రెక్కలొచ్చిన వృద్దాప్యం
- Sampath Kumar S
- May 3, 2023
- 1 min read

'Rekkalochhina Vruddhapyam' New Telugu Story
Written By S. Sampath Kumar
'రెక్కలొచ్చిన వృద్దాప్యం' తెలుగు కథ
రచన: S. సంపత్ కుమార్
(కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్)
సుమారు 30 యేండ్ల క్రితం అమెరికా వెళ్ళాలి, బాగా డబ్బులు సంపాదించాలి అని విశ్వ ప్రయత్నం చేశా. నా ప్రయత్నం కలగానే మిగిలిపోయింది కాని నా కల ఇంకో రకంగా నెరవేరింది. ఎలా అంటారా....నాకు 60 యేండ్లు వచ్చాక అది ఎలా అనేది ఈ పాటికి కాస్త అర్థం అయింటుంది కదా.... అర్థం కాలేదా.. అదేనండీ.. మా పిల్లలు అమెరికాలో సెటిల్ అవడం వలన. పెళ్లిళ్లు ఇక్కడే అయినా వాళ్ల కాపురాలు అక్కడే . మా పెద్ద అబ్బాయికి అమ్మాయి పుట్టడం వలన నేను, మా ఆవిడ అమెరికా వెళ్ళవలసి వచ్చింది. అమెరికా వెళ్ళడం వలన నా కల అలా నెరవేరిందన్న మాట. ఇంక నా అమెరికా అనుభవాలు, అనుభూతులు చెబుతా. కాస్త ఆసక్తిగా వినండి. ఫిబ్రవరిలో వెళ్లిన మేము, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళే అవకాశం కుదరలేదు. వింటర్ సీజన్ కాబట్టి, ఇంటి పైన, ముందర, వెనుక, అంతా మంచు మయం. వాకింగ్, ఎక్సర్సైజులు అంతా ఇంటిలోనే.ఇంక టీవీ , స్మార్ట్ ఫోన్ తోనే కాలం వెళ్ళబుచ్చటం అలవాటు అయ్యింది.. వింటర్ వెళ్ళి సమ్మర్ సీజన్ మొదలు అవటంతో బయట వాకింగ్ చేయడం మొదలు పెట్టా. నాలాగే కొందరు వాకింగ్ కి రావడం వలన ఒక నలుగురు వివిధ ప్రాంతాల తెలుగు వాళ్లు పరిచయం అయ్యారు. రోజూ అక్కడే దగ్గరలొ ఉండే ఒక పార్కులో ఒక టైం పెట్టుకొని కలుసుకోవడం మా దినచర్య. రోజూ మా మధ్య లోకాభిరామాయణం.. అవే కబుర్లు మీతో పంచుకోవాలని.. అమెరికాలో నచ్చిన నాలుగు అంశాలు అంటు మొదలు పెట్టాడు రామరావు. మనిషి కనపడగానే నవ్వుతూ పలకరించడం.. రోడ్ క్రాస్ చేసేటప్పుడు తమ వేహికలు ఆపి మనం వెళ్ళాక వాళ్లు వెళ్ళడం.. ఎవ్వరూ బయటకు రాకుండా తమ పని తాము చేసుకోవడం.. చెత్త కనపడకుండా రోడ్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండటం.. “ఇంకా తెలుసా.. ఇక్కడ ముఖ్యంగా పిల్లలు ఫ్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అయ్యాక తల్లి తండ్రుల మీద ఆధారపడకుండ పై చదువులు పార్ట్ టైం జాబ్ చేసుకుంటూ చదువుకుంటారట. అలాగే పెండ్లి చేసుకున్నక ఎవరి సంసారం వాళ్ళది అట” అన్నాడు మధ్యలో కలిపించుకొంటూ ఏకాంబరం. “అవును..అందుకే మనకు ఇక్కడ ముసలి జంటలు, అలాగే పడుచు జంటలు పిల్లలతో, ఇంకా వీరికి కుక్కలు వుంటే వాటితో కనపడుతూ వుంటారు. ఇంకా 14 యేండ్లు దాటిన పిల్లలు, వాళ్ల తల్లి తండ్రులతో సాధారణంగా తిరుగుతూ కనపడరు. “అయినా వీళ్ళకు పిల్లల మీద అనుబంధాలు, మమతలు ఏమీ ఉండవేమో..” అన్నాడు రామరావు. రెండు మూడు సార్లు వచ్చిన వీళ్ళకు తెలిసినంత నాకేమీ తెలియదు. కాని వీళ్ళు చెప్పినట్టు అవి వాస్తవాలుగా కనపడ్డాయి కొన్ని రోజులకు. కనపడగానే నవ్వుతూ పలకరించడం.. నేను మా పిల్లలతో కారులో ప్రయాణిస్తున్నప్పుడు రోడ్ క్రాస్ కోసం ఉన్న వాళ్లు రోడ్ దాటేంత వరకు, అలాగే స్టాప్ బోర్డ్స్ ఎక్కడ ఉంటే అక్కడ మా కారు ఒక సెకన్ బ్రేక్ పడుతుంది. ఇంక స్పీడ్ లిమిట్ కూడ సూచనల ప్రకారం ఆటోమేటిక్ గా స్టీరింగ్ మీద చేతులు , బ్రేక్ మీద కాళ్ళు పడి, తన పని తాను చేసుకుపోతుంటాయి. ఇంట్లో ఉన్న చెత్త ప్రతి గురువారం ఉదయం ఇంటి వెనకల ఉన్న రెండు డస్ట్ బిన్లలో. ఒకటి రీసైక్లింగ్ , ఇంకొకటి నాన్ రీసైక్లింగ్. వాటిలో వేసి రెడీగా ఉంచితే చెత్త వాళ్లు వచ్చి ఆ చెత్తను వెహికిల్ లో తీసుకెళ్లడం జరుగుతుంది. రోడ్డు మీద చెత్త అనేది ఉండదు. చుట్టు పక్కల ఉన్న గ్రాస్ ఎప్పటి కప్పుడు వచ్చి, లెవెల్గా మోటార్ కట్టింగ్ మెసిన్స్ తో కట్ చేస్తారు. ఇంక ఇంటి ముందు, వెనకాల ఉన్న గ్రాస్ ఎవరంతకు వారు, వారి సమయాన్ని బట్టి కట్టింగ్ చేసుకుంటారు. ఎక్కువగా తమ పని తాము చేసుకొని పోయే వాళ్ళలా కనపడుతుంటారు. ఇక్కడ ఉండే చట్టాలు వలన వాటిని ఉల్లంఘించే సాహసం ఎవ్వరూ చెయ్యరు. అలా ఉల్లంఘన చేస్తే అనేక రకాల ఇబ్బందులకు గురి కావలసివస్తుందని తెలుసు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండటం అలవాటు పడ్డారు. అందువలన మనిషికి అతనికి తెలియకుండానే వంట్లో సెల్ఫ్ డిసిప్లెయిన్ అలవాటు అయ్యింది. ఇలా మన దేశంలో ఎందుకు కుదరదు? ఇప్పుడు మేము కూర్చున్న పార్కులో ఈ విషయం గురించి చర్చ.. “ఇక్కడ జనాభా తక్కువ . విశాలమైన స్థలాలు. మొదటి నుండి క్రమ పద్దతిలో పాలన. రెండు రాజకీయ పార్టీలు. వాళ్ల లో వాళ్లు విమర్శలు చేసుకొంటారు కాని పబ్లిక్ ఇంట్రెస్ట్ లో రాజీ పడకుండా పోటీపడి చేస్తారు” అన్నాడు ఏకాంబరం. “అవును... మన జనాభా ఎక్కువ. అంతా ప్లానింగ్ లేని కట్టడాలు.. వంద రాజకీయ పార్టీలు.. ఎక్కడా చూసినా అవినీతిమయం. మరి అలాంటప్పుడు ఏమీ చేయలేము చూస్తు ఉండటం తప్ప” అన్నాడు రామరావు. “మన దేశాన్ని మనమే విమర్శస్తు ఉంటామని అంటారు కాని..” ఏకాంబరం అంటుంటే మధ్యలో రామారావు కలిపించుకొని “మన దేశం అన్ని దేశాలతో పోల్చితే గోప్ప దేశం. అందులో ఏ మాత్రం సందేహం లేదు. వనరులకు కొదవ లేదు. పంచ భూతాల నిలయం. అన్ని రకాల వాతావరణానికి అనుకూలం. మన దేశం సంస్కృ, సంప్రదాయాల పుట్టిల్లు. కాని మనుష్యుల నడవడిక సరిగా లేక మనమే కాకుండ ప్రకృతినీ కూడ సర్వ నాశనం చేస్తున్నాం. ఈ అమెరికలాగా మనం కూడ సెల్ఫ్ డిసిప్లెయిన్ పాటిస్తే చాలా మటుకు మన దేశం కూడ కాలుష్య కోరల నుండి బయట పడుతుంది. “ఏమి ముకుందం.. రోజూ సాయంత్రం పార్కుకి వస్తున్నావు, మా మాటలు వింటున్నవు కాని నీవేమి మాట్లాడం లేదు?” “ఏమి మాట్లాడాలి... సెల్ఫ్ డిసిప్లెయిన్ వలన ఆమెరికా చాలా మటుకు ఒక క్రమ పద్ధతిలో ముందుకు వెళుతుంది. ఇది వాస్తవం. అందుకు బలమయిన కారణం అవినీతి కంట్రోల్లో ఉందని నా అభిప్రాయం. మన దేశంలో దాదాపు అన్ని రంగాలలో చాలామటుకు అవినీతి పెనవేసుకొని పోవడం వలన సెల్ఫ్ డిసిప్లెయిన్ కు మన జనాలు అలవాటు పడే ఆస్కారం లేదు. ఇంక జనాభా పెరుగుదల కూడ డిసిప్లెయిన్ కంట్రోల్ కాకపోవడానికి ఒక కారణం. నాకు ముఖ్యంగా నచ్చింది రెక్కలు వచ్చాక పక్షులు ఎలా ఎగిరి పోతావో అలా ఇక్కడ పిల్లలు తమ తల్లి తండ్రులను వదలి వెళ్ళి తమ జీవితం తాము బ్రతకడం బాగుంది. అదే నిజమైన పరిపూర్ణ జీవితం.మనం పిల్లలను పెంచడం బాధ్యత భావించక వారి నుంచి ఎదో ఆశిస్తాం. నిజం చెప్పాలంటే మనకు వృద్దాప్యం వచ్చాక పిల్లలు ఎంత బాగా చూసుకున్న ఎందుకో తెలియదు ఎదో తెలియని స్వేచ్ఛ కొలుపోతున్నము అనిపిస్తుంది. ఇక్కడ వాళ్లు మాకు ఏమీ లోటు చెయ్యడం లేదు కాని మా ఆవిడ అంటుంది మన లోకం మనది ఇక్కడ ఉండలేకపోతున్నాను అంది . నాది కూడ సేమ్ ఫీలింగ్. ఇక్కడ మా ఆవిడ మా పిల్లలు మేము వాళ్ళకు సహాయం చెసే పనుల విషయంలో ఏమీ అనకపోయిన ఎదో వాళ్ళను తృప్తి పరచాలేక పోతున్నాం అనే భావన. పిల్లలు రెక్కలు వచ్చి వెళ్ళి పోయాక మేమిద్దరం ఒంటరిగ ఉండే అవకాశం పిల్లలు పుట్టక ముందు కంటే ఇప్పుడు రెక్కలొచ్చి పిల్లలు వెళ్ళిపోయాక చాల హాయిగా ఉంది. అప్పుడు జీవన పోరాటంలో ఎన్నో కోల్పోయిన మేము ఇప్పుడు ఈ వయసులొ పొందుతున్న ఆనందం వర్ణించలేం.అందుకే ఎప్పుడెప్పుడు ఇండియా పోవాలని ఉంది. పిల్లలకు రెండు రకాల ఆలోచనలు . ఇంత బాగా చూసుకుంటే కూడ వీళ్ళు ఎందుకు ఉండం అంటున్నారు అని. అలాగే ఈ వయసులొ తల్లి తండ్రులను వొంటరిగా వదలి వేశారని అందరు అనుకుంటరని .ఇప్పుడు అంటే ఓపిక ఉంది రేపు చేసుకొనే అవకాశం లేనప్పుడు అయిన రావాలి కదా అని పిల్లలు అంటే నా సమాధానం ఏమిటో తెలుసా.. అప్పుడు మా అమ్మ గురించి చెప్పాను. మా అమ్మ మా నాన్న ఉన్నంత వరకు మేము ఎంత రమ్మన్నా రాకుండ ఇద్దరే కలసి ఉన్నారు. మా నాన్న కాలం చేశాక మా అమ్మ ఇంక మా దగ్గరికి వస్తుంది అనుకున్నాం. కాని ‘నేను రాను.. నాన్న జ్ఞాపకాలతో ఇక్కడే ఉండి పోతా’ అంది. మరి మా పిల్లలు నన్ను అడిగినట్టు రేపు ఒంటరిగా చేసుకోలేనప్పుడు ఎలా అని మా అమ్మను నేను అడిగా . అప్పుడు మా అమ్మ చెప్పిన సమాధానం.. ‘దగ్గరలో అమృతా నిలయం ఉంది. అందులో ఉంటా’ అంది. ఆ అమృతా నిలయం మా నాన్న కొంత మంది మిత్రులు మా ఊరి చివర మా పొలంలో కట్టిన నిలయం. వృద్ధాప్యం వచ్చి చేతకానప్పుడు తల్లీతండ్రులు పిల్లలను ఇబ్బంది పెట్టకుండా వాళ్లు ప్రశాంతంగా చివరి జీవితం గడిపేందుకు చేరే మందిరం. అన్ని వసతులు ఉన్న అమృత నిలయంలో పిల్లలు ఇక్కడ వదిలి వేశారని భావన తల్లి తండ్రులకు ఉండదు. ఇష్ట పూర్వకంగా చేరే వారు ఎక్కువ. పిల్లలు బాగ చూసుకోలేక ఇక్కడ వదలి వేశారనే ఆలోచన రాదు. ఇక్కడ మళ్ళీ రెక్కలు వచ్చిన వృద్ధుల జీవనం సరికొత్తగా ఉంటుంది.పిల్లలే తమ పిల్లలతో వాళ్ల సెలవు దినాలు ఇక్కడికి వచ్చి వాళ్ల తల్లి తండ్రులతో గడపటం ఒక పండగ. అలాగే పండగలు, ఇంక మిగత ఇంట్లో జరిగే వేడుకలప్పుడు తల్లి తండ్రులను పిల్లలు తమ ఇండ్లకు తీసుకెళ్లి కొన్ని రోజులు ఉంచుకోవడం ఒక ఆనందం. ఒకరికి ఒకరు తోడుగా ఇబ్బంది లేని విధంగా పిల్లలు, వారి తల్లి తండ్రులు అద్భుతంగా జీవించే జీవితం ఇది. కాని మన సమాజంలో ఈ మార్పురావాలనేది నాఉద్దేశం. కాలానుగుణంగా మారాలి. ఎంత దూరంలో ఉంటే అంత మమతలు ఈ కాలంలో పెనవేసుకొని ఉంటాయి. ఒకరి స్వేచ్ఛకు ఒకరు అడ్డు లేనప్పుడే జీవితం సుఖం. మా ఇద్దరంలో ఎవరు ముందు పోయిన ఆ అమృతా నిలయం లో చివరి రోజులు గడుపుతాం. మా నిర్ణయం విన్నాక పిల్లలు మా ఇష్టనికే మమ్మల్ని వదలివేశారు.” “మీరు ఏమి మాట్లాడటం లేదు ఏమిటి అనుకుంటే ఎంతో నగ్న సత్యాలు చెప్పారు. మీరు చెప్పినట్లే మా మనసులొ చేతనయ్యేంత వరకు పిల్లల మీద ఆధార పడ కూడదు అనుకున్నాం.. ‘పిల్లలు ఇక్కడ.. మేము అక్కడ ఎందుకు.. వీళ్ల తో పాటు ఉంటే బాగుంటుంది’ అనుకున్న మాకు మీ మాటల ద్వారా ఎక్కడి వాళ్లు అక్కడే ఉంటేనే బాగుంటుంది అనిపించింది కాని చేసుకోలేనప్పుడు ఎలా.. మాకు కూడ మీకు ఉన్నట్లు అమృత నిలయలు ఉంటే బాగుంటుంది” అన్నాడు రామరావు. “మన పిల్లలు ఇక్కడ బాగున్నారు. మన ఆర్థికంగా ఉన్నవాళ్ళమే.మనమే ఎవరికి వారు తమకు అందుబాటులో ఈ అమృత నిలయాలు నిర్మిస్తే ఎలా ఉంటుంది” అన్నాడు ఏకాంబరం. “అవును ...ఇప్పుడు ఆమృత నిలయాలాంటివి అక్కడక్కడ ఉన్నాయి. కానీ మనం ఉండే ప్రతి ఊరిలోనూ ఈ అమృతనిలయాలు నిర్మించాలి. అలాగే పేద వృద్దాప్య వాళ్ళను కూడ మనమే ఆదుకోవాలి” అన్నాడు రామరావు. “అలోచన వచ్చింది. ఆనందం. ఇంక ఆచరణలో పెట్టడానికి కృషి చెయ్యండి” అన్నాను. “ఈ అమృత నిలయాలను పుణ్య స్థలాలుగా తీర్చి దిద్దాలి. చివరి దశలో ఇక్కడే కన్ను మూయలి అనే భావన కలగాలి. ఇవి వృద్దాశ్రమం కాదు పవిత్ర క్షేత్రంగా వర్ధిల్లాలి. మరి ఇలా ఈ అమృత నిలయాలు ఉండాలంటే మంచి భావాలు, వీటి ఆశయాలు అవగాహన చేసుకున్న వాళ్లు ముందుకు రావాలి. అలాగే ఆర్థికంగా సహాయం చాలా అవసరం. ముందు వీటి ఆశయాలు గురుంచి బాగ ప్రచారం కావాలి. ఇందుకు తగిన ప్రణాళిక నా దగ్గర సిద్ధం ఉంది. మీకు ఇంక ఎలా వుంటే ఇంకా బాగుంటుంది అనే మీ ఆలోచనలు జోడించి మీరు ముందుకు వెళ్ళండి” “మీరు చెప్పినట్లే.. మా వంతు కృషి ఇప్పటి నుంచే మొదలు పెడతాం” అన్నారు.రామరావు, ఏకాంబరం. “సంతోషం...అమెరికాలో ఈ కొత్త సంప్రదాయనికి మన దేశంలో మన నుండే శ్రీకారం” అన్నాడు ముకుందం. ఇండియాకు ప్రయాణం.. ఎంతో ఆనందంగా ఉంది. పిల్లలు ఇంక కొన్ని రోజులు ఉండండి ఎక్స్టెన్షన్ చేస్తా అన్నారు. కాని మళ్ళీ వస్తాం అక్కడ కొన్ని పనులు ఉన్నయి అని ఒప్పించాం.వారు కూడ మళ్ళీ ఉండు అని మమ్మల్ని బలవంతం చేయలేదు. ఇండియా పోవడానికి విమానం ఎక్కాము. విమానం రెక్కలు గాలిలొ ఎగరాయి వాటితో పాటు మా వృద్దాప్య రెక్కలు కూడ అమాంతం ఆకాశంలో ఎగిరే మబ్బుల మధ్య స్వేచ్ఛగా విహరిస్తూ ఉన్నాయి.. |
***
S. సంపత్ కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం : S. సంపత్ కుమార్
చదువు M.A. Archeology
కథలు రాయడం, వివిధ పత్రికలలో సుమారు 20 , అలాగే తీసిన షార్ట్ ఫిల్మ్స్ 6లో ఒక షార్ట్ ఫిల్మ్ కు డైరెక్టర్ గా స్పెషల్ జ్యూరీ అవార్డు, రెండు షార్ట్ ఫిల్మ్స్ బెస్ట్ స్టోరీ అవార్డ్స్ వచ్చాయి.
Murali Mohan Annamaraju • 18 minutes ago
Good message
VBM Rao • 28 minutes ago
కథ బాగుంది.