top of page

క్షీరసాగర మథనము - 17

Updated: Apr 3

#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )


Ksheerasagara Mathanamu - 17 - New Telugu Poems Written By T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 28/03/2025

క్షీరసాగర మథనము - 17 - తెలుగు పద్యాలు

రచన: T. V. L. గాయత్రి



ఇక క్షీరసాగర మథనము - 17 చదవండి..


93.

వచనము.


తదనంతరంబున యధావిధిగ దైత్యులు, దేవతలు కూడి క్షీరసాగరమథనము 

గావించుచుండగా.


94.

తేటగీతి.


వారుణీదేవి కన్యయై ప్రభవమొంద

నసురులద్దేవిని వరించి యభిషలించ

వారికడకేగి వారుణి వరములొసగ

సంతసించిరా సురలట సమధికముగ.//


తాత్పర్యము.


ఆ పాల సముద్రమునుండి వారుణీదేవి (ఒకరకమైన మోహము కలిగించే దేవత) పుట్టింది. ఆమెను చూచి రాక్షసులు ఆమె తమకు కావాలని కోరుకున్నారు. అలా ఆ వారుణీదేవి రాక్షసుల దగ్గరకు చేరి వరములిస్తూ ఉంటే వారంతా చాలా సంతోషించారు.//


95.

తేటగీతి.


దైత్యదేవతాగణములు తెరిపిలేక

జలధి మథియించుచుండగా జలమునుండి

దివ్య పురుషుడేతెంచెనా దిశలు వెలుగ

మునులు, సిద్ధులు భక్తితో మ్రొక్కుకొనిరి.//


తాత్పర్యము.


దేవతలు, రాక్షసులు విశ్రాంతి తీసికోకుండా పాలసముద్రాన్నిచిలుకుతూ ఉన్నారు.అప్పుడు ఆ పాలసముద్రమునుండి ఒక దివ్యమైన పురుషుడు దిక్కులందు వెలుగులు చిమ్ముతూ వచ్చాడు. అతడిని చూచి మునులు, సిద్ధులు భక్తితో మ్రొక్కుకున్నారు.//


96.

తేటగీతి.


అరుణవర్ణంపు నయనంబు లదరుచుండ

కంబుకంఠంబు కలవాడు కలిమిపంట

దీర్ఘభుజబల సంపన్న దివ్యతేజు

నల్ల నైనట్టి దేహంబు నవ్వుమొగము!//


తాత్పర్యము.


అతని కన్నులు ఎర్రగా ఉన్నాయి. శంఖము వంటి కంఠము కలవాడు. సిరులకు నెలవైనవాడు. అతని భుజములు పొడుగ్గా బలంగా ఉన్నాయి.  నల్లని శరీరముతో అతడు దివ్యమైన తేజస్సుతో నవ్వుతూ ఉన్నాడు.//


97.

తేటగీతి.


సింహవిక్రముండాతడు శ్రీకరుండు

పీతవస్త్రమున్ ధరియించు పెద్దయతడు

రత్నకుండలంబులవాడు రహిని జిల్కు

సుందరంబగు మూర్తియా శోభనుండు.//


తాత్పర్యము.


సింహమువంటి పరాక్రమము కలవాడు. శుభమైనవాడు, పట్టువస్త్రాన్ని ధరించాడు. అందరికంటే పెద్దవాడు.అతని చెవులకున్న రత్నాల భూషణములు వెలుగుతో ప్రకాశిస్తూ ఉండగా సుందరంగా ఉన్నాడు.//


98.

తేటగీతి.


కంకణంబులు గల్గిన కరములందు 

పసిడి కలశంబు చేకొని వచ్చియుండె 

వేదవైద్యశాస్త్రంబుకు పెన్నిధియట 

నంశరూపమై హరికి తా నలరుచుండె.//


తాత్పర్యము.


అతని చేతులకు కంకణములు ఉన్నాయి. ఆ చేతులతో ఒక బంగారు కళాశాన్ని పట్టుకొని వచ్చాడు. అతడు వేదవైద్యశాస్త్రమునకు ఆద్యుడు. అతడు విష్ణుమూర్తి అంశగా అవతరించాడు.//


99.

తేటగీతి.


యజ్ఞభోక్తగా నిల్చిన యగ్నిసముడు

ఘనుడు ధన్వంతరి యనుచు గౌరవించి 

ప్రణతులర్పించి దేవతల్ ప్రాంజలించ 

యోగిగణముల్ మ్రొక్కిరి సాగిలబడి.//


తాత్పర్యము.


అతడు యజ్ఞములలో హవిస్సును స్వీకరించే అగ్నిదేవునివంటివాడు.  అతడే గొప్పవాడైన 'ధన్వంతరి 'అని దేవతలు భక్తితో నమస్కారములు చేయగా,అప్పుడు యోగిసమూహాలు  సాగిలిబడి మ్రొక్కాయట//


(సశేషం )



టి. వి. యెల్. గాయత్రి.

పూణే. మహారాష్ట్ర.

Profile Link:




1 Comment


లలితమైన పదాలతోడి పద్యాలతో భావం విడిగా ఇవ్వకపోయినా అర్థం చేసుకునేందుకు వీలైనంత తీరున మీ రచన సాగించారు. ధన్యవాదములు తల్లీ

Like
bottom of page