top of page

జిహ్వచాపల్యం



'Jihvachapalyam' - New Telugu Story Written By Neeraja Hari Prabhala

Published In manatelugukathalu.com On 06/09/2024

'జిహ్వచాపల్యం' తెలుగు కథ

రచన: నీరజ హరి ప్రభల 

(ఉత్తమ రచయిత్రి బిరుదు గ్రహీత)

కథా పఠనం: పద్మావతి కొమరగిరి



విశ్వనాథం గారు లెక్చరర్ గా చేసి రిటైరయి భార్య జానకమ్మ తో ప్రశాంత జీవనం గడుపుతున్నారు. ఎప్పటి నుండో రమ్మంటున్న కొడుకు పిలుపు మేరకు తొలిసారిగా అమెరికాకు పయనమయారు విశ్వనాధం దంపతులు. అక్కడ ఎయిర్ పోర్టుకు కొడుకు రవి, కోడలు సుథ వీళ్ళని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకెళ్ళారు. స్నాన పాన భోజన కార్యక్రమాలయ్యాక వాళ్ళకోసం తెచ్చిన బట్టలు‌, వస్తువులు, పచ్చళ్ళు మొ.. వాళ్ళకు ఇచ్చి ప్రయాణ బడలిక తో విశ్రాంతి తీసుకున్నారు విశ్వనాథం దంపతులు. 


సుధ ఆ సాయంత్రం అత్తగారికి వంట ఇంటి సరుకులు ఎక్కడ, ఏమున్నాయో చూపించి, స్టవ్, ఒవెన్, ఎలా వాడాలో వివరించింది. వీళ్ళకోసం ఆరోగ్యానికి మంచిదని బ్రౌన్ రైస్ తెప్పించింది సుధ. మరుసటి రోజు ఉదయమే బ్రేక్ ఫాస్ట్ గా బ్రెడ్ తిని యథావిధిగా రవి, సుథలు ఆఫీసులకు వెళ్ళారు. జానకమ్మ ఉప్మా చేసి భర్తకు పెట్టి తనూ తిని, వంటచేసే కార్యక్రమంలో పడింది. భోజనాలయ్యాక తెలుగు టీవీ ఛానెల్స్ లో ఏవో ప్రోగ్రామ్ లు చూస్తూ పొద్దు గడిపి సాయంత్రం రవి వాళ్ళు రాగానే వాళ్ళతో కబుర్లలో పడ్డారు. 


జెట్ లాగ్ తో రెండు రోజు లు ఇట్టే గడిచాయి. విశ్వనాథం గారికి ఏమీ తోచక, చేసే పని ఏమీ లేక, ఇరుగుపొరుగు మాట్లాడే వాళ్ళు లేక బోర్ కొట్టటం మొదలయింది. 

"తన ఊరిలో అయితే సాయంత్రం అరుగుల మీద ఇరుగుపొరుగుతో చేరి పిచ్చాపాటి కబుర్లు, లోకాభి రామాయణం తో హాయిగా గడిపేవాణ్ణి" అనుకోసాగాడు. వీకెండ్స్ కు వీళ్ళని బయటకు తీసుకెళ్లి అమెరికా చూపించేవాళ్ళు రవివాళ్ళు. 


రవి, సుధ ఆరోగ్య సూత్రాలు ఎక్కువ పాటిస్తారు. రోజూ కూరగాయల ముక్కలు, బ్రొకోలీ ఆకులు, బ్రెడ్, సూప్స్, సలాడ్స్, పాలు‌, పళ్ళు, జ్యూస్ లు తీసుకుంటారు. బ్రేక్ ఫాస్ట్ గా వీళ్ళకు కూడా అదే. జానకమ్మ వంట వీళ్ళిద్దరికే. స్వీట్లు, జంతికలూ, కారప్పూస లాంటి చిరుతిళ్ళు తినటం విశ్వనాథంకు అలవాటు. ఎప్పుడూ ఏదో ఒకటి నోట్లో పంటికింద నలుగుతూ ఉండాలి. ఇండియా నుంచి తెచ్చిన స్వీట్స్, చిరుతిళ్ళు చాటుగా దాచుకుని తినేవాడు. అవి అయిపోయాయి. ఇహ భార్యను పిండి వంటలు చేయమని సణుగుతూనే ఉన్నాడు. 


పాపం ఆవిడ కోడలితో చెపితే 'పిండి వంటలు అనారోగ్యము' అని డ్రైఫ్రూట్సు తెప్పించింది సుధ. విశ్వనాథానికి అవి ఏమూలకూ ఆనేవి కావు. జిహ్వ చాపల్యం ఎక్కువ. కడుపులో ఎలుకలు డాన్స్ చేస్తుంటే అందరూ నిద్రలోకి జారాక నెమ్మదిగా అర్థరాత్రి కిచెన్ లో డబ్బాలు వెతుక్కుని తినేవాడు. భర్త ప్రవర్తనకు జానకమ్మ సిగ్గుతో కుంచించుకు పోతూ కోడలికంట ఎక్కడ పడుతుందో అని భయపడేది. 


కిచెన్ లో ఏదో అలికిడి అయితే సుధ కిచెన్ లోకి రాగానే మామగారు డబ్బాలు వెతుక్కుని తింటున్న ద్రృశ్యం కంటబడి‌ ఇంతవయస్సు వచ్చినా ఈయనకు ఇంకా ఈ జిహ్వచాపల్యం ఏమిటి?’ అనుకుని ఆ విషయం మరునాడు రవితో చెప్పింది. 


"నాన్నా! పరిమితమయిన డైట్ ఆరోగ్యానికి మంచిది, ఇక్కడ ఏదన్నా అనారోగ్యం వస్తే మెడికల్ వసతి ఉండదు. ట్రీట్మెంట్ చాలా ఖరీదు. పైగా ఎంత ఇన్సూరెన్స్ ఉన్నా వెంటనే చూడరు. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి" అని పెద్ద లెక్చలిచ్చాడు రవి తండ్రికి. అలా చెప్పటం విశ్వనాథానికి అవమానకరంగా అనిపించింది. అప్పుడు ఏమీ అనలేక మిన్నకున్నాడు. 


మర్నాడు వాళ్లు ఆఫీసుకి వెళ్ళాక "రాను, రాను అంటే నువ్వే అమెరికా, అమెరికా అంటూ ఎగేసుకుంటూ బయలుదేర దీశావు. నీతో పాటు నన్ను కూడా రమ్మని ప్రాణం తీశావు చూడు, ఇప్పుడేమయ్యిందో‌, ఇదంతా నీ వలననే" అని భార్య మీద విరుచుకుపడ్డాడు. భార్యే కదా లోకువ. 


"బావుంది ఇది మరీ చోద్యం. ఉరుము ఉరిమి మంగలం మీద పడ్డట్టు తప్పు మీ వద్ద ఉంచుకుని నన్ను అంటారెందుకు? అయినా రవి చెప్పిన దాంట్లో తప్పేముంది? మీ మంచికే కదా వాడు చెప్పింది. మీ తిండి యావ తగ్గించుకోవచ్చుగా. కోడలి పిల్ల ముందు సిగ్గుతో చస్తున్నాను" అంది జానకమ్మ. 


"ఇంక ఇక్కడ ఇలా కడుపు మాడ్చుకుంటూ ఆ బ్రౌన్ రైస్, బ్రెడ్, ఆకులూ, అలాలూ, కీరాలు, డ్రైఫ్రూట్సు తింటూ, మాట్లాడే వాళ్లు లేక ఈ జైలులో ఉండలేను. రవితో ఏదో సాకు చెప్పి టికెట్ మార్చుకుని వెళతాను. నీవు వస్తే రా. లేకపోతే ఇంకా నాలుగు నెలలు ఇక్కడే ఊరేగు" అన్నాడు విశ్వనాథం. 


ఒకరోజున రవితో "ఒంట్లో కొంచెం నలతగా ఉంది. ఇంటి మీద బెంగ గా ఉంది. ఇండియాకు వెళ్తామురా" అని రవిని అతికష్టం మీద ఒప్పించి బయలు దేరారు విశ్వనాథం గారు. ఈ ప్రయాణం ఇష్టం లేక పోయినా భర్త వెంట బయలు దేరింది జానకమ్మ. 


తన ఊరిని, తన ఇల్లును చూడగానే ప్రాణం లేచొచ్చినట్టయి ఇల్లంతా చిన్న పిల్లాడిలా తిరిగాడు విశ్వనాథం. వీళ్ళు వచ్చారని గమనించి ప్రక్కింటి పార్వతమ్మ వచ్చి "ఏం వదినా! అమెరికా వెళ్ళి ఆర్నెల్లు ఉంటానని అప్పుడే రెండు నెలలకే వచ్చేశారేం?” అని అడిగింది. 


"ఆ ఏం లేదు వదినా! నీకు తెలుసుగా. ఈ ఇల్లన్నా, ఈ ఊరన్నా, మాకెంత ప్రాణమో! ఎప్పుడూ వదిలి ఉండలేదు. ఇంటి మీద బెంగ వచ్చి రవి వాళ్ళను ఒప్పించి బయలుదేరి వచ్చేశాము" అన్న భార్య సమయస్ఫూర్తి మాటలను విని మనసులో మెచ్చుకుంటూ, పేపరు చదువు కుంటున్న విశ్వనాథం గారు నవ్వుతూ, భార్య తన నవ్వును ఎక్కడ పసిగడుతుందోనని గుబురు మీసాల చాటున దాచే ప్రయత్నం జానకమ్మ దృష్టిని దాటిపోలేదు. 


"ఎంతైనా మగమహారాజు. భార్యను అంత తేలికగా మెచ్చుకోరు " అని మనసులో అనుకుని చిన్నగా నవ్వుకుంది జానకమ్మ. 


.. సమాప్తం .. 


నీరజ హరి ప్రభల గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2024 కథల పోటీల వివరాల కోసం


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ నీరజ హరి ప్రభల గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


 మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

 గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం :

Profile Link:

Youtube Play List Link:


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత్రి  బిరుదు పొందారు



నా గురించి పరిచయం.....


 నా పేరు  నీరజ  హరి ప్రభల. మాది  విజయవాడ. మావారు  రిటైర్డ్  లెక్చరర్. మాకు  ముగ్గురు  అమ్మాయిలు. మాలతి, మాధురి, మానస.  వాళ్లు  ముగ్గురూ  సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా   విదేశాల్లో  ఉద్యోగాలు  చేస్తూ  భర్త, పిల్లలతో  సంతోషంగా ఉంటున్నారు. 


 నాకు  చిన్నతనం  నుంచి  కవితలు, కధలు  వ్రాయడం  చాలా  ఇష్టం. ఆరోజుల్లో  వాటిని  ఎక్కడికి,  ఎలా  పంపాలో  తెలీక  చాలా ఉండిపోయి  తర్వాత  అవి  కనుమరుగైనాయి.  ఈ  సామాజిక మాధ్యమాలు  వచ్చాక  నా రచనలను  అన్ని  వెబ్సైట్ లలో  వ్రాసి వాటిని పంపే  సౌలభ్యం  కలిగింది. నా కధలను, కవితలను  చదివి  చాలా  మంది పాఠకులు  అభినందించడం  చాలా  సంతోషదాయకం. 

నా కధలకు   వివిధ పోటీలలో  బహుమతులు  లభించడం,  పలువురి  ప్రశంసలనందుకోవడం  నా అదృష్టంగా  భావిస్తున్నాను. 


మన  సమాజంలో  అనేక  కుటుంబాలలో   నిత్యం  జరిగే  సన్నివేశాలు, పరిస్థితులు,   వాళ్లు  పడే  బాధలు కష్టాలు, ధైర్యంగా వాటిని   ఎదుర్కొనే  తీరు   నేను  కధలు వ్రాయడానికి  ప్రేరణ, స్ఫూర్తి.  నా కధలన్నీ  మన  నేటివిటీకి, వాస్తవానికి   దగ్గరగా ఉండి  అందరి  మనస్సులను  ఆకర్షించడం  నాకు  సంతోషదాయకం. నిత్యం జరుగుతున్న  దారుణాలకు, పరిస్ధితులకు   నా మనసు  చలించి  వాటిని  కధల రూపంలోకి  తెచ్చి  నాకు  తోచిన  పరిష్కారం  చూపే  ప్రయత్నం  చేస్తాను.   


నా  మనసులో  ఎప్పటికప్పుడు  కలిగిన  భావనలు, అనుభూతులు, మదిలో  కలిగే  సంఘర్షణలను   నా కవితలలో  పొందుపరుస్తాను. నాకు  అందమైన  ప్రకృతి, పరిసరాలు, ఆ సుందర  నైసర్గిక  స్వరూపాలను  దర్శించడం, వాటిని  ఆస్వాదించడం, వాటితో  మమేకమై మనసారా  అనుభూతి చెందడం  నాకు  చాలా ఇష్టం. వాటిని  నా హృదయకమలంలో  అందంగా  నిక్షిప్తం చేసుకుని   కవితల రూపంలో  మాలలుగా  అల్లి  ఆ  అక్షర మాలలను  సరస్వతీ దేవి  పాదములవద్ద  భక్తితో   సమర్పిస్తాను.  అలా  నేను  చాలా  దేశాల్లలో  తిరిగి  ఆ అనుభూతులను, అనుభవాలను   నా కవితలలో, కధలలో  పొందుపరిచాను. ఇదంతా  ఆ వాగ్దేవి  చల్లని  అనుగ్రహము. 🙏 


నేను గత  5సం… నుంచి  కధలు, కవితలు  వ్రాస్తున్నాను. అవి  పలు పత్రికలలో  ప్రచురణలు  అయ్యాయి. పుస్తకాలుగా  ప్రచురించబడినవి. 


“మన తెలుగు కధలు.కామ్. వెబ్సైట్” లో  నేను కధలు, కవితలు   వ్రాస్తూ ఉంటాను. ఆ వెబ్సైట్ లో   నాకధలకి  చాలా సార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి. అనేక ప్రశంసలు  లభించాయి.  వాళ్ల   ప్రోత్సాహం  జీవితాంతం  మరువలేను. వాళ్లకు  నా ధన్యవాదాలు. ఆ వెబ్సైట్ వాళ్లు   రవీంద్రభారతిలో  నాకు  “ఉత్తమ రచయిత్రి” అవార్డునిచ్చి  ఘనంగా  సన్మానించడం  నా జీవితాంతం  మర్చిపోలేను. ఆజన్మాంతం  వాళ్లకు  ఋణపడిఉంటాను.🙏 


భావుక  వెబ్సైట్ లో  కధల పోటీలలో   నేను  వ్రాసిన “బంగారు గొలుసు” కధ   పోటీలలో  ఉత్తమ కధగా  చాలా ఆదరణ, ప్రశంసలను  పొంది  బహుమతి  గెల్చుకుంది. ఆ తర్వాత  వివిధ పోటీలలో  నా కధలు  సెలక్ట్  అయి  అనేక  నగదు  బహుమతులు  వచ్చాయి.  ‘మన కధలు-మన భావాలు’  వెబ్సైట్ లో  వారం వారం  వాళ్లు  పెట్టే  శీర్షిక, వాక్యానికి కధ,    ఫొటోకి  కధ, సందర్భానికి  కధ  మొ… ఛాలెంజ్  లలో  నేను   కధలు వ్రాసి  అనేకమంది  పాఠకుల  ప్రశంశలను  పొందాను. ‘మన తెలుగుకధలు. కామ్  వెబ్సైట్ లో  “పశ్చాత్తాపం” అనే  నా  కధకు  విశేష స్పందన  లభించి  ఉత్తమ కధగా  సెలక్ట్ అయి  నగదు బహుమతి   వచ్చింది. ఇలా  ఆ వెబ్సైట్ లో  నెలనెలా   నాకధలు  ఉత్తమ కధగా  సెలెక్ట్ అయి  పలుసార్లు  నగదు  బహుమతులు  వచ్చాయి. వస్తున్నాయి.



ఇటీవల నేను  వ్రాసిన  “నీరజ  కథాకదంబం” 175 కధలతో పుస్తకం, “ఊహల అల్లికలు”  75 కవితలతో  కూడిన పుస్తకాలు  వంశీఇంటర్నేషనల్   సంస్థ వారిచే  ప్రచురింపబడి  మా గురుదంపతులు  ప్రముఖ వీణావిద్వాంసులు, రాష్రపతి  అవార్డీ    శ్రీ  అయ్యగారి శ్యామసుందరంగారి  దంపతులచే  కథలపుస్తకం,  జాతీయకవి  శ్రీ సుద్దాల అశోక్ తేజ  గారిచే   కవితలపుస్తకం  రవీంద్ర భారతిలో ఘనంగా  ఆవిష్కరించబడటం,  వాళ్లచేత  ఘనసన్మానం  పొందడం, బహు ప్రశంసలు, అభినందనలు  పొందడం  నాఅదృష్టం.🙏 


ఇటీవల  మన  మాజీ ఉపరాష్ట్రపతి  శ్రీ  వెంకయ్యనాయుడి గారిచే  ఘనసన్మానం పాందడం, వారి అభినందనలు, ప్రశంసలు  అందుకోవడం  నిజంగా  నా అదృష్టం. పూర్వజన్మ  సుకృతం.🙏


చాలా మంది  పాఠకులు  సీరియల్ వ్రాయమని కోరితే  భావుకలో  “సుధ” సీరియల్  వ్రాశాను. అది  అందరి ఆదరాభిమానాలను  పొందటమే  కాక   అందులో  సుధ  పాత్రని  తమ ఇంట్లో పిల్లగా  భావించి  తమ  అభిప్రాయాలను  చెప్పి  సంతోషించారు. ఆవిధంగా నా  తొలి సీరియల్  “సుధ”  విజయవంతం అయినందుకు  చాలా సంతోషంగా  ఉన్నది.        


నేను వ్రాసిన  “మమతల పొదరిల్లు”  కధ భావుకధలు  పుస్తకంలో,  కధాకేళిలో “మంచితనం-మానవత్వం” కధ, కొత్తకధలు-5 పుస్తకం లో  “ప్రశాంతినిలయం” కధ, క్షీరసాగరంలో  కొత్తకెరటం   పుస్తకంలో “ఆత్మీయతానుబంధం”, “గుర్తుకొస్తున్నాయి”   పుస్తకంలో  ‘అత్తింటి అవమానాలు’ అమ్మకు వ్రాసిన లేఖ, మొ…కధలు  పుస్తకాలుగా  వెలువడి  బహు  ప్రశంసలు  లభించాయి. 


రచనలు  నా ఊపిరి. ఇలా పాఠకుల  ఆదరాభిమానాలు, ఆప్యాయతలే  నాకు  మరింత  రచనలు  చేయాలనే  ఉత్సహాన్ని, సంతోషాన్నిస్తోంది. నా తుది  శ్వాస వరకు  మంచి రచనలు  చేయాలని, మీ అందరి  ఆదరాభిమానాలను  పొందాలని  నా ప్రగాఢవాంఛ. 


ఇలాగే  నా రచనలను, కవితలను  చదివి  నన్ను   ఎల్లప్పుడూ ఆశ్వీరదిస్తారని   ఆశిస్తూ 


                     మీ  అభిమాన రచయిత్రి

                       నీరజ హరి  ప్రభల.

                          విజయవాడ.

Photo Gallery



Comments


bottom of page