ఆత్మనిగ్రహం
- Karlapalem Hanumantha Rao

- 10 minutes ago
- 2 min read
#KarlapalemHanumanthaRao, #కర్లపాలెంహనుమంతరావు, #TeluguMoralStories, #తెలుగునీతికథలు, #ఆత్మనిగ్రహం, #AthmaNigraham

Athma Nigraham - New Telugu Story Written By Karlapalem Hanumantha Rao Published In manatelugukathalu.com On 12/02/2026
ఆత్మనిగ్రహం - తెలుగు కథ
రచన: కర్లపాలెం హనుమంతరావు
ఒకరోజు అక్బర్ బాదుషా ఒక అడవిలో తపస్సమాధిలో ఉన్న రుషివర్యుణ్ణి చూసి ఆకర్షితుడయ్యాడు. ఆ జ్ఞానసంపన్నుడి దారిద్ర్యాన్ని చూసి బాధపడ్డాడు. ఏదైనా సాయం చేయాలనుకున్నాడు.
'స్వామీ, మీరు మా నగరానికి పావనం చేస్తే సకల సౌకర్యాలున్న మంచి భవంతి నిర్మించి ఇస్తాను' అన్నాడు.
'రాజా! ఈ మనోహరమైన వనసీమను వదిలి నేను ఆ రాళ్లమధ్య ప్రశాంతంగా జీవించలేను. క్షమించండి!' అన్నాడు.
'పోనీ... శరీరం మీద కౌపీనంతో అనునిత్యం మారే వాతావరణంలో బాధలు పడటమెందుకు? దయచేసి పట్టు పీతాంబరాలు స్వీకరించి మమ్మల్ని పావనం చేయండి!' అని ప్రాధేయపడ్డాడు చక్రవర్తి.
'దైవం ప్రసాదించిన దుస్తులు కదా ఆత్మమీది ఈ శరీరం. ఆ దుస్తులకు మరిన్ని దుస్తులా! మన్నించండి! నాకు ఇలా ఉండటమే సౌకర్యంగా ఉంటుంది' అన్నాడు రుషివర్యుడు చిరునవ్వుతో.
'కనీసం మీరు తాగేందుకైనా ఈ స్వర్ణపాత్రను గ్రహించి మమ్మల్ని సంతోషపెట్టండి సాధుమహారాజ్!' అన్నాడు అక్బర్.
'దోసిలి ఉండగా వేరే పాత్రలు ఎందుకు? దండగ కదా! అన్యథా భావించకండి రాజా!' అని మహర్షి సమాధానం.
'పోనీ... సుఖంగా శయనించేందుకు ఒక పర్యంకం అయినా తెప్పించమంటారా?' రాజుగారి ప్రార్థన.
సాధువుది మళ్ళా అదే సమాధానం. 'ప్రకృతి ప్రసాదించిన ఇంత చక్కని పచ్చిక బయలుండగా వేరే శయ్యా సుఖాలు నాకెందుకు మహారాజా!' అని నిరాకరించాడు రుషివర్యుడు.
రుషి నిరాడంబర సాధుజీవనానికి విస్మయం చెందాడు అక్బరు మహారాజు. సాధు మహారాజుకి ఏదైనా సరే ఒకటి సమర్పించి తీరాలని పంతం పెరిగింది అక్బరు చక్రవర్తికి. 'ఇప్పుడంటే ఇలా ఉన్నారు. భవిష్యత్తులో తమరికి ఏది కావాలన్నా నిస్సంకోచంగా మాకు కబురు చేయండి! అడగడానికి మొహమాటమైతే ఈ అగ్రహారం మీకు రాసి ఇస్తున్నాం. యధేచ్ఛగా అనుభవించండి' అంటూ రాజుగారు రుషికి సమాధానం ఇచ్చే వ్యవధానం కూడా ఇవ్వకుండా నిష్క్రమించారు.
'స్వామీ! సర్వసంగ పరిత్యాగం అంటే ఏమిటో నాకు ఇప్పుడర్థమయింది' అన్నాడు అప్పటిదాకా అక్కడే నిలబడి అంతా చూస్తున్న శిష్యపరమాణువు భక్తి ముప్పిరిగొనగా.
'సర్వసంగ పరిత్యాగమా నా బొందా! రాజుగారి మొదటి కోరికనే మన్నించి ఉంటే నాకేమి మిగిలేదిరా శిష్యా! మన్నుతో కట్టిన నాలుగ్గోడల భవనం. ఇప్పుడు అలాంటి భవనాలు వంద కట్టించగలను. పట్టు పీతాంబరాలు, స్వర్ణమయ పాత్రలు, హంసతూలికా తల్పాలు ఎన్నైనా ఏర్పాటు చేసుకోగలను ఒకరిని యాచించకుండా! చివరి కోరికవరకు మనసుమీద అదుపు సాధించానే... దీన్నే అంటారు నువ్వు అనుకొంటున్న 'ఆత్మనిగ్రహం' అని! అర్థమయిందా?' అన్న గురువు బోధను విని నోరువెళ్లబెట్టాడు శిష్యపరమాణువు.
-----
కథ సమాప్తం.
***
కర్లపాలెం హనుమంతరావు గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
ఉగాది 2026 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx/docs రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).
మనతెలుగుకథలు.కామ్ వారి ఫేస్ బుక్ పేజీ చేరడానికి ఈ క్రింది లింక్ క్లిక్ చేయండి. లైక్ చేసి, సబ్స్క్రయిబ్ చెయ్యండి.
గమనిక : పాఠకులు తమ అభిప్రాయాలను మనతెలుగుకథలు.కామ్ వారి అఫీషియల్ వాట్స్ అప్ నెంబర్ : 63099 58851 కు పంపవచ్చును.

రచయిత పరిచయం:
కర్లపాలెం హనుమంతరావు -పరిచయం
రిటైర్డ్ బ్యాంకు అధికారిని. 20 యేళ్ళ వయస్సు నుంచి రచనా వ్యాసంగంతో సంబంధం ఉంది. ప్రింట్, సోషల్ మీడియాల ద్వారా కవిత్వం నుంచి నవల వరకు తెలుగు సాహిత్యంలోని ప్రక్రియలు అన్నింటిలో ప్రవేశం ఉంది. సినిమా రంగంలో రచయితగా పనిచేశాను. వివిధ పత్రికలకు కాలమిస్ట్ గా కొనసాగుతున్నాను. పోటీ కథల జడ్జి పాత్రా నిర్వహిస్తున్నాను. కథలకు , నాటక రచనలకు వివిధ పత్రికల నుంచి బహుమతులు, పురస్కారాలు సాధించాను. ప్రముఖ దినపత్రిక 'ఈనాడు' తో 25 ఏళ్ళుగా రచనలు చేస్తున్నాను. మూడేళ్ళు ఆదివారం అతిధి సంపాదకుడిగా పనిచేసిన అనుభవం నా ప్రత్యేకత.




Comments