పితృ దేవతల కోరిక
- Srinivasarao Jeedigunta
- Jun 10
- 5 min read
#JeediguntaSrinivasaRao, #PithruDevathalaKorika, #పితృదేవతలకోరిక, #JeediguntaSrinivasaRao,#TeluguStory, #తెలుగుకథ

Pithru Devathala Korika - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 10/06/2025
పితృ దేవతల కోరిక - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
వారం రోజులనుంచి రాత్రి 12 గంటలకల్లా రామూర్తి కి మెలుకువ వచ్చేస్తోంది. ఎందుకో చనిపోయిన తల్లిదండ్రులు, అన్నగారు మగత నిద్రలో కలలోకి వచ్చి ఏదో తిడుతున్నాట్టు అనిపించడం, వెంటనే మెలుకువ వచ్చి నిద్రపట్టకపోవడం జరుగుతోంది.
భార్య కమలకి చెప్పితే, “రోజంతా ఆ రాజకీయ వార్తలు విని బుర్ర వేడిక్కించుకుంటున్నారు, అందుకే నిద్రపట్టడం లేదు. నేను మొత్తుకుంటోనే వున్నాను, భక్తి టీవిలో భాగవతం వస్తోంది కూర్చొని వినమని. నాకు చూడండి.. పడుకుంటే మళ్ళీ పనిమనిషి వస్తే గాని మెలుకువ రాదు” అంది.
“అంటే ఆ మొద్దు నిద్రకి భాగవతం వినడం వలనే అంటావా” అన్నాడు రామూర్తి.
“మీకు ఏది చెప్పినా వేళాకోళంగానే వుంటుంది. వద్దన్నాఆ టి షార్ట్స్ వేసుకుని తయారు అవుతారు, రాత్రికి దిష్టి తీస్తాను, హాయిగా నిద్రపడుతుంది” అంది కమల..
దిష్టి తీయడం వలన ఏమో రోజు 12 గంటలకు మెలుకువ వచ్చేది, ఆరోజు 12.30 కి మెలుకువ వచ్చింది. అయితే రోజులాగానే తల్లిదండ్రులు, అన్నగారు కలలోకి వచ్చారు. అర్ధం కాని విషయం మరి వాళ్ళతో పాటు వదినగారు ఎందుకు రావడం లేదో?.
భర్త అటు యిటు కదలడం తో కమలకి మెలుకువ వచ్చి, “ఏమిటి.. మళ్ళీ మీ వాళ్ళు కలలోకి వచ్చారా” అంది. “బతికి వున్నప్పుడు అలిగి మన గుమ్మం ఎక్కలేదు, పోయిన తరువాత యిలా పట్టుకుని వేలాడుతున్నారేమిటి” అంది.
“అవును.. మా అమ్మా, నాన్నా, అన్నయ్య వస్తున్నారు కానీ మా వదిన ఎందుకు రావడం లేదు, ఆవిడ వేరే లోకం లో వుందా?” అన్నాడు.
“బాగుంది వరస.. నాకెల్లా తెలుస్తుంది, నేను వెళ్లి చూసివచ్చినట్టు నన్ను అడుగుతారు” అంది అటు తిరిగి పడుకుంటో.
మంచం దిగి హాల్ లోకి వచ్చి కూర్చున్నాడు. గడియారం ఒంటిగంట చూపిస్తోంది. రేపు డాక్టర్ గారిని కలిసి తన బాధ చెప్పుకుని ఏదైనా మందు తీసుకోవాలి అనుకున్నాడు రామూర్తి.
డాక్టర్ గారు, చెప్పినవి విని బ్రెయినికి స్కానింగ్ చేసి చూడాలి అనడం తో, “పడుకోగానే నిద్ర బాగానే పడుతుంది, తరువాత కలలోకి మా వాళ్ళు రావడంతో నిద్రనుంచి లేచిన తరువాత నిద్రపట్టడం లేదు. మీరు చెప్పినట్టు స్కానింగ్ చేయించుకుంటే స్కానింగ్ లో మా తల్లిదండ్రులు కనిపిస్తారా?” అని అమాయకంగా ఆడిగాడు రామూర్తి.
“అది చెప్పలేను కానీ, మీ బ్రెయిన్ బాగుందా, లేకపోతే తరువాత రోజులలో బ్రెయిన్ డెడ్ అవుతుందా తెలుసుంది” అన్నాడు.
“సరే డాక్టరుగారు, ఈ రోజు కలలో మా నాన్నగారిని అడిగి, ఆయన స్కానింగ్ చేయించుకోమంటే అప్పుడు వస్తాను” అన్నాడు లేచి నుంచుని రామూర్తి.
“కలలోకి వచ్చిన వాళ్ళని ఎలా అడుగుతారండి, ముందు స్కానింగ్ చేయించుకుంటే, మీకు మధ్యలో మెలుకువ రావడానికి కారణం తెలుస్తుంది” అన్నాడు డాక్టర్.
“డబ్బు, కార్డు తీసుకుని రాలేదు, రేపు ఉదయం వస్తాను” అని చెప్పి, బయటకి వచ్చి డాక్టర్ గారి రిసెప్షన్ అసిస్టెంట్ ని ఆడిగాడు, “ఏమిటి మీ డాక్టర్ గారు స్కానింగ్ మీషిన్ కొత్తగా కొన్నాడా” అని.
“అవును సార్, మీతో బోణి అయితే నా జీతం వచ్చేది” అన్నాడు నీరసంగా.
బాగానే వుంది మంచి డాక్టర్ దగ్గరికే వచ్చాను అనుకుని, బయట టీ షాపులో టీ తాగి, మెల్లగా నడుచుకుంటూ వెళ్తున్న రామూర్తి కి ఎమ్ ఎస్ సుబ్బలక్ష్మి గారి భజగోవిందం రామాలయం నుంచి వినిపించడంతో, గుడివైపుకి నడిచాడు.
గుడిలో పూజారి గారు ఒక్కరే కూర్చొని సుందరకాండ పారాయణం చేసుకుంటున్నారు. రామూర్తిని చూసి లేచి, తీర్థం గిన్నె తీసుకుని తీర్ధం యిచ్చి, మళ్ళీ గోడకి అనుకుని కూర్చుని పుస్తకం చదువుకోవడం మొదలుపెట్టారు.
రామూర్తి ఆయన దగ్గరికి వెళ్లి “స్వామి, నాకు ఒక విషయంలో మీ సలహా కావాలి అడగమంటారా” అన్నాడు.
పూజారి గారు పుస్తకం పక్కన పెట్టి, “కూర్చొని చెప్పండి” అన్నారు.
రామూర్తి తనకి “రోజూ అర్ధరాత్రి కలలో చనిపోయిన తన తల్లిదండ్రులు, అన్నగారు వచ్చి, ఏదో చెపుతున్నారు, అర్ధం కావడం లేదు, వెంటనే మెలుకువ వచ్చి, తరువాత నిద్రపట్టడం లేదు. ఎందుకు వాళ్ళు నాకు రోజూ కలలోకి వస్తున్నారు” అని ఆడిగాడు.
దానికి పూజారి గారు, “మీ తల్లిదండ్రుల పేరు, అన్నగారి పేరు ఏమిటి?” అని అడిగి తెలుసుకుని, “ఊరిలో వున్న సీతమ్మ గారి అన్నదానం సెంటర్ సుబ్బారావు గారు మీ అన్నగారన్నమాట” అని అన్నారు.
“అవును స్వామి మా తల్లిదండ్రులకి నేను, మా అన్న సుబ్బారావు ఇద్దరమే పిల్లలం. మేము యిద్దరం బాగా చదువుకుని మంచి ఉద్యోగాలు చేసి రిటైర్ అయ్యాము. నాకు ఇద్దరు పిల్లలు, వాళ్ళు ఉద్యోగరీత్యా అమెరికాలో వున్నారు. మా అన్నగారికి పిల్లలు లేరు. అతనే మా అమ్మగారి పేరున తనకున్న యింట్లో అన్నదాన సెంటర్ పెట్టి రోజూ యాభై, అరవై మందికి భోజనం పెట్టేవాడు” అన్నాడు.
“అది నాకు తెలుసు, మీ అన్నగారు కూడా గుడికి వచ్చే వారు. సరే మీ తల్లిదండ్రుల తిధి ఎవరు పెడుతున్నారు” అని అడిగారు పూజారి గారు.
“పెద్దవాడిగా మా అన్నగారే పెట్టేవాడు, ఆయన పోయి పదినెలలు అయ్యింది, మొన్న డిసెంబర్ లో మా నాన్నగారి తిధి, పెద్దవాడు మా అన్నయ్య లేడు కదా, నాకు అర్హత లేదని పెట్టలేదు” అన్నాడు.
“చాలా తప్పు చేసారు మూర్తి గారు, యిప్పుడు మీరే మీ నాన్నగారికి పెద్దకొడుకు. మీరు తప్పక మీ తల్లిదండ్రుల తిధి తోపాటు మీ అన్నగారికి కూడా యిహనుంచి తిధి పెట్టాలి. ఎంతో మంది ఆకలితో మీ తల్లిగారి పేరున వున్న అన్నదాన సెంటర్ కి వచ్చి, తలుపులు వేసి వుండటం తో నిరాశ తో తిరిగి వెళ్లిపోవడంతో కూడా మీ అన్నగారి ఆత్మ బాధ పడి రోజూ మీ తల్లిదండ్రులు, అన్నగారు మీ కలలోకి వచ్చి మీకు వాళ్ళ బాధ చెప్పుకుంటున్నారు. అయితే అది మీరు అర్ధం చేసుకోలేక బాధ పడుతున్నారు” అన్నాడు పూజారి గారు.
“పోయిన వాళ్ళకి యింకా యిటువంటి కోరికలు వుంటాయా” అన్నాడు మూర్తి.
“మీ తల్లిదండ్రుల శరీరం నుంచి మీరు, మీ అన్నగారు వచ్చారు, వాళ్ళు పోయినా మీ శరీరం వున్నంతవరకు మీతో సంబంధం వుంటుంది. వాళ్ళు వదిలేసిన మంచి పనులు మీరు చేయాలని వారి కోరిక” అన్నారు పూజారి గారు.
“అయితే యిప్పుడు నేను ఏమిచేయాలి చెప్పండి స్వామి” అన్నాడు రామూర్తి.
“ముందుగా మీరు గయా క్షేత్రం కి వెళ్ళి మీ నాన్నగారికి తిధి పెట్టి వచ్చి, మీ అమ్మగారి పేరున వున్న అన్నదానం సెంటర్ ని తిరిగి తెరిచి మీకు వీలున్నంత మంది ఆకలి తీర్చండి. ఈ గుడికి వచ్చే కొంతమంది ధనవంతుల చిరునామాలు యిస్తాను. వాళ్ళ సహాయం కూడా తీసుకుని అన్నదాన సెంటర్ ని నడిపించండి. మీ పుత్రులని కూడా ఇందులో బాగస్వాములని చేయండి. అంతా మంచి జరుగుతుంది” అని పూజారి గారు లేచి గర్భగుడి లోకి వెళ్ళి సీతారాములకి నమస్కరించి, రెండు ప్రసాదం దొప్పేలు తీసుకుని వచ్చి రామూర్తి చేతిలో పెట్టి అక్షింతలు వేసారు.
పూజారి గారు చెప్పింది నిజమేనా, అన్నయ్య అన్నదానం సత్రం మూత పడితే నాకు ఏమి సంబంధం, అనుకుంటూ ఇంటికి చేరి ప్రసాదం భార్య చేతికి యిచ్చి, “గుడికి వెళ్లాను, ప్రసాదం నీకు, నాకు” కాళ్ళు కడుగుకుని వచ్చి సోఫాలో కూర్చొని ప్రసాదం కళ్ళకి అద్దుకుని తింటూ జరిగిన విషయం అంతా భార్య కి చెప్పాడు.
“రేపు ఉదయమే మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి బాగుచేయించి, మళ్ళీ అన్నదానం మొదలుపెట్టాలి” అన్నాడు.
“మనతో అవుతుందా యింత పెద్ద పని?” అంది భార్య కమల.
“చూడు.. నాకు గవర్నమెంట్ పెన్షన్ వస్తోంది, యింటి అద్దె నీకు వస్తోంది, ఏదో కొద్దిగా డబ్బు పొదుపు చేసుకున్నాము. పిల్లలకి మన డబ్బు అవసరం లేదు. వాళ్ళు ఈ కార్యక్రమం లో కొంత సహాయం చేయగలరు. అందుకే భగవంతుడి మీద నమ్మకం తో పని మొదలుపెట్టాలి అనుకున్నాను. మా అమ్మ ని ఆ రోజులలోనే మరో డొక్కా సీతమ్మ అనే వారు” అన్నాడు.
***
“లేవండి, ఏడుగంటలు అయింది, యింకా పడుకున్నారు, యిల్లు రిపేర్ చేయించడానికి వెళ్తామన్నారు” అంటూ తట్టి లేపింది భర్తని.
‘ఇదేమిటి యింత మొద్దు నిద్ర పట్టింది, బహుశా మంచి చేద్దాం అనుకోగానే బాధ తగ్గి నిద్రపట్టింది, యిహ నిజంగా చేస్తే ఎంతో మంచి జరుగుతుంది’ అనుకుని కాఫీ తాగి బయలుదేరాడు అన్నగారి యింటికి.
ఎనిమిది నెలల నుంచి తలుపులు తీయకపోవడంతో, దొడ్లో పిచ్చ చెట్లు పెరిగిపోయాయి. పాములు వున్నా వుండవచ్చు అనుకుంటూ జాగ్రత్తగా తలుపు కి వేసిన తాళం తీసాడు.
తలుపు తెరవగానే ఒక కవర్ కనిపించింది. తీసుకుని చదివి, తన అన్నగారి ముందు చూపుకి ఆశ్చర్యపోయి, తనతో తీసుకుని వచ్చిన పనివాళ్ళకి పని అప్పచెప్పి, తను నేరుగా స్టేట్ బ్యాంకు కి వెళ్ళి మేనేజర్ ని కలిసి లెటర్ చూపించాడు.
“అవునండి.. ఈ లెటర్ మేము పంపినదే. మీ అన్నగారు మా బ్యాంకు లో సీతమ్మా అన్నదాన సెంటర్ మీద ఫిక్సడ్ డిపాజిట్ పెట్టి, అకౌంట్ ఓపెన్ చేసారు. దానిలో మిమ్మల్ని నామినీ గా పెట్టారు. మీ అన్నగారు చనిపోయిన తరువాత మీరు వస్తారని చూసాము, రాకపోవడం తో ‘వెంటనే బ్యాంకు కి వచ్చి మీ కే వై సి వివరాలు ఇవ్వండి’ అని నోటీసు పంపించాము” అన్నాడు.
బ్యాంకు మేనేజర్ అడిగిన వివరాలు అన్నీ రెండు రోజుల తరువాత బ్యాంకులో యిచ్చి, ‘అన్నదానం సెంటర్ వచ్చే నెల మొదటి రోజునుంచి తిరిగి ప్రారంభం అవుతుంది’ అని బోర్డు పెట్టి, భార్య తో సహా ట్రైన్ ఎక్కాడు గయా క్షేత్రం కి తల్లిదండ్రులకి పిండప్రదానం చేయడానికి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


Commentaires