top of page
Original.png

అమ్మ మనసు

#అద్దంకిలక్ష్మి, #AddankiLakshmi, #AmmaManasu, #అమ్మమనసు, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

ree

Amma Manasu - New Telugu Story Written By Addanki Lakshmi

Published In manatelugukathalu.com On 22/08/2025

అమ్మ మనసు - తెలుగు కథ

రచన: అద్దంకి లక్ష్మి 


ఒక్కసారి తుఫాన్ వచ్చి వెలిసిన ప్రశాంతత. చుట్టాలు అందరూ వెళ్లిపోయారు. అమ్మ పోయిన తర్వాత కార్యక్రమాలన్నీ చక్కగా జరిపించారు పిల్లలు ఆరుగురు. 


 సీతమ్మ గారికి ఆరు మంది సంతానం. తండ్రి పోయి రెండేళ్లయ్యింది. ముగ్గురు మగ పిల్లలు. ముగ్గురు ఆడ పిల్లలు. మనుమలందరూ బయట ఆడు కుంటున్నారు. 


కోడళ్ళు ముగ్గురు వంటగదిలో పనిలో ఉన్నారు. ఏవో కబుర్లు చెప్పుకుంటూ అత్తగారి మంచితనం గురించి జ్ఞాపకం చేసుకుంటూ వంట చేసుకుంటున్నారు, 


కొడుకులు, కూతుళ్లు కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు. అందరూ ఎప్పుడూ ఇలా ఒక్కసారి కలుసుకునేది లేదు, 


15 రోజులు అన్ని కార్యక్రమాలన్నీ చక్కగా నిర్వహించారు, తల్లికి లోటు లేకుండా, అంత్యక్రియలు జరిపించారు. ఆమెకి కూడా సునాయాసాన మరణం, పిల్లలు ఎవరిని ఆమె కష్టపెట్టలేదు. ఏదో కొద్దిగా నలతగా ఉందంటే ఒక్కొక్కళ్ళు చూడడానికి వచ్చారు, పిల్లలందరితో మాట్లాడుతూ ఉంటేనే, ప్రాణం పోయింది ఆమెది. 

 

పిల్లలందరూ హాల్లో కూర్చుని ఆమె తెలివిగా సంసారాన్ని ఎట్లా నడిపిందో గుర్తు చేసుకుని నవ్వుకుంటున్నారు. 


ఉన్నదాంట్లో నే సంసారాన్ని చక్కగా సాగించింది ఆమె, 


"అమ్మకి నేనంటే చాలా ఇష్టం. అందరి కంటె నన్నే బాగా చూసేది. టెన్త్ పాస్ అయితే నాకు వాచీ కొనిపెడతాను ఎవరికీ చెప్పొద్దు అంటూ, కొనిపెట్టింది తెలుసా” అన్నాడు మూడో వాడు, 


"ఏం కాదు, నేనంటేనే అమ్మకు చాలా ఇష్టం. నేను పెద్దవాడిని కదా. నన్ను చాలా బాగా ముద్దుగా పెంచింది. నేను ఏదంటే అలా జరిపించేది. అమ్మకు నేనంటేనే చాలాఇష్టం". అన్నాడు పెద్దవాడుగొప్పగా.. 

 

"అమ్మకి నేను అంటేనే ఎక్కువ ఇష్టం. ఎందుకంటే లెక్కల్లో నేను వీక్ కదా. ఈసారి ఫైలవకుండా, 40 మార్కులు తెచ్చుకుంటే, నీకు ఇష్టం అయిన మైసూర్పాక్ చేసి పెడతాను. అని నన్ను ఊరించేది. నిజంగానే నేను 40 మార్కులు తెచ్చుకున్నప్పుడు నాకు చేసి పెట్టింది. అమ్మకు నేను అంటేనే ఎక్కువ ఇష్టం” అన్నాడు రెండోవాడు.. 

 

"నన్నే బాగా చూసేది అమ్మ. నేను చిన్నాడిని కదా. ఒరేయ్ చిన్నీ అంటూ గారంగా పిలిచేది.. ఒక రూపాయి ఇచ్చి బిస్కెట్లు కొనుక్కో ఎవరికీ చెప్పకు, అనేది, అసలు అమ్మకి నేనంటే చాలా ఇష్టం," ఆనందంగా చెప్పాడు చిన్ని. 


చిన్నది సుధ మొదలెట్టింది, 

“అమ్మ సంక్రాంతి పండక్కి పట్టు లంగా కుట్టించింది. అప్పుడు చెప్పింది ‘నీకే ఇది. ఈసారి ఆటల్లో ఫస్ట్ వచ్చావు కదా. అక్కకు చెల్లికి కుట్టించలేదు, మళ్లీ పండక్కి కుట్టిస్తాను. ఇలాగే ప్రతి సంవత్సరము గెలవాలి’ అంటూ దగ్గరకు తీసుకుంది, నేను అంటేనే అమ్మకు ఎంతో ఇష్టం..” సుధ ఆనందంగా చెబుతోంది, 

 

"అమ్మకి నేనంటేనే ఇష్టం. నన్నే బాగా చూసేది. నాకు చాక్లెట్ అంటే ఇష్టం కదా. అమ్మ నాకు డబ్బులు ఇచ్చి స్కూల్ దగ్గర చాక్లెట్లు తిను. ఎవరికీ చెప్పకు అంటూ ఉండేది. అందుకనే అమ్మకి నేనంటే చాలా ఇష్టం.. "


ఇలా పిల్లలందరూ అమ్మ ప్రేమ గురించి చెప్పుకునే నవ్వుకుంటున్నారు, 


పెద్దపిల్ల సుగుణ అమ్మ గురించి చెప్పడం మొదలు పెట్టింది, 


"నేను పెద్దదాన్ని కదా! అమ్మ గురించి నాకు అన్నీ తెలుసు. అమ్మకి ఎప్పుడూ చేదోడు వాదోడుగా ఉండేదాన్ని. ఆమె తన కష్టసుఖాలను నాతో చెప్పుకునేది, నాన్నగారు చిన్న ఉద్యోగం. పిల్లలందరినీ పెంచాలి. అమ్మే ఎంతో తెలివిగా సంసారాన్ని ఈడ్చేది.

తాతగారు నాయనమ్మ గారిని ఎంతో గౌరవంగా చూసేది. నాయనమ్మ ఎప్పుడు అమ్మని సతాయిస్తూ ఉండేది, ‘ఈ పని సరిగా లేదు ఆ పని సరిగా చేయవు’ అంటూ. 


అమ్మ ఎంతో బాధపడుతూ ఉండేది మనసులో. అత్తయ్యలు బాబాయలు వచ్చి పది రోజులు హాయిగా గడుపుకొని వెళ్ళిపోతుండేవారు. ఎవరు కూడా తాతయ్యని నాయనమ్మని, వాళ్ల ఇంటికి రమ్మని పిలిచేవారు కాదు. పూర్తిగా అమ్మానాన్న గారే పెద్దవారి బాధ్యతను చూసేవారు. ఎప్పుడైనా బాబాయిలు కొంత డబ్బు పంపిస్తూ ఉండేవారు తాతగారికి.


అమ్మ ఎంత గొప్ప మనసు అంటే ఏనాడు తన మీదే బాధ్యత పడింది అనుకునేది కాదు, నిజానికి మనమందరము బాగా చదువుకునే ఉద్యోగాల్లో స్థిరపడినందుకు అమ్మకు మనము ఎంతో కృతజ్ఞత చెప్పుకోవాలి.


నాన్నగారికైతే మన చదువు సంధ్యలు పట్టించుకునేందుకు టైమే ఉండేది కాదు. ఆ ఉద్యోగంలో సతమతమయ్యేవారు. నాకు పెళ్లయినప్పుడు చిన్నది అమ్మ చుట్టూ తిరిగి అడిగేది ‘అమ్మా నాకు ఎప్పుడు పెళ్లి చేస్తావు’ అంటూ. ‘నువ్వు తింగరి దానివి, నిన్ను ఎవడు చేసుకుంటాడు’ అంటూ అమ్మ నవ్వేది"


ఇలా అమ్మ గొప్ప మనసు గురించి చెప్పుకుపోయింది పెద్ద పిల్ల సుగుణ, 


పిల్లలు అందరు హాయిగా గలగల నవ్వుకున్నారు, అమ్మ తెలివి గురించి చెప్పుకొని. 


"చూసావా అమ్మ ఎంత తెలివైనదో. ఇంత మంది పిల్లల్ని ఎంత బాగా పెంచిందో, ఎవరికీ ఏ లోటూ రాకుండా. పిల్లలందరి మనసుల్లో అమ్మకి తనే ఎక్కువ అనే భావాన్ని చక్కగా కలుగజేసింది. ఇదీ పిల్లల పెంపకం అంటే. ఈ రోజుల్లో అయితే మన అందరికీ ఇద్దరు పిల్లలు, పెద్ద పెద్ద జీతాలు వస్తున్నా, పిల్లల్ని పెంచడానికి అయోమయం అయిపోతున్నాము, అని అందరూ అమ్మను మరీ మరీ జ్ఞాపకం చేసుకున్నారు.. 

***

అద్దంకి లక్ష్మి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి

నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి

జన్మ స్థలం:రాజమహేంద్రవరం

డేట్ అఫ్ బర్త్

3_6_1946.

నివాసం: నవీ ముంబయి

విద్యార్హతలు:

బి.ఎ; బి. ఇడి

**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,

బాంబే మునిసిపల్ కార్పొరేషన్


**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.

భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;

విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ

**కుమారుడు:

గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,


**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.

అల్లుడు మధుసూదన్ అమెరికా

వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు


**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,


నిరక్షరాస్యతను నిర్మూలించుటకు

సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,


నాటకాలు వ్రాసి

విద్యార్థుల నాటకాలు

వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,

సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి


చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,


**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,


**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం


**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం


సాహితీ జీవితం_రచనలు

**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను

**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి


ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను


**అనేక సమూహాల్లోని

ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,

పద్యాలు ప్రచురించ బడినవి

కవితలకు కథలకు బహుమతులు పొందినాను


నేను రాసిన

కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా

**మినీ కవితలు

పంచపదులు

సున్నితాలు

ఇష్టపదులు

**గేయాలు

**వ్యాసాలు

**నాటకాలు

పద్యాలు

గజల్స్

కథలు

రుబాయీలు

బాల సాహిత్యం

**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి


*సాహిత్య సేవ

తేనియలు,

తొణుకులు,

చిలక పలుకులు,

పరిమళాలు,

మధురిమలు,

ముత్యాలహారాలు,ఇష్టపదులు,

సకినాలు,

సున్నితాలు,

పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,


**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను

**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,

అన్ని గ్రూపుల నుంచి,

15 బిరుదులు పొందడం జరిగినది,


ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,

2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,


రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,


1.ప్రచురణ,,,


1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,


Comments


bottom of page