యువత - దేశరక్షణ
- Kandarpa Venkata Sathyanarayana Murthy
- 1 day ago
- 5 min read
#YuvathaDesaRakshana, #యువతదేశరక్షణ, #KandarpaMurthy, #కందర్పమూర్తి, #TeluguInspirationalStories, #ప్రేరణాదాయకకథలు

Yuvatha Desa Rakshana - New Telugu Article Written By Kandarpa Murthy
Published In manatelugukathalu.com On 15/05/2025
యువత - దేశరక్షణ - తెలుగు వ్యాసం
రచన: కందర్ప మూర్తి
నేటి యువత పెద్ద చదువులు చదివి విదేశాల్లో పెద్ద హోదా ఉద్యోగాలు, పదవుల కోసం ఆరాట పడుతుంటారు. అందరూ సివిల్ జాబుల కోసం ఎగబడితే రక్షణ దళాలలో పని చేసేదెవరు?
యువత ముందుకు వచ్చి దేశరక్షణ దళాలలో ప్రవేశం పొంది దేశ సేవ చెయ్యాల్సిన బాధ్యత ఉంది. సివిల్ ఉద్యోగాల మాదిరి రక్షణ దళాలలో కూడా అందరికీ అనువైన విద్య వైద్య ఇంజనీరింగ్ సాంకేతిక రంగాల జాబులు అందుబాటులో ఉన్నాయి. విద్యార్హతలతో పాటు శారీరకంగా మానసికంగా ఏ వైకల్యము లేకుండా ఫిట్నెస్ అత్యవసరం.
ఒక సైనికుడిగా, హోదాగల మిలిటరీ ఆఫిసర్ గా దేశ రక్షణ దళాలలో చేరి దేశ సేవ చెయ్యడం అందరికి సాధ్యం కాదు. రక్షణ దళాలలో బాధ్యతలు నిర్వర్తించి సుదీర్ఘ సేవ చేసి సురక్షితంగా వచ్చిన వారు కొందరైతే దేశ సరిహద్దు ప్రాంతాల్లో తమ ప్రాణాలను అర్పించిన సాహస అమర వీరులూ ఉన్నారు. అటువంటి అమరవీరుల త్యాగాలను గుర్తించి ప్రభుత్వాలు, ప్రజలు గౌరవించి వారి కుటుంబ సబ్యులను ఆదుకోవల్సిన బాధ్యత ఉంది.
ఏటా డిశంబరు నెల(7)లో నిర్వహించే రక్షణ దళాల పతాక విరాళ నిధి (నేషనల్ డిఫెన్స్ ఫ్లాగ్ ఫండ్) దినోత్సవాల్లో ధనం సహాయంగా విరాళాలు ఇవ్వాలి. యుద్ధం వల్ల ప్రదానమంత్రి సహాయనిధికి భారీగా నిధులు సమకూర్చి దేశ ఆర్థికస్థితి మెరుగుపర్చాలి.
సైనికుడంటే దేశం కోసం సర్వం త్యాగం చెయ్యాలి. తన మానవ హక్కుల్ని అర్పించి దేశ సరిహద్దుల రక్షణ కోసం ముందుకు రావాలి. ఆకాశం భూమి సముద్ర జలాల్లో తమ కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. క్రమశిక్షణ ఆరోగ్యరక్షణ సమయ పాలన రోజువారి విధుల్లో పై అధికారుల ఆదేశాలు అమలు చెయ్యాలి.
యుద్ధ సమయంలో దేశ సరిహద్ధుల్ని కాపాడటమే కాకుండా ప్రకృతి వైపరీత్యాలు, వరదలు, భూకంపాలు, అగ్ని ప్రమాదాలు, అంతర్గత టెర్రరిస్టుల దుశ్చర్యలు అత్యవసర సమయాల్లో సివిల్ పోలీసులకు సహాయపడతారు రక్షణ దళాలు.
సైన్యంలో చేరాలంటే ముందు గుండె దిటవు, ధైర్యం కావాలి. మన కుటుంబాలలో రక్షణ దళంలో చేరిన వారు ప్రాణాలతో తిరిగి రారనే అపోహ ఉంది. మరణం అనేది ఎప్పుడు ఎక్కడ ఎలాగైనా సంభవించ వచ్చు.
సైనికుడు తన పౌర హక్కుల్నీ, జీవితాన్ని దేశానికి అర్పిస్తున్నట్లు దేశ జాతీయ పతాకంపై ప్రమాణం చేసి భూమి మీద, నీటి మీద, గాలిలో రాత్రయినా పగలయినా ఎప్పుడు ఏ సమయంలో పిలుపు వచ్చినా దేశసేవలో నిమగ్నమవుతానని సిద్ధ పడాలి.
సైనికుడు దేశసేవ కర్తవ్యం ముందు అమ్మానాన్న, భార్యా బిడ్డలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్లు, పండగలు. పర్వదినాలు, ఆప్యాయతలు, అనురాగాలు మరిచిపోతాడు.
ప్రతి తల్లి తండ్రి తమ బిడ్డలు పెద్ద చదువులు చదివి పెద్ద హోదా ఉధ్యోగాలు, విదేశాల్లో సుఖ జీవనం గడపాలని కోరుకుంటారు. కానీ మాజీ సైనిక కుటుంబాల పిల్లలు సైన్యంలో కెళ్లడానికే ఇష్ట పడుతున్నారు. వారి రక్తంలో ఆ ధైర్య సాహసాలు పుట్టుకతో వస్తున్నాయి.
నూనూగు మీసాలతో యువకుడిగా సైన్యంలో కాలు పెట్టిన వ్యక్తి ముప్పై సంవత్సరాల సుదీర్ఘ సర్వీసు పూర్తి చేసి నెరసిన జుత్తుతో సివిల్ జీవితంలో కొస్తాడు. తన యవ్వన జీవిత మంతా దేశ సేవకి అర్పిస్తాడు. మరి అటువంటి విశ్రాంత సైనికుల్నీ, వారి కుటుంబాల్నీ ఏ విధంగా గౌరవించాలో అందరూ ఆలోచించాలి.
దేశ సరిహద్దుల్లో మనకు రక్షణ కవచాలుగా.. తమదేహం.. హృదయం.. ప్రాణాలతో "కంచె" వేసి రాత్రింబవళ్ళు కావలి కాస్తున్న త్యాగధనులు.. మన రక్షకులు.. మన వీర సాహస సైనికులు.
పుట్టిన ఊరు కన్నా.. జన్మనిచ్చిన అమ్మ కన్న.. పెంచి పెద్ద చేసిన నాన్న కన్నా.. తోడ పుట్టిన అన్నదమ్ములు.. అక్కా చెల్లెళ్ల అనురాగం కన్నా.. బతుకు పంచిన భార్య కన్నా.. కన్న బిడ్డల భవిష్యత్తు కన్నా తన మాతృదేశ రక్షణే ధ్యేయంగా చేసుకుని.. నిప్పులు కురిసే ఎడారి ప్రాంత ఎండలో, కుంభవృష్టి వర్షంలో, ఘనీభవించిన మంచు పర్వత శ్రేణుల్లో, చలిలో వణుకుతు.. క్లిష్ట వాతావరణ పరిస్థితుల్లో..
కంటి మీద కునుకు లేకుండా.. సమయానికి కడుపు నిండా తిండిలేక.. సుఖం అన్న మాటకు అర్థం తెలియకుండా.. ఊరు గుర్తుకు వచ్చినా.. అమ్మ పిలుస్తున్నా.. భార్య తలుస్తున్నా.. కేరింతలు కొట్టే
కన్న బిడ్డల ఆటపాటలు జ్ఞప్తికి వచ్చినా..
అవేవీ తన అకుంఠిత దేశ సేవకు అడ్డంకి కారాదని.. తన హృదయాంతరాల్లో వాటిని బలవంతంగా అణచివేస్తూ..
భారత దేశం నా మాతృభూమి.. భారతీయులందరూ నా సహోదరులు అనే అచంచలమైన అంకిత భావంతో.. దేశం కోసం ప్రాణ త్యాగానికి సిద్ధ పడుతున్న సాహసవీరులే మన అమర జవాన్లు..
అటువంటి ప్రాణ త్యాగధనులకు మనం ఏమిచ్చినా వారి ఋణం తీరదు. అది వెల కట్టలేని అత్యంత త్యాగం..
కానీ తమ బిడ్డలను, తమ భర్తలను దేశ సేవకు అంకితం చేస్తున్న ఆ మాతృ మూర్తులకు, సహ ధర్మచారిణులకు మనమిస్తున్న గౌరవం ఏ పాటిది?
తన చనుబాలతో రక్త స్పర్సతో ఒడిలో పెరిగిన బిడ్డలు ముష్కరుల కర్ఖశ దాడిలో రక్తపు ముద్దలుగా.. మాంసపు ముద్దలుగా చూసిన ఆ కన్న తల్లుల ఆవేదన..
శతృ సైనికుల కిరాతక చర్యల వల్ల సాహస వీరుల దుర్మరణం చూసిన భారతమాత ఆక్రందన వర్ణనాతీతం..
మరి, నువ్వూ నేను కార్చామా వారి కోసం కన్నీటి బొట్టు.. వారి త్యాగ నిరతిని గుర్తించామా..
ఎప్పుడైనా ఒక్క నిముషం సంతాపం తెలిపామా..
వారి కుటుంబ సభ్యుల పరిరక్షణకు జండా దినోత్సవం నాడు ఏమైనా ధన సహాయం చేసామా?
యుద్ధ సమయం అపత్కాలీన పరిస్థితుల్లో లేక ఏదైనా దుస్సంఘటన జరిగినప్పుడు జాతీయ దినోత్సవాల్లో చూపే ఆదరణ మిగతా సమయంలో ఎందుకు చూపించరు?
'జై జవాన్ ' అని నినాదం కొట్టడం కాదు, జవానే దేశ జన రక్షకుడని తెలుసుకో. వేదికల మీద, వార్తా పత్రికల్లో, ప్రసార మాధ్యమాల్లో నాలుగు రోజులు వారిని స్థుతిస్తే కాదు, ఎల్లవేళల వారి త్యాగాల్ని గుర్తు చేసుకోవాలి.
దేశం కోసం అమరులైన వీర సైనికుల త్యాగాలను ప్రాంతీయ వారిగా స్మరించాలి. వారి కుటుంబ సభ్యులను సన్మానించినప్పుడే వారికి నిజమైన నివాళి.
పండగైనా, ఇంట్లో శుభకార్యమైనా, పిల్లల జన్మదినమైనా సైనికుడిగా దేశ రక్షణలో అన్నిటినీ త్యాగం చేసి జాతీయ దినోత్సవాలనే తన జన్మదినంగా కొండ కోనల్లో సహచర మిత్రుల మద్యే ఆనందంగా జరుపుకుంటాడు.
సరిహద్దుల్లో శతృ సైనిక ముష్కరుల చేతిలో తమ సహచరుల్ని ఊచకోత కోసినప్పుడు కసితో మరింత దూకుడుగా శతృ స్థావరాల్లోకి వెళ్లి అత్యంత ధైర్య సాహసాలతో సర్జికల్ స్ట్రైక్ వంటి సాహస చర్యలతో సురక్షితంగా వెనక్కి తిరిగి వచ్చిన వీరుల్ని, అలాగే శతృదేశంలో తన ఫైటర్ విమానం దుర్ఘటన పాలైనా దైర్య సాహసాలతో తిరిగి వచ్చిన వింగ్ కమాండర్ అభినందన్ లాంటి వారికి జై జై నినాదాలతో స్వాగతిద్దాం. వారిలో ఆత్మ స్థైర్యం నింపుదాం.
మన పొరుగున ఉన్న మతఛాందశ దేశం తమ భూభాగంలో ఉగ్రవాదులకు శిక్షణతో పాటు ఆయుధాలను సరఫరా చేస్తు మన సరిహద్దుల్లో పర్యాటకులను, అమాయక ప్రజలను కర్కశంగా చంపి కల్లోలం సృష్టిస్తున్నారు. మన రక్షణ దళాలు అప్రమత్తంగా ఉన్నప్పటికీ దొంగ దారులంట మన భూభాగంలో ప్రవేశించి ఆస్థి ప్రాణ నష్టం కలిగిస్తున్నారు.
మనం రాత్రింబవళ్లు వినోద కార్యక్రమాలు, క్రికెట్ ఐపీఎల్ మేచ్ లు, ప్రపంచ సుందరీమణుల అందాల పోటీలు, వివాహ శుభకార్యాలు ఆనందంగా జరుపుకుంటున్నామంటె సరిహద్దుల్లో మన రక్షణ దళాలు అహర్నిశలు తమ ప్రాణాలను పణంగా పెట్టి శతృమూకలు, ఉగ్రవాదులను ఎదుర్కొంటు దేశ ప్రజల ఆస్థి, ప్రాణాలను కాపాడుతున్నారు.
యుద్ధం ఏ దేశానికి మంచిది కాదు. ప్రాణ నష్టం, ఆస్థినష్టం పర్యావరణానికి హాని జరుగుతుంది. అత్యవసర సమయంలో రక్షణ దళాలకు ఆయుధాలు, వాహనాలు, ఇంధనం, ఆహార
రవాణా సదుపాయాలకు డబ్బులు ఖర్చు చేయవల్సి ఉంటుంది.
వాటి ఆర్థిక భారం తర్వాత దేశ ప్రజల మీద పన్నుల రూపంలో వసూలు చేయవల్సి ఉంటుంది.
పహల్గాం టెర్రరిస్టుల దుశ్చర్యలకు బదులుగా ఆపరేషన్ సింధూర్ తో శతృ స్థావరాల్లోకి అత్యంత సాహసంతో మన రక్షణదళాలు సమ్మిళితంగా వెళ్లి ఉగ్రమూకల ట్రైనింగ్ స్థావరాలను, ఉగ్ర మూకలను మట్టుపెట్టిన మన సాహస సైనిక వీరులను అభినందిద్దాం.
అందుకు నువ్వూ నేను మనం దేశమంతా కలిసి ఒక్క సారి 'జై జవాన్- జై భారత్ ' అని గట్టిగా నినదించి వారిలో ధైర్య సాహసాల్ని పెంచుదాం. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన అమరులైన సైనిక సోదరుల కుటుంబాలకు ఓదార్పు కలిగేలా సంతాపం తెలుపుదాం.
సమాప్తం
కందర్ప మూర్తి గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం: https://www.manatelugukathalu.com/profile/kandarpamurthy
పూర్తి పేరు : కందర్ప వెంకట సత్యనారాయణ మూర్తి
కలం పేరు : కందర్ప మూర్తి
పుట్టి పెరిగిన ఊరు : 02 జూలై -1946, చోడవరం (అనకాపల్లి జిల్లా)ఆం.ప్ర.
భార్య పేరు: శ్రీమతి రామలక్ష్మి
కుమార్తెలు:
శ్రీమతి రాధ విఠాల, అల్లుడు డా. ప్రవీణ్ కుమార్
శ్రీమతి ఉషారమ , అల్లుడు వెంకట్
శ్రీమతి విజయ సుధ, అల్లుడు సతీష్
విద్యార్థి దశ నుంచి తెలుగు సాహిత్యం మీద అభిలాషతో చిన్న కథలు, జోకులు, కార్టూన్లు వేసి పంపితే పత్రికలలో ప్రచురణ జరిగేవి. తర్వాత హైస్కూలు చదువులు, విశాఖపట్నంలో పోలీటెక్నిక్ డిప్లమో కోర్సు చదివే రోజుల్లో 1965 సం. ఇండియా- పాకిస్థాన్ యుద్ధ సమయంలో చదువుకు స్వస్తి పలికి ఇండియన్ ఆర్మీ మెడికల్ విభాగంలో చేరి దేశ సరిహద్దులు,
వివిధ నగరాల్లో 20 సం. సుదీర్ఘ సేవల అనంతరం పదవీ విరమణ పొంది సివిల్ జీవితంలో ప్రవేసించి 1987 సం.లో హైదరాబాదు పంజగుట్టలోని నిజామ్స్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్) బ్లడ్ బేంక్ విభాగంలో మెడికల్ లేబోరేటరీ సూపర్వైజరుగా 18 సం. సర్వీస్ చేసి పదవీ విరమణ అనంతరం హైదరాబాదులో కుకట్ పల్లి
వివేకానందనగర్లో స్థిర నివాసం.
సుదీర్ఘ ఉద్యోగ సేవల పదవీ విరమణ తర్వాత మళ్లా తెలుగు సాహిత్యం మీద శ్రద్ధ కలిగి అనేక సామాజిక కథలు, బాల సాహిత్యం, సైనిక జీవిత అనుభవ కథలు, హాస్య కథలు, విశ్లేషణ వ్యాసాలు, కవితలు, గేయాలు రాయగా బాలమిత్ర, బుజ్జాయి, బాలల చంద్ర ప్రభ, హాయ్ బుజ్జీ,
బాలభారతం, బాలబాట, మొలక, సహరి, సాక్షి ఫన్ డే, విపుల,చిన్నారి, హాస్యానందం, ప్రజాశక్తి, గోతెలుగు. కాం, తపస్వి మనోహరం, సాహితీ కిరణం, విశాఖ సంస్కృతి, వార్త ఇలా వివిధ ప్రింటు, ఆన్లైన్ మేగజైన్లలో ప్రచురణ జరిగాయి.
నాబాలల సాహిత్యం గజరాజే వనరాజు, విక్రమసేనుడి విజయం రెండు సంపుటాలుగాను, సామాజిక కుటుంబ కథలు చిగురించిన వసంతం, జీవనజ్యోతి రెండు సంపుటాలుగా తపస్వి మనోహరం పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపంలో ముద్రణ జరిగాయి.
నా సాహిత్య రచనలు గ్రామీణ, మద్య తరగతి, బడుగు బలహీన వర్గ ప్రజల, జీవన విధానం, వారి స్థితిగతుల గురించి రాస్తు సమాజానికి ఒక సందేశం ఉండాలని కోరుకుంటాను.