సత్సంగం - వైరాగ్యం - ఆధ్యాత్మికతకు సోపానం
- Rayala Sreeramachandrakumar
- Jun 3
- 4 min read
#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #సత్సంగం, #వైరాగ్యం, #ఆధ్యాత్మికత #TeluguDevotionalArticle

Satsangham Vairagyam Adhyatmikathaku Sopanam - New Telugu Article Written By R C Kumar Published In manatelugukathalu.com On 03/06/2025
సత్సంగం వైరాగ్యం ఆధ్యాత్మికతకు సోపానం - తెలుగు వ్యాసం
రచన: ఆర్ సి కుమార్
సత్సంగత్వం:
ఓ మంచి గురువు, మంచి స్నేహితుడు, మంచి మనిషితో గడపటమే సత్సంగం అని చెప్పుకోవచ్చు. సత్సంగత్యంలో ప్రియమైన మాటలే కాకుండా హితమైన మాటలు కూడా వింటాము. ఆధ్యాత్మిక సాధనకు ప్రధాన ఉపకరణం సత్సంగత్యం. అలాగే ప్రధాన ఆటంకం దుస్సంగం. సత్ + సంగం. సత్ అనగా శాశ్వతం. భగవంతుని సత్యస్వరూపమే సత్. సంగం అనగా కూడిక. సత్ ను కూడి ఉండటమే సత్సంగం. విషయ వికారాలను తొలగించి సత్ చింతనతో, సద్భక్తితో, సద్భుద్ధితో భగవంతుని దరికి చేర్చేది సత్సంగం. అటువంటి వైరాగ్యభావనలో నేను, నాది అనే స్వార్ధాలు తొలగిపోయి నిర్మొహత్వం కలుగుతుంది. మోహం లేకపోవడం వలన మనసు స్థిరత్వాన్ని పొందుతుంది. ఆ నిశ్చలతత్వమే జీవన్ముక్తికి మార్గమౌతుంది. అందుకే శంకర భగవత్పాదులు భజ గోవింద శ్లోకంలో ఇదే భావాన్ని అద్భుతంగా వెల్లడించారు.
సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం
నిర్మొహత్వే నిశ్చల తత్వం నిశ్చలతత్వే జీవన్ముక్తి
ఆధ్యాత్మికత, వైరాగ్య భావన:
ఆధ్యాత్మికత అనగానే వైరాగ్యంతో కూడిన సన్యాసి జీవితాన్ని గడపడం అనే భావనలో ఉంటారు కొందరు. గృహస్థ ధర్మాలను త్యజించి అకర్మను పాటిస్తూ భక్తి మార్గంలో పయనిస్తున్నాను అనుకోవడం మూర్ఖత్వం. జీవితాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేని వారి నుంచే ‘వైరాగ్యం’ అనే మాటకు పెడార్థాలు వినిపిస్తాయి. కేవలం అజ్ఞానులు మాత్రమే తమ సోమరిపోతు తనాన్ని, వైరాగ్యమని తప్పుగా అర్థం చేసుకుంటారు. కర్మ యోగులు అంటే కర్మలు త్యజించిన వారు కాదు కర్మ ఫలాన్ని త్యజించినవారు. ఏ పని చేసినా ఈశ్వరార్పణబుద్ధితోనే చేయాలి. చేయించేది భగవంతుడే, నేను ఆయన చేతిలోని పనిముట్టును మాత్రమే అనే దృక్పథాన్ని అలవర్చుకోవాలి. కాషాయ వస్త్రాలను ధరించడమే కాదు, కోరిక, మోహం లేని స్థితిలో ఉండగలగడమే వైరాగ్యం. అవసరానికి మించిన ధన సంపాదన మీద వైరాగ్యం ఉండాలి, స్వలాభం మరియు స్వార్థ ప్రయోజనాలపైన వైరాగ్యం ఉండాలి. భోగభాగ్యాలపై వైరాగ్యం ఉండాలి, దేహం పైన మోహం కలగని వైరాగ్యం ఉండాలి. అభ్యాసేనతు కౌంతేయ అని కృష్ణ భగవానుడు చెప్పినట్టు ఇటువంటి వైరాగ్య లక్షణాలు కేవలం అభ్యాసం ద్వారానే సాధ్యపడుతాయి. నేను’ అనే స్థాయి నుంచి విస్తృతమైన, విశాలమైన ‘మనం’ అనే స్థాయికి చేరుకునే ప్రయాణమే ఆధ్యాత్మికం, మానవత్వం నుంచి మాధవత్వానికి చేరుకోవటమే ఆధ్యాత్మికం.
ఆధ్యాత్మిక దృష్టి కోణం:
నిజానికి ‘ఆధ్యాత్మికత’ అంటే, ఈ సృష్టిలోని ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి అనే కుతూహలాన్ని కలిగి ఉండడం. మనకు ఆసక్తి ఉండవలసింది కేవలం భౌతిక జీవితం గురించి మాత్రమే కాదు, జీవితంలోని అన్ని కోణాల గురించీ అవగాహన కలగాలి. ఈ సందర్భంగా రవీంద్రనాథ్ ఠాగూర్ స్వీయ చరిత్ర గుర్తుకు తెచ్చుకోవలసిన అవసరం ఉంది. ఆయనకు ప్రకృతి అన్నా, జీవితం అన్నా చాలా ఇష్టం. ఠాగూర్ గారు వార్ధక్యంతో మంచాన పడ్డ సమయంలో కొందరు మిత్రులు ఆయన వద్దకు చేరి ఇలా అన్నారు- ‘అంత్యకాలం సమీపించింది కదా, ఇక భగవన్నామ స్మరణ చేసి ముక్తి కావాలని కోరుకోండి’. అంటే ఆయన ‘ముక్తిని నేనేం చేసుకోవాలి. నాకు మళ్లీ మళ్లీ ఇక్కడకు రావాలని ఉంది. చూడండి, ఈ ప్రపంచం ఎంత రమణీయంగా ఉందో. ఈ ప్రకృతి ఎంతో దయ కలిగి అద్భుతమైన ఆనందాన్ని అందిస్తున్నది. భగవంతుడు అంటూ ఉంటే ఈ ప్రకృతిని ఆస్వాదించడానికి నన్ను మళ్లీ ఇక్కడికే పంపమని ప్రార్థిస్తాను’ అన్నాడు. అంతలా జీవితంతో మమేకమైన వారికే జీవిత పరమార్థం ఏమిటో తెలుస్తుంది. అలాంటి వారే జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించ గలరు. అంతేకానీ, జీవితంపై నిరాసక్తతతో ఉదాసీనంగా ఉన్నవారు కాదు. కాబట్టి నిజమైన ఆధ్యాత్మికతలోకి వెళ్లాలంటే, ముందుగా మనకు లభించిన మానవ జీవితాన్ని సంపూర్ణంగా ఆస్వాదించాలి, అప్పుడే సత్యాన్వేషణకు దారి సుగమం అవుతుంది.
మరొక భ్రమ:
సాధారణంగా ఆధ్యాత్మికత అంటే మత సంబంధమైన ఆరాధన లేక దైవ సంబంధమైన ప్రార్థన, భజన, పూజ, జపధ్యానాలు మాత్రమే అని సగటు మనిషి భావిస్తారు. అయితే, అవన్నీ మనలో ఆధ్యాత్మికతను పురిగొల్పే ఉపకరణాలు మాత్రమే. అజ్ఞానం అనే చీకట్లను తొలగించే జ్ఞానజ్యోతిని ప్రకాశింప చేసుకోలేని పూజా కైంకర్యాల ప్రయోజనం పరిమితమే. ఆధ్యాత్మికత అన్నది అత్యున్నత సంస్కార విశేషం. అది ఒక గొప్ప నాగరికత. అవగాహనలో, అనుభూతిలో అనన్యత, అన్యోన్యత, ఆత్మీయత అనంతంగా విస్తరింపజేయడమే ఆధ్యాత్మికత. తద్వారా ఉంది అంతిమ ప్రయోజనం అమృతత్వం. ‘మృత్యోర్మా అమృతంగమయ’ అంటే ఇదే. ఒక విషయాన్ని ఇంద్రియాల ద్వారా నేరుగా తెలుసుకుంటే ప్రత్యక్ష జ్ఞానం అంటారు ఇంద్రియాలతో సంబంధం లేకుండా సత్యం వేరే రకంగా ఎరుకలోకి వస్తే అది పరోక్ష జ్ఞానం. ఈ రెండూ కాక అంతర్గతంగా తాను ఎవరన్నది స్పష్టంగా గుర్తించడాన్నే ఆత్మతత్వ జ్ఞానం అంటారు. అదే భగవత్సాక్షాత్కారం.
వాక్పటిమతో తప్పుదారి పట్టించే ఘనులు :
మిడిమిడి జ్ఞానంతో వాక్చాతుర్యాన్ని ప్రదర్శిస్తూ మూఢత్వాన్ని ప్రచారం చేసే కొందరు స్వయం ప్రకటిక మేధావులు ఈ మధ్యకాలంలో పుట్టుకొస్తున్నారు. కొందరు విగ్రహారాధనను తప్పుపడితే మరికొందరు సనాతన ధర్మాలను కాలం చెల్లిన ఆచారాలుగా వేలెత్తి చూపుతున్నారు. ఇటువంటి వారి దుస్సంగత్యం వల్ల సమాజంలో కొందరికి ఆధ్యాత్మికత పట్ల సరియైన అవగాహన లేకపోగా ఒక విధమైన ఏవగింపు వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఇక మరికొందరు అరకొరగా జ్ఞాన సమపార్జన చేసి బాబాలు, సన్యాసులుగా అవతారం ఎత్తి సత్సంగం పేరిట తన వాక్పటిమతో అమాయక భక్తులను ఆకట్టుకుంటున్నారు. వారు ఆధ్యాత్మికత ముసుగులో కీర్తి ప్రతిష్టలు సంపాదించి ఒక దశలో దాన్నే ఆదాయ మార్గంగా మలుచుకుంటున్నారు. స్వలాభం కోసం స్వార్ధ ప్రయోజనాల కోసం చేసేది మంచి పనే అయినా చెడు పనికిందే లెక్క. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న సాధువులు, ప్రవచన కర్తలు సమాజాన్ని తప్పుదోవ పట్టించకుండా వివేకంతో మసలుకోవాలి. తమ శక్తియుక్తులను సమాజ శ్రేయస్సుకు ధారపోయాలే కానీ మాయమాటలతో ఆధ్యాత్మిక వేదికను ధనార్జనకు పనిముట్టుగా మార్చుకునే ప్రయత్నం చేయకూడదు.
కృష్ణం వందే జగద్గురుమ్
ఆర్ సి కుమార్
ఆర్ సి కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే
ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.
పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్ బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.
రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం అందజేశారు.
కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు.
వందనం, ఆర్ సి కుమార్
(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్)
సామాజికవేత్త
Comments