top of page

నవచైతన్యం

#Navachaithanyam, #నవచైతన్యం, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు


Navachaithanyam - New Telugu Story Written By Kandarpa Murthy

Published In manatelugukathalu.com On 18/06/2025

నవచైతన్యం - తెలుగు కథ

రచన: కందర్ప మూర్తి


అగ్రహారం బ్రాహ్మణవీధిలో ఇంటి వసారా వాలుకుర్చీలో కూర్చుని ఊరి పురోహితులు రామనాథశాస్త్రి పంచాంగం చూస్తున్నారు. 


"దండాలు బాబయ్యా ! "


"ఏరా అప్పలస్వామీ, ఇలా వచ్చావు ? "


"నా బొట్టికి లగ్గం సెయ్యాలనుకుంటున్నాను బాబూ ! దగ్గిరలో 

మూర్తం సూత్తారని తమ వద్ద కొచ్చినాను. "


"నీ కూతురు వయసెంతరా ? "


"మొన్న దీపావలి అమాస్యకి పదమూడెల్లి పద్దాలుగు వచ్చిందయ్య. మన ఊరి ఇస్కూల్లో తొమ్మిది సదువుతోంది. "


"అప్పుడే దానికి పెళ్లేమిట్రా ! చదువు కుంటానంటే చదివించు. పదో తరగతి పాసు కానివ్వు. " 


"లేదు బాబయ్యా, నా అక్క కొడుక్కిచ్చి లగ్గం సేద్దామనుకుంటున్నాను. ఆడు పదకొండు పాసయినాడట. మిలిట్రీకి పోతానంటున్నాడు. ఇక్కడే కూలో నాలో సేసుకుని బతకరా అంటే ఇనటం లేదు. మిలిట్రీకి పోయి నౌకరీ సేసుకుంటాడట. నా బొట్టె నిచ్చి లగ్గం సేసేస్తె ఇక్కడే పడుంటాడు." 


"ఆడపిల్లకి పద్దెనిమిది, మగపిల్లాడికి ఇరవై సంవత్సరాలు పూర్తవకుండా పెళ్లి చెయ్యకూడదు. " 


"అయ్యన్నీ పెద్దోల్లకి బాబయ్యా ! కూలీనాలీ సేసుకుని బతికేటి మా బోటోల్లకి ఎలా సాగుద్ది. దాని లగ్గం అయిపోతే నిచ్చింతగా ఉంటాది. మా అమ్మ ముసిల్ది లచ్చికి బేగె లగ్గం సెయ్యరా, సూసి సచ్చిపోతానంటది. 


మరేం సెయ్యాల. నా ఆడది కూడ అదే అంటోంది. అర ఎకరం ముక్క అమ్మి బొట్టికి లగ్గం జరిపేత్తే అత్తారింటికి పోతాది " ఏకరువు పెడుతున్నాడు సన్నకారు రైతు అప్పలస్వామి. 


ఇంటి లోపల్నుంచి ఈ సంభాషణ విన్న రామనాథశాస్త్రి గారబ్బాయి హైస్కూలు హెడ్మాష్టరు సుబ్రమణ్యం బయటి కొచ్చి, "అప్పలస్వామీ, నీ మేనల్లుణ్ణి నా దగ్గరకు పంపు. వాడితో నేను మాట్లాడుతా. లక్ష్మి తెలివైన పిల్ల. నీ కూతుర్ని పది పాసవనీ. ఆడపిల్లల్కి చిన్న వయసులో పెళ్లి చేస్తే చట్టరీత్యా నేరమే కాదు, ఆమె శరీర ఆరోగ్యానికి పుట్టబోయే పిల్లలకు మంచిది కాదు. 


ఇంట్లో చదువుకున్న ఆడపిల్లుంటే ఇల్లంతా వెలుగు. లోక జ్ఞానం తెలుస్తుంది. ఆరోగ్య విషయాలు తెలిసి ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంటాయి. వారి పిల్లలకు చదువు చెప్పుకో వచ్చు. 


ఒక దీపంతో పది దీపాలు వెలిగించినట్లు చదువుకున్న తల్లి ఉంటే ఇంట్లో పిల్లలందరూ విద్యాబుద్దులతో రాణించవచ్చు. బాధ్యత లు తీరి పోతాయని, ముసలోళ్లు చచ్చిపోక ముందే లగ్గం చేసెయ్యాలని పసిమొగ్గల జీవితాల్ని నాశనం చెయ్యకండి. 


ప్రభుత్వాలు ఆడపిల్లల చదువుల కోసం స్కావర్ షిప్పులు, సైకిళ్లు, మరెన్నో సౌకర్యాలు కలగచేస్తున్నాయి. మీలాంటి వెనుక బడిన వర్గాల వారికి ఎన్నో ఉధ్యోగావకాశాలు కలగచేస్తోంది. వాటిని ఉపయోగించు

కోండి." వివరించి నచ్చచెప్పేడు


"అలాగే చినబాబూ, సదువు లేనోల్లం. ఇయన్నీ మాకెలా తెలుత్తాయి. మా తాత ముత్తాతల కాడనుంచి ఇట్టాగే దినాలు గడిచిపోనాయి. దరమ పెబువులు, ఇన్ని ఇసయాలు తెలియ సెప్పినారు. నా మేనల్లుడిని తమ కాడికి పంపుతా. ఆడికో దారి సూపండి బాబూ, సిత్తం. సెలవిప్పించండి. " నమస్కరించి వెళిపోయాడు అప్పలస్వామి. 

 

"నమస్కారం మేస్టారూ! మీరు పిలిచారని మా మావయ్య

అప్పలస్వామి చెప్పినాడు " అంటు వినయంగా నిలబడ్డాడు చంద్రం. 


"అవునోయ్ చంద్రం ! మిలిటరీ కెళతావట. నీలాంటి యువకులు మిలిటరీలో చేరి దేశరక్షణకు ముందుకు రావడం మంచిదే. కాని వెనుక బడిన పల్లెల్లో నిరక్షరాస్యత, మూఢ నమ్మకాలు, అనారోగ్యాల కారణంగా అమాయక ప్రజలు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. ప్రభుత్వాలు డబ్బు ఖర్చుచేసి అనేక పథకాలు అమలు పరుస్తుప్పటికీ నిరక్షరాస్యత వల్ల అవి సఫలం కావటం లేదు. నీలాంటి చదువుకున్న యువకులు ప్రభుత్వ పథకాలు సద్వినియోగం చేసుకుని ఉపకార వేతనాలు పొంది ఉన్నత చదువులు పూర్తిచేసి గ్రామాల అభివృద్ధికి కృషి చెయ్యాలి. 


 నిరక్షరాస్యత కారణంగా నీ మావ అప్పలస్వామి పసిపిల్ల లక్ష్మిని నీకిచ్చి పెళ్లి చేసి బాధ్యత  తీర్చుకుందా మనుకుంటున్నాడు. మైనర్లకి పెళ్లి జరిపిస్తే చట్టరీత్యా నేరం. ఇటువంటి సాంఘిక దురాచారాలు నీలాంటి చదువుకున్న వారు ఊరి జనాలకు తెలియచెప్పాలి. 


నువ్వు పట్నమెళ్లి డిగ్రీ కాలేజీ అడ్మిషన్ ఫారం తీసుకురా. 

నీకు స్కాలర్ షిప్ వస్తుంది. డిగ్రీ కాలేజీలో చేరి నా దగ్గరికొస్తే ట్యూషన్ చెబుతాను. డిగ్రీ పూర్తయితే భవిష్యత్తులో ఏం చెయ్యాలో నేను చెబుతా" అన్నారు. 


సుబ్రమణ్యం మాస్టారి పర్యవేక్షణలో చంద్రం స్కాలర్ షిప్ పొంది డిగ్రీ పూర్తిచేసి బి. ఎడ్. ట్రైనింగై ప్రభుత్వ ఉపాధ్యాయుడయాడు. అగ్రహారం దాని చుట్టు గ్రామాల్లో యువతను అబ్యుదయ పరిచి చదువు, ఆరోగ్యం, రక్షిత త్రాగునీరు, పరిసరాల శుభ్రత, మూఢ

నమ్మకాల నిర్మూలన, ప్రభుత్వ పథకాల సద్వినియోగం, పర్యావరణ పరిరక్షణకి ఎంతో కృషి చేసాడు. 


మేనకోడలు లక్ష్మిని ఇంటర్ వరకు చదువు పూర్తి చేయించి

గ్రామ ఆరోగ్య సేవిక ( ఎ. ఎన్. ఎమ్. ) గా ట్రైనింగ్ అయిన తర్వాత గ్రామంలో పారిశుద్యం, శిసు మరణాల నివారణ, స్త్రీల ఆరోగ్య రక్షణకు ఎంతో సహాయ పడ్డాడు. 


చంద్రం సామాజిక సేవకు గుర్తింపుగా ఉత్తమ ఉపాధ్యాయుడిగా ప్రశంసా పత్రం జిల్లా కలెక్టరు గారి చేతుల మీదుగా పొందాడు. 


ఊరి పెద్దల సమక్షంలో సుబ్రమణ్యం మాస్టారి పర్యవేక్షణలో ఊరి పురోహితులు రామనాథశాస్త్రి గారి చేతుల మీదుగా అగ్రహార గ్రామ అభ్యున్నతికి పాటుపడిన యువజంట లక్ష్మి - చంద్రం ల పెళ్ళి అట్టహాసంగా జరిగింది. 

 

 సమాప్తం


కందర్ప మూర్తి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


  పూర్తి పేరు  :  కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి

  కలం పేరు :  కందర్ప మూర్తి

  పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.

  భార్య పేరు:   శ్రీమతి  రామలక్ష్మి

 కుమార్తెలు:


శ్రీమతి రాధ విఠాల, అల్లుడు  డా. ప్రవీణ్ కుమార్

              

శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్

                  

శ్రీమతి  విజయ సుధ, అల్లుడు సతీష్

                   

  విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే  పత్రికలలో  ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు  చదువులు,  విశాఖపట్నంలో  పోలీటెక్నిక్ డిప్లమో  కోర్సు చదివే రోజుల్లో  1965 సం. ఇండియా- పాకిస్థాన్  యుద్ధ  సమయంలో చదువుకు స్వస్తి  పలికి  ఇండియన్  ఆర్మీ  మెడికల్ విభాగంలో చేరి  దేశ సరిహద్దులు,  

వివిధ నగరాల్లో  20 సం. సుదీర్ఘ సేవల  అనంతరం పదవీ విరమణ  పొంది సివిల్  జీవితంలో  ప్రవేసించి 1987 సం.లో  హైదరాబాదు  పంజగుట్టలోని నిజామ్స్  వైద్య  విజ్ఞాన  సంస్థ  (నిమ్స్ సూపర్  స్పెషాలిటీ  హాస్పిటల్) బ్లడ్ బేంక్  విభాగంలో  మెడికల్ లేబోరేటరీ  సూపర్వైజరుగా  18 సం. సర్వీస్  చేసి  పదవీ  విరమణ  అనంతరం  హైదరాబాదులో కుకట్ పల్లి

వివేకానందనగర్లో  స్థిర  నివాసం.


సుదీర్ఘ  ఉద్యోగ  సేవల  పదవీ విరమణ  తర్వాత  మళ్లా  తెలుగు సాహిత్యం మీద  శ్రద్ధ  కలిగి  అనేక  సామాజిక కథలు,  బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా  బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ, 

బాలభారతం,  బాలబాట, మొలక,  సహరి,  సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి,  గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త  ఇలా  వివిధ  ప్రింటు, ఆన్లైన్  మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.


నాబాలల  సాహిత్యం  గజరాజే వనరాజు, విక్రమసేనుడి  విజయం రెండు  సంపుటాలుగాను, సామాజిక  కుటుంబ కథలు  చిగురించిన వసంతం,  జీవనజ్యోతి   రెండు  సంపుటాలుగా  తపస్వి మనోహరం పబ్లికేషన్స్  ద్వారా  పుస్తక రూపంలో  ముద్రణ  జరిగాయి.


 నా సాహిత్య  రచనలు  గ్రామీణ,  మద్య తరగతి,  బడుగు బలహీన   వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు  సమాజానికి  ఒక సందేశం  ఉండాలని  కోరుకుంటాను.


 


Comments


bottom of page