కరోనా మళ్లీనా
- Srinivasarao Jeedigunta
- 4 days ago
- 5 min read
#JeediguntaSrinivasaRao, #KaronaMallina, #కరోనామళ్లీనా, #JeediguntaSrinivasaRao,#TeluguStory, #తెలుగుకథ

Karona Mallina - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 15/06/2025
కరోనా మళ్లీనా - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
సుబ్బారావు, సింహాచలం, రామూర్తి ముగ్గురు అన్నదమ్ములు. సుబ్బారావు అందరికంటే పెద్దవాడు, ఆ తరువాత సింహాచలం, ఆ తరువాత రామూర్తి. ముగ్గురు హైదరాబాద్ లోనే వుంటున్నారు.
ప్రపంచం అంతా కరోనా తో వణికిపోతోవుంది. ఒకరి యింటికి ఒకరు రాకపోకలు లేవు. పలకరించుకోవటం ఫోన్లోనే.
ఒకరోజున, రామూర్తి అన్నగారైన సుబ్బారావు కి ఫోన్ చేసి, మాటల మధ్య లో తను కరోనా రాకుండా వుండటానికి వాక్సిన్ వేయించుకున్నాని చెప్పాడు.
"మొన్ననే కదరా వాక్సిన్ బజార్ లో కి వచ్చింది, అప్పుడే నీకు ఎలా దొరికింది "అన్నాడు సుబ్బారావు.
"ఏమిలేదు, మన సింహాచలం అల్లుడు గవర్నమెంట్ హాస్పిటల్ లో డాక్టర్ కదా, అతను రెండు వాక్సిన్ లు తెచ్చి, మామగారికి, అత్త గారికి యిచ్చాడుట, దానితో నిన్న సింహాచలం ఫోన్ చేసి చెప్పాడు, వాళ్ళిద్దరికి కరోనా రాదని. దాంతో వాడిని బ్రతిమాలి యింకో వాక్సిన్ సంపాదించి, నేను కూడా తీసుకున్నాను. "అన్నాడు రామూర్తి.
"యింత స్వార్థం గా వున్నారేమిటిరా, మీ యిద్దరికంటే నేను పెద్దవాడిని కదా, నాకు కూడా ఒక వాక్సిన్ యిప్పించకుండా, మీరిద్దరూ తీసుకుంటారా " అని ఫోన్ పెట్టేసాడు సుబ్బారావు కోపం తో.
రెండు రోజులతరువాత, సింహాచలం నుంచి ఫోన్ రావటం తో బహుశ తనకి కూడా ఒక వాక్సిన్ యిస్తాను రమ్మని చేసాడేమో అని సుబ్బారావు "హలో " అన్నాడు.
అటువైపునుంచి మరదలు కంగారు గా మాట్లాడుతో చెప్పింది. మీ తమ్ముడికి ఉదయం నుండి విపరీతంగా జ్వరం, డోకులు, వణుకు తో వున్నారు, హాస్పిటల్ కి తీసుకునివెళ్తున్నాము, మీరు పెద్దవాళ్ళు అని చెపుతున్నాను" అని ఫోన్ పెట్టేసింది.
తనకి కూడా వాక్సిన్ యిప్పించలేదని కోపంతో వున్న సుబ్బారావు అంతా మర్చిపోయి కొడుకుని తీసుకుని హాస్పిటల్ కి వెళ్ళాడు.
అప్పటికే తమ్ముడు వాళ్ళు రావడం, డాక్టర్ ని కలవడం, టెస్ట్ చేసి కరోనా పాజిటివ్ అని చెప్పి అడ్మిట్ చేసుకోవడం అయిపొయింది.
తమ్ముడి కొడుకు సుబ్బారావు కి ఎదురై జరిగింది చెప్పి, “పెద్దనాన్నగారు.. మీరు ఒకసారి డాక్టర్ గారితో మాట్లాడండి, నాకు భయం గా వుంది” అన్నాడు.
సహజంగా రోగం అంటే భయపడే సుబ్బారావు కి ఆ క్షణం లో ఎటువంటి భయం లేకుండా వెళ్ళి డాక్టర్ ని కలిసి మాట్లాడాడు. "మా వాడు కరోనా రాకుండా వాక్సిన్ తీసుకున్నాడు, అయినా ఎలా కరోనా వచ్చింది " అని అడిగాడు డాక్టర్ ని.
"కరోనా కి వాక్సిన్ ఎక్కడ వచ్చిందండి.. కరోనా వస్తే తట్టుకోవడానికి ధైర్యం వచ్చే వాక్సిన్ ఒకటి బాబా ధనార్జాన్ కనిపెట్టింది వచ్చింది మార్కెట్ లో కి. కరోనా పేషెంట్స్ కి ధైర్యం కోసం గవర్నమెంట్ కూడా ఆ వాక్సిన్ ఇస్తోంది, బహుశా మీ వాడు ఆ వాక్సిన్ తీసుకున్నారనుకుంటా. అందుకనే ఆయన చాలా ధైర్యం గా వున్నారు " అన్నాడు డాక్టర్ నవ్వుతు.
“రోజుకి లక్ష రూపాయలు అవుతుంది ఖర్చు, మీరు అయిదు రోజులకి సరిపడ డబ్బు కట్టి వెళ్లిపోండి. యిక్కడ ఎవరు వుండటానికి వీల్లేదు” అన్నాడు డాక్టర్ గారు.
“మరి మా తమ్ముడు దగ్గర ఎవరుంటారు మేము వెళ్ళిపోతే, మా తమ్ముడు కొడుకునైనా ఉండనివ్వండి” అన్నాడు సుబ్బారావు.
“ఉండాలంటే అతను కూడా అడ్మిట్ అవ్వాలి, అతను బాగానే వున్నాడు కాబ్బటి ఫిఫ్టీ థౌసండ్ రోజుకి అవుతుంది” అన్నాడు.
మా తమ్ముడి కొడుకు “అయితే అయ్యింది నేను నాన్న దగ్గర వుంటాను, నాకు రెసిస్టన్స్ ఎక్కువగానే వుంది అని బావ గారు చెప్పారు” అన్నాడు తల్లితో.
“చాల్లే ఊరుకో, పేషెంట్ దగ్గర డాక్టర్లే వుండటం లేదు, నువ్వు ఎలా వుంటావు, రోజు ఫోన్ చేసి తెలుసుకుందాము, ఈ హాస్పిటల్ వాళ్ళు మీ డాక్టర్ బావకి బాగా తెలిసినవాళ్ళు” అంటూ కొడుకుని లాక్కుని వెళ్ళిపోయింది సుబ్బారావు మరదలు.
రెండవ రోజుకి సుబ్బారావు మరదలు కి కూడా అవే లక్షణాలతో అదే హాస్పిటల్ లో చేరింది.
ఈ కధ యిలా వుండగా, వాక్సిన్ కరోనా రాకుండా కాపాడదని రామూర్తి కి తెలిసింది. తనకి రెసిస్టెన్స్ బాగా వుంది అనుకుని వూరంతా మాస్క్ లేకుండా చెడ తిరుగుడు తిరిగేసాడు. యిప్పుడు తమ్ముడికి కరోనా రావడంతో,భయం తో మంచం ఎక్కేడు. అతనికి కూడా జ్వరం, కళ్ళు తిరగడం తో హాస్పిటల్ లో టెస్ట్ చేయించారు. టెస్ట్ లో కరోనా పాజిటివ్.
“డబ్బుకట్టి వెంటనే జాయిన్ అవ్వండి” అని డాక్టర్ వెళ్ళిపోయాడు.
అయితే రామూర్తి కి అనుమానం వచ్చింది, తనని చూసిన డాక్టర్ మాస్క్ కూడా వేసుకోలేదేమిటి అని. అయితే రోజుకి లక్ష కట్టడం యిష్టం లేక, ఇంటిలోనే జాగ్రత్తగా ఉంటానని చెప్పి యింటికి వచ్చి జ్వరం మందులు పుచ్చుకుంటూ, పాత పాటలు వింటూ గడుపుతున్నాడు.
హాస్పిటల్ నుంచి ఎవరో రెండు మూడు సారులు ఫోన్ చేసి “యింట్లో వుంటే ప్రమాదం, ఫీజు కొద్దిగా తగ్గిస్తాము” అని చెప్పారు.
“ఆ భయం లేదులెండి, మా నాన్నగారికి జ్వరం తగ్గింది, రేపు అన్నం కూడా పెడదామనుకుంటున్నాము” అని చెప్పాడు రామూర్తి గారి అబ్బాయి.
దాంతో హాస్పిటల్ వాళ్ళు కంగారు పడి, “మీ నాన్నగారి పేరు ఏమిటి?” అని అడిగి, “అరే.. ఆయన కి కరోనా నెగటివ్, ఎవరు చెప్పారు పాజిటివ్ అని” అని ఫోన్ కట్ చేసారు.
ఆ మాట వినగానే మంచం మీదనుంచి దిగ్గున లేచి “డబ్బు గుంజటానికి, కరోనా వచ్చింది అని చెప్పారు, నా దగ్గరా వీళ్ళ వేషాలు” అంటూ చెప్పులు వేసుకుని బయలుదేరాడు బజార్ రామూర్తి..
ఈ విషయం తెలిసి, సింహాచలం, అతని భార్య కూడా అల్లుడు తో చెప్పి వేరే ల్యాబ్ లో బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే, కరోనా నెగటివ్ అని వచ్చింది. ‘వీళ్ళ దుంపలు తెగ, డబ్బు కోసం ఎంత నాటకం ఆడారు’ అనుకుని, తమని వెంటనే డిశ్చార్జ్ చేయమని డాక్టర్ ని అడిగారు.
“మీ యిష్టం, మీ రెస్పాన్సిబిలిటీ మీద డిశ్చార్జ్ చేస్తాము, అయితే యింటి దగ్గర ప్రతీ రోజు ఆవిరి పట్టండి కరోనా తగ్గిపోతుంది” అన్నాడు డబ్బు అంతా ఆవిరి చేసి.
తమ్ముడు ని హాస్పిటల్ లో చూసుచ్చిన దగ్గర నుంచి, సుబ్బారావు కి తెలియని భయం తో ఉలిక్కిపడుతున్నాడు. ఒక రోజు కొడుకుని పిలిచి, ఎందుకైనా మంచిది కరోనా టెస్ట్ చేయించమని ఆడిగాడు.
“ఎందుకు నాన్న, బాబాయ్ వాళ్ళకి కూడా ఏమిలేదు అని రిపోర్ట్ వచ్చింది, యింకా మీకెందుకు భయం” అన్నాడు.
అయినా తండ్రి వినకపోవడం తో కాలనీలో వున్న మంచి పేరున్న హాస్పిటల్ కి తీసుకుని వెళ్ళి డాక్టర్ కి చూపించాడు.
“కరోనా టెస్ట్ ఎవరికి పడితే వారికి చెయ్యరండి, మీరు చూడటానికి రాయి లాగా వున్నారు, మీకెందుకు టెస్ట్” అన్నాడు డాక్టర్ సుబ్బారావు తో.
“లేదండి, నాకెందుకో అనుమానం గా వుంది, మీరు టెస్ట్ చేయకపోతే భయంతో చచ్చిపోతాను, మీరు టెస్ట్ చేయండి” అని బలవంతం చేసాడు సుబ్బారావు.
“సరే మీ యిష్టం నాకేమైపోయింది,” అని డాక్టర్ టెస్ట్ చేసాడు, నెగటివ్ వచ్చింది.
“చూసారా యిప్పుడు భయం తగ్గిందా” అంటూ వుండగా, సుబ్బారావు ఒక తుమ్ము తుమ్మాడు గట్టిగా.
“ఏమిటి యింకా మీ అనుమానం తీరలేదా, అయితే నేను చేసుకుని చూపిస్తాను చూడండి” అని డాక్టర్ గారు టెస్ట్ చేసుకున్నాడు. రిజల్ట్స్ పాజిటివ్ వచ్చింది.
“చచ్చాన్రోయ్.. ఈ స్ట్రిప్స్ తగలడా.. కరోనా వున్నవాడికి లేనట్టుగాను, లేని వాడికి వున్నట్ట్లు గా చూపిస్తున్నాయి. దేముడో, యిప్పుడు నేను ఏ డాక్టర్ దగ్గర కి వెళ్ళాలి నాయనో..” అంటూ గబగబా పరిగెత్తాడు డాక్టర్.
సరే తనకి లేదు అని తెలుసుకుని యింటికి చేరుకుని, కరోనా విషయం మర్చిపోయాడు.
వేరే స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్లన ఈ డాక్టర్ గారితో అక్కడ డాక్టర్స్ అందరు మాకు కూడా ఈ స్ట్రిప్స్ మీద అనుమానం వుంది. కాబట్టి అందరం కలిసి ఎవరైనా ఈ సబ్జెక్టు తెలిసిన సైంటిస్ట్ ని కలుద్దాం అనుకుని, ముంబాయి లో వున్న పెద్ద పేరున్న డాక్టర్ తిలక్ ని కలిసి తమ డౌట్ ని అడిగారు.
ఆయన నవ్వుతు, “కరోనా రావటానికి కారణం మీరే, ఈ విధంగా గుంపుగా తిరగడం వలన కరోనా తగ్గటం లేదు, రాసుకుని, పూసుకుని తిరగడం మానేస్తే, కరోనా భారీ పడరు.
రోజూ జామాకు కషాయం, అల్లం కషాయo, మిరియాల రసం వాడుతో, ఆవిరి పడ్తో, శుభ్రత పాటించాలి అంతే. దీనికి ఎటువంటి వాక్సిన్ లు అక్కరలేదు. భగవంతుడు తన సృష్టి లో అన్నీ రోగాలు కుదరచ్చటానికి సరిపడ మూలికలు, ఆకులు యిచ్చాడు,” అన్నాడు డాక్టర్ తిలక్.
“మరి ఈ డాక్టర్ కి వచ్చిన పాజిటివ్ గురించి?” అని అడిగారు.
“కషాయలే.. అవి చాలు” అన్నాడు తిలక్ గారు. ఇంతలో పాజిటివ్ వచ్చిన డాక్టర్ పెద్దగా తుమ్మి, “థాంక్స్ డాక్టర్ మా అనుమానం తీర్చారు” అన్నాడు.
వాళ్ళు అటు వెళ్ళగానే, “చచ్చాం రా నాయనా, ఆ పాజిటివ్ గాడు నా మొహం మీద తుమ్మెడు, ఎందుకైనా మంచిది ఒకసారి టెస్ట్ చేసుకోవా”లని లోపలకి వెళ్ళాడు డాక్టర్ తిలక్.
ఎవడి ప్రాణం వాడికి ఎక్కువ అంతేగా.
ఎందుకైనా మంచిది జనం లోకి వెళ్ళకండి మాస్క్ లేకుండా.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Comments