వెండి కంచం
- Srinivasarao Jeedigunta
- May 6
- 6 min read
#JeediguntaSrinivasaRao, #VendiKancham, #వెండికంచం , #JeediguntaSrinivasaRao, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Vendi Kancham - New Telugu Story Written By Jeedigunta Srinivasa Rao
Published In manatelugukathalu.com On 06/05/2025
వెండి కంచం - తెలుగు కథ
రచన : జీడిగుంట శ్రీనివాసరావు
(ప్రముఖ రచయిత బిరుదు గ్రహీత)
కథా పఠనం: మల్లవరపు సీతారాం కుమార్
శర్మ గారు విజయవాడ కి దగ్గరలో వున్న పల్లెటూరు లో రెడ్డిగారి ఆయిల్ మిల్లులో గుమస్తాగా చేస్తున్నాడు. శర్మగారి భార్య అన్నపూర్ణ, భర్త ఎక్కువ సమయం మిల్లులోనే గడుపుతో వుండటం తో యింటి బాధ్యత, పిల్లల చదువు బాధ్యత తనే తీసుకుని భర్తకి శ్రమ కలగనిచ్చేది కాదు. శర్మ గారి మొదటి అబ్బాయి రమణ, రెండవ కొడుకు పేరు శ్రీనిధి. యిద్దరికి వయసులో రెండు సంవత్సరాల తేడా మాత్రమే ఉండటం తో ఒక క్లాస్ తేడాతో స్కూల్ లో చదువుకుంటూ ఉండేవారు.
రెడ్డిగారు యిచ్చే జీతం తక్కువ, వెనుక ఎటువంటి ఆస్తిపాస్థులు లేకపోవడం తో శర్మగారు అన్నపూర్ణ ఆడంబరాలకి పోకుండా బండి నడిపేవారు.
“నాన్నా! మా మాస్టర్ స్కూల్ ఫీజు రేపు తీసుకొని రాకపోతే స్కూల్ కి రావద్దు అన్నారు” అని చెప్పారు పిల్లలు యిద్దరూ శర్మగారు భోజనం చేస్తో వుండగా.
“రేపు స్కూల్ కి వెళ్లేటప్పుడు డబ్బులు తీసుకుని వెళ్ళండి” అన్నాడు ఏదో ఆలోచిస్తో.
పిల్లలు పక్క గదిలోకి వెళ్లిన తరువాత అన్నపూర్ణ అడిగింది, “రెడ్డిగారు జీతం యిచ్చారా” అని.
“యిచ్చారు. అయితే ఈ రోజు జీతాలు పంచినప్పుడు పదివేల రూపాయలు ఎవ్వరికో ఎక్కువ వెళ్లిపోవడం తో నా జీతం లోనుంచి పదివేలు క్యాష్ బాక్స్ లో వుంచాను.
మిగిలిన అయిదు వేలు అద్దె కట్టి, బియ్యం పంపమని డబ్బులు షాపులో కట్టి వచ్చాను” అన్నాడు.
“కరువులో అధికమాసం అన్నట్టు డబ్బులు పోవడం ఏమిటండి, యిప్పుడు రేపు పిల్లలకు ఫీజు డబ్బులు యిస్తాను అన్నారు ఎలా?” అంది అన్నపూర్ణ.
“మీ నాన్న మనపరిస్థితి ముందే ఊహించారేమో మన పెళ్ళిలో వెండి కంచం పెట్టారు. రోజు దానిలో భోజనం చేస్తేగాని నువ్వు వూరుకునే దానివి కాదు. త్వరగా కంచం కడిగి తీసుకునిరా. మార్వాడి షాప్ కట్టేసే లోపు వెళ్లి వెండి కంచం తాకట్టు పెట్టి డబ్బులు తెస్తాను” అన్నాడు.
వెండి కంచం శుభ్రంగా తుడిచి సంచిలో పెట్టి భర్తకు యిస్తో, “పెద్దాడిని తీసుకుని వెళ్ళండి” అంది.
“వద్దులే. వాళ్ళ ఫీజులు కట్టలేక వెండికంచం తాకట్టు పెట్టాను అని వాళ్ళకి తెలియడం మంచిది కాదు” అన్నాడు సంచి పట్టుకుని బయటకు నడుస్తో.
ఉదయం పిల్లలతో స్కూల్ కి వెళ్లి ఫీజులు కట్టేసి, ఆ విషయం హెడ్ మాస్టర్ కి చెప్పి పిల్లలు ఎలా చదువుతున్నారు అని అడిగి తెలుసుకుని మిల్లు కి వెళ్ళాడు.
తన గది ముందు సుబ్బారావు- మిల్లు సెక్యూరిటీ ఆఫీసర్ నుంచుని ఉండటం చూసి, “సుబ్బారావు గారూ! నాతో ఏమైనా పని వుందా” అని అడిగాడు శర్మ గారు.
“అవును సార్, లోపలకి పదండి” అన్నాడు సుబ్బారావు.
శర్మగారు తన కుర్చీలో కూర్చుని ఎదురంగా వున్న లక్ష్మి దేవి ఫోటోకి నమస్కారం చేసుకుని, “చెప్పండి సుబ్బారావు గారు” అన్నాడు.
“సార్! నిన్న నాకు యిచ్చిన జీతం కవర్లో పదివేల రూపాయలు ఎక్కువ వచ్చాయి. మానవ స్వభావం తో ఒక్క క్షణం మనస్సు ఆ డబ్బులు ఉంచేసుకో అని అంది, అయితే వివేకం వీపు మీద చరిచి తప్పు శర్మగారు లాంటి నిజాయతీ, మంచి తనం గలిగిన వాడిని మోసం చేస్తావా అని అనడం తో నాకు ఎక్కువగా వచ్చిన డబ్బులు తీసుకుని మీ దగ్గరికి వచ్చాను” అంటూ డబ్బులు శర్మగారి చేతికి అందించాడు.
“కృతజ్ఞతలు సుబ్బారావు గారూ! ఈ కాలం లో డబ్బులు తిరిగి రావడం అనేది చాలా గొప్ప విషయం. మిమ్మల్ని భగవంతుడు మంచిగా చూడాలి” అని చెప్పాడు.
ఆరోజు సాయంత్రం రెడ్డిగారికి చెప్పి త్వరగా మిల్లు నుంచి బయటకు వచ్చి డైరెక్టుగా మార్వాడి షాప్ కి వెళ్ళి డబ్బులు కట్టేసాడు.
షాప్ యజమాని “సార్! నిన్న రాత్రి డబ్బులు తీసుకుని ఈ రోజు యిచ్చేసారే, వడ్డీ వద్దులెండి, ఈ వెండి కంచం మీ దగ్గర నుంచి మా దగ్గరికి చాలా సార్లు వచ్చింది” అన్నాడు.
కంచం తీసుకుని సంచిలోపెట్టుకుని యింటికి వచ్చి అన్నపూర్ణ కి చూపించాడు.
“మీరు కష్టపడి సంపాదించింది అవ్వడం వల్ల తిరిగి డబ్బు మీకు దక్కింది” అంటూ వెండి కంచం కడిగి భర్తకు భోజనం పెట్టింది.
వెండి కంచం డబ్బులు అవసరం పడినప్పుడల్ల మార్వాడి షాప్ కి వెళ్లి వస్తోంది. పెద్ద కొడుకు రమణ ఇంటర్మీడియట్ లో మంచి ర్యాంక్ లో పాస్ అయినా ఎంసెట్ లో మంచి ర్యాంక్ రాకపోవడం తో బంగారం, వెండి రేట్స్ పెరగడంతో వెండికంచం తోపాటు అన్నపూర్ణ మెడలో వున్న బంగారం గొలుసు కూడా మార్వాడి దగ్గరకి చేరింది.
ఎన్నో ఏళ్ళ నుంచి పరిచయం వుండటంతో మార్వాడి రాంలాల్ శర్మగారిని కూర్చోపెట్టి “ఎందుకు యిలా ఈసారి బంగారం గొలుసు కూడా తాకట్టు పెడుతున్నారు” అని అడిగాడు.
“మీ దగ్గర దాచేది ఏముంది రాంలాల్ సాబ్” అంటూ “పెద్దకొడుకుని ఇంజనీరింగ్ కాలేజీలో చేర్పించాలి” అని చెప్పాడు.
అంతా విన్నా రాంలాల్ శర్మాజీ “మీరు చాలా అదృష్ట వంతులు, పిల్లలు చదవు అంటే యిష్టం చూపుతున్నారు, నాకూ వున్నారు యిద్దరు పిల్లలు. చదువుకోరు. పోనీ వ్యాపారం లో పెడితే డబ్బులు మాయం చేస్తున్నారు. చివరికి మొండి బాకీల వాళ్ళని బెదిరించడానికి రౌడీలుగా ఉపయోగపడుతున్నారు” అన్నాడు.
“డబ్బులు ఎక్కువ వుండకూడదు శర్మగారు, ఉంటే పిల్లలు వృద్ధిలోకి రారు” అని, “ఉదాహరణకి నేను నా పిల్లలు” అన్నాడు.
“అయ్యో! అలా బాధపడకండి. వాళ్లే తెలుసుకుని మీ వ్యాపారం లో బాధ్యత తీసుకుంటారు” అన్నాడు శర్మగారు.
“డబ్బులు ఎంత కావాలి సార్?” అన్నాడు, ‘వెండి కంచం, గొలుసు- శర్మగారు’ అని వ్రాసిన సంచిలో వేసి బీరువాలో పెడుతూ.
“రెండు లక్షలు కావాలి, మా నగలు మీద అంత వస్తుందో రాదో కాని నాకు రెండు లక్షలు కావాలి” అన్నాడు శర్మగారు.
బీరువాలోనుంచి నాలుగు అయిదు వందల రూపాయల కట్టలు తీసి శర్మగారికి యిచ్చాడు రాంలాల్.
“ఇదేమిటి నోటు లో లక్షాయాభైవేలు అని రాసారు, నాకు కావలిసింది రెండు లక్షలు” అన్నాడు సంతకం పెట్టకుండా.
“మీకు యిచ్చింది కూడా రెండు లక్షలే శర్మగారు, మీతో మీ వెండికంచంతో ఇరవై ఏళ్ళ అనుబంధం నాకు. మా పిల్లలకు చదువు అబ్బలేదు, ఇన్నేళ్లు మీ దగ్గర నుంచి తీసుకున్న వడ్డీ మీ అబ్బాయి చదువు కోసం తిరిగి యిచ్చేస్తున్నాను. దీనివల్ల అయినా మా పిల్లలు బాగుపడితే చాలు” అన్నాడు రాంలాల్.
“అయ్యా! ఇతరుల సహాయం తో మా అబ్బాయి కి చదువు చెప్పించాలి అనుకుంటే మా మిల్లు యజమాని రెడ్డిగారికి విషయం చెప్పితే చాలు, ఆయనే తగిన సహాయం చేసేవాడు. నాకు యిష్టం లేదు, దయచేసి రెండు లక్షల కి నోట్ రాయించుకోండి” అన్నాడు శర్మగారు.
“ముందు మీరు ఈ డబ్బులు తీసుకుని మీ అబ్బాయి కాలేజీలో చేరిపించే పని చూడండి. తరువాత మీరు బాకీ తీర్చే సమయంలో మీరు అనుకున్నట్టే యిద్దురు గాని” అన్నాడు రాంలాల్.
పెద్ద పిల్లాడిని ఇంజనీరింగ్ లోను, చిన్నాడిని ఇంటర్మీడియట్ లో జాయిన్ చేసాడు.
చిన్నకొడుకు శ్రీనిధి, తల్లి మెడ బోసిపోయి ఉండటం చూసి “అమ్మా! నీ గొలుసు వేసుకోవడం లేదు, నాన్న స్టీల్ కంచం లో తింటున్నాడు. వెండి కంచం ఏమైంది?” అని అడిగాడు.
“పెద్దదానిని అవుతున్నాను కదా, మెడ నొప్పిగా ఉంటోంది అని గొలుసు దాచిపెట్టాను” అంది అన్నపూర్ణ.
మెడ నొప్పి పెట్టే అంత బరువైన గొలుసు కాదు అని, బహుశా అన్నగారి చదువు కి అమ్మేసారేమో అనుకుని, “అమ్మా నేను పెద్ద ఉద్యోగం చేసి నీకు వడ్డాణ్ణం చేయిస్తా, అప్పుడు నడుం నొప్పిగా వుంది అని పెట్లో దాయకు” అన్నాడు.
పిల్లలకు చదువులు పూర్తి అవ్వడం, విశాఖపట్నం లో ఉద్యోగాలు రావడం, వాళ్ళ ఆఫీసులలో పని చేసి అమ్మాయిలని పెళ్లిచేసుకోవడం జరిగిపోయాయి. పిల్లలా అభిమాతం కి ఎదురు చెప్పకుండా వాళ్ళ సంతోషమే తమ సంతోషం అని భావించి అన్నిటికి సరే అన్నారు శర్మగారు అన్నపూర్ణ గారు.
శర్మ గారి రిటైర్మెంట్ కి కొడుకులు కోడళ్ళు వచ్చారు. రెడ్డిగారు తన మిల్లు అభివృద్ధి కి ముఖ్య కారణం శర్మగారి నిజాయితీ అని తెగ పొగిడి మంచి డిన్నర్ యిచ్చి, వెళ్లిపోయేముందు ఒక్క శర్మగారికి వినిపించేడట్లుగా ‘ఈసారి దస్త్రం లో కూడా మీకు మూడు నెలల బోనస్ యిస్తాం’ అన్నాడు.
పువ్వుల దండలు టేబుల్ మీద పడేసి, “పిల్లలూ! మీరు నలుగురూ ఒకసారి యిటువచ్చి కూర్చోండి” అన్నాడు. “రేపటి నుంచి నాకంటూ సంపాదన ఏమి వుండదు” అన్నాడు. “యిహ మా శేషజీవితం సుఖంగా గడిచిపోవాలని మా ఆశ అన్నాడు” శర్మ గారు.
పిడుగులాంటి ప్రశ్నకి కొద్దిగా కంగారు పడిన ఆ నలుగురు “ఏముంది నాన్న.. మీరు, అమ్మా నా దగ్గర ఆరునెలలు, ఆ తరువాత తమ్ముడి దగ్గర ఆరునెలలు, మళ్ళీ నా దగ్గర.. వుందురు గాని. మీరు ఇక్కడి సామాను అమ్మేసి ఆడబ్బులు పట్టుకుని వచ్చేసేయండి. అయినా మేమిద్దరం వుండేది ఒకే ఊరు కాబట్టి పెద్దగా యిబ్బంది వుండదు” అన్నాడు చిన్న కొడుకు.
“ఒకే ఊరిలో వున్నా మీ దగ్గర విడిగా వుండే దానికంటే యిక్కడే వుంటాము. మీరు నలుగురు వచ్చి చూసి వెళ్తో వుంటారు కాబట్టి పర్వాలేదు” అన్నాడు శర్మగారు.
“మీ యిష్టం నాన్న, మీకు స్వతంత్ర గా ఉండటం అలవాటు అవ్వడం తో కొడుకుల దగ్గర ఉండటానికి యిబ్బంది అనుకుంటున్నారు. మీ అభిప్రాయం మారినప్పుడు మీరే వస్తారు అని ఆశిస్తున్నాము” అని చెప్పి వెళ్లిపోయారు.
“పిల్లలు రమ్మంటే అలా అన్నారేమిటండి” అంది అన్నపూర్ణ.
“మొదట్లో బాగానే ఉంటుంది, తరువాత నిన్ను ఒకడు, నన్ను ఒకడు పంచుకుంటారు. ఈ వయసు లో యిద్దరం విడివిడిగా బతకడం అవసరమా” అన్నాడు శర్మగారు.
“అవసరం లేదు సరే. మరి ఈ నెల నుంచి జీతం రాదుగా. ఎలా..? ఒక్కసారిగా జీతం లేకపోతే” అంది.
“పర్వాలేదు. రిటైర్ అయిపోయినంత మాత్రన మనం యిహ మనం ఎందుకు పనికిరాము అని అనుకోవడం తప్పు. మనిషి ఓపికగా, జీవించినంత వరకు తన సంపాదన తను సంపాదించుకోవాలి.
ఆలోచన అలా వుంటే రిటైర్ అయిన తరువాత కూడా ఓపిక వస్తుంది. అందుకే ఈ ఊరిలో టిఫిన్ రూమ్ పెట్టి నలుగురికి పనికల్పించి మనం కూడా పనిచేసి మన ఆహారం మనము సంపాదించుకుందాము” అన్నాడు.
“మీ కలలు బాగానే వున్నాయి మరి పెట్టుబడి మాట ఏమిటి” అంది అన్నపూర్ణ.
“కష్ట సమయంలో మనల్ని ఆడుకుంటున్న వెండి కంచం ఉందిగా. అది అమ్మేసి ఆ డబ్బుల తో చిన్నగా వ్యాపారం మొదలుపెడతాము. నీ సహకారం ఎంతో అవసరం అన్నపూర్ణ ఈ విషయం లో” అన్నాడు శర్మగారు.
వెండి కంచం మార్వాడి షాప్ కి చేరింది. అయితే తాకట్టు కి కాదు అమ్మకానికి.
హోటల్ విషయం విన్న రాంలాల్ “ఓపిక వున్నంతవరకు సంతానం మీద ఆధారపడకుండా మీరు జీవించాలి అని అనుకోవడం గొప్పనిర్ణయం. అయితే మీ వెండి కంచంకి ఖరీదు యిస్తాను, అయితే మీరు మీ హోటల్ మీద సంపాదించుకుని ఈ వెండి కంచం మీరు కొనుక్కోవాలి అని నా ఆకాంక్ష”
రెండు కిలోల బరువు వున్న వెండి కంచం కి రెండు లక్షలు డబ్బు యిచ్చి శుభాకాంక్షలు తెలిపాడు రాంలాల్.
‘శుచి మా ఆచారం’ అంటూ అమ్మా హోటల్ మొదలు పెట్టారు. ‘తింటే టిఫిన్ అమ్మా హోటల్ లో తినాలి’ అనే పేరు రావడం తో ఉదయం నుంచి జనం తో కిటకిటలాడుతో ఉండేది. గల్లా పెట్టి నిండుతో ఉండటం తో రోజుకి నాలుగైదు సారులు మార్చాలిసి వస్తోంది.
యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వచ్చి ఈ వయసులో కష్టపడి సంపాదిస్తున్న దంపతులు, తింటే సాంబార్ ఇడ్లీ యిక్కడే తినాలి అంటూ షార్ట్ ఫిల్మ్స్ తీసి జనం లోకి వదలటం తో పక్క వూరిలో వాళ్ళు కూడా వచ్చి టిఫిన్ తినడం మొదలుపెట్టారు.
జనం వత్తిడికి జొమాటో లాంటి వాళ్ళతో ఒప్పందం కుదుర్చుకున్నాడు శర్మగారు. ఒక రోజు రాంలాల్ గారు కూడా వచ్చి టిఫిన్ తిని, మా అమ్మ చేసిన టిఫిన్ లా వుంది అంటూ సంతోష పడ్డాడు.
టీవీలో తండ్రి పెట్టిన హోటల్ వార్త విని కొడుకులు కోడళ్ళు స్వంత గ్రామం చేరుకున్నారు. డిమాండ్ బాగా వున్నప్పుడే మనం బ్రాంచిలు పెట్టాలి అని తండ్రిని ఒప్పించి చుట్టుపక్కల టౌన్స్ లో రెండు అమ్మా టిఫిన్స్ పేరు మీద రెండు హోటల్స్ తెరిచి కొడుకులద్దరూ వ్యాపారం మొదలుపెట్టారు.
అదృష్టం పడితే అంతే అమ్మా టిఫిన్స్ పేరుకి ఎదురు లేకుండా వుంది. ఒక రోజు సాయంత్రం క్యాష్ కౌంటర్ దగ్గర భార్య అన్నపూర్ణ ని కూర్చోపెట్టి తను మార్వాడి షాప్ కి వెళ్ళి “మీరు ఆ వెండికంచం నిజంగానే తిరిగి నాకు అమ్మేస్తారా” అని ఆడిగాడు శర్మగారు.
“పేరు కి కంచం నా దగ్గర వున్నా అది మీదే శర్మగారు. మీ శ్రమ ఫలించి ఏదో ఒకరోజు మీ వెండి కంచం తీసుకుంటారు అని నాకు ముందే తెలుసు. యిప్పుడు మీరే నాలాంటి వాళ్లకు డబ్బు అవసరం అయితే ఇవ్వగలరు” అన్నాడు డబ్బులు తీసుకుని వెండి కంచం యిస్తో.
“మీ సహాయం లేకపోతే నేను యింత వాడిని అయ్యేవాడిని కాను రాంలాల్ గారు” అంటూ వెండి కంచం తో యింటికి చేరాడు.
రిటైర్ అవ్వగానే జీవితం అయిపొయింది అని క్రుంగి పోకుండా నాకే నేను ఏదైనా సాధించగలను అనుకుంటే చివరి వరకు మనము ఎవ్వరి మీద ఆధారపడకుండా పదిమందికి ఆధారం చూపించగల పని చేసుకోగలం.
ఆలోచించండి.
శుభం
జీడిగుంట శ్రీనివాసరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ జీడిగుంట శ్రీనివాసరావు గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
నా పేరు జీడిగుంట శ్రీనివాసరావు. నేను గవర్నమెంట్ జాబ్ చేసి రిటైర్ అయినాను. నేను రాసిన కథలు అన్నీ మన తెలుగు కథలు లో ప్రచురించినందులకు ఎడిటర్ గారికి కృతజ్ఞతలు.
30 /10 /2022 తేదీన హైదరాబాద్ రవీంద్ర భారతిలో మనతెలుగుకథలు.కామ్ వారిచే సన్మానింపబడి, ప్రముఖ రచయిత బిరుదు పొందారు.


@getrags555
• 5 hours ago
Bagundi ..
@t.s.sbhargavateja6196
•5 hours ago
Super story.
@saipraveenajeedigunta8361
•20 hours ago
Very inspiring