క్షీణిస్తున్న మానవ సంబంధాలు
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- May 22
- 4 min read
#KsheenisthunnaManavaSambandhalu, #క్షీణిస్తున్నమానవసంబంధాలు, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguArticleOnHumanRelations

Ksheenisthunna Manava Sambandhalu - New Telugu Article Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 22/05/2025
క్షీణిస్తున్న మానవ సంబంధాలు - తెలుగు వ్యాసం
రచన: కందర్ప మూర్తి
ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాల విషయమై ఎంత తక్కువ మాట్లాడితే అంత ఉత్తమం. పాతతరం పెద్దలు నేడు సమాజంలో జరుగుతున్న మార్పులను తలచుకుంటూ బాధపడాల్సి వస్తోంది.
పాతతరం రోజుల్లో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ కారణంగా కుటుంబ పెద్ద ఏది చెబితే అది అమలవుతుండేది. అందరూ ఒకే మాట మీద ఉండేవారు. అన్నదమ్ములు కలసిమెలసి పెద్దల సలహా మేరకు పనులను చక్కబెట్టేవారు. ఎవరికి కష్టం వచ్చినా మిగతావారు ఆదుకునేవారు. అప్పట్లో కుటుంబ ఆప్యాయతలకు విలువ ఇచ్చేవారు. ఎవరి సంపాదన ఎంతైనా కుటుంబ యజమానికి అందజేస్తేవారు.
ఏ వర్గం వారైనా క్రమశిక్షణ, కట్టుబాట్లతో కుటుంబ సభ్యులు జీవితం సాగించేవారు. తప్పు జరిగితే దండనల ద్వారా సరిచేసేవారు.
ప్రస్తుత నవతరంలో వినోద మాధ్యమాలు అంటే సినిమాలు, టీవీలు, మొబైళ్ళు సమాజంపై ఎంతో ప్రభావాన్ని చూపుతున్నాయి. యువత తేలికగా వాటి ఆకర్షణకు లోనై తమ భవిష్యత్తును నిర్వీర్యం చేసుకుంటున్నారు. కొత్తగా వచ్చే సినిమాలు, టీవీలలోని అశ్లీల సన్నివేశాలు, హత్యలు, దోపిడీలు, మానభంగాలు, దొంగ నోట్ల ముద్రణ, మాదకద్రవ్యాల రవాణా, ఆర్థిక నేరాలు, బ్యాంకుల మోసాలు ఇలా అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదనకు మోజు పెరిగిపోతోంది. చిన్న వయసులోనే దురలవాట్లకు లోనై ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నారు.
ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం వల్ల తల్లిదండ్రులు పిల్లలను సరైన క్రమశిక్షణలో ఉంచలేకపోతున్నారు. పెద్దలంటే గౌరవం లేదు. ఇంట్లో వయోవృద్ధులు ఉంటే వారిని వ్యర్థులుగా భావిస్తూ అగౌరవంగా ప్రవర్తిస్తున్నారు. గురు-శిష్యుల బంధం నశించింది. గురువులపై చిన్న చూపు పెరిగింది. తరగతులలో గురువులను బహిరంగంగా అవమానపరుస్తున్నారు. గురువులు దండన చేస్తే తల్లిదండ్రులే విద్యాలయాల్లోకి వచ్చి దాడులు చేస్తూ పిల్లల్ని వెనకేసుకువస్తున్నారు.
పెద్దలు మిగిల్చిన ఆస్తి విషయంలో అన్నదమ్ముల మధ్య మనస్పర్థలు, అక్కచెల్లెళ్ల మధ్య అపోహలు పెరిగిపోతున్నాయి. తల్లి ఆస్తి తన పేరున రాయలేదని కొడుకుల మధ్య తగవులవల్ల హత్యల వరకు వెళ్తున్నారు. వృద్ధాప్యంలో అమ్మానాన్నలను వృద్ధాశ్రమాలకు అప్పగిస్తున్నారు.
ప్రేమలో పడిన భార్య భర్తను హత్య చేయడం, కన్న కూతురిని/కొడుకును చంపేయడం వంటి కఠిన సంఘటనలు మనం చూస్తున్నాం.
రాజకీయ కారణాలతో కూడా కుటుంబ సభ్యుల మధ్య అపోహలు పెరిగి, ఆప్యాయతలు, అనుబంధాలు నశిస్తున్నాయి.
టీవీ సీరియల్స్లో అత్తలు కోడళ్లను, కోడళ్లు అత్తలను హింసించడం, అన్నదమ్ముల మధ్య తగవులు రగల్చడం వంటి విషయాలు కుటుంబాలలో చిచ్చు పెడుతున్నాయి. ఇటువంటి వ్యాపార ధోరణి సీరియల్స్కి అలవాటు పడి నేటి సామాన్య మహిళలు అర్జంటు పనులను కూడా వదిలేసి చూడడం అలవాటుగా మారింది.
ఉమ్మడి కుటుంబ వ్యవస్థలో వయోవృద్ధులు అంటే తాతలు, అమ్మమ్మలు, నానమ్మలు వంటి వారు పిల్లలను చేరదీసి తీరిక సమయాల్లో వారికి విద్య, మానవ సంబంధాలు, నీతి కథలు, పురాణ ఇతిహాసాల గురించి వివరించేవారు. అందువల్ల పిల్లల్లో ఐక్యత, ప్రేమానురాగాలు, సహాయసహకార భావం, పెద్దల పట్ల గౌరవం, దయాగుణం అలవడేవి. పాఠశాలల్లో గురువులు కూడా నైతిక విలువలు, దేశభక్తిని పెంపొందించేవారు.
అప్పట్లో గ్రామాల్లో ఉండే రైతులు, కులవృత్తుల వారు వ్యవసాయం మీద ఆధారపడి కలిసిమెలిసి జీవించేవారు. అధిక ఆదాయం కోసం ఆశపడకుండా గ్రామాలను నమ్ముకుని నిశ్చింతగా జీవించేవారు.
ప్రస్తుతం యంత్రయుగంలో ఆధునిక జీవన విధానాన్ని అలవాటు పడి గ్రామాలను వదిలి పట్టణాల వైపు పరుగులు తీస్తున్నారు. శరీర శ్రమ అవసరం లేని యంత్రాలు అందుబాటులో ఉండటం వల్ల నాజూకుగా జీవితం గడుపుతూ, ఆడంబరాల వైపు మొగ్గు చూపుతున్నారు. డబ్బు సంపాదన కోసం కన్నవారిని, ఊరిని వదిలి విదేశాలకు వెళ్తున్నారు.
సినిమా మాధ్యమం కూడా సమాజంపై ప్రభావం చూపుతున్నది. ఇటీవల వచ్చిన "బలగం" అనే చిన్న బడ్జెట్ చిత్రం, తెలంగాణా గ్రామీణ నేపథ్యాన్ని సున్నితంగా చిత్రీకరించింది. పల్లెజనం పారదర్శక తెరలు ఏర్పాటు చేసి సినిమాను చూశారు.
కుటుంబ యజమాని వార్ధక్యంలో మనోవేదనతో చనిపోతాడు. హిందూ సంప్రదాయం ప్రకారం చనిపోయినవారికి దశదిన కర్మకాండలు నిర్వహించి ఇష్టమైన వస్తువులు తర్పణంలో పెడతారు. వాటిని కాకులు తింటే ఆత్మ సంతృప్తి చెందిందిగా భావిస్తారు. కానీ ఆహారాన్ని కాకులు తినక పోవడంతో, కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతారు. చివరికి మనుమడు కుటుంబ సభ్యుల ఫోటోతో వచ్చి అందరూ కలసి తర్పణం చేసినప్పుడు కాకి రూపంలో జీవాత్మ ఆహారాన్ని ముట్టుకొని సంతృప్తి చెంది పోతుంది. ఇదే కథాంశం.
ఈ సినిమా చూసినవారు – దూరంగా ఉన్న అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు – మనస్పర్థలు వదిలి మళ్లీ కలుసుకున్నారు. దర్శకుడు అందరికి చెబదలచిన సందేశం — "కలిసి ఉంటే కలదు సుఖం."
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.
Comments