top of page

ఎగిరే పావురమా

Updated: Dec 9, 2023


'Egire pavurama' - New Telugu Story Written By Pitta Gopi

Published In manatelugukathalu.com On 07/12/2023

'ఎగిరే పావురమా' తెలుగు కథ

రచన: పిట్ట గోపి


ప్రపంచంలో ఎంతోమంది తల్లిదండ్రులు తమ బిడ్డల కోసం ఎన్నో త్యాగాలు చేస్తారు, చేస్తున్నారు. ఈ విషయంలో పేద ధనిక అంటూ తేడా ఏమీ ఉండదు. ఎంతో కష్టంతో, ఎన్నో ఆశలతో తమ బిడ్డలకు తమ స్థోమతకు మించి చేస్తారు.


పిల్లలు పెద్దవాళ్ళు అయి ఒక వయసు వచ్చాక తల్లిదండ్రుల కష్టాన్ని గమనిస్తూ.. ఏదైనా మంచి ఉద్యోగం సాధించి ,గొప్పవాడిగా ఎదిగి తల్లిదండ్రులకు తోడు నీడగా ఉండాలని ,వారి కష్టాన్ని తీర్చాలని అనుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు.


అయితే అందులో కొద్దిమంది మాత్రమే దానిని ఆచరణలో పెడతారు. మిగిలిన వారు తల్లిదండ్రులను ,వారి కష్టాన్ని మర్చిపోయి వారిని దూరం పెడతారు. మరికొందరు వారి పై క్రూరంగా కూడా ప్రవర్తిస్తారు.


వనవిష్ణుపురంలో వంకాజమ్మ, వీరయ్యల ముద్దుల కొడుకు సంజీవ్. చుట్టూ పచ్చని అడవుల మధ్యలో ఆ ఊరు. పెద్ద సౌకర్యాలు,అభివృద్ధికి నోచుకోని ఆ ఊరిలో అందరికీ వ్యవసాయం, అడవులే జీవనాధారం.


పూరిగుడిసెల్లోనే అందరి జీవితాలు సాగుతున్నాయి. ఏ ఒక్కరి పిల్లలు బడికి వెళ్ళి చదువుకోరు. అందరూ తల్లిదండ్రులుతో కలిసి పొట్టనింపుకోవటానికి అడవులకు పోయి తేనె, కలప ,వంటచెరకు , వెదురు తో తయారు చేసిన వస్తువులు ,అల్లికలు సామగ్రి దగ్గర లో ఉన్న పట్టణానికి తీసుకుపోవటం ఇదే వారి జీవనాధారం. ఆ బతుకు ఈరోజుల్లో చాలా కష్టంతో కూడుకున్నది అయినా.. వారికి తప్పటంలేదు.


అలాంటి కుటుంబం లో పుట్టిన సంజీవ్ ను వీరయ్య పట్టణంలో బడికి పంపేవాడు.


ఆ గ్రామంలో బడికి వెళ్తున్న ఒకే ఒక్కడు సంజీవ్.

ఇరుగుపొరుగు ఎంత విమర్శించినా..పేదరికం పట్టిపీడిస్తున్న కూడా సంజీవ్ ని చదివించాడు. ఎందుకంటే తమ దుర్బార జీవితం తమ కొడుకు అనుభవించకూడదని.


సంజీవ్ కూడా వీరయ్య ఆశయాలుకు తగిన విధంగా తెలివైనవాడిగా పేరు తెచ్చుకున్నాడు.


ఊరిలో ఏ పనైనా..కష్టంతో కాకుండా తెలివిగా చేసి అందరి మన్ననలు పొందాడు.పెద్దవాడు అయ్యాక పై చదువులకు కూడా సంజీవ్ కొనసాగించాడు. వీరయ్య సంపాదన సరిపోకపోయానా.... ప్రభుత్వం స్కాలర్ షిప్ కూడా సంజీవ్ చదువునకు దోహదపడింది.


అలా సంజీవ్ పెద్ద చదువులు చదివి పెద్ద డాక్టర్ అయ్యాడు.


అంతే!

రెక్కలు వచ్చి ఎగిరే పావురంలా ఇక అప్పటి నుండి వనవిష్ణుపురంలో అది కూడా చిన్న పూరిగుడిసెలో ఉండటం సంజీవ్ కి ఇష్టం ఉండేది కాదు. ఆ కారణంగా తల్లిదండ్రులును కూడా చూడ్డానికి వచ్చేవాడు కాదు.


ఏ సంవత్సరానికో ,రెండు సంవత్సరాలుకో వచ్చి వెంటనే పోయేవాడు.


అయినా వంకాజమ్మ వీరయ్యలు ఏనాడూ బాదపడలేదు.

ఏ తల్లిదండ్రులు అయినా తమ బిడ్డలు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటారు కదా మరీ!


ఇక అక్కడే ఎవరో అమ్మాయి ని ప్రేమించి పెళ్ళి చేసుకున్నాడు. తమ తల్లిదండ్రులు,తమ ఊరును భార్య, అత్తామామలు చూస్తే నవ్వుకుంటారని చూపించటం ఇష్టం లేక అత్తగారి ఇంటికి దగ్గర్లో ఒక ఇల్లు కనుగోలు చేసి అక్కడే కాపురం పెట్టుకున్నాడు సంజీవ్.


ఈ విషయం ఆ నోటా ఈ నోటా సంజీవ్ తల్లిదండ్రులుకు తెలిసింది.


వాళ్ళు ఎంతోగానో కన్నీటి పర్యంతమయ్యారు.

అక్కడితో అది చాలక ఇరుగుపొరుగు ఓదార్చటం మానేసి

"చక్కగా మనలాగా పనులు నేర్పించకుండా నెత్తిన పెట్టుకొని చదువుకు పట్టణం పంపాడు. వాడు వదిలేసి ఎగిరే పావురంలా ఆకాశానికి ఎగిరోపోయాడు. కొద్దీ క్షణాల్లో బలివ్వబోతున్న మేకను చివరిసారిగా ఒక్కసారి తిరిగి గంతులేసుకుని వస్తుంది అని వదిలితే ఎలా ఉంటుందో వీరయ్య పరిస్థితి ఇప్పుడు అలాగే ఉంద"ని ఎద్దేవా చేశారు.


చాలా కాలం గడిచాక కొడుకు పై ఆశలు వదులుకుని తమ బతుకు తాము బతుకుతున్న వీరయ్య వంకాజమ్మ నెత్తిన మరో పిడుగు పడింది.


అది ఏంటంటే..!

సంజీవ్ కి ఏదో అంతుపట్టని వ్యాధి సోకిందట , కనీసం మంచం పై నుండి లేవలేని పరిస్థితి అంటా. చస్తాడో బతుకుతాడో ఆసుపత్రిలో చేర్చకుండా భార్య పిల్లలతో ,కలిసి సంజీవ్ ని వదిలి అమ్మగారి ఇంటికి పోయిందట.


ఇలాంటి పరిస్థితుల్లో సంజీవ్ కి తన తల్లిదండ్రులు గుర్తు వచ్చి వారికి సమాచారం అందించాడు.


వీరయ్య వంకాజమ్మలు పట్టణంలో సంజీవ్ చదువుకున్న బడిలో ఒక ఉపాధ్యాయుడి సహకారంతో సంజీవ్ ఉన్న చోటకు వెళ్లి వనవిష్ణుపురం తీసుకువచ్చారు.


"సంజీవ్! నువ్వు చూపించిన అహంకారం , గ్రామం పై చూపించిన చీత్కారము ,ఇక్కడే పుట్టి పెరిగి ఇక్కడ తలదాచుకునేందుకు ఇష్టపడని వాడు,ఇక్కడ తల్లిదండ్రులు గ్రామస్తులు క్షేమం పట్టనివాడు ఇప్పుడు చావు వరకు రావటంతో తల్లిదండ్రులు, గ్రామము ,గ్రామస్తులు గుర్తుకువచ్చారా" అంటూ విమర్శించారు కొందరు గ్రామస్తులు.

అయితే వీరయ్య వంకాజమ్మల బాధ చూడలేక సంజీవ్ ని చూసి కాస్తా జాలిపడ్డారు. తల్లిదండ్రులు అయితే బిడ్డ పరిస్థితి చూసి ఎంతో దుఃఖించారు.


గ్రామస్తులు అందరూ ఏకమయి పసరుతో ఆయుర్వేదం మందులు తయారు చేసి సంజీవ్ కి మరలా కొత్త జీవితం ప్రసాదించారు.


ఇప్పుడు సంజీవ్ సాదారణ మనిషిలా మరలా తన విధుల్లో చేరాడు.అయితే ఉదయం బయలుదేరి సాయంత్రానికి వనవిష్ణుపురంలో తల్లిదండ్రులు వద్దకు చేరుకునేవాడు.

సంజీవ్ కి జ్ణానోదయం అయింది

మనసులో ఇలా అనుకున్నాడు.


"పిల్లలు ప్రేమించినా.. ద్వేషించినా... తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటారు. కదా..!


కష్టకాలంలో తల్లిదండ్రులను వదిలి పిల్లలు వెళ్ళిపోవచ్చు కానీ... ఎన్ని కష్టాలు ఉన్నా పిల్లలను ఎప్పుడూ తల్లిదండ్రులు కష్టంగా భావించరు, కదా..!


తన భార్యకు విలువలు లేవు. తాను కూడా నేర్పలేదు. అయినా..కష్టపడి పెంచి ఈ స్థానంలో పెట్టిన తల్లిదండ్రులను వదిలేసిన నాకు అసలు విలువలు ఉంటే కదా నేర్పించటానికి..

ఇన్నాళ్లు డబ్బు సంపాదించాను కాబట్టి ఆ డబ్బుతో హాయిగా నాతో కాపురం చేసింది. ఎప్పుడైతే పరిస్థితి బాలేదో అప్పుడు వదిలిపోయింది. డబ్బు ఎక్కడ ఉంటుందో ఖచ్చితంగా అక్కడ ప్రేమ విరబూస్తుంది.


పంజరంలో పావురాన్ని వదిలితే ఎలా ఎగిరిపోతుందో అలా తాను ఎగిరిపోయాడు. ఇప్పుడు తాను గొప్ప డాక్టర్ల లో ఒకడు. తల్లిదండ్రులను,గ్రామస్తులను ఎంతో బాధపెట్టినా..

కష్టకాలంలో తనను బతికించారు.ఎంతో ప్రేమను చూపారు.ఇలాంటి వారి ఋణం తీర్చుకోవటానికి తన హోదాని వాడుకోవాలని, ఈ గ్రామంలో అందరికీ మంచి జీవితం ఇవ్వటానికి ,గ్రామ రూపురేఖలు మార్చటానికి ప్రణాళికలు వేసుకున్నాడు సంజీవ్.

***

పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు

ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).


మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.


గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం

Profile:

Youtube Playlist:

సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం





Comments


bottom of page