భార్య వంటే రుచి
- Addanki Lakshmi

- Apr 6
- 4 min read

రోజువారీ జీవితంలో చిన్న విషయాల్లోనే పెద్ద పాఠాలు దాగి ఉంటాయి. అలాంటి హాస్యంతో కూడిన ఒక చక్కని కుటుంబ కథే “భార్య వంటే రుచి”.
Bharya Vante Ruchi - Telugu Family Story | Addanki Lakshmi
భార్య వంటే రుచి - తెలుగు కుటుంబ కథ | అద్దంకి లక్ష్మి
Published In manatelugukathalu.com On 06/04/2026
"కాంతం! ఈ పనసపొట్టు కూర చాలా బాగుంది, ఆవ పెట్టి చేశావు"
"ఓ! బాగుందా? ఇది నేను చేసింది కాదండి, ఈమధ్య మన క్రింద ఫస్ట్ ఫ్లోర్ లోకి వచ్చారు - ఆవిడ పంపించారు"
"అదే అనుకున్నాలే, నీవెప్పుడూ ఇంత రుచిగా చేయలేదు గా"
"అవును. నాకు వంటలేం వచ్చు, మీ టేస్ట్ కి తగ్గట్టుగా? పెళ్లి అయ్యి పదేళ్లయినా మీ టేస్ట్ కి తగ్గట్టు వంట చేయలేకపోతున్నాను, ఏమైనా - పొరుగింటి పుల్లకూర రుచి అంటారు కదా"
"ఇదిగో ఈ సాంబారు తినండి, ఇంకా ఎంత బాగా చేసిందో ఆవిడ" అంటూ సాంబారు కూడా వేసింది కాంతం.
వెంకట్రావు - "అవును ఎంత రుచిగా ఉందో అచ్చు అరవ వాళ్ళు చేసినట్టుగా ఉంది" అంటూ ఆనందంగా తింటున్నాడు
భార్యాభర్త లిద్దరూ రాత్రి 7:00కి భోజనం చేస్తున్నారు.
వెంకట్రావు "అవును ఆవిడ మనకెందుకు ఇచ్చింది?"
"ఏం లేదండి, కాస్త పెద్ద చెయ్యి ఎక్కువ చేస్తూ ఉంటుంది. నేనిస్తాలే అమ్మా అంది"
"అయితే మనకే మంచిది, అప్పుడప్పుడు రుచిగా తినొచ్చు" అంటూ ముచ్చట పడ్డాడు వెంకట్రావు.
పొరుగింటి పుల్లకూర రుచి అంటే ఇదే మరి అని మనసులో అనుకుంది కాంతం.
రోజూ రాత్రి అయ్యేసరికి కూర, పులుసు పంపిస్తోంది. వెంకట్రావు ఆనందంగా లొట్టలేసుకుంటూ తింటున్నాడు.
కాంతం రాత్రి అన్నం మాత్రమే వండుతోంది. కూర, పచ్చడి, పులుసు చేయడం మానేసింది.
వెంకట్రావు ఆఫీసు నుంచి వచ్చి ఆ పొరుగింటి ఆమెను
ఎంతో మెచ్చుకుంటూ తింటున్నాడు.
ఓ వారం తర్వాత, పొద్దున్నే టిఫిన్ - ఇడ్లీ గానీ, దోసెలు గానీ, ఉప్మా గానీ ఏం చేస్తే అవి పంపిస్తోంది.
"నీకన్నా, చూడు ఆవిడ నయం, చాలా బాగా చేస్తోంది" అంటూ ఎంతో మెచ్చుకుంటున్నాడు.
హోటల్కు వెళ్లి తింటే వంకలు పెడతాం. ఊరికే ఎవరో ఇచ్చింది బాగుండదా మరి?
వెంకట్రావు మధ్యాహ్నం భోజనం ఆఫీసులోనే చేస్తాడు.
పొద్దున టిఫిన్, రాత్రి భోజనం ఇంట్లో తింటాడు.
ఇలా ప్రతి రోజు ఆమెని మెచ్చుకుంటూ ఆనందంగా భోంచేస్తున్నాడు
"ఆవిడ దగ్గరికి వెళ్లి వంట నేర్చుకో, కాంతం. ఎంత రుచిగా చేస్తుంది ఆ కొబ్బరికాయ పచ్చడి,
గుమ్మడికాయ పులుసు!
అప్పుడప్పుడు వెళ్లి నేర్చుకుంటూ ఉండు,"
అంటూ సలహా ఇస్తున్నాడు భార్యకు.
"ఆవిడ చూడు, ఒట్టి అమాయకురాలు. నాలుగు సార్లు వంటలు బాగున్నాయి, బాగున్నాయి అంటే రోజూ పంపించేస్తోంది.
ఆడవాళ్ళను మెచ్చుకుంటే చాలు. వాళ్ళ ఆనందానికి పట్టపగ్గాలు ఉండవు.
రోజూ ఉదయం టిఫిన్, రాత్రి కూరలు బాగానే పంపిస్తోంది. ఈ కూరలు కొనడం డబ్బు ఖర్చు తప్పింది
అంటూ మనసులో వెంకట్రావు సంతోషపడుతున్నాడు.
ఇలా ఓ 15 రోజులు తిరిగాయి. ఫస్ట్ తారీఖు వచ్చింది.
పొద్దున్నే ఆఫీసుకు బయలుదేరాడు. కింద ఆవిడ వాళ్ళబ్బాయి చేత పంపించిన ఇడ్లీలు కమ్మగా తిన్నాడు.
ఆఫీసుకు బయలుదేరబోతున్నాడు
"ఏవండీ, జీతాలు వచ్చాయి కదా మీకు?" అని అడిగింది కాంతం
"నిన్ననే వచ్చాయి" అన్నాడు వెంకట్రావు
"అయితే నాకు 8,000 ఇవ్వండి."
"8 వేలా? నీకెందుకే? ఈనెలలో ఏమీ కొనడానికి నా దగ్గర డబ్బులు లేవు," అంటూ విసుక్కున్నాడు వెంకట్రావు.
"నేనేమీ కొనడానికి కాదండి, మీ తిండి ఖర్చు..."
"నా తిండి ఖర్చా? నేను ఇంట్లోనే కదా తింటున్నాను" అన్నాడు ఆశ్చర్యంగా.
"మరి పొరుగింటి పుల్లకూర రుచికి డబ్బులు కట్టాలి కదా? రోజూ 'చాలా బాగుంది, చాలా బాగుంది' అని పొద్దున టిఫిన్, రాత్రి కూరలు, సాంబారు తింటున్నారు కదా?" అంటూ నవ్వుతోంది కాంతం.
"ఏమిటి నువ్వు చెప్పేది? నాకేమీ అర్థం కావడం లేదు. నేనెందుకు ఆవిడకి డబ్బులు ఇవ్వాలి?"
"అవును మరి! నేను చేసిన పదార్థాలన్నిటికీ పేర్లు పెడతారు కదా, 'ఇది బాగోలేదు, అది బాగోలేదు' అని. అందుకే ఆ కొత్తగా వచ్చిన ఆవిడని క్యారేజీ పంపమన్నాను.
ఆవిడ ప్రతిరోజూ ఊరికే ఎందుకు ఇస్తుంది మీకు? ఆవిడది వంటల వ్యాపారం.
ఇంట్లో భార్య చేసేది బాగుండవని, పొరుగింటి కూరలు బాగున్నాయని లొట్టలేసుకుని తింటున్నారు కదా? మరి దానికి డబ్బులు కట్టవలసి వస్తుంది..
రోజూ క్యారేజీ పంపమని ఆవిడకు ఆర్డర్ చేశాను. ఆవిడ వంటలు అందరికీ పంపిస్తుంది.
ఇప్పుడు ఈ 15 రోజులకి ఆవిడకు ఎనిమిది వేలు ఇవ్వాలి. పొద్దున టిఫిన్కు, రాత్రి వంటలకు. తెలిసిందా మీకు?" అంది కాంతం.
"ఇదెక్కడి గొడవే! ఆవిడ ఊరికే ఇస్తోంది కదా అని చెప్పావు."
"ఊరికే ఎన్నాళ్లు ఎవరైనా ఇస్తారండీ?"
ఇంట్లో భార్య చేసే వంట బాగోలేదంటే బయట వంటలకు డబ్బులు కట్టుకోవలసి వస్తుంది."
"అయ్య బాబోయ్! నీ తెలివి మండినట్టే ఉంది. నన్నే బోల్తా కొట్టించావే.
నాకు ఈ పొరుగింటి పుల్లకూరలు వద్దే వద్దు.
ఇక్కడి నుంచి నువ్వే చెయ్యి. ఈ లెక్కన నేను నెలకు 16,000 ఇచ్చుకోలేను.
నీ వంటలే నాకు బాగుంటాయి, నువ్వే చేసి పెట్టు.
బుద్ధొచ్చింది నాకు" అన్నాడు వెంకట్రావు.
"ఇక నుంచి నేను ఏం చేస్తే అది నోరు మెదపకుండా తినండి మరి.
ఇంతవరకూ పంపించిన వాటికి ఆవిడకు డబ్బులు కట్టాలి కదా?" అంది కాంతం.
"సరే, తీసుకో. ఏం చేస్తాం" అని ఎనిమిది వేలు ఇచ్చాడు.
"ఇక ముందు ఇలా క్యారేజీలు తెప్పించకు!" అంటూ కోపంగా ఆఫీసుకు బయలుదేరాడు వెంకట్రావు.
"బాగానే పాఠం చెప్పాను. ఇకముందు ఏం చేసినా వంకలు పెట్టకుండా తింటారు."
అని నవ్వుకుంది కాంతం.
***
అద్దంకి లక్ష్మి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2026 కథల పోటీల వివరాల కోసం
ఉగాది షడ్రుచుల కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత్రి పరిచయం: అద్దంకి లక్ష్మి
నా పేరు శ్రీమతి అద్దంకి లక్ష్మి
జన్మ స్థలం:రాజమహేంద్రవరం
డేట్ అఫ్ బర్త్
3_6_1946.
నివాసం: నవీ ముంబయి
విద్యార్హతలు:
బి.ఎ; బి. ఇడి
**వృత్తి:విశ్రాంత ఉపాధ్యాయిని,
బాంబే మునిసిపల్ కార్పొరేషన్
**తల్లిదండ్రులు: శ్రీమతి రత్నమ్మ గారు_శ్రీరామ మూర్తి గారు.
భర్త:శ్రీ వేంకటేశ్వర రావు;
విశ్రాంత జాయింట్ కమిషనర్, ఆదాయపు పన్ను శాఖ
**కుమారుడు:
గిరిధర్ సిఏ;ఎంబీఏ; శాక్రమెంటో కాలిఫోర్నియా,
**కూతురు:మాధురి వెబ్ మేనేజర్ న్యూయార్క్ స్టేట్ అమెరికా.
అల్లుడు మధుసూదన్ అమెరికా
వృత్తి/ప్రవృత్తిలో ముఖ్య ఘట్టాలు
**నూతన విద్యా విధానం గురించి ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చి,ఉత్తమ రిసోర్స్ పర్సన్ టీచర్ గా పురస్కారం పొందాను,
నిరక్షరాస్యతను నిర్మూలించుటకు
సేవా కార్యక్రమాలు నిర్వహించాను,,
నాటకాలు వ్రాసి
విద్యార్థుల నాటకాలు
వేయించాను బెస్ట్ డైరెక్టర్ బెస్ట్ రైటర్ అవార్డులు పొందాను,
సౌత్ ఇండియన్ భాషలలో వేయించిన నాటకాల్లో, పిల్లలకు బెస్ట్ యాక్టర్ గా పురస్కారాలు లభించాయి
చదువులో వెనుకబడ్డ విద్యార్థులకు ప్రత్యేకంగా పాఠాలు చెప్పి వారి విద్యాభివృద్ధికి తోట్పడినాను,
**తెలుగు రచయితల సంఘం మహారాష్ట్ర వారి సంకలనాలలో కథ,కవిత రాసి పురస్కారాలు పొందాను,
**ఆల్ ఇండియా రేడియో తెలుగు కేంద్రంలో ఢిల్లీలో నాలుగేండ్లు తెలుగులో వార్తలు చదివిన అనుభవం
**ఎంప్లాయిమెంట్ న్యూస్ పేపర్ లో నాలుగేండ్ల అనుభవం
సాహితీ జీవితం_రచనలు
**వివిధ సాహితీ సమూహాల్లో కథలు,కవితలు రాస్తుంటాను
**ఆంధ్ర ప్రభ,ఆంధ్ర పత్రికల్లో కథలు, వ్యాసాలు ప్రచురించ బడ్డాయి
ఆంధ్రప్రభ పత్రికలో కథలకు బహుమతులు పొందాను
**అనేక సమూహాల్లోని
ఇ-సంకలనాలలో నా కథలు,కవితలు,
పద్యాలు ప్రచురించ బడినవి
కవితలకు కథలకు బహుమతులు పొందినాను
నేను రాసిన
కవితలు మరియు ప్రక్రియలు 4000 పైగా
**మినీ కవితలు
పంచపదులు
సున్నితాలు
ఇష్టపదులు
**గేయాలు
**వ్యాసాలు
**నాటకాలు
పద్యాలు
గజల్స్
కథలు
రుబాయీలు
బాల సాహిత్యం
**పేరడీ పాటలు 20 వివిధ దిన పత్రికలలో ప్రచురించబడ్డాయి
*సాహిత్య సేవ
తేనియలు,
తొణుకులు,
చిలక పలుకులు,
పరిమళాలు,
మధురిమలు,
ముత్యాలహారాలు,ఇష్టపదులు,
సకినాలు,
సున్నితాలు,
పంచ పదులు, బాల పంచ పదులు, నానీలు అనేక లఘు కవితా ప్రక్రియల్లో అన్నిట్లోనూ శతాధికంగా కవితలు రాసి, ప్రశంసా పత్రాలను పొందినాను,
**1500 వందలకు పైగా ప్రశంసా పత్రాలు పొందాను
**సాహితీ చక్రవర్తి, ఇష్టపది శ్రేష్ఠ,కవన కిరణం, అక్షర ఝరి , పంచపది కవి రత్న లాంటి , సాయి వనములో సాహిత్యం నుంచి కవన రత్న, కథా భూషణ్, మెదక్ జిల్లా విశిష్ట పురస్కారం, ఏకె మీడియం ముంబై వారి పురస్కారం, నారీ శ్రీ, సున్నితార పురస్కారం,,
అన్ని గ్రూపుల నుంచి,
15 బిరుదులు పొందడం జరిగినది,
ఆగస్టు 2022లో అమ్మ అంశముపై నేను రాసిన పద్యములకు,,
2 సున్నితాల ప్రక్రియ లో కవితకు కూడా ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదైనను,
రెండుసార్లు ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో నమోదయ్యాను,
1.ప్రచురణ,,,
1 ,కవితా కుసుమాలు పుస్తకాన్ని ప్రచురించుకున్నాను,




Comments