top of page

నివురు..


'Nivuru' New Telugu Story

Written By B Kalagopal

'నివురు..' తెలుగు కథ

రచన: బి.కళాగోపాల్


బ్యాగ్ లో నుండి మరోసారి ఎలక్షన్ డ్యూటీ ఆర్డర్స్ కాపీని చూసుకొని సర్దుకున్నాను. బాబు నుదుటిపై చెయ్యివేసి చూశాను. జ్వరం జారింది. వేసుకున్న టీషర్ట్ చెమటలు పోసి తడిచిపోయింది వాడికి. అటుకేసి తిరిగాడు. దిగులుపొర నా గుండెల్ని మెలిపెట్టింది.


బి.టెక్ సెమిస్టర్ పరీక్షల్లో ఈ డెంగీ జ్వరమొకటి వాడికి. ఇంకో రెండు పరీక్షలు రాయాలి. ఈ వేసవిలో మే ఐదు, ఆరు తేదీల్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రిసైడింగ్ ఆఫీసర్ గా విధినిర్వహణ కీలకమైనది నాకు.


బాబును హాస్టల్ నుండి కూకట్ పల్లిలోని మా దగ్గరి బంధువులింట్లో ఉంచాను. పాఠశాల వేసవి సెలవులు ఐనందువల్ల నేనూ అక్కడే మకాం. వాడికి దగ్గరుండి పళ్ళరసాలు, అవసరమైన మాత్రలు, తేలికపాటి ఆహారం అందిస్తూ అటు సపర్యలు, ఇటు వాడి పరీక్షల ఒత్తిడిలో తలమునకలై ఉన్న నాకు రేపటి ప్రయాణం ఒక ప్రశ్నార్థకమైన బెంగను రేకెత్తించింది.


డైనిoగ్ టేబిల్ పై ట్రైనింగ్ లో ఇచ్చిన ప్రిసైడింగ్ ఆఫీసర్స్ డైరీ వేయినాల్కల ఫణిరాజులా బరువుగా నా ఆఫీసర్ బాధ్యతను నెత్తిన మోదడానికి సిద్ధం అంటూ చూడసాగింది. రేపటి ప్రయాణ ఏర్పాట్లలో భాగంగా అవసరమైన చపాతీలు, నాకిష్టమైన ఆలూ బఠాణీల కూర ప్యాక్ చేసుకొని తెల్లవారు ఝామున 4 గంటలకు అలారం పెట్టుకొని తలగడపై ఒత్తిగిల్లాను. దిమ్మన్న పని ఒత్తిడి భారంతో రాత్రంతా కలతనిద్రా మరకలే..! నా దిండు నిండా..!


తెల్లారి ఫెటీల్మన్న సూర్యోదయంతో పోటీపడి, గబగబా రెడీ అయ్యి బట్టల బ్యాగు, ఎలక్షన్ ఆర్డర్ కాపీని హ్యాండ్ బ్యాగ్ లో సర్దుకొని, బాబుకు నుదుటిపై ముద్దుపెట్టి బెస్టాఫ్ లక్ చెప్పి బయటపడ్డాను. వాడి కళ్ళు అలసటతో మెరిశాయి. పెదవులపై కనీ కనిపించని చిర్నవ్వుతో డోర్ వేసుకున్నాడు.

ఉదయం ఏడుగంటలకే బోయిన్ పల్లి బస్టాండ్ జనసందోహంతో కిటకిటలాడసాగింది. ఊపిరి సలపని రష్. నా మనసులోని గడబిడకు సమాధానమంటూ దేవుడు పంపిన దూతలా కామారెడ్డి బస్ టైంకి వచ్చింది. టికెట్ తీసి కిటికీ తెరిచాను. ప్రొద్దుటి చల్లగాలి విధి నిర్వహణకు ఆహ్వానమంటూ నా చెంపలను సుతారంగా నిమిరింది. మరో రెండుగంటల తర్వాత కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనం దగ్గర రిక్వెస్ట్ స్టాపులో దిగిపోయాను.


మైక్ లో సందడి చేస్తున్నసూచనలు, ఒక పక్క వరుసలో ఉన్న వివిధ రూట్ బస్సులు, పోలీసుల బందోబస్తు, బయట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ దగ్గర నా నెంబర్ చూసుకొని మా రూట్ ఆఫీసర్ టేబిల్ దగ్గర రిపోర్ట్ చేశాను. మనిషి సన్నగా, రివటలా ఉన్నాడు. పాత సిన్మాల్లోని రమణారెడ్డిని తలపిస్తూ..! హడావుడిగా అందరి ఆర్డర్స్ తీస్కొని మెటీరియల్ ఇస్తూ సంతకాలు తీస్కోసాగాడు. ఎలక్షన్ల వస్తు సామగ్రి, చెక్ లిస్ట్ అన్నీ చెక్ చేసుకున్నాక నా ఆర్డర్ లోని పోలింగ్ ఆఫీసర్ ఇంకా రాలేదని మా ఆర్వోకు చెప్పాను. రిజర్వ్ వాళ్ళు అలాట్ అవుతారేమోనన్న సందేహాన్ని పూర్తి హామీతో వెలిబుచ్చలేక తడబడ్డాడు. ఎన్నికల సిబ్బంది అందరూ లేనిదే బస్ బయల్దేరదని రూఢీగా తెలుసు.


వార్డ్ మెంబర్లవి తెలుపు రంగు బ్యాలెట్, గులబీరంగువి సర్పంచుల బ్యాలెట్ పత్రాలను జాగ్రత్తగా లెక్కించుకొని భద్రపర్చుకున్నాను. ఎల్లారెడ్డి డివిజన్ లోని రాంపూర్ గ్రామంలో ఎలక్షన్ డ్యూటీ. అక్కడ సర్పంచ్ ఎన్నిక ఇదే ప్రథమం. అడవిలింగాల, నల్లమడుగు, రాంపూర్, శాంతాపూర్, చద్మల్ తాండ, కల్ పోల్, బైరాపూర్ తాండ రూట్ మ్యాపు గిర్రున కళ్ళలో తిరిగింది. నా జ్ఞాపకాలు ముప్పై ఏళ్ళు వెనక్కి నెట్టబడ్డాయి.

** ** ** ** ** ** ** ** ** ** ** ** **

మార్పు అత్యంత సహజమేనంటూ.. అనివార్యమైన దానికి శోకించుట తగదు అన్న గీతాచార్యుని ప్రభోదామృతం మదిలో కదలాడగా గుండె చిక్కబట్టుకొని నా ప్రథమ నియామక పత్రాన్ని చేతబట్టుకొని బైరాపూర్ తాండకు ఎలా వెళ్ళాలి? అని బస్ ఎంక్వైరీ చేస్తే నివ్వెరపోయిన నిజం కళ్ళు బైర్లు కమ్మేలా చేసింది.


ఆ ఊరికి బస్ లేదు అన్న విషయం తెలియగానే మూర్ఛిల్లే ఆశ్చర్యంతో కొయ్యబారిపోయాను..

అప్పటికి నేను అవివాహితురాల్ని. భవిష్యత్ ఎలానన్న భయం, దుఃఖం తాలూకు బెంగతో బిగుసుకుపోయాను. కేంద్రప్రభుత్వం ఆపరేషన్ బ్లాక్ బోర్డు అన్న స్కీం కింద కొత్తగా తండాలల్లోనూ పాఠశాలలను తెరుస్తూ.. ప్రాథమిక విద్యకు పెద్దపీట అంటూ స్పెషల్ గా మహిళా ఉపాధ్యాయినులను నియమించ సాగింది. అదిగో ఆ పద్మవ్యూహంలో భాగంగా నేను మొదట పోస్టింగ్ పొందిన తాండ అది.


నావెంట ఎవరూ రాలేరు. ఎలా వెళ్ళాలి? ఎక్కడ ఉండాలి? హోరుమంటున్న అంతుచిక్కని ప్రశ్నల సొద నాలో.. జాయినిoగ్ రోజు మండల కేంద్రంలో రిపోర్ట్ చేసి నా నిర్జన బతుకుయాత్రను ఎడ్లబండి ఎక్కి ప్రారంభించాను.


వన్యమృగాలు తిరిగే అటవీ ప్రాంతం కేసి కిర్రుమంటూ బండిచక్రాలు కదిలాయి. చిక్కటి దట్టమైన కీకారణ్యం అడవి లోపలికి..లోలోతులకు వెళ్తుంటే.. అసలు ఈ గుట్టల్లో ఎక్కడుందీ తాండా ? అంటూ తచ్చాడాల్సిందే!


“గీ నల్లవాగు దాటి మూడు కిలోమీటర్లు ప్రయాణించి మొండివాగు మరీ ఉధృతంగా ప్రవహిస్తే చుట్టూ తిరిగి వెళ్ళాలి. అదిగో ఆ గుట్టమీద చిన్న గుడిసెలు బొమ్మలలెక్క కన్పిస్తున్నయి జూడు! గదే బైరాపూర్ తాండ!” అంటూ ఆ వృద్ధుడు వేలు తిప్పిన వైపు చూస్తే వెన్నులో చలిపాకింది.


తెచ్చుకున్న సూట్ కేసు దించుకున్నాను. ఆ వృద్ధుడు ఎడ్లను అదిలిస్తూ, కల్ పోల్ తాండ కేసి సాగిపోతున్నాడు. క్రమంగా ఎడ్ల మువ్వల శబ్దం వినపడకుండా పోయింది. నిర్మానుష్యమైన ఆ అడవిలో నా శ్వాస, గుండెదడ భయం భయంగా నాకే విన్పించసాగాయి. మధ్యాహ్న మార్తాండ కిరణాలు నిప్పులు కక్కసాగాయి. దాహంతో నాలుక పిడచకట్టుకపోసాగింది. సోయి తెచ్చుకొని బ్యాగులోనుండి నీళ్ళ సీసా తీసి గొంతు తడుపుకున్నాను. తెచ్చుకున్న కాల్చిన జొన్నరొట్టెలు తిని, చీర నడుం చుట్టూ బిగించాను.


గుట్టమీద కిరీటంలా మెరిసిపోతున్నాయి తెల్లని మేఘ మాలికలు. నల్లవాగులో కాలు మోపగానే గులకరాళ్ళ సంగీత ప్రవాహం ఆప్యాయంగా నా చీర కుచ్చిళ్ళను చుట్టుకొంది. ఇసుకలో గట్టిగా పాదాలను తొక్కిపెట్టి జారిపోకుండా..వాగు ఉధృతికి తగ్గట్టుగా అడుగులను సమంగా వేసుకుంటూ దాటాను. కొండంత భరోసానిస్తూ ఎదురుగా కొండపైని తునికాకు సేకరణలోనున్న బంజారా స్త్రీలను చూడగానే పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లైంది.


విద్యా గంధానికి దూరమైన ఈ అడవిబిడ్డలకు చదువు విలువ తెలియజెప్పాలి.. చదువుకొని తమకాళ్ళపై తాము నిలబడే తొలితరానికి అంకురార్పణం చేసే ఆదిగురువును నేనే అవటం గొప్ప బాధ్యతాయుతమైన కర్తవ్యంగా భావిoచగానే ఎలాంటి జంకూ గొంకూ లేకుండా వారి మువ్వల పట్టీలకనుగుణంగా నా పాదాలు ఆశల వసంతంతో అడవిబాట పట్టాయి. ఎత్తుగా, బలాఢ్యులైన ఆ బంజారా మహిళల వెంట నడుస్తుంటే మౌర్యుల కాలంలో అంగరక్షకులుగా మహిళలు ఉండేవారన్న చరిత్ర పాఠం కళ్ళముందు కదలాడింది.


దారిలో బండలపై ఎండకాగుకు మత్తుగా జోగుతున్న కొండచిలువలు, అక్కడక్కడా పురివిప్పిన నెమళ్ళు, పేరు తెలియని పక్షుల కూతలు వింటూ అదురుతున్న గుండెలతో నాముందు నడుస్తూ బలిష్టంగానున్న ఆ బంజారా మహిళ చేయి చప్పున పట్టుకున్నా.


"అవి అలాగే పోతయిగాని.. నీకేం భయం లేదు.. మాతోబాటు గుడిసెలో ఉండొచ్చు” అంది తన భాషను మిళితం చేస్తూ.. బహుశా నా వాలకం పోల్చుకుందేమో! వీపున కట్టుకున్న తునికాకు మోపును సవరించుకుంటూ.. నాపేరు కనుక్కుని, తన పేరు చంప్లీబాయి అంది దృఢమైన అంగలతో..!


ఈ గుట్టే వారి మాతృఛాయ అంటూ దీని వాలులో పండే పెసలు, కందులు, జొన్న, మక్కలే ప్రధాన ఆహారధాన్యాలుగా.. ప్రతిరోజూ ఇలా ఏడెనిమిది కిలోమీటర్లు నడిచి తునికాకు, కుంకుడుకాయ, పుట్టతేనె, గెయిగడ్డలు, వంటచెరుకు, మొర్రిపండ్లు సేకరిస్తామని గరగరమనే కంఠంతో చెప్పింది చంప్లి. బహుశా తాండ దగ్గరపడిందేమో సన్నని నీలిరంగు వెలుతురు పొగ చారికలు చారికలుగా పైకి కదులుతూ వెళ్ళసాగింది. మక్కరొట్టెలు కాలుస్తున్న పచ్చివాసన ముందుగానే పలకరించింది.


పేరు తెలియని అక్షాంశాలు, రేఖాంశాలు అంటూ గిరిగీసుకుంటాం.. గ్లోబుపై ఆనవాలు కూడా పట్టలేని ఈ తాండ ఇలా కొండలు, గుట్టలెక్కితేనే అగుపడుతుంది..ఇలా స్థానికత యొక్క పట్టు తెలిసేది.. అనుకుంటూ.. బురద జారుడుబాటలో పాదరక్షలు జారిపోతుంటే తీసి చేతిలో పట్టుకున్నాను. ఎత్తు ఎక్కటం వలన పిక్కలు పట్టేసినట్లై రొప్పుతూ.. దగ్గరున్న బండరాయిపై కూలబడ్డాను. గుట్టపైనుండి చూస్తే చుట్టూ చిక్కని పచ్చని వనం.. ఒకవైపు మొండివాగు పాయ, మరోవైపు నల్లవాగు ఝరి.. ద్వీపం లాంటి ఈ గుట్టపై బైరాపూర్ తాండ..


రేపు నేను ప్రారంభం చేయబోయే ప్రాథమిక పాఠశాల స్కూల్ రిజిస్టర్ నా సూట్ కేస్ లో అల్లావుద్దీన్ అద్భుత దీపంలా తనలో ఎవరి పేర్లు ఎక్కుతాయో చూద్దామన్నట్టుగా నిరీక్షించసాగింది.


అటూ ఇటూ దూరంగా..దగ్గరగా.. ఎత్తుగా పల్లంలో పాకలు.. వెదుళ్లపాకలు.. గుడ్డిదీపాలు.. దూడమూతి పచ్చి పాలవాసన లాంటి ఆ తాండ.. ఆరనిమంటల కథలకు కేంద్రంలా అన్పించింది.

** ** ** ** ** ** ** ** ** ** ** **


మాగన్నుగా నిద్రించిన నాకు ఉదయం పూట ఎవరో చెద్దరు బలంగా లాగుతున్నట్టై చప్పున మెలకువ ఐంది. నా మోహంలో మొహం పెట్టి చూస్తున్న తొర్రిపళ్ళ చిన్నారులు, ముక్కుపుడక, కాళ్ళకు కడియాలు, చేతులకు వెండిగాజులు.. చిరుగడ్డంపై పచ్చబొట్లు.. రెండు రిబ్బన్లు వీస్తున్న గాలికి ఊగుతుంటే.. అసలుసిసలైన బంజారా బాలికలు.. నా మొహం ఆనందంతో విప్పారింది.. ఆ ఆకుపచ్చ చందమామలను చూడగానే..

వారి కళ్ళలో పసితనం.. వదనంలో నిర్మలత్వం చూడగానే గొప్ప ఉత్తేజపు అలజడి నాలో..


బంజారా మహిళలు, మగవాళ్ళు వ్యవసాయ పనుల్లో, మూగజీవాల్ని మేపుకు రావటంలో పగలంతా అడవిబాట పడితే, ఇంట్లోనున్న ఎడపిల్లల్ని సాకటానికి జవసత్వాలుడిగిన వృద్ధులను కనిపెట్టుకొని ఉండటానికి ఈ ఆడపిల్లలే ఆధారమని అర్థమవటానికి ఎక్కువసేపు పట్టలేదు నాకు.


లిపిలేని భాష గోర్ బోలి మాట్లాడేవాళ్లకు మన వర్ణమాల, సంఖ్యలు, గుణింతాలు, ఎక్కాలు, సైన్స్ పరిజ్ఞానం, నీతికథలు ఎలా చెప్పాలి? అన్న ఆశ్చర్యార్థక ప్రశ్న నాలో ఉదయించి ఆవిరయ్యింది.


అందులో చురుకుగా ఉండే రూప్లి, పీరుబాయి, ఖింణిబాయి అంటే భలే ఇష్టం నాకు.

గళ్ళనుడికట్టు జవాబు తెలిసిపోయిందన్న చందాన వాళ్ళతో మిళితమయి, ముందుగా నేను గోర్ బోలి భాష నేర్చుకుంటే తప్ప వాళ్లకు తెలుగులో చదవటం, రాయటం నేర్పలేననే సూత్రం కొద్దిరోజుల్లోనే అవగతమయింది.

వాళ్ళ మనసులోకి దూరే రాచమార్గంగా, పిల్లలను బడికి రప్పించే తాయిలంలా వారి స్థానిక భాషే నాకు ఆయువుపట్టు అన్న నిజాన్ని ఇట్టే పట్టేశాను.


రోజూ పీరుబాయి, రూప్లి, ఖింణిలతో మాట్లాడేదాన్ని. వాళ్ళ ఇష్టాలు, అభిరుచులు, కుటుంబం గురించి అడుగుతుంటే ఆ పసికళ్ళలో కోటి ఆహ్లాదాలు వెల్లివిరిసేవి. నేను వారి భాషలో మాట్లాడబోయి తడుముకుంటూ తడబడితే తప్పుదిద్ది, ఉచ్చారణను సరిదిద్ది తొర్రిపళ్ళతో తుంటరి నవ్వులు రువ్వేవారు ఆ నెలవంకలు.


“పెండ్లీడు ఆడపిల్లవు అక్కడే ఉంటే నీకెలా వివాహం చేయాలి? సంబంధాలు వస్తున్నాయి.. నీవేమీ పలక్కపోతే పోతున్నాయి కూడా.. మధ్యమధ్యలో ఇంటికొచ్చి కన్పించి వెళ్ళు..” అంటూ అమ్మ మందలింపుతో కూడిన అభ్యర్థన.


ఎండాకాలం సెలవుల్లో వెంటతెచ్చే వేసంగి పప్పులు, తండావాసులు అభిమానంతో, ఇష్టంతో ఇచ్చిన ఆటవీ ఉత్పత్తుల్ని నెయ్యి, జున్నులాంటివి తీసుకెళ్తే అమ్మ పెదవులపై చిరుదరహాసరేఖ కదలాడేది. లెక్కలేని దయాభావం, కృతజ్ఞతతో వారు అలా నా దోసిలి నింపుతూనే ఉన్నారు. వారి ఔదార్యానికి వెలకట్టలేము! సరికదా నవనాగరికులమైన మనం వారికి సరితూగలేమనీ అన్పించింది.


మెరుపు మెరిసినపుడు పట్టుకున్న జ్ఞాపకాల ఆనవాలులా అదే అదను అనుకొని నేను వెళ్లినచోట ఖచ్చితంగా రెండుమూడేళ్ళు ఐనా పనిచేయాలనీ, అప్పుడే ట్రాన్స్ ఫర్ అర్హత వస్తుంది, ఆ తర్వాతే పెళ్లి అంటూ నిక్కచ్చిగా దాటవేసాను.

** ** ** ** ** ** ** ** ** ** ** **


వర్షాకాలం రాకముందే ఆ తండావాసులు దగ్గర్లోని మండల కేంద్రంలో సరుకులు కొనుగోలు చేసి తెచ్చుకునేవారు. నేనూ అలాగే..సరుకులతో బాటు ఆ తండా పుణ్యమాని నాలోని చదువరి మరిన్ని పుస్తకాలను మస్తిష్కంలోకి ఎక్కించుకుంటూ.. నేనూ ఆ అడవికి.. తాండాకు అలవాటుపడ్డాను.. చీకట్లోంచి చూస్తే తండా గుడిసెలు ఆకారంలేని ముద్దల్లా.. నల్లవాగు.. మొండివాగు నీటిపాయల కదలికలు జలతరంగిణి వాయిద్యంలా.. రాత్రిపూట అడవిలోంచి విన్పించే జంతువుల వింత శబ్దాలకు, నిర్భయంగా నిద్రించటం నేర్చుకున్నా!


చంప్లీ ఆతిథ్యంలో..అజ్ఞాతవాస చంద్రోదయాలు.. అరణ్యవాస సూర్యోదయాలు చూడటం నేర్చుకున్నా!

తూరుపుగాలి కోస్తుంటే పెచ్చులూడిన గుడిసె గోడలు, బీటలువారిన మట్టి వాకిండ్లు, అడవితీగ వనాల ఆదివాసీ మూలాలను దర్శిస్తున్నా!


అక్షరాలను దిద్దమంటే బుర్రగోక్కునే రూప్లి “అమ్మ ఏది? (యాడి

కత్?) అని ఏడ్చేది. కొద్దిగా పెద్దదైన ఖింణి మాత్రం ఏకసంథాగ్రాహి.. చెప్పినదే తడవుగా మందనుండి విడిపోని లేగదూడలా బుద్ధిగా నాదారికి వచ్చేది. ఏవో నాకున్న కొద్దిపాటి ఆలోచనల కాల్వలతో భయపెట్టే సిలబస్ ను సరళీకృతం చేసేదాన్ని. ఎండుమక్కలు, పెసర్లు, ఎర్రకందుల్ని చార్ట్ లపై అతికించి వర్ణమాలను, సంఖ్యామానాన్ని వర్ణరంజితం చేస్తే.. ఇంద్రమాలికలా వారి కళ్ళలో ఫెటీల్మని ప్రతిఫలించిన ఆశ్చర్యంతో.. స్తబ్దతను వీడుతూ మెల్లిమెల్లిగా రాయడం, చదవడం నేర్చుకోసాగారు చిన్నారులు.

** ** ** ** ** ** ** ** ** ** ** **


ఓరోజు కట్టతెగిన తటాకంలా ఏడుస్తూ వచ్చింది ఖింణి. “పీరు అక్కకి నల్లతేలు కుట్టింది. గుడిసెలో ఉంది. కడుపునొప్పి దానికి. (పీరు బాయిన కాలో విచ్చు కాటో, ఓణ్ పేటేమా దూగ్రీ కచ)” అంది వెక్కుతూ..

వద్దు..ఆ వైపు వెళ్ళవద్దు అన్నారు తండా పెద్దలు.. ముట్టడినో.. కట్టడినో ఛేదించుకుంటూ వెళ్లాలని ఉన్నా.. నా ఏకాంత ద్వీపవాసం ఇలా.. నాకు అడ్డుకట్ట వేసింది.. నాకు తెలుసు నాముందు ఉన్నది చీకటిలోని బావి అని.. నాలాంటి వాళ్ళకే కన్పించే బావి అది! కన్పించడం నా తప్పుకాదు గదా!


“ఆ అమ్మాయికి మైల రోజులు.. ముట్టుడు ఇది మా ఆచారం (ఈ హమార్ రివాజ్ ఛ) ఎవరైనా ఋతుస్నాత ఐతే అక్కడే ఉండాలి. అన్నం, నీళ్ళు అక్కడే (ధాణ్ పాణి ఒత్తజ్) ఇది ఇక్కడి నిర్భంధ బహిష్కరణ” అంటూ తండాపెద్ద లంఖ్యానాయక్ హుంకరించాడు.


మరో రెండురోజుల్లో ఆ పిల్లకు నిలువెల్లా విషపు జెరం సోకి శరీరం ఉబ్బిపోయి మరణించింది. కట్టుబాట్ల పేరుతో నిండుప్రాణాన్ని బలిగొన్న అనాచారానికి దుఃఖితనయ్యాను. ఖింణి వదనంపై విషాద వీచికలు..మ్రాన్పడిపోయింది.. మరో వారం రోజులకు గానీ మామూలు కాలేదు ఆ అమ్మాయి..


వన్యమృగాల దాడి, అంటువ్యాధులు, గర్భిణీల ప్రసవవేదన, అకాల మరణాలు అలా ఆ తండాలో మరో ఐదారు మరణాలు సంభవించాయి. గుండె పగిలేలా ఆక్రోశిస్తూ నేను.. వాటన్నిటికి సాక్షీభూతమై నిలిచాను.


ఐనా.. అన్నిటినీ కళ్ళ గవాక్షాలకవతల విసిరిపారేస్తూ.. మొక్కవోని ఆశతో.. గుండె చిక్కబట్టుకొని ప్రతీ వేసవి సెలవుల అనంతరం పిల్లలకు అవసరమైన నోటు బుక్కులు, పెన్నులు తెల్లకాగితాలు తెచ్చేదాన్ని..


నాకవసరమైన రంగుల చాక్ పీస్ లూ, ఓ నల్లబల్ల, మరికొన్ని రిజిష్టర్లను పోగు చేసుకొని..ఆ

ఏకోపాధ్యాయ పాఠశాలలో ఓ అడుగు ముందుకేసి కాస్తో కూస్తో ఎన్ రోల్ మెంట్ ను పెంచగలిగాను.


అలా ఓ మూడు వసంతాల కష్టం పిమ్మట.. నా పోస్టింగ్ జిల్లా కేంద్రానికి సమీపంలోని బస్ రూట్ గల గ్రామంలో వేసేసరికి ఊపిరి పీల్చుకున్నాను. నా కoటేను అమ్మ ఆనందం రెట్టింపు ఐంది అనడం సబబు.. పెట్టే, బేడా సర్దుకొని అడవి బిడ్డలకు ఆఖరి వీడ్కోలు పలుకుతుంటే.. ఖింణి నా చీర కుచ్చిళ్ళలో తలదూర్చి “మీరెల్లోద్దు టీచర్” (తూ జో మత్ టీచర్) అంది సజల నయనాలతో. తల్లి ఆవునుండి విడిపోయిన లేగదూడలా బెంగటిల్లుతూ నా చేయిని వదలనంటున్న రూప్లి చూపుల స్వచ్ఛతకు.. ఒక క్షణం వివశురాలైనప్పటికిని మార్పు అత్యంత సహజమన్న మది అలజడే గెలిచింది.


“రాంపూర్.. రాంపూర్ దిగండి” అంటూ ఆర్వో గొంతు పీలగా వినబడే సరికి ఈ లోకంలోకొచ్చి పడ్డాను. ఒక్క కుదుపుతో బస్సు రాంపూర్ లో ఆగింది.

** ** ** ** ** ** ** ** ** ** ** **


చుట్టూ ఎర్రరేగడి మట్టిదిబ్బలు.. శిథిలావస్థలోనున్న ప్రభుత్వ పాఠశాల రెండుగదుల భవనంలో మా పోలింగుబూతులు.. పక్కనేనున్న ఆఫీస్ రూమ్, స్టాఫ్ రూoలో మా బస ఏర్పాట్లను గ్రామస్థులు గావించారు.


మొత్తం ఆరుబూతులు. ప్రతీబూతుకు ముప్పైకి మించని ఓట్లు. రెండవబూతులో వార్డ్ మెంబర్ ఏకగ్రీవ ఎన్నిక అయ్యారు అని కేవలం గులాబీరంగు సర్పంచి బ్యాలెట్ మాత్రమే ఇవ్వాలి అంటూ.. “మధ్యాహ్నం రెండు వరకే ఎన్నికల సమయం.. భోజనానంతరం కౌంటింగ్ ప్రక్రియ షురూ ఆనక! సర్పంచి, ఉపసర్పంచి ప్రమాణ స్వీకారాలు అన్నీ ఐదుగంటల వరకు అయిపోతే మిగతా గ్రామాల సిబ్బందిని ఎక్కించుకొని మండల కేంద్రానికి మనం చేరుకోవాలి” అంటూ ముందే సిద్ధం చేసుకున్న ప్రణాళికలను మా ముందు ఉంచాడు ఆర్వో.


రెండుగదుల ప్రాథమిక పాఠశాలలో ఒక్కోగదిలో మూడుబూతులు..


మండల కేంద్రంలో బ్యాలెట్ బాక్సులను తుదివిడతగా చెక్ చేసి బస్ లో కెక్కుస్తున్న క్లాస్ ఫోర్ ఎంప్లాయీ కాళిదాస్ ని నాకు క్లర్క్ గా వేసి చేతులు దులుపుకున్నారు అధికారులు. నాకు అలాట్ ఐన క్లర్క్ ఇంకా రిపోర్ట్ చేయలేదు. మూడు ఫేజ్ లలో నిర్వహిస్తున్న స్థానిక సంస్థల ఎన్నికలు, వరుసపెట్టి అందుతున్న ఆర్డర్లకు సిబ్బంది సరిపోవడం లేదు అన్నదానికి ఈ సంఘటనే మచ్చుతునక.. కొంతమంది లేట్ గా వెళ్తారు. రిజర్వ్ డ్యూటీ ఉంటుందన్న లేజీ భరోసా సాకు కావొచ్చు.


సమయం అయిపోవస్తున్నదని..ఒకవేళ పోలింగ్ క్లర్క్ గనుక వస్తే అతన్ని రిజర్వ్ లో ఉంచి మరుసటి రోజైనా పంపించగలమన్న హామీతో చేతులు దులుపుకున్న అధికారుల మెళకువలకు ఔరా! అనుకోక తప్పలేదు నాకు..


గత్యంతరం లేక కాళిదాస్ కు బ్యాలెట్ ఎలా చిoపాలి, ఎలా మడవాలి, ఇండెలిబుల్ ఇంక్ ఎడమ చూపుడు వేలిపై ఎలా పెట్టాలి అని..వివరంగా చెప్పి, ఉదయం ఏడు లోపలే పోలింగు సామాగ్రి అంతా సర్దుకొని కూర్చున్నాం.


అన్ని బూతులను కాళ్ళకు చక్రాలు కట్టుకున్నట్లుగా చుట్టబెడుతున్న మా ఆర్వో గంటగంటకోసారి వచ్చి..మేల్, ఫీమేల్ ఓటర్ల సంఖ్య అడుగుతూ, ఫోన్ లో.. తన పై అధికారులకు ఈ వివరాలను మెసెజ్ చేయసాగాడు.


కాళిదాస్ నుదుటన పట్టిన చెమటను తుడుచుకుంటూ ఓసారి ఆర్వో దగ్గరకెళ్ళి అర్జంట్ ఫోన్ కాల్ చేసుకొని వస్తానoటూ వెళ్ళడం, వచ్చాక మరింత నెర్వస్ తో.. ఆందోళనగా పనిచేస్తూ ఇండెలిబుల్ ఇంక్ కాస్తా ఒలకపోయడంతో నాకు కోపం తారస్థాయిలో పెరిగిపోయింది. అదిగో! అప్పుడే మా పోలింగ్ గదిలోకి..


అడవిమల్లెల పరిమళం గప్పున వ్యాపించగా గజ్జెల చప్పుడుతో.. గులాబీరంగు పెద్ద లంగా (ఫేట్యా), గవ్వలు, పూసలు, వెండిరూపాయలతో కుట్టిన ప్రత్యేక పైట (టుక్రి), తలనిండుగా కప్పుకున్న చిక్కని రంగుదారాల అల్లికతో మెరిసిపోయే ఆకుపచ్చరంగు గూంగట్, అదేరంగు పెద్ద పెద్ద మెరిసే అద్దాలతో కుట్టిన జాకెట్ (కాళి) మోచేతులవరకు అలంకరించుకున్న ఏనుగుదంతపు గాజులు, నున్ననితల చెంపలపైదాకా దువ్వి జారవిడిచిన పెద్ద పెద్ద జుంకీలు, సంపెంగముక్కుపై ముచ్చటగా ఒదిగిపోయిన ముక్కుపుడక (పూళి) తీరైన అవయవ సౌష్టవంతో.. పచ్చని పసిమి ఛాయలో ఓ రూపసి అడుగిడింది.


గదిలో పరుచుకున్న పరిమిత విద్యుత్ కాంతిలో ఆమె వనదేవతలా శోభిల్లింది. ఆ కాంతి తన ముఖంపై సగం పడుతూ ఉంటే, అవాక్కైన నా ముఖకవళికలను సరిపోల్చుకొని ఆహ్లాదకరమైన నవ్వుతో.. ఆ అమ్మాయి నా టేబిల్ దగ్గరికి వచ్చి “మేడంజీ, గుర్తుపట్టారా ?నేను ఖింణిబాయి. (“హారదేచ్చుక మ ఖింణి”).. వోటర్ నంబర్ ఇరవైమూడు” అంది గోర్ బోలి ఆనందాన్ని గొంతులో రంగరిస్తూ..


సగం తెరిచిన నాకళ్ళలో ముందుగా నమ్మలేనిది అన్న ఆశ్చర్యం.. ఆ తర్వాత సత్యం బోధపడింది అన్న కదలిక.. సూచనగా..!


తేరుకున్న నేను తన ఓటర్ స్లిప్ నెంబర్, ఓటర్ పేరు సరిచూసుకొని, ఆధార్ కార్డ్ నంబర్ రాసుకొని, ఆ అమ్మాయి సంతకం తీసుకొని, బ్యాలెట్ ఇష్యూ చేశాను. కాళిదాస్ ఇంతలో టేబిల్ క్లీన్ చేసి ఉన్న కాస్త ఇండెలిబుల్ ఇంక్ ను సర్దుతూ “మాది పక్కనేనున్న శాంతాపూర్ కేవలం మూడు కిలోమీటర్లే మేడం.. నేను వెళ్లి అక్కడ వోటు వేసిరావాలి. మా అమ్మ సర్పంచిగా నిలబడింది అక్కడ” అన్నాడు బెదురుతున్న కళ్ళతో.. అతడి అర్జంట్ ఫోన్ కాల్స్ రహస్యం వీడిపోయింది. ఖింణిబాయి ఓటు చివరిది.. ఇంకెవరైనా వస్తే చూసుకొవచ్చునన్న నమ్మికతో ఎంతైనా.. ఓటు వజ్రాయుధంగా..అతన్ని పంపక తప్పలేదు నాకు. తొందరగా రావాలన్న షరతు మాత్రం విధించాను.


ఖింణిబాయి ఓటువేసి వచ్చి చేతులు జోడించింది అభిమానంగా. కనుబొమలతో ప్రోత్సాహకమిస్తూ.. ఎలక్షన్ అయ్యాక మాట్లాడదామని పంపించాను.


మరో అరగంటలో కాళిదాస్ వచ్చేశాడు. గట్టిగా ఊపిరి పీల్చుకున్నాను. దాదాపు తొంభై శాతం ఓట్లు పోలయ్యాయి.


బ్యాలెట్ బాక్సులకు సీలువేసి తెల్లటి గుడ్డసంచీలో దించి కుట్లువేసి మా పోలింగు బూతు నెంబర్ అతికించి, నా సంతకాలు చేసేశాను.

అన్ని బూతుల బ్యాలెట్ బాక్సులను ఆర్వోగదిలో పోలీస్ ఎస్కార్ట్ తో ఉంచి భోజనాలకు వెళ్ళాం మేమంతా..

** ** ** ** ** ** ** ** ** ** ** **


మధ్యాహ్నం రెండు తర్వాత ఆర్వో ఆధ్వర్యంలో బ్యాలెట్ బాక్సుల సీళ్లు విప్పి ఒక్కో ప్రిసైడింగ్ ఆఫీసర్ సమక్షంలో.. ప్రిసైడింగ్ ఆఫీసర్ డైరీ ప్రకారంగా పోలయిన ఓట్ల లెక్కింపులు జరుగసాగాయి.


ఖింణిబాయి మిగతా వార్డు మెంబర్లు, ఆ తండా పెద్దమనుషులు నలుగైదుగురు అక్కడే నిలబడి ఓటింగ్ సరళిని సమీక్షించసాగారు. మొదటినుండీ ఖింణీదే లీడింగ్! ట్రైబల్ మహిళా రిజర్వేషన్ లో రాంపూర్ ప్రథమ మహిళగా ఖింణిబాయి సర్పంచిగా ప్రమాణస్వీకారం చేసింది. తనతోబాటే ఉపసర్పంచి ఎన్నిక, ప్రమాణస్వీకారాలు పూర్తయ్యాయి. రిజిస్టర్ లో సంతకం చేశాక.. సంతోషం పట్టలేక ఖింణీ నన్ను గట్టిగా కౌగలించుకుంది. వనం మైసమ్మ పచ్చిగడ్డి మోపుల వాసనతో ఉక్కిరిబిక్కిరయ్యాను.

** ** ** ** ** ** ** ** ** ** ** **


బయట ఎదురుచూస్తున్న మీడియాతో మాట్లాడుతూ ఖింణి, తాను పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ లో మాస్టర్స్ డిగ్రీ చేశాననీ, చదువు అయ్యాక తనకు రాంపూర్ వాసి బంశ్యానాయక్ తో పెండ్లి జరిగిందని, తగిన సాక్ష్యాలతో తన ఓటు హక్కును బైరాపూర్ తాండానుండి ఇక్కడి రాంపూర్ గ్రామపంచాయతీకి మార్పించుకున్నానని చెప్పింది.


బైరాపూర్ తాండాకు ఇప్పటికీ సరైన రహదారి లేక అభివృద్ధికి ఆమడదూరంలోనే ఉండిపోయింది అంటూ..


విద్యా, వైద్యం, రవాణా సౌకర్యాలకు నోచుకోని తమ తండావాసుల గోడు ఎన్నేళ్ళయినా ఇంతేనా? అంటూ ఆవేదన పడింది. చదువు విలువ తెల్సిన తెలివైన భర్త లభించడం తనకు ఒక గొప్ప వరమైతే.. తాను చిన్ననాడు విన్నపాఠం మూడంచెల స్వపరిపాలన అంటే తనకు ఎంతో ఇష్టమని.. గొప్పగా చదువుకొని తండా పెద్దగా మన్ననలు అందుకోవాలన్న ప్రేరణను ఆ పాఠం కల్గజేసిందంటూ..


చదువుకోవాలన్న తమ తపనకు పాదులు చేసి నీళ్ళు పోసి బతికించిన తన టీచరే తనకు ప్రేరణ అంటూ ఆర్ద్రంగా మెత్తబడిన కంఠంతో పలికింది.


జీరో ఎన్ రోల్ మెంట్..అంటూ ఇటీవల మూతబడిన తమ తoడాల్లోని పాఠశాలలను.. రీ ఓపెన్ చేయిస్తానని, డ్రాపవుట్ పిల్లలనూ తిరిగి చదువులమ్మ ఒడికి పంపించాలని, తమ తండాల్లోని బాలికల విద్యకొరకు స్పెషల్ గర్ల్స్ ప్రైమరీ స్కూల్ ను భవిష్యత్ లో ఏర్పాటు చేసుకుంటామని ఎంతో ఆత్మవిశ్వాసంతో చెప్తున్న..ఆమె మాటల్లోని ధీరత్వంలో వనం సూర్యుడి తేజం.. అక్బర్ నెదిరించిన గోండురాణి దుర్గావతి శౌర్యపరాక్రమాలు ప్రతిఫలించసాగాయి.


ఈ వెచ్చటి సూర్యాస్తమయ కాంతిలో ఆమె ఒక కంటిలో ఆరని జ్వాలను.. మరొక కంటిలో సతత హరిత వనాలను దర్శించసాగాను.


ఖింణీ మాటల్ని అక్కడి తాండా రిపోర్టర్ యువకుడెవరో వీడియో తీసి, లోకల్ న్యూస్ ఛానెల్ కు పంపిస్తున్నాడు.


కాళిదాస్ వదనం కోటి వసంతాలతో వెలిగిపోసాగింది. “మేడం మా అమ్మ గెల్చింది!” అన్నాడు ఆనందం పట్టలేక.. అతడికి అభినందనలు తెలుపసాగారు అందరూ...


ఖాళీ ఐన బ్యాలెట్ డబ్బాలను విధిగా బస్ లో కెక్కించసాగాము.. మదినిండిన బోలెడన్ని సంతోషాలను మూటగట్టుకొని మండల కేంద్రంవైపుగా మా ఎన్నికల బస్సు పరుగులు తీసింది. నా చేతిలో ఖింణీ ఇచ్చిన వారి సాంప్రదాయక లడ్డూ.. ఎలాంటి అరమరికలు లేకుండా, హేతుబద్దంగా, సముదాయింపుగా, అటు ప్రకృతినీ, ఇటు మానవ ప్రకృతిని పూర్తిగా ఆహ్వానిస్తూ దేనిని, వేటినీ, ఎవరినీ తోసిపుచ్చకుండా, నేలమీదే నిలుస్తూ.. నిలబడుతూ.. ఎటో తేలిపోకుండా వారి ఆచారాలు, సంస్కృతిని పరిరక్షించుకుంటూ, భేషజాలు లేని స్వచ్ఛమైన ఆ ఆదివాసీ తండాల తేనెజల్లు నా మదిలో మధుర సుధలై కురియసాగింది.


అవును.. ముప్పై ఏళ్ళు ముందుకీ, వెనక్కీ నెట్టబడిన ఈ జ్ఞాపకాల ముక్కలా అస్తవ్యస్తపు సముదాయమే గడిచిన జీవితం కాబోలు...


మా బస్సు మెల్లగా ఎర్రరేగడి మట్టిదిబ్బ రోడ్డు పక్కన ఉన్న పాక హోటల్ నుండి అటువైపు వెళ్తోంది.. ఎర్రటి దుమ్మును ఛేదిస్తూ.. హారన్ మ్రోగిస్తూ.. నిగనిగలాడే తారురోడ్డు ఎక్కాలన్న తాపత్రయం దానిది..


వ్యక్తిగతం.. వృత్తిగతమంటూ.. బహుపాత్రల్ని పోషించే ఈ బోహీమియన్ జీవితంలో ఊపిరి సలపలేనంత పని..


కాల్వగట్టు వెంబడి వేయబడిన పాలకూర మళ్ళను... అంగార వర్ణంతో మెరిసిపోయే సాయం సంధ్యా సూర్యుడిని చూస్తూ.. సాంత్వన పొందసాగాను.


విద్యార్థులంతా తమ తమ నిండైన వక్తిత్వాలతో కాలం ఫ్లోలోకి వెళ్ళిపోయి స్థిరపడిపోతుంటే.. ఆ సంతోషంతో గొప్పగా రీఛార్జ్ అవసాగాను.


ఆకులపై రాలిన చినుకుల అలికిడి నాలో.. గెలిచి నిలిచిన వనం నివురు.. ఖింణీబాయికి అభినందనలంటూ...

** ** ** ** ** ** ** ** ** ** ** **

బి.కళాగోపాల్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

విజయదశమి 2023 కథల పోటీల వివరాల కోసం

మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:

నా బయొడేటా..పేరు.. బి.కళాగోపాల్.. వృత్తి.. ఆంగ్ల సహ ఉపాధ్యాయుని..

M.A.English..B.ED..

ఇంతవరకు నావి 450కి పైగా కవితలు వివిధ వార..మాస..సాహిత్య పత్రికలలో ప్రచురితమయ్యాయి..నా కవితా సంపుటి "మళ్లీ చిగురించనీ.." 2015లో 74కవితలతో ప్రచురించాను..అంతేగాక స్థానిక నిజామాబాద్ రేడియో ఎఫ్. ఎం లో 20 కథానికలు..ప్రసారమయ్యాయి..25వ్యాసాలు వివిధ పత్రికల్లో వచ్చాయి..50కథలు వివిధ పత్రికల్లో అచ్చు అయ్యాయి..వాటిల్లో 20..కథలు వివిధ సందర్భాల్లో అవార్డులను..పొందాయి..నా కవితలు కూడా అనేక సందర్భాల్లో.. పలు అవార్డులను పొందాయి.. గత దశాబ్ద కాలంగా.. కవితలు కథల్ని రాస్తున్నాను.. ఇటీవల 2022 డిసెంబర్ లో "కొత్త ఊపిరి.." కథల సంపుటిని ప్రచురించాను.. నేను పుట్టింది.. నిజామాబాద్.. జిల్లాలో.. రాధేయ..ఎక్స్ రే..భిలాయ్ వాణి..కలహంస..భూమిక..సాహితీకిరణం..ద్వానా..వాల్మీకి.. మల్లెతీగ..వారి కవితా పురస్కారాలు..సోమేపల్లి..వట్టికోట ఆళ్వారు స్వామి..జలదంకి పద్మావతి.. కథా పురస్కారాలను పొందాను..

బి.కళాగోపాల్..

నిజామాబాద్..

ధన్యవాదాలు..


43 views0 comments
bottom of page