top of page

తీర్పు

#SudhavishwamAkondi, #Theerpu, #తీర్పు, #సుధావిశ్వంఆకొండి, #TeluguMoralStories, #నైతికకథలు


Theerpu - New Telugu Story Written By Sudhavishwam Akondi

Published In manatelugukathalu.com On 05/05/2025 

తీర్పుతెలుగు కథ

రచన: సుధావిశ్వం ఆకొండి


పూర్వం మన దేశంలో సంస్కృతంలో పంచ మహా కావ్యాలు చదివి అర్ధం చేసుకుంటేనే పండితుడిగా పరిగణించే వారట! అవి మహాకవి కాళిదాసు రచించిన రఘువంశం, కుమారసంభవం, మేఘ సందేశం, మహాకవి భారవి రచించిన కిరాతార్జునీయం, మాఘ కవి రచించిన శిశుపాల వధ. 


 అలాగే తెలుగులో అల్లసాని పెద్దన రచించిన మను చరిత్ర, తెనాలి రామకృష్ణుడు రచించిన పాండురంగ మహత్యం, శ్రీకృష్ణ దేవరాయలు రచించిన ఆముక్త మాల్యద, రామరాజ భూషణుడు రచించిన వసు చరిత్ర, నంది తిమ్మన రచించిన పారిజాతాపహరణం పంచ మహా కావ్యాలుగా ప్రసిద్ధి చెందాయి. 


 ఇంకా శ్రీనాథుని రచనలు ఇవే పాఠాలు గా ఉండేవట! డెబ్బైలలో వరకూ కూడా. మా నాన్న వాళ్ళు చదువుకునేప్పుడు ఉందట. ఎందులోనిదో గుర్తులేదు, చిన్నప్పుడు మా నాన్న ద్వారా విన్న ఒక కథ మీ కోసం.. 


కొందరు పెద్దవాళ్లకు తెలిసేవుంటుందేమో మరి!


ఒక బ్రాహ్మణుడు తన ఊరి నుంచి దూరంగా ఉన్న ఊరిలో వాళ్ళింటికి కార్యక్రమం చేయించడానికి వెళతాడు. అక్కడ కార్యక్రమం పూర్తి అయ్యాక మార్గ మధ్యలో తినడానికి వాళ్ళిచ్చిన తినుబండారాలు మూటగా కట్టుకుని తిరుగుప్రయాణం అవుతాడు. 

 ఆ దారిలో ఒక చెట్టు క్రింద నిద్రమత్తు వచ్చినట్లుగా అనిపించింది ఆ బ్రహ్మణునికి. వెంటనే ఆ మూట ఒక పక్కన పెట్టి.. 

 'కాసేపు పడుకుని, లేచాక తినవచ్చులే!' అని అనుకుని, ఒక కునుకు తీస్తాడు. 


అదే సమయంలో.. 


 ఒక గద్ద ఒక పామును నోట కరుచుకుని ఆకాశంలో అదే దారిలో వెళుతూ ఉంటుంది. గద్ద నోటితో నొక్కడం వల్ల ఆ పాము విషం బయటకు కక్కేస్తుంది. ఆ విషం కాస్తా ఆకాశం నుంచి కిందకు జారుతూ సరిగ్గా ఈ బ్రాహ్మణుడు పక్కన పెట్టిన మూటలో పడుతుంది. బట్టతో కట్టి ఉండడం వలన ఆ విషం లోపలికి వెళ్లి తిండి పదార్థాలలో కలిసి పోతుంది. 

ఈ విషయం ఏమీ తెలియని ఆ బ్రాహ్మణుడు కాసేపటికి లేచి, మూట విప్పి ఆహారం తినేస్తాడు. అందులో చేరిన విషం ఆహారంతో పాటు శరీరం అంతా ప్రవహించి ఆ విష ప్రభావం వల్ల వెంటనే మరణిస్తాడు ఆ బ్రాహ్మణుడు. 


 కాసేపటికి విషయం తెలిసిన ఊరి జనాలు గుమిగూడి, అసలు ఎలా జరిగిందని చర్చించుకుంటారు. ఎవరికి తోచిన మాట వారు అంతా తలోమాట అంటుంటారు. కొందరు తినుబండారాలు మూట కట్టి ఇచ్చిన ఆ ఇంటివారిదే ఈ పాపం అని అన్నారు. ఆ మాటలు విని, ఆ ఇంటివాళ్ళు బాధ పడ్డారు. 


కొందరు గద్దదే తప్పు అనీ, మరికొందరు పాము విషం వదలడం వల్లనే జరిగింది కాబట్టి పాముదే తప్పు అనీ, కనుక ఈ పాపం ఆ ఇంటివారికి రాదని అంటే, ఇంకా కొందరు అసలు ఈ బ్రాహ్మణుడు మూట జాగ్రత్తగా పెట్టుకోకుండా తిని, మరణించాడు. కనుక అతనిదే తప్పని అన్నారు. ఎవరికి వారు మాదే సరియైన తీర్పని కాసేపు వాదులాడుకున్నారు కూడా!


ఇక్కడ ఇలా ఉండగా.. 

బ్రాహ్మణుడిని చంపిన పాపం ఎవరి ఖాతాలో వేయాలి అని తర్జన భర్జనలు అవుతుంటారు చిత్రగుప్తుల వారు కూడా. 


'తినుబండారాలు మూట కట్టి ఇచ్చిన ఇంటి వారిదా పాపం? గద్దదా? పాముదా? లేదా చూసుకోకుండా తిని, మరణించిన బ్రాహ్మణుడిదా?' అనుకుని ఎటూ తేలక యమధర్మరాజు గారి వద్దకు వెళ్లాడు ఆయన.


"స్వామీ! బ్రాహ్మణుడు మరణించిన ఈ పాపం ఎవరి ఖాతాలో వెయ్యలో అర్థం కావట్లేదు! ఏం చేయమంటారు ప్రభూ!" అని చిత్రగుప్తుడు అడిగిన వెంటనే సమవర్తిగా పేరుపొందిన యమధర్మరాజు అప్పుడు ఒక ధర్మసూక్ష్మం చెబుతాడు. ఆ తీర్పును చిత్రగుప్తులవారు అమలుజేస్తారు. 

 

"చిత్రాగుప్తా! విను! తినుబండారాలు ఇచ్చినవారు సదుద్దేశంతోనే ఇచ్చారు తప్ప, ఆయన్ని చంపాలని కాదు కనుక వాళ్లకు ఈ పాపం అంటదు! తన మూట అంతా బాగానే పెట్టుకున్నాడు, పాము విషం పడిందనే విషయం అతనికి తెలియదు కనుక ఆ బ్రాహ్మణుడిదీ దోషం లేదు! గద్దకు పాము ఆహారం కాబట్టి అది ఆకాశంలో ఎగురుతూ తీసుకుని వెళ్ళింది! ఇక పాముకి గ్రద్ద వలన ప్రాణసంకటం అవ్వడం వల్ల విషం చిమ్మింది కనుక ఈ రెండింటిది దోషం లేదు!" అని యమధర్మరాజు వివరించగా

 

"ప్రభూ! అయితే మరి ఈ పాపం ఎవరికి పోతుంది?" అని చిత్రాగుప్తుల వారు మళ్లీ అడిగితే.. 

"చిత్రాగుప్తా! పనీ పాట లేకుండా, తమ పని తాము చూసుకోకుండా, తమకు దోష నిర్ధారణ శక్తి ఉందా అసలు అనే విషయం ఆలోచించకుండా, ఇతరులపై నిందలు వేసేవారి ఖాతాలో ఈ పాపం వేసెయ్యి! 


అక్కడ గుమిగూడిన జనాలు ఆహారం ఇచ్చిన వారితో 'తినుబండారాలు ఇవ్వడం తప్పు, మీకు పాతకం చుట్టుకుంటుంది' అని భయపెడుతూ, పనికిమాలిన తీర్పులు చెబుతూ నిలబడిన ఆ జనం ఖాతాలో ఈ బ్రహ్మహత్య పాతకం వేసేయ్యి!" అని తీర్పు చెప్పారట యమధర్మరాజు గారు. 


 అందుకే ఇతరులపైన అవాకులు, చెవాకులు తూలకూడదు! సామాన్యులకు ధర్మం పైకి కొంచెం అర్ధమయినా, ధర్మసూక్ష్మం జ్ఞానులకు మాత్రమే తెలుస్తుందట! ఏది పడితే అది, ఎవరిని పడితే వారిని నోరు ఉంది కదానని నోటికి వచ్చినట్లు వాగితే ప్రమాదంలోకి వెళతారనే నీతి ఈ కథ తెలియజేస్తుంది. అందుకే అనవసర ప్రసంగాలు చేసి ఆరోగ్యం పాడుచేసుకోవద్దు అంటారు పెద్దలు. 


 మీ అభిప్రాయం కామెంట్స్ లో తెలుపండి


శ్రీకృష్ణార్పణమస్తు

����������

సుధావిశ్వం



-సుధావిశ్వం





Kommentare


bottom of page