క్షీరసాగర మథనము - 21
- T. V. L. Gayathri
- Apr 9
- 2 min read
#TVLGayathri, #TVLగాయత్రి, #TeluguKavithalu, #Kavitha, #Kavithalu, #TeluguPoems, #KsheerasagaraMathanamu, #క్షీరసాగరమథనము, #తేటగీతి

(శ్రీమహా భాగవతపురాణము నుండి అనువాదము )
Ksheerasagara Mathanamu - 21 - New Telugu Poems Written By T. V. L. Gayathri
Published In manatelugukathalu.com On 09/04/2025
క్షీరసాగర మథనము - 21 - తెలుగు పద్యాలు
రచన: T. V. L. గాయత్రి
ఇక క్షీరసాగర మథనము - 21 చదవండి..
110.
వచనము.
ఇవ్విధంబుగ నసుర సేనాధిపతులు వేడగా వారిని క్రీగంట చూచి మోహిని యిట్లు వచియించె.//
తాత్పర్యము.
ఈ విధంగా రాక్షసుల సేనాధిపతులు వేడుకోగా వారిని ఓరకంటతో చూచి మోహిని ఇలా చెప్పింది.//
111.
తేటగీతి.
"కశ్యపాత్మజుల్ మీరలు కాంత నేను
విబుధవరులెల్ల స్త్రీలను విశ్వశింప
లేరయా!మీకు కల్గును లేమి యనుచు
ధర్మకోవిదుల్ తెల్పిరి తగున మీకు?"//
తాత్పర్యము :
మీరు కశ్యపప్రజాపతి కుమారులు. పండితులైన వాళ్ళు స్త్రీలను నమ్మకూడదని, అలా నమ్మితే దరిద్రం పట్టుకుంటుందని శాస్త్రము తెలిసిన వాళ్ళు చెబుతూ ఉంటారు.మీరు నాతో ఇలా మాట్లాడటం మంచిదా? కాదు కదా!"//
112.
తేటగీతి.
కపట బుద్ధితో మోహిని కలకల నగి
పలుకు చుండగన్ దైత్యులు పడతిని గని
ప్రేమ నిండగాన్ మదిలోన విశ్వశించి
యమృత కలశంబునుంచిరా యతివ చెంత.//
తాత్పర్యము.
మోసం చేసే బుద్ధితో మోహిని ఇలా పలికి కిలకిలా నవ్వుతూ ఉంటే రాక్షసులు ఆమెను చూచి ప్రేమతో, విశ్వాసంతో ఆ మోహిని దగ్గర అమృత కలశాన్ని పెట్టారు.//
113.
తేటగీతి.
అమృత కలశమున్ గైకొని యతివ పలికె
"కార్యమేదియైనను మీరు కలహము విడి
నాదు చేష్టలన్ మదిలోన నమ్మవలయు
నుచిత రీతిలో పంచెద నొప్పుదలగ!"//
తాత్పర్యము.
ఆ మోహిని ఆ అమృత కలశాన్ని తీసికొని"మీ పని ఏదైనా కానివ్వండి!మీరు తగవును వీడి నేను చేసే పనులను నమ్మండి!మీకు చక్కగా అమృతాన్ని నేను పంచుతాను!"అని చెప్పింది.//
114.
వచనము.
మోహిని పల్కులు విని దైత్యులు"వల్లె"యనిరి.//
తాత్పర్యము.
మోహిని మాటలు విని రాక్షసులు"సరే"అని అన్నారు.//
(సశేషం )
క్షీరసాగర మథనము - 22 త్వరలో

టి. వి. యెల్. గాయత్రి.
పూణే. మహారాష్ట్ర.
Profile Link:
Comments