
'Hithabodha' - New Telugu Story Written By Sudarsana Rao Pochampally
Published In manatelugukathalu.com On 05/11/2023
'హితబోధ' తెలుగు కథ
రచన : సుదర్శన రావు పోచంపల్లి
కనకయ్యకు భార్య సుందరమ్మ, ఇద్దరు కూతుర్లు వాసంతి- పరిమళ- మధ్యతరగతి కుటుంబము. పారంపర్య ఆస్తి లేకున్నా నిజాయితీగా సంపాదించి పొదుపు పాటిస్తాడు. ఇద్దరు కూతుర్లను గ్రాడువేషన్ వరకు చదివిస్తాడు.
మంచి సంబంధాలు చూసి ఇద్దరికీ పెళ్ళి చేస్తాడు.
కూతుర్లు బుద్ధి గలిగిన వాళ్ళైనా వాళ్ళను అత్తవారింటికి పంపేముందు ఆలోచిస్తాడు- నా దగ్గర ఇంత చనువుగా ఆప్యాయతగా పెరిగినోళ్ళు అత్తవారింట్లో ఏ పొరపాటు చేసికష్టాల పాలౌతారో అని.
వాళ్ళకు కనబడకుండా కళ్ళను తుడుచుకుంటు గద్గద స్వరం చెబుతాడు “అమ్మా! నేటి నుండి మీది మరో ప్రపంచం. మాదగ్గర అనుభవించిన చనువు- ఆప్యాయత అనురాగం అక్కడ నీ ప్రవర్తనే సమకూరుస్తుంది. అత్తతో మొండిగా గర్వంగా మగనితో తూష్ణీంభావముతో మెలుగకు. ఇకనుండి మీ అమ్మను అత్తలో చూసుకో- మీ మామగారిలో మీ నాన్నను చూసుకో- తమ్ముడు లేకున్న తమ్ముల అనుభూతి మరుదుల దగ్గర పొందుటే శ్రేయస్కరం.
ఇల్లు నాది అను భావనతో చక్కదిద్ద చూసుకోవాలి- కాని కించిత్ గర్వము కనబర్చ గూడదు- పనివాళ్ళు చాటుగా కూడా నీ పట్ల చిన్న చూపుగా భావించె పరిస్థితి రానీకు.
భర్తతో అనురాగము పెంచుకో-స్నేహ భావమే ఆదర్శనీయము- అహం మొత్తము చంపుకోవాలి. ఇలాంటి ఎన్నో హితబోధలు చేస్తాడు ఇద్దరు కూతుర్లకు కనకయ్య- సుందరమ్మ కూడా భర్తను బలపరుస్తుంది.
పెద్ద కూతురు వాసంతి మాత్రము అత్తవారింటి పరిస్థితులను చూసి సహించలేక పోతుంది. మగని ప్రవర్తన జుగుప్సా కరంగ తోస్తది. తండ్రి చెప్పిన హితబోధ అంతా గాలికి ఒదిలేసి చీటికి మాటికి తగవులకు దిగుతుంది- వాసంతి మొండితనము భరించే ఓపిక లేని భర్త ఒకసారి వాసంతిపై చేయి చేసుకోవడము గూడా జరుగుతుంది- అప్పుడు కృష్ణుడు పారిజాత పుష్పము రుక్మిణికీయగా సత్యభామ ఉగ్ర రూపము దాల్చినట్లుగా కోపోద్రేకముతో నేను ఇక ఒక్క క్షణమైనా ఇక్కడ ఉండబోను మా పుట్టింటికి పోతాను అని సూట్ కేస్ లో బట్టలు సర్దుకొని తల్లిగారింటికి పోతుంది.
అదేమి ఖర్మనో కాని వాసంతి ఇల్లు చేరే వరకు ఇంటి ముందర జనము కూడి ఉంటారు ఎవరి ముఖము చూసినా నిర్విణ్ణముగా గోచరిస్తుంది- లోనికి పోయిన వాసంతి తల్లి దండ్రులు కరెంట్ షాక్ కు గురై చనిపోయిన విషయము గ్రహించి నిర్ఘాంత పోయి గొల్లున ఏడ్వడము తల్లిదంద్రుల శవాలపై బడి ఇక నాకు దిక్కెవరని మరీ మరీ విలపిస్తుంది.
చుట్టుప్రక్కల వారే ఓదార్చి కొన్ని నీళ్ళు తాపుతారు. ఇంతలో చెల్లెలు పరిమళ ఆమె భర్త అత్త మామలు కూడా వస్తారు- వాళ్ళను చూసి మరియొకమారు దుఖఃము ఉప్పొంగి వస్తూ చెల్లెలును కౌగలించుకొని ఏడుస్తుంది.
పరిమళ అత్తమామలే ఇద్దరక్క చెల్లెళ్ళను ఓదారుస్తారు- ఇక తక్కిన కార్యక్రమాలన్ని పరిమళ భర్తనే నిర్వహించ పూనుకొని మా అత్త మామలు కూడా తలిదండ్రులతో సమానము అంటాడు- మా అబ్బాయికి ఇంత విశాల హృదయమా అని లోలోపల సంతసించి కర్మకాండకు పూనుకొమ్మంటారు. జనము అనుకుంటారు పరిమళమ్మ అత్తమామల, మగని ఆదరాభిమానాలు చూరగొనుటచే వాళ్ళు ఈ సాహసమునకొడిగట్టినారు- వాసంతి భర్తగాని, అత్తమామలు గాని రాక పోవడము ఈమె ప్రవర్తనే కాబోలు అనుకుంటారు- అది చెవిన బడ్డ వాసంతికి పుండు మీద కారము జల్లినట్టుగా ఉంటుంది.
పండ్రెండు రోజులకు కార్యక్రమాలన్ని ముగిసి ఎవరి దారి వారు పడుతారు- వాసంతి ఒక్కతే ఇంట్లో ఉండవలసి వస్తుంది- అప్పుడు అనుకుంటుంది అహం ఎంత చెడ్డదోకదా అని- ముందుచూపుతో అమ్మ నాన్నలు చేసిన హితబోధ అర్థం చేసుకోక ఈ పరిస్థితి తెచ్చుకుంటిని అని వాపోతుంది.
గత్యంతరం ఏమిటి అని ఆలోచించి అదే ఇంట్లో ఉండి ఏదేని ఉద్యోగము చేస్తాననుకుంటది వాసంతి.
వాసంతి తలిదండ్రులు చనిపోయిన విషయము తెలిసినా వాళ్ళదీ మూర్ఖపు పట్టే గనుక కనీస మర్యాద పాటించుటకు ఇద్దరక్క జెల్లెళ్ళను మందలించుటకు రానిష్టపడరు.
చివరకు వాసంతి ఒక్కతే దృఢ చిత్తం తో అదే ఇంట్లో ఉండసాగింది- తల్లిగారింటిమీద ధ్యాస కలిగినప్పుడు చెల్లెలు పరిమళ కూడా వచ్చి పోవుడు చేస్తుంది- అదే వాసంతికి తృప్తినిచ్చే విషయము. .
సమాప్తం.
***
సుదర్శన రావు పోచంపల్లి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
https://www.youtube.com/channel/UCP4xPLpOxrVz33eo1ZjlesQ
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
https://www.facebook.com/ManaTeluguKathaluDotCom
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
https://www.manatelugukathalu.com/profile/psr
పేరు-సుదర్శన రావు పోచంపల్లి
యాదాద్రి భువనగిరి జిల్లాలోని జిబ్లక్పల్లి గ్రామము.(తెలంగాణ.)
వ్యాపకము- సాహిత్యము అంటె అభిరుచి
కథలు,శతకాలు,సహస్రములు,కవితలు వ్రాస్తుంటాను
నేను విద్యాశాఖలో పనిచేస్తు పదవి విరమణ పొందినాను,
నివాసము-హైదరాబాదు.