top of page

ప్రమోషన్

#PandrankiSubramani, #పాండ్రంకిసుబ్రమణి, #ప్రమోషన్, #Promotion, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

ree

Promotion - New Telugu Story Written By Pandranki Subramani

Published In manatelugukathalu.com On 13/07/2025

ప్రమోషన్ - తెలుగు కథ

రచన: పాండ్రంకి సుబ్రమణి

ఉత్తమ రచయిత బిరుదు గ్రహీత

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్

మళ్ళీ అదే సమస్య. ఆనాడు యెదురైన అదే ఇరకాటపు ఇరుసులో పడవేసిన సందిగ్ధావస్థ. నుదుటిపైన చేతినుంచుకుని ఆలోచనలో పడ్డాడు సంక్షేమ సంస్థ ఉపకార్యాలయ అకౌంట్స్ క్లర్కు సిధ్ధరామయ్య. 


రెండేళ్ళ క్రితమేమో, యు. డి. సి. డిపార్టు మెంటల్ పరీక్షలకు పోటీ పడి హోరాహోరీగా చదువు తున్నప్పుడు తన తల్లి సౌభాగ్యమ్మ మంచాన పడింది. రోగాలూ తుఫాను గాలులూ ముందస్తు కబురిచ్చి రావుగా? వాటిష్ట ప్రకారం అవి వస్తాయి. వాటిష్ట ప్రకాకరం అవి పనిముగించుకుని పోతాయి. ; విధ్వంస రచన పూర్తి చేసి..


ఐతే..కొన్ని రోగాలు తుఫాను గాలుల్లా కాకుండా పిలవని పేరంట్రాళ్ళలా దూసుకు వచ్చినట్టు తిష్ట వేసుక్కూర్చుండి పోతాయి. అడుగంటి వరకూ అంతు చూడకుండా విడిచి పెట్టవు. తన తల్లి విషయంలో ఆనాడు అలాగే జరిగింది. ఎన్ని ఆస్పత్రులు తిరిగినా ఎందరు వైద్యులచుట్టూ ప్రదక్షిణలు చేసినా తగ్గని ఖళ్ళ దగ్గులా రోగం నయంకా లేదు. అటువంటప్పుడు ఒక్కగా నొక్క కొడుకు సిధ్ధరామయ్య ఎలా ఏకాగ్రతతో శాఖాపరమైన పోటీ పరీక్షలకు సిధ్ధమవగలడు? స్థిర చిత్తుడై చదివగలడు? పూనకం వంటి పట్టుదలతో చదివినా ఎలా కుదురుగా పరీక్షా హాలులో కూర్చుని వ్రాయగలడు? 


అవేమిటి, పాఠ్య పుస్తకాలలోని వరసకట్టిన అంశంలా క్రిందా మీదా పడి గైడ్స్ ద్వారా కంఠతా పట్టి అప్పచెప్పడానికి? అవన్నీ శాసన బధ్దమైన పరిపాలనా వ్యవస్థకు సంబంధించిన విధి విధానాలు కదూ! కచ్చితంగా నియమ నిబంధనల రిఫరెన్సు గుర్తింపులను ప్రస్తావించే తీరాలికదూ! గోరు ముద్దలుపెట్టి పెంచి పెద్దచేసిన అమ్మ మంచాన పడి విపరీతంగా యెగశ్వాసగా దిగశ్వాసగా అవస్థ పడుతున్నప్పడు తనెలా యెగ్జామ్ హాలులో కుదురుగా కూర్చుని పరీక్ష వ్రాయగలడు?


ఇక ఆలోచించలేక తీవ్ర అసహనానికి లోనయాడు సిధ్ధరామయ్య. అంతేకాక-పైకి కనిపించని కౌకు దెబ్బలా సిధ్ధరామయ్య మరొక పెను నష్టానికి లోనయాడు. అదేమంటే-తన వెనుక జూనియర్ క్లర్కుల్లా కార్యాలయంలో చేరి తన వద్ద పని నేర్చుకున్న కొందరు జూనియర్ స్టాఫ్ డిపార్టు మెంటల్ పరీక్షల్లో ఉత్తీర్ణులై పైకి యేగబ్రాకి తనను క్రిందకు తోసి యుడిసీలుగా ఎదిగిపో యారు. మరైతే తన వంటి నష్ట జాతకులకు ఇలా జరగడం లోకరీతేగా! తను కూడా పరీక్ష వ్రాసుండి మెరిట్ కేటాయింపు ఆధారంగా ప్రమోషన్ పొంది ఉంటే తనుకూడా చాలామందినే దాటుకుంటూ ఎదుగుదలనే నిచ్చెనెక్కి వెళ్లిపోయుండే వాడే.. జీవితమంటే బ్రతుకు మైదానంలో ఆటలో అరటి పండేనేమో! 


చిట్ట చివరకు అతడికి సీనియారిటీ వరస క్రమంలోనే యుడిసీ పదోన్నతి వచ్చింది. అదీను యెప్పుడని -చాలా మందికి ర్యాంకులోనూ సీనియారిటిలోనూ జూనియర్ గా మారిన తరవాతనే! ఏది ఏమైతేనేమి-అతడికిక మిగిలిందేముంది-ఏమీ లేదు. తన తల్లి సౌభాగ్యమ్మ అదే సంవత్సరం అందరినీ దు:ఖ సముద్రంలో ముంచి పరలోక ప్రాప్తి చెందింది. తన అనారోగ్య కారణంగానే కొడుకు శాఖాపరమైన పరీక్షలు వ్రాయలేక పోయాడని తెలిసుంటే యెంత బాధపడేదో! అంతా ఒక విధంగా మంచికే జరిగిందేమో! అమ్మ ప్రశాంతంగా కళ్ళు మూసింది అతను ప్రక్కనుండగానే చేతిలో చేతినుంచి. 


ఇదిగో.. ఇప్పుడు మళ్ళీ అదే గడ్డు పరిస్తితి! నిజానికి అంతకంటే దారుణమైన పరిస్థితి. వయసు మళ్ళి వర్క్ షాపుకి వెళ్ళడం మానుకున్న బాబు అనారోగ్యానికి లోనయాడు. స్వతహాగా తండ్రిది దృఢ శరీరం. రోగం రొష్టులను ఆమడ దూరాన ఉంచగల శ్రమైక శారీరం. మరెందకలా నీరసించి నిస్సహాయుడై ఇంటిపట్టున ఉండిపాయాడో సిధ్ధరామయ్యకు అంతు పట్టడం లేదు. అంతే కాదు-వర్క్ షాపులో పని చేస్తున్నప్పుడే ఆయన రెండు మూడు సార్లు పడిసెం పట్టి ఖళ్ళెతో బాధ పడ్డాడు. జాగ్రత్త తీసుకోవడం మరిచాడు. 


అప్పటికి తల్లి ఆశీర్వాదం వలన- దేవుడి దయ వలన కాలం కలిసొచ్చి తను సీనియారిటీ ప్రకారం కుంటుతూ సానుకూల సి ఆర్ రిపోర్టుల ఆసరాతో యుడిసి పోస్టు పదోన్నతితో గట్టెక్కాడు. జేబులు కాసుల గలగల చప్పుడుతో నిండి ఉన్నాయి. కావున దేనికీ వెనుకాడకుండా వైద్యుడు వ్రాసిచ్చిన మందులూ టానిక్కులూ పకడ్బందీగా కొనిచ్చాడు. మరెందుకో మరి, బాబు మందులు తీసుకోవడం తరచుగా మరచిపోతూనే ఉన్నాడు. 

మందులెందుకు వేసుకోలేదని అడగడానికి వెళితో బాబు దేనినో ఎవరినో దీర్ఘంగా వెతుకుతున్నట్టు శూన్యంలోకి తేరి చూస్తూ కనిపించేవాడు. తనకు నిజంగానే చిరాకు వచ్చేది. ఆ అసహనాన్ని తండ్రిపై న చూపించలేక భార్య ప్రేమవతి పైన చూపించేవాడు కూకలు వేస్తూ- “ఇవన్నీ నువ్వు చూడవద్దా! నీ పనులు నువ్వు చూసుకోవడమేనా? అసలు మాఁవగారికి అనారోగ్యంగా ఉందన్నదైనా గుర్తుందా లేదా? ”


ఈ మాట తను కావాలనే కస్సుమన్న గొంతుతో అనేవాడు; తండ్రి చెవిలో పడేటట్టు, కాని తను ఎన్నాళ్ళని ఇటువంటి నాటకం చూపిస్తూ ఉండగలడు? ఎన్నిసార్లు నెపం పెట్టి తండ్రి చేత ముందులు తినిపిస్తూ ఉండగలడు? ప్రేమవతి తిరుపతయ్యకు కోడలు కావచ్చు- తనకు భార్య కావచ్చు- కాని ఆమె కూడా మనిషేగా.. ఆమెకు కూడా గాయపడే మనసుంటుంది కదా! అంచేత తను సాధ్యమై నంత మేర తండ్రి మందులు తీసుకునే సమాయనికి స్వయంగా దగ్గరుండి సపర్యలు చేయిడానికి ప్రయత్నంచేవాడు. 


మరి దానికి కూడా ఒక హద్దుంటుంది. ఆయనగారినే అహర్నిశలూ అంటి పెట్టుకుని ఉండటానికి ఉద్యోగస్థుడైన తనకు ఎంత వరకు సాధ్యపడుతుందని? అందరిలాగే తనకూ అర్జంటు కార్యాలయ పనులు తగుల్తుంటాయి. తను కూడా నెలజీతం పైన ఆధారపడి జీవించే సగటు మనిషేగా! 


మరైతే తండ్రి అలా రాను రాను నీరసించిపోవడానికి— నిర్జీవితకు లోనుకావడానికి మరొక కారణం ఉండవచ్చున్నది అతడు తరవాత ఊహించుకోగలిగాడు. అదెలా తెలుసుకోగలిగాడంటే— మాఁవగారికి వంజిరం చేప అంటే ఇష్టమని ప్రేమవతి ఆది వారం పూట వంజిరం చేపల పులుసు చేసింది. 


ఏమైందో మరి- మంచం పైన తింటున్నవాడల్లా చప్పున ఆగిపోయి కొడుకుని దగ్గ రకు రమ్మనమని పిలిచాడు తిరుపతయ్య. అదేదో అర్జంటు మేటర్ గురించి పిలిచాడనుకుని తింటూన్న గిన్నెను ప్రక్కకు తోసి చప్పున లేచి వెళ్ళాడు సిధ్దరామయ్య- “చెప్పు బాబూ! ” అంటూ—


తిరుపతయ్య వెంటనే బదులివ్వలేదు. అన్నం ముద్దను కొడుకు నోటికి అందిస్తూ అన్నాడు- “నిన్నెప్పుడూ ఇలాగే దగ్గర్నించి చూస్తూ ఉండాలనుందిరా కొడకా! ”

ఆ మాట విని అతడికి దిగ్గుమని పించింది. ఎందుకంటే ఆ మాట అతడి చెవికి వింతగా తోచింది, దిగులు నిచ్చింది. మాటా పలుకూ లేకుండా గుడ్లప్ప గించి చూడసాగాడు. ఎందుకని అడగాలనిపించలేదు. 


“మీ అమ్మను చూస్తున్నట్లే ఉందిరా!’


ఆమాటతో అతడికి దు:ఖపు తెర గొంతు వరకూ తన్నుకు వచ్చింది. తనను తను అదుపు చేసుకుంటూ వెళ్లి గిన్నెముందు కూర్చున్నాడు. కెలుకుతూ కూర్చున్నాడే గాని ముద్ద మింగుడు పడలేదు. ఇన్నాళ్ళూ ఇంటి దూలంలా నిల్చుని కుటుంబాన్ని ఆదుకున్న చెట్టంత మనిషి భార్య పోయిన జ్ఞాపకం తెచ్చుకుని ఎంతగా నీరసించి పోతున్నాడు! బ్రతికుండడం యేమిటి- లేకుండా పోవడమేమిటి- భార్యా భర్తల మధ్య ఉన్న అనుబంధం అటువంటిది మరి.. కనిపించీ కనిపించని విధంగా తనువెళ్లా పెనవేసుకున్న మానవాత్మల్లా— గత స్మృతుల పవ్వళింపులా..


మగటిమితో తను ఆపుకున్నాడు దు:ఖం. కాని ప్రేమవతి ఆపుకోలేక పోయింది. కన్నీరు కార్చేసింది. చేపల పులుసుతో అన్నం జుర్రుకుతింటూన్న కొడుకూ కూతూరూ తల్లిని బిత్తరపోయి చూడసాగారు. ఆ చిరు వయసులో హృదయ మనోరాగ వలయాల గురించి వాళ్ళకేం తెలుసు! ఇకపోతే- డిపార్టుమెంటల్ పరీక్షలు సాధారణంగా ఎక్కువ భాగం దైనందిన కార్యాలయ కార్య కలాపాలపైనే ఆధారపడి ఉంటాయి. ఇంకా చెప్పాలంటే- సగ భాగం అధికార పూర్వక వర్క్ మ్యాన్యువల్ పైన ఆధారపడి ఉంటే మిగతావి సగం.. దైనందిన ఆచరణీయ పధ్ధతులపైన ఆధారపడి ఉంటాయి. 


ఈ కారణం చేత కష్టపడి పని చేసే శ్రమజీవి కావటాన సిధ్ధరామయ్యకు పనితనపు పధ్థతులపైన మంచి పట్టు ఉంది. ఈ తరహా ఉద్యోగులు శాఖా సంబంధిత పోటీ పరీక్షల్లో త్వరగా తేరుకోగలరు. పదోన్నతి నిచ్చెనను అవలీలగా అందుకోగలరు. కావున— చాలామంది ఆఫీసు సిబ్బంది పరీక్షలకు అనుగుణమైన పని పధ్ధతుల గురించి లోతుగా తెలుసుకోవడానికి సిధ్ధరామయ్య ఇంటికి రాసాగారు. 


వాళ్ళందరూ భర్తకు ఇరుగు పొరుగున అదే ఆఫీసులో పని చేసేవారు కాబట్టి విసుగుదలకు చోటివ్పకుండా అల్పాహారాలు టీలు కాఫీలు అందిస్తుండే ది ప్రేమవతి. ఆ రీతిన సూపర్ వైజర్ పోస్టుల పోటీ పరీక్షలు రంయ్ మని దగ్గరకు వచ్చేసాయి.


ప్రయత్నాలు ముమ్మరమయా యి. అందుకోబోయేది అందని మ్రాని పండులా ఊరించే హెడ్డు గుమాస్తా పోస్టు కదూ! కలసి రావాలే గాని- -పోస్టుగాని అందుకో గలిగితే ఎంతోమందికి పైగా వెళ్ళి, ఇంకెంతో మందికి సీనియర్ కూడా కావచ్చు. 


డైరక్ట్ మెరిట్ కోటా ప్రమోషన్ కి ఉన్న మహత్యం అటువంటిది మరి. ఆపైన తదుపరి ప్రమోషన్ లు మోచేతి నుండి తాగే నీళ్ల ప్రాయమే; వద్దంటే పెళ్ళన్నట్టు.. ఆ కోవన మూడు నెళ్ళ ముందే ఇచ్చిన ధరఖాస్తు ప్రకారం అందరికీ ఎగ్జామ్ సెంటర్లు కేటాయించినట్టే సిద్ధరామయ్యకు వనస్థలి పురం కేటాయించారు. ఓపెన్ పోటీ పరీక్షలు కావు కాబట్టి, వ్రాసేవారందరూ ఒకే కార్యాలయానికి చెందిన డిపార్టుమెంటు సిబ్బందే కాబట్టి, అందరూ అలా ఆఫీసు చేరుకుని అక్కణ్ణించి అలానే వాళ్ళ వాళ్ళకు కేటాయించిన పరీక్ష కేంద్రాలకు వెళ్ళవచ్చు. పిమ్మట తిన్నగా కార్యాలయం వేపు రాకుండానే ఇండ్లకు చేరుకోవచ్చు. అంటే పరీక్ష కేంద్రనుండి మళ్ళీ ఆఫీసుకి వెళ్ళనవసరం లేదన్నమాట. 

***

ఆరోజు రాత్రి భోజనాలయిన తరవాత సిధ్ధరామయ్య అలా ఆరుబయట చిన్నపాటి నడక సాగించి వచ్చిన తరవాత తిరుపతయ్య అతణ్ణి పిలిచాడు. పిలిచి అడిగాడు- “మీ ఆఫీసు పరీక్షలు ఎలా వ్రాసావురా కొడకా!”


“బాగానే వ్రాసాను బాబూ! అందరూ కష్టంగా ఉందన్నారు గాని నాకు మాత్రం అలా అనిపించలేదు. పెట్టిన పేనా దించకుండా దంచేసాననుకో! ఆ మాటకు వస్తే నాకిదంతా నీళ్ళ ప్రాయం బాబూ!”


తిరుపతయ్య ఏమీ మాట్లాడకుండా కొడుకు కళ్ళలోకి నిదానంగా చూస్తూ ఉండిపోయాడు. 

“అదేంవిటి బాబూ అలా తేరి చూస్తున్నావు! నేను బాగా వ్రాసానంటే నమ్మకం కుదరడం లేదా? ” 


ఆమాట విని తిరుపతయ్య నీరసంగా నవ్వి కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుని అన్నాడు- “నాకు తెలుసురా నువ్వు రాత్రంతా కళ్లు తుడుచుంటూ నిద్రపోకుండా అవస్థ పడుతున్నప్పుడే అనుకున్నాను నువ్వు పరీక్షకు వెళ్ళవని..” 


తెల్లబోయి చూసాడు సిధ్ధరామయ్య. “మీకెవరో తప్పుడు సమాచారం ఇచ్చినట్టున్నారు బాబూ! నేనెందుకు పరీక్ష వ్రాయకుండా ఉంటాను? చూస్తూ చూస్తూ హెడ్ క్లర్కు పోస్టుని ఎవడైనా చేతులార వదులుకుంటాడా బాబూ! ” 


తిరుపతయ్య తల అడ్డంగా ఆడించాడు తను నమ్మలేనట్టు. “నా వద్ద దాగుడు మూతలు ఆడకురా కొడకా! అన్నీ తెలుసుకునే నిన్ను అడుగుతున్నానురా కొడకా! హెడ్డు పోస్టు పెద్ద పోస్టట కదా— అదిచ్చిన వెంటనే ఉన్నచోట ఉండనివ్వకుండా మరొక జిల్లాకో లేదా మరొక మండలానికో ట్రాన్సుఫర్ చేస్తారటగా! నాకు దూరం కాకుండా ఉండటానికేగా నువ్వు ప్రమోషన్ పరీక్షలు వ్రాయకుండా ఉండిపోయావు? రేపో మాపో రాలిపోయే పండును కాబోతూన్న నాకోసం నీకు నీవు అన్యాయం చేసుకుని పెళ్ళాం పాపలకు అన్యాయం చేసుకుని పరీక్షలు మానుకుంటావా!” 


ఆ మాటతో సిధ్ధరామయ్య మనసుని అదుపు చేసుకోలేక పోయాడు. భళ్ళున ఏడ్చేసాడు. ఏడుస్తూనే ఆగి ఆగి బదులిచ్చాడు—


“బాబూ! నాకు నువ్వు వేరు అమ్మవేరు కాదు. నాకిప్పుడు నువ్వే బాబువి నువ్వే అమ్మవి. నేను గాని ప్రమోషన్ కోసం ఆశపడి నిన్ను ఈ పరిస్థితిలో విడిచి దూరంగా వెళ్ళిపోతే అమ్మ ఆత్మ నన్నెప్పటికీ క్షమించదు. అమ్మేకాదు, రేపు నా ఆత్మసాక్షే నన్ను క్షమించక పోవచ్చుబాబూ! ”


తిరుపతయ్యి ఇక మాట్లాడలేదు. కొడుకుని గుండెలపైకి తీసుకున్నాడు. అతడికి తెలియకుండానే కన్నీరు కారుతూంది. ఇటు వంటి కొడుకుని ఇచ్చినందుకు తన దివంగత భార్య సౌభాగ్యమ్మకు చేతులు ఎత్తి నమస్కరించాలని పించింది. నిజానికి తనిప్పుడు సిధ్ధరామయ్యకు తండ్రికాడు. సిధ్ధరామయ్యే తనకు తండ్రి! శ్రవణుడిలా తన సంరక్షకుడు..

 

శుభం

  

పాండ్రంకి సుబ్రమణి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు


యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ పాండ్రంకి సుబ్రమణి గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.

గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


ree

1) పేరు-పాండ్రంకి సుబ్రమణి

2)తండ్రి పేరు-పాండ్రంకి నరసియ్య

3) తల్లిపేరు-పాండ్రంకి పైడమ్మ

4)స్వస్థలం-విజయనగరం

5)ఉద్యోగ విరమణచేసి స్థిరపడినది-హైద్రాబాదు

6)సాహితీ నేపథ్యం-కథలు వివిధ పత్రికల్లో ప్రచురితమైనవి.ఒక నవల సాహితీ కిరణం మాసపత్రికలో మరొక నవల- ఆంధ్రభూమి మాసపత్రికలో ప్రచురించబడ్డాయి.


30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ఉత్తమ రచయిత బిరుదు పొందారు.

ree





2 Comments


@vemparaladurgaprasad9696

•2 days ago

సహజంగా ఉంది❤

Like

కథ హృదయాన్ని కదిలించింది. బాధ్యతల బరువు, దార్మిక చింతన, ప్రతిఫలించిన తీరు బాగుంది

Like
bottom of page