ఎవరు బాధ్యులు?
- Chilakamarri Satyanarayana

- 16 hours ago
- 3 min read

ఎక్కడో జరిగే యుద్ధం… మన వంటింటి మంటను ఆర్పేస్తే? అప్పుడు బాధ్యులు ఎవరు?
Evaru Badhyulu - New Telugu Story On Social Problems | Chilakamarri Satyanarayana
ఎవరు బాధ్యులు? - సామాజిక సమస్యల పైన తెలుగు కథ | చిలకమర్రి సత్యనారాయణ
Published In manatelugukathalu.com On 01/04/2026
“గ్యాస్ సిలిండర్ కొరత వలన ఈ రోజు నుంచి ప్రతి ఉదయం ఇడ్లీ లేదా ఉప్మా లేదా పొంగల్ ఏదో ఒకటి మాత్రమే ఫలహారంగా ఇవ్వబడుతుంది” అని వచ్చిన వాట్సప్ సందేశాన్ని చదివింది చిన్మయి. సమతా వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటున్న ఆమె హైదరాబాద్ మాదాపూర్లో ఉన్న ఓ బహుళజాతి సంస్థలో ఉద్యోగిని. గత రెండేళ్లుగా చిన్మయి ఆ హాస్టల్లో ఉంటోంది. అమీర్పేటలో ఉండే ఆ హాస్టల్ నుంచి చిన్మయి ఆఫీస్ మెట్రోలో వెళితే పదిహేను నిమిషాలు.
ఉదయమే ఎనిమిది గంటలకల్లా తయారై “బ్రేక్ ఫాస్ట్” చేసేసి, భోజనం కూడా డబ్బాలో సర్దుకొని తొమ్మిదింటికల్లా మెట్రో ఎక్కేస్తుంది. ఠంచనుగా తొమ్మిదిన్నరకల్లా ఆఫీసులో అడుగు పెట్టేస్తుంది.
ఆ రోజు కూడా ఎనిమిదింటికి తయారై డైనింగ్ రూమ్కి వెళదాము అని అనుకుంటుండగా, బాత్రూంలోంచి బయటికి వచ్చిన తేజస్వి అంది “అమెరికా - ఇరాన్ యుద్ధం కాదు గానీ మన ప్రాణాలకొచ్చింది”.
తేజస్వి వాళ్ళ ఊరి అమ్మాయి, ఉద్యోగరీత్యా సహచరి. తేజస్వికి దోశలంటే చాలా ఇష్టం; రోజూ తినమన్నా తింటుంది. ఉప్మా అంటే రుచించదు. పొద్దున్న పొద్దున్నే పొంగల్ తినడం ఇష్టముండదు. ఇడ్లీ మాత్రం వారానికి ఒకటి రెండు సార్లు పర్వాలేదు.
చిన్నప్పటి నుంచి చిన్మయికి వార్తలంటే ఆసక్తి లేదు. ఇంటిలో నాన్న తెప్పించే ‘ఈనాడు’ దినపత్రికలో సైతం మొదటి పేజీలో పతాక శీర్షిక మాత్రమే అప్పుడప్పుడు చదివేది. అయితే ఇటీవల అమెరికా - ఇరాన్ యుద్ధం మొదలయ్యాక కుతూహలంగా యుద్ధ వార్తలు చదవడం మొదలుపెట్టింది.
రెండు మూడు రోజులుగా దేశంలో ముడి చమురు కొరత ఏర్పడిందని, కారణం గల్ఫ్ దేశాల నుంచి దిగుమతులు ఆగిపోవడమే అని అందరూ అనుకుంటుంటే విన్నదామె. మన దేశం 88 శాతం క్రూడ్ ఆయిల్ గల్ఫ్ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుందని, దానిని శుద్ధి చేసి పెట్రోల్గా, డీజిల్గా, గ్యాస్గా మార్చి దేశీయ అవసరాలకి ఉపయోగిస్తారని తెలిసి అర్థమైంది. యుద్ధం ఆరంభమై పది రోజులు గడిచాయో లేదో గ్యాస్ కొరత ఏర్పడిందని వార్తలు వచ్చాయి. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల వినియోగార్థం ఇచ్చే గ్యాస్ ఆపేసింది. ఇవన్నీ మెట్రోలో ప్రయాణం చేస్తున్నప్పుడు, ఆఫీస్ కాంటీన్లో కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు తెలిశాయి.
యుద్ధం ఆరంభమై పది రోజులు గడిచాయో లేదో గ్యాస్ కొరత ఏర్పడిందని వార్తలు వచ్చాయి. దానికి తోడు కేంద్ర ప్రభుత్వం వ్యాపారుల వినియోగార్థం ఇచ్చే గ్యాస్ని ఆపేసింది. ఆఫీస్లో కూడా యూరప్కి, గల్ఫ్కి సంబంధించిన వినియోగదారులు తాత్కాలికంగా ప్రాజెక్టులు నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. చిన్మయి వాళ్ళ కంపెనీ యాజమాన్యం కూడా హెచ్చరిక జారీ చేసింది. ప్రాజెక్టుల నిలుపుదల పరోక్షంగా ఉద్యోగాల మీద పడుతుందని, దానికి అందరూ సిద్ధంగా ఉండాలని దాని సారాంశం.
యుద్ధం మొదలైన పదిహేనో రోజున అమీర్పేటలో ఓ కమ్యూనిటీ హాలులో “దేశంలో ఆయిల్ సంక్షోభం” అనే అంశం మీద రాజకీయ చర్చ జరుగుతుందని తెలిసింది. తేజస్వికి సహజంగా ఇటువంటి విషయాల పట్ల ఆసక్తి కాబట్టి “వెళదామా?” అని చిన్మయిని అడిగింది. ఇద్దరూ కలిసి వెళ్ళారు.
సాయంత్రం ఆరు గంటలకన్న సమావేశం ఏడు గంటలకి ప్రారంభం అయింది. సభలో కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న పార్టీ ప్రతినిధిగా ఓ పార్లమెంట్ సభ్యుడు, రాష్ట్రంలో అధికారంలో ఉన్న పార్టీ శాసన సభ్యుడు పాల్గొనడంతో సమావేశానికి చాలా మంది వచ్చారు.
పార్లమెంట్ సభ్యుడు లేచి దేశంలో ఆయిల్ కొరత లేదని, ఇదంతా ప్రతిపక్షాల రాద్ధాంతమని ఆవేశంగా అన్నాడు. ఇక శాసన సభ్యుడైతే “ఆయిల్ కొరత లేకపోతే హోటళ్ళకి, చిన్న చిన్న కర్రీ పాయింట్ నడుపుకునే బడుగు వర్గాలకి ఎందుకు గ్యాస్ దొరకడం లేదు?” అని మరింత ఆవేశంగా ప్రశ్నించాడు.
ప్రేక్షకులు రకరకాల ప్రశ్నలు వేశారు. నాయకులు జవాబులు చెప్తున్నారు.
“ఇంకెవరైనా ఏమైనా అడుగుతారా?” సభా నిర్వాహకులు మైకులో అడిగారు.
హఠాత్తుగా చిన్మయి లేచి నిలబడింది. అందరి దృష్టి ఆమె మీదకు మళ్ళింది. తేజస్వి అయితే ఆశ్చర్యపోయింది.
“నా పేరు చిన్మయి. నాకు రాజకీయాలంటే తెలియదు. ఎక్కడో ఎవరెవరో యుద్ధం చేసుకుంటుంటే నాకేమవుతుంది అని అనుకునేదాన్ని మొన్నటి వరకు. అయితే క్రమంగా అర్థమవుతోంది. ఆ యుద్ధం కారణంగా తిండి దొరకని స్థితి, ఆటోలో ఎక్కి తిరగలేని దుస్థితి, ఉద్యోగం పోయే పరిస్థితి...” ఒక్క క్షణం ఆగిందామె.
“ఒకప్పుడు మా అమ్మమ్మ కట్టెల పొయ్యి మీద అన్నం వండేది, కుంపట్లో కాఫీ కాచేది అంటూ మా అమ్మ చెబితే నమ్మేదాన్ని కాదు. రైళ్ళు బొగ్గులతో నడిచేవని, ఆ తర్వాత ఆవిరితోను, డీజిల్తోను నడిచేవని నాన్న చెప్తారు. కానీ నేను పుట్టీ బుద్ధి ఎరిగాక రైళ్ళు కరెంట్తోనే నడుస్తున్నాయి.
అయితే నాకు ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే, మన దగ్గర లేని పెట్రోల్, డీజిల్, గ్యాస్లను ఎక్కడి నుంచో దిగుమతి చేసుకొని కార్లు, బస్సులు, విమానాలు నడుపుతూ కాలం గడిపేస్తున్నాం. ప్రభుత్వాలు లక్షల కోట్లు వెచ్చిస్తున్నాయి. మళ్ళీ మన దగ్గర నుంచే పన్నుల రూపంలో తీసుకుంటున్నాయి. ఒక్క రోజు ఆయిల్తో ఓడ గల్ఫ్ దేశాల నుంచి రాకపోతే మన దేశ ఆర్థిక వ్యవస్థ కూలిపోయే పరిస్థితి. మనకి లేని వస్తువు మీద ఇంతగా ఆధారపడిపోవడం ఆశ్చర్యంగా లేదా?
అధికార పక్షం గానీ, ప్రతిపక్షం గానీ ఎప్పుడైనా అనుకున్నారా? ప్రపంచంలోనే పెద్ద ప్రభుత్వ సంస్థ అయిన రైల్వేలు ముందుచూపుతో మారాయి. మరి అదే ఆలోచన మిగతా వ్యవస్థలో ఎందుకు ఆలోచించలేదు?” ఆవేశంలో మాట సరిగ్గా రావడం లేదు చిన్మయికి.
వేదిక పైన ఉన్న పెద్దలు తలదించుకున్నారు. సభంతా ఒక్కసారిగా నిశ్శబ్దం అయిపోయింది. అయితే రెండు నిమిషాల తర్వాత హాలు చప్పట్లతో మారుమ్రోగింది.
*******************************************************************
చిలకమర్రి సత్యనారాయణ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: చిలకమర్రి సత్యనారాయణ
తెలుగు భాష అంటె ఎంతొ మక్కువ..ఆదిలొ నాకవితలు వ్యాసాలు అంధ్రజ్యొతి అంధ్ర పత్రిక ప్రచురించి ఎంతగానొ ప్రొత్సహించాయి. ఉద్యొగరీత్య సిండికేటుబ్యాంక్ లో అధికారిగ పదవి, అనెక ప్రదేశాలను వ్యక్తులను పరిచయంచెసింది. ప్రస్తుతం న్యాయవాది వృత్తిలో ఉంటూ భిన్న సమస్యలతొ సతమతమయ్యె వ్యక్తులకు సహయం చెయ్యాలని ఆకాంక్ష.
వర్తమానంలో జరిగే సంఘటనలకు స్పందించడం అలవాటు.చాలా సందేహాలకు భగవద్గీత సమాధానమని నా నమ్మకం.
చిన్నారి మనవడు అరుష్ తొ కాలక్షేపం. కుటుంబం ప్రశాంతంగా ఉంటే జీవితం ఆనందంగా ఉంటుందని నమ్ముతాను.
తిరిగి నేను రచయితగా మారడానికి అన్నయ్య కృష్ణమాచార్యులు ప్రొత్సహం అయితె తెలుగుకథలు మాధ్యమం కావడం నా అదృష్టం.




ప్రస్తుత పరిస్థితిని చాలా చక్కగా వివరించారు రచయిత. ఇది ఒక్క చిన్మయి మనసులో ప్రశ్న మాత్రమే కాదు, సామాన్యులందరూ అడగాలనుకుంటున్న ప్రశ్న