిర్ణయం”. అన్నాడు రమణ భార్యతో.
భర్తలో వచ్చిన ఈ మార్పుకు నివ్వెరపోయి అతనివైపు చూస్తోంది మంజుల.
మరలా రమణ భార్యతో “ఇప్పటికైనా నీలో మార్పు వస్తే నేను చాలా సంతోషిస్తాను. ఇప్పుడే మనం అమ్మ వద్దకు వెళ్లి ఆమెని క్షమాపణ కోరి మన ఇంటికి తెచ్చుకుని ప్రేమగా చూసుకుందాం.” అన్నాడు భార్యని దగ్గరకు తీసుకుని.
అతని మాటలతో తన తప్పులు తెలుసుకున్న మంజులలో పరివర్తన కలిగింది. “నన్ను క్షమించండి. ఇన్నేళ్లూ అజ్ఞానంతో మూసుకుపోయిన నాకళ్లను మీరు తెరిపించారు. ఇన్నేళ్లూ అత్తయ్య వాళ్ల ఎడల నేను చాలా తప్పుగా ప్రవర్తించాను. మనం ఇప్పుడే వెళ్లి అత్తయ్యని క్షమాపణ కోరి ఆవిడని మన ఇంటికి తీసుకొచ్చి ప్రేమగా చూసుకుందాం” అంది మంజుల.
వెంటనే వాళ్లిద్దరూ వృధ్ధాశ్రమానికి వెళ్లి కాంతమ్మని, ఆర్గనైజర్లను కలిశారు. తల్లికి జరిగింది చెప్పి తమని క్షమించమని కోరి ఆమెని తమతో ఇంటికి తీసుకుని రావడం జరిగింది. కోడలిలో వచ్చిన ఈ పరివర్తనకు కాంతమ్మకు సంతోషంతో కడుపు నిండిపోయింది.
కొడుకుని, కోడలిని ప్రేమగా దగ్గరకు తీసుకుని హత్తుకుని వాళ్లను దీవించింది. మనసులోనే ఆ భగవంతుడికి నమస్కరించింది కాంతమ్మ.
.. సమాప్తం ..
నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం :
Profile Link:
Youtube Play List Link:
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి బిరుదు పొందారు


నా గురించి పరిచయం.....
నా పేరు నీరజ హరి ప్రభల. మాది విజయవాడ. మావారు రిటైర్డ్ లెక్చరర్. మాకు ముగ్గురు అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస. వాళ్లు ముగ్గురూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా విదేశాల్లో ఉద్యోగాలు చేస్తూ భర్త, పిల్లలతో సంతోషంగా ఉంటున్నారు.
నాకు చిన్నతనం నుంచి కవితలు, కధలు వ్రాయడం చాలా ఇష్టం. ఆరోజుల్లో వాటిని ఎక్కడికి, ఎలా పంపాలో తెలీక చాలా ఉండిపోయి తర్వాత అవి కనుమరుగైనాయి. ఈ సామాజిక మాధ్యమాలు వచ్చాక నా రచనలను అన్ని వెబ్సైట్ లలో వ్రాసి వాటిని పంపే సౌలభ్యం కలిగింది. నా కధలను, కవితలను చదివి చాలా మంది పాఠకులు అభినందించడం చాలా సంతోషదాయకం.
నా కధలకు వివిధ పోటీలలో బహుమతులు లభించడం, పలువురి ప్రశంసలనందుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నాను.
మన సమాజంలో అనేక కుటుంబాలలో నిత్యం జరిగే సన్నివేశాలు, పరిస్థితులు, వాళ్లు పడే బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని ఎదుర్కొనే తీరు నేను కధలు వ్రాయడానికి ప్రేరణ, స్ఫూర్తి. నా కధలన్నీ మన నేటివిటీకి, వాస్తవానికి దగ్గరగా ఉండి అందరి మనస్సులను ఆకర్షించడం నాకు సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న దారుణాలకు, పరిస్ధితులకు నా మనసు చలించి వాటిని కధల రూపంలోకి తెచ్చి నాకు తోచిన పరిష్కారం చూపే ప్రయత్నం చేస్తాను.
నా మనసులో ఎప్పటికప్పుడు కలిగిన భావనలు, అనుభూతులు, మదిలో కలిగే సంఘర్షణలను నా కవితలలో పొందుపరుస్తాను. నాకు అందమైన ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర నైసర్గిక స్వరూపాలను దర్శించడం, వాటిని ఆస్వాదించడం, వాటితో మమేకమై మనసారా అనుభూతి చెందడం నాకు చాలా ఇష్టం. వాటిని నా హృదయకమలంలో అందంగా నిక్షిప్తం చేసుకుని కవితల రూపంలో మాలలుగా అల్లి ఆ అక్షర మాలలను సరస్వతీ దేవి పాదములవద్ద భక్తితో సమర్పిస్తాను. అలా నేను చాలా దేశాల్లలో తిరిగి ఆ అనుభూతులను, అనుభవాలను నా కవితలలో, కధలలో పొందుపరిచాను. ఇదంతా ఆ వాగ్దేవి చల్లని అనుగ్రహము. 🙏
నేను గత 5సం… నుంచి కధలు, కవితలు వ్రాస్తున్నాను. అవి పలు పత్రికలలో ప్రచురణలు అయ్యాయి. పుస్తకాలుగా ప్రచురించబడినవి.
“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో నేను కధలు, కవితలు వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో నాకధలకి చాలా సార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు లభించాయి. వాళ్ల ప్రోత్సాహం జీవితాంతం మరువలేను. వాళ్లకు నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు రవీంద్రభారతిలో నాకు “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి ఘనంగా సన్మానించడం నా జీవితాంతం మర్చిపోలేను. ఆజన్మాంతం వాళ్లకు ఋణపడిఉంటాను.🙏
భావుక వెబ్సైట్ లో కధల పోటీలలో నేను వ్రాసిన “బంగారు గొలుసు” కధ పోటీలలో ఉత్తమ కధగా చాలా ఆదరణ, ప్రశంసలను పొంది బహుమతి గెల్చుకుంది. ఆ తర్వాత వివిధ పోటీలలో నా కధలు సెలక్ట్ అయి అనేక నగదు బహుమతులు వచ్చాయి. ‘మన కధలు-మన భావాలు’ వెబ్సైట్ లో వారం వారం వాళ్లు పెట్టే శీర్షిక, వాక్యానికి కధ, ఫొటోకి కధ, సందర్భానికి కధ మొ… ఛాలెంజ్ లలో నేను కధలు వ్రాసి అనేకమంది పాఠకుల ప్రశంశలను పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్ వెబ్సైట్ లో “పశ్చాత్తాపం” అనే నా కధకు విశేష స్పందన లభించి ఉత్తమ కధగా సెలక్ట్ అయి నగదు బహుమతి వచ్చింది. ఇలా ఆ వెబ్సైట్ లో నెలనెలా నాకధలు ఉత్తమ కధగా సెలెక్ట్ అయి పలుసార్లు నగదు బహుమతులు వచ్చాయి. వస్తున్నాయి.
ఇటీవల నేను వ్రాసిన “నీరజ కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు” 75 కవితలతో కూడిన పుస్తకాలు వంశీఇంటర్నేషనల్ సంస్థ వారిచే ప్రచురింపబడి మా గురుదంపతులు ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి అవార్డీ శ్రీ అయ్యగారి శ్యామసుందరంగారి దంపతులచే కథలపుస్తకం, జాతీయకవి శ్రీ సుద్దాల అశోక్ తేజ గారిచే కవితలపుస్తకం రవీంద్ర భారతిలో ఘనంగా ఆవిష్కరించబడటం, వాళ్లచేత ఘనసన్మానం పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు పొందడం నాఅదృష్టం.🙏
ఇటీవల మన మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడి గారిచే ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు అందుకోవడం నిజంగా నా అదృష్టం. పూర్వజన్మ సుకృతం.🙏
చాలా మంది పాఠకులు సీరియల్ వ్రాయమని కోరితే భావుకలో “సుధ” సీరియల్ వ్రాశాను. అది అందరి ఆదరాభిమానాలను పొందటమే కాక అందులో సుధ పాత్రని తమ ఇంట్లో పిల్లగా భావించి తమ అభిప్రాయాలను చెప్పి సంతోషించారు. ఆవిధంగా నా తొలి సీరియల్ “సుధ” విజయవంతం అయినందుకు చాలా సంతోషంగా ఉన్నది.
నేను వ్రాసిన “మమతల పొదరిల్లు” కధ భావుకధలు పుస్తకంలో, కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో కొత్తకెరటం పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి” పుస్తకంలో ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు పుస్తకాలుగా వెలువడి బహు ప్రశంసలు లభించాయి.
రచనలు నా ఊపిరి. ఇలా పాఠకుల ఆదరాభిమానాలు, ఆప్యాయతలే నాకు మరింత రచనలు చేయాలనే ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది శ్వాస వరకు మంచి రచనలు చేయాలని, మీ అందరి ఆదరాభిమానాలను పొందాలని నా ప్రగాఢవాంఛ.
ఇలాగే నా రచనలను, కవితలను చదివి నన్ను ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని ఆశిస్తూ
మీ అభిమాన రచయిత్రి
నీరజ హరి ప్రభల.
విజయవాడ.
Photo Gallery

Comments