పాలేరు కొడుకు పోలీసు ఆఫీసరా!?
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- Apr 17
- 4 min read
#PaleruKodukuPoliceOfficer, #పాలేరుకొడుకుపోలీసుఆఫీసరా, #Kandarpa Murthy, #కందర్ప మూర్తి, #TeluguKathalu, #తెలుగుకథలు

Paleru Koduku Police Officer - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 17/04/2025
పాలేరు కొడుకు పోలీసు ఆఫీసరా!? - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
"అయ్యా, నేను దివాణం గారింటికి పనికి పోను"
"ఏమైనాదిరా, ఇయాల నీకు"
"నేను బడికి పోయి చదువుకుంటాను"
"మనకెందుకురా సదువులు. తాతలనాటి నుంచి దివాణం గారి గుమ్మంలో మన బతుకులు ఎల్లిపోతున్నాయి. ఇప్పుడు నీకెందుకు ఈ బుద్ధి పుట్టినాది" కొడుకు
సత్తిబాబును నిలదీసాడు కిష్టయ్య.
"లేదయ్యా, నేను దివాణం గారింటికి పోయి ఆరి గొడ్లకు సేవ చెయ్యలేను. నువ్వు పొలంలో రోజంతా
చెమటోడుస్తావు. గొడ్ల చావడి, పెరడు వాకిలి శుభ్రంతో నేను రోజంతా కష్టపడుతూనె ఉంటాను. ఐనా తిడుతూనె ఉంటాడు. నిన్న మన ఊరు బడి పంతులు గారింటికి మామిడి కొమ్మలు ఇవ్వడానికి పోయినప్పుడు ఏం చేస్తున్నావని అడిగితె దివాణం గారి దొడ్లో గొడ్లు కాస్తున్నానని చెప్పినా. బడికి వచ్చి చదువుకోమని చెప్పినారు. మీ అయ్యతో నేను మాట్లాడుతా అన్నారు."
"పెద్దోళ్లు తిట్టినా మనబోటోళ్లం పడాలిరా. మనకి సదువులు లేవు. ఎవసాయం చేసుకోడానికి భూమి లేదు. కడుపు నిండాలంటె చెమటోడ్చాల్సిందేరా. సంక్రాంతి పండగ దగ్గరైనాది. అయ్యగారు పండగ బట్టలు, మామూళ్లు ఇస్తారు" కొడుకును సముదాయిస్తున్నాడు కిష్టయ్య.
"ఒరె, అయ్యా! నువ్వెన్ని చెప్పినా నేను దివాణం గారింటికి పోనంటె పోను" బీష్మించి చెప్పేడు సత్తిబాబు.
పొద్దెక్కిపోనాదని పరుగున దివాణం గారింటికి పరుగెత్తాడు పాలికాపు కిష్టయ్య.
తండ్రి కొడుకులు రానందున ఎక్కడి పనులక్కడే ఉండిపోయాయని దివాణం గారు చిందులేస్తున్నాడు.
కిష్టయ్యని చూడగానె కోపంతో ఊగిపోతు " ఏరా, టైము ఎంతైనాదో చూసావా ? కళ్లు నెత్తిమీద కెక్కినాయి మీకు. నీ గుంటడు ఎక్కడ? తత్తుకొడుకు, ఆడూ ఎదురు సమాధానం చెప్పడం నేర్చేడు." తిట్లు మొదలెట్టాడు దివాణం రంగారావు.
"సత్తిగాడు రాలేదు అయ్యగారూ. బడికెళ్లి సదువుకుంటాడట. పనికి రాడంట " సమాధానం చెప్పేడు.
"అవున్రా, ఈమద్య మీ లేబరోళ్లకి తిండి ఎక్కువై కండ బలిసింది. మీ ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తున్నారు. ఇంక బడికెళ్లి చదువులు నేరిస్తే భూమ్మీద ఉండరు. ఆమద్య నర్సిగాడు కాళ్లట్టుకుని కొడుక్కి ఏదైనా పని చూడమని బతిమాలుతుంటె మీ సత్తిగాడు ఉన్నాడని సర్దిచెప్పేను. ఆడిని పంపమని చెబుతాను. ఫో, ఆ గొడ్ల చావిడి శుభ్రం చేసి ఈ పత్తి గింజలు పొలానికి పట్టుకెళ్లు " కసురుకున్నారు దివాణం.
సాయంకాలం చెరువుగట్టు మీద సాయిబాబాను దర్సనం చేసుకుని ఇంటికి వెల్తున్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామారావుగారు ఎదురుగా వచ్చిన పాలేరు కిష్టయ్యను చూసి సత్తిబాబును పాఠశాలకు పంపి చదివించమన్నారు.
"కాయకష్టం చేసుకు బతికే మాబోటి లేబొరోళ్లకు సదువులు ఎందుకు పంతులు గారు" అన్నాడు వినయంగా కిష్టయ్య.
"మీలాంటి వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం ఎన్నో ఉచిత సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. మీరు వాటిని సద్వినియోగం చేసుకోండి. బడికి వచ్చే పిల్లలకు బట్టలు పుస్తకాలతో పాటు మద్యాహ్న భోజనం కూడా పెడుతున్నారు. మీ తరం కాయకష్టంతో అక్షరజ్ఞానము లేకుండా బతుకులు వెళ్లదీసారు. మీ పిల్లల్నైనా బాగా చదివించి వారి భవిష్యత్తుకు దారి చూపండి" వివరంగా చెప్పేరు.
మేష్టారు చెప్పిన దాంట్లో కూడా సబబు ఉన్నట్టు గ్రహించాడు పాలేరు కిష్టయ్య.
బడిలో సత్తిబాబు పేరును శరత్ బాబుగా మార్చి ఎడ్మిషన్ కు కావల్సిన ఫారాలు నింపి ప్రవేశం కల్పించారు రామారావు మాస్టారు.
శరత్ బాబు లేబరు కుటుంబంలో పుట్టినా చదువంటే శ్రద్ధ ఎక్కువ. చురుకైనవాడు. ఏదైనా ఒకసారి వింటే జ్ఞాపకం పెట్టుకుంటాడు. అలాగే తనంత తాను పుస్తకాలలోని బొమ్మలు చూసి అనుకరిస్తాడు. వాడి తెలివితేటలకు రామారావు మాస్టారు ఆశ్చర్యపోయారు. మెరుగు పెట్టేవారు లేక ఇటువంటి మట్టిలో మాణిక్యాలు మరుగున ఉండిపోయాయనుకున్నారు.
ప్రత్యేక శ్రద్ధ పెట్టి చదువులో ప్రోత్సహిస్తుంటె చురుకుగా తయారయాడు. వినయం విధేయత మాట తీరుతో అందరికీ ఆప్తుడయాడు శరత్ బాబు.
జిల్లా విద్యాధికారికి శరత్ బాబు కుటుంబ వివరాలు, చదువులో చురుకుదనం తెలియచేసి పట్నంలో ప్రభుత్వ గురుకుల పాఠశాలలో ప్రవేశం కల్పించారు రామారావు మాస్టారు.
సరైన తిండి వసతి సౌకర్యాలతో గుర్తు పట్టలేనంతగా మారిపోయాడు శరత్ బాబు. ప్రథమంలో సత్తిబాబును పట్నం పంపడానికి ఇష్టపడని కిష్టయ్య, మాస్టారు చదువు ప్రాముఖ్యం తెలియచేయడంతో ఒప్పుకున్నాడు.
తన ప్రతిభాపాటవాలతో అందరి మన్ననలు పొందుతు ప్రభుత్వ స్కాలర్ షిప్ సంపాదించి హైస్కూలు, కాలేజీ, యూనివర్సిటీలో మెరిట్ మార్కులతో డిగ్రీ,పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాడు శరత్ బాబు.
కొడుకును చూడటానికి పట్నం వచ్చినప్పుడు వాడి ఉన్నతిని చూసి మురిసిపోయాడు కిష్టయ్య. రామారావు మేస్టారి మాట విని దివాణం గారి ఇంటి పనులకు కాకుండా బడికి పంపినందున కొడుకు ప్రయోజకుడయాడని మాస్టారికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు.
ముందు నుంచి చదువులో మార్గదర్సకం చేస్తున్న రామారావు మాస్టారు, శరత్ బాబు పోస్టుగ్రాడ్యుయేషన్ అవగానే గ్రూప్సు రాయమని ప్రోత్సహించారు.
గ్రూప్సు రాసి పోలీసు శాఖలో సబినస్పెక్టరుగా సెలక్టయి తన కృషి, నిజాయితీ పనిలో సామర్థ్యంతో అంచెలంచెలుగా ఇనస్పెక్టరు స్థాయి హోదాకు చేరేడు సత్తిబాబు ఉరఫ్ శరత్ బాబు.
ఊళ్ళోని పాఠశాలను అభివృద్ధి చేయించి అందరికీ అందుబాటులో గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసాడు ప్రజలకు మౌలిక సదుపాయాలు కలగచేసాడు. అన్ని వర్గాల పిల్లలు పాఠశాలకు వచ్చి చదువుకునేలా ప్రోత్సహించేడు.
రామారావు మాస్టారు హెడ్మాస్టరు హోదాలో పదవీ విరమణ చేసినప్పటికీ తనకు గురువుగా దేవుడిలా మంచి భవిష్యత్తు జీవితం కలగచేసినందుకు వారిని ఎంతో గౌరవంగా సత్కరించాడు.
తండ్రి కిష్టయ్య వార్ధక్యంలో మంచాన పడితే హాస్పిటల్లో చేర్పించి సపర్యలు చేయిస్తున్నాడు.
ఊళ్లో సత్తిబాబు శరత్ బాబుగా మారి పెద్ద పోలిసు ఉద్యోగం సంపాదించే నాటికి దివాణం గారు కాలం చేసారు. ఆయన తిట్టిన పరుష పదాల వల్లే పౌరుషంతో తను పట్టుదలగా చదివి ఈ స్థాయికి రాగలిగానని, ఏది జరిగినా మంచికే అని సరిపెట్టుకున్నాడు. చీకటి అంధకారం నుంచి తన తెలివితేటలతో దినదిన వర్ధమానం చెంది పున్నమి చంద్రుడయాడు శరత్ బాబు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments