top of page

అపరాధ పరిశోధన - పార్ట్ 10

Updated: May 30

#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన


Aparadha Parisodhana - Part 10 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 22/05/2025

అపరాధ పరిశోధన - పార్ట్ 10 - తెలుగు ధారావాహిక

రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్




జరిగిన కథ:


కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు. 


ఇంటరాగేషన్ లో కిషన్, ఫయాజ్ లు తడబడతారు. మొదట లొంగని రంగా, బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు. 


ఆ రోజు సాయంత్రం శివరాం శర్మ ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులతో మాట్లాడాలనుకుంటాడు దీక్షిత్. తను కూడా వస్తానంటుంది నీతూ శర్మ.


దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము.


హంతకుడు రంగా మునావర్ ను కాంటాక్ట్ చేస్తాడు. మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్.



ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 10 చదవండి..


కానిస్టేబుల్ మధు అందించిన మొబైల్ ఫోన్ లో వాయిస్ రికార్డింగ్‌ను మురళి, దీక్షిత్‌లు ఆసక్తిగా విన్నారు. అందులో వినిపించిన స్వరాలు, సంభాషణల మూలంగా కేసు ఒక్క అడుగు ముందుకు కదిలిందని స్పష్టమైంది.


"మామూలుగా అయితే ఇలాంటి నేరస్థులు తాము వాడిన ఫోన్లను తమ కళ్లముందే ధ్వంసం చేయమంటారు. కానీ ఈ కేసులో వాళ్లు కొంత తొందరపడి కొన్ని తప్పులు చేశారు. ఆ తప్పులే మనకు బలమైన ఆధారాలుగా మారుతున్నాయి," అని దీక్షిత్ వ్యాఖ్యానించాడు.


"నిజమే సార్! ముఖ్యంగా చిల్లర డబ్బులకు ఆశపడే వాడిలాగా మన కానిస్టేబుల్ మధు గారి నటన వీళ్ళని బుట్టలో పడేలా చేసింది. ఇలాంటి ఆరితేరిన నేరస్తులు డబ్బుకు లోంగే  వారి కోసం ఎదురు చూస్తూ ఉంటారని పసిగట్టి, మన మధు సార్ ని ఆ పాత్రలో ఉంచడం మీ ప్లాన్ ప్రకారమే జరిగింది. అందువల్లే వాళ్ల కంటే ఒక అడుగు ముందుగా ఉండగలుగుతున్నాం." అన్నాడు మురళి. 


"ఇప్పుడు విచారణను తదుపరి దశకు తీసుకెళ్లాలి. మొదట కిషన్, ఫయాజ్‌లను పిలిపించు. వాళ్లను అప్రూవర్స్‌గా మార్చుకోవచ్చు. శివరాం శర్మ గారి హత్యకు ప్లాన్ చేసినవారిని కనిపెట్టాలి.. నువ్వే స్వయంగా వాళ్లతో మాట్లాడి వాళ్లను నా వద్దకు తీసుకొని రా," ఆదేశించాడు దీక్షిత్.


మురళి వెంటనే కిషన్, ఫయాజ్‌లను విడివిడిగా కలిశాడు. "ఎస్పీ గారు అప్రూవర్‌గా తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు," అన్న మాట వాళ్లకు కొంత ఊరట ఇచ్చింది.


"మీరు జాఫర్‌ని కలిశారా?" మురళి ప్రశ్నించాడు.


"ఫోన్లో మాత్రమే మాట్లాడాం సార్. ఆయన పేరు జాఫర్ అని చెప్పాడు," అన్నాడు కిషన్.


"జాఫర్ అని చెప్పాడని నమ్మేశారా? ఆయన పేరు అమితాబ్ బచ్చన్ అని చెబితే కూడా నమ్మేస్తారా?" మురళి ప్రశ్నించాడు. "ఆ నెంబర్ ఎవరు ఇచ్చారు?"


"మునావరన్న ఫ్రెండ్- కాలా చెప్పాడు సార్. ఆయనదే సిఫార్సు."


"మునావర్ దాము మనిషి. దానికి పైగా దాము-జాఫర్ మధ్య ఎప్పటి నుంచో విభేదాలున్నాయి. మునావర్ ఎందుకు జాఫర్ నెంబర్ ఇస్తాడు?" అడిగాడు మురళి.


"అయన ఇప్పుడైతే జాఫర్‌తో కలిసి ఉన్నట్లు చెప్పారు" అన్నాడు ఫయాజ్.


"ఇంకొద్ది సేపట్లో దామును సాక్ష్యాలతో అరెస్టు చేయబోతున్నాం. అతడు మిమ్మల్ని కాపాడలేడు. పైగా, దామును వాడుకున్న వారే ఇప్పుడు మిమ్మల్ని ఇరికించవచ్చు.. నిజం చెప్పండి. ఎస్పీ సార్ మీకు సహాయం చేస్తారు," మురళి నచ్చజెప్పాడు.


కొద్దిసేపు చర్చించుకుని, "అలాగే సార్. మేము సహకరిస్తాం," అని అంగీకరించారు వాళ్లు.

వాళ్లను దీక్షిత్ వద్దకు తీసుకెళ్లారు.


"మరేంటి, అప్రూవర్స్‌గా మారతారా లేక ఇంకా ఎవరో కాపాడతారనే భ్రమలో కొనసాగుతారా?" దీక్షిత్ ప్రశ్నించాడు.


"మేం తప్పు చేశాం సార్. శివరాం శర్మ గారి కారు ఇంట్లోకి వెళ్తున్న సమయంలో కింద బైక్‌తో పడిపోయేలా నటించమని మాకు జాఫర్ ఆదేశించాడు. కానీ ఆయన అసలు పేరు దాము అని  తెలుసుకున్నాం. మునావర్ ద్వారా జాఫర్ నెంబర్ వచ్చినట్టు మాకు అప్పట్లో తెలియలేదు."


"పూర్తిగా వివరించండి," అన్నారు దీక్షిత్.


"కాల్ చేసిన వ్యక్తి తన పేరు జాఫర్ అని చెప్పాడు. వివరాలు మునావర్ ద్వారా వచ్చాయి. మాతో మాట్లాడింది కాలా. ఆయనే మాకు సూచనలు ఇచ్చారు – బైక్‌ను కారు కింద వేయడం, అనంతరం షూట్ జరిగాక నిందితుడి ఫోటో తీసి పంపడం. అంతా క్రమంగా జరిగింది."


"డబ్బు విషయానికొస్తే?" మురళి అడిగాడు.


"పోలీసుల విచారణ ముగిసిన తర్వాత డబ్బు అందుతుందని చెప్పారు. కానీ ఆ డబ్బు ఇప్పటికి రాలేదు."


"ఇద్దరినీ అప్రూవర్స్‌గా తీసుకుని స్టేట్మెంట్స్ రికార్డు చేయించండి. వీళ్లకు తక్కువ శిక్ష పడేలా చూస్తాం," అన్నారు దీక్షిత్. "ఇప్పుడు రంగాను బైక్‌లో తీసుకెళ్లిన వ్యక్తిని తీసుకొచ్చి మాట్లాడుదాం."


కొద్ది సేపటికి ఒక యువకుడు వచ్చాడు. అతనిలో చలాకీతనం కనిపించింది. కానీ అతని కళ్ళల్లో భయం కనిపిస్తోంది.

"నీ పేరు?" అడిగాడు దీక్షిత్.


"విక్రమ్ సార్," అన్నాడు అతను కొంచెం జంకుతూ.


"నిన్ను ఎవరు పంపించారు?" మురళి అడిగాడు.


"ఒక నెంబర్ ఇచ్చారు. ఆ నంబర్‌కు కాల్ చేయమన్నారు. అవతలి వ్యక్తి ఒక మనిషిని బైక్ లో తీసుకెళ్లాలని చెప్పారు. ఏం జరుగుతుందో నీకు సంబంధం లేదన్నారు."


"ఆ నెంబర్ నీ దగ్గర ఉందా?" అడిగాడు మురళి.


"అవును సార్. నా ఫోన్లో 'మునావర్ మనిషి' అని సేవ్ చేశాను. నా ఫోన్ మీ వద్దే ఉంది కదా."


దీంతో, అతని వివరాలను ఆధారంగా తీసుకొని తదుపరి విచారణలో మునావర్–దాము మధ్య సంబంధాలు, కాలా పాత్ర, అసలు మాస్టర్‌మైండ్ ఎవరు అనే దానిపై దృష్టి కేంద్రీకరించాలని నిశ్చయించారు.


అంతేకాదు, దీక్షిత్ మసులుతున్న మెదడు కొత్త పథకాన్ని సిద్ధం చేస్తోంది – "దాము మేము ఊహించినదానికంటే పెద్ద ముఠాలో భాగమై ఉండవచ్చు. విక్రమ్ అందించిన నంబర్, కాలా ద్వారా వచ్చిన సూచనలు.. ఇవన్నీ వాడుకుంటే గుట్టు వీడుతుంది."


మురళికి దీక్షిత్ చెప్పింది స్పష్టంగా అర్థమయ్యింది – ‘ఈ కేసు శివరాం శర్మపై దాడితో ఆగదు. ఇది ఒక పెద్ద కుట్రలో భాగం. ఇప్పుడు చేతిలో ఉన్న అప్రూవర్లను ఉపయోగించి, మిగతా ముఠా సభ్యుల నుంచి నిజాలను రాబట్టాల్సిన అవసరం ఉంది.’ అనుకున్నాడు.


"ఈ సారి రంగాను తీసుకొని రండి" చెప్పాడు దీక్షిత్. 


రంగా రాగానే ఆలస్యం చెయ్యకుండా మొదలు పెట్టాడు దీక్షిత్."కిషన్, ఫయాజ్ లు, నిన్ను బైక్ లో తీసుకొని వెళ్లిన విక్రమ్.. అందరు దాము పేరు చెప్పారు" 


మనసులో నవ్వుకున్నాడు రంగా. 'వీళ్లు ఉత్తినే బెదిరిస్తున్నారు. వాళ్లకు దాము తన పేరు జాఫర్ అని చెప్పాడు కదా..' అనుకున్నాడు.


అతని ఆలోచన పసిగట్టిన దీక్షిత్, "కాలా మునావర్ బావమరిది. మునావర్ దాము ముఖ్య అనుచరుడు. ఈ విషయం అందరికీ తెలుసు. కాబట్టి డీల్ దాముతో అని వీళ్లకి తెలుసు. అలానే స్టేట్ మెంట్ ఇచ్చారు. ఇక మేము బషీర్ పైన నిఘా పెట్టాం. నువ్వు ఫోన్ లో మునావర్ ను కాంటాక్ట్ చెయ్యడం, అతను జాఫర్ పేరు చెప్పమనడం అన్నీ కాల్ రికార్డ్ ద్వారా బయట పడ్డాయి. త్వరలో దాము, మునావర్ లు అరెస్ట్ కావడం ఖాయం. వాళ్ళ ద్వారా దాముతో డీల్ కుదుర్చుకున్న పెద్దలు దొరకడం ఖాయం. మేము గనక డబ్బుకు ఆశపడితే నిన్ను మా కష్టడీలోనే చంపేస్తారు. 

ఏం చెయ్యాలో నువ్వే ఆలోచించుకో" అన్నాడు దీక్షిత్.


ఒక నిముషం అలోచించి, "ఒప్పుకుంటున్నాను సర్. నన్ను ఎంగేజ్ చేసుకుంది దాము" చెప్పాడు రంగా.


"దాముని ఎంగేజ్ చేసుకుంది ఎవరు? అది కూడా చెప్పు." అడిగాడు మురళి.


"నిజంగా చెబుతున్నాను. నాకు ఆ విషయం తెలీదు. అసలు అలాంటివి మేము అడగకూడదు." చెప్పాడు దాము.


అతని మాటల్లో నిజం ఉందనిపించింది దీక్షిత్ కు.


"కానీ ఏదో ఒక సందర్భంలో నోరుజారి ఉండొచ్చు కదా. కాస్త ఆలోచించుకుని చెప్పు" అన్నాడు దీక్షిత్.


"అలాంటిదేమీ ఉండదు సర్. ఆ.. ఒకటి గుర్తుకు వచ్చింది. 


"దొరికిపోతామేమో అని నేను అంటే కేసు విషయంలో దగ్గరి వాళ్ళు కూడా పెద్దగా ఆసక్తి చూపరు. ఇక కొడుకులు భోపాల్ లో వ్యాపారాల్లో మునిగిపోయి ఉన్నారు" అన్నాడు రంగా.


"సరే. ఇతన్ని లాకప్ లో ఉంచండి" అని అతన్ని పంపేశాడు దీక్షిత్.


“ఇక నీతూ శర్మ పైన దాడి చేసిన వారిద్దరినీ పిలిపించండి. అదయ్యాక ఇంటికి వెళ్ళి ఆమెను తీసుకొని శివరాం శర్మ వాళ్ళింటికి వెళ్ళాలి" అన్నాడు.


పోలీసులు వాళ్ళిద్దరినీ ఆ గదికి తీసుకొని వచ్చారు.

"ఒక అమ్మాయి పైన దాడి చెయ్యడానికి వెళ్లారు. మీకు సిగ్గుగా లేదూ?" అన్నాడు మురళి.


"మేము శివరాం గారి విధేయులం. హంతకుడు దొరికాక కూడా ఆ అమ్మాయి ఏవో అనుమానాలంటూ వీడియో చేసింది. అందువల్ల విచారణ ఆలస్యం అవుతుంది. ఆ కోపంతో బెదిరిద్దామని వెళ్ళాము. దాడి చేసే   ఉద్దేశం లేదు" చెప్పారు ఇద్దరూ.


"ఆ అమ్మాయి రాత్రి రెండు గంటలప్పుడు వీడియో చేస్తే వేకువఝామునే అభిమానులు దాడి చెయ్యడం సహజంగా లేదు. నిజం చెప్పండి" అన్నాడు దీక్షిత్.


కాస్త తటపటాయించి, " అలా అటెంప్ట్ చేసినట్లు నటించమని ఆ అమ్మాయి అన్నయ్యే చెప్పాడు సర్" చెప్పాడు వాళ్లలో ఒకడు.


"ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు" అన్నాడు మురళి.


"నిజం సర్. ఆ అమ్మాయి అన్నయ్య స్వయంగా వీడిని కలిసాడు." అంటూ ఒక ఫోటో చూపించాడు రెండోవాడు.


అందులో నీతూ  అన్నయ్య ప్రణవ్ మొదటివాడితో మాట్లాడుతున్నట్లు ఉంది. 


“మీరు ఎందుకు అబద్ధాలు చెబుతున్నారో నాకు తెలుస్తోంది. మిమ్మల్ని తరువాత డీప్ గా విచారిస్తాను" అని వాళ్ళను కస్టడీకి పంపాడు దీక్షిత్.


"వీళ్ల ద్వారానే హత్య వెనుక ఉన్న అసలు వ్యక్తులు దొరుకుతారు. వీళ్ల ప్లాన్ తెలిసిందే. ముందుగా నీతూశర్మ పైన అనుమానం కలిగేలా చేస్తారు. తరువాత అసలు వ్యక్తి అంటూ మరొకరిని చూపుతారు, ఇందాక రంగా జాఫర్ ను  తమ బాస్ గా  చూపినట్లుగా. 


రేపు మరోసారి వీళ్లను విచారిద్దాం. ఇక బయలుదేరుదాం." అన్నాడు దీక్షిత్.


"సర్! నేనుకూడా మీతో ఇంటికి రానా?" అడిగాడు మురళి.


"వై నాట్? అమ్మ చేతి కాఫీ తాగుదువు కానీ" అంటూ మురళి వైపు చూశాడు దీక్షిత్.


కానీ అతను వేరే ఆలోచనలో ఉన్నట్లు గ్రహించి "టెన్షన్ పడకండి. కేసు విషయంలో అంతా అనుకున్నట్లే జరుగుతుంది" అన్నాడు నవ్వుతూ. కానీ మురళి ముఖంలో నవ్వు రాలేదు.

తాను శివరాంశర్మ గారి ఇంటికి వెళ్లబోతున్నాడు. మాములుగా అయితే మురళి ముందుగా అక్కడికి వెళ్ళి అక్కడి ఏర్పాట్లు, అక్కడ సెక్యూరిటీ ఎలావుందీ.. లాంటివి పరిశీలించి తనకు ఇన్ఫార్మ్ చేస్తాడు. కానీ ఇప్పుడు తనతో పాటు తన ఇంటికి రావడమేమిటి?.. 


ఆలోచిస్తున్నాడు దీక్షిత్. 


=========================================================

ఇంకా ఉంది


=========================================================


మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:

నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.

 








Comments


bottom of page