top of page

అధర్మంపై గెలుస్తున్న ధర్మం

#RCKumar, #శ్రీరామచంద్రకుమార్, #AdharmampaiGelusthunnaDharmam, #అధర్మంపైగెలుస్తున్నధర్మం, #TeluguArticleOnTerrorism

Adharmampai Gelusthunna Dharmam - New Telugu Article Written By R C Kumar

Published In manatelugukathalu.com On 09/05/2025

అధర్మంపై గెలుస్తున్న ధర్మం - తెలుగు వ్యాసం

రచన: ఆర్ సి కుమార్


ఉగ్రవాదాన్ని ఉసిగొలిపి రెచ్చగొట్టింది పాకిస్తాన్, మొదటగా లక్ష్మణ రేఖ దాటింది పాకిస్తాన్, పౌర స్థావరాలపై గురుద్వారాలపై దాడి జరిపింది పాకిస్తాన్, విషం చిమ్ముతూ సరిహద్దుల్లో చొరబాటుదార్లను పంపుతున్నది పాకిస్తాన్. ఇంకెంతకాలం భరించాలి పొరుగు దేశపు ఈ నీచనికృష్ట చర్యలు. ఆపరేషన్ సింధూరం ద్వారా వందమంది ఉగ్రవాదులు హతమైన నేపథ్యంలో 'నన్ను వదిలి తప్పు చేశావు మోడి' అంటూ ఆపరేషన్ సింధూర్ లో తొమ్మిది కుటుంబ సభ్యులను పోగొట్టుకున్న జైషే మహమ్మద్ మసూద్ అజహర్ ఒక లెటర్ విడుదల చేశాడు.


78 సంవత్సరాలు నిండిన లష్కరే తోయిబా నాయకుడు హఫీజ్ సయ్యిద్ 'పాకిస్తాన్ కి నీళ్లు ఆపితే మీకు శ్వాస ఆపుతానని' బీరాలు పలుకుతున్నాడు. ఇప్పటికీ కరుడుగట్టిన వీరి దృక్పథాలలో ఏమాత్రం మార్పు లేదు. ఆపరేషన్ సింధూర్ లో చనిపోయిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాకిస్తాన్ మిలిటరీ అధికారులు హాజరై అధికారిక లాంఛనాలతో కార్యక్రమాన్ని జరిపించడం హేయమైన చర్య. ఆ ఒక్క సంఘటన చాలు ఉగ్రవాదులకు వెన్నుదన్నుగా ఉండడంలో పాక్ మిలటరీ పాలకుల పాత్ర గ్రహించడానికి. నీలం లోయలో టెర్రరిస్టులు ఏర్పాటు చేసుకున్న లాంచ్ ప్యాడ్ లను పాకిస్తాన్ మిలిటరీ వాడుకుంటూ జమ్మూ కాశ్మీర్లో పౌరస్థావరాలపై దాడులు చేస్తున్నారు. 


సరిహద్దు ప్రాంతంలో కొన్ని ప్రదేశాలు పాకిస్తాన్ కి అనుకూలంగా ఎత్తైన ప్రాంతాల్లో ఉండడం వారికి కలిసొచ్చింది.‌ యూరీ, పూంఛ్, రాజౌరి ప్రాంతాలలోని జనావాసాలపై శతజ్ఞులు, మోర్టార్ షెల్స్, ద్రోణ్ లతో పాక్ దాడికి పాల్పడింది. కాశ్మీర్ ప్రభుత్వం ఏర్పాటుచేసిన బంకర్లలోకి కూడా ప్రజలను తరలించాల్సిన అవసరం ఏర్పడింది. నిరాశ నిస్పృహలతో పౌరులు పై చేస్తున్న ఈ అమానుష దాడులను మన సరిహద్దు భద్రత దళాలు సమర్థవంతంగా తిప్పి కొట్టగలిగినా అక్కడి పౌర సమాజానికి కొంతమేరకు నష్టం కూడా వాటిల్లింది. ప్రభుత్వం యూరీ లాంటి సున్నితమైన ప్రాంతాలలో కంట్రోలర్ రూమ్ స్థాపించడం కూడా జరిగింది.


54 ఏళ్ల తర్వాత మన దేశంలోని కొన్ని సరిహద్దు ప్రాంతాల్లో బ్లాక్ అవుట్ ప్రకటించాల్సిన అవసరం వచ్చింది.‌ యుద్ధ సమయంలో, ప్రజలు బయట తిరగకుండా ముఖ్యంగా వైమానిక దాడుల సమయంలో శత్రు దళాలకు కనిపించకుండా లోపల మరియు బయట ఉన్న అన్ని లైట్లను ఆర్పి ఇంటికే పరిమితమయ్యే పద్ధతిని బ్లాక్అవుట్ అంటారు. పాకిస్తాన్ కూడా తమ సరిహద్దు ప్రాంతాల్లోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించుకొని, ఇంటర్నెట్ సర్వీసులను కూడా పూర్తిగా నిలిపివేసింది. మరోవైపు బలోచ్ లిబరేషన్ ఆర్మీ చేసిన దాడిలో 14 మంది పాక్ సైనికులు మృతి చెందారు. 


రాత్రి సుమారు 8 గంటల ప్రాంతంలో కవ్వింపు చర్యలు ప్రారంభించడం పాకిస్తాన్ కు ఆత్మహత్యాసదృశంగా మారింది.‌ వినాశకాలే విపరీత బుద్ధి అంటూ వినాశనాన్ని వారే కోరుకోవడం చిత్రం.‌ ఆపరేషన్ సింధూర్ 2 మరియు 3 ప్రారంభమైంది. పాకిస్తానీ ప్రేరేపిత జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన రెండు గ్రూపులు సాంబ ప్రాంతంలోని అంతర్జాతీయ సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశిస్తుండగా మన బిఎస్ఎఫ్ జవాన్లు వారిని అక్కడికక్కడే మట్టుపెట్టారు. ఉగ్రవాదులు భారత భూభాగంలోకి ప్రవేశించడానికి అనుకూలంగా మన దృష్టి మరల్చడానికి పాక్ సైనికులు సరిహద్దుల్లో కాల్పులు జరిపడం నీచాతినీచం.


ప్రత్యక్ష యుద్ధం లో వెన్ను చూపుతున్న శత్రుదేశం ఇప్పటికీ ఉగ్రవాదులను ఈ విధంగా మన పైకి వదలడం లాంటి తుచ్ఛమైన విధానాలను అంతర్జాతీయ సమాజం గుర్తించే విధంగా చేయాలి. ఈ చర్యలతో పాక్ సైనికులనే ఉగ్రవాదులుగా ముద్ర వేయవేయాల్సిన అవసరం వచ్చింది. భారతదేశానికి యుద్ధాన్మాదము ఏనాడు లేదు కానీ ఉగ్రవాద యుద్ధవాతావరణాన్ని శత్రుదేశం సృష్టిస్తే, ఊహించని విధంగా బుద్ధి చెప్పగల సామర్థ్యం మన బలగాలకు ప్రభుత్వానికి ఉందని ఆపరేషన్ 2 మరియు 3 ద్వారా రుజువైంది. 


ఓపిక నశించిన భారత సైన్యం పాకిస్తాన్ ఆర్మీ స్థావరాలైన లాహోర్, సియాల్కోట్ మరియు కరాచీలను లక్ష్యంగా చేసుకొని భారీ ఫిరంగిదళాలు మరియు షెల్లింగ్‌లతో విరుచుకుపడింది. 50 కి పైగా శత్రుదేశ ద్రోణ్లను నిర్వీర్యం చేసింది. మన నావికా దళానికి సంబంధించిన 26 యుద్ధనౌకలు రంగంలో దిగి శత్రుదేశాన్ని ఉక్కిరిబిక్కిరి చేసాయి. ఈ ప్రాంతాల మిలిటరీ స్థావరాలను కోలుకోలేని విధంగా ధ్వంసం చేస్తున్న మన త్రివిధ దళాల దెబ్బకు పాకిస్తాన్ నీరు గారి పోయి గిలగిలా కొట్టుకుంటోంది. మన సైన్యం కూల్చివేసిన ఆరు ఫైటర్ జెట్ విమానాలలో ఎఫ్ 16 రెండు జె ఎఫ్ 17 లు ఉన్నాయి. ఒక ఎఫ్ 16 కి చెందిన పాకిస్తాన్ పైలట్ బందీగా పట్టుబడ్డాడు.


ప్రధాని షెహబాజ్ షరీఫ్ జాడలేదు. లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థను ధ్వంసం చేసిన భారత సైన్యం సియాల్కోట్, ఇస్లామాబాద్, బదల్పూర్, పెషావర్, క్వెట్టా లోనూ వరుస దాడులు కొనసాగిస్తున్నాయి. కీలకమైన పాక్ సైనిక స్థావరాలు ఉన్న కరాచిపై ద్రోణ్ లతో దాడులు జరిపి అక్కడి సదుపాయాలను నామరూపాల్లేకుండా మట్టిబెట్టగలిగాయి.‌ నేవీ లాంచ్ ప్యాడ్, నావల్ ట్రేనింగ్ సెంటర్ మరెన్నో ముఖ్యమైన స్థావరాలు కరాచీలోనే ఉన్నాయి. ఆయిల్ టాంకర్లు సైతం భగ్గుమన్నాయి.‌ జరిగిన నష్టం త్వరలో అధికారికంగా త్వరలో విడుదల కానుంది.‌


ఉగ్రవాదానికి మద్దతు ఇచ్చే వ్యవస్థను పుణికిపుచ్చుకున్న పాకిస్తాన్ వైఖరిని ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నాయి. అయితే టర్కీ మాత్రం ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మనకే కాకుండా ప్రపంచ శాంతికి కూడా భంగం కలిగిస్తున్న పాకిస్తాన్ పక్షాన మాట్లాడుతూ తమ అసలు సిసలు నైజాన్ని బహిర్గతం చేసుకుంది. ఆ దేశంతో గత ఏడాది 3.78 బిలియన్ల డాలర్ల దిగుమతులతో కొనసాగించిన మన వ్యాపార వాణిజ్యాలను పూర్తిగా నిలిపివేసి, అన్ని రకాల సంబంధాలను తెంచుకొని తగిన బుద్ధి చెప్పడమే కాక అంతర్జాతీయ సమాజంలో కూడా వారిని ఎండగట్టాలి.


పాకిస్తాన్ నిఘా సంస్థలో ఉగ్రవాద సంబంధాలపై దర్యాప్తు చేస్తున్న అమెరికా జర్నలిస్ట్ డేనియల్ పెర్ల్ ను జైషే మహమ్మద్ ఉగ్రవాదులు కరాచీలో మట్టుపెట్టడం అమెరికా ప్రభుత్వానికి కంటగింపుగానే ఉంది. అతని కుటుంబీకులు చాలా కాలంగా ఎదురుచూస్తున్న న్యాయం ఆపరేషన్ సింధూర్ ద్వారా సంబంధిత ఉగ్రవాద స్థావరాల ధ్వంసంతో జరగడం అమెరికన్లకు సంతోషాన్ని కలిగించింది. తాజాగా పాకిస్తాన్ పెంచుతున్న ఉద్రిక్తతల నేపథ్యంలో అమెరికా పహల్గామ్ సంఘటనను ఖండిస్తూ ఉగ్రవాదానికి సహకరిస్తున్న పాకిస్తాన్ ను తప్పుబట్టింది. రెండు దేశాల వివాదాలతో మాకు ఎటువంటి సంబంధము లేదని తెగేసి చెప్పింది.‌ ఈ ప్రకటన మనకు అనుకూలం పాకిస్థాన్ కి ఊహించని పరిణామం.‌ 


ఆర్థికంగా పాకిస్తాన్ ఎదుర్కొంటున్న సవాళ్లను సమస్యలను కొంతలో కొంత పరిష్కరించుకోవడానికి పరిష్కార ఐయమ్ఎఫ్ రుణం ఎంతో కీలకం. యుధోన్మాద నేపథ్యంలో ఆ నిర్ణయం రేపు వెలవడనుంది. అది కూడా ఆగిపోతే పాకిస్తాన్ దిగిరాక తప్పదు. మనం చేస్తున్నది పాక్ పై పోరాటం కాదు, ఉగ్రవాదంపై పోరాటం, న్యాయం కోసం పోరాటం, దేశ సమగ్రత సార్వభౌమాధికారం కోసం చేస్తున్న పోరాటం, ప్రపంచ శాంతి కోసం పోరాటం. శాంతి మంత్రం జపిస్తూ అహింసవాదాన్ని పాటించే సందర్భం కాదిది.


స్వధర్మాన్ని పాటిస్తూ అధర్మంపై ఉక్కుపాదాన్ని మోపాల్సిన సమయం ఆసన్నమైంది. ప్రాణాలకు తెగించి పోరాడుతున్న మన త్రివిధ దళాలకు పూర్తిస్థాయిలో సంఘీభావం తెలుపుతూ వారి శ్రేయస్సుకి, అంతిమ విజయానికి ప్రార్థనలు చేయడమే మన తక్షణ కర్తవ్యం. ఈ క్లిష్ట సమయంలో వినోదాలతో కూడిన ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ లు, మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ తాత్కాలికంగా ఆపితే మంచిది. జైహింద్ ! 


ధన్యవాదాలు 


ఆర్ సి కుమార్

సామాజిక వేత్త


ఆర్ సి కుమార్  గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు 

ఉగాది 2025 కథల పోటీల వివరాల కోసం


మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.


మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.

లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.


 మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.

దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).



మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.



గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.


రచయిత పరిచయం:

నమస్తే 

ఆర్.సి. కుమార్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లో వివిధ హోదాల్లో అత్యుత్తమ సేవలు అందించి అనేక అవార్డులు రివార్డులు పొందారు. అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గా పదవీ విరమణ చేసిన పిదప సంస్థకు చెందిన పూర్వ ఉద్యోగులతో వెటరన్స్ గిల్డ్ అనే సంస్థను స్థాపించి అనేక సామాజిక, సాంస్కృతిక, సంక్షేమ కార్యక్రమాలకు పునాది వేశారు.

పదవి విరమణ తర్వాత గత పది సంవత్సరాలుగా వివిధ హోదాల్లో తన ప్రవృత్తికి ఊతమిచ్చే సామాజిక సేవా కార్యకలాపాలు కొనసాగిస్తూనే ఉన్నారు. అమీర్ పేట, సనత్ నగర్ ప్రాంతాలలో గల కాలనీల సంక్షేమ సంఘాలతో కూడిన సమాఖ్యను 'ఫ్రాబ్స్' (FRABSS, ఫెడరేషన్ అఫ్ రెసిడెంట్స్ అసోసియేషన్స్ ఆఫ్  బల్కంపేట్, సంజీవరెడ్డి నగర్, సనత్ నగర్) అనే పేరుతో ఏర్పాటు చేసి అచిరకాలంలోనే స్థానికంగా దానినొక ప్రఖ్యాత సంస్థగా తీర్చిదిద్దారు. సుమారు ఐదు సంవత్సరాల పాటు ఆ సంస్థ తరఫున అధ్యక్ష హోదాలో అనేక కార్యక్రమాలు చేపట్టి ప్రముఖ సామాజిక వేత్తగా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు.


రాయల సేవా సమితి అనే మరొక స్వచ్ఛంద సంస్థను స్థాపించి పర్యావరణ పరిరక్షణ, ప్లాస్టిక్ రహిత సమాజం పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ, బీద సాదలకు అన్నదానాలు, ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, స్కాలర్షిప్ లు అందించడం, మొక్కలు నాటించడం వంటి సేవా కార్యక్రమాలు ప్రతి నెలా  చేస్తుంటారు. బస్తీలు, కాలనీల లో సమాజ సేవా కార్యక్రమాలతో పాటు పర్యావరణ పరిరక్షణ, కాలుష్య నివారణ, జల సంరక్షణ వంటి అనేక సామాజిక అంశాలపై ప్రజల్లో అవగాహన తెచ్చే విధంగా పాటుపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రివర్యులు శ్రీ తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు వీరి సేవలను కొనియాడుతూ ప్రశంసా పత్రాన్ని సైతం  అందజేశారు.


కథలు కవితలు రాయడం వారికి ఇష్టమైన హాబీ. స్వతంత్ర పాత్రికేయుడిగా వీరి రచనలు తరచుగా మాస పత్రికలు, దినసరి వార్తా పత్రికల్లోని ఎడిటోరియల్ పేజీల్లో ప్రచురింపబడుతుంటాయి. వక్తగా, వ్యాఖ్యాతగా వ్యవహరిస్తూ అనేక కార్యక్రమాల నిర్వహణ బాధ్యతను కొనసాగించడమే కాక ఆధ్యాత్మిక ఉపన్యాసాలు, సత్సంగ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. 


వందనం, ఆర్ సి కుమార్

(కలం పేరు - రాకుమార్, పూర్తి పేరు - ఆర్. శ్రీరామచంద్రకుమార్) 

సామాజికవేత్త

Comments


bottom of page