top of page

వెన్నెల

#TVLGayathri, #TVLగాయత్రి, #Vennela, #వెన్నెల, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Vennela - New Telugu Story Written By - T. V. L. Gayathri

Published In manatelugukathalu.com On 15/06/2025

వెన్నెల - తెలుగు కథ

రచన: T. V. L. గాయత్రి


కాళహస్తి దేవాలయం. 

జనాలు కిటకిట లాడుతున్నారు. 

గుడి ప్రాంగణంలో ఆఫీసు రూము. టికెట్లు అమ్ముతున్నాడు భాస్కర్. 


రోజూ భాస్కరుకు అదే పని. ఆరోజు కూడా డ్యూటీ చేస్తున్నాడు. టైమ్ అయిపోయిందని టికెట్ కౌంటర్ మూసేసాడు. మళ్ళీ సాయంత్రం తెరవాలి. గుడిలో అటూ ఇటూ తిరుగుతుంటే ఏడుస్తున్న చిన్న పాప కనిపించింది. పాప ఒక్కతే ఉంది. బెదురు చూపులతో గుక్క పట్టి ఏడుస్తోంది. పాప తల్లిదండ్రులు అక్కడ లేనట్టుగా ఉంది. "పాప తల్లిదండ్రుల నుండి విడిపోయినట్లుంది "అంటూ మేనేజరు శివకాశికి చెప్పాడు భాస్కర్.. శివకాశి పరిగెత్తుకొని వచ్చాడు. సంవత్సరంలోపు పాప. ఏడుస్తోంది. 


"ముందు పాపకు తినటానికి ఏమన్నా తీసుకురా!"అన్నాడు శివకాశి. 


గబగబా గుడి బయట ఉన్న టిఫిన్ సెంటర్ దగ్గరికి వెళ్ళాడు భాస్కర్


పాపకు రెండు ఇడ్లీలు పొట్లాం కట్టించుకొని వచ్చాడు. 


"మెల్లగా తినిపించు! జాగ్రత్త! పొరపోకుండా మంచినీళ్లు పట్టు! నేను మైకులో అనౌన్స్ చేస్తాను!" అంటూ భాస్కరుకు పురమాయించి కదిలాడు శివకాశి. 


పాపను తీసికొని ఒక ప్రక్కగా కూర్చోబెట్టుకొని ఇడ్లీ తినిపించాడు భాస్కర్. సాయంత్రం అయ్యింది. పాపకోసం ఎవ్వరూ రాలేదు. పోలీసులు వచ్చారు. 


పాప ఫోటో తీసుకున్నారు. అయితే పాపను అనాథలు ఉండే హోముకు పంపించాలి. 


"సార్! మీరేమీ అననంటే పాపను నేను ఇంటికి తీసికెళ్తాను!" ఇన్స్పెక్టరుతో చెప్పాడు భాస్కర్. 


ఆలోచనగా భాస్కర్ వైపు చూశాడు ఇన్స్పెక్టర్ రవి. 


"మీ ఇంట్లో ఎవరెవరు ఉంటారు? పాపను జాగ్రత్తగా చూడాలి!"


"మా అమ్మ ఉంటుంది సార్! జాగ్రత్తగా చూసుకుంటాము సార్!" వినయంగా బదులిచ్చాడు భాస్కర్. 


తల పంకించాడు రవి. 


"భాస్కర్ దగ్గర భయం లేదు సార్! నెమ్మదైన వాడు" అని సర్టిఫికెట్ ఇచ్చాడు శివకాశి. 


"సరే! పొద్దునా సాయంత్రం పాపను మాకు చూపించాలి!" అన్నాడు రవి. 


"సరే సార్!" అంటూ పాపను ఎత్తుకున్నాడు భాస్కర్. 


అతడికి సంతోషంగా ఉంది. 

పాప అతడి దగ్గరే ఉంది. ఆఫీసులో కంప్యూటర్ దగ్గర పని చేస్తూ కూడా పాపను చూసుకున్నాడు. నాలుగుసార్లు పాపను బాత్రూంకు కూడా తీసి కెళ్లాడు. మధ్యాహ్నం పాపను ఆఫీసు రూములో నిద్రబుచ్చి వెళ్లి దగ్గర్లో ఉన్న బట్టల కొట్టుకు వెళ్లి రెండు గౌనులు, నిక్కర్లు తెచ్చాడు. 


ఎందుకో పాపను ఎత్తుకుంటే మనసుకు ఆనందం కలుగుతోంది. పాప తనది కాదు.. రేపు వాళ్ళ అమ్మా నాన్నా వస్తే పాప వెళ్లిపోతుంది. అయినా ముద్దొచ్చే పాపని ఒక రోజు తన ఇంట్లో ఉంచుకుందామనుకున్నాడు భాస్కర్. 


ఒక చేత్తో పాపని ఎత్తుకొని, మరో చేత్తో పాపకు కొన్న గౌన్ల సంచీ పట్టుకొని ఇంటికి వచ్చాడు భాస్కర్. 


తల్లి వర్ధనమ్మ వీధిలోనే కూర్చుని ఉంది. కొడుకు చంకలో పాపను చూసి గబగబా దగ్గరికి వచ్చింది. 


"ఎవర్రా?" అంటూ పాపను ఎత్తుకుంది. 

అంతా తల్లికి చెప్పాడు భాస్కర్. 

"బంగారంలా ఉంది పాపాయి!" అంటూ ముద్దు పెట్టుకుంది వర్ధనమ్మ. 


ఆ రాత్రి పాప నిద్ర పోయేదాకా పాపను ఆడిస్తూ గడిపారు తల్లి కొడుకులు. 


భాస్కర్ తండ్రి వీరయ్య కూడా గుడిలోనే పని చేసేవాడు. భాస్కర్ ఒక్కడే కొడుకు. 


చదువు ఎక్కువగా వంటబట్టలేదతడికి. 


"పోనీలే! మన దేవుడి దగ్గర పనిచేస్తాడు!" అన్నాడు శివకాశి. 


టెన్త్ క్లాసు వరకు ఎలాగో చదివి సర్టిఫికెట్ తెచ్చుకొని గుడిలో చేరాడు భాస్కర్. అతడికి కంప్యూటర్ వర్క్ నేర్పించి తన దగ్గర అసిస్టెంటుగా పెట్టుకున్నాడు శివకాశి. 


వీరయ్యకు స్వామీజీలు, సాధువులు అంటే పరమభక్తి. ఎప్పుడూ స్వాముల వెంట వెనకా తిరుగుతూ ఉంటాడు. కొడుకు ఉద్యోగంలో చేరాక వెళ్లి నెల్లూరు దగ్గర ఆశ్రమంలో చేరాడు. ఎప్పుడో ఆరునెలల కొకసారి వచ్చి ఇల్లు చూసి వెళుతూ ఉంటాడు. 


భాస్కరానికి యుక్త వయస్సు వచ్చాక తన అన్నకూతురు రాధను కోడలిగా చేసుకుందామనుకుంది వర్ధనమ్మ. 

"చదువు సంధ్యా లేకుండా గుళ్ళో పని చేసే వాడిని నేనెందుకు చేసుకుంటాను? నాకు తగిన వాడిని నేను వెతుక్కుంటాలే!" అంటూ నిర్లక్ష్యంగా మూతి తిప్పింది రాధ. 

మండిపోయింది వర్ధనమ్మకు. 


"ఆ! ఆ! వెతుక్కోవే! అయిన సంబంధం కాదని మిడిసి పడుతున్నావు? నా కొడుక్కు బంగారు తల్లి ఎక్కడో రాసి పెట్టే ఉంటుంది!" అని మాటకు మాట అంటించింది వర్ధనమ్మ. 


కానీ కొడుకుకు పెళ్లి చేయటం కష్టమని ఆమెకు తొందరలోనే తెలిసిపోయింది. ఆడపిల్లల కోరికలు వేలను దాటి లక్షలకు పరుగులు పెడుతున్నాయి మరి!


చూస్తుండగానే భాస్కరుకు ముప్పై ఏళ్ళు వచ్చాయి. ఒక్క సంబంధమూ కుదరలేదు. 


'అన్నిటికీ ఆ కాళహస్తీశ్వరుడే దిక్కు!' అనుకుంది వర్ధనమ్మ. 


వర్తమానానికి వస్తే


పాప ఇంటికి వచ్చి వారం అయింది. 

ఎవ్వరూ పాప కోసం రాలేదు. 

వర్ధనమ్మ, భాస్కరులు పాపకు జ్ఞానప్రసూనాంబ అని అమ్మవారి పేరు పెట్టుకున్నారు. 


భాస్కర్ ఇంటికి వస్తే చాలు ప్రసూన పరుగెత్తుకొని వస్తుంది. పాప చిన్న చిన్న అడుగులు వేస్తూ, వచ్చీరాని మాటలు పలుకుతుంటే ప్రంపంచాన్ని మర్చి పోతున్నాడు భాస్కర్. 


అప్పటికి పాప వచ్చి నెల అయింది. ఒక రోజు పోలీసు స్టేషన్ నుండి 'పాప తల్లి వచ్చింది' అంటూ కబురు వచ్చింది భాస్కరుకు. 


పాపను తీసికొని అదరా బదరాగా వెళ్ళాడతడు. 

ఆమె వయస్సు ఇరవై అయిదేళ్లు ఉండొచ్చు. 

తలవంచుకొని బల్ల మీద కూర్చుని ఉంది. 

పాపను చూడంగానే గబక్కున వచ్చి ఎత్తుకొని ముద్దులు పెట్టుకుంది. 


పాప తల్లిని చూచి చేతులు చాచి తల్లిని హత్తుకుంది. 

ఆమె పేరు ప్రతిమ. 


ఇన్స్పెక్టరు రవికి ఆమె కథంతా ఇలా చెప్పసాగింది. 


"సార్! మాది చిత్తూరు. మా నాన్న కిరణా కొట్లో గుమస్తా. అమ్మ వంటలు చేస్తుంది. నేను కాలేజీలో బియ్యే చదివాను. మిషన్ కుట్టటం కూడా నేర్చుకున్నాను. 


మా నాన్న తెచ్చే సంబంధాలు నాకు నచ్చేవి కావు.. నాకు డబ్బున్న వాడిని చేసుకోవాలనిపించేది. అందుకే రమేష్ అనే అతడిని ప్రేమించాను. అతడు నా కోసం డబ్బులు ఖర్చు పెట్టి కొంచెం ఖరీదైన బహుమతులు తెచ్చేవాడు. అతడి ఆకర్షణలోపడి నేను మా అమ్మావాళ్ళ మాట ఖాతరు చెయ్యలేదు. అతడితో హైదరాబాద్ లేచి పోయి పెళ్లి చేసుకున్నాను. కానీ కొద్ది కాలానికే తెలిసిన విషయం ఏమిటంటే రమేష్ పచ్చి మోసగాడు. అతడు నాలాంటి వాళ్లకు వల వేసి పెళ్లి పేరుతో మోసం చేసి వ్యభిచార గృహలకు అమ్మేస్తుంటాడని.. 


నేను అతడి నుండి తప్పించుకొని చిత్తూరు వచ్చాను. అప్పటికే నేను గర్భవతిని. అమ్మా నాన్న నా గురించి ఏడ్చినంత ఏడ్చారు. నేను ఇంట్లో ఉంటే మా చెల్లికి పెళ్లి కావటం కష్టమని నన్ను తిరుపతిలో ఉండే మా మేనత్త దగ్గర పెట్టారు. అక్కడే పాప పుట్టింది. పాప పేరు 'వెన్నెల' అని పెట్టుకున్నాను. మిషను కుట్టుకుంటూ డబ్బులు సంపాదించుకుంటూ మా అత్త దగ్గరే ఉంటున్నాను. 


అయితే మా అత్త తోడికోడలు కొడుకు సుభాషు నన్ను పెళ్లి చేసుకుంటానన్నాడు. అతడికి పాపను చూసుకోవటం ఇష్టం లేదు. పాపను అనాథాశ్రమంలో వదిలేయమని, సుభాషును పెళ్లి చేసుకొని హాయిగా ఉండమని మా అత్త పోరు పెడుతోంది. అత్తకు తోడుగా మా అమ్మానాన్న కూడా బలవంతం చేయసాగారు. నేను ఒప్పుకోలేదు. 


ఒక రోజు నేను బజారు కెళ్ళాను. వచ్చేసరికి పాప లేదు. నేను అత్తను అడిగితే ఆవిడ తనకు తెలియదంది. అప్పటి నుండి పాప కోసం ఫ్రెండ్స్ సహాయంతో వెతుకుతున్నాను. ఇప్పటికి పాప ఇక్కడ ఉందని తెలిసి వచ్చాను.. !

 

ప్రతిమ చెప్పింది ఓపిగ్గా విన్నాడు ఇన్స్పెక్టర్ రవి. 

"నువ్వు చెప్పింది నిజమని నమ్మేదెలా?ముందు డి ఎన్. ఎ. టెస్ట్ చేయిస్తాము! పాప నీ కూతురు అని రిపోర్ట్ వస్తే నీకు అప్ప చెప్తాము!"


ఒప్పుకుంది ప్రతిమ. 

బ్లడ్ టెస్టుకు తీసికొన్నారు అధికారులు. 


“రాత్రికి ఎక్కడ ఉండాలి?”


"మా ఇంటికి రండి! మా అమ్మ కూడా ఉంటుంది!" ప్రతిమతో చెప్పాడు భాస్కర్. 


అలా ఆ రోజు ప్రతిమ భాస్కర్ ఇంటికి వచ్చింది. 


ఆ రాత్రి పాపను పట్టుకొని నిశ్చింతగా నిద్ర పోయిందామె. 

రిపోర్ట్స్ వచ్చాయి. పాప డి. ఎన్. ఎ. ప్రతిమ డి. ఎన్. ఎ. ఒకటే అని చెప్పారు అధికారులు. 


"మళ్ళీ మీ వాళ్ళ దగ్గరకే వెళ్తావా?" ప్రతిమను అడిగింది వర్ధనమ్మ. 


"ఎక్కడికి వెళ్తాను? ఒక్క దాన్ని. ఎక్కడ ఉన్నా సమస్యలే.. "


"ఇక్కడే ఉండు! మా ప్రక్కయింట్లో మేడమీద గది ఖాళీగానే ఉంది. "


వర్ధనమ్మను చూస్తే ధైర్యంగా ఉంది ప్రతిమకు. 


ముఖ్యంగా పాపను ఎత్తుకుంటూ, ఆడిస్తూ ఉన్న భాస్కరును, వర్ధనమ్మను చూసాక లోకంలో ఇంత మంచి వాళ్ళు వుంటారా అనిపిస్తోంది. ఏ బంధుత్వమూ లేకపోయినా తన బిడ్డను నెలరోజులు కడుపులో పెట్టుకొని చూసుకున్నారు. వాళ్లకు చర్మం వలిచి చెప్పులు కుట్టించినా ఋణము తీరదు. 


అక్కడే ఉండి పోయింది ప్రతిమ. 


వారం తర్వాత ప్రతిమ తల్లిదండ్రులు వచ్చారు. వాళ్ళతో ఒక్క మాట అయినా మాట్లాడలేదు ప్రతిమ. 


"మేమేమన్నా దానికి హాని చేశామా! పిల్ల జీవితం బాగుండాలని కోరుకోవటం తప్పేనా?" ఆక్రోశ పడ్డారు వాళ్ళు. 


"మీకు మీ కూతురు అంటే ప్రేమ వున్నట్లే ప్రతిమకు కూడా తన పిల్ల అంటే ప్రేమ ఉండటం సహజం. ఇంకా కొంత కాలం ఓపిక పడితే ప్రతిమ ఎవరినైనా పెళ్లి చేసుకోవచ్చు! లేదంటే పాప పెద్దదయ్యి ప్రతిమను జాగ్రత్తగా చూసుకోవచ్చు! ఎవరు చూడొచ్చారు? నా కొడుకుకు ఇంతవరకు పెళ్లి కాలేదు. మా అయన సన్యాసిలాగా వెళ్లిపోయాడు. వీడి గురించి దిగులుగా ఉంటోంది. ఏం చేస్తాం? భగవంతుడు ఎలా రాసి పెట్టాడో మనకు తెలియదు!" వాళ్ళను సమాధాన పరిచింది వర్ధనమ్మ. 

వాళ్ళు చిత్తూరు వెళ్లారు. 

ప్రతిమ పని చేసుకుంటుంటే పాపను చూసుకొనేది వర్ధనమ్మ. పాపకు ఏం కావాలన్నా క్షణాల్లో తెచ్చి పెడతాడు భాస్కర్. సంవత్సరం గడిచింది. ప్రతిమ, భాస్కర్ అప్పుడప్పుడూ పాప భవిషత్తు గురించి మాట్లాడుకొంటూ ఉండేవాళ్లు. 


ఒక రోజు వర్ధనమ్మ కళ్లు తిరిగి పడిపోయింది. 

గుడిలో ఉన్నాడు భాస్కర్. 


 ప్రతిమ వర్ధనమ్మను హాస్పిటలుకు తీసికొని వెళ్లి చూపించింది. బి. పి. పెరిగింది అన్నాడు డాక్టర్. 

ఇంటికి వస్తూ "మనసులో ఏదైనా దిగులు ఉందా అంటీ!" అడిగింది ప్రతిమ. 


"వీడి గురించే ప్రతిమా! నేను కళ్ళు మూస్తే వాడికి దిక్కెవరు అనే ఆలోచనే.. "


మౌనంగా ఉంది ప్రతిమ. ప్రతిమ ముఖం చూసింది వర్ధనమ్మ. మెల్లగా గొంతు విప్పింది. 


"నువ్వు ఆడపిల్లవి! పైగా ఒక పెళ్లి విషయంలో దెబ్బతిన్న దానివి! నువ్వు పైకి చెప్పలేవు!.. మా వాడికి నువ్వంటే ఇష్టం ఉంది. కానీ బయట పడడు.. పాప అంటే ప్రాణం.. కానీ చనువు తీసుకోడు! నువ్వు చెప్పు! నా దగ్గర మొహమాటం వద్దు!! మా వాడంటే ఇష్టమేనా!"


వర్ధనమ్మ మొహం వడలిపోయి ఉంది. భర్త దూరంగా ఉంటాడు. కొడుకు మంచివాడే కానీ మొహమాటస్తుడు. ఆమెకు కొడుకు గురించి దిగులు. 


తలవంచుకొని ఆలోచిస్తూ ఉంది ప్రతిమ. 

'జీవితమంతాఒంటరిగా పాపతో జీవితాన్ని గడపాలంటే భయం వేస్తూ ఉంటుంది తనకు.. తోడుగా భాస్కర్ ఉంటే.. అతడు ఎక్కువ చదువుకో లేదు. సంపాదన అంతంత మాత్రం!.. అయితేనేం పొదుపుగా బ్రతికితే సరిపోతుంది. అన్నిటికంటే వెన్నెల అంటే పిచ్చి ప్రేమ. అది చాలదూ!.. '

వర్ధనమ్మ చెయ్యి పట్టుకుంది ప్రతిమ. ఆమె కళ్ళల్లో నీళ్లు. 

"నా కిష్టమే ఆంటీ!"అంది నెమ్మదిగా. 


ఇంకేమీ చెప్పాల్సింది లేదు. 


ఒక నెలరోజులకు ప్రక్కింటి మేడమీద గది ఖాళీ చేసి భాస్కర్ ఇంటికి వచ్చింది ప్రతిమ. 


తన ఇంటికి నిజంగా వెన్నెల వచ్చిందనుకొంది వర్ధనమ్మ. 



(సమాప్తం )


 T. V. L. గాయత్రి  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత్రి పరిచయం:

Profile Link:



నా పేరు తోకచిచ్చు విజయలక్ష్మీ గాయత్రి.(టి. వి. యెల్. గాయత్రి ). మా నాన్నగారు కీ. శే. పవని శ్రీధరరావు గారు. ప్రకాశంజిల్లా మొగలిచర్ల గ్రామంలోని శ్రీదత్తాత్రేయమందిరమునకు ధర్మకర్తగా బాధ్యతలు నిర్వహించేవారు. అమ్మగారు కీ. శే శ్రీమతి పవని నిర్మల ప్రభావతి గారు ప్రముఖ నవలా రచయిత్రిగా తెలుగు ప్రజలకు చిరపరిచితులు.


నా రచనావ్యాసంగం  2019 సంవత్సరంలో 'ఛందశాస్త్ర రత్నాకర' బిరుదాంకితులయిన శ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్యశర్మగారి దగ్గర పద్యవిద్య నేర్చుకోవటంతో ప్రారంభంమయింది.  శతకవిజయము(ఐదు శతకముల సమాహారం ), కవన త్రివేణీ సంగమం (మూడు కావ్యముల సమాహారం ) ప్రచురితములు. ఇప్పటి దాకా 25 సంకలనాల్లో పద్యాలు, కవితలు ప్రచురితములు. వివిధ పత్రికల్లో 200 దాకా పద్యాలు, కవితలు ప్రచురితములు. నేను వ్రాసిన సామాజిక ఖండికలకు 2023 తానా కావ్యపోటీల్లో తొమ్మిదవ స్థానం వచ్చింది. ఇప్పటివరకు 50 కథలు వ్రాసాను. అందులో 25 కథలకు  వివిధపోటీల్లో బహుమతులు వచ్చాయి. నేను వ్రాసిన వ్యాసాలు 20, రూపకాలు 25 కూడా వివిధ పత్రికల్లో ప్రచురితములు. 2022లో స్టోరీ మిర్రర్ వారు 'ది ఆథర్ ఆఫ్ ది ఇయర్ ' అవార్డు ఇచ్చారు. 2024లో సాయివనంలో సాహిత్యం వారిచే 'కవనరత్న 'బిరుదును అందుకొన్నాను.నేను వ్రాసిన నవల 'క్రొత్తనీరు' అచ్చంగా తెలుగు అనే అంతర్జాల పత్రికలో ధారావాహికంగా ప్రచురితమవుతూ ఉంది.




Comments


bottom of page