భాయిజాన్
- Chaturveadula Chenchu Subbaiah Sarma
- May 5
- 6 min read
#Bhaijan, #భాయిజాన్, #ChCSSarma, #చతుర్వేదులచెంచుసుబ్బయ్యశర్మ, #TeluguStory, #తెలుగుకథ

Bhaijan - New Telugu Story Written By - Ch. C. S. Sarma
Published In manatelugukathalu.com On 05/05/2025
భాయిజాన్ - తెలుగు కథ
రచన: సిహెచ్. సీఎస్. శర్మ
సత్య..... ఎం.ఎ, పి.హెచ్.డి. ఆ వూరి హైస్కూల్లో టీచరుగా పనిచేస్తున్నాడు. తల్లి సుమతి, తండ్రి జగన్నాథం. వారు గతించి నాలుగు సంవత్సరాలు.
సయ్యద్ జగన్నాథం గారి ఇంటికి ఎదురిల్లు. ఇరువురూ మంచి మిత్రులు. సయ్యద్ కన్నా జగన్నాథం మూడు సంవత్సరాలు పెద్ద.
జగన్నాథం గారి తండ్రి సాంబశివయ్య. వారి సతీమణి ఆదిలక్ష్మి... సాంబశివయ్య ఉపాధ్యాయ వృత్తినే నిర్వహించారు.
అది చిన్నగ్రామం. పదిమంది యాదవులు, పన్నెండుమంది కమ్మవారు (నాయుళ్ళు), మూడు ఇళ్ళు కమ్మరివి, నాలుగిళ్ళు కుమ్మరివారివి, ఐదు ఇళ్ళు చాకలి వారివి, రెండు ఇళ్ళు మంగలి వారివి, రెండు ఇళ్ళు వైశ్యులవి, రెండు బ్రాహ్మణ కుటుంబాలు వున్న నలభై ఇళ్ళు వున్న చాలా చిన్న గ్రామం అది.
ఆ గ్రామస్తులందరికీ సాంబశివయ్యగారి మాట వేదవాక్యం. వారు తెలుగు ఉపాధ్యాయులైనందున, ఇన్స్ పెక్షన్కు వచ్చిన జానీగారు చేసిన అప్రస్తుత ప్రసంగం ’నీవు ఒక ముస్లింను తెలుగు పండిట్ చేయగలవా?’ అన్నమాటకు రోషం, ఆవేశం కలిగినా, బయటికి వ్యక్తం చేయకుండా... సయ్యద్ను ఉభయ భాషా ప్రవీణునిగా చేశారు. ఆ వూరి స్కూలుకు సయ్యద్ గారే తెలుగు పండిట్.
సాంబశివయ్యగారు మరణించిన ఆరు మాసాల్లోపే, వారి అర్థాంగి ఆదిలక్ష్మీగారు గతించారు. యధార్థం చెప్పాలంటే ఆ దంపతుల మరణం వూరి జనాలందరికీ, కొడుకు జగన్నాథం, కోడలు సుమతి, కన్నా ఎంతోకాలం ఎక్కువగా బాధపడినవారు సయ్యద్, వారి సతీమణి మల్లిక.
సుమతి, మల్లికా ఒకేవూరి వారు. కలిసి చదువుకొన్నారు. సుమతి మల్లిక కన్నా ఒక్క సంవత్సరం పెద్ద, ఆ కారణంగా మల్లిక, సుమతిని, అక్కా అని పిలిచేది. ఇరువురికీ మంచి స్నేహం....
దైవ నిర్ణయం చిత్రం.... విచిత్రం, ఇరువురూ ఒకే వూరి కోడళ్ళు అయ్యారు. తొలుత జగన్నాథం గారితో సుమతి వివాహం, ఆ తరువాత రెండు సంవత్సరాలకు సయ్యద్తో, మల్లిక వివాహం జరిగింది. ఇరువురి ఇళ్ళు ఎదురెదురు కాబట్టి సుమతి, మల్లిక స్నేహం వివాహానంతరం కూడా వారి బాల్యంలో మాదిరే సాగింది.... ఇక... జగన్నాథం సయ్యద్ల స్నేహాన్ని గురించి వేరుగా చెప్పనవసరం లేదు. ఇరువురి ఉద్యోగం ఒకే స్కూల్లో. జగన్నాథం ఇంగ్లీష్, సైన్స్ మాస్టర్, సయ్యద్ తెలుగు పండిట్. సొంత అన్నతమ్ముల వలే కలిసి వుండేవారు.
వివాహం అయ్యి ఐదు సంవత్సరాలు అయినా సుమతి గర్భవతి కాలేదు. ఆ దంపతులకు అది ఒక్కటే విచారం. సుమతి నోములు, వ్రతాలు, పూజలు చాలా దీక్షగా చేసేది. కొంతకాలానికి ఆ దైవం ఆ దంపతుల కోర్కెను ఆలకించాడు. సుమతి నెల తప్పింది....
అదే సమయాన మల్లికా గర్భవతి.....
సుమతి ప్రసవించింది. పండంటి మగబిడ్డ.....
మూడు నెలల తర్వాత మల్లిక ప్రసవించింది. ఆడపిల్ల....
జగన్నాథ్ సుమతి... ఆ బిడ్డకు ’రంగ’ అని నామకరణం చేశారు.
సయ్యద్ మల్లికలు... తమ కూతురుకు చాందిని అనే పేరు పెట్టారు.
ఇరు కుటుంబాల వారికి, వారికి హితులైన ఊరి జనానికీ ఎంతో ఆనందం....
రోజులు ప్రశాంతంగా సాగిపోతున్నాయి.
కానీ... రంగకు తల్లి పాలు చాలడం లేదు. అప్పుడప్పుడూ గుక్క తిప్పుకోకుండా ఏడ్చేవాడు.
ఒకరోజు... మల్లిక తన కూతురితో సుమతి ఇంటికి వచ్చింది. మగవారు పాఠశాలకు వెళ్ళిన సమయం.
రంగా ఏడుపును ప్రారంభించాడు. సుమతి పాలను ఇవ్వ ప్రయత్నించింది. ఆమె వద్ద పాలు లేవు. రంగా ఏడుపు ఆపలేదు. ఆ దృశ్యాన్ని చూచిన మల్లిక... తన బిడ్డను సుమతికి అందించింది. సుమతి చేతిలోని రంగను తన చేతిలోకి తీసుకొంది.
రంగ నోటిని తన స్తన్యసీమ దగ్గరకు చేర్చింది. రంగ ఆనందంగా పాలు త్రాగడం ప్రారంభించాడు.
"అక్కా!...."
"ఎం మల్లి!...."
"బిడ్డకు పాలు చాలడం లేదని నాకు నీవు ఎందుకు చెప్పలేదు?" అడిగింది మల్లిక.
విచారంగా సుమతి తలదించుకొంది.
"అక్కా!.... బాధపడుతున్నావా!... నీ బిడ్డ నా బిడ్డ కాదా!.... నా కూతురు నీ కూతురు కాదా!..." కళ్ళు పెద్దవి చేసి సుమతి ముఖంలోకి ప్రశ్నార్థకంగా చూచింది మల్లిక.
"అదీ!...." ఏదో చెప్పబోయింది సుమతి.
"అదీ కాదు... ఇదీ కాదు. రంగడికి నీ పాలు చాలడం లేదు. అందుకే వాడు ఆకలితో ఏడుస్తున్నాడు. ఇకనుంది వాడు ఆకలితో ఏడవకూడదు. నేను రెండుమూడు సార్లు వచ్చి పాలు ఇస్తాను. చూడు చందిని ఎంత బొద్దుగా ఆరోగ్యంగా వుందో!.... రంగాను చూడు పాలు చాలక ఎంత బలహీనంగా వున్నాడో!..." విచారంగా చెప్పింది మల్లిక.
రంగణ్ణి చూస్తూ సుమతి విచారంగా తలాడించింది.
అది మొదలు మల్లిక ప్రతిరోజు రెండు మూడు సార్లు సుమతి ఇంటికి వచ్చి రంగడికి తన పాలు ఇచ్చేది.
నెలరోజుల్లో రంగడు బాగా ఒళ్ళు చేశాడు. ఆనందంగా బోసి నవ్వులతో కాళ్ళు చేతులు ఆడిస్తూ ఇద్దరు తల్లులనూ చూచేవాడు.
వాడి ఆ స్థితిలో చూచిన సుమతి మల్లిక ఎంతగానో ఆనందించేవారు.
ఒకరోజున....
"మల్లీ!..."
"అక్కా!...."
"పేరు నేను రంగడికి తల్లిని. నీ స్తన్యాన్ని ఇచ్చి వాడిని పెంచి పెద్ద చేస్తున్న తల్లివి నీవేనే!..." పరవశంతో పలికింది సుమతి.
"అక్కా!... ఇందులో నా గొప్పతనం ఏమీ లేదు. అంతా అల్లా ఈశ్వర్ల ఆదేశం" నవ్వుతూ చెప్పింది మల్లిక. ఆనందంతో సుమతి మల్లికను కౌగలించుకొంది.
*
కాలగతిలో ఇరవై సంవత్సరాలు, అందమైన వసంతాలు జరిగిపోయాయి. చాందినీ తర్వాత నాలుగు సంవత్సరాలకు మల్లికకు ఒక మగబిడ్డ పుట్టాడు. అతని పేరు భాషాగా నిర్ణయించారు ఆ దంపతులు. పిల్లలు రంగ, చాందిని, భాషాలు పెద్దవారైనారు.
రంగ, చాందినీలు బి.ఎస్సీ పాసైనారు. భాషా ప్లస్. టు. సెకండ్ ఇయర్ చదువుతున్నాడు.
ఆ సమయంలో దేశంలో (ప్రపంచంతా) కరోనా విలయ తాండవం చేసింది. కరోనా జగన్నాదానికి సోకింది. దిన దినానికి వారి ఆరోగ్యం క్షీణించింది.
ఆ స్థితిలో వున్న జగన్నాథం ప్రక్కన సయ్యద్ వుండి మందులు ఇస్తూ, సోదరతుల్యుడు జగన్నాథం ఆరోగ్యం కుదుటపడాలని తాను నమ్మిన అల్లాను ప్రార్థించేవాడు.
అలాగే... సుమతి, మల్లిక, చాందిని, భాషా, జగన్నాధం గారి ఆరోగ్యం మెరిగుపడి మామూలు మనిషి కావాలని ఆ దైవాన్ని ప్రార్థించేవారు. అందరూ వారి మంచం చుట్టూ వుండేవారు.
వారంరోజులు గడిచాయి. జగన్నాథం ఆరోగ్యం పూర్తిగా క్షీణించింది. వారికి తన స్థితి తెలిసింది....
అప్పుడు....
"సత్యా!..." సయ్యద్ను జగన్నాథం ఎప్పుడూ అలాగే పిలిచేవాడు.
"అన్నా!...."
"దైవం నన్ను పిలుస్తున్నాడురా!... నేను వచ్చిన పని పూర్తయిందట!" విరక్తిగా నవ్వాడు జగన్నాథం.
"అన్నా!... అలా అనకండి. మీరు కోలుకొంటారు!.... భయపడకండి!..." గద్గద స్వరంతో చెప్పాడు సయ్యద్.
"సత్యా!... నా స్థితి నాకు తెలుసురా!... నీవు నా తర్వాత రంగ, సుమతీలకు అండగా నిలబడాలి. మంచి యువతిని చూచి రంగకు వివాహం చేయాలి. చేస్తానని నాకు మాట ఇవ్వరా!..." కన్నీటితో అతికష్టం మీద చెప్పి, తన కుడి చేతిని సాచాడు జగన్నాథం.
రోదిస్తూ సయ్యద్ తన చేతిని జగన్నాథం చేతిలో వుంచాడు. వారి ముఖంలో ఒక వెలుగు, పెదవులపై చిరునవ్వు.... కదులుతున్న కనుగుడ్లు కదలలేదు. వారి జీవుడు తనువును వదలి గాల్లో కలిసిపోయాడు.
అందరి రోదన ఆ గదిలో మారు మ్రోగింది....
*
"ఓ సీనియర్ తెలుగు పండిట్ షేక్ సయ్యద్ గారా!...." వ్యంగ్యంగా అన్నాడు కాంతయ్యగారు.
"అవునండీ!... నమస్కారం!...."
చేతులు జోడించారు ఎంతో వినయంగా చెప్పాడు సయ్యద్.
"ఏం సార్!.... దారి తప్పి వచ్చినట్లున్నారు. ఏమిటి విషయం?" అడిగాడు కాంతయ్య.
"కాంతయ్య సార్!... దారి తప్పి రాలేదు. దారి బాగా తెలుసును కాబట్టే వచ్చాను" చిరునవ్వుతో చెప్పాడు సయ్యద్.
"ఏమిటి విశేషం?"
"నాకు డొంక తిరుగుడుగా మాట్లాడ్డం తెలియదు. నాకు మా అన్న జగన్నాథం గారిపై వుండిన అనురాగం, అనుబంధం మీకు తెలిసిందే!.... అన్నయ్య పోయారు. ఆ కుటుంబ బాధ్యతలను నాకు అప్పగించి"
"సరే!... అందుకు నేనేం చేయాలి?"
"మీరు వారి బావగారు కదా!...."
"అవును!?"
"మీకు ఒక ఆడబిడ్డ వుంది కదా!...."
"వుంటే!....." ఆశ్చర్యంతో అడిగాడు కాంతయ్య.
"మీ అమ్మాయి మా రంగబాబుకు ఇచ్చి వివాహం చేయవలసిందిగా కోరుతున్నాను."
"ఏందీ?"
"వివాహం!.... నీ కూతురికి మా రంగడికి!...."
"మా మా అంటున్నావ్!.... నీవెవరు? ముస్లిం.... ఆ రంగడెవరు? నాయుడు. వారికి నీకు ఏమిటి సంబంధం!.... బాంధవ్యం?.... "
"అయ్యా!... కాంతయ్య!.... రంగడు నాకు కొడుకు లాంటి వాడు. లాంటి వాడేంది!... కొడుకే!... మీ అబ్బాయికి మీ అమ్మాయికి వివాహం జరిపించ వలసినదిగా కోరుతున్నాను."
"కాదు... కుదరదు!...."
"ఏది కాదు!... ఏది కుదరదు?"
"నీవు కోరింది!...."
"అవసరపడకండి. కాస్త స్థిమితంగా ఆలోచించండి!..."
"ఇందులో ఆలోచించేదానికి ఏమీ లేదు!...."
"వుంది!...."
"ఏం వుంది?"
"మీ అమ్మి మావాడిని ప్రేమించింది!"
"ఎమిటీ?....." ఆశ్చర్యపోయాడు కాంతయ్య.
"అడగండి మీ అమ్మాయిని!...."
"నా కూతురుని గురించి నాకు బాగా తెలుసు. అలాంటి అరాచకమైన పనులు అది ఎన్నడూ చేయదు!..." ఆవేశంగా చెప్పాడు కాంతయ్య.
"చూడు కాంతయ్యా!... ఆస్థి విషయంలో మీ నాన్నగారు వ్రాసిన వీలునామా ప్రకారం, వారి ఆస్థిలో సగభాగం మా సుమతికి చేరింది. పదిహేను సంవత్సరాలుగా మీరు ఆ కుటుంబాన్ని ద్వేషిస్తూ వున్నారు. కానీ.... మా రంగడు వాటినన్నింటినీ మరిచి తనను ప్రేమించిన మీ కుమార్తె మాధవిని మీరు సమ్మతిస్తే వివాహం చేసుకొనేటందుకు సిద్ధంగా వున్నాడు.
ఆ ప్రేమికులను విడదియ్యకండి. వారి భవిష్యత్తును అంధకారం చేయకండి. మీ అర్థాంగిని సంప్రదించి, మంచి మనస్సుతో గతాన్ని మరచి, వారి వివాహానికి అంగీకరించండి. అలా జరిగితే మీ రెండు కుటుంబాలు ఏకం కావడం, మీకే కాదు, అందరికీ ఆనందప్రదం అవుతుంది" చిరునవ్వుతో చెప్పాడు సయ్యద్.
"నా విరోధికి నా కూతురుకీ పెళ్ళా!...."
"కాదు... నీ మేనల్లుడితో నీ కూతురు పెండ్లి!..." నవ్వాడు సయ్యద్.
"అసంభవం!!!...." అరిచాడు కాంతయ్య.
"అంతేనా?..."
"నీకు చెవుడా!... పోరా.... పో!...." కాంతయ్య ఆవేశంగా తన ఇంటివైపుకు నడిచాడు.
సయ్యద్ గారు సహజంగా తెలుగు పండిట్ కాదా!... ’మూర్ఖుని మనస్సు రంజింపరాదు’ అనుకొంటూ తన గ్రామానికి బయలుదేరారు.
*
సుమతికి తన అన్న కాంతయ్య మీద ప్రేమాభిమానాలు కారణంగా ఆమె, తన మనో అభిప్రాయాన్ని (అన్న కూతురును తన ఇంటి కోడలుగా చేసుకోవాలన్న భావన) సయ్యద్ గారికి తెలియజేసిన కారణంగా.... వారు కాంతయ్యగారిని కలిసి వారి కూతురు మాధవి రంగడు ప్రేమించుకొన్నారని అబద్ధం చెప్పాడు. సుమతి కుటుంబానికి, ఆమె తండ్రి వ్రాసిన వీలునామా అనుసరించి సగభాగం ఆస్తి సుమతికి సంక్రమించింది. ఆ కారణంగా వారిపై ద్వేషం పగతో సాంబయ్య రంగ మాధవీల వివాహానికి అంగీకరించలేదు. ఆ విషయాన్ని విన్న సుమతి ఎంతగానో బాధపడింది.
"అమ్మా!...." పిలిచాడు రంగ.
తన అన్నను గురించి ఆలోచిస్తున్న సుమతి రంగ ముఖంలోకి చూచింది.
"మామయ్య మాధవితో నా వివాహాన్ని చేయ నిరాకరించాడని బాధపడుతున్నావా?" అనునయంగా అడిగాడు.
క్షణం తరువాత....
"యధార్థంగా నాకు మాధవిపైన అలాంటి అభిప్రాయం లేదమ్మా!.... నీవు ఆశించావని, నీ మనస్సుకు బాధ కలిగించకూడదని, మౌనంగా వుండిపోయాను" అనునయంగా చెప్పాడు రంగ.
రంగ మాటలకు సుమతి ఆశ్చర్యపోయింది.
కొన్ని నిముషాల తర్వాత....
"రంగా!...."
"ఏమ్మా!..."
"నీ మనస్సున ఎవరైనా వున్నారా!...."
"అవునమ్మా!...."
"ఎవరు నాయనా ఆ అమ్మాయి!"
అప్పుడే వచ్చిన సయ్యద్ వారి మాటలను వింటూ వరండాలో ఆగిపోయాడు. తల్లి కొడుకులు హాల్లో ప్రసంగిస్తున్నారు.
"నీకు బాగా తెలిసిన అమ్మాయేనమ్మా!....."
"ఎక్కడ వుంటుంది?"
"మన వూర్లోనే!..."
"పేరు?"
"చాందిని!...."
రంగ ముందున్న తల్లి సుమతి వరండాలో వున్న సయ్యద్, రంగ అన్న మాట విని ఆశ్చర్యపోయారు.
కొన్ని క్షణాల తర్వాత సుమతి....
"రంగా!... నీవు చెప్పిన పేరు... పేరు...."
"మన చాందినీ అమ్మా!..."
సయ్యద్లో వున్న సందేహమూ తీరిపోయింది.
సింహద్వారం వైపు చూచిన సుమతి సయ్యద్ను చూచింది.
కొన్ని క్షణాల తర్వాత సయ్యద్ వెనుతిరిగి వరండా మెట్లు దిగసాగాడు.
సుమతి వేగంగా వరండాలోకి నడిచింది. "భాయిజాన్" పిలిచింది.
’భాయిజాన్’ అనుకొంటూ మెల్లగా వెనుతిరిగాడు సయ్యద్.
"వచ్చి ఏమీ మాట్లాడకుండా!...."
"వినకూడనిది విన్నానమ్మా అందుకని.... ఎప్పుడూ సయ్యద్ సాబ్ అని పిలిచే సుమతి ఈనాడు ’భాయిజాన్’ అని పిలవడంతో.... సయ్యద్ అయోమయస్థితిలో పడిపోయాడు.
"మీరు నా కొడుకు నిర్ణయాన్ని విన్నారు కదా!...."
అవునన్నట్లు సాలోచనతో తలాడించాడు సయ్యద్.
"భాయిజాన్!.... అది తప్పా ఒప్పా!...."
ఆశ్చర్యంతో సుమతి ముఖంలోకి చూచాడు సయ్యద్. అదే సమయానికి మల్లిక, చాందినీలు అక్కడికి వచ్చారు. మల్లిక చేతిని తన చేతిలోనికి తీసుకొంది సుమతి. చాందిని, తండ్రిని చూచి తలదించుకొంది.
తల్లీ సయ్యద్ల సంభాషణ వింటూ రంగడు హాల్లోనే వుండిపోయాడు.
కొన్ని క్షణాల తర్వాత చాందిని హాల్లోకి వేగంగా వెళ్ళిపోయింది.
"చాందినీని నా కోడలుగా చేయి భాయిజాన్!..." సయ్యద్ను సమీపించి చేతులు జోడించింది సుమతి.
తన మిత్రుడు, జగన్నాథం చివరి క్షణాల్లో తను చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి సయ్యద్కు. అతని కళ్ళు చెమ్మగిల్లాయి.
"జీ... చాందినీకి రంగా అంటే చాలా ఇష్టం!...." నవ్వుతూ సయ్యద్ ప్రక్కకు చేరింది మల్లిక.
"అది ఎంతసేపు అలా చేతులు జోడించి మీ ముందు నిలబడాలి!... సరే అనండి సయ్యద్ సాబ్!..." నవ్వుతూ అంది మల్లిక.
అందరూ ఒకే నిర్ణయంతో వున్నారు... నాకు డిపాజిట్ పోయింది. నవ్వుతూ ’సరే, అనడం వుత్తమం.’
"భెహాన్ జీ!..."
"భాయిజాన్!..."
"మీ నిర్ణయమే, నా నిర్ణయం అమ్మా!...."
సుమతి మల్లిక సయ్యద్లు ఆనందంగా నవ్వుకొన్నారు.
తలుపు చాటున వుండి వారి మాటలను విన్న చాందినీ రంగలు ఆనందంగా చేతులు కలుపుకొన్నారు.
సమాప్తి
సిహెచ్. సీఎస్. శర్మ గారి ప్రొఫైల్ కొరకు, మనతెలుగుకథలు.కామ్ లో వారి ఇతర రచనల కొరకు
యూట్యూబ్ లోకి అప్లోడ్ చేయబడ్డ సిహెచ్. సీఎస్. శర్మ గారి కథలకు సంబంధించిన ప్లే లిస్ట్ కోసం
విజయదశమి 2025 కథల పోటీల వివరాల కోసం
కొసమెరుపు కథల పోటీల వివరాల కోసం
మేము నిర్వహించే వివిధ పోటీలలో రచయితలకు బహుమతులు అందించడంలో భాగస్వాములు కావాలనుకునే వారు వివరాల కోసం story@manatelugukathalu.com కి మెయిల్ చెయ్యండి.
మాకు రచనలు పంపాలనుకుంటే మా వెబ్ సైట్ లో ఉన్న అప్లోడ్ లింక్ ద్వారా మీ రచనలను పంపవచ్చు.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
మనతెలుగుకథలు.కామ్ వారి యూ ట్యూబ్ ఛానల్ ను ఈ క్రింది లింక్ ద్వారా చేరుకోవచ్చును.
దయ చేసి సబ్స్క్రయిబ్ చెయ్యండి ( పూర్తిగా ఉచితం ).

రచయిత పరిచయం:
పేరు చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ.
కలంపేరు సి హెచ్ సి ఎస్ శర్మ.
బాల్యం, చదువు: జననం నెల్లూరు జిల్లా కోవూరు తాలూకా గుంట పాలెం
విద్యాభ్యాసం: రొయ్యల పాలెం, బుచ్చి రెడ్డి పాలెం, నెల్లూరు
ఉద్యోగం: మద్రాసులో 2015 వరకు వివిధ కంపెనీలలో చీఫ్ జనరల్ మేనేజర్/టెక్నికల్ డైరెక్టర్ గా పదవి నిర్వహణ.
తరువాత హైదరాబాద్ మెగా ఇంజనీరింగ్ సంస్థలో చేరిక.
Comments