ఎవరికి ఎవరు అనుబంధం
- Kandarpa Venkata Sathyanarayana Murthy

- Jun 29
- 5 min read
#EvarikiEvaruAnubandham, #ఎవరికిఎవరుఅనుబంధం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ

Evariki Evaru Anubandham - New Telugu Story Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 29/06/2025
ఎవరికి ఎవరు అనుబంధం - తెలుగు కథ
రచన: కందర్ప మూర్తి
మోడరన్ సొసైటీలో కడుపున పుట్టిన బిడ్డలు వృద్ధాప్యంలో కనిపెంచిన తల్లిదండ్రుల్ని చిన్నచూపు చూస్తు మానసికంగా శారీరకంగా యాతనలు పెట్టి వారిని రోడ్ల వెంట, వృద్ధాశ్రమాల్లో ఉండేలా చెయ్యడం దురదృష్టకరం.
"మంగా, బాబును తీసుకో. నేను కొబ్బరికాయ కొనుక్కు వస్తాను. " అని గోవిందు తన చేతిలోని కొడుకును భార్యకి అప్పగించి మెట్ల దగ్గర కూర్చున్న కొబ్బరికాయల తాత దగ్గరకొచ్చాడు.
"తాతా, కొబ్బరికాయ ఎంత?"
"పదిహేను రూపాయలు బాబూ !" అన్నాడు తాత.
జేబులోంచి ఇరవై రూపాయల నోటు చేతిలో పెడుతూ తాత చేతిమండ మీదున్న పెద్ద బొల్లిమచ్చ, వెంటనే ఆయన నుదుట పెదవుల మీదున్న మచ్చలు చూసి ఆశ్చర్య చకితుడయాడు. ఆయనెవరో కాదు అరవింద్ వస్త్ర పరిశ్రమల యజమాని వెంకట్రామయ్య గారు.
తెల్లని జుట్టు, గుబురుగా పెరిగిన గెడ్డం, చిరిగిన బనీను, మాసిన పంచతో నీర్సంగా ఉన్న ఆయన్ని అటువంటి దీనావస్తలో చూసి స్తబ్దుడయాడు గోవిందు.
వచ్చే భక్తుల కోలాహలంతో గుడి సందడిగా ఉంది. ఆ సమయంలో ఆయన్ని వివరాలు అడిగి వ్యాపారానికి అడ్డు పడటం ఇష్టం లేక ఇరవై రూపాయల నోటు ఇచ్చి చిల్లర, కొబ్బరికాయ అందుకుని ముందుకు నడిచాడు.
"ఏమయిందండీ, ఇంత ఆలశ్యమైంది ? " అడిగింది మంగ.
“తర్వాత చెబుతాలే, ముందు బాబా గారి దర్శనం చేసుకుందా”మని చెప్పి గర్భగుడి వైపు బయలుదేరాడు. గురువారమైనందున బాబా గారి మందిరం భక్తులతో కిటకిట లాడుతోంది.
వరుసలో నిలబడి సాయిబాబా దర్శనం చేసుకుని మంగ పక్కన చేరి కొడుకును ఒళ్ళోకి తీసుకుని గుడి ప్రాంగణంలో కూర్చున్నాడు గోవిందు.
"ఇందాక అడిగావుగా, కొబ్బరికాయ తేవడానికి ఆలశ్యమెందుకైందని, ఇప్పుడు చెబుతా విను.
అటుచూడు, మెట్ల దగ్గర కొబ్బరికాయలు అమ్ముతున్న తాతను. ఆయనెవరో కాదు కోటీశ్వరుడు, అరవింద్ స్పిన్నింగ్ మిల్స్ యజమాని వెంకట రామయ్య గారు. ధర్మాత్ముడు. తన స్పిన్నింగు మిల్లులో పని చేసే కార్మికుల్ని కన్నబిడ్డల్లా చూసేవారు. ఎవరికి ఏ కష్టం వచ్చినా ఆదుకునేవారు. కార్మికులు ఉండటానికి వసతి గృహాలు కట్టించారు. అలాగే మిల్లులో పని చేసే కార్మికులు కూడా మిల్లును తమ ఆస్థిగా భావించి కష్టపడి పని చేసి లాభాలు ఆర్జించి పెట్టేవారు. పండగలపుడు బోనస్ గా గృహోపకరణాలు సమకూర్చేవారు.
వెంకట్రామయ్య గారి భార్య అన్నపూర్ణమ్మ గారు కూడా చాలా దయగల మనిషి. మిల్లులో పని చేసే కార్మికుల మహిళలు, వారి పిల్లల బాగోగులు చూసేవారు.
వెంకట రామయ్య గారు ఉన్న ఇద్దరు కొడుకుల్నీ విదేశాలకు పంపి పెద్ద చదువులు చెప్పించారు. వారికి సంపన్నుల అమ్మాయిలతో వివాహాలు జరిపించారు.
కోడళ్లిద్దరూ బిజినెస్ మానేజ్ మెంటు చదివిన మోడరన్ సొసైటీలో పెరిగారు. నవనాగరిక వేషభాషలతో కోడళ్లిద్దరూ ఇంటి వాతావరణాన్నే మార్చేసారు.
కట్టూ బొట్టూ ఆహార వ్యవహారాలన్నీ విదేశీ పద్దతికి మారిపోయాయి. కొడుకులిద్దరు విదేశీ వ్యసనాలతో భార్యల చేతుల్లో కీలుబొమ్మలుగా తయారయారు. సనాతన సంప్రదాయ పద్దతుల్లో ఉండే వెంకట్రామయ్య దంపతుల్ని చిన్న చూపు మొదలెట్టారు.
విదేశాల్లో ఉన్నత సాంకేతిక విద్య చదివిన కొడుకులిద్దరు వస్త్ర వ్యాపారాన్ని తమ చేతుల్లోకి తెచ్చుకుని ఆధునిక సాంకేతిక పద్దతులతో విదేశాల నుంచి భారీ యంత్రాల్ని తెప్పించి దేశీయ నూలుకు బదులు టెర్లిన్, నైలాన్, రేయన్, సిఫాన్ వంటి సింథటిక్ వస్త్రాలు తయారు చేయిస్తూ కార్మికుల కడుపులు కొట్టారు.
ఎప్పటినుంచో అరవింద్ మిల్సును నమ్ముకున్న కార్మికులు పనులు లేక రోడ్డున పడ్డారు. అచేతనుడైన వెంకట్రామయ్య గారు కార్మికుల ఆర్థిక బాధలు చూడటం తప్ప ఏమీ చేయలేక పోయారు.
ఇంట్లో కోడళ్ల పెద్దరికం వచ్చి సరైన భోజన సదుపాయాలు లేక అన్నపూర్ణమ్మ గార్ని, బాబు గార్ని ఇంటి వెనక స్టోరు రూములో ఉంచారు. సకల వసతులతో ఎంతో దర్జాగా బతికిన వారిద్దరూ నౌకర్లు పెట్టే తిండి మీద ఆధార పడవల్సి వచ్చింది. అటువంటి పరిస్థితుల్లో వారు మానసికంగా కుంగిపోయారు.
వ్యాపార పనుల్లో వత్తిడిగా ఉండే కొడుకులు వీలున్నప్పుడు వచ్చి స్టోరు రూములో నివాసముంటున్న వెంకట్రామయ్య దంపతుల్ని పరామర్సించే వారట. అమ్మగారు బతికున్నంత కాలం ఆయన కనీస అవసరాలు తీర్చేవారు. అకస్మాత్తుగా ఆవిడ కూడా కాలం చెయ్యడంతో పెదబాబు గారు వార్థక్యంలో ఒంటరి పక్షిగా మిగిలి పోయారు.
తర్వాతి కాలంలో కార్మికుల వసతి గృహాలు కూలగొట్టి గొడౌన్లుగా మారేయి. కంపెనీలో ఆటో ట్రాలీల బదులు పెద్ద ట్రక్కులు నడుస్తున్నాయి. ఫ్యాక్టరీ చుట్టు కాంపౌండుగోడ కట్టి సెక్యూరిటీ పోస్టులు ఏర్పాటు చేసారు.
ఆధునిక టెక్నాలజీతో పెద్ద యంత్రాలు వచ్చి కార్మికుల సంఖ్య తగ్గింది. అంతటా ఆధునికత కనబడుతోంది. చదువుకున్న కొత్త కార్మికుల వేష భాషల్లో మార్పు వచ్చింది. పనివాళ్ల వసతులు, వేతనాలు పెరిగాయి. పాత కార్మికులు పనులు లేక ఇతర వృత్తుల్లో జీవనోపాధి వెతుక్కున్నారు.
పెద బాబు గారి దయ వల్ల నేను పోలిటెక్నిక్ డిప్లమో చేసిన తర్వాత మీ అన్నయ్య తోడు కలిసి మేమిద్దరం బ్యాంకు లోను మీద మిషన్లతో చిన్న వర్కుషాపు పెట్టి స్వయం ఉపాధి కార్యక్రమం మొదలెట్టాము. బాబా చల్లగా చూసారు. వర్కుషాపులో ఆర్డర్లు పెరిగి ఆర్థికంగా బలపడ్డాము.
అప్పట్లో పనులు లేక ఉపాధి కోసం నాన్న అమ్మను తీసుకుని మా స్వంత ఊరు వెళిపోయారు. తర్వాత నాన్నకు క్షయ జబ్బు, వృద్ధాప్యం వల్ల స్వర్గవాసులు కాగా, అమ్మని నా వద్దకు తీసుకు వచ్చాను.
ఉన్నంతలో చక్కటి సదుపాయాలున్న మనం ఉంటున్న ఇంటిని కొనుగోలు చేసాను. మీ అన్నయ్యతో నా అనుబంధం నిన్ను పెళ్లి చేసుకుని బాంధవ్యంగా మారింది. తర్వాత మన ప్రేమానురాగాలకు గుర్తుగా బాబు పుట్టడం జరిగింది.
ఈమధ్య మా నాయనతో కలిసి పని చేసిన మా బంధువొకరు కలిసినప్పుడు మాటల సందర్భంలో అరవింద్ బట్టలమిల్లు యజమాని వెంకట్రామయ్య గారి దీనావస్థను, వృద్ధాప్యం వల్ల ఆరోగ్యం క్షీణించినట్టు, మోడరన్ పద్దతుల్లో మసలే కోడళ్ల నిరాదరణ భరించలేక మతి భ్రమించి ఇల్లు వదిలి ఎటో వెళిపోయినట్టు చెప్పినాడు. పదిమందికి అన్నం పెట్టిన ధర్మదాత బికారిలా తిరుగుతున్నాడని తెలిసి అమ్మ, నేను ఎంతో బాధ పడ్డాము.
నేను ఇంత ఉన్నత స్థితికి వచ్చి పది మందికి జీవనోపాధి కలిగించానంటే ఇదంతా ఆ పెద్దాయన చలవే. వారి ఋణం తీర్చుకోవాలి. బికారిలా గుడి మెట్ల మీద బ్రతకనివ్వను.
ఆయన్ని మన ఇంటికి తీసుకువచ్చి చనిపోయిన నాన్నే తిరిగి వచ్చినట్లు వారి సేవ చేసుకుంటాను." అని జరిగిన కథ చెప్పాడు గోవిందు.
"అలాగే నండి, తప్పక మనింటికి తీసుకు వచ్చి మామయ్య గారిలా చూసుకుందాము " అంది మంగతాయారు.
ఇంటికి వచ్చి గోవిందు తల్లికి మిల్లు యజమాని వెంకట్రామయ్య గారు కనిపించడం, ఆయన దుర్భర పరిస్థితి వివరించి తన మనసులోని మాట చెప్పగా ఆమె కూడా కొడుకు విశాల హృదయాన్ని మెచ్చుకుని " అలాగే చేద్దాం " అంది.
బాబా గారి గుడి దగ్గర భక్తుల సందడి తగ్గగానే అమ్మగా మిగిలిన కొబ్బరి కాయలు, అమ్మిన డబ్బులు పూజారి గార్కి అప్పగించడానికి వచ్చిన వెంకటరామయ్య గార్ని చూసి గోవిందు మనసు చలించిపోయింది.
అంతకు ముందే పూజారి గారి ద్వారా పెద్దాయన విషయం తెలుసుకున్నాడు. పూజారి గారు చెప్పిన సంగతి ఏమిటంటే, ఒకరోజు బాబా గుడి అరుగు మీద ఆకలితో సొమ్మసిల్లిన వెంకట్రామయ్య గార్ని చూసిన సెక్యూరిటీ గార్డు పూజారి గార్కి చెప్పగా, ఆయన చేసిన సపర్యల మూలంగా కోలుకున్న పెద్దాయనకు ప్రసాదం తినిపించి ఆయన దీనావస్థను చూసి గుడి యాజమాన్యంతో మాట్లాడి కొబ్బరికాయలు అమ్మించి వచ్చిన లాభంతో ఆయన తిండికి జరుగుబాటు అయేలా ఏర్పాటు చేసారు. అలా బాబా గుడి ప్రాంగణంలో ఆయన రోజులు గడుస్తున్నాయి.
ఎంతో దర్జాగా బ్రతికిన వెంకట్రామయ్య గారి దుర్భర జీవిత గాథ గోవిందు ద్వారా తెలుసుకున్న పూజరి గారు ఎంతో బాధ పడ్డారు. పెద్దాయన్ని తమ ఇంటికి తీసుకెళ్లి ఆయన బాగోగులు చూసుకుంటామని గోవిందు చెప్పగా, పూజారి గారు సంతోషించి బాబా మిమ్మల్ని చల్లగా చూడాలని ఆశీర్వదించారు.
గోవిందు వెంకటరామయ్య గారి దగ్గరకెళ్లి తనని పరిచయం చేసుకుని తను వారి వస్త్రపరిశ్రమ మిల్లుకార్మికుడు వీరయ్య కొడుకునని, మీ దయ వల్ల హైస్కూలు చదువు తర్వాత సాంకేతిక విద్య నేర్చుకుని స్వయంగా చిన్న పరిశ్రమ నడుపుతు, ఆర్థికంగా నిలదొక్కుకున్నానని, తన తండ్రి చనిపోయినందున పెద్ద దిక్కుగా ఉండాలని వేడుకున్నాడు.
వెంకట్రామయ్య గారు ముందు నిరాకరించినా గోవిందు వినయ విధేయతలకు, గుడి పూజారి గారు నచ్చ చెప్పడంతో ఒప్పుకున్నారు. సాదరంగా ఇంటికి తీసుకు వచ్చిన వెంకట్రామయ్య గార్ని చూసి గోవిందు తల్లి మురిసిపోయింది.
గోవిందు, మంగతాయారు ఆయనకు సపర్యలు చేస్తూ ఎంతో ఆప్యాయంగా చూసుకుంటున్నారు. వారందరి ఆదరాభిమానాలకు వెంకట్రామయ్య గారు తన స్వంత కొడుకుల దగ్గర కెళ్లడానికి ఇష్టపడ లేదు. తన శేష జీవితంలో వారితోనే గడపాలని నిశ్చయించుకున్నారు.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.




Comments