దొంగ స్వామీజీ
Updated: Sep 23, 2024
తెలుగు బాలల కథ

'Donga Swamiji' - New Telugu Story Written By Palla Venkata Ramarao
Published In manatelugukathalu.com On 06/09/2024
'దొంగ స్వామీజీ' తెలుగు కథ
రచన: పల్లా వెంకట రామారావు
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
రామాపురంలో శివయ్య దంపతులకు వంశీ అనే పుత్రుడు ఉన్నాడు. ఆరవ తరగతి చదువుతున్నాడు. బడిలో ఉపాధ్యాయుడు చెప్పే విజ్ఞాన దాయక విషయాలన్నీ, నిత్యజీవితంలో పనికొచ్చే అంశాలన్నీ వాడు బాగా గుర్తుంచుకుంటాడు. ఆరోజు మామూలుగానే పాఠశాలకు బయలుదేరాడు వంశీ. ఇంటి బయటకి రాగానే ఎదురుగా ఎవరో కాషాయ బట్టలతో ఎదురయ్యారు.
ఆ వ్యక్తి "హర హర శంభో మహాదేవ! మీ ఇంట్లో ఏదో దోషం ఉంది. ఎన్నో కష్టాలు ఎదుర్కొంటున్నారు. స్వామిని నమ్ముకోండి. కష్టాలు తొలగి, ధనవంతులవుతారు" అంటూ అరుస్తున్నాడు.
వంశీ బడికి సమయం కావడంతో అతన్ని పట్టించు కోకుండా వచ్చేసాడు. వీధి మలుపు తిరిగేటప్పుడు ఆ బాబాని పక్కింటి వారు పిలవడం గమనించాడు. బడికి వచ్చాడన్న మాటే గాని వంశీ మనసులో ఏదో అనుమానం. వంశీ పరధ్యానంగా ఉండటం చూసి ఏమైందని ప్రశ్నించాడు ఉపాధ్యాయుడు.
"సార్! మీరు కొంతకాలం క్రితం వార్తాపత్రికలోని ఒక వార్త చదివి వినిపించారు. అదేంటంటే స్వామీజీ వేషాలు వేసుకొని కొందరు మోసగాళ్లు జనాలని మోసగిస్తున్నారని"
"అవును అయితే ఏమిటి?"
"ఈరోజు ఒక స్వామీజీ మా ఇంటి దగ్గరికి వచ్చాడు. అతను మోసగాడేమోనని నా అనుమానం" అన్నాడు వంశీ.
వంశీ చెప్పిన దాన్ని విన్న రంగారావు ‘పదా, చూద్దా’మంటూ బయలుదేరారు. ఇద్దరూ వంశీ ఇంటి దగ్గరికి వచ్చారు. ఆ స్వామీజీ వంశీ పక్కింట్లో పూజలు చేయడం గమనించారు. ఆ ఇంటి యజమాని పొలానికి వెళ్లగా, అతని భార్య లింగమ్మ స్వామీజీతో పూజలు చేయిస్తోంది. రంగారావు వంశీని నిశ్శబ్దంగా ఉండమని చెప్పి కిటికీలోంచి లోపల జరిగే తతంగాన్ని చూడసాగాడు.
స్వామీజీ ముగ్గు వేసి పసుపు, కుంకుమ, నిమ్మకాయలను పెట్టి మంత్రాలు చదువుతున్నాడు.
కాసేపటి తరువాత "అమ్మా! మీ ఇంట్లో ఉన్న బంగారు వెండి వస్తువులు తెచ్చి పూజలో పెట్టు. నీకు మంచి జరుగుతుంది" అని చెప్పాడు. ఆమె అలాగే చేసింది. కాసేపు వాటిని ముగ్గులో పెట్టి తర్వాత ఒక డబ్బాలో వేయమన్నాడు. ఆమె అలాగే వేసింది. తరువాత ఏదో వస్తువు తెమ్మన్నాడు. తేవడానికి లోపలికి వెళ్ళింది. స్వామీజీ వెంటనే ఆ డబ్బాలోని బంగారు వస్తువులను తన సంచిలో వేసుకున్నాడు.
సంచిలో నకిలీ నగలు తీసి డబ్బాలో వేసి మూత పెట్టాడు. ఇంతలో లింగమ్మ లోపలి నుండి బయటకు వచ్చింది. "అమ్మా! ఈ డబ్బా తీసుకువెళ్లి దేవుని గదిలో ఉంచు. వారం రోజుల తర్వాత తెరువు. ఈ నగలు రెట్టింపు అవుతాయి. అంతేగాక మీ ఇంటికి పట్టిన శని వదిలి పోతుంది. తొందరపడి ముందుగా తెరిస్తే మీ ఇంట్లో ఒక ప్రాణం పోతుంది" అని భయపెట్టాడు.
ఆమె భయంతో అలాగేనంటూ తల ఊపింది. ‘పూజ చేసినందుకు నాకు దక్షిణ కూడా వద్దు’ అంటూ బయటికి వచ్చాడు స్వామీజీ.
వెంటనే రంగారావు స్వామీజీకి ఎదురెళ్లి "ఆగండి స్వామీజీ! కాస్త నా సమస్యని కూడా తీర్చండి" అన్నాడు.
"ఏంటి నాయన! మీ సమస్య?" అడిగాడు స్వామీజీ.
“మా నగలు పోయాయి స్వామీజీ"
"ఎక్కడ నాయనా"?
"ఇక్కడే ఈ ఇంటిలోనే పోయాయి స్వామీజీ!" మీ సంచిలోనే ఉన్నాయని నా అనుమానం" అన్నాడు.
దొంగస్వామి "నాయనా!నువ్వేదో పరిహాస మాడుతున్నట్లుంది. నాకు సమయం అయ్యింది. నేను వెళ్ళాలి" అన్నాడు.
"అవును స్వామి! మీకు సమయం అయ్యింది. వెళ్లాల్సిన చోటుకు వెళ్లాలి" వ్యంగ్యంగా అన్నాడు రంగారావు.
స్వామీజీ కంగారుగా వెళ్ళబోయాడు. రంగారావు అతన్ని పట్టుకొని చుట్టూ ఉన్న గ్రామస్తుల్ని పిలిచాడు. అందరూ చుట్టుముట్టారు. రంగారావు జరిగిందంతా అందరికీ వివరించాడు. లింగమ్మ ఇంట్లో ఉన్న డబ్బాలు చూడగా నకిలీ నగలు ఉన్నాయి. స్వామి సంచిలో అసలు నగలు బయటపడ్డాయి.
దొంగ స్వామిని పోలీసులకు అప్పగించారు. సకాలంలో స్పందించి దొంగను పట్టించిన రంగారావు, వంశీలను గ్రామస్తులంతా అభినందించారు.
సమాప్తం
----------
పల్లా వెంకట రామారావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: పల్లా వెంకట రామారావు
Profile Link:
జన్మస్థలం: ప్రొద్దుటూరు, కడప జిల్లా.
జననం: 1974
తల్లిదండ్రులు:కీ.శే. శ్రీ రామయ్య, శ్రీమతి ఓబులమ్మ
చదువు: ఎం.ఎ (తెలుగు), టి.పి.టి, డిప్లమో (కంప్యూటర్స్) (జర్నలిజం)
ఉద్యోగం: స్కూల్ అసిస్టెంట్ (తెలుగు)
అభిరుచి: సాహిత్యం, దర్శకత్వం, నాణేల సేకరణ, యాత్రలు చేయడం(యూట్యూబ్ వ్లాగ్స్) travel India telugu
(యూట్యూబ్ చానల్ , Id:@travelIndia82)
రచనలు: 'ది అటాక్' నవల, పూలుముళ్ళు, (మినీ నవల) గేయం,
వచన కవితలు, హైకు, నాటిక, కథలు, పద్యం,
బాలల కథలు, జోక్స్, వ్యాసాలు, వంటివి. సాక్షి, ఈనాడు, వార్త,అల
ఉపాధ్యాయ వాణి, బాలభారతం, చంద్రబాల, సూర్య, బాలల
బొమ్మరిల్లు, ఆంద్రభూమి వంటి పత్రికల్లో ప్రచురితం అయ్యాయి.
సత్కారాలు: జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు, పండిత పరిషత్ వారిచే స్టేట్ అవార్డు,రాజుపాళెం
మండలం వారిచే ఉగాది పురస్కారం; అటా వారిచే , సాహితీ మిత్ర మండలి, యువ
కళావాహిని, కడప జిల్లా రచయితల సంఘం,రామరాజ భూషణ సాహితీ పీఠం, అనంతపురం జిల్లా
రచయితల సంఘం, తెలుగు కళా వేదిక,వేమన సాహితీ కళాపీఠం, కొని రెడ్డి ఫౌండేషన్ , తెలుగు రక్షణ
వేదిక, కర్ణాటక తెలుగు రచయితల సంఘం, మద్రాసు తెలుగు విశ్వవిద్యాలయం సంస్కృతి స్వచ్ఛంద సంస్థ వంటి సంస్థలచే సత్కారం.





Comments