top of page

గ్రహాంతరవాసి

Updated: Jun 5

#GSSKalyani, #GSSకళ్యాణి, #Grahantharavasi, #గ్రహాంతరవాసి, #TeluguFantacy, #కొసమెరుపు

Grahantharavasi - New Telugu Story Written By - G. S. S. Kalyani

Published In manatelugukathalu.com On 04/06/2025

గ్రహాంతరవాసి - తెలుగు కథ

రచన: G. S. S. కళ్యాణి

కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్



పట్నంలో ఉంటున్న కొడుకు రమేష్ దగ్గర కొన్ని వారాలు గడుపుదామని పల్లెటూరినుండీ వచ్చిన ఆనందరావు మొబైల్ ఫోను ఫయరింజిన్ సైరెన్ లాంటి శబ్దంతో గణగణమంటూ ఆగకుండామోగింది. ఆ అరుదైన రింగ్ టోన్ చేసిన చప్పుడుకి ఉయ్యాలలో ప్రశాంతంగా నిద్రపోతున్న తొమ్మిదినెలల అర్జున్ ఉలిక్కిపడి లేచి గుక్కపట్టి ఏడవటం మొదలుపెట్టాడు. 

"అదేమి రింగ్ టోన్ నాన్నా? గుండెల్లో దడపుట్టేటట్లుంది! ఇంకోదానికి మార్చుకోవచ్చు కదా?", అన్నాడు రమేష్ తన కొడుకు అర్జున్ ను ఎత్తుకుని ఊరుకోపెడుతూ.


"మీ నాన్నగారికి సరిగ్గా వినపడదు కదా?! అందుకే ఇరుగు పొరుగు వాళ్ళకు కూడా వినపడేలా గట్టి రింగ్ టోన్ పెట్టుకున్నారు!", చిరాగ్గా ముఖం పెట్టిన అర్జున్ ని తన చేతుల్లోకి తీసుకుంటూ రమేష్ తో అంది ఆనందరావు భార్య పార్వతి.


పార్వతీ రమేష్ ల సంభాషణ పట్టించుకోకుండా, "హలో!" అంటూ ఫోన్ పట్టుకుని ఇంటి బయటకు వెళ్ళిపోయాడు ఆనందరావు.


"హలో ఆనందరావు గారూ! నేనూ! మీ ఎదురింటి రంగనాథం మాట్లాడుతున్నాను. మీరు వెంటనే బయలుదేరి ఇక్కడికి రావాలండీ", అన్నాడు రంగనాథం కంగారుగా.


"ఏమిటీ? ఏం జరిగిందీ?? కొంచెం వివరంగా చెప్తారా?", ఆందోళన చెందుతూ అడిగాడు ఆనందరావు.


"మీరు వార్తలు చూడలేదా? నిన్న రాత్రి మీ ఇంటి మేడ పైకి గ్రహాంతరవాసులు దిగారు!! వాళ్ళు మన ఊరిని ఏం చేస్తారో అని అందరూ భయపడిపోతున్నారు!", అసలు విషయం చెప్పాడు రంగనాథం.


ఆ మాటలు విన్న ఆనందరావు గుండెల్లో రైళ్ళు పరిగెత్తాయ్. హడావుడిగా పరుగులాంటి నడకతో ఇంట్లోకి వెళ్ళి, బెడ్రూంలో ఉన్న సూట్ కేసులు ముందుగదిలోకి లాక్కుంటూ వచ్చి, "పార్వతీ! పద! తొందరగా మనింటికి వెళ్ళాలి!", అన్నాడు ఆయాసపడుతూ. ఎందుకన్నట్లు ఆనందరావు వంక ఆశ్చర్యంగా చూస్తూ ఏం మాట్లాడాలో తెలియక నిలబడిపోయింది పార్వతి.


"ఏమైంది నాన్నా? ఎందుకంత కంగారుగా ఉన్నావ్? ముందు నువ్వు కూర్చో", అంటూ మంచినీళ్ళు తీసుకురమ్మని తన భార్య విమలకు సైగ చేశాడు రమేష్.


"మన ఇంట్లోకి గ్రహాంతరవాసులొచ్చారటరా! వాళ్ళు ఏ పని మీదొచ్చారో మనకు ఏ హాని తలపెట్టారో ఏమో! తలుచుకుంటూ ఉంటే ఒణుకు పుడుతోంది", అన్నాడు ఆనందరావు తనకు పట్టిన చెమటలు కండువాతో తుడుచుకుంటూ.


"ఊరుకోండి నాన్నా! గ్రహాంతరవాసులేంటీ? మన ఇంటికి రావడమేంటీ? నీకెవరో అబద్ధం చెప్పినట్లున్నారు. అనవసరంగా కంగారు పడకు", అన్నాడు రమేష్.


"లేదురా! ఆ విషయం వార్తల్లో కూడా వచ్చిందని అంటూ ఉంటే అబద్ధం ఎలా అవుతుందీ?", విమల తెచ్చిన నీళ్ళు అందుకుంటూ అన్నాడు ఆనందరావు.


"ఏ ఛానెల్ వాళ్ళు చెప్పారూ?", అడిగాడు రమేష్.


"ఏమో! నాకదంతా తెలీదు. నేనైతే బయలుదేరుతున్నానురా. పార్వతీ! త్వరగా రా!", అన్నాడు ఆనందరావు. 


"గ్రహాంతరవాసులను ఇంతవరకూ చూసినవాళ్ళెవ్వరూ లేరట. ఇంతవరకూ వచ్చిన వార్తలన్నీ అనుమానాలేకానీ నిజమని నిరూపించిన దాఖలాలేవీ లేవు. నేను ఎంబ్రాయిడరీ క్లాసుల్లో చేరాను కదా! రేపటినుంచీ క్లాసులు మొదలవుతాయి. రమేష్ మొత్తం కోర్సుకు ఫీజు కట్టేశాడు. నేను క్లాసులకు వెళ్ళకపోతే డబ్బులన్నీ వృధా అయిపోతాయి. మరోసారి మీరు విన్నది నిజమో కాదో తెలుసుకోండి", అంది పార్వతి ఆనందరావుతో.


"అబ్బా! నువ్వూ నీ క్లాసుల గోలా! అవన్నీ కాలక్షేపం కోసమే తప్ప మనకు వాటివల్ల ఉపయోగమేమీ ఉండదు. నువ్వొచ్చినా రాకపోయినా నే వెడుతున్నా అంతే!", ఇక చర్చకు ఆస్కారం లేకుండా తేల్చి చెప్పేశాడు ఆనందరావు.


చేసేది లేక ఆనందరావుతో తమ ఊరికి బయలుదేరింది పార్వతి. ఆనందరావుకు అసలే హై బీపీ షుగరూ ఉన్నాయనీ, బస్సు ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయేమోనని సందేహించిన రమేష్, పార్వతీఆనందరావులను తన కారులో పల్లెటూరికి తీసుకెళ్ళిపోవడానికి నిర్ణయించుకుని వారితో బయలుదేరాడు. రెండుగంటల కారు ప్రయాణం తర్వాత తమ ఇంటి పరిసరాలకు చేరుకున్నారు ఆనందరావు దంపతులు. ఆ సమయానికి తమ ఇంటి ఆవరణకు కొద్ది దూరంలో కొందరు గ్రామస్థులు గుమిగూడి ఏదో విషయం చర్చించుకుంటున్నారు. కారు దిగుతూనే ఆనందరావు వారి వద్దకు వెళ్ళాడు. ఆనందరావు వెంట రమేష్ కూడా వెళ్ళాడు.


ఆనందరావును చూస్తూనే పాలవ్యాపారి మల్లేశం, "రండి రండి! మీకోసమే అంతా ఎదురుచూస్తున్నారు! గ్రహాంతరవాసులు నిన్న రాత్రి మీ డాబాపైకి దిగారు", అని అన్నాడు.

"అవునయ్యగారూ! వాటిలో ఒక గ్రహాంతరవాసి మాకు సుస్పష్టంగా కనపడింది. అది గుండుగా ఉంది! దాన్నుండీ గుప్పుగుప్పుమని ఒకటే నల్లటి పొగలు", భయమూ, ఆశ్చర్యమూ కలగలిపిన కంఠంతో అంది ఆనందరావు పనిమనిషి మాణిక్యం.


"ఆ తర్వాత 'ఠపీ'మని పెద్ద శబ్దంతో ఆ గ్రహాంతరవాసి మాయమైపోయింది. పత్రికలకోసం సమాచారం సేకరించేందుకు వచ్చిన ఇద్దరు యువకులు ఇప్పుడే మీ ఇంటి ప్రహరీ గోడ దూకి, డాబాపైకి వెళ్ళారు ఆనందరావుగారూ!", చెప్పాడు రంగనాథం.


"అమ్మబాబోయ్! మీరు చెప్పేది వింటూ ఉంటే నాక్కూడా గుండె దడొచ్చేస్తోంది!! మేడ మీద నాకెంతో విలువైన వస్తువులున్నాయ్. బహుశా వాటికోసమే ఆ గ్రహాంతరవాసులు వచ్చి ఉంటారు!", అంది పార్వతి.


అంతలో డాబాపైకి వెళ్ళిన ఇద్దరు యువకులు పరిగెత్తుక్కుంటూ ఆనందరావు దగ్గరకు వచ్చారు. వాళ్ళు ఆనందరావు ఇంటివైపు బెదురు చూపులు చూస్తూ, "ఆ ఇంటి యజమాని మీరే కదండీ?", అని అడిగారు.


"అవును నేనే. ఇంతకూ డాబాపైన ఏముందీ?", ఆతృతగా అడిగాడు ఆనందరావు.


"అమ్మో! చాలా భయంకరంగా ఉందండీ!", అన్నాడు ఆ యువకుల్లో ఒకడు.


"అంతా నల్లటి మసి! ఏవో కొన్ని మట్టి బొమ్మల్లాంటివి ఉన్నాయి. వాటి ఆకారాలు చాలా విచిత్రంగా ఉన్నాయి. గుండె కాస్త బలహీనంగా ఉన్నవాళ్ళు ఆ బొమ్మల్ని చూడకుండా ఉంటే మంచిదండీ", చెప్పాడు యువకుల్లో మరొకడు.


"భగవంతుడా! ఏమిటీపరీక్ష?! నా ఇంటిని నువ్వే కాపాడాలి!", భయంతో వణుకుతూ కళ్ళు గట్టిగా మూసుకుని దేవుణ్ణి ప్రార్థించాడు ఆనందరావు.


యువకులు చెప్పిన సంగతులు విన్న పార్వతికి మాత్రం మనసులో ఏవేవో సందేహాలు కలుగుతున్నాయి.


రమేష్ ని పక్కకు పిలిచి, "ఒరేయ్ రమేషూ! నాకేదో అనుమానంగా ఉందిరా. నువ్వు ఒక్కసారి మన ఇంటి డాబా పైకి వెళ్ళి అక్కడ ఏం జరిగిందో నీ కళ్ళతో చూసి రా!", అంది పార్వతి.


రమేష్ కొంచెం ఆలోచించి, "సరేనమ్మా! చూసొస్తా", అంటూ ఇంటి వైపుకు ధైర్యంగా వెళ్ళాడు.


"ఆగరా! నేను కూడా నీకు తోడుగా వస్తా!", అంటూ రమేష్ వెంట వెళ్ళాడు ఆనందరావు.


గ్రామస్థులంతా ఏం జరుగుతుందోనని ఉత్కంఠగా ఎదురు చూడసాగారు.


ఒక పావుగంట గడిచాక రమేష్ తో కలిసి ఆనందరావు ఆయాసపడుతూ జనం దగ్గరకు వచ్చి, "కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. అందరూ ప్రశాంతగా మీ మీ ఇళ్లకు వెళ్ళచ్చు", అని అన్నాడు.


"అసలేం జరిగింది ఆనందరావుగారూ? ఆ వచ్చినది గ్రహాంతరవాసులు కాదా??", అసహనంగా అడిగాడు రంగనాథం.


"గ్రహాంతరవాసులూ కాదూ! ఇంకేదో అనుకోని ఉపద్రవమూ కాదు! మా ఆవిడ డాబాపైన రాత్రిళ్ళు కాసేపు పని చేసుకోవాలని చెప్పి లైటు పెట్టమని అడిగింది. దానికోసం ఒక పైపు పెట్టి దాని చివర బల్బు పెట్టాను. వైరింగులో ఏదో తప్పు చేసినట్లున్నాను. షార్ట్ సర్క్యూట్ అయ్యి మంటలు వచ్చాయి", అన్నాడు ఆనందరావు.


"వైరింగులో పొరపాటు కాదేమోనండీ! నిన్న గాలి దుమారం వచ్చింది. ఆ గాలికి చెట్లన్నీ ఊగిపోయి, తేలికపాటి వస్తువులన్నీ గాల్లోకి ఎగిరిపోయాయ్. అక్కడక్కడా కరెంటు తీగలు మండిపడ్డాయ్. అలా ఏదో జరిగి మంట వచ్చుంటుంది", అన్నాడు మల్లేశం.


"మసి ఎందుకుందో విషయం తెలిసింది. మరి ఆ భయంకరమైన ఆకృతులు ఏమిటి సార్? కచ్చితంగా అవి మన భూమి మీద చేసిన బొమ్మలైతే కావు. మరవి ఎక్కడినుంచీ వచ్చుంటాయ్?”, ఆనందరావుని అడిగాడు ఒక పత్రికా విలేకరి.


"ఓ! అదా?! అదీ... మీకెలా చెప్పాలో తెలియట్లేదయ్యా! మా ఆవిడ గతంలో పట్నం వెళ్ళినప్పుడు కుండలూ, మట్టి బొమ్మలూ తయారు చేసే పాటరీ క్యాంపులో చేరింది. అక్కడ నేర్చుకున్న విద్యనుపయోగించి కొన్ని కళాకృతులు చేసే ప్రయత్నం చేసింది. మిమ్మల్ని భయపెట్టిన ఆ అర్థంకాని బొమ్మలు అవే!", మొహమాటపడుతూ అసలు సంగతి చెప్పాడు ఆనందరావు. అక్కడున్నవారంతా ఒకరి చెవులొకరు కొరుక్కోవడం మొదలుపెట్టారు. 


అంతలో రమేష్, "కానీ ఒక్క విషయం ఆశ్చర్యంగా ఉంది! అక్కడ కొన్ని కుండ ముక్కలున్నాయి. మా అమ్మకు కుండ చెయ్యడం రాదు. అవేంటో, అసలు అవి ఎక్కడినుంచీ వచ్చాయో అర్థం కావట్లేదు", అన్నాడు దీర్ఘంగా ఆలోచిస్తూ.


"నువ్వుండరా రమేషూ! ఆ కుండ గురించి నేను చెప్తా! మీ నాన్న లైటు పెట్టారు కానీ దాన్ని ఆర్పడానికి స్విచ్ పెట్టలేదు. మేము ఊళ్ళో లేనప్పుడు డాబామీద లైటు వెలుగుతూ ఉంటే అందరికీ లేనిపోని అనుమానాలొస్తాయని నేనే ఆ బల్బుమీద పాత కుండొకటి బోర్లించిపెట్టా. ఇలా జరుగుతుందని అస్సలూహించలేదు", అంది పార్వతి.


ఆనందరావు, రమేష్ లు పార్వతి అన్నది విని అవాక్కయ్యారు. జరిగినదంతా గ్రహాంతరవాసుల పని కాదని తెలుసుకున్న గ్రామస్థులు ఊపిరి పీల్చుకుని ఎవరిదారిన వాళ్ళు వెళ్ళిపోయారు.


ఇంతవరకూ ఎవ్వరూ కనీవినీ ఎరుగని వార్తలు సేకరిద్దామని వచ్చిన పత్రికా విలేకరులు నిరాశతో వెనుదిరిగి వెళ్ళిపోయారు. డాబా శుభ్రం చేసుకునే పనిలో ఆనందంగా పడిపోయింది ఆనందరావు కుటుంబం.


అప్పుడొచ్చింది ఒక నిజమైన గ్రహాంతరవాసి! ఆనందరావు పడేసిన మట్టి బొమ్మలను రహస్యంగా తన గ్రహానికి పట్టుకెళ్ళడానికి.


*****


G. S. S. కళ్యాణి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు G. శ్రీ శేష కళ్యాణి. మాది హైదరాబాదు. ప్రస్తుత నివాసం కాలిఫోర్నియా, USA. మా తల్లిదండ్రులవల్ల నాకు సాహిత్యం పట్ల అభిమానం ఏర్పడింది. వారి ప్రోత్సాహంతో నేను రచనలు చెయ్యడం ప్రారంభించి, మా కుటుంబసభ్యుల సహకారంతో కొనసాగిస్తున్నాను. నా మొదటి రచన టీ.టీ.డీ. వారి 'సప్తగిరి' మాసపత్రికలో ప్రచురితమయింది. 2018 సంవత్సరంలో తెలుగు అసోసియేషన్ అఫ్ గ్రేటర్ శాక్రమెంటో(TAGS) వారు నిర్వహించిన ‘శ్రీ UAN మూర్తి మెమోరియల్ రచనల పోటీ’ లో నా మొట్టమొదటి కథ 'సంక్రాంతి సంబరం - ఒక మధుర జ్ఞాపకం'  కన్సోలేషన్ బహుమతి గెలుచుకుంది. ఆ తరువాత నేను రాసిన కథలు ప్రముఖ ఆధ్యాత్మిక పత్రిక 'భారత ఋషిపీఠం'తో సహా వివిధ వెబ్-పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇంతవరకూ నేను రాసిన కొన్ని కథలను, “కదంబవన కుసుమాలు” - VOL 1, VOL 2, మరియు VOL 3 అన్న పేర్లతో మూడు పుస్తకాలుగా విడుదల చెయ్యడం జరిగింది. నేను రాసిన "శ్రీరామనామము పలికెదము" అనే పాటను ‘స్వర’ మీడియావారు 2023 సంవత్సరంలో శ్రీరామనవమి పండుగ సందర్భంగా యూట్యూబ్ లో విడుదల చెయ్యడం జరిగింది. సమయం దొరికినప్పుడల్లా నాకు కలిగిన భావాలను రచనలుగా మలచి, వాటిని సకలకళాస్వరూపిణి అయిన ఆ అమ్మవారి పాదాలకు పుష్పాలుగా సమర్పిస్తున్నాను. 





Comments


bottom of page