పొదరిల్లు
- Lalitha Sripathi
- May 23
- 8 min read
#TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ, #SripathiLalitha, #శ్రీపతిలలిత, #Podarillu, #పొదరిల్లు

Podarillu - New Telugu Story Written By Sripathi Lalitha
Published In manatelugukathalu.com On 23/05/2025
పొదరిల్లు - తెలుగు కథ
రచన: శ్రీపతి లలిత
కథా పఠనం: పద్మావతి కొమరగిరి
"నాన్నగారి షష్టిపూర్తి చెయ్యడం ఎలానో కుదరలేదు. ఇంకో రెండు నెలలలో ఆయనకి డెబ్భై నిండుతాయి. కనీసం సప్తతి చేద్దాము. మీరందరూ టికెట్లు బుక్ చేసుకుని రండి" అమెరికాలో ఉన్న పెద్దకొడుకు రాహుల్ తో చెప్తోంది మాధవి.
"చూద్దామమ్మా! మళ్ళీ రోజూ ఆఫీసులకు వెళ్తున్నాము. నాకూ, రమ్య కి సెలవలు దొరకాలి, పిల్లలకు సెలవలు ఉంటాయనుకో. నేను రాజీవ్ తో కూడా మాట్లాడి చెప్తాను, నాన్న బాగానే ఉన్నారు కదా, నాకు ఆఫీస్ టైం అవుతోంది" అంటూ ఫోన్ పెట్టేసాడు.
"ఇప్పుడు పిల్లలకి ఉద్యోగాల టెన్షన్ ఎక్కువగా ఉంది మాధవీ, వాళ్ళు సెలవలు పెట్టుకుని అందరు కలిసి రావాలంటే బోలెడు ఖర్చవుతుంది. నువ్వు వాళ్ళని ఎందుకు ఇబ్బంది పెడతావు, నాకేమన్నా పుట్టినరోజు చేసుకోవడం సరదానా, ఇంకా పుట్టినరోజు ఏమిటి?" నెమ్మదిగా విసుక్కున్నాడు కృష్ణ మోహన్.
"మీ పుట్టినరోజు అనేది ఒక వంకండీ, కరోనా పుణ్యమా అని పిల్లల్ని చూసి మూడేళ్లు అవుతోంది భగవంతుడి దయవల్ల ఏదో మన కుటుంబంలో అందరం క్షేమంగా ఉన్నాము. ఒకసారి పిల్లలని, మనవల్ని కళ్లచూసుకుంటే బావుటుంది అని నా తాపత్రయం" అంది మాధవి.
కృష్ణమోహన్ ఉస్మానియా యూనివర్సిటీ లో రీడర్ గా రిటైర్ అయ్యాడు. ఇద్దరు అబ్బాయిలు మెరికల్లాగా చదువుకుని అమెరికాలో ఉద్యోగాలు చేసుకుంటున్నారు. వాళ్ళకి తగ్గవాళ్ళే భార్యలు. రాహుల్ కి కూతురు అయితే, రాజీవ్ కి కొడుకు. ఇద్దరూ అయిదేళ్లలోపే.
కృష్ణ పనిచేసేటప్పుడు యూనివర్సిటీకి దగ్గర అని నల్లకుంటలో స్థలం కొని ఇల్లు కట్టాడు. మూడొందల గజాల స్థలము ఉన్నా, ఆ రోజుల్లో తాహతు లేక రెండు బెడ్ రూమ్ ల ఇల్లు కట్టాడు. ముందు ఖాళీ స్థలంలో పూలమొక్కలు మామిడి చెట్టు, జామ చెట్టు, కొన్ని కూరగాయల మొక్కలు వేశారు. దానితో ఇల్లంతా పూలు, పళ్ళు, కూరలతో కళకళలాడుతూ ఉంటుంది. కూరలోకి వంకాయలు ఒక చేత్తో, కరేపాకు, మిరపకాయలు ఒక చేత్తో తెచ్చి తిరగమాత వేస్తుంది, ఇంటికి ముతైదువు వస్తే వెనక తమలపాకు తీగ నుంచి మూడు ఆకులు, మామిడి పండో, జామపండో, అరటిపండో కోసి బొట్టు పెడుతుంది. పూలు కొనే సమస్యే లేదు.
'మేడంటే మేడా కాదు, గూడంటే గూడు కాదు పదిలంగా అల్లుకున్నా పొదరిల్లు మాది' అన్నట్టుగా ఉంటుంది ఆ ఇల్లు.
పిల్లలు పెద్దవాళ్ళు అయ్యి పెళ్లిళ్లు అయ్యాక, అందరూ ఒకసారి వస్తే వసతి సరిగా ఉండదు, మేడ మీద రెండు రూములు వేద్దాము అంటే "నాకు ఓపిక లేదు, ఎప్పుడో ఒక్కసారి వచ్చి నాలుగు రోజులు ఉంటారు, ఎల్లకాలం మనం చేయలేము" అన్నాడు కృష్ణ.
ఈ విషయంలో వాదులాట అవుతూనే ఉంటుంది ఇద్దరికీ.
కృష్ణ మోహన్ పుట్టినరోజు వారంలోకి వచ్చింది, "పిల్లలు ఎలానూ రారు, పోనీ ఊళ్ళో ఉన్న అక్క చెల్లెళ్లని పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుందాం" అంది మాధవి. "దానికేముంది సరే" అన్నాడు కృష్ణ.
ఆడపడుచుకి ఫోన్ చేస్తే ఆరోజు ఇంకో ఫంక్షన్ ఉంది అంది.
తమ్ముడికి ఫోన్ చేస్తే ఊర్లో ఉండను అన్నాడు. మరిది, కూతురి దగ్గరికి వెళ్తున్నాను అన్నాడు.
పోనీ అని ఇంటి బ్రహ్మ గారికి ఫోన్ చేస్తే ఆరోజు వేరే గృహప్రవేశం ఉందమ్మా అన్నాడు.
మాధవికి బాధ అనిపించింది, ఏమిటి ఇలా అయింది అని.
"ఏం పర్వాలేదు, హాయిగా మన రామాలయానికి వెళ్లి, అహోబిల మఠం చూసుకుని వద్దాము" అన్నాడు కృష్ణ భార్యని అనునయిస్తూ.
ఇద్దరూ కలత నిద్రపోయారు. రాత్రి మూడవుతూ ఉంటే వాకిట్లో కార్లు ఆగిన శబ్దం, గేటు శబ్దంతో పాటు ఇద్దరు, ముగ్గురి గొంతులు వినిపించాయి. కానీ అంత రాత్రి పూట తలుపు తియ్యడానికి భయం వేసి ఇద్దరూ నెమ్మదిగా ముందు రూంలోకి వచ్చారు. గేట్ తీసుకుని లోపలికి వస్తూ "అమ్మా!నాన్నా!" అన్న గొంతులు వినిపించి తలుపుతీశారు.
ఇద్దరు కొడుకులు, కోడళ్ళు, మనవలు. వీళ్ళని చూస్తూనే "సర్ప్రైజ్ " అని అరిచారు అందరూ. "ఇదేమి సర్ప్రైజ్ రా బాబూ! దడుచుకున్నాం" సంతోషంగా అంది మాధవి, మనవళ్ళని దగ్గరకి తీసుకుంటూ, కోడళ్ళని పలకరిస్తూ.
పైకి అనకపోయినా పిల్లలు రావట్లేదని నిరాశ పడ్డ కృష్ణకి వీళ్లందరినీ చూడగానే ఎక్కడలేని ఉత్సాహం వచ్చింది.
ఇంక నిద్రెగిరిపోయింది.
మాధవి గబగబా ఇడ్లీ పెట్టి కాఫీ చేసి ఇచ్చింది. మనవలు ఇద్దరికీ పాలు కలిపి ఇస్తే తాగి ఇద్దరు నిద్రపోయారు.
"మీరు కూడా కాసేపు పడుకోండి" అని మాధవి బెడ్ రూంలు సర్ది చెపితే " లేదమ్మా! మనం పొద్దున్నే ఒక చోటికి వెళ్ళాలి. మీరు తయారు అవండి, మేము రెడీ అవుతాము" లోపలికి వెళ్లారు పిల్లలు.
ఏడు గంటలకల్లా టాక్సీల్లో బయలుదేరారు. “ఎక్కడికిరా?” అన్న తల్లితండ్రుల వేపు చూసి ముసిముసిగా నవ్వుతూ కదిలారు.
"నల్లగండ్ల" అని టాక్సీ వాళ్లతో అంటే అదెక్కడో ఊరి చివర అక్కడకి ఏమిటి అనుకున్నాడు కృష్ణ.
నల్లకుంట నుంచి బయలుదేరిన కార్లు జూబిలీహిల్స్, హైటెక్ సిటీ దాటి వెళ్తుంటే, అసలు ఇది హైదరాబాద్ నగరమేనా, ఎప్పుడూ నల్లకుంట, విద్యానగర్ మహా అయితే కోఠి తప్ప కదలలేదు. అందరూ అంటుంటే ఏదో అనుకున్నాము కానీ హైద్రాబాద్ అమెరికాకి తక్కువ లేదు అనుకున్నారు ఇద్దరూ.
టాక్సీ వెళ్లి పేరుమోసిన సువర్ణ అపార్ట్మెంట్స్ ముందు ఆగింది.
అవి ముప్ఫై అంతస్తులు ఉన్న పది టవర్స్. ఒకో అంతస్తులో ఆరు ఫ్లాట్స్.
పెద్ద గేట్, సెక్యూరిటీ, లోపల రెండు పక్కలా చెట్లు, కార్ పార్కింగ్ అంతా సెల్లార్ లో పెట్టారు. అక్కడ నుంచి పైకి వెళ్ళాక ఒక పక్క నడక కి ట్రాక్ పిల్లలు ఆడుకోడానికి పార్కులు, కళకళలాడుతోంది.
అందులో ఒక టవర్ లోకి పదో అంతస్తులోకి తీసుకెళ్లారు రాహుల్, రాజీవ్,
"ఇక్కడ ఎవరున్నారు?" అన్న ప్రశ్నకి సమాధానం ఇవ్వకుండా.
అన్నీ కొత్త అపార్ట్మెంట్లే, చివరిగా ఉన్న అపార్ట్మెంటు దగ్గరికి వెళ్లి ఆగారు.
లోపల పనులు చేస్తున్నట్టు శబ్దాలు వినిపిస్తున్నాయి, బయట లైట్లు పెడుతున్నారు.
గుమ్మం దగ్గర ‘కృష్ణమోహన్, మాధవి’ అని, పక్క ఫ్లాట్ దగ్గర ‘రాజీవ్, రాహుల్’ అని పేర్లు ఉన్నాయి.
ఆశ్చర్యంగా చూస్తున్న తల్లి తండ్రులతో "అమ్మా ! ఈ రెండు ఫ్లాట్ లు నేను అన్నయ్య కొన్నాము. ఒకటి మీ కోసం, ఇంకోటి మేము ఎప్పుడు వచ్చినా ఇబ్బంది లేకుండా మాకోసం.
మా ఫ్రెండ్స్ అందరూ ఇప్పుడు ఇండియాలో కూడా ఇల్లు ఉండడం అవసరం అంటే తీసుకున్నాము. ఇక్కడ మీకు అన్ని సదుపాయాలు ఉంటాయి. కింద స్విమ్మింగ్ పూల్, జిమ్ పెద్దవాళ్ళకి క్లబ్, ఏ రిపేర్ కావాలన్నా ఫోన్ చేస్తే చాలు మనుషులు నిమిషాల్లో చేస్తారు.
మన నల్లకుంట ఇల్లు పాతపడింది, రిపేర్ చేయించాలంటే మనుషులు దొరకరు. ఏ వస్తువు కావాలన్నా మీరే వెళ్లి తెచ్చుకోవాల్సి వస్తుంటే మీకు ఇబ్బంది అవుతోంది. ఇక్కడ చూడండి మీకోసం సామాను అంతా అమర్చాము, ఇక్కడ ఏ ఇబ్బంది ఉండదు ఏది కావాలన్న ఒక్క ఫోన్ కాల్ లో వస్తాయి. మీరు కూర్చున్న చోటు నుంచి అడుగు బయట పెట్టక్కర్లేదు”
హుషారుగా చెప్తున్న పిల్లలని చూసి అంత డబ్బు ఖర్చు పెట్టి కొనేముందు ఒక్కమాట కూడా చెప్పలేదు, కోట్లల్లో ఖర్చు పెట్టి సర్ప్రైస్ ఏంటి అనిపించినా, సరేలే వాళ్ళ డబ్బులు వాళ్ళు ఖర్చు పెట్టుకున్నారు, ఒక ఆస్తి అమర్చుకున్నారు అని ఊరుకున్నారు.
ఈలోగా బ్రహ్మ గారు కూడా వచ్చారు. "మీ పిల్లలు మరీ మరీ చెప్పారండి మీకు చెప్పద్దని, అందుకే నేను చెప్పలేదు, మీ పుట్టిన రోజు నాడే గృహప్రవేశం ముహూర్తం. రెండు ఫ్లాట్స్ కి ఒకసారి. అన్నీ తయారుగా ఉన్నాయి, మనకి ఎప్పుడూ చేసే వంట ఆయన్నే మాట్లాడాను” అన్నాడు ఆయన.
“అబ్బో ఇంత గూడుపుఠాణి మాకు తెలియకుండా బాగానే నడిపించారు” తల్లితండ్రి మాటలకు నవ్వుకున్నారు అందరూ.
వీళ్లు ఏమాత్రం ఊహించనంత గొప్పగా జరిగింది కృష్ణమోహన్ పుట్టినరోజు,
అందరు బంధు మిత్రులని పిలిచి అందరికీ మంచి బట్టలు, బహుమతులు ఇచ్చారు. వచ్చిన ప్రతివాళ్ళు వీరి అదృష్టాన్ని, రత్నాల్లాంటి పిల్లలు ఉన్నారని పొగిడితే ఇద్దరూ సంతోషంతో ఉబ్బి తబ్బిబ్బు అయ్యారు.
ఎంత హడావిడిగా వచ్చారో అంత హడావిడిగా వెళ్లిపోయారు పిల్లలు.
మీ వీలుని బట్టి ఇక్కడికి వచ్చి ఉండండి, మీ బట్టలు, మీకు అవసరమైనవి చిన్నవి తప్ప ఏమీ తెచ్చుకునే పనిలేదు అని చెప్పారు. ఒక వారం ఇక్కడ ఉండి నల్లకుంట ఇంటికి వెళ్లారు మాధవి, కృష్ణ అన్నీ సర్దుకుని ఫ్లాట్ కి రావడానికి.
ఈ ఫ్లాట్ నుంచి వెళ్లి నల్లకుంట ఇల్లు చూస్తే మాధవి కళ్ళకి రాజుని చూసిన కళ్ళతో.. అన్నట్టుగా వెలా తెలా పోయింది ఈ ఇల్లు.
ఎప్పుడెప్పుడు ఫ్లాట్ కి వెళ్లి అక్కడ రాజభోగాలు అనుభవిద్దామా అన్నట్టు తొందరపడింది.
కృష్ణ మాత్రం “అక్కడ అంతా కొత్త, ఈ వయసులో మనం కొత్త స్నేహితులని చేసుకోలేం, ఇక్కడ పిలిస్తే పలకడానికి చుట్టుపక్కల అందరూ ఉన్నారు. వీళ్లంతా మనకి ముప్ఫయ్ ఏళ్ళ నుంచి తెలుసు ఇక్కడే ఉందాము” అన్నాడు. మాధవికి అది అసలు రుచించలేదు.
ఇంట్లో పనిచేసే నర్సమ్మ కూడా దాదాపు ఇరవై ఏళ్ళ నుంచి చేస్తోంది, పనిపోతోంది అని భయపడితే మాధవి “నర్సమ్మా! నువ్వు రోజూ వచ్చి వాకిలి ఊడ్చి చెట్లకి నీళ్లు పెట్టు, రెండు మూడు రోజులకి ఒకసారి ఇల్లు చిమ్మి తుడిచెయ్యి, మేము వారం, పది రోజులకి ఒకసారి వస్తాము, నీ జీతం నీకు మామూలుగా ఇస్తాను, ఇంకో ఇల్లు మాట్లాడుకోకు” అంటే నర్సమ్మ ‘అమ్మయ్య!’ అని ఊపిరి పీల్చుకుంది.
అవసరమైన సామాన్లతో అపార్ట్మెంట్ కి వెళ్లారు ఇద్దరూ.
కోడళ్ళు వెళ్ళేముందే పనికి అమ్మాయిని మాట్లాడారు.
"ఆంటీ! ఎప్పడు వచ్చారు?” అనుకుంటూ వచ్చింది ఆ అమ్మాయి. గిన్నెలు, బట్టలు అన్నీ మిషన్లలో వేసేది. వారానికి ఒక రోజు సెలవు, రాగానే ఊపిరాడకుండా పనులు చేసి వెళ్ళేది. మాధవికి నల్లకుంటలో నర్సమ్మ నెమ్మదిగా ఒకో కబురు చెపుతూ నెమ్మదిగా చేసేది, ఈ అమ్మాయి తో మాట్లాడినట్లే ఉండేది కాదు. ఏమన్నా అంటే “అమ్మా! చిట్టీలు కట్టాలంటే నాలుగు ఇళ్లలో పని చెయ్యాలి. కబుర్లు చెప్తే డబ్బులు రావుగా” అనేది. నిజమేగా అనుకునేది మాధవి.
కృష్ణకి నల్లకుంటలో మాటిమాటికీ బయటికి వెళ్లడం అలవాటు.
ఇప్పుడు ప్రతిసారీ పది అంతస్తులు లిఫ్టులో దిగి వెళ్లినా, కింద ఎవరికివాళ్లు ఒక నవ్వు నవ్వడం తప్ప పలకరించేవారుకాదు.
కృష్ణ కూడా కొత్తవాళ్ళతో పరిచయం చేసుకోవడానికి అంత త్వరగా ముందుకురాడు, మొహమాటం అతనికి.
క్లబ్ లో క్యారమ్స్, కార్డ్స్ ఆడడం అతనికి రావు. మాధవికి ఇక్కడ ఆడవాళ్ళ పూజ గ్రూప్ తో పరిచయం అయింది. ప్రతీ రోజు ఒక దేవుడి పూజ స్త్రోత్రాలు చదవడం, ప్రసాదాలు, తాంబూలాలు తర్వాత కాసేపు కబుర్లు. ఈ గ్రూప్ లో చాలామటుకు ఇంటిపట్టున ఉండే ఆడవాళ్లే. రోజుకి ఒక చీర, కొత్త నగలు దిగేసుకుని పెళ్లికి వెళ్తున్నట్లుగా వస్తున్నారు అందరూ. మాధవి కూడా పట్టుచీరలు, జరీ చీరలు దుమ్ము దులిపి కడుతోంది. కొద్దిగా వయసులో పెద్దది, పూజల గురించి తెలిసిందని తనకి అందరూ గౌరవం ఇస్తున్నారు.
ప్రసాదాలు రోజుకి ఒకళ్ళు తెచ్చినా అదే రుచి ఉంటే “అదెలా కుదుర్తోంది” అన్న మాధవికి ప్రసాదాలు తయారుచేయడానికి ఇక్కడ ఒకావిడ ఉందని ఆవిడకి చెప్తే చేస్తుందని, అదే పని ప్రతీ పండగకి చేస్తారని చెప్పారు. “అయ్యో! ప్రసాదాలు ఆర్డర్ ఇవ్వడమేమిటి” బుగ్గలు నొక్కుకుంది మాధవి.
ఇంతలో వరలక్ష్మి వ్రతం వచ్చింది. కోడళ్ళిద్దరూ పూజ ఘనంగా చెయ్యమని వచ్చిన వాళ్ళకి తాంబూలంలో ఏదైనా బహుమతి పెట్టమని గట్టిగా చెప్పారు.
ఈ సారి నల్లకుంట ఇంట్లో కాకుండా ఇక్కడ చేసుకోవాలంటే కొద్దిగా తటపటాయించింది మాధవి. ఇన్ని ఏళ్ల నుంచి అమ్మవారిని పెట్టి పూజ చేసి చుట్టుపక్కల అందరికీ తాంబూలాలు ఇచ్చి ఎంతో ఆనందపడేది. పూలు ఇంట్లోనే బోలెడు అయ్యేవి. అవి మాలలు కట్టి ఇచ్చేది. ఇంట్లో వచ్చిన పళ్ళు, కొబ్బరికాయలు, తమలపాకులతో తాంబూలం ఇచ్చేది. పక్కవాళ్ళు, ఎదురువాళ్ళకి తను ఇంట్లో చేసిన పులిహోర, బూరెలు, గారెలు ఇస్తే వాళ్ళు ఇచ్చే బొబ్బట్లు, ఆవడలు తిని బావున్నాయి అని సంతోషపడేవాళ్ళు. ఇక్కడ ఎవరు ఏది ఇచ్చినా అదే రుచి ఎందుకంటే అన్నీ ఒకావిడ చేస్తోందికదా.
మర్నాడు పూజకోసం కిందికి వెళ్లి పూలు, పళ్ళు, తమలపాకులు అలా కావలసినవి అన్నీ తెచ్చుకుంది. మామిడాకులు కొనాలంటే బాధ వేసింది, నల్లకుంటలో తమ చెట్టువే ఎంతోమంది కోసుకెళ్లేవారు.
తాంబూలాలలో ఇవ్వడానికి పిల్లలు పంపిన డబ్బులతో చిన్న వెండి వస్తువులు, జాకెట్టు గుడ్డలు కొంది.
ఉదయం తను మామూలుగా ఎలా చేస్తుందో పూజ అలానే చేసి, రవ్వలడ్లు, గారెలు, బూరెలు, పులిహోర ఎక్కువగానే చేసింది, ఎవరైనా వస్తే పెట్టడానికి.
సాయంత్రం లోగా అందరూ ఫోన్ చేసి వాళ్ళ వాళ్ళ ఇళ్ళకి రమ్మన్నారు.
అందరిళ్ళకి వెళ్తే తమ ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎలా అనుకుంటే వాళ్ళే ఒక టైంటేబుల్ పంపారు.
అందరూ వరుసగా ఎవరింటికి ఏ టైంకి వెళ్ళాలి అని. దానిప్రకారం అందరూ ఒకేసారి ఒకో ఇంటికి వెళ్లి తాంబూలం తీసుకుని వేరే ఇంటికి వెళ్ళాలి. ఇది కూడా బానేఉంది అనుకుంది మాధవి.
అలా స్లాట్ ప్రకారం మొదటి ఇంటికి వెళ్లారు.
అంతా పేపర్లు, పూలతో చిన్న సైజ్ పెళ్లికి చేసినట్టు ఇల్లు అలంకరించారు.
లోపలికి వెళ్ళాక ఆ ఇల్లాలు అప్పుడే పార్లర్ నుంచి జడ వేయించుకుని, చీర కట్టించుకుని వచ్చిందని తెలిసింది.
అక్కడ బల్ల మీద పేపర్ ప్లేట్లు ప్లాస్టిక్ కాగితం సీల్ చేసి ఉన్నాయి. ఒక్కో ప్లేట్లో కారాలు, స్వీట్లు పెట్టి ఉన్నాయి. అక్కడే పసుపు, కుంకుమ పెట్టి ఉన్నాయి. ఒక్కోరు వచ్చి కనిపించీ కనిపించినట్లు బొట్టు పెట్టుకుని వచ్చారు. అమ్మవారికి ఈవిడ నగలు, పెద్ద కొత్త పట్టుచీర కట్టి ఇల్లంతా లైట్లు పెట్టి, స్టీరియో లో స్తోత్రాలు పెట్టారు, మాధవి కి అంతా గందరగోళం గా అనిపించింది.
పండు, తాంబూలం కూడా కవర్ లో పెట్టి సీల్ చేసి ఒక పెద్ద బ్యాగ్ ఇచ్చారు.
“ఇంత బ్యాగ్ ఎందుకు?” అన్న మాధవితో “అందరి ఇళ్లలో తాంబూలం వేసుకోవాలి కదా అందుకే మొదటివాళ్ళు ఇలా బ్యాగ్ ఇస్తారు” చెప్పింది ఒకావిడ.
ఇలా ప్రతీ ఇంటికి వెళ్లి వాళ్ళు ఆర్డర్ ఇచ్చి చేయించిన స్వీట్లు, తాంబూలాలు, గిఫ్ట్ గా ఇచ్చిన గాజు బౌల్స్, ప్లాస్టిక్ డబ్బాలు పట్టుకుని ఆఖరుగా మాధవి ఇంటికి చేరారు.
అక్కడ మాధవి తన పద్ధతిలో అందరికీ ముఖాన బొట్టుపెట్టి, కాళ్లకి పసుపురాసి అందరూ అమ్మవారు అనుకుని కాళ్లకి దణ్ణంపెట్టి తాంబూలం చేతికి ఇస్తే, అందరికీ చిత్రంగా అనిపించింది.
అందరికీ స్టీల్ ప్లేట్లో వేసిన అరటి ఆకుల్లో కొద్దిగా పులిహోర, రవ్వలడ్డు, గారె, బూరె వేసి ఇస్తే ముందు మొహమాటానికి ‘వద్దు’అన్నా అన్ని ఇళ్ళు తిరిగి ఆకలేసి తిని “అబ్బా ఎంత బావున్నాయి ఆంటీ! ఈసారి మేము కూడా అక్కడే ఆర్డర్ ఇస్తాం, ఫోన్ నంబర్ ఇవ్వండి “ అంటే “అన్నీ నేనే చేశాను” అన్న మాధవిని చూసి నోరెళ్లబెట్టారు అందరూ.
శ్రావణ మాసం ఇంట్లో అమ్మవారిని పెట్టుకోకుండా ఉండడానికి మనసు రాక మాధవి పై వారం పూజ అక్కడ చేసుకోవాలని ఆదివారమే నల్లకుంటకి వెళ్లింది. వాకిట్లో నర్సమ్మ పెట్టిన ముగ్గు, ఇంట్లో పూలతో నిండిన మొక్కలు, పళ్ళ చెట్లు చూడగానే మాధవికి ప్రాణం లేచి వచ్చినట్లయింది.
కాఫీ తాగంగానే బయటికి వెళ్లిన కృష్ణ మధ్యాహ్నం భోజనం టైం వరకు స్నేహితుల దగ్గరకి వెళ్లి కబుర్లు చెప్తూనే ఉన్నాడు. పక్కవాళ్లు, ఎదురువాళ్ళు శుక్రవారం మాధవిని ఎలా మిస్ అయ్యామో చెప్తుంటే మాధవి కళ్ళు చెమర్చాయి.
ఒకళ్ళు టిఫిన్ పంపితే, ఇంకోళ్ళు కూరలు, పచ్చళ్ళు పంపారు.
ఆ పలకరింపులో ఆప్యాయత, అనురాగం గమనించిన మాధవి మనసు భారమైంది.
ఇంత మంచి ఇరుగుపొరుగు వదిలేశామా! అని బాధ వేసింది.
కృష్ణ మొహంలో కూడా అక్కడ లేని ఉత్సాహం కనిపించింది. ఆపకుండా స్నేహితుల కబుర్లు చెప్తున్న కృష్ణ ముఖంలోకి ఆనందంగా చూస్తున్న మాధవిని చూసి “ఏమిటి నా మొహంలోకి అలా చూస్తున్నావు?” నవ్వుతూ అడిగాడు.
“ఈ హుషారంతా అక్కడ ఏమైంది అని చూస్తున్నాను” అంది మాధవి.
“ఏమో మాధవీ! అక్కడ అన్ని సుఖాలు ఉన్నాయి కాదనను, కానీ అదేమిటో ఒక ఫైవ్ స్టార్ హోటల్ లా ఉంది నాకు.
అన్ని పనులు ఇంటినుంచి చేసుకోవచ్చు నిజమే, కానీ మనకి బయటికి వెళ్ళకపోతే కాలక్షేపం ఏది?
ఉద్యోగాలు చేస్తూ బయటికి వెళ్ళలేని వాళ్ళకి అది నిజంగా మంచి స్థలం. వాళ్ళు సమయం వృధా అవకుండా ఇంటినుంచి అన్నీ చేసుకుంటారు, ఫోన్ తో అన్ని తెప్పించుకుంటారు, కాని రోజులో ఉన్న సమయం ఎలా గడపాలో తెలియని మనలాంటి వాళ్ళకి కాదు.
డబ్బు ఉంటే అన్నీ ఉన్నాయి, కానీ.. మనతో ఈ కబుర్లు చెప్పే తీరిక, ఓపిక అక్కడ వాళ్ళకి ఉండదు, వాళ్ళకి తగ్గ పనులు, అభిరుచులు వాళ్ళకి ఉన్నాయి.
ఈ వయసులో మనకి కావాల్సింది మనమేమిటో తెలిసి మనతో గడిపేవారు. మార్పుకోసం ఎప్పుడైనా వెళ్లి నాలుగు రోజులు ఉండగలం కానీ, నా వరకు నాకు మొత్తం అక్కడ ఉండలేను” మాధవిని చూస్తూ అన్నాడు కృష్ణ.
“నిజమండీ! నాకూ అక్కడ కాలక్షేపం ఉంది కానీ ఇలాగ ఫ్రీగా లేదు. ఆ ఇళ్ళు వయసులో ఉన్న పిల్లలకి బావుంటాయి. వాళ్ళకి ఇల్లే ఆఫీస్, ఉద్యోగాల హడావిడిలో బయటికి వెళ్లి అన్నీ కొనుక్కునే సమయం లేదు. ఏ వస్తువు కావాలన్నా బయటికి వెళ్ళకుండా అన్నీ దొరుకుతాయి, ఒక్క ఫోన్ చేస్తే ఇంటికి వస్తాయి. మనకి ఒక కూర అయినా ఒక సరుకు అయినా బయటికి వెళ్లి తెచ్చుకుంటే అదో తృప్తి, కాలక్షేపం. అక్కడ పిల్లలు ఆడుకోవడానికి అన్ని సౌకర్యాలు ఉన్నాయి, వాళ్ళు బయటికి వెళతారు అనే భయం ఉండదు.
మనకి ఇంట్లోనే ఉంటే తోచదు, కాసేపు ఒక గుడి అనో, పార్క్ లో వాకింగ్ అనే వంకలతో బయటికి వెళతాం, మన కష్టసుఖాలు పంచుకుంటాం. అది తప్పుగా అనిపించదు, ఎందుకంటే మన కుటుంబ నేపథ్యం, మన పిల్లలు అంతా ముప్పై ఏళ్లుగా ఇక్కడ వాళ్ళకి తెలుసు. మన ఈ పొదరిల్లే మన వానప్రస్థం. మధ్య మధ్యలో ఫ్లాట్ కి వెళ్లి అక్కడి సరదా జీవితం కూడా అనుభవిద్దాం. పిల్లలు వచ్చినప్పుడు వాళ్ళతో అక్కడ, ఇక్కడా కూడా గడపొచ్చు. ఆ సంగతి పిల్లలకి నెమ్మదిగా వాళ్ళు బాధపడకుండా చెప్దాం” మాధవి అంటుంటే కృష్ణ సంతోషంగా “అందుకే నిన్ను మనసెరిగిన నెచ్చెలి అనేది” నవ్వుతూ అన్నాడు.
***
శ్రీపతి లలిత గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం:
నా పేరు శ్రీమతి శ్రీపతి లలిత.
నేను ఆంధ్రా బ్యాంకు లో ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేశాను.
నా భర్త గారు శ్రీపతి కృష్ణ మూర్తి గారు కేంద్ర ప్రభుత్వం లో గెజెటెడ్ ఆఫీసర్ గా పని చేసి పదవీ విరమణ చేసారు.
నాకు చిన్నప్పటి నుంచి పుస్తక పఠనం , శాస్త్రీయ సంగీతం , లలిత సంగీతం వినడం ఇష్టం.
అరవై ఏళ్ళ తరవాత జీవితమే మనకోసం మనం బతికే అసలు జీవితం అనుకుంటూ రచనలు మొదలు పెట్టాను.
నా కధలు ఫేస్బుక్ లోని "అచ్చంగా తెలుగు " , "భావుక " గ్రూప్ లో , " గోతెలుగు. కం" లో ప్రచురించబడ్డాయి.
ప్రస్తుత సమాజం లో ఉన్న సమస్యల మీద , ఏదైనా పరిష్కారం సూచిస్తూ కధలు రాయడం ఇష్టం.
నేను వ్రాసిన కధలు ఎవరైనా చదువుతారా !అని మొదలు పెడితే పాఠకులనుంచి మంచి స్పందన, ప్రోత్సాహం , ఇంకాఉత్సాహం ఇస్తుంటే రాస్తున్నాను.
పాఠకుల నుంచి వివిధ పత్రికల నుంచి ప్రోత్సాహం ఇలాగే కొనసాగగలదని ఆశిస్తూ.. మీకందరికీ ధన్యవాదాలుతెలుపుతూ మళ్ళీ మళ్ళీ మీ అందరిని నా రచనల ద్వారా కలుసుకోవాలని నా ఆశ నెరవేరుతుంది అనే నమ్మకం తో ... సెలవు ప్రస్తుతానికి.
బాగా చెప్పారు.ఇలాగే ఉంటాయి పెద్దవారి ఆలోచనలు...చుట్టూ మనుషులూ , మనసులూ కావాలి 👏🏻👏🏻