top of page

శ్రీరామదూతం శిరసానమామి

Updated: May 23

#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #Sriramadutham Sirasanamami, #శ్రీరామదూతంశిరసానమామి, #TeluguArticleOnHanuman

Sriramadutham Sirasanamami - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 22/05/2025

శ్రీరామదూతం శిరసానమామి - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


 హనుమజ్జయంతి సందర్భంగా శ్రీ ఆంజనేయ ప్రార్థనతో మొదలుపెట్టి కేసరి నందనుడి పుట్టుపూర్వోత్తరాలు, నామధేయాలు, శక్తి సామర్థ్యాలతో పాటు ఆ మహానుభావుడి నుండి మనం నేర్వ దగిన జీవిత పాఠాలు కొన్నింటిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. 


మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్ఠమ్ । 

వాతాత్మజం వానర యూధముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి || 


మనసు వలె మెరుపు జోరు కలవాడు, వాయువుతో సమానమైన వేగం కలవాడు, ఇంద్రియాలను జయించిన వాడు, సూక్ష్మ బుద్ధి కలవారిలో శ్రేష్టుడు, వాయుదేవుని కుమారుడు, వానర సేనలో ప్రధానుడు, శ్రీరామ దూత అయినటువంటి హనుమంతుడికి శిరస్సు వంచి నమస్కారము చేయుచున్నాను. 


పుట్టుపూర్వోత్తరాలు: 

కంబ రామాయణంలో తెలుపబడిన వృత్తాంతం ప్రకారం ఒకసారి దేవలోకంలో దేవేంద్రుడు దేవతలు ఋషుల సమక్షంలో కొలువుతీరి ఉండగా పుంజికస్థల అను అప్సరసకాంత దేవ గురువైన బృహస్పతి వద్దకు చేరి వింత హావభావాలతో వికృత హాస్య ప్రసంగం చేయడం మొదలు పెట్టింది. మర్కటంలా ప్రవర్తిస్తున్న ఆమె హావభావ వికారాలకు బృహస్పతి కోపగించి నీవు భూలోకంలో "వానర స్త్రీగా జన్మించెదవుగాక ! అని శాపం పెట్టాడు. ఆ విధంగా శాపగ్రస్తురాలైన పుంజికస్థల పొరపాటు గ్రహించి తనను క్షమించి శాప విమోచనం చేయమని అనేక విధాల ప్రార్థించగా బృహస్పతి శాంతించి, నువ్వు భూలోకంలో "హనుమంతుడికి" జన్మ ఇచ్చిన తరువాత తిరిగి దేవలోకమునకు రాగలవని అనుగ్రహించాడు. 


జననం, నామధేయాలు: 

శాపవశాత్తు భూలోకంలో వానరకన్యగా జన్మించిన పుంజికస్థల "కేసరి" అనే ఒక అందమైన వానరాన్ని ప్రేమించి వివాహమాడింది. బలవంతుడైన కేసరి మునులకోరికపై శంబసాధనుడు అనే రాక్షసుడితో యుద్ధం చేసి అతన్ని చంపి దేవ ఋషుల పీడ తొలిగిస్తాడు. సంతానలేమితో బాధపడుతున్న అతను భార్య అంజనితో కలిసి భక్తితో శివుని ఆరాధించెను. అప్పుడు వాయుదేవుడు శివుని తేజస్సును పండు రూపంలో అంజనకు అందించగా ఆ అంజనకు జన్మించిన కుమారుడే ఆంజనేయుడు. అతను కేసరి పుత్రుడు కనుక కేసరి నందనుడనీ, వాయుదేవుని అనుగ్రహముతో జన్మించాడు కనుక వాయుసుతుడనీ, దివ్యతేజస్సుతో అంజనీ పుత్రుడిగా పుట్టడం వలన ఆంజనేయుడని పేర్లు వచ్చాయి. అంతేకాకుండా అతనికి చిన్నతనంలో అంజనా దేవి పెట్టిన పేరు ‘సుందర’ కాబట్టి రామాయణం లోని సుందరకాండకి ఆపేరే వచ్చింది.‌ పుట్టుకతోనే పరాక్రవంతుడైన ఆంజనేయుడికి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చిందో చూద్దాం.


హనుమంతుడిగా మారిన వైనం: 

చిన్నతనంలో ఉన్నప్పుడు ఒంటరిగా నిద్రపోతున్న ఆంజనేయుడిని ఇంటి వద్ద వదిలి పెట్టి పళ్ళు తీసుకొని రావడానికై అడవికి వెడుతుంది అతని తల్లి. ఈలోగా ఆకలి వేసి మెలుకువ వచ్చిన ఆంజనేయుడు కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా ఎర్రని సూర్య బింబం కనిపిస్తుంది. గుండ్రంగా మెరుస్తున్న ఆ ఎర్రని బింబాన్ని చూసి పండుగా భ్రమించి దాన్ని అందుకోవాలనే కుతూహలంతో ఒక్కసారి ఆకాశం పైకి ఎగురుతాడు. రివ్వుమని వాయు మనో వేగాలతో సూర్యుడి వైపు దూసుకుపోతున్న ఆ బాలుడిని దేవతలు, మునులు, రాక్షసులు ఆశ్చర్యంగా చూడసాగారు. మహాశక్తిమంతుడైన ఆంజనేయునికి సూర్యుడి వలన వేడి తగలకుండా వాయువు అతనిచుట్టూ చేరి చల్లబరుస్తుంది. సూర్యుడు కూడా ఒక్క సారిగా తనవైపుకు దూసుకొస్తున్న పిల్లవాడిని గమనించి ఇతనెవరో మహానుభావుడిగా గుర్తించి అతనికి వేడి తగలకుండా తన తేజస్సును తగ్గించుకొన్నాడు. మరోవైపు ఆరోజు సూర్యగ్రహణం కావడం వల్ల సూర్యుడ్ని పట్టుకోవడానికి రాహువు వేగంగా సమీపిస్తునాడు. అతనికి అపరిమితమైన వేగంతో బాణంలా దూసుకువస్తున్న హనుమంతుడు కనిపించాడు. ఆ పిల్లవాడి తేజస్సు ముందు రాహువు వెలవెల పోయాడు. వెంటనే ఇంద్రుని వద్దకు వెళ్ళి తాను చూసింది చెప్పాడు. ఇంద్రుడు ఐరావతం ఎక్కి వజ్రాయుధాన్ని తీసుకొని రాహువుతో వచ్చి వాయు వేగంతో పోతూన్న ఆంజనేయుడిని చూసాడు. వేగంగా వెడుతున్న ఆంజనేయుడికి ఐరావతం తెల్లగా ఒక పండులా కనిపించింది. దాన్ని చప్పున అందుకోబోయాడు. ఇంద్రుడు ఆగ్రహంతో వజ్రాయుధాన్ని ఎత్తి గట్టిగా ఆంజనేయుడి మొహం పైకి విసిరాడు. ఆ వజ్రాయుధం వేగంగా వెళ్లి ఆంజనేయుడి ఎడమ చంపకు తగిలింది. ఆదెబ్బకు స్పృహ తప్పి కిందకు జారి ఒక పర్వతం పై పడిపోతాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో ఆ బాలుని కొట్టడం వల్ల ఆ బాలుని హనువుకు (దవడకు) చొట్ట పడినది. చొట్ట పడిన దవడ కలిగిన వాడవడం చేత హనుమంతుడనే పేరు వచ్చింది.


బ్రహ్మ ద్వారా ఉపశమనం, వరాల జల్లు: 

ఇంద్రుడు చేసిన పనికి వాయుదేవునకు ఆగ్రహం కలిగింది. ఆ కోపంలో లోకాలలో గాలిని ఉపసంహరించి పాతాళానికి వెళ్ళిపోయాడు. విషయం తెలుసుకుని బ్రహ్మ అంజనీ దేవి వద్దకు దేవతలను వెంట పెట్టుకొని వెళ్ళాడు. ఆమె బాల హనుమంతుని ఒడిలో పెట్టుకొని పెద్దగా ఏడుస్తూ ఉంది. బ్రహ్మ అతడిని దీవించి తన హస్తాలతో బాల హనుమను నిమరగానే అతడు నిద్ర లోంచి లేచినవాడి వలె లేచాడు. వాయుదేవుడు సంతోషించి బ్రహ్మ పాదాలకు నమస్కరించి తిరిగి గాలిని లోకాలలో నింపి ప్రాణులను రక్షించాడు. అప్పుడు బ్రహ్మ దేవతలందరినీ పిలిచి ఆంజనేయునికి వరాలు ఇవ్వాల్సిందిగా కోరాడు. 


1) ఇంద్రుడు పద్మమాలికనిచ్చి తన వజ్రాయుధం వల్ల హనువు గాయపడ్డది కావున హనుమంతుడిగా తన పేరు స్థిరపడుతుందని, వజ్రాయుధం వల్ల కూడా అతనికి మరణం ఉండదని చెప్పాడు. 

2) సూర్యుడు తన తేజస్సులో నూరోవంతు భాగాన్ని ఇచ్చి సకల శాస్త్రాలూ నేర్పిస్తానన్నాడు. 

3) వరుణుడు నీటి వల్ల మరణం సంభవించదన్నాడు. 

4) యముడు తన కాలదండం ఇతనిని ఏమీ చేయదని, మృత్యువు ఉండదని వరం ఇచ్చాడు.

5) సూక్ష్మరూపం, ‌స్థూల రూపం ధరించే విధంగా కుబేరుడూ, ఈశానుడూ, విశ్వకర్మ కూడా వరాలిచ్చారు. 

7) వాయుదేవుడి వర ప్రభావంతో వాయు వేగంతో వెళ్లగల శక్తిసామర్థ్యాలు పొందాడు. 

8) బ్రహ్మ చిరాయువునిచ్చి బ్రహ్మాస్త్రం కూడా ఇతనిని కట్టిపడవేయలేదని మాటిచ్చాడు. శత్రువులకు భయాన్ని, మిత్రులకు సంతోషాన్ని ఇస్తాడని, కోరిన రూపం ధరించగలడని దీవించాడు. 

9) ఇవే కాకుండా ఈశ్వర తేజస్సుతో జన్మించిన కారణంగా ఈశ్వరానుగ్రహం కూడా లభించింది


అయితే ఈ శక్తులన్నింటిని ఎక్కడా, ఎప్పుడూ ప్రదర్శించే అవకాశం రాకపోవడానికి కారణాలు ఉన్నాయి. హనుమంతుడు మహా శక్తిమంతుడు బలశాలి. అయినా సహజ సిద్ధమైన వానర లక్షణాలవల్ల కొంటెపిల్లవాడుగా మారి అల్లరి చేసేవాడు. మునుల నార వస్త్రాలు చింపివేయడం, అగ్ని హోత్రాలు ఆర్పివేయడం లాంటివి చేస్తూ వారిని విసిగించేవాడు. అప్పుడు మునులు హనుమంతుని శక్తి అతనికి తెలియకుండా పోతుందని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే అతనికి తన శక్తి తెలిసివస్తుందని అంటారు. అందువల్ల అప్పటినుండి ఆగడాలు తగ్గి హనుమంతునికి చదువు ధ్యాస పట్టింది.


విద్యాభ్యాసం, వృత్తి నైపుణ్యం: 

హనుమంతుడు సూర్యునివద్ద విద్యాభ్యాసం చేశాడు. సూర్యుడు గగనతలంలో తిరుగుతూ ఉంటే ఆయన రథంతో పాటుగా తానూ ఎగురుతూ విద్య నేర్చుకొని హనుమంతుడు సకల విద్యలలోను, వ్యాకరణంలోను పండితుడయ్యాడు. నవ వ్యాకరణాలలోనూ మహాపండితుడని హనుమంతునికి పేరు. వివాహితులకు మాత్రమే అర్హత ఉన్న కొన్ని విద్యలు నేర్చుకోవడానికి అనుకూలంగా సూర్యుడు తన కూతురు సువర్చలను హనుమంతుడికిచ్చి వివాహం చేశాడనీ, ఐనా హనుమంతుని బ్రహ్మచర్య దీక్షకు భంగం వాటిల్లలేదనీ చెబుతారు.‌ గురుదక్షిణగా సూర్యుని కొడుకు సుగ్రీవునకు మంత్రిగా ఉండడానికి హనుమంతుడు అంగీకరించాడు. కిష్కింధలో ఉన్న వానర రాజ్యానికి వాలి రాజైన తరువాత సుగ్రీవునికి ఆంతరంగికుడుగా, మంత్రిగా ఆంజనేయుడు పనికి కుదిరాడు. వాలి సుగ్రీవుల వైరం మనకు తెలిసిందే. నిజానికి వాలి కంటే కూడా హనుమంతుడే బలవంతుడు. మునుల శాపంతో తన బలం గుర్తురానందువల్ల అతను సుగ్రీవునితో పాటు అడవులలోకి పారిపోవలసి వచ్చింది. ఆ తర్వాత రామలక్ష్మణులతో కలయిక జరగడం, వాలి సుగ్రీవుల యుద్ధానంతరం రాముడి చేతిలో వాలి హతం కావడం, సుగ్రీవుడి పట్టాభిషేకం వరుసగా జరిగిపోతాయి.


సీతాన్వేషణ: 

సీతాన్వేషణలో భాగంగా అంగదుడు సముద్రాన్ని దాటగలవారు మనలో ఎవరని తర్జనభర్జన పడుతుండగా జాంబవంతుడు మనలో ఈ సముద్రాన్ని దాటగల వీరుడు హనుమంతుడొకడే అని పలికి హనుమంతునితో "హనుమా! లే, నువ్వు అనన్య సామాన్యుదడివని గుర్తు చేస్తున్నాను. నీకంటే శక్తిమంతులు ఈ భూమండలం మీద లేరు. వెళ్ళి కార్యం సఫలం చేసుకొనిరా" అని అతని శక్తులను గుర్తు చేసాడు. హనుమంతుడికి తన శక్తులు గుర్తుకు రాగానే అర్ధరాత్రి వేళ ఒక్క సారి హఠాత్తుగా వెలిగిన సూర్యుడిలా ప్రకాశించి తోక విదిలించి లేచాడు. వానరులందరూ హనుమంతుడిని స్తుతిస్తుండగా భీకరాకారంతో మహేంద్ర పర్వతంపై కాలు మోపి ఒక్క ఎగురులో సముద్రం మీదుగా లంకకు దూసుకు పోయి అశోక వనంలో సీత జాడ కనిపెట్టడంతో విజయం సాధించాడు. 


హనుమంతుడి నుండి మనం నేర్చుకోగల జీవిత పాఠాలు: 

1) చాలా బలంగా మరియు శక్తివంతంగా ఉన్నప్పటికీ, హనుమంతుడు ఎల్లప్పుడూ వినయపూర్వకంగా, అణుకువతో ఉండేవాడు. అందరు పిల్లల వల్లే బాల్యంలో పిల్ల చేష్టలు చేసినా, పెరిగేకొద్ది పరిణితి చూపుతూ విద్యాబుద్దులు నేర్చుకొని కీర్తి ప్రతిష్టలు పెంపొందించుకున్నాడు. మనం కూడా బాల్యంలో ఎలా ఉన్నా ఒక దశ నుండి బాధ్యతాయుతంగా వ్యవహరిస్తూ, ధర్మబద్ధమైన జీవితంతో జన్మ సార్థకం చేసుకోవాలి. 

2) సమయస్ఫూర్తిగా వ్యవహరిస్తూ కార్యసాధకుడిగా ఎలా మారాలో హనుమంతుడు సముద్రాన్ని దాటే సమయంలో జరిగిన సంఘటన ద్వారా తెలుసుకోవచ్చు. నాగజాతి స్త్రీ అయిన సురస భయంకరమైన రాక్షసి రూపాన్ని ధరించి, హనుమంతుడికి తన నోటి ద్వారా వెళ్ళకుండా నన్ను దాటలేవు అని చెప్పింది. నువ్వు నా నోట్లోకి ప్రవేశించవలసిందే అని తన నోరుని పెద్దగా తెరిచింది. హనుమంతుడు ఆమె బలాన్ని గుర్తించి, తన శరీరాన్ని బాగా పెంచాడు. సురస కూడా తన నోటిని బాగా పెంచింది. అలా ఇద్దరు 100 యోజనములు పెరిగిపోయారు. అప్పుడు హనుమంతుడు ఉన్నట్టుండి బొటన వేలంత చిన్నవాడిగా అయిపోయి ఆ సురస నోట్లోకి ప్రవేశించి బయటకి వచ్చి "అమ్మా! నువ్వు చెప్పినట్టు నీ నోట్లోకి వెళ్ళి వచ్చేశాను. సరిపోయింది కదా, ఇక నేను బయలుదేరతాను" అన్నాడు. "ఎంత బుద్ధిబలంరా నీది, రాముడితో సీతమ్మని కలిపినవాడు హనుమ అన్న ప్రఖ్యాతిని నువ్వు పొందుతావు" అని సురస హనుమంతుడిని దీవించి పంపింది. ఆ విధంగా సందర్భానుసారంగా భుజబలంతో పాటు బుద్ధి బలాన్ని కూడా ఉపయోగించాలి. 

3) సంజీవిని కోసం పర్వతాన్నే పెకిలించి తెచ్చిన సందర్భం సంకల్ప బలంతో శారీరక బలాన్ని ఎలా జోడించాలో సూచిస్తుంది. సంజీవిని మూలికను గుర్తించలేక పోవడంతో సమయాన్ని వృధా చేయకుండా హిమాలయాల నుండి పర్వతం మొత్తాన్ని స్వయంగా ఎత్తి లంకకు తీసుకువచ్చాడు. 

4) యువతకు స్ఫూర్తి కలిగించే విధంగా హనుమంతుడు ఒక సందర్భంలో తనకు కలిగిన ఆత్మ దౌర్భాల్యాన్ని, విరక్తి భావాన్ని ఎలా జయించాడో గమనించవచ్చు. సీతాన్వేషణ ప్రక్రియలో అలసిపోయిన హనుమంతుడు ఒకానొక దశలో సీతను కనిపెట్టలేని తన జీవితం వృధా అని తలచి ఆత్మహత్యా ప్రయత్నం చేయాలనుకుంటాడు. కానీ ఆ వెంటనే గుండె దిటవు చేసుకుని తన దుర్బల మనస్తత్వానికి తానే చింతించి, రామకార్యాన్ని సాధించే సంకల్పాన్ని దృఢపరుచుకుంటాడు. ఆ సందర్భంగా తాను గుర్తుతెచ్చుకున్న అద్భుత సందేశం - "జీవనృద్రాణిపస్యతి" (బతికి ఉండినచో శుభములు పొందవచ్చు). ఆ విధంగా సీతమ్మ జాడ కనబడక చనిపోదామని అనుకున్న హనుమంతుడికి ఎదురుగా అశోకవనం కనపడింది,‌ అందులోనే సీతమ్మ జాడ తెలిసింది. 

5) ఎక్కడ తగ్గాలో ఎక్కడ ఎదిరించాలో తెలుసుకునే యుక్తాయుక్త విచక్షణ ప్రదర్శించిన హనుమ యువతకు మార్గదర్శకుడు అయినాడు. అశోక వనంలో హనుమంతుడికి ఇంద్రజిత్తుకి మధ్య జరిగిన యుద్ధంలో, ఇంద్రజిత్తు హనుమంతుడిని ఓడించడానికి బ్రహ్మాస్త్రం ఉపయోగించాడు. హనుమంతుడు తనకు ఉన్న వర ప్రభావంతో తన బలాన్ని ఉపయోగించి బ్రహ్మాస్త్రాన్ని ఛేదించగలడు కానీ బ్రహ్మ దేవుడు తయారు చేసిన ఆయుధం యొక్క ప్రాముఖ్యతను తగ్గించకూడదు అనుకోవడం వల్ల అలా చేయలేదు. బదులుగా, అతను దాని ముందు నమస్కరించాడు. 

6) దృఢ సంకల్పంతో కూడిన ప్రయత్నంతో విజయ సాధన సులభతరం అవుతుందని చేసి చూపించాడు. సవాళ్లను ఎదుర్కోవలసి వచ్చినప్పుడు, సంయమనంతో ఆచరణాత్మకంగా వ్యవహరించి కార్యసాధకుడు అయినాడు. కోతులకు తోకంటే మహా ఇష్టం తోకకు నిప్పు పెట్టండని రావణుడు ఆజ్ఞాపిస్తే నిప్పు అంటుకున్న ఆ తోకతోనే హనుమంతుడు లంకా దహనం చేయడం వల్ల చూసి రమ్మంటే కాల్చి రావడం అన్న నానుడి ప్రచారంలోకి వచ్చింది. 

7) సానుకూల దృక్పథం, సందర్భోచిత ప్రవర్తనతో తనదైన గౌరవాన్ని ఎలా కాపాడుకోవాలో రావణాసురుడి సభలో నిరూపించాడు హనుమంతుడు. దూతగా వచ్చిన హనుమంతుడు బందీగా పట్టుబడ్డప్పుడు రావణుడు తన ఆస్థానంలో ఆసనం ఇవ్వడానికి నిరాకరించాడు. అంతేకాకుండా అతని కోతి రూపాన్ని ఎగతాళి చేశాడు. హనుమంతుడు కోపం తెచ్చుకోకుండా లేదా అవమానించబడ్డానని భావించకుండా తన తోక పొడవును పెంచుతూ దానిని నేలపై చుట్ట చుట్టి గౌరవప్రదంగా తోక పైన కూర్చున్నాడు. రాముడి దూతగా శాంతి సందేశాన్ని రావణునికి తెలియజేశాడు. ఆ విధంగా మన గౌరవానికి భంగం కలగకుండా విధి నిర్వహణ చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉండాలి. 

8) హనుమంతుడు నుండి నేర్చుకోవాల్సిన మరొక పాఠం స్నేహానికి ఇచ్చే విలువ, సద్భావనతో కూడిన సేవ. రాముడికి సుగ్రీవునితో స్నేహం కలిపాడు. అదే విధంగా, శ్రీరాముడు, లక్ష్మణుడు మరియు సీతమ్మకు గొప్ప భక్తుడిగా సేవలందిస్తూ పవిత్ర జంటను తిరిగి కలపడానికి హనుమంతుడు తన శక్తి మేరకు చేయవలసింది అంతా చేశాడు. మనం కూడా హనుమంతునిలాగే స్నేహానికి విలువనివ్వాలి మరియు మనుషుల మధ్య సద్భావనను పెంపొందించాలి. 

9) గంజాయి వనంలో తులసి మొక్కలు ఉండవు అనే నగ్న సత్యాన్ని తెలుసుకుని క్లబ్బులు పబ్బుల వంటి అనైతిక వాతావరణానికి యువత దూరంగా ఉండవలసిన అవసరాన్ని తెలియజేశాడు. విలాస జీవితాలకు నెలవైన లంకా నగర వైభవాన్ని తిలకిస్తూ ఆశ్చర్యపోతూ రావణాసురుడి అంతఃపురంలో సౌందర్యవంతమైన స్త్రీలను రాక్షసులను చూసాడు హనుమంతుడు. మద్యం మత్తులో వారి నృత్య విన్యాసాలు తనకు చికాకు కలిగించాయి. అక్కడ ఎంత వెతికినా అతనికి సీత ఎక్కడా కనపడలేదు. ఒక సందర్భంలో అంతఃపురంలోని మండోదరిని చూసి సీతగా భ్రమించాడు. కానీ పరమ పావని సీతామాత దుష్టుడైన రావణుడి మందిరంలో ఉండజాలదన్న నిజాన్ని గ్రహించి చివరకు అశోక వనంలో సీత జాడ కనిపెట్టడంతో విజయం సాధిస్తాడు. 


ఓం హనుమంతే నమః 

ధన్యవాదాలు 


ఆర్ సి కుమార్


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comentarios


bottom of page