పొడుపుకథ పొదిగిన కథ
- Karlapalem Hanumantha Rao
- Apr 26
- 4 min read
#పొడుపుకథలోదాగినకథ, #PodupukathaloDaginaKatha, #KarlapalemHanumantha Rao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #నైతికకథలు

Podupukatha Podigina Katha - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao
Published In manatelugukathalu.com On 26/04/2025
పొడుపుకథ పొదిగిన కథ - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
"భోజనం బలి భుక్తంచ
శయనే హస్త మార్జనం
పరదేశేచ జాగారం
ప్రథమ కోప నివారణం"
ఆదో పట్టణం; ఆ పట్టణంలో ఓ విద్వాంసుడు; అతనికిద్దరు కొడుకులు. ఆ విద్వాంసునికి తన బతుకు పొద్దు కుంకుతున్నదని అనుమానం వచ్చింది. ఇద్దరు కొడుకులను దగ్గరకు పిలిచాడు. తన ఆస్తిని, తన విద్యల్ని చూపించి ఎవరికేం కావాలో తీసుకోండన్నాడు. పెద్ద కొడుకు ఆస్తి, చిన్న కొడుకు శాస్త్రాల్ని తీసుకొన్నారు. పెద్దవాడు ధన ధాన్యాలతో భోగ భాగ్యాలతో ఆనందంగా ఉన్నాడు.
చిన్న వాడు పల్లెలూ-పట్టణాలూ తిరుగుతూ తాను నేర్చిన చదువులతో - శాస్త్రాలతో ప్రజల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దుతున్నాడు. ప్రజలందరు అతణ్ని ఆదరిస్తున్నారు; గొప్ప పండితుడని ప్రశంసిస్తున్నారు. వేళకెవరో ఇంత అన్నం పెడుతున్నారుగాని చిరకాలం సుఖంగా ఉండే వసతులెవరూ సమకూర్చడం లేదు. ఆతనిది కావాలని అనుకోలేదు కాబట్టి విచారం లేకుండా విద్యాదానం చేస్తూ దేశ దేశాలు తిరుగు తున్నాడు.
ఓనాడు ఆదేశం ముఖ్యపట్టణంలోని ధర్మసత్రంలో ఈ విద్వాంసుడు ధర్మబోధచేస్తున్నాడు. ఆక్కడికి మారువేషంలో వచ్చిన రాకుమారుడు అతని మాటలు విన్నాడు. అందరు వెళ్లిపోయాక తన దగ్గర ఉన్న ధనమంతా ఇచ్చి ఈ పైశ్లోకం ఉన్న తాళపత్రం తీసుకొన్నాడు. గుర్తుంచుకోవచ్చు గదా! తాళపత్రం కొనడం ఎందుకు ? సలహా ఇవ్వబోయాడు విద్వాంసుడు. విద్యాంసుడి మాట వినకుండా రాజకుమారుడు శ్లోకమున్న తాళపత్రంతీసుకొని వెళ్లి పోయాడు.
తండ్రి దగ్గరకు వెళ్లి తాను చేసిన పని చెప్పి శ్లోకం చూపించాడు. డబ్బు దండగ చేసి శాస్త్రం కొన్నావా అని తండ్రి దూషించాడు; శ్లోకం ఉన్న పత్రాన్ని ముఖాన కొట్టాడు; కొడుకును రాజభవనం నుంచి గెంటించాడు.
ఇల్లూ పొల్లూ వదలి పెట్టిన కొడుకు దుస్థితి తల్లి గమనించింది. భర్త చాటుగా కొంత ధనం తీసి కొడుకుకు పంపించింది. ఆ ధనం సంచితో అతడో నగరం నడివీధి గుండా పోతున్నాడు.
ఆ వీధిలో ఓవేశ్య ఉంది. వీధిలో పోతున్న అతని ముఖలక్షణాల్ని పరిశీలించి, ధనవంతుడు అని నిశ్చయించుకుంది. తన మేడకు పిలిపించుకొంది. ఒయ్యారాలు ఒలకబోసింది. అందచందాలు ప్రదర్శించింది. అతిథి మర్యాదలేవేవో చేసింది.
రాకుమారుడు తప్పుకున్నాడు; నీతులు చెప్పాడు; బతుకుబాటలోని పరమార్థాల ముళ్లు విప్పిచెప్పాడు. అర్ధం కన్నా పరమార్థం మిన్న అన్నాడు.
అతను తన వలలో చిక్కడని ఆ వేశ్య ఆనుకున్నది. తన ఆతిథ్యాన్ని స్వీకరించి వెళ్లాల్సిందిగా ప్రాధేయపడింది. రాజకుమారుడు 'సరే' అన్నాడు. ఆ వేశ్య అన్నంలో విషం కలిపి పెట్టింది.
అన్నం తినడానికి ముందు అతనికి ఆ శ్లోకం గుర్తుకు వచ్చింది. ప్రథమ పాదం అర్థం మననం చేసుకొన్నాడు. భోజనానికి పూర్వం భూత తృప్తి చేయాలని ఆ పాదం నిర్దేశిస్తోంది.
అది శాస్త్రార్ధంగా అతని మనసులో నాటుకొంది. అందుకే అతను మొదట పిల్లికి అన్నం వేశాడు. ఆ పిల్లి అక్కడికక్కడే చనిపోయింది. రాకుమారుడా వేశ్యవై పు కోపంతో చూచి వెళ్లిపోయాడు.
ఆ తర్వాత రాజపుత్రు ఆ నగరంలోని మరొక వీధికి వెళ్లాడు. ఆ వీధిలో ఉన్న వేశ్యకూడా ఇతణ్ని చూసింది. ఇంటికి పిలుపించుకొంది. మాటా ముచ్చటా జరిగాక అతడు తనకు వశం కాడని నిశ్చయించుకొంది. తన ఇంట భోజనం చేయమంది. తాను అప్పటికే అన్నంతిన్నా నన్నాడతను. పరదేశీవి కాబట్టి ఈరోజు రాత్రికి తన ఇంటనే ఉండవల్సిందని ఆమె అభ్యర్థించింది. రాజపుత్రుడు 'సరే' అన్నాడు.
ఆమె తన ఇంట పడగ్గదిలో ఓ గుంత (గొయ్యి) తవ్వించింది. దానిపై శయ్య ఏర్పాటు చేసింది. రాజపుత్రుణ్ని ఆ శయ్యపై పడుకోమంది. అప్పుడతనికి ఆశ్లోకంలోని రెండో పాదం గుర్తుకు వచ్చింది. దాని ప్రకారం పడుకొనేముందు శయ్యను చేతితో తడిమి చూడాలి.
అతనట్లే చేశాడు. రహస్యం బట్టబయలైంది. రాజపుత్రుడు తనను రక్షించిన ఆ శాస్త్రశ్లోక పత్రాన్ని కళ్ల కద్దుకొన్నాడు. అర్థం కొరకు ప్రాణాలు తీయడానికైనా వెనుకాడని ఆ వేశ్యకాంతను దూషించి, పరదేశానికి పయన మయ్యాడు.
ఆ దేశంలో అడుగు పెట్టిన వెంటనే ఓ విచిత్ర సమాచారం; ఆ దేశం రాజపుత్రిని ఎవరు పెళ్లి చేసుకొంటే వారు, పెళ్లినాటి రాత్రే మరణిస్తున్నారని తెలుస్తుంది. అప్పటికి ఎందరో చనిపోయారని వర్తమానం అందింది. ఆ రహస్య మేదో భేదించాలనుకున్నాడు రాజపుత్రుడు.
శాస్త్రం లోకానుభవం రాజపుత్రునికి కొండంత అండగా ఉన్నాయి; సాహసించాడు; ఆ పట్టణ రాచపట్టిని పరిణయ మాడాడు.
ఆ రోజు పడగ్గదిలో అతను అడుగు పెట్టక పూర్వమే రాజపుత్రి నిదుర పోయింది. గదిలో సహధర్మ చారిణి; ఉలుకూ పలుకూ లేక పడి ఉంది. అది గాఢ నిద్రేనా! ఆది దంపతుల గదేనా! ఆలా అనిపించ లేదతనికి. ఆ ప్రదేశం పరదేశంగానే కనిపించింది. వెంటనే శాస్త్రంలోని మూడవపాదం గుర్తుకు వచ్చింది. దాని ప్రకారం పరదేశంలో నిదుర పోరాదు; జాగరణ చేయాలి. అతను శాస్త్రకారుణ్ని మెచ్చుకున్నాడు.
కంటి మీదికి కునుకు రాకుండా కాచుకొని కూచున్నాడు. ఊరికనే కాదు. ఖడ్గధారియై ఉన్నాడు. రాజపుత్రినీ పరిసరాల్నే పరిశీలిస్తూ అతిజాగ్రత్త గా ఉన్నాడు.
సరిగా ఆర్ధరాత్రివేళ రాజపుత్రి నాసిక నుండి రెండు పాములు బుసలు కొడుతూ వచ్చాయి. ప్రమాదాన్ని పసిగట్టిన రాజకుమారుడు వెంటనే వాటిని ముక్కలు ముక్కలుగా ఖండించాడు.
అప్పుడే మేడమీది (ఉపరిగవాక్షం) నుండి ఓ రాక్షసుడు గదిలోకి దిగాడు. రాజపుత్రుణ్ని పట్టుకోడానికి చేతులు చాచాడు. వెంటనే అతని రెండు చేతుల్ని రాజకుమారుడు ఖండిచాడు. మొండి చేతులతో రాక్షసుడు మొండిగా పారిపోయాడు.
అప్పుడే రాజపుత్రి కళ్లు విప్పింది. చచ్చిన పాముల్ని, ఖండిత హస్తాల్ని చూసి భయభ్రాంత అయ్యింది, రాజకుమారుడామెకు జరిగినదంతా వివరించి చెప్పాడు. ఆమె తనకు పట్టిన రాక్షస గ్రహపీడ విరగడైనందుకు సంతోషించింది. పట్టలేనంత ఆనందంతో అతని పాదాలపై వాలిపోయింది. రాజకుమారుడామెను కౌగిలించు కొన్నాడు.
ఆ తర్వాత మామగారి రాజ్యమంతా అతనికే దక్కింది. తనకు లభించిన రాజ్యగౌరవ విశేషాల్ని వివరిస్తూ తండ్రి దగ్గరికి దూతను పంపించాడు. తాను తండ్రిని చూడ్డానికి వస్తున్నట్లు తెలియ జేశాడు. తన కొడుకు ఎంత వాడయ్యాడని ఆ తండ్రి ఎదురు చూస్తుండగ వెళ్లాడు.
తండ్రిగారానాడు విసరి కొట్టిన శాస్త్రం సాధించిన పరమార్థాన్ని విశదీకరించాడు. అంతే గాక ఆ శాస్త్రంలోని చివరి పాదం ఏం బోధిస్తుందో తెలిపాడు. క్రోధాన్ని ప్రప్రథమంగానే నివారించాలన్నాడు. తండ్రి ఆనాడు ఆవేశంగా వ్యవహరించిన తీరునుదాహరించాడు. ఆతండ్రి తనకు జ్ఞానోదయమైందని కొడుకును కౌగిలించుకొన్నాడు.
కథాత్మకాలైన పొడుపు కధల చాయలున్న ఇలాంటి శ్లోకాలు మన సాంప్రదాయక విజ్ఞాన కోశాలు. జానపదుల హృదయమర్మా లెరిగిన కవి పండితులే వీటికి కర్తలు. కర్ణావివరణాని సపయుక్తాలైన ఇలాంటి శ్లోకాలన్నీ కేంద్రిత కాంతి బిందువులు. కథా వివరణకు ఉపయుక్తమైన ఇలాంటి పొడుపుకథలు ఆ బిందువు ననుసంధించు కొని పరిభ్రమించే కాంతిపుంజం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోదీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.
Comments