సంప్రియ
- Vagumudi Lakshmi Raghava Rao
- May 4
- 6 min read
#పురాణం, #ఆధ్యాత్మికం, #devotional, #TeluguMythologicalStories, #VagumudiLakshmiRaghavaRao, #వాగుమూడిలక్ష్మీరాఘవరావు, #Sampriya, #సంప్రియ

Sampriya - New Telugu Story Written By - Vagumudi Lakshmi Raghava Rao
Published In manatelugukathalu.com On 04/05/2025
సంప్రియ - తెలుగు కథ
రచన: వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
శుభాంగి కురుమహారాజుల కుమారుడు విదూరథుడు. ఎలాంటి రథాన్నైన ఎక్కి సమరం చేయడంలోనే కాదు ఎలాంటి రథాన్నైనా సరే ఒడుపుగా, అత్యంత వేగంగా, శత్రువులకు భయం కలిగించే విధంగా నడపడంలో కూడా భూలోకంలోనే కాదు సమస్త లోకాలలో విదూరథుని మించిన వారు మరొకరు లేరని సురులు సహితం అనుకుంటారు.
సురులు సమరంలో అతని రథ సారథ్య సామర్థ్యాన్ని చూసి, "ఔరా ఔరౌరా విదూరథ.. నువ్వు తలచుకుంటే సైనికుల తలల మీద కూడా రథాన్ని నడపగలవురా" అని అనుకుంటారు.
శ్రీ సూర్య నారాయణుని రథ సారథి అనూరుడు సహితం విదూరథుడు తనను మించిన రథ సారథి.. తన రథ సారథ్యంతో పగలును రాత్రిగా, రాత్రిని పగలుగ భ్రమింప చేయగలడు " అని తనకు తెలిసిన వారందరికి చెబుతుంటాడు.
చంద్ర వంశ రాజులకు తన తండ్రి కురు మహారాజు వంశ కర్త అవుతాడని మహర్షులు చెప్పిన మాటలు విని విదూరథుడు అమితానంద పడ్డాడు. తన తండ్రి కురు మహారాజు స్థాయిలో తను కూడా ప్రజలు శాశ్వతంగా గుర్తుంచుకునే పలు మంచి పనులు చేయాలనే దృఢ నిర్ణయానికి వచ్చాడు. తండ్రి కురు మహారాజు విస్తరించిన రాజ్యాన్ని చక్కగా పరిపాలిస్తూ ప్రజోప కార్యాలు అనేకం చేయసాగాడు.
అలాగే తండ్రి కురు మహారాజు పరాక్రమాన్ని పుణికి పుచ్చుకుని, తన రాజ్యం లో నలు మూలల తిరిగి, కండ బలం, గుండె బలం, దేశభక్తి, దండిగా ఉన్న అనేకమంది సమర వీరులను ఒక గణం గా మలచాడు.. ఆ గణానికి కురు గణం అని పేరు పెట్టాడు.
కురులు నివసించడానికి, క్రొత్త క్రొత్త సమర విద్యలను అభ్యసించడానికి ఒక సువిశాల ప్రదేశాన్ని ఏర్పాటు చేసాడు. అక్కడే కురులు నివసించేవారు.
ఎప్పటికప్పుడు నవీన సమర విద్యలను అభ్యసించే వారు. ప్రజలు వారు నివసించే ప్రాంతాన్ని క్రమక్రమంగా కురుల భూమి అని పిలవసాగారు..
కురుల భూమి లో ప్రతిరోజూ ఏదో ఒక యుద్ద క్రీడ జరుగుతుండేది. ఆ క్రీడను కురులు పవిత్రంగా మొదలు పెట్టేవారు. అతి పవిత్రంగా ముగించేవారు.
ఆ క్రీడను వీక్షించడానికి విదూరథుడు, కురు మహా రాజు, అతని బంధు వర్గం వచ్చేవారు. వారి వారి పనులను అనుసరించి ప్రజలు కూడా అప్పుడప్పుడు క్రీడలను వీక్షించడానికి వచ్చేవారు. విదూరథుడు ప్రజలు సమర క్రీడలను వీక్షించే నిమిత్తం ప్రత్యేక సమర క్రీడలను కూడా ఏర్పాటు చేసేవాడు.
ఆ సమర క్రీడల్లో అప్పుడప్పుడు తను కూడా పాల్లోనేవాడు. ఉత్సావంతులైన ప్రజలకు కూడా సమర క్రీడలలో పాల్గొనడానికి అవకాశం ఇచ్చేవాడు. ప్రజలందరూ కురుల భూమి ని పవిత్రంగా చూసేవారు. ఆ కురుల భూమి నే క్రమక్రమంగా ప్రజలు కురుక్షేత్రం అనసాగారు.
మగథ రాజు కురుల కంటే కూడా తన సైన్యమే శక్తి వంతమైన సైన్యం అనే భావనతో ఉండేవాడు. తన సైన్యం తన కోసం ప్రాణాలను ఇవ్వడానికి కూడా సంసిద్దంగా ఉంటుందనే నమ్మకం తో ఉండేవాడు. ఎప్పుడైనా, ఎక్కడైనా సరే కురులతో యుద్దానికి సిద్దం అన్నట్లు ఉండేవాడు.
మగథ రాజ కుమార్తె సంప్రియ తండ్రి భావాలతో ఏకీభవించేది కాదు. ఆమె "సమయం, సందర్భం బట్టి సైన్య బలాబలాలు మారుతుంటాయి. నిరంతరం మన సైన్య బలమే గొప్పదని మిడిసిపడ కూడదు. మన సైన్యం లోని బలాలను, బలహీనతలను అనుక్షణం గమనిస్తూ ఉండాలి. ఆపై బలహీనతలను సరి చేసుకుంటూ ముందుకు సాగాలి.. అలా చేయకుంటే ఎవరికైనా పరాజయం తప్పదు" అనేది.
మగథ రాజు ఒక్కొక్క సారి కుమార్తె సంప్రియ మాటలతో ఏకీభవించేవాడు. అయినా నమ్మకం నీరు కాకూడదు అని కుమార్తెతో అనేవాడు. నమ్మకం మంచిదే కాని నమ్మకం అతి కాకూడదు. పరుల బలాలను తక్కువగా అంచనా వేయకూడదు. మన జాగ్రత్తలో మనం ఉండాలి. " అని తండ్రితో మగథ రాజ కుమార్తె సంప్రియ అనేది.
సంప్రియ తండ్రి అనుమతి తో శత్రువులను సునాయాసంగా జయించడానికి రెండు ఆయుధాలను తయారు చేసింది. అందులో ఒకటి రాళ్ళను, బాణాలను, గదలను, వివిధ రకాల ఆయుధాలను ఏక కాలంలో ప్రయోగించే జ్యా (కాటాపుల్ట్.. యజుర్వేదం లో కాటాపుల్ట్ ను జ్యా అనే పేరుతో వాడటం జరిగింది)
రెండు జాపత్రి రథం. జాపత్రి రథంలో ఉన్న వారికి యుద్దరంగంలో రమారమి అయిదు వేల ఎకరాల విస్తీర్ణంలో శత్రువు భూమి మీద ఉన్నా, ఆకాశంలో ఉన్నా, నీటిలో ఉన్నా, రాక్షస మాయలో ఉన్నా, దైవ మాయలో ఉన్నా, ఎక్కడ ఉన్నా, ఎలా ఉన్నా కంటి ముందు కనపడతాడు.
జాపత్రి రథం లో ఉన్నవారు శత్రువుకు అంత సులభం గా కనపడరు. ఒకవేళ ఏదన్నా శక్తి వలన కనపడినా మసకమసకగా కనపడతారు. రకరకాల స్వభావాలతో కనపడతారు. జాపత్రి రథంలో ఉన్న ఇలాంటి అనేక ప్రత్యేకతన్నీ సంప్రియకు బాగా తెలుసు. సంప్రియ తయారు చేసిన ఆయుధాలను చూసి మగథ రాజు మహదానంద పడ్డాడు. కుమార్తె మేథో సామర్థ్యాన్ని పలు రీతులలో ప్రశంసించాడు. కుమార్తె కు పలు బహుమతులను ఇచ్చాడు.
సంప్రియ తయారు చేసిన ఆయుధాల గురించి విదూరథూనికి తెలిసింది. జాపత్రి రథం నడిపే సమర్థుడైన రథ సారథి నిమిత్తం సంప్రియ అన్వేషణ చేస్తుందన్న విషయం కూడా విదూరథునికి తెలిసింది.
విదూరథుడు మహర్షులందరిని పిలిచి, " మహర్షోత్తములారా! మగధ రాజ కుమార్తె సంప్రియ జాపత్రి రథం తయారు చేసినట్లు నాకు తెలిసింది. జాపత్రి రథం గురించి వేదాలలో నేనూ చదివాను. సమర రంగాన దాని వలన కలిగే ప్రయోజనాలు గురించి కూడా నాకు బాగా తెలుసు. వేద పురాణేతిహాసాది గ్రంథాలలో ఊహలు ఎక్కువ. సశాస్త్రీయత తక్కువ అని కొందరు అంటారు. నిజమే. అయితే ఆ ఊహలలో కొన్ని ఊహలు ప్రయోగ శాలలో విజయవంతమైతే వాటి ప్రయోజనాలు అసంఖ్యాకం అన్నది అక్షర సత్యం.
సంప్రియ వేద పురాణేతి హాసాదుల సహాయం తో రెండు ఆయుధాలను స్వంతంగా తయారుచేసి, తన రాజ్యాన్ని మహా శక్తివంతం చేసుకుంది. జాపత్రి రథం ను సమర రంగాన ఒడుపుగా నడపగల సారథి నిమిత్తం ఆమె అన్వేషణ సాగిస్తుందన్న వార్త మాకు తెలిసింది. " అని అన్నాడు.
విదూరథుని మాటలను విన్న మహర్షులు, "రాజా..
ఎలాంటి రథాన్ని అయినా సరే అధిరోహించి ఆహవ రంగాన నిలవడమే కాదు ఎలాంటి రథమునైన సరే కడకు త్రిమూర్తుల, త్రిమాతల రథాలనైన సరే ఒడుపుగా కడు నైపుణ్యం తో నడపగల సామర్థ్యం మీకు ఉంది కదా?" అని రాజుతో అన్నారు.
మహర్షుల మాటలను విన్న విదూరథుడు, "ఉంది. త్రిమూర్తుల, త్రిమాతల రథాలను నడిపిన అనుభవం కూడా నాకు పుష్కలంగా ఉంది. అమ్మ సరస్వతీ మాత హంసవాహినియై తన రథమును అధిరోహించగా, ఆ తల్లికి ఎలాంటి ఇబ్బందీ కలగకుండా ఆమె అధిరోహించిన రథమును నడిపిన నాటి జ్ఞాపకాలను నేను ఇప్పటికీ అసలు మరువలేను.
అందుకే తల్లిదండ్రుల అనుమతి తో, మీ సహాయ సహకారాలతో మారు వేషంలో సంప్రియ రథ సారథి గా కొంతకాలం ఉండాలనుకుంటున్నాను. ఈ విషయం లో మీ అభిప్రాయం ఏమిటి?" అని అడిగాడు.
"మీది ప్రశస్తమైన ఆలోచన రాజ.. సంప్రియ సమర తేజమే కాదు సరస్వతీ మాత తేజం కూడా పుష్కలంగా ఉన్న మహిళామణి. " అని రాజు విదూరథునితో మహర్షులు అన్నారు.
విదూరథుడు తల్లిదండ్రుల, మహర్షుల ఆశీస్సులు తీసుకుని మారు వేషంలో మగథ కు వెళ్ళాడు. హితులతో, సన్నిహితుల తో కురు మహారాజు హస్తినాపుర రాజ కార్యాలను చక్క దిద్ద సాగాడు. వివిధ భంగిమల్లో రథమును నడిపే విదూరథుని సారథ్య నైపుణ్యం ను చూసిన సంప్రియ మారు వేషంలో ఉన్న విదూరథునికి జాపత్రి రథం నడిపే బాధ్యతలను అప్పగించింది.
జాపత్రి రథం సంప్రియ అధిరోహించగానే మారు వేషంలో ఉన్న విదూరథుడు జాపత్రి రథాన్ని జన నాశకాసురి వనానికి తీసుకు వెళ్ళాడు. ఆ వనంలో అందరూ స్త్రీలే ఉన్నారు. వారి వస్త్రధారణ చిత్రాతి చిత్రంగా ఉంది. కొందరు బాహువుల నిగారింపు కనపడే వస్త్రాలను ధరించారు. మరికొందరు ఊరువుల నిగారింపు కనపడే వస్త్రాలను ధరించారు.
ఇంకొందరు ఉదర నిగారింపు కనపడే వస్త్రాలను ధరించారు. ఉదర నిగారింపు కనపడే వస్త్రాలను ధరించిన స్త్రీల నాభి మూడవ కన్ను ఆకారంలో ఉంది.
అలాగే కొందరు స్త్రీలకు కన్ను మీద కన్నుతో నాలుగు కళ్ళు కలిగి ఏకాదశ రంధ్రాలతో ఉన్నారు. ఇలా రకరకాల ఆకారాలతో ఉన్న ఆ స్త్రీలు అందరూ కలిసి పెద్ద గా పాడితే కొండ గుహల పెచ్చులు రాలిపోతున్నాయి. వారంతా జాపత్రి రథంలో ఉన్న సంప్రియ, విదూరథులను సరిగా చూడలేక పోయారు. జాపత్రి రథం ను అదేదో అసురాసుర రథం అనుకుని రథం మీద కు పెద్ద పెద్ద రాళ్ళను వేసారు.
సంప్రియ ఆ రాళ్ళన్నిటిని సమర్థవంతంగా ఎదుర్కొంది. కడకు ఆ స్త్రీలందరిని సమరంలో ఓడించి బంధించింది.
అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై సంప్రియ, విదూరథుని ఆశీర్వదించాడు. బ్రహ్మ దేవుని ముందు విదూరథుడు తన స్వస్వరూపాన్ని ధరించాడు.
అనంతరం బ్రహ్మ దేవుడు, "సంప్రియ.. నువ్వూ విదూరథుడు భార్యాభర్తలు అవ్వాలి. ఇది మీ కర్మానుసార ఫలింతంగా మీకు సంప్రాప్తించిన తలరాత. విదూరథునికి నువ్వన్నా, నీ మేథోసంపద అన్నా మహాయిష్టం. మీరు ఇరువురు ఏకం అయితే అసుర సంహార విషయంలో దేవతలకు కూడా మీరు సహాయ పడగలరు. " అని అన్నాడు.
"బ్రహ్మ దేవ, ! మీ మాట జీవ కాల గమన జ్ఞానం. దానిని అధిగమించడం ఎవరికి సాధ్యం కాదు." అని సంప్రియ బ్రహ్మ దేవునికి నమస్కరిస్తూ అంది.
"ఇక ఈ విచిత్ర స్త్రీల విషయానికి వస్తే వీరు శాస్త్రీయ
విజ్ఞానం ను, కాల గమన విజ్ఞానం ను అతిగా అవహేళన చేసి సరస్వతీ మాత శాపానికి గురయ్యారు. విదూరథుడు అందిస్తుండగా నువ్వు ప్రయోగించిన శర స్పర్శ వలన వారికి శాప విమోచనం కలిగింది. ఇకపై వీరు మీ రాజ్యాలలోనే ఉంటారు. వారిని ఆదరించండి. " అని సంప్రియ విదూరథులతో బ్రహ్మ దేవుడు అన్నాడు.
ఇరువురు " చిత్తం విధాత" అని అనడంతో బ్రహ్మ దేవుడు అదృశ్యం అయ్యాడు.
"సంప్రియ.. నువ్వు పుట్టింట ప్రదర్శించే సమర విద్యల నైపుణ్యం కనులార చూడాలి అనీ, నీకు సారథిగా కొంత కాలం ఉండాలి అనీ ఈ చంద్ర వంశ రాజు విదూరథుడు నీ చెంతకు మారు వేషంలో వచ్చాడు. అంతేగానీ మరో ఉద్దేశంతో నీ చెంతకు రాలేదు. " అని సంప్రియ తో విదూరథుడు అన్నాడు.
"మీ ఉద్దేశం ఏమైన మనమందరం ఆ విధాత రాతను అనుసరించక తప్పదు" అని సంప్రియ విదూరథునితో, స్త్రీలతో మగథ కు చేరుకుని జరిగినదంతా తండ్రికి చెప్పింది.
మగథ రాజు విదూరథుని సముచితంగా సత్కరించాడు. స్త్రీలకు తగిన పదవులు ఇచ్చాడు. మహర్షుల ద్వారా శుభాంగి కురు మహారాజు లకు సంప్రియ విదూరథుల వివాహాది విషయాల వర్తమానం పంపించాడు.
శుభాంగి కురు మహారాజు, మగథ మహారాజు, మహర్షులు, దేవర్షులు, దేవతలు, ప్రజల సమక్షంలో సంప్రియ విదూరథుల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది.
దేవతలకు రాక్షసులకు జరిగిన అనేక యుద్దాల లో అనేక పర్యాయాలు సంప్రియ విదూరథులు దేవతలకు సహాయపడ్డారు.
ఒకనాడు ఉద్యానవనం లో సంచరిస్తూ ఏదో ఆలోచిస్తున్న విదూరథుని దగ్గరకు సంప్రియ వచ్చింది. భర్త ముఖం చూసి, " ఏమిటి తీవ్రంగా ఆలోచిస్తున్నారు?" అని సంప్రియ అడిగింది.
విదూరథుడు ధర్మపత్ని సంప్రియ మాటలను విని, "ఏం లేదు దేవి. మీ తండ్రి గారు నాకు అనేకానేక కానుకలను ఇచ్చారు. అందులో జాపత్రి రథం కూడా ఉంది. ఆ రథాన్ని నడిపే సామర్థ్యం నాకైతే ఉంది కానీ అందరికీ లేదు. అందుకే అసలు అశ్వములు లేకుండా ఆ రథాన్ని ఎలా నడపాలి? అని ఆలోచిస్తున్నాను " అని సంప్రియ తో విదూరథుడు అన్నాడు.
"జాపత్రి రథం ను అశ్వములు లేకుండా నడుపుట. !!! అంటే అనశ్వములతో జాపత్రి రథం నడుచుట. బాగుంది బాగుంది మీ సరిక్రొత్త ఆలోచన. " అని సంప్రియ, భర్త విదూరథుని సమాలోచన ను ప్రశంసించింది.
సంప్రియ విదూరథుల సుపుత్రుడు అనశ్వుడు.
శుభం భూయాత్
వాగుమూడి లక్ష్మీ రాఘవరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

-వాగుమూడి లక్ష్మీ రాఘవరావు
Comments