top of page

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త!

#Vijayasundar, #విజయాసుందర్, #TasmathJagratthaJagrattha, #తస్మాత్జాగ్రత్తజాగ్రత్త, #TeluguFamilyStory, #తెలుగుకుటుంబకథ


Tasmath Jagrattha Jagrattha - New Telugu Story Written By Vijayasundar

Published In manatelugukathalu.com On 13/06/2025

తస్మాత్ జాగ్రత్త! జాగ్రత్త! - తెలుగు కథ

రచన: విజయా సుందర్

కథా పఠనం: పద్మావతి కొమరగిరి

అప్పటికి అరగంట నుండి చింటూ చేత చింత చిగురు పప్పన్నము తినిపించలేక చిరాకు పడుతున్నది పావని. కాళ్ళు నేలకేసి కొడుతూ, " నాకు ఈ పప్పన్నం యాక్, పిజ్జా కావాలి " 'అయిదేళ్ల పిల్లాడికి అసలు పిజ్జా అనేది ఉంటుంది అని ఎలా తెలిసిందో'' అర్థం కాక ఓ వైపు, 'ఆఫీసుకి టైం అయిపోతున్నది, వాణ్ని ప్లేస్కూల్ లో దింపి తను వెళ్ళాలి'

టైం చూసుకున్న ఆమెకింక సహనం చచ్చిపోయింది.. ఇదో ముద్దా, అదో ముద్దా చింటూ నోట్లో కుక్కేసింది. 


ఆకలే వేసిందో, పప్పు రుచి తెలిసిందో, మూడు ముద్దలు తిన్నాడు శోకాలు పెడుతూనే. ఈ లోపల టివి లో డామోనోస్ పిజ్జా ప్రకటన! అంతే మళ్ళీ పంతం గుర్తొచ్చి ఏడుపు, ఉమ్మెయ్యడం, నానా కంగాళీ చేసాడు. కొరబోయి నోట్లో అన్నమంతా కక్కేసాడు. అంతే పావని వాడి వీపు సాఫు చేసింది దభీ గుభీ దెబ్బలతో. ఏడుస్తున్న వాణ్ని బలవంతంగా ఈడ్చుకుని బాత్రూములో పడేసి, స్నానం చేయించి కాసిని పాలు తాగించి, ఎలాగో డ్రెస్ చేసి తను కూడా డబ్బా తీసుకుని చేతిలో ఓ రొట్టె రోల్ చేసుకుని తింటూ చెప్పుల్లో కాళ్ళు దూర్చింది, చంకలోనించి జారిపోతున్న చింటుగాణ్ణి ఒక్క గదుము గదిమి. బ్యాగ్లోనించి ఓ చాకలేట్ తీసి వాడికిచ్చి, ఇంటి పక్కనే ఉన్న డేకేర్ క్లాసు రూంలో కుదేసి ఆటో బుక్ చేసుకున్నది. 


వెనక్కి వాలి కూర్చుని, 'ప్చ్ పసివాణ్ణి కొట్టాను పాపం. ఏమి చేసేది నాలుగు చేతులతో చేసినా ఏ రోజూ ఆఫీస్ కి టైం కి వెళ్ళలేకపోతున్నాను,. ఆ నక్కచూపుల నాగలింగం గాడు గారపళ్లతో ఇకిలిస్తాడు. ఇంట్లో ఒక్కళ్ళన్నా సాయం చెయ్యరు.


ఉండటానికైతే ఉమ్మడికుటుంబమే!. పెద్దవాళ్ళు పది అయితేగానీ మేడ pదిగిరారు. తన మొగుడు పొద్దున ఎనిమిదికే వెళ్ళిపోతాడు. అడబడుచు కాలేజీకి ఎప్పుడో పదకొండుగంటలకి వెళ్తుంది. ఆ అమ్మాయి కాస్త సాయం చేస్తే కొంచెం వెసులుబాటుగా ఉండును.. ఆ అమ్మాయి చేస్తానన్నా వాళ్ళ అమ్మ చెయ్యనివ్వదు. అయినా వీడికీ పిజ్జా పిచ్చి ఎక్కడ్నించి పట్టుకున్నదో చూడాలి. " పొలాలు రాగానే తెరిచి ఉంచిన కిటికీ్లోనుండి వచ్చే చల్లనిగాలి ఆమెని సేదతీరుస్తుంటే, ఆలోచనలన్నీ ఆగిపోగా హాయిగా కళ్ళు మూసుకుని సీటుకి చేరబడ్డది పాపం!


అయిదు గంటలకల్లా రావాల్సిన తనకి ఆ రోజు ఆరయ్యింది. ఆఘమేఘాలమీడ్ వచ్చింది ఇంట్లోకి, అంతా ఎంతగా తన కోసం చూస్తున్నారో అని.. ఆమె సర్వీస్ కోసమే. ముఖ్యంగా పిల్లాడి ఆకలి బెంగతో వచ్చింది. టేబిల్ మీద ఒద్దికగా కూర్చుని పిజ్జా తింటున్నాడు వాసు అదే చింటూ. 


అవాక్కయింది ఆమె.. 'ఇంత చిన్నపిల్లవాడికా ఈ దిక్కుమాలిన తిండి' వివవిసా రాబోయిన ఆమెలోని వివేకం వెన్ను తట్టింది. 'పొద్దున కూడా సరిగ్గా తినలేదు, ఇప్పుడు అది తీసేసినా వాడే్మీ తినడు' అప్పటికి మాట్లాడకుండా ఊరుకున్నది. 


ఆఫీసులో ఇన్స్పెక్షన్ జరుగుతున్నది. పొద్దున తొందరగా వెళ్లి రాత్రి 8 కి వస్తున్నది పావని. ఇడ్లీ పిండి, దోశ పిండి ఫ్రిజ్ నిండా స్టోర్ చేసి పెట్టింది. పళ్ళు, కూరలు శని, ఆదివారాల్లో పనమ్మాయికి అదనంగా డబ్బులిచ్చి కట్ చేయించి పెట్టింది. రెందు పూటలకి కలిపి చేసెయ్యమన్నాడు శంకర్. అత్తగారు ఎంత తిట్టుకున్నా మాట్లాడద్దన్నాడు భార్యని. 


ఆరోజు ఇంటికి వచ్చేటప్పటికి తొమ్మిది అయింది పావనికి. భర్తకి ఇంకా పని ఉన్నదని ఫోన్ చేసాడు. హాల్లోకి వస్తూనే చూసిన సీన్ కి పావనికి అరికాశలి మంట నెత్తికెక్కింది. మూడు డబ్బాల్లో పిజ్జా, రెండు డబ్బాల్లో గార్లిక్ బ్రెడ్.. ఇంటిల్లి పాదీ, ఇంకో కొత్తశాల్తీతో కలిసి కూర్చుని తింటూ, పగలబడి నవ్వుతున్నారు. బలవంతాన కోపం ఆపుకున్నది కొత్త వ్యక్తి ఉన్నాడని. 


శంకర్ వచ్చాక చాలా గోల చేసింది పావని.. "నేను రెక్కలు ముక్కలు చేసుకుని అన్ని పిళ్ళు రుబ్బి పెట్టిపోతుంటే ఈ పిజ్జాల తిండేమిటంటా? వయసు మీరిన వాళ్లకి కూడా ఇలా చెప్పాల్సి రావడం ప్రారబ్దం! ఒకవైపు ఆరోగ్యాలు, ఇంకో వైపు డబ్బు చెట్లకి కాస్తున్నదా? ఈ వారంలో ఇది అప్పుడే రెండోసారి. మేమిద్దరం రెక్కలు ముక్కలు చేసుకుంటుంటే ఇలా దుబారా చేస్తే ఎలాగ? ఇక్కడి ఖర్చులే కాక ఇంకా మరిదిగారికి ఎత్తి పంపాలి.. 


ఆది ఏమి చదువో ఈ జన్మకి పూర్తయ్యేట్లు లేదు. పిల్ల పెళ్లి దూసుకు వస్తున్నది. తమ బాధ్యతల్ని చిన్నవాళ్ళు నెత్తికెత్తుకున్నారు అని కొంచెం సహకారంగా నన్నా ఉండలేరా? అన్నీ తప్పించుకపోయిన పెద్దాయన్ని ఒక్క మాట అనరు మళ్ళీ. ఏమైనా ఇలా కాడికి కట్టిన ఎద్దుల్లాగా మా చేత చాకిరీ చేయిస్తూ, రవ్వంత శాంతి లేకుండా చేస్తే మేమూ చేతులెత్తాయ్యాల్సిందేనండీ" విసవిసా లోపలికెళ్లిపోయింది. 


శంకర్ ఒక్క మాట మాట్లాడలేదు. అదే శంకర్ లేకపోతే అత్తగారు పావనిని ఏకేసేది. శంకర్ మాట్లాడలేదు అంటే పావని ఒక్క పొల్లు మాటకూడా మాట్లాడలేదని అర్థం. ఈఒక్క ఖర్చే కాదు అన్నీ అంతే వాళ్ళు.. ఎక్కడబడితే అక్కడ పద్దులు పెట్టి బట్టలు, వస్తువులు తెచ్చుకుంటుంటే ఒకసారి వీళ్ళు కట్టము అని మొండికేయడంతో కాస్త తగ్గారు. 


ఏమి తగ్గడమో.. పావనికి ప్రమోషన్ వచ్చి బెంగుళూరు ట్రాన్స్ఫర్ అయింది.. వంటమనిషిని పెట్టక తప్పలేదు. ఆమె చేతికి అడ్డుఆపు లేదు. తెగ నూనెలు వాడేది. దానికి తగ్గట్లే అత్తగారు పురమాయించే వంటలన్నీ దిట్టంగా నూనె వాడి చెయ్యాల్సినవే. పోనీ దగ్గరకూర్చుని వంటావిడ ఏ వస్తువులు ఇంటికి వాడ్తున్నదో, ఏవి బైటకు తరలిస్తున్నదో చూడనన్నా చూస్తే సంసారం బాగుపడేది. 


పావని శని ఆది వారాల్లో వచ్చి చూసుకుంటే గుండె జారిపోయేది పచారీకొట్లో కట్టవలసిన డబ్బుకి. అంతే ఎవరేమనుకునన్నా సరే, అని వారానికి సరిపడా సరుకులు పేర్చిపెట్టి పోయేది. ఇదంతా తేలిగ్గా అయ్యేదా, సూటీ పోటీ మాటలు, తనకి మానసిక, శారీరక విశ్రాంతి అనేది లేక పిచ్చి తలనెప్పి వస్తోందీ మధ్య. 


***

 రోజులు గడుస్తున్నాయి. వాసు ఇప్పుడు పదో తరగతికి వచ్చాదు. శ్రద్ధగా చదువుకుంటాడు. మంచి మార్కులు వస్తున్నాయి కానీ తల్లికి ట్రాన్స్ఫర్ అయిన దగ్గరనుండి అడపాదడపా బైటతిండి బాగా అలవాటు అయింది. వాడిది అసలు వాళ్ళమ్మానాన్నల్లాగా కాయబారు ఒళ్ళు. ఇప్పుడు ఊబకాయంగా అయిపోయింది. ఒక పదిహేనురోజులు పావనికి ఇంటికి రావటం కుదర్లేదు. 


ఇంటికొచ్చేప్పటికి అందరూ బలూన్లు లాగా ఉబ్బిపోయి ఉన్నారు, ఒక్క శంకర్ తప్ప.. పావనికి నోటమాట రాలేదు వాళ్ళని చూసి. పనిమనిషి చెప్పింది, వంటావిడ మానేసిందిట. అయితే కర్రీ పాయింట్, లేదా పిజ్జా బర్గర్లుట. శంకర్ టూర్ లో ఉన్నాడు. 


మరునాడు వాసు ఎనిమిదైనా లేవలేదు. ఎందుకా అని అతని రూంలోకి వెళ్లి ఇంకా దుప్పటిముసుగులోనే లోనే ఉన్న వాడి నుదురు పట్టుకుచూసి హడలి పోయింది పావని, కాలిపోతున్నది. ఇంతలోకే వాడు లేచి "అమ్మా విపరీతంగా కడుపునొప్పి, మోషన్స్, వోమిటింగ్స్ రాత్రంతా" అన్నాడు. 


"అదేమిటి నాన్నా లేపలేకపోయావా" 


"మీరు కూడా అలిసిపోయారు పొద్దున చెప్పచ్చులే అనుకున్నా"


"నీ మొహం పద డాక్టర్ దగ్గరకు" అని శంకర్ కి కూడా చెప్పి హాస్పిటల్ కి తీసుకువెళ్లారు. 


ఆ డాక్టర్ తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి అందరికీ వార్ణింగ్ ఇచ్చారు, కొన్ని నెలలు బైట ఆహారం ముట్టకూడదని,, నెలరోజులు సాఫ్ట్ డైట్ ఇంట్లోదే పెట్టాలనీ చెప్పారు, మందులు రాసిస్తూ. ఆ పడక పడకా 15రోజులు పట్టింది కోలుకోవడానికి. 


పావనికి ఏట్లోకి కొట్టుకు పోతున్న భావన కలిగింది. ఆరోజు చాలా రోజుల తరవాత భర్తతో ఏకాంతంగా ఉన్నప్పుడు, చాలా పెద్ద పొట్లాట వేసుకున్నది. 


"ఎవరికీ పట్టకపోతే ఈ సంసారం నా ఒక్కదానిదేనా, ? మాటిమాటికీ ఖర్చుల గురించి నేనే రచ్చ చేస్తున్నట్లున్నది. అసలు బ్యాంకు. బాలెన్స్ ఆల్మోస్ట్ జీరో అని చూసారా జాయింట్ అకౌంట్ లో. చిల్లి బుట్టలో వెయ్యడానికా నేను ఇంత కస్టపడి హాస్థల్లో ఉంటూ, వారం వారం అప్ అండ్ డౌన్ చేస్తున్నాను?. బెంగుళూర్, హైదరాబాద్ పక్కపక్కనే ఉన్నాయా? 


ఆడదాన్నయ్యుండి ఆగమ్మకాకిలా తిరుగుతున్నాను. హాయిగా అక్కడ ఇల్లు తీసుకుని ఉంటే మీరు, పిల్లాడు వస్తుంటే మన ప్రైవసీ, ద సోకాల్డ్స్పేస్ ఉండేవి కదా నాకు కూడా. అలిసిపోయానండీ. అన్నిటినీ మించి వాసు నాతో సరిగ్గా మాట్లాడటంలేదు, వాడి దృష్టిలో నన్నో రాక్షసిని చేసేసారు., అందరి తిండి మీద ఏడుస్తానని వాడి గట్టిగుడ్డి నమ్మకం. వాళ్ళ మామ్మ తోనే మంతనాలన్నీ. ఎవరికోసం నాకీ చాకిరీ, కష్టం, మనస్తాపమూను. 


ఒక్క పిల్లవాడు, మీరు నేను మీ జీతంతో హాయిగా ఉండలేమా? మానేస్తానండీ ఉద్యోగం. " హిస్టరికల్ గా ఏడవటం మొదలుపెట్టింది. 


శంకర్ గట్టిగా పొదువుకుని, ముంగురులు సరిచేస్తూ, "రిలాక్స్! ముందు కొన్నాళ్ళు సెలవుపెట్టు. నేను పరిస్థితులు చక్కపడేట్లు చేస్తాను. ఏమీ మార్పు లేకపోతే నువ్వు తప్పకుండా రిజైన్ చెయ్యి. మనము ముగ్గురం, అచ్చంగా మనమే ఉందాము " 


భార్యకి మంచినీళ్లు తేవడానికి గదిబైటకు వచ్చిన శంకర్, వడివడిగా మెట్లు ఎక్కుతున్న చెల్లెలు నీరజని చూసి నవ్వుకున్నాడు, మంచిదే అయింది, 'మేము ముగ్గురమే ఉండబోతున్నాము' అనే మాట విన్నది అనుకున్నాడు. 


"వాసూ" ! తండ్రి పిలుపు విని వచ్చాడు. 


అక్కడ తల్లి పడుకుని ఉండటం, తండ్రి తల్లి నుదుటి మీద తడిబట్ట వేస్తూ, టెంపరేచర్ చూడటం చూసి గాభరాపడ్డాడు, తల్లిని ఎప్పుడూ పడుకుని ఉండటం చూడని వాడు. "అమ్మకేమయ్యింది నాన్నా?" తల్లి దగ్గరకు వస్తూ అడిగాడు. 


"మెల్లిగా నాన్నా. ఇప్పుడే ఎలాగో నిద్రపట్టింది. పద ఆ గదిలో కూర్చుందాము" అని తీసుకు వెళ్లి, 

"వాసూ ఇప్పుడు నువ్వు కూడా పెద్దవాడివాయ్యావు,. అన్నీ తెలుసుకోవాలి అంటూ మా తండ్రి చాలా చిన్న ఉద్యోగం చేసినా పొలం చాలా ఉండేది, దాన్ని చూసుకుని అందినకాడికి అప్పులు చేసి దర్జాగా బతికారు గొప్పలకి పోతూ. మా చదువులు అయ్యేటప్పటికి ఉన్న పొలం అప్పులకి పోగా ఇంకా చదువుకుంటున్న తమ్ముడు, చెల్లెలు తల్లీ తండ్రి నా బాధ్యతలుగా మిగిలారు. మా అన్నయ్య ఇల్లరికం పోవడంతో అన్ని బాధ్యతలు నేనే మొయ్యవలసి వచ్చింది. నాకు తోడుగా మీ అమ్మ, నన్ను మించి బాధ్యతల్ని మోస్తున్నది" అంటూ మొత్తం విప్పి చెప్పాడు.. 


బైటతిళ్ళు ఆరోగ్యాన్ని ఎలా నాశనం చేస్తాయో సోదాహరణంగా కళ్లముందు నిలిపేప్పటికి వాసు వణికిపోయాడు. "అంతేకాదు చింటూ నీకో తమ్ముణ్ణి లేదా చెల్లెల్ని ఇవ్వాలని నేను ఎంత చెప్పినా మీ అమ్మ వినలేదు ఈ పరిస్థితుల్లో వీడికి న్యాయం చెయ్యగలగుతే చాలు" అని. అటువంటి త్యాగమయి మీ అమ్మ. ఆమెకు తప్ప ఎవరికి ఉంటుంది ఈ కుటుంబం పట్ల బాధ్యత? "


అంతా విన్న వాసు తను అమ్మగురించి ఆలోచించే విధానానికి సిగ్గుపడ్డాడు. 


"ఇంకా నీ బైట తిండి గురించి ఖర్చు మాట అటుంచు ఒక్కసారి ఈ ఆల్బమ్ చూడు. నీ వయసులో నేను ఎలా ఉన్నానో, నువ్వు ఎలా ఉన్నావో చూడు. సర్దాగానేలే కానీ కాయకూరలు, పళ్ళు ఒంటికి కట్టుకుని ఉన్నట్లు బక్కపలచగా, హుషారుగా నేను, పిజ్జాలు బర్ గర్లు ఒంటికి కట్టేసుకుని ఊబకాయంతో మొయ్యలేక మోస్తూ వేలముఖం వేసుకుని నువ్వు. కనిపించడం లేదూ.. హ హ హ.. హాయిగా నవ్వెయ్యి! నవయువకుడా మేలుకో!" ఆల్బమ్ మూసిపెట్టి వచ్చి,.. వాసుకోసం ఇటు తిరిగేప్పటికి వాళ్ళ అమ్మ చేతుల్లో!


***

విజయా సుందర్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 


విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం

కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం

మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.


లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు. 

మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.



రచయిత్రి పరిచయం: https://www.manatelugukathalu.com/profile/vijayasundar

నా పేరు వారణాశి వెంకట విజయలక్ష్మి. కలం పేరు 'విజయాసుందర్'. నేను ముఖపుస్తక మాధ్యమాలలో రచనలు చేస్తుంటాను. గత 5 సంవత్సరముల నుండియే నేను వ్రాస్తున్నాను. ప్రముఖ ముఖపుస్తకము భావుకలో రెండు గొలుసు కథలు, రెండు సీరియల్స్, అనేక కథలు వ్రాసాను. పలు పోటీల్లో పాలుపంచుకుని అడపా దడపా బహుమతులు గెలుచుకున్నాను. భావుకథసలు పేరిట అచ్చు అయిన పుస్తకంలో నా కథ ' బాజా భజంత్రీలు' ఈనాడు పుస్తకపరిచయంలో చోటు చేసుకున్నది. 'కథాకేళి', 'ప్రియమైన నీకు, పిల్లలు చెప్పిన పాఠాలు' పుస్తకాలలో న కథలు అచ్చు అయ్యాయి. 'భావుక' లో 'బిజ్జు బామ్మ కబుర్లు' అనే శీర్షిక కొన్నాళ్ళు నడిపాను.మన కథలు మన భావాలు, ముఖపుస్తకం లో కూడా ఎన్నో కథలు రకరకాల కాన్సెప్ట్స్ కి తగ్గ రచనలు చేస్తూ ఉంటాను.

'లీడర్', 'ఉదయం', ఇంకా కొన్ని వెబ్ పత్రికలలో నా కథలు చాలా అచ్చయ్యాయి, పలువురి ప్రశంసలు అందుకున్నాయి. నా సాహితీ ప్రయాణంలో పలువురు సీనియర్ రచయితల సూచనలను అంది పుచ్చుకుంటూ నా రచనలను మెరుగు పర్చుకునే దిశలో ప్రయాణిస్తున్నాను. నమస్సులు!


Comments


bottom of page