![](https://static.wixstatic.com/media/acb93b_74f6674f79ec4178ac47875cdf8fbc6c~mv2.jpg/v1/fill/w_147,h_83,al_c,q_80,usm_0.66_1.00_0.01,blur_2,enc_auto/acb93b_74f6674f79ec4178ac47875cdf8fbc6c~mv2.jpg)
'Wrong Society' - New Telugu Story Written By Pitta Gopi
Published In manatelugukathalu.com On 11/01/2024
'రాంగ్ సొసైటీ' తెలుగు కథ
రచన: పిట్ట గోపి
సృష్టికి మూలం స్త్రీ. ఈ స్త్రీలు ఒకప్పుడు వంటింటికే పరిమితం అయ్యారు. అది ఒకప్పటి సంస్కృతి అనేవారు అప్పట్లో. రానురాను అటు మగవాళ్ళు ఇటు ఆడవాళ్లు ఆ సంస్కృతికి స్వస్తి పలికారు. కాలక్రమేణా ఆడవాళ్ళు వంటింటి నుండి బయటపడి మగవారితో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తూ మగవారికి దీటుగా ఎదిగారు. దీన్ని అభివృద్ధి అంటారు.
ఇక్కడి వరకు బాగుంది. ఇక్కడి నుండి గాడి తప్పింది. అటు ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు తమ తమ పరిధి దాటి ప్రవర్తిస్తుండటంతో ఎందరో మేధావులు పెదవి విరుస్తున్నారు.
ముఖ్యంగా చాలామంది మగవాళ్ళు స్త్రీలను అగౌరవపరుస్తూ.. ఆడవాళ్ళుని తప్పుడు కోణంలో చూస్తూ సమాజంలో రాక్షసుల కంటే కూడా ఘోరంగా తయారవుతున్నారు.
ప్రస్తుతం స్త్రీలకు ఎక్కువగా మూడు సమస్యలు వెంటాడుతున్నాయి వాటి వలన స్త్రీలు బెంబేలెత్తుతున్నారు.
అవి అత్యాచారం, వరకట్న వేధింపులు, ఆడబిడ్డకు జన్మనిచ్చిందని అత్తారింటి నుండి హింసించబడి తరిమివేయబడటం.
మొదటిది అందరూ మహిళలకు జరగకపోవచ్చు కానీ.. ! తర్వాత రెండు మాత్రం దాదాపు ప్రతి ఆడది అనుభవిస్తుంది.
కొందరు ధైర్యంగా ఎదిరించి పోరాడుతుంటే మరికొందరు ధైర్యంగా, ఆర్థిక బలము లేక చితిమంటల్లా చితికిపోతున్నారు.
ఓ వృద్దాశ్రమంలో అగ్నిప్రమాదం జరిగి అందరు వృద్దులు అగ్నికి ఆహూతులై మరణించగా రాయుడనే అరవై ఏళ్ల వృద్దుడు గాయాలతో బయటపడ్డాడు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న అతడి వద్దకు ఓ మహిళ పోలీసాఫీసర్ వచ్చి ప్రమాదం పై ఆరా తీసింది. వెళ్తు వెళ్తు.. మంచి మనసు కల్గిన ఆ ఆఫీసర్ అతడికి ఆసరాగా ఉన్న ఆ వృద్దాశ్రమం ఇప్పుడు లేదు కదా.. అతనికి బతుకు ఎలా అని ఆలోచించింది.
"సార్ మీ పిల్లలు ఎవరో చెప్పండి ఇప్పుడు మీకు ఆదుకునే ఆశ్రమం లేదు కదా.. ! నేను మీ పిల్లలతో మాట్లాడించి మిమ్మల్ని చూసుకునేలా చేస్తా"నని చెప్పింది
"వద్దమ్మ నా మొదటి భార్య శాపం ఇది. ఆడపిల్లగా నీకు ఉన్న మనసు మగవాడిగా నా కొడుకునకు ఉంటే ఈరోజు ఇక్కడ ఉండేవాడిని కాదు” ఆంటు తన గతాన్ని చెప్పాడు.
తనకి ఒక చెల్లి గారాలపట్టి ఉంది. ఆమె పేరు స్పందన. తండ్రి లేకపోయినా రాయుడు సంపాదనతో ఆమె చదువుకోగలిగింది. ఆమె తన ఇంటికి ఒక దీపంలా పెంచాడు రాయుడు. స్పందన తప్పులను దండించే తల్లి సుమిత్రని సైతం రాయుడు వారించేవాడంటే చెల్లిపై రాయుడికి ఏపాటి ప్రేమ ఉందో అర్ధం అవుతుంది.
కష్టపడి సంపాదించే రాయుడు తాను ముందు పెళ్లి చేసుకోకుండా చెల్లికి ఘనంగా పెళ్ళి చేసి అత్తారింటికి పంపాడు.
చెల్లెలు తమ నుండి వెళ్ళేటప్పుడు తల్లి కంటే రాయుడు ఎంతో బాదపడ్డాడు.
ఇక కొన్నాళ్ళకి అంతా సర్దుకుంది.
రాయుడు పని చేసుకుంటు తల్లిని బాగానే చూసుకుంటు బతుకు నడిపాడు.
రాయుడికి వయసు పెరుగుతుండటంతో తల్లి అతడికి పూజ అనే అమ్మాయిని చూసి పెళ్ళి చేసింది. ఆ అమ్మాయిని రాయుడు ప్రేమించాడు కూడా. అప్పటికే చెల్లి స్పందనకు రెండేళ్ల పాప ఉంది. మొదటిసారి పాపను చూసి ముచ్చటపడ్డాడు.
రోజులు గడుస్తున్నాయి ఇప్పుడు రాయుడు ఇంట్లో ముగ్గురు. తల్లి, రాయుడు, చెల్లికి బదులు భార్య పూజ.
వారిని బాగానే చూసుకుంటున్నాడు.
అప్పుడప్పుడు భవిష్యత్ ని తలుచుకుంటు భయపడుతుండేవాడు.
ఎందుకంటే రోజులు మారుతున్నాయి కదా.. ! ఎంత కష్టపడుతున్నా.. కుటుంబ పోషణ గాడీ తప్పుతుంది కారణం.. నిత్యవసర ధరలు వంటివి పెరగటం.
ఏదైతేనేం.. ! రాయుడికి పూజ కూడా సంపాదనలో తోడు నిలుస్తున్నా అతడికి తృప్తి ఉండటం లేదు. అతడి ఆలోచనలో మార్పు వచ్చింది. ఎప్పుడూ, భవిష్యత్తులో ఎక్కువ డబ్బులు అవసరం అయితే ఏం చేయాలనేది అతడికి కలవరపెడుతుంది.
అలా కొంతకాలం గడిచాక పూజ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
ఆసుపత్రిలో పూజ తప్ప రాయుడు, సుమిత్రలు విచారంగా ఉన్నారు.
పూజ వారిని గమనించి
"ఏమైందండి, ఎందుకలా ఉన్నారు" ప్రశ్నించింది.
రాయుడు నిట్టూర్చుతు
"మగపిల్లవాడు అయితే బాగున్ను ఆడపిల్ల అయింది" అన్నాడు.
"అవునమ్మ, మగపిల్లవాడు అయితే పెద్దయ్యాక తమకు సహయపడేవాడు బాగా చూసుకునేవాడు కదా.. "అని అత్తగారు సుమిత్ర అంది.
"అదేంటి అత్తయ్య ఎవరు పుట్టిన సంతోషించాలి కదా.. మన దృష్టిలో ఆడ మగ సమానమేగా.. ! మీరేంటీ ఇలా కొత్తగా మాట్లాడుతున్నారు.. ?” ప్రశ్నించింది పూజ.
రాయుడు కోపంతో
"ఏమె.. మగబిడ్డ కావాలనే నా ఆశలు చంపి ఆడపిల్లకు జన్మనిచ్చింది చాలక ఆడ మగ సమానమే అంటావా.. వెళ్ళు.. వెళ్ళి నీ అమ్మగారింట్లో ఈ ఆడపిల్లని మగపిల్లాడిగా పెంచుకో " అంటాడు.
"ఏంటండీ ఆ కోపం.. ! నేనేదో కావాలనే ఆడబిడ్డని కన్నట్లు మీ అమ్మగారు, మీరు నన్ను నిందితురాలిని చూసినట్లు చూస్తున్నారు" ఏడుస్తుంది.
" ఏడువు.. బాగా ఏడువు కానీ.. నీ ఏడుపు మగబిడ్డ పుట్టలేదనే నా బాధకు సరితూగదు. అసలు నిన్ను అనవసరంగా పెళ్ళి చేసుకున్నాను" ఆవేశంతో ఊగిపోయాడు రాయుడు.
"ఏవండీ.. ! పిచ్చి పిచ్చిగా వాగకండి. ఏంటీ.. ! ఆడపిల్ల పుడితే మీకు వచ్చిన నష్టం.. ?” అంతే ఆవేశంతో అడిగింది పూజ.
ఆ మాటలకు రాయుడు పురిటి నొప్పులతో బాధపడుతుందని కూడా చూడకుండా పూజని ఆసుపత్రిలోనే విచక్షణ రహితంగా కొట్టి
"ఆడ మగ సమానమే అన్నావు కదా.. ! ఆ ఆడబిడ్డను మగబిడ్డలాగే పెంచుకో పో.. నా ఇంటి గడపతొక్కావో.. " అంటూ తల్లిని తీసుకుని వెళ్ళిపోతాడు. ఆ రాత్రికి మెల్లగా అత్తారింటికి చేరుతుంది పూజ.
ఆడబిడ్డతో లోపలికి ప్రవేశించగ
"ఆగు.. ఒక్కసారి చెబితే అర్థం కాదా నీకు పోయి నీ కన్నోరింటి వద్ద పెంచుకో" అని చెంప చెళ్లుమనిపించాడు పూజకి.
" హే ఆడబిడ్డ పుట్టిందని ఇంత ఆక్రోశంతో ఊగిపోతున్నావు కదరా.. నువ్వు కూడా ఒక ఆడదానికే పుట్టినావు. ఆ ఆడదే లేకుంటే.. ! నీ పుట్టుక ఉండేది కాదురా.
ఆడదిగా ఇన్నేళ్ళు నాతో సంసారం చేసి ప్రేమగా నన్ను చూసుకుని ఆడబిడ్డ పుట్టిందని ఇప్పుడు నన్ను క్రూరంగా హింసిస్తున్నావా..
ఒక ఆడదానిపై చెయ్యెత్తి తనకు తాను శక్తివంతంగా నిరూపించుకోవాలనుకునేవాడు ఈ ప్రపంచంలో అత్యంత బలహీనుడు.
ఈ మగవాళ్ళు ఇంతే! ఒక ఆవుకు ఆడదూడ జన్మిస్తే సంబరపడతారు కానీ.. ! ఒక మనిషికి ఆడబిడ్డ పుడితే చెత్తలో పారేయటం, రోడ్లపై వదిలేయటం, జన్మనిచ్చిన ఆడదాన్ని నిందించటం సరామాములే.
వెళ్తాను.. నా ఆడబిడ్డని తీసుకుని నా పుట్టింటికే వెళ్తాను. వెళ్ళేటప్పుడు ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి
మగవాడు పుడితే బాగా చూసుకుంటాడని ఎలా అనుకుంటారు. రేపు మిమ్మల్ని వృద్దాశ్రమంలో అయినా చేర్పిస్తాడేమో.. ఎవరికి తెలుసు.
ప్రేమ, మమకారం, ఆప్యాయతానురాగాలు పంచేది ఆడది. అలాంటి ఆడది పుడితే దేవత పుట్టినట్లు ఆనందించకుండా నన్ను తరిమేశారు. ఆడదంటే అబల కాదురా ఆదిపరాశక్తి. నా కూతుర్ని గొప్పదాన్ని చేస్తాను. ఏదో ఒకరోజు గొప్పదైన నా కూతుర్ని అదే.. ! నువ్వు వద్దనుకున్న ఆడబిడ్డను నీ వద్దకు కాలమే పంపిస్తుంది. అప్పటికి కానీ నీకు, ఈ మగవాళ్ళకి అర్థం కాదు ఆడబిడ్డ శక్తి ఏపాటిదో " ఆంటూ కన్నీరు పెట్టి రాయుడుని వదిలి వెళ్ళిపోయింది పూజ.
ఏ మాత్రం బాధపడకుండా రాయుడు దర్జాగా మరో పెళ్ళి చేసుకున్నాడు.
ఈ విషయం తెలిసి చెల్లెలు స్పందన వచ్చి తనకు కూడా ఆడబిడ్డ పుట్టినప్పుడు ముచ్చటపడిన విషయం గుర్తు చెసి నచ్చజెప్పింది. రాయుడు వినలే. ఎందుకంటే అప్పటికే సమాజంలో ఆడపిల్లలు పుడితే చాలు ఎక్కడో ఒకచోట పసికందులుగా శవాలుగా మారుతున్న వార్తలు వస్తూనే ఉండటం.
వారికంటే తానే నయమని చంపకుండా పంపేశానని తనకుతాను సర్దిచెప్పుకునేవాడు రాయుడు.
కొంతకాలానికి రాయుడికి రెండో భార్య రూపంలో మగబిడ్డ జన్మించాడు. తల్లి ముందే అనారోగ్యంతో మరణించగా రాయుడికి అరవై ఏళ్ల వయసులోనే, వృద్దాశ్రమంలో చేర్పించాడు ఆ కొడుకు.
అలా ఆ ఆఫీసర్ వద్ద తన జీవితగాథ వివరించగా..
తన తల్లి యొక్క జీవితం తెలిసిన ఆమె రాయుడి పాదాలకు నమస్కరించి హత్తుకుని కన్నీరు పెట్టింది.
విషయం అర్ధం కాని రాయుడు అలా ఉండిపోగా
"నాన్న.. మీరు వద్దనుకున్న ఆ ఆడబిడ్డని నేనే నాన్న. ఇన్నాళ్ళకి మిమ్మల్ని కలుసుకునే భాగ్యం కలిగినందుకు ఆ భగవంతుడికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. పదండి, అమ్మ దగ్గరకు తీసుకొని వెళ్తాను " అంటుంది.
"వద్దమ్మ, నేను మూర్ఖుడుని. నీ తల్లి అనుకుంది సాధించింది. నిన్ను గొప్పవ్యక్తిని చేసింది. కాలం ఆడపిల్లను వద్దనుకున్న నా వద్దకు నిన్ను ఈ విధంగా తెచ్చి ఆడపిల్ల ప్రేమని నాకు రుచి చూపించింది. పూజమ్మ, నా నిజమైన భార్య. తనను నేను దూరం చేసుకుని తప్పు చేశా. ఎవరి తప్పుకు వారు శిక్ష అనుభవించాల్సిందే. ఆడపిల్లని వద్దనుకున్నాను కానీ.. ఆత్మాభిమానం ఉన్నోడినే. నన్ను వదిలే" అని వేడుకొనగా నాన్నకు తెలియకుండా నాన్న సంరక్షణ కొరకు తాను చేయవల్సినది ఆలోచించుకుంటు వెళ్ళిపోయింది, ఆ ఆఫీసర్.
సమాప్తం.
పిట్ట గోపి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2024 సీరియల్ నవలల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు. లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.
![](https://static.wixstatic.com/media/acb93b_97b83c8b80f64a4bac364c0d2484b4d4~mv2.png/v1/fill/w_80,h_116,al_c,q_85,blur_3,enc_auto/acb93b_97b83c8b80f64a4bac364c0d2484b4d4~mv2.png)
రచయిత పరిచయం: పిట్ట గోపి ( యువ రచయిత )
Profile:
Youtube Playlist:
సమాజం వేసే తప్పుడడుగులను సరిచేయాలంటే పదిమంది కి మంచి విషయాలు తెలపాలి. అలా జరగాలంటే మనం మంచి రచయిత గా మారి పాఠకులకు అందేలా చేయాలనేది నా అభిలాష. ఎనిమిదో తరగతిలో జరిగిన చిన్న రోడ్డుప్రమాదంతో స్వల్ప వినికిడి సమస్య తలెత్తినా.. సామాన్యుడిగా ఉండటానికే ప్రాధాన్యతనిస్తా. ఈ రోజు మనం వేసే ప్రతి మంచి అడుగుని మనకంటే చిన్నవారు ఖచ్చితంగా అనుసరిస్తారనే ఆశ కలవాడిని. చదువుకునే ప్రతిఒక్కరు... సమాజం కోసం ఆలోచిస్తే... ఈ సమాజం అభివృద్ధి పథంలో నడువటం ఖాయం