అపరాధ పరిశోధన - పార్ట్ 13
- Seetharam Kumar Mallavarapu
- 3 days ago
- 6 min read
#MallavarapuSeetharamKumar, #మల్లవరపుసీతారాంకుమార్, #అపరాధపరిశోధన, #AparadhaParisodhana, #TeluguSuspenseStories, #TeluguCrimeStory, #TeluguDetectiveStory, #TeluguInvestigativeJournalism, #Apana, #అపన

Aparadha Parisodhana - Part 13 - New Telugu Web Series Written By Mallavarapu Seetharam Kumar Published In manatelugukathalu.com On 16/06/2025
అపరాధ పరిశోధన - పార్ట్ 13 - తెలుగు ధారావాహిక
రచన, కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
జరిగిన కథ:
కొత్తగా ఎస్ పీ గా బాధ్యతలు చేపట్టిన దీక్షిత్, చేరిన రెండోరోజే ప్రతిపక్ష నాయకుడు శివరాం శర్మ హత్య కేసు పరిశోధించాల్సి వస్తుంది. హత్య జరిగిన కొద్ది గంటల్లోనే ఆ కేసు తాలూకు నిందితులు దొరికినట్లు వార్త వస్తుంది. ఆ వార్త విని ఆనంద పడేలోగా, ముందురోజే పరిచయమైన శివరాం శర్మ గారి మేనకోడలు, యూట్యూబర్ నీతూ శర్మ పైన హత్యా ప్రయత్నం జరిగినట్లు తెలిసి దిగ్భ్రాంతి చెందుతాడు.
ఇంటరాగేషన్ లో కిషన్, ఫయాజ్ లు తడబడతారు. మొదట లొంగని రంగా, బషీర్ దొరికాడని తెలియడంతో జంకుతాడు.
దీక్షిత్ ను చంపడం కోసం దాముకు సుఫారి ఇచ్చే ఏర్పాట్లు జరుగుతాయి. ఆ హత్యకు జాఫర్ ను ఉపయోగించు కోవాలనుకుంటాడు దాము. హంతకుడు రంగా, మునావర్ ను కాంటాక్ట్ చేస్తాడు. మరీ ఒత్తిడి వస్తే జాఫర్ నియమించినట్లు చెప్పమంటాడు మునావర్.
రెండో విడత విచారణలో నిందితులు తమను దాము నియమించినట్లు అంగీకరిస్తారు. దీక్షిత్ ఇంటికి డ్రైవర్ కోదండం సహాయంతో ఏసీ టెక్నీషియన్ లాగా వస్తాడు జాఫర్. ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం దీక్షిత్ ను రబ్బర్ బులెట్ తో కాలుస్తాడు జాఫర్. అవి నిజం బులెట్ లు అనుకోని దీక్షిత్ కు అడ్డం వస్తుంది నీతూశర్మ. ఆమెను తీసుకొని శివరాం శర్మ ఇంటికి బయలుదేరుతాడు దీక్షిత్.
ఇక అపరాధ పరిశోధన - పార్ట్ 13 చదవండి..
తమ వాహనానికి కాస్త ముందుగా ఒక బుల్ డోజర్ నిదానంగా వెళ్తూ ఉండటం గమనించాడు దీక్షిత్. తమ కార్ వేగాన్ని తగ్గించాడు కోదండం.
ఇందాక జరిగిన సంఘటనల తాలూకు ఆలోచనలనుండి తేరుకోలేదు నీతూ శర్మ.
"షూట్ చేసిన వ్యక్తి మీకు తెలుసా?" కోదండాన్ని ప్రశ్నించింది.
చెప్పాలా వద్దా అని సంశయిస్తున్నాడు కోదండం.
అది గమనించిన దీక్షిత్, "ఇదంతా మా ప్లాన్ లో భాగమే. పూర్తి వివరాలు మరో సందర్భంలో చెబుతాను. మనకు మరో ప్రమాదం పొంచి ఉంది. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది" అన్నాడు.
ఆమె మౌనంగా ఉండటం చూసి "ఏమిటి.. ఈ ప్రాబ్లమ్స్ టీవీ ఎపిసోడ్స్ లాగా ఒకదాని తరువాత ఒకటి వస్తున్నాయని భయపడుతున్నారా.. " అన్నాడు.
అంతలోనే “సారీ.. మీ ప్రాణాలను నాకు అడ్డుగా వేశారు. మీరు భయపడటమేమిటి?" అన్నాడు.
"ఆలోచించుకునే సమయం కూడా లేని ఆ సందర్భంలో అసంకల్పితంగా అడ్డు వచ్చాను. ఆ సమయంలో మిమ్మల్ని కాపాడాలనే ధ్యాస తప్ప మరో ఆలోచన లేదు. " అంది నీతూ శర్మ.
"ఏమైనా గుండుకు ఎదురుగా నిల్చోవడం అంత చిన్న విషయం కాదు మేడం గారూ!" అని అభినందించాడు కోదండం.
ఇంతలో ముందు వెళ్తున్న బుల్ డోజర్ స్లో అయింది.
తనుకూడా కారును స్లో చేశాడు కోదండం.
'ఓవర్ టేక్ చెయ్యడానికి కావలసిన గ్యాప్ ఉంది. అయినా నెమ్మదిగా వెళ్తున్నదంటే ఆ బుల్ డోజర్ ను రక్షణ కవచంగా వాడుకుంటున్నారన్న మాట. ' అనుకుంది నీతూశర్మ.
ఆమె ఆలోచనలు పసిగట్టిన దీక్షిత్, వెనక్కి తిరిగి, "కుడివైపు అటునుండి వస్తున్న ఒక వాహనం అదుపు తప్పినట్లుగా మన కారు మీదకు దూసుకువచ్చి, ముందు భాగాన్ని డాష్ ఇచ్చేలా ప్లాన్. అందుకు అడ్డమే మేము ఏర్పాటు చేసిన ఈ బుల్ డోజర్. ఇది మన కారుకు డాష్ ఇవ్వడానికి అడ్డంగా ఉంటుంది. " అన్నాడు దీక్షిత్.
"మై గాడ్.. ఈ వాహనం లేకుంటే మనకు యాక్సిడెంట్ ఖాయమన్న మాట" అంది నీతూ శర్మ.
"మనకు కాదు. మాకు మాత్రమే.. మీకు ఏ ఆపద జరగకూడదన్నది వాళ్లకు ఇవ్వబడ్డ ఆదేశం. కాబట్టి కారు ముందు భాగం మాత్రమే డామేజ్ కావాలి" చెప్పాడతను.
"ఎందుకలా?" అడిగింది.
మొదట్నుంచీ మీ ఫామిలీ పైకి అనుమానం తెప్పించేలా ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి కేసుల్లో నేర నిరూపణకు చాలా కాలం పడుతుంది. చనిపోయిన వారి పట్ల సానుభూతి మాత్రం వెంటనే పెరుగుతుంది. దాన్ని వాళ్ళు రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారు. ఆ సానుభూతిని ఓట్లుగా మార్చుకోవాలనుకుంటున్నారు. మీకేదైనా ప్రమాదం జరిగితే మీ కుటుంబంపై నింద మోపలేరు కదా.. అందుకే వాళ్ళు ఈ యాక్సిడెంట్ చాలా జాగ్రత్తగా చెయ్యాలి. అందుకు ఈ బుల్ డోజర్ పెద్ద అడ్డంకి. " చెప్పాడు దీక్షిత్.
కారును మరింత ఎడమవైపుకు తిప్పాడు కోదండం. బుల్ డోజర్ కాస్త రోడ్ కు మధ్యగా వచ్చింది. ఎదుటి వైపు నుండి వస్తున్న ఒక కార్ వెంటనే ఇటువైపుకి తిరగలేక పోయింది. బుల్ డోజర్ ను దాటాక ఇటువైపుకి తిప్పే ప్రయత్నం చేశారు. అప్పటికే దీక్షిత్ వెళ్తున్న కార్, బుల్ డోజర్ ను దాటి ముందుకు వెళ్లి పోయింది.
ఇటువైపుకు వచ్చిన కార్ ఎడమవైపు ఉన్న సిమెంట్ దిమ్మెను కొట్టుకొని ఆగిపోయింది.
దీక్షిత్ ఫోన్ మోగింది.
"బుల్ డోజర్ డ్రైవర్ కు ఏ ఆపదా లేదు కదా.. " అడిగాడు దీక్షిత్.
"లేదు సర్.. ఆ కార్ లో వాళ్ళను అదుపులోకి తీసుకున్నాము. మీరు ఆగాల్సిన అవసరం లేదు" చెప్పాడు అవతలి వ్యక్తి.
"అంతా అనుకున్నట్లే జరిగింది. ఇక శివరాం శర్మ ఇంటికి ప్రశాంతంగా వెళ్లొచ్చు" చెప్పాడు దీక్షిత్.
వీళ్ళు వెళ్లేసరికి మురళి అక్కడ సిద్ధంగా ఉన్నాడు.
"చూసావా మురళీ! అంతా అనుకున్నట్లే అయింది. నాకే ప్రమాదం జరగలేదు" అన్నాడు దీక్షిత్.
"నేరస్తులతో వ్యవహారం కదా.. దాముకు హ్యాండ్ ఇస్తానన్న ఆ జాఫర్ మనకే హ్యాండ్ ఇస్తే.. అందుకే నేను మీతో రావాలనుకున్నాను. " చెప్పాడు మురళి.
"మీ డ్యూటీ నీతూ శర్మగారు చేశారు" చెప్పాడు దీక్షిత్.
"థాంక్ యు మేడం. " అని ఆమెతో చెప్పి, "రండి సర్.. కింద హాల్లో డెడ్ బాడీ ఉంది. బంధువులు వచ్చి ఉన్నారు. మిమ్మల్ని మేడపైన గదికి తీసుకొని వెళ్తాను. ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా వచ్చి మిమ్మల్ని కలుస్తారు. " అన్నాడు మురళి.
శివరాం శర్మ ఇంట్లోకి వెళ్లేసరికి హాల్లోనే డెడ్ బాడీ ఉంది. ఫ్రీజర్ బాక్స్ లో ఉంచారు. పక్కనే విలపిస్తున్న శివరాం శర్మ భార్య దాక్షాయణి నీతూశర్మను చూడగానే దుఃఖం ఆపుకోలేక పోయింది. నీతూశర్మ ఆమెను కౌగలించుకొని ఓదార్చ సాగింది.
శివరాం శర్మ కొడుకులిద్దరూ దీక్షిత్ ను సమీపించారు.
"మీ గురించి విన్నాము. అసలు నేరస్థులను పట్టుకుని మా నాన్నగారి ఆత్మకు శాంతి కలిగించండి" అన్నాడు పెద్ద కొడుకు.
"పార్టీ వాళ్ళు మమ్మల్ని కలిసి ఒకరి మీద ఒకరు నిందలు మోపుకుంటున్నారు. నీతూ ఫ్యామిలీ మీద కూడా ఆరోపిస్తున్నారు. హత్య చేయించిన వాళ్ళను మీరే పట్టుకోవాలి. మేము మాత్రం మీ మీదే నమ్మకంతో ఉన్నాము" చెప్పాడు రెండో కొడుకు.
"హంతకుడిని ఎప్పుడో పట్టుకున్నాము. అతన్ని నియోగించిన వాళ్ళను కూడా పట్టుకోబోతున్నాము. తప్పకుండా నేరస్థులెవరూ తప్పించుకోకుండా చూస్తాము" చెప్పాడు దీక్షిత్.
"ఎస్పీ గారు ఒక క్రిమినల్ ను పట్టుకోవడానికి వెళ్ళాలి. ఈ లోగా క్లుప్తంగా మీకు తెలిసిన వివరాలేమైనా వుంటే చెప్పండి. ఎంత చిన్న విషయమైనా ఏదో ఒక విధంగా ఉపయోగ పడవచ్చు. ముందుగా మీకు చెప్పినట్లు ఎస్పీ గారు మేడమీది గదిలో ఉంటారు. మీరు, మీ అమ్మగారు ఆయనను కలవండి. " చెప్పాడు మురళి.
తరువాత దీక్షిత్ ను మేడపైకి తీసుకొని వెళ్ళాడు.
కొంత సేపటికి దాక్షాయణి గారిని మేడ పైకి తీసుకొని వచ్చింది నీతూ శర్మ.
"ఎస్పీ గారు అడిగిన వాటికి మీకు తెలిసిన సమాధానాలు ఇవ్వండి. ప్రశ్నలు పూర్తయ్యాక నాకు మిస్స్డ్ కాల్ ఇస్తే నేను వచ్చి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను" అంది.
“నువ్వు పక్కనే ఉండమ్మా. నీకు తెలియని రహస్యాలు నా దగ్గర లేవు" అంది దాక్షాయణి.
"అలా కాదు అత్తయ్యా. నేను బయటే ఉంటానుగా.. " అంటూ బయటకు నడిచింది నీతూ శర్మ.
"అడగండి ఎస్పీ గారు.. నాకు తెలిసినంతవరకు చెబుతాను' అందామె కళ్ళు వత్తుకుంటూ.
“ముందుగా శివరాం శర్మ లాంటి మంచి వ్యక్తి మరణానికి నేను చాలా బాధ పడుతున్నాను. ఈ సమయంలో మీ మానసిక స్థితి ఎలా ఉంటుందో నేను ఉహించగలను. కానీ ఒక్కొక్క సారి ఒక చిన్న ఇన్ఫర్మేషన్ కూడా మా ఇన్వెస్టిగేషన్ కు ఎంతో ఉపయోగ పడుతుంది. అందు కోసం మిమ్మల్ని కలిసాను. ముందుగా మీ కుటుంబ పరంగా ఏవైనా విబేధాలు ఉన్నాయా.. ఆలోచించుకుని చెప్పండి" అని అడిగాడు దీక్షిత్.
"లేవండీ. మేమెవ్వరం రాజకీయాలలో లేము. పిల్లలు వ్యాపారాల్లో ఉన్నారు. ఎవరి ఆస్తులు వారికి ఉన్నాయి. " చెప్పిందామె.
"దగ్గరి బంధువులతో విబేధాలు ఉన్నాయా.. అయన మరణం మీ వాళ్లెవరికైనా లాభిస్తుందా?” ప్రశ్నించాడు.
"లేదండీ. మా నీతూ ఫ్యామిలీ అంతా చాలా మంచి వాళ్ళు. ఇతర బంధువులతో పెద్దగా సంబంధాలు లేవు" చెప్పిందావిడ.
"తనకు శత్రువులు ఉన్నట్లు అయన ఎప్పుడైనా చెప్పారా?"
"లేదు సర్. అయినా పార్టీ విషయాలు, రాజకీయాలు ఆయన నాతో ఎప్పుడూ మాట్లాడరు. "
"పిల్లల్ని పార్టీలోకి తీసుకొని రావాలని చూడలేదా?" అడిగాడు దీక్షిత్.
వాళ్లకు రాజకీయాలు పడవు. ఆయన కూడా పార్టీ కోసం పని చేసిన వారికే విలువ ఇవ్వాలని చెబుతూ ఉంటారు" చెప్పింది దాక్షాయణి.
"అలా ఎవరి పేరైనా ఎప్పుడైనా చెప్పారా?"
"లేదు. కానీ పార్టీ పగ్గాలు తులసీనాథ్ అనే వ్యక్తి చేతిలో పడతాయేమో.. ఆలా జరిగితే పార్టీ నాశనమవుతుంది.. అని ఒకసారి అన్నారు" గుర్తుకు తెచ్చుకుని చెప్పిందామె.
'ఇంతవరకు వినని కొత్త పేరు బయటకు వచ్చింది' అనుకున్నాడు దీక్షిత్.
నీతూ శర్మకు మిస్స్డ్ కాల్ ఇచ్చాడు. ఆమె లోపలి రాగానే "మీ అత్తగారిని కిందకు తీసుకొని వెళ్ళండి. " అన్నాడు.
ఆమె వెళ్ళాక "శివరాం శర్మ గారి పిల్లలను పిలిపించండి" అని మురళితో చెప్పాడు.
మురళి కిందికి వెళ్లి శివరాం శర్మగారి కొడుకులని మేడమీదికి తీసుకొని వచ్చాడు.
"మీ నాన్నగారికి ఎవరైనా శత్రువులు ఉన్నారా?" అడిగాడు దీక్షిత్.
లేరని బదులిచ్చారు ఇద్దరూ.
"పోనీ ఆయన తరువాత ఎవరు పార్టీ లీడర్ అవుతారు?" అడిగాడు దీక్షిత్.
"మాకు పెద్దగా తెలీదు. మేము రాజకీయాల్లో వుంటే తప్పక మమ్మల్ని ఆదరించేవారు. కానీ నాన్నగారు ఏరోజూ ప్రశాంతంగా నిద్ర పోయింది లేదు. అందుకని మేము వ్యాపారాల్లోకి వెళ్లిపోయాం. సునీల్ వర్మ అనే పేరు అక్కడక్కడా వినిపిస్తోంది" చెప్పాడు పెద్ద కొడుకు.
"తులసీనాథ్ పేరు విన్నారా?" హఠాత్తుగా అడిగాడు దీక్షిత్.
'విన్నాము. ప్రస్తుతం కిందే ఉన్నాడు. అంత నమ్మదగ్గ వ్యక్తి కాదని నాన్నగారు అనేవారు" చెప్పాడు రెండో కొడుకు.
"సరే. మిమ్మల్ని మరోసారి కలుస్తాను. " అని వాళ్ళను వెళ్ళమన్నాడు. తరువాత మురళితో "ఆ తులసినాథ్ ను ఒకసారి పైకి రమ్మంటారా.. జస్ట్ పరిచయం కోసం అని చెప్పండి" అన్నాడు దీక్షిత్.
ఇంతలోనే భారీ ఆకారంతో ఉన్న ఒక వ్యక్తి గుమ్మం దగ్గర నిలుచుని, "మే ఐ కమిన్ సర్? ఐ యామ్ తులసినాథ్" అన్నాడు.
=========================================================
ఇంకా ఉంది
అపరాధ పరిశోధన - పార్ట్ 14 త్వరలో..
=========================================================
మల్లవరపు సీతారాం కుమార్ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ మల్లవరపు సీతారాం కుమార్ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నమస్తే! నా పేరు మల్లవరపు సీతారాం కుమార్. శ్రీమతి పేరు మల్లవరపు సీతాలక్ష్మి. ఇద్దరమూ రచనలు చేస్తుంటాము. ఇప్పటికి దాదాపు 25 కథలు మనతెలుగుకథలు.కామ్, కౌముది, గోతెలుగు.కామ్, సుకథ.కామ్ లాంటి వెబ్ మ్యాగజైన్ లలో ప్రచురితమయ్యాయి. స్వస్థలం నెల్లూరు. తెలుగు కథలంటే చాలా ఇష్టం. మనతెలుగుకథలు.కామ్ నిర్వహిస్తున్నాము.
Commentaires